30, మే 2020, శనివారం

కాదేదీ





కాదేదీ   కవితకనర్హం
కుక్కపిల్లా,సబ్బు బిళ్ళా, అగ్గిపుల్లా
మహాకవి శ్రీశ్రీ


పేరడీ

తెనుగులో   పేరడీ కవితలకు ఆది గురువు శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. వీరు జరుక్ శాస్త్రిగానే ప్రసిద్ధులు. ఆదిగురువుకు నమస్కరిస్తూ

కాదేదీ  తినుట కనర్హం
కుక్కా,నక్కా,పిల్లీ,బల్లీ
నేటి అవుసరం ఉడతా మిడతా
తింటేనే ఉనికి లేకుంటే లేదు మనికి
కడుపుకాలితే సర్వం సమానం
కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.

ఆది పేరడీ గురువును స్మరించుకున్న సందర్భంగా చిన్న కవిత :)

పేరడీ కవిత్వానికి
ఆది గురువు  జరుక్కు
దీనికి కావాలి   చమక్కు
అనిపించాలి     చురుక్కు
నవ్వు రావాలి   భళుక్కు

ఇది ఇంతకు   ముందే  ఎవరేనా చెప్పేసేరేమో కూడా :)

29, మే 2020, శుక్రవారం

మిడతల దండు


మిడతల దండు



మిడుత చాలా చిన్న జీవి.పతంగం అంటే కూడా మిడత అని అర్ధం ఉంది. దీనికున్న బలం ఎగురగలగడం. దీని బలహీనత నిప్పు. మిడుతలు ఎడారుల్లో గుడ్లు పెడతాయి. అవి ఒకటి రెండు మూడు ఆపై అసంఖ్యాకంగా పెరిగి ఆహారానికి బయలు దేరాతాయి. వీటికి దేశాలు సరిహద్దులు లేవు. పచ్చదనం ఎక్కడవుంటే అక్కడ వాలతాయి. అన్నీ తినేస్తాయి, లేచి వెళతాయి, అక్కడేం మిగలదు. ఇది కూడా కొన్ని అత్యాశాపరులైన దేశాల వారి సృష్టి కావచ్చు. ప్రపంచాన్ని శాసించాలనే ఎత్తుగడ కావచ్చు.జీవ జంతువులతో విలయం సృష్టి కావచ్చు. ఇవి దండుగా ఎగురుతోంటే ఆకాశం లో సూర్యుడే కనపడకపోవచ్చు. ఏమవుతుంది ఇవొస్తే ముందు పచ్చని ఆకు కనపడదు. ఉన్న ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ తరవాత ఆహారానికి కరువొస్తుంది. అదుపు చేయండి, ఎలా చిన్న చిన్న మంటలేయండి, అందులో దూకి చస్తాయి. పైర్లమీద పచ్చదనం మీద వేప కషాయం చల్లండి, అవి వేప కషాయం చల్లిన వాటిని తినలేవు. ఒక వేళ తింటే చనిపోతాయి, పునరుత్పత్తీ చేయలేవు. బహుపరాక్, మనదేశంలో మహా రాష్ట్ర,రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ మొదలైన ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది, ఈ మిడత, రేపు మనదీ అదే పరిస్థితి కావచ్చు.... 

ఇక్కడొక పెద్ద కథ చదవండి...మిడత మూలంగా
https://kastephale.wordpress.com/2013/06/11/  ఈ రోజు రెండు టపాలున్నాయి, గమనించగలరు.
https://kastephale.wordpress.com/2013/06/14/

https://kastephale.wordpress.com/2013/06/17

24, మే 2020, ఆదివారం

కొమ్ములు తిరిగిన దేశాలే

https://youtu.be/OV3Hvq5L5Eg
పాట1960లో విడుదలైన భట్టి విక్రమార్క చిత్రంలోది
కొమ్ములు తిరిగిన మగవారూ కొంగు తగిలితే పోలేరు నాకొంగు తగిలితే పోలేరు ని అనుసరించిన పారడీ పాట 




కొమ్ములు తిరిగిన దేశాలే కంటి చూపుకే మాడేయి
కడగంటి చూపుకే మాసేయి


కత్తులు దూసే దేశాలే ఎత్తులు మార్చే దాదాలే
                          లాకు డవున్ లో చేరేరు,లాకు డవునులో చేరేరు,                           II  కొమ్ములు తిరిగినII

మందుకోసమే మూగేరు, చేతులు, మూతులు కడిగేరు,దెబ్బకి భయపడిపోయారూ, ముక్కూ నోరూ మూసేరు,                                               .                                                          II  కొమ్ములు తిరిగినII

చేతులు కలిపే మొనగాళ్ళే చేతులు జోడించేరూ.దూరం పాటించేరు                            II  కొమ్ములు తిరిగినII

తగిలిన కరోన కౌగిలిలో ప్రభువైనా వసివాడును లే
                         ఇదే నీతి ఈ జగతి.                                                          II  కొమ్ములు తిరిగినII


With regards to all concerned

20, మే 2020, బుధవారం

అయ్యయ్యో చేతిలో డబ్బులు ఐపోయనే

అయ్యయ్యో చేతిలో డబ్బులు ఐపోయనే
అమ్మయ్యో జేబులు ఖాళీ ఆయనే!

లాక్డవున్ లో తిని కూచుంటే సొమ్మయిపోయిందీ.
పులిమీద పుట్రలా రిలయన్స్ రైట్స్ వచ్చిపడిందే 

దీకి కట్టడానికి సొమ్మెక్కడనుంచి వచ్చు?

ధాన్యం అమ్మితేనో?
అమ్మినదానికే సొమ్మురాలేదు భాయీ

బంగారం కుదవబెడితే
ఇదే చచ్చు సలాహాభాయీ
అప్పుచేసి పప్పు కూడంటే ఇదేనోయీ

ఎవరినేనా చేబదులడిగితే
అందరిదీ ఇదే పరిస్థితైతే అప్పెవరిచ్చేనూ

రిలయన్స్ రైట్స్ కి అప్పుచేసి కొనే సీనుందా?
నాలుగేళ్ళలో షేర్ రేటు రెట్టింపయ్యిందే

గోవిందా! గోవిందా!!

మరిప్పుడు దారేదీ?
ఆలోచన తెగటం లేదోయీ
అప్పుడే ఒక రోజైపోయిందీ!!!!

RIL-RIGHTS ISSUE
This company deals in oil and Telecom sectors,primarily.
The last benefit from the company was a 1:1 bonus in 2017.
Now this company is offering one share for every fifteen shares held by a shareholder, at a premium of Rs.1247 per share. The market value of this share is around Rs.1500 as on date. The share value of this company was  Rs.780.90 in sep 2017 and now it is around Rs.1500/-   Yellow metal  GOLD is trending high and the rate may increase up to Rs.82000/-per ten grams by next year  end, a good short term investment. Be careful about GOLD control Rules.

Disclaimer: This is not an encouragement to invest in stock or to buy gold. Consult financial experts before investment.

8, మే 2020, శుక్రవారం

బాధగా ఉంది.



కష్టం కలిగినపుడే బాధ తప్పదు. ధైర్యం కోల్పోవద్దు.వదంతులు నమ్మద్దు

7, మే 2020, గురువారం

6, మే 2020, బుధవారం

ఆత్రం

Courtesy Whats app
ఆహారధాన్యాలకంటే మందుకే కరువొచ్చేలా ఉంది

5, మే 2020, మంగళవారం

తెలగపిండి వడియం

తెలగపిండి వడియం

కరోనా పేద గొప్ప దేశాలని పెద ధనిక వర్గాలని చూడకుండా జనాల్ని చిత్తు చేస్తోంది. అదేమో తెలియదుగాని మగవాళ్ళనే ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటోందిట. దీని మొహం తగలెయ్య! దీనికి మగాళ్ళంటే అంత ఇష్టమా? అందులోనూ పెద్దాళ్ళంటే మరీనుట, దీని ప్రేమ తగలెయ్య!!

ఆంధ్రాలో విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టలేకపోయిందిట. ఈ జిల్లాలలో అడుగు పెట్టలేకపోడానికి కారణం ఏంటీ? అని వాట్సాప్ యూనివర్సిటీ వారు పరిశోధన చేశారట. :)  హా! తెలిసెన్ కారణం అన్నారు. :)  ఏంటీటా?

ఏంటదీ?  తెలగపిండి వడియం. ఎలా తయారు చేస్తారు? ఆ ప్రాంతంలో విరివిగా పండేవి ఎర్ర నువ్వులు. నూనె తీయగా మిగిలిన తెలగపిండిలో ఉప్పు,వాము, పచ్చి మిర్చి కలిపి కుమ్మి, ముద్దకి దబ్బకాయ రసం కలిపి వడియాల్లా ఎండ బెడతారట. దానిని నంజుకుంటూ ఉదయమే గంజి తాగుతారట. అదీ రహస్యం అని బయట పడింది. తెలగపిండి వడియం తినిచూస్తారా?

3, మే 2020, ఆదివారం

Lock Down



వాట్స్ ఆప్ లో ఒక యువకుని మాట.
లాక్ ఆప్ పోలీస్ కస్టడీ
లాక్డవున్ పెళ్ళాం కస్టడీ








All videos Courtesy Whats app.


2, మే 2020, శనివారం

కుండల్లోకి గుర్రాలని తోలుకుంటూ


Courtesy:Whats app


ఏంటీ పుణుక్కుంటున్నారక్కడా?? సణిగిందో ఇల్లాలు.
ఏం లేదూ బీరువా సద్దుదామనీ..సాచేశాడా మగమహారాజు.
చూస్తూనే ఉన్నాలెండి మీ సద్దుడు అంది సద్దుడు మాట మీద నొక్కి మూతి విరుస్తూ!
నలభై రోజుల్నించీ కుండల్లోకి గుర్రాలని తోలుకుంటూ మీరు చేస్తున్న పనులివేగా, మురిపెంగా విసుక్కుంది.
ఖాళీగా కూచుంటే ఏం తోచటం లేదోయ్
సరేగాని, ఏంటా మాసిపోయిన బనీనూ మీరూనూ, చెమట వాసనతో చిరాకేయటం లేదూ? విప్పేయండి, వాష్ లో వేస్తాను అంటే ఓహో అనుకున్న మగమహారాజు బనీను విప్పేసేడు,గొప్పగా.  లోపల దాచుకున్నవి మరచిపోయి బనీను విప్పడంతో కాయితాలు జలజలా రాలేయి. ఆ ఇల్లాలు కాగితాలన్నీ ఏరి బీరువాలో జాగ్రత్త చేసుకుని తాళమేసి, మగమహారాజుని చూస్తూ...
అవును కదా! ఉదయం నాలుగునుంచి ఎనిమిది మధ్యాహ్నం ఒకటినుంచి రెండు, రాత్రి ఏడునుంచి ఎనిమిది దాకా రసోయి,కిచెన్,వంటిల్లు తీసి ఉంచితేనే, చిరుబొజ్జలు, బాన పొట్టలు వచ్చేసేయి. వచ్చినవేమైనా పోతాయేమోగాని ఇవి పోవులెండి అని సాగతీసిందా ఇల్లాలు, బొజ్జ నిమురుకుంటూ బయటికెళ్ళేడా మగమహారాజు :)




Courtesy:Whats app

28, ఏప్రిల్ 2020, మంగళవారం

పల్లె సీమలు.

పల్లె సీమలు.
కితం వారం లాక్ డవున్ ను పల్లెలలో సడలించారు. రెండవపంట బాగానే పండింది.దిగుబడి కూడా బాగుంది.ఎకరానికి రెండున్నర టన్నులు కావచ్చు. ఇది రెండవపంట కనక యంత్రాలు ఉపయోగించి కోతనుంచి మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. యంత్రాలకి అయ్యే ఖర్చు డబ్బులొచ్చాకా ఇస్తారు. ఇది అలవాటే. ఎఫ్.సి.ఐ రంగంలోకి దిగి కొనుగోళ్ళు చేస్తోంది. సరకు కూడా గొదాములకు చేరుతోంది. నెల లోగా సొమ్ములు రైతు చేతికి రావడం మామూలే.ఏమైనా సరుకు ఒబ్బిడి అవుతోంది సంతోషం.   పంట పండించిన రైతు గిట్టుబాటు ధర  కోసం చూస్తాడు అలాగే సరుకు పాడవకుండా ఒబ్బిడి ఐతే సంతోషిస్తాడు,చేసిన శ్రమ ఫలించినందుకు.
    

  ఇంకా   సగం  పైగా మాసూళ్ళు కావాలి,మొత్తం పూర్తి కావాలంటే మరో రెండు వారాలు తప్పదు. కాని ఈ లోగానే 27,28 తారీకులలో తుఫాను తాక నుందని  వార్త. ఇదెంత నిజమో తెలియదు.   ఇటువంటి అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి.నిన్న ఉదయమే గాలివాన తో మామిడి రాలిపోయింది, వరికి కొంత నష్టం.  ఏమైనా పల్లెసీమలు పని పుంజుకున్నాయి. పల్లెలకు సంబంధించిన అన్నీ పని చేస్తున్నాయి. ఈ లోగా ప్రధాని నుంచి వచ్చే సహాయం ప్రతి ఒక్కరి కాతాలోనూ పడుతోంది.  (2000+2000) ఇది సమయానికి రైతుకు ఉపయోగకరంగానే ఉంది. మరొక విడత సొమ్ములు మాత్రం రావాలి. మొత్తం గోజిలలో పన్నెండున్నర లక్షల టన్నులాఅహారధాన్యాలు ఒబ్బిడి అవుతున్నాయి. కరోనా పల్లెలనేం చెయ్యలేకపోయింది.  మందులేక ఇబ్బంది పడుతున్న మాట నిజం.  బియ్యం ఇత్ర నిత్యావసరాలు ఇంటికే చేరుస్తున్నారు, బాధ లేదు. 



ఒక రైతు మాట
''మూడో తారీకు తరవాత ఎలా వుంటుంది? కంగారు పడద్దు. నెమ్మది నెమ్మదిగా అంతా సద్దుకుంటుంది,  కరోనా, తుఫానులూ ఏం చేయలేవు. పనులు పూర్తైనా రైతన్నలు మిగిలినవారికి సహాయం చెయ్యండి. తొలకరికి కావాల్సిన విత్తనాలు,ఎరువులు సరఫరా అవుతాయి, భయపడద్దు. ఆరోగ్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండంది, పనులు పూర్తయితే
  పల్లెలను  అలవాట్లే రక్షిస్తున్నాయి. లాక్ డవున్ ఎత్తేసినా,ఉన్నా మంచి అలవాటలు మానకండి.అనవసర ప్రయాణాలొద్దు. అవసర ప్రయాణాలు మానొద్దు.బయట తిరగద్దు.గాలి వార్తలు నమ్మద్దు.


గొప్ప మార్పు వచ్చేస్తుందని అనుకోనుగానిమార్పు మంచికే జరుగుతుందని ఆశిద్దాం."

26, ఏప్రిల్ 2020, ఆదివారం

ఆవిడైనగాని కోవిడైనగాని

కొసరి పెట్టినదేదొరుచిలేనిదైనను
నోరు మూసుకు తినితీరవలయు

విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా
చూసిచూడనియట్లు చూడవలయు

అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు
వినపడనియట్లుగా వెడలవలయు

పైమూడు సూత్రాలు పాటించి మగవారు
దీటుగా లాక్ డవును దాటవలయు

ఆశ వీడకుండ ఆరాట పడకుండ
మూడు సూత్రములను వాడువాడు

హాయిగా తరించు నాపద నొందడు
ఆవిడైనగాని కోవిడైనగాని.
Courtesy:C.V.L.N.Ravi kumar

23, ఏప్రిల్ 2020, గురువారం

ఆమెగా అతడు


నిశాజిందాల్ ఆడ పేరుతో పదివేల స్నేహ బృందంతో, ఒక ముఖపుస్తక పేజి. అందులో ఒక వర్గం, మతం వగైరా వారిపై మరొకరికి ద్వేషం కలిగించే పోస్ట్లు పెట్టడం అలవాటు. ఓ పిక పట్టేరు, చిరాకొచ్చిన ఒకరు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.

పోలీస్ పరిశోధనలో వెలుగు చూసిన నిజాలు. ఈ స్త్రీ నని చెబుతున్నవారు ముఫై ఒక్క సంవత్సరాల  పురుషుడు. ఎనిమిదేళ్ళుగా, ఆమెగా సాగుతున్న ముఖ పుస్తక పేజి

   ఇంతకీ వీరేంటయ్యా అంటే! పట్టు వదలని విక్రమార్కునిలా పదేళ్ళుగా ఐ.టి ఇంజనీరింగ్ గట్టెక్కని వాడు. ఐతే ఆమెగా తన పరిచయంలో పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలలో ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నావారు .
( World health Organisation, International monetary fund,  World trade Organisation.) ఇదేగాక ఒక పాకిస్తానీ నటీమణి పేరుతో ఈ మహానుభావుడు నడుపుతున్న  మరొక  ముఖపుస్తక పేజిలో నాలుగు వేల మంది మిత్ర బృందం. ఇదీ కత. నేను చెప్పడమేంటిగాని పోలీస్ ల మాటల్లోనే చదవండి. మన తెనుగు బ్లాగుల్లో కూడా ఇటువంటివి చూడబోతున్నామేమో!


 https://timesofindia.indiatimes.com/india/nisha-jindal-with-10k-fb-fans-turns-out-to-be-a-man/articleshow/75240983.cms

మొదటి లాక్డవున్ ముగిసింది. రెండవ లాక్ డవున్ నడుస్తోంది. గట్టేక్కకపోతే,జాగ్రత్తలు తీసుకోకపోతే పెరమనెంట్ లాక్ డవునే! . ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెచివల్స్.భయపెట్టడం కాదు. ఉన్న నిజం


14, ఏప్రిల్ 2020, మంగళవారం

Rare films division news reel

Courtesy. Whats app.  A rare films division news reel

 సినిమా మొదటిలో, ఇలా ఒక న్యూస్ రీల్ వేసేవారు. . ఇది తప్పని సరిగా వేయాలి. ఇలా న్యూస్ రీల్ వేసినందుకు హాలువాళ్ళు కొంత సొమ్ము చెల్లించాలి.దీనికి బాకీలుంటే మాత్రం సినిమాహాలు లైసెన్స్ రెన్యూ చేసేవారు కాదు. ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు

12, ఏప్రిల్ 2020, ఆదివారం

మందు దాతలు

courtesy:Whats app
  కల్లు పొర వచ్చేసింది,వేసవీ వచ్చేసింది.తాటి కల్లుకి డిమాండ్ ఎక్కువేగాని ఈత కల్లంత కాదు. ఈత కల్లు ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువ. కల్లు చలవ చేస్తుందంటారు గాని ఈత కల్లు మందులా వాడతారు, ఈ ఈతకల్లు కుష్టు వ్యాధికి మందంటారు. కల్లు ఆకలి పుట్టిస్తుందిట.కల్లు గీసినవాడిని చెట్టునుంచి దిగనిచ్చేలాలేరు, ప్రజలు. 
If demand is more than the supply,irrespective of the cost, what it is called
courtesy Whats app

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం

శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం.


ధర్మ అర్ధ కామ మోక్షాలనేవి నాలుగూ పురుషార్ధాలు. మానవులైపుట్టిన వారు వీటిని సాధించుకోకతప్పదు. మోక్షం అనేది దొరుకుఇతుందో లేదో తెలీదుగాని మొదటి మూడిటిని పొందవలసిందే!

వీటిని పొందాలంతే శరీరం కావాలి. అదెలా వుండాలి? ఆరోగ్యంగా ఉండాలి. శారీరిక ఆరోగ్యం ఒక్కటే సరిపోదు. మానసిక ఆరోగ్యమూ బాగుండాలి. మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరిక ఆరోగ్యం బాగుంటుంది.మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మనసు బాగుండాలి. తీసుకునే ఆహారం బట్టి మనసు ఏర్పడుతుంది. మనసు బాగోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇదంతా ఒక్క రోజులో నాలుగు మాత్రలు మింగేస్తే వచ్చేది కాదు.అందుకే తాతమాట సాధనమున పనులు సమకూరు ధరలోన. ఆడ మగ తేడా లేక ఆరోగ్యం కాపాడుకోవాలి,పెంపొందించుకొవాలి.చూడండి ఒక నలభై ఏళ్ళ స్త్రీ పాతికేళ్ళ యువకుణ్ణి కర్ర సాములో నిలబెట్టిన అవైనం, అదీ సాధన అంటే... ఇది నేటి అవసరం..

1, ఏప్రిల్ 2020, బుధవారం

సిగరట్టు బాబూ! సిగరెట్టూ!!

courtesy: Whats app


సిగరట్టు బాబూ! సిగరెట్టూ!!

చూసేవాళ్ళకి నవ్వులాటగా ఉండచ్చుగాని అనుభవించేవారికే తెలుస్తుంది బాధ ఏమిటో!!!
ఇలాగే మందు కూడా వారం నుంచి ఏమీ లేవు ఎలాబతికేది?ఒక్కసారిగా సిగరట్టు,మందూలేని ఈ ప్రపంచం చాలా వింతగా,కొత్తగా ఉంది.Sudden withdrawal symptoms are more dangerous. 

28, మార్చి 2020, శనివారం

తిరిగే కాలు తిట్టే నోరు....

తిరిగే కాలు తిట్టే నోరు....

తిరిగే కాలు తిట్టే నోరు తీరిగ్గా వుండలేవన్నది ఒక జాతీయం.

సాధారణం అవుసరం ఉంటే గాని బయటకి కదలరెవరూ, కాని కొంత మంది అవసరం లేకపోయినా తిరుగుతూనే ఉంటారు. ఇదొక అలవాటు.
 ”ఎక్కడికెళ్ళేవూ రాత్రి పదికి ఇంటికి చేరేవు,ఆఫీసు ఐదుకి ఐపోతే ఇప్పటిదాకా ఎక్కడ తిరిగినట్టూ, త్రిపాది లాగా?”....
”అబ్బే ఏం లేదమ్మా సత్యానందం కనపడితేనూ”...
”వాడితో పాటు ఇంటి దాకా వెళ్ళి.... వచ్చావనమాట”.
”వాడెదో కష్టం చెబుతుంటేనూ”..
”ఏవైనా చది వించుకొచ్చావా?”.. 
”   రెండు వేలుకావాలంటే.....నెలాకరికిచ్చేస్తానన్నాడు"
ఇటువంటి వాళ్ళు ఆఫీసులో కూడా సీట్లో కూచోలేరు. ”పక్క సెక్షన్లో మిత్రానందం నిన్న బండి మీంచి పడ్డాట్ట చూసొస్తా”, పక్క సీట్ వాడికి చెప్పి పెత్తనాలకి బయలుదేరతారు. ఇది నిజంగానే వ్యసనం. ఇలా   కూడా కాకుండా పని లేక తిరుగుతున్నవాళ్ళని కరోనా పోలీస్ కొడుతున్నారు, లేదా పొర్లు దండాలు పెట్టిస్తున్నారు కదా!   నేటి మాట, బండి పాడుచేసి ఇస్తున్నారు, మళ్ళీ తిరగడానికి లేకుండా,అలా కాకుండా వీళ్ళని అక్కడే ఒక పూట కాపలా కాయిస్తే రోగం చప్పగా కుదురుతుంది. తిక్కతిక్కగా మాటాడేవాడెవడేనా తగిలితే వీళ్ళకి అప్పజెప్పేస్తే సరిపోతుంది :)

తిట్టే నోటి నుంచి వచ్చేవెలా ఉంటాయో మచ్చుకి :) ”నిన్ను ఎన్నెమ్మమ్మెత్తుకుపోనూ!నీనోరడిపోనూ! న్నిన్నేట్లో కలిపెయ్యా!” ఇలాగే ఉంటాయి. ఇటువంటివారి నోటి నుంచి విందామంటే మంచిమాట వినపడదు. పొరబాటున వినపడిందో ఏదో ప్రళయం కరోనా లాటిది ప్రపంచం మీద కి వచ్చి తీరుతుంది. :)


ఉబోస అంటూ చెప్పేవాళ్ళు కూడా ఈ కోవకే చెందుతారనుకుంటా.ఇక నిత్యమూ ఏదో గిలక్కుండా ఉండలేని జనాభా ఉంటారు. వీళ్ళని తగలెయ్యా,  వీళ్ళ చేతులిరిగిపోనూ! ..... ఎక్కణ్ణించి ఊరతాయో కబుర్లు, తెగరాసి జనం మీద పారేస్తుంటారు. ఇదో వ్యసనం.



ఇలాటి పరిస్థితులలో కరోనా వచ్చి అందరిని లాక్ డవున్ చేసింది, ఎన్నాళ్ళూ ఇరవై ఒక్క రోజులట. చచ్చి చెడి మూడురోజులు నడవలేదు. ఏం తోచడం లేదు. ఏం చెయ్యాలి, ఏం తోచడం లేదు ఇదీ అసలు మాట.

ఏం చెయ్యచ్చూ
1.అమ్మ,నాన్న ఉంటే కాసేపు కబుర్లు చెప్పచ్చు.
2.ఇల్లాలి కి ముచ్చట్లు చెప్పచ్చు,వినచ్చు. కూడా కొంగు పట్టుకు తిరగచ్చు. వంటలో సాయం చేయచ్చు.వంటా చేయచ్చు. వంటగది సద్దచ్చు. కూరలు తరగచ్చు. వీలు కుదిరితే తలలో పేలు చూడచ్చు :) Work from Home or Work at Home :)''చాలు సంబడం ఇలా గొంగట్టుకు తిరగడమేంటో కొత్తగా, చూసేవాళ్ళు నవ్వుతారు'', అని ఆవిడ సున్నితంగా విదిలిస్తే ''చూడనిద్దూ'' అని దీర్ఘమూ తియ్యచ్చు, మరో కాఫీగ్లాసూ పుచ్చుకోవచ్చు.
3.తోట పని చెయ్యచ్చు
4.పిల్లలకి పద్యాలు,కతలు చెప్పచ్చు.
5.ఇల్లాలు చిన్నప్పుడు నేర్చుకున్న త్యాగరాజ కృతి వినచ్చు.
6.చిన్నతల్లి డేన్స్ చూడచ్చు.
7.మంచి పుస్తకం చదువుకోవచ్చు,కుటుంబం అంతా కలసి భోజనాలూ చెయ్యచ్చు,కబుర్లు చెప్పుకుంటూ.
8. ఒంటరి పక్షులు లేప్టాప్ ముందేసుకుని....ఎవరితోనైనా జగడమేసుకోవచ్చు. డవ్ జోన్స్,నిఫ్టీ వర్చుయల్ ట్రేడింగ్ చెయ్యచ్చు. 
9.పక్కవాళ్ళలో హాస్పిటల్ కి వెళ్ళేవాళ్ళకి సాయం చేయచ్చు.
10.ఒంటరి ఉండిపోయినవాళ్ళకి, బిచ్చగాళ్ళకి ఆహారం అందించచ్చు.
11.రైల్వే స్టేషన్లలో ఉండిపోయినవారిని ఆదుకోవచ్చు.
12.కరోనా గురించి ఇతరులకు వివరించవచ్చు,తెలిసున్నంతలో.
13.ఇతరులకు ధైర్యం చెప్పచ్చు,జాగ్రత్తలూ చెప్పచ్చు.
14.మా దగ్గర ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు, భోజనం లేక ఇబ్బంది పడుతున్నవారెవరైనా ఫోన్ చేస్తే ఆహారం అందిస్తున్నారు. వారికి సాయం చేయచ్చు.
15.పోలీస్,డాక్టర్, నర్స్,శానిటరీ వర్కర్స్,కరంట్ వాళ్ళు, డెలివరీ బాయ్స్ వీళ్ళకి అవసరం బట్టి ఒక ఆహార పొట్లం ఇవ్వచ్చు...వారికి మనిషి సాయం కావాలంటే చేయచ్చు 
ఇది అనంతం. సాయం చెయ్యాలనే మనసుండాలి కాని అవకాశాలు అనంతం.


ఇక, WHO Director General, ఈయన చూడండి, ఏమంటున్నారో
1.మందుకొట్టకండి.
వామ్మో! వారమైపోలా నాలిక పీక్కుపోతావుందయ్యా! షాపులా మూసేశారు, ఇంట్లో అమ్మో, కర్ర తిరగేస్తది, సతీష్ గాడి ఇంటి దగ్గర కుదురుద్దిగాని, వామ్మో పోలీసోళ్ళు, తల్చుకుంటేనే....
2.ధూమపానం వద్దు.
ఈయనెక్కడ దొరికాడండీ బాబూ చిన్నప్పుడు బళ్ళొ చదువుకున్నవన్నీ ఏకరువెడతన్నాడా?

ఏవయ్యా పె ద్దాయనా! నువు చెప్పినయ్యన్నీ మాకు సిన్నపటనుంచి అలవాటే గాని. ఈ కరోనా-19   భూతాన్ని పెపంచకం మీద ఒదిలినోడినేమనవేం...

అధో సూచిక:- ఇదెవరిని ప్రత్యేకంగా ఉద్దేసించినదీ కాదు. అలా అనిపిస్తే సా...రీ....

26, మార్చి 2020, గురువారం

చెప్పిన మాట వింటేనా?


చెప్పిన మాట వింటేనా?

దేశం అంతా లాక్ డవున్ లో ఉంది. ఎవరూ బయటికి రాకండోయ్ అత్యవసరం ఉంటే తప్పించీ అని మొత్తుకుంటోంది ప్రభుత్వం. ఆ అత్యవసరం కూడా వైద్యం,ఆహారం తప్పించి మరోటి వద్దూ అంటోంది.

పోలీసులు పల్లెలనుంచి మరో పల్లెకి వెళ్ళే మార్గాలు కూడా మూసేశారు. అబ్బే అలా ఐనా వింటేనా? ఇంకా తిరుగుతూనే ఉన్నారు మోటార్ సైకిళ్ళేసుకుని. ఎందుకో తెలవదు.

నీళ్ళు,పాలవాళ్ళు,కరంటువాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. పోలీసులూ,డాక్టర్లు,నర్సులూ మనుషులేగా. పాపం వాళ్ళూ ఆహారం నిద్ర లేక రాత్రి పగలూ లేక పని చేస్తున్నారు. ఇంటిలో ఉండడి మహాప్రభో అని మొత్తుకుంటుంటే ఎందుకు బయట తిరిగి ముచ్చట్లు పెడుతున్నట్టు? ఇటలీ ప్రభుత్వం ఇక నా వల్ల కాదు, ఏం చేయలేనని చేతులెత్తేసింది. సరే పాకిస్తాన్ మొండికే పడింది. లాకు లేదు డవునూ లేదు, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నవాళ్ళుంటారు,పోయినవాళ్ళు పోతారననట్టు.

అరవై ఏళ్ళకితం మాట అదో పల్లెటూరు, ఊరంతా చక్కహా నిద్దరోతోంది.నేనొక్కణ్ణీ ఆఫీసులో స్విచ్ బోర్డ్ దగ్గర కూచుని ఉద్యోగం చేస్తున్నా! మొదటిలో చాలా ఆనందంగా ఉండేది, ఊరంతా నిద్దరోతోంటే మనం ఒకళ్ళం మెలుకువగా ఉండి ఉద్యోగం చేస్తున్నాం అని గొప్పగా ఉండేది. కాలం గడిచింది. ఇదేమి ఖర్మ? ఊరంతా నిద్దరోతుంటే నేనొక్కణ్ణీ మెలుకువగా ఉండడం అనిపించింది. మానవ మనస్తత్వంకదా! ఇలా రోడ్డున పడి ఉద్యోగం చేస్తున్న పోలీసులకి పెళ్ళాం పిల్లలు లేరూ? వాళ్ళకి హాయిగా ఇంటి దగ్గర కూచోవాలని ఉండదూ? డాక్టర్లు నర్సులకి అలా అనిపించదా?

రోడ్ మీద పని లేక ఊరికే తిరిగేవాళ్ళని చితక తన్నుతున్నారు పోలీస్, ఐనా తిరుగుతూనే ఉన్నారు, ఇదేమో? మనమూ ఇటలీలా ఐపోతామా? ఏమో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికెరుక.

20, మార్చి 2020, శుక్రవారం

టముకు



భారత దేశం అంటే పల్లెలే. పాత రోజుల్లో వార్త ప్రజలకి చేరాలంటే ఆనోటా ఆనోటా చేరాల్సి వచ్చేది. వార్తను అదే ఊళ్ళో ఉన్నవారికి చేర్చేందుకుగాను ప్రభుత్వం ఇలా టముకు ద్వారా చార్త చేరేసేది. సాధారణంగా ఇవి కోర్ట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ద్వారా వేలం వేసే ప్రక్రియ గురించిన వార్తలే ఐ ఉండేవి. వ్యక్తుల ఆస్థులను వేలం వేసే సందర్భాలలోనే ఎక్కువుండేవి. ప్రోనోటు బాకీలు తీర్చలేకపోయిన సందర్భాలలో వ్యక్తుల ఆస్థులను జప్తు చేసేందుకు ఇలా టముకు ద్వారా వార్త చేరేసేవారు, వేలంలో పాల్గొనేవారి కోసం. ఈ ప్రక్రియ జరగడం అవమానకరంగా భావించేవారు. అదే టముకుమీద దెబ్బ పడటం అంటే,  డప్పు మీద దెబ్బ పడటం అన్నా! అంటే నీ ఆస్థి జప్తు చేయించి బాకీ వసూలు చేసుకుంటానని..బాకీ తీర్చలేక ఆస్థి జప్తు చేసే స్థితి రావడం అవమానకరంగా భావించేవారు..


కాలం మారింది. ప్రభుత్వం ప్రజలకు వార్త చవేయడానికి ఆ తరవాత కాలంలో వార్తాపత్రికలొచ్చాయి. ఆ తరవాత రేడియో మరో సాధనమయింది. ఐనా వార్త చేరడానికి సమయమూ పట్టేది. ఆ తరవాత టి.వి. వచ్చింది. వార్తల్ని వండి వడ్డించడం మొదలయింది.నిజమేదో అబద్ధమఏదో తెలిస్తే ఒట్టు. ఒక్కో పార్టీకో టి.వి ఛానలు, ఎవరి మాట వారిదే నిజం భగవంతునికే తెలుసు. :)

మరి నేటి కాలంలో వార్త గ్రామము,రాష్ట్రము,దేశమూ కూడా దాటి ఖండాంతరాలకి చేరడం చిటికెలో పని. ఒక్కసారి ఒక్క నొక్కు నొక్కితే మొత్తం ప్రపంచానికి వార్త తెలిసినట్టే. అందుకే మనవారు పెదవిదాటితే పృధివి దాటుతుందనేవారు.అంచేత మాట మాట్లాడే ముందు ఆలోచించాలి.. :) 

వార్త ఇంత సులభం చేరుతోందని సంతోషించాలో అబద్ధపు వార్తలు పెరిగినందుకు విచారించాలో తెలీటం లేదు. ప్రతిదానికి ఫేక్ట్ చెక్ చేసుకోవలసి వస్తోంది. ఇదీ నేటి ప్రారబ్ధం.

కరోనా గురించి కంగారొద్దు, నీలివార్తలు ప్రచారం చెయ్యద్దు. వ్యక్తిగత శుభ్రత పాటిద్దాం. 



18, మార్చి 2020, బుధవారం

దూది ఏకడం-పరుపు కుట్టడం



పత్తి ఏకడం పురాతనమైన వృత్తి. మానవుడు బట్ట కట్టే కాలం నుంచి ఈ పత్తి ఏకే ఉపకరణం ఎన్ని రూపాంతరాలు చెంది ఇలా స్థిరపడిందో చెప్పలేం. దీనికి నేటి కాలంలో కమాన్ అని పేరు. ఐతే పురాతన కాలం లో దీని పేరు ధనురి కర్ర అని నేడే తెలిసింది. ఇప్పుడీ వృత్తిని దూదేకుల వారు చేస్తున్నారు, వారిని నూర్ బాషా అంటారట.నేటి కాలంలో దూది పరుపులు వాడుతున్నవారు లేరు. చక్రం మళ్ళీ మేట్రెస్సులు వదిలేసి దూది పరుపుల దిశగా మళ్ళింది.

చిన్నప్పుడన్నీ దూది పరుపులే. నాలుగేళ్ళ కోసారి దూది ఏకించి కుట్టించేవారు. నాగరికులమైపోయిన తరవాత కాయర్ మేట్రెస్ లు వాడడం మొదలు పెట్టేం. వీటితో నడుము నొప్పి, గాలి ఆడక ఇబ్బంది కలుగుతూనే ఉన్నా నెట్టుకొస్తున్నాం. ఒక దూది పరుపుండిపోయింది, అదిగో దాన్ని మళ్ళీ కుట్టించా. తయారు చేసిన పరుపు బాగుంటే మరికొన్ని కుట్టిస్తానని ఆశ పెట్టా. చాలా బాగా కుట్టేడు, బాగుంది, మరో రెండు కుట్టించా. ఇవి చూసి పక్కవాళ్ళో రెండు కుట్టించుకున్నారు. ఆ తరవాత పక్క అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోయారు, కుట్టిన పరుపుల పనితనం చూసి. చేసే పనిలో నైపుణ్యం బుర్రలో గుంజూ, మంచి మాటా ఉన్నవాడెక్కడేనా బతకగలడు

దూది పత్తి కాయల నుంచి,బూరుగు కాయల నుంచీ, జిల్లేడు కాయల నుంచీ తీస్తారు. ఈ దూదిని దారం తీయడం మొదలు, ఇలా పరుపులు కుట్టించుకునేదాకా వాదతారు. ఇక బూరుగుదూది పరుపు బాగుంటుందిగాని వేడి చేస్తుందని వాడరు,ఎక్కువగా. ఇక జిల్లేడు పత్తి వత్తులు చేసి శివారాధనలో వాడతారు. 



16, మార్చి 2020, సోమవారం

करॊ न కరో న= చేయవద్దు.


करॊ न
కరో న= చేయవద్దు.


పీకలదాక త్రావితే,పెంపువహింపగ మత్తున మునిగితే
వెలభామల మూతులు నాకితే,పాయకితరుల చేతులు పిసికితే
పాచిన జిలేబి మెక్కితే,దుష్ట జిలేబి మెచ్చి గుచ్చితే
ఎటుల కరోన సోకక మాను పవన సుతా!


పద్యం నా స్వంతమేం కాదు! లిజిబే గారిది, పవన్ గారి బ్లాగు సౌజన్యంతో!

కరోన అంటే చేయవద్దని అర్ధం హిందీలో. ఏం చేయద్దూ?

1.చేతులు పిసుక్కోవద్దు: ఎదుటివారి దగ్గర చేతులు పిసుక్కోవడం బానిసత్వ లక్షణం. ఆపని చేయద్దు. మరొకరి చేతులూ పిసకద్దు. దీనివల్ల అంటువ్యాధులు అందునా కరోనా లాటివి వ్యాపిస్తాయి. 

2.మూతులు నాక్కోవద్దు: ఆడ మొగ తేడా లేక సమయం సందర్భమూ కాక, వావి వరుసా లేక మూతులు నాక్కుంటే కరోనా వచ్చి తీరుతుంది.
ముద్దిస్తానని దగ్గితే పారిపోయిన వీరులు :)

3.హగ్గులొద్దు:హగ్గులంటే కౌగిలింతలు.ఇవీ కరోనా వ్యాప్తికి తోడు. హగ్గులు లేకపోతే ఎలా? ఇంట్లో,వీధిలో ఇష్టమైనవారందరినీ హాగ్ చేయకపోతే వాళ్ళేమనుకుంటారూ. వోరి నీ హగ్గు కూలిపోను గుచ్చి కౌగలింతలు పాతవేనోయ్! నువ్వేం కొత్తగా కనిపెట్టలేదుగాని. దానికి సమయం సందర్భం ఉంటుంది. హగ్గులొద్దు, కిస్సులూ వద్దు. కిస్ ఫెచివల్స్ చేసుకుంటే కరోనా ఏ ఆపై మీ ఇష్టం. In front crocodile festivals.

4.పెగ్గులొద్దు:సిగ్గులు లేవు, హగ్గులూ లేవు, పెగ్గులూ వద్దు అంటే ఎలా? నాలుగు పెగ్గులు మింగితే కారోనా దగ్గరికి రాదట (ష). పిచ్చి పడిపోకు, నాలుగు పెగ్గులేసుకుంటే కరోనా కి తలుపులు బార్లా తెరిచినట్టే! ఏసుకో నా రాజా! ఏస్కో, ఆకేసుకో వక్కేసుకో ఆపైన చుక్కేస్కో!!  ఆపైనా కరోనా పక్కేస్కో!

5.Avoid packed and food on streets:వామ్మో హిమ క్రిములొద్దా! పానీ పూరీ లొద్దాంటే ఎలాబాబూ, నాలిక పీక్కుపోదూ, పిల్ల పేరు చెప్పి పట్టుకొచ్చే పేకట్లు పిల్లలతో పాటుగా తినకపోతే పిల్లలు నొచ్చుకోరూ :) ఏదీ వద్దంటే ఎలా చచ్చేదీ

బారు లేదు,బీరు లేదు, పోరిలేదు, చినిమా లేదు, బైస్కోప్ లేదు. ఏమీ లేదు, ఇదా స్వతంత్రం. ఆజాది చాహియే ఆజాదీ. తుపాకీ గుండు కంటే బలమైన కరోనా ఉన్నది అందుకో! నా ఇష్టమొచ్చినట్టు చేస్తాను కాదనువారెవరూ కళ్యాణ రామా! కాదనువారెవరూ! మా కేం అభ్యంతరం లేదుగాని ఒక్క మాట. నా ఇల్లు నా సొంతం తగలబెట్టుకుంటానంటే కుదరదు. నీ ఇల్లు తగలబెట్టుకుంటే అగ్గి అక్కడితో ఆగదు. ఊరు తగలబడుతూంది, అంచేత నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకో లేవు. ఇదీ నీ స్వాతంత్రం, తెరియమా? 

అదేం కుదరదు నా ప్రాణం నా ఇష్టం, ఆజాదీ,ఆజాదీ కరోనా యా మరోనా !
ఆగు ,ఆగు, నా ఇష్టం ఛస్తానంటే కుదరదు, నువు కరోనా తో ఛస్తే పూడ్చి పెడితే మరొకరికి అంటుకుంటుంది, చాలా మంది ఛస్తారు, అందుకు తగలబెట్టాల్సిందే!

కరోనా తో చచ్చినవాళ్ళని పూడ్చకండి, తగలబెట్టండి. ఇది వర్ల్డ్ హెల్త్ వారి మాట. కరోన,కరోన, కరోనా!!!

ప్రయాణాలొద్దు, ఎవరినీ దేనినీ అనవసరంగా ముట్టుకోవద్దు, నీ ముక్కు మూతి T సెంటర్ని కూడా. కరోనా! 

ప్రపంచంలో ప్రతి ఇంటి ముందు లోపల అన్ని దేశాలలో కరోనా గార్డులున్నారు, యమభటులు కరోనా రూపంలో కనపడకుండా తిరుగుతున్నారు. తస్మాత్జాగ్రత! జాగ్రత!! జాగ్రత!!!



खून कि दलाली
మృత్యు బేహారులు. మేరా భారత్ మహాన్
కరన్సీతో పాటు కరోనా కూడా వస్తుంది. పాపం సొమ్ము లెక్కెట్టుకుంటే కారోనా మహమ్మారి నిన్నే ఎత్తుకుపోతుందో నరుడా!

మాస్క్ తయారు చేసుకోడం ఎంత వీజీయో!

చావక మిగిలినవాళ్ళకి మోకాల్లోతు కూడని బ్రహ్మంగారి మాట.
Videos: Credits to Whats app University.
Secret caution message leaked from the office of  YAMA through WHO





15, మార్చి 2020, ఆదివారం

అరణ్య రోదన

అరణ్య రోదన

అరణ్య రోదన అనగా అడవిలో ఏడవడం. అడవిలో ఏడవడమెందుకూ? గ్రామంలో ఏడిస్తే ఆర్చేవారూ తీర్చేవారూ లేక. అదేంటీ? మానవులకు ఆరు ఊర్ములు ఉంటాయి. అవి ఆకలి,దప్పిక, జర,మరణం;మోహము,శోకము. ఇందులో ఏ ఒక్కదాన్ని ఎవరిది వారే అనుభవించాలి తప్పించి మరొకరికి బదలాయింపు కుదరదు. అందుకే ఎవరి ఏడుపు వారే ఏడవాలి,మరొకరు ఏడవరు. గ్రామంలో ఎవరి ఏడుపువారు ఏడుస్తుంటే మరొకరెవరు ఆరుస్తారు,తీరుస్తారు. మరి అడవిలో తీర్చేవారుంటారా? పూర్వకాలంలో సాయంత్రం వేళ పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గాన విహారం చేస్తున్నపుడు ఇలా అడవిలో ఒంటరిగా ఏడుస్తున్నవారిని ఓదార్చి వారికి మంచి చెసేవారని పెద్దల మాట. అందుకు ఊళ్ళో కాక అడవిలో ఏడిస్తే ఎప్పటికైనా దేవుడు కరుణించకపోతాడా అని ఆశ. అందుకే అరణ్య రోదనం అన్నారు. ఇప్పుడీ అరణ్య రోదన సంగతేల


శ్రీ జి.పి.శాస్త్రి అనే గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారొక రిటయిర్డ్ ప్రొఫెసరు. వారు తెనుగులో ఒక పద్యాల పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని నాకు పంపే సందర్భంలో జిలేబి నాకు శాస్త్రి గారిని పరిచయం చేశారు.పారితోషికం పంపించే సందర్భంగా ఒకటి రెండు సార్లు మెయిలిచ్చారు. అదే పరిచయం. పెద్దవారు కదా వీరికి జరుగుతున్నది విన్నవిద్దామనుకుని చెప్పేను. వారు నాకు తెనుగే తెలియదన్నారు. తెనుగులో పద్యాలల్లి పుస్తకాలేసినవారు తెనుగు రాదంటే అర్ధమే కాలేదు. జిలేబి మాయలో మరో మాయ. 

29, ఫిబ్రవరి 2020, శనివారం

నీవేదప్ప నితః పరం బెరుగ

తాతగారూ
నమస్కారం
ఏం పొద్దుటే ఇలా ఊడిపడ్డావూ? 



లా వొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యె,బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను,మూర్ఛవచ్చె,దనువున్ డస్సెన్,శ్రమంబయ్యెడిన్
నీవేదప్ప నితః పరం బెరుగ, మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద !! సంరక్షింపు భద్రాత్మకా!

ఎందుకిలా జట్టీలు తెచ్చుకుంటావూ? తిన్నగా ఉండలేవూ?

అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్...
క్షమస్తధ్వం,క్షమస్తధ్వం శేష శైల శిఖామణే!

సరేలే చెబుతా! వెళ్ళు.
తాతగారూ మామ్మ...
ఈ వినయానికేం లోటులేదు. ఆమె ఇప్పుడు

అలవైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపలి మందార వనాంతరం  లో ఉంటుంది.
దర్శనం చేసుకొస్తా! 
ఇప్పుడు వెళితే సన్మానం బాగా చేయిస్తుంది. వెళ్ళు.
మరి...
నసగక్కరలేదు, చెబుతానన్నాగా 
దయచెయ్యి...

28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

వీరణము లేని పెండ్లి


కారణము లేని నగవును,

బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో

బూరణము లేని బూరెయు,

వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ

ప్రపంచంలో కారణం లేని నవ్వు, బేరణము అనగా కంచుకము అనగా రైక లేని స్త్రీ, ఫూరణము లేని బూరె, వీరణము లేని పెళ్ళి వృధా అని కవి గారి భావం

కారణము లేని నగవు ఉండదు. పాపం ద్రౌపది మీద, అకారణంగా నవ్వి ఒక పెద్ద యుద్ధానికి నాంది పలికిందనే అభాండం వేసేసింది, లోకం. కాని నిజానికి ద్రౌపది నవ్వు యుద్ధానికి కారణం కానే కాదు. దుర్యోధనుడు తన తండ్రితో ఏకాంతంలో చెప్పుకున్నమాట. తండ్రీ  పాండవులకు మయుడు నిర్మించి ఇచ్చిన భవన సోయగాలు చూస్తుండగా జరిగినదిది. 

నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై……………………….జలబుద్ధింజేసి బరిధానోత్కరణంబు సేసి విమలశిలాతలబుద్ధి నుదకపూర్ణంబున వాపి సొచ్చి కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుంజూచి వృకోదరుండు నగియె. దానినంతయు నెఱింగి ధర్మరాజచోదితులైన కింకరులు నాకు పరిధానంబు దెచ్చి యిచ్చిరి మఱియు……..యనేక సహస్ర విలాసినీపరివృతయయి యున్న ద్రౌపది నగియె నంత నకుల సహదేవులు పఱతెంచి యిదె వాకిలి ఇట వచ్చునది యని నన్నుం దోడ్కొనిపోయిరట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యంబయి యున్నయది.” సభా .ఆశా2….140

''స్పటిశిలామయమైన ప్రదేశంలో నీరుందనుకుని పంచె ఎగగట్టేను, మరోచోట మామూలు ప్రదేశమని కాలేస్తే నీటితో పంచె తడిసింది, అది చూచి భీముడు నవ్వేడు. అంతా తెలిసిన ధర్మరాజు సేవకులతో పొడిబట్టలు పంపేడు. తరవాత అనేకవేల చెలికత్తెలతో ఉన్న ద్రౌపది నవ్వింది అని చెప్పుకున్నాడు''.

నిజానికి దుర్యోధనుని బాధించినది భీముని నవ్వే. సందర్భంగా నవ్వినవారంతా సహజంగా వచ్చిన నవ్వును ఆపుకోలేకపోయినవారే! ఇక కారణం లేని నవ్వు నవ్వేవారు ఇద్దరేఒకరు పిచ్చివారు, రెండవవారు యోగులు.వారి నవ్వుకు కారణం మనకు తెలియదు,వారు చెప్పరు. మనం ఇద్దరికోవకీ చెందం, అందుకు కారణం లేని నవ్వు లేదనీ  కవిగారినమ్మకంకాని నేటి కాలానికి వెకిలి నవ్వులే కనపడుతున్నాయి. వికటాట్ట హాసం దీనికి కొంచం తక్కువ అట్టహాసం దానికంటే తక్కువది హాసం. తరవాతది oదహాసం చివరిది స్మితం. ఎంత తేడా! కారణం లేని నవ్వు లేదు ఉండదు అన్నది కవి హృదయం.


బేరణము లేని లేమ. బేరణము అనగా కంచుకము. అనగా నేటి బ్రా అనొచ్చుననుకుంటా. బహుశః నేటి బ్రా పదం ఆనాటి బేరణం నుంచి పుట్టిందే కావచ్చు. నాటి కంచుకము కూడా నేటి బ్రాలాగే ఒక గుడ్డ ముక్క రెండు స్థనాలని కప్పి ఉంచేది, ఇది భారతీయ, రోమన్ తదితర సంస్కృతులలో  చిత్రాలలో కనపడుతుంది. అందమైన స్త్రీకి బేరణము లేకపోవడం కవిగారికి నచ్చలేదు. నేటి కాలంలో టూ పీస్ లు కట్టుకున్నవారే జాతి చిహ్నాలుగా గుర్తింపబడుతున్నరోజులు. రోజులిలా మారతాయని కవిగారూహించి ఉండరు.  బేరణము లేని స్త్రీ ఉండదయ్యా అని కవి భావం.


వీరణము లేని పెళ్ళి. పెళ్ళంటే పందిళ్ళు, సందిళ్ళు,సందళ్ళు,తాళాలు, తలంబ్రాలూ. మూడే ముళ్ళు ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళూ అని ఒక సినిమా కవిగారి మాట. ఎవరిమాటైనా నిజం నిజమేకదా!

ఐతే పెళ్ళికి రెండు ముఖ్యం. ఒకటి కాగడా,రెండవది వీరణం.మరో ముఖ్యమైనది మామిడాకు తోరణంవీరణం అనేది ఒక వాద్యం. దీనిని ఎక్కువగా శివాలయాలలో ఉపయోగిస్తారు. వీరణం వాయిస్తే నరాలు ఉప్పొంగుతాయి. ఒక ఆవేశం ఆవహిస్తుంది. ఒకప్పుడు రణానికి సిద్ధమయ్యే సందర్భంలో  వీరణం వాయించేవారుకారణము,వీరణము,రణము,మరణము చూడండి అన్ని దగ్గర దగ్గరగా పోలిన మాటలే. మరి పెళ్ళికి వీరణం ఎందుకూ? పెళ్ళి అనే రణం లోకి దూకుతున్న ఇద్దరు స్త్రీ పురుషులు ఆవేశం కోసం వాయించేదనుకుంటా :) వీర శైవులు వాద్యాన్ని వాడుతున్నట్టే ఉంది. ఆంధ్రలో వీరభద్రుడిని కొలిచే ఆచారం ఉంది,అన్ని కులాలవారూ. వీరభద్రుని సంబరంలో వీరణం తప్పనిసరిగా ఉంటుంది. వీరణం వింటారా? లింక్ లో వినండి.


https://youtu.be/fLBfmWEGnu8


పూరణము లేని బూరె...బూరె కి పెళ్ళికి లింకూ. పెళ్ళి కాని ఆడపిల్ల కనపడితే ''బూరిముక్కెప్పుడు పెట్టిస్తావ్'' అని అడగడం మామూలు. బూరిముక్కెట్టడమంటే పెళ్ళి కావడం. నీ పెళ్ళెప్పుడూ అని తిన్నగా అడగక ఇలా డొంక తిరుగుడుగా అంటే అన్యాపదేశంగా అడుగుతారనమాట. ఇప్పుడీ ముచ్చట్లూ లేవు లెండి.వాళ్ళ పెళ్ళెప్పుడో వాళ్ళకే తెలీదూ.ఆవేశం రావాలిగా. వీరణం మోగాలిగా. బూరి ముక్కనడం అలవాటూ. బూరి అన్నది ఒక విలక్షణమైన పిండివంట.శనగపప్పు ఉడకబెట్టి రుబ్బి మెత్తగాచేసి దానిలో కోరిన బెల్లం కలిపి ఉండలుగా చేస్తారు. ఇలా శనగపప్పు ఉడికించిన పిండి,బెల్లం, యాలకు పొడి కలిపిన దానినే పూర్ణం అంటారు. వాటిని తోపు పిండిలో ముంచి ( దీనికి మైదా వాడతారు) నూనెలో వేయిస్తే....తినడం మజా. బూరి తినడానికో ప్రోటోకోల్. అలా తింటేనే బాగుంటుంది. బూరికి చిల్లు పెట్టాలి,దాని నిండా కరిగిన నెయ్యి పొయ్యాలి, పక్కకి కారినా ఫరవాలేదూ. అలా నేతిలో ములిగిన బూరి ముక్కని తుంచుకుని తింటే నా రాజా....ఏమని చెప్పుదుమరింతటి బూరిలో అత్యవసరమైన పూరణం లేకపోతే? అసలది బూరి అవుతుందా...వ్యర్ధం,వ్యర్ధం,వ్యర్ధం......

చివరిగా కవిగారి మాటేంటంటే కారణం లేని నవ్వు, బ్రాలేని స్త్రీ, పూరణం లేని బూరె, వీరణం లేని పెళ్ళి ఉండవంటారు.


మొన్నో చిత్రం చూశానూ! అమ్మాయికి అబ్బాయికి వివాహానికి తాంబూలాలు కార్యక్రమం, ఒక ఫోన్ లో వాట్సాప్ లో అమ్మాయి,అమెరికా నుంచీ, మరొక , మరో పీటమీద ఫోన్లో అబ్బాయి వాటాప్ లో ఉండగా తాంబూలాల కార్యక్రమం నడిచింది. అమ్మాయి  కనపడుతున్న ఫోన్ మీద ఆమెకు బట్టలు పెట్టేరు, మెడలో వేసినట్టు. అల్లాగే అబ్బాయికి చేసేరు. మరి పెళ్ళి కూడా ఇలాగే చేసుకుంటే కాపరమెక్కడా అని బుగ్గలు నొక్కుకుంటున్నారు, చూసినవారు.  

కవిగారికి నమోన్నమః