Friday 30 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-భీష్ముడు అంపశయ్యపై ఎన్నాళ్ళున్నారు?



భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగిందనీ, అందులో భీష్ములు పదవరోజున కూలారనీ అందరం చెబుతాం, ఆ తరవాత వారు అంపశయ్యపై ఉన్నారనీ మాఘ శుక్ల ఏకాదశి రోజు నిర్యాణం చెందారనీ, ఈ రోజును స్మరించుకుంటాం. భీష్ములు అంపశయ్య మీద దక్షణాయనంలో చేరినా ఇఛ్ఛామరణం మూలంగా ఉత్తరాయణం కోసం వేచి చూచారు, దేహ త్యాగం చేయడానికి.  అంప శయ్యపై ఉన్న కాలంలో కూడా ధర్మరాజాదులకు రాజవ్యవహారాలలో, ధర్మాలలో ఉపదేశం చేశారు, అసలు వారు అంపశయ్యపై ఉన్నది ఎన్నిరోజులు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం యుద్ధం మొదలైన రోజు, పరమాత్మ రాయబారానికి బయలుదేరిన రోజు కూడా చూడాలి. ప్రయత్నిద్దాం.contine at
   https://kastephale.wordpress.com/2015/01/30/       కష్టేఫలే



 Hither to, further posts to be published from the original blog
 https://kastephale.wordpress.com/

and
this blog will be continued as photo blog.

Thursday 29 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?



చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 

దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే వాయసరాజు ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి వాయసరాజు ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడాదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.వాయసరాజు  బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా వాయస రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

Monday 26 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-కనిపించేవాడు దైవం కాదా?



"పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్" ఇవి పంచభూతాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తన్మాత్రలు. ఆకాశం నుంచి వాయువు, వాయువునుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలంనుంచి భూమి పుట్టేయని శాస్త్రాలు చెబుతున్నాయి, నేటి సయిన్సూ చెబుతోంది. అకాశానికి ఒకటే గుణం శబ్దం, మానవ శరీరంలో ఇంద్రియం చెవి, వాయువుకు రెండు గుణాలు శబ్దం స్పర్శ, మానవ శరీరంలో ఇంద్రియం చర్మం. తేజస్సు, దీనికి ఖగోళం లో సూర్యుడూ, భూమి పై నిప్పు ప్రతీకలు,ఈ భూతానికి మూడు గుణాలు శబ్ద, స్పర్శ, రూపాలు. ఇంద్రియం కన్ను. నాల్గవది జలం దీనికి నాలుగు గుణాలు. శబ్ద,స్పర్శ,రూప, రసాలు, ఇంద్రియం నోరు. చివరిది భూమి దీనికి ఐదు గుణాలు శబ్ద,స్పర్శ, రూప,రస,గంధాలు. ఇంద్రియం ముక్కు. పంచ భూతాలకి మానవ శరీరం లొ ఉన్న ఇంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలంటాం.

తేజస్సు అంతరిక్షంలో సూర్యునిగాను, భూమి మీద అగ్నిగాను కనపడతాయి. సూర్యుడు మిగిలిన నాలుగు భూతాలతో సంపుటీ కరణం చెంది, ఈ సర్వ జగత్తుకూ కారణమవుతున్నాడు. అలా భూమిపై పుట్టిన జీవులలో మానవుడు సర్వ శ్రేష్ఠుడు అన్నారు, జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరులన్నారు. ఇలా పుట్టిన జీవులు మరలా భూమినుంచి సూర్యుని ద్వారా తయారైన ఆహారం తీసుకుని పెరుగుతున్నాయి. పెరుగుతున్న జీవులు పెద్దవవుతున్నాయి. పెద్దవైన ప్రాణులు భూమినుంచి సూర్యుని ద్వారా ఇవ్వబడిన ఆహారం, పురుషులలో శుక్రంగాను, స్త్రీలలో శోణితంగానూ పరిణామం చెంది, వారి కలయిక ద్వారా మరలా జీవులు పుడుతున్నాయి. వయసు మళ్ళితే మరణిస్తున్నాయి. మరణిస్తే మరలా సూర్యుని దయవల్లే బూడిదవుతున్నాయి, మట్టిలో కలసిపోతున్నాయి. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో కలియడానికి అన్నిటికి సూర్యుడే కారణం. ఇది కాలంలో జరుగుతోంది, ఈ కాలం కూడా సూర్యుని వలననే ఏర్పడుతోంది, పగలు, రాత్రుల రూపంలో. జీవుల ఆరోగ్యానికి కారకుడు,ఆలోచనలకు కారకుడు, అనారోగ్యానికి కారకుడు, మనుషులకు కావలసిన సర్వ వస్తువులూ భూమి ద్వారా సమకూర్చేవాడు సూర్యుడు. ఇంత చేస్తున్న సూర్యుడు దేవుడు కాదా? సూర్యుడు కనపడని రోజును దుర్దినం అంటారు, ఆ రోజు భోజనం చెయ్యనివారూ ఉంటారు, ఇదేమి మూఢనమ్మకమని కదా అధునికులవాదన, కాని ప్రకృతికి దగ్గరగా జీవించడమని ఆచరించేవారి వాదన.

Image courtesy: also see post.
http://navarasabharitham.blogspot.in/2014/03/blog-post.html

ఆరోగ్యం కోసం ఈ కింది శ్లోకం పారాయణ చెయ్యండి. ఉదయించే, అస్తమించే సూర్యుని చూడకండి. ఉదయించిన అస్తమయానికి ముందు సూర్యుని చూడండి. సూర్యుడికి మతాలు, కులాలూ లేవు, అందరిపట్లా ఒకలాగే ప్రవర్తిస్తాడు.

వికర్తనో వివశ్చాంచ్య మార్తాండో భాస్కరో రవిః
లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్గహేశ్వరః
లోక సాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రహా
తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః
గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వ దేవ నమస్కృతః
ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమః
శరీరారోగ్యద శ్చైవ ధన వృద్ధి యశస్కరః
స్తవరాజః ఇతి ఖ్యాతస్త్రిషులోకేషు విశ్రుతః

 సూర్యుని జీవితకాలం తో పోలిస్తే మన జీవిత కాలం చాలా స్వల్పం, సముద్రంలో నీటి బిందువు. ఈ సూర్యుడు కూడా మహాలయ కాలంలో అంతరిస్తాడు. వేదం ఇలా చెబుతోంది " సూర్యచంద్ర మసౌధాతా యథాపూర్వమకల్పయాత్, పృధివీంచాంతరిక్ష మధోస్వసః" సూర్యచంద్రులతో, భూమి మిగిలిన భూతాలను బ్రహ్మగారు మరల యధాప్రకారంగా పూర్వంవలె సృష్టి చేశారు. కారకులెవరు? శివ శక్తులన్నారు.

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి I
అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి

Cortesy:-http://shaktiputram.blogspot.in/2014/12/ii-ii.html

శివుడు లేని శక్తిలేదు, శక్తిలేని శివుడు లేడు. ఈ ఇద్దరూ కలసిన ఏక స్వరూపమే దేవుడు, నేటి ప్రోటాన్, న్యూట్రాన్ లనుకోవచ్చు, ఈ రెండూ కలసిన ఆటం అనుకోనూవచ్చు. ఈ అణువులతో ఉన్న ఈ సర్వ ప్రపంచమే విశ్వం,విష్ణుః...అదే పరమాత్మ...కనపడుతున్నవాడు దేవుడు కాదా? 
నేడు సూర్య జయంతి.

Saturday 24 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-లేస్తే మనిషిని కాదు....



ఈ మాట తెనుగునాట చాలా విస్తృతంగానే వాడతాము. దీని వెనక ఒక చిన్న కథ ఉంది, అవధరించండి.

అనగనగా ఒక పల్లెటూరు. దాని పక్కనే ఒక అడవి. అడవిలో ఒక మఱ్ఱిచెట్టు, బాటపక్కన. దానికింద ఒక దొంగ కంబళి కప్పుకుని పడుకుని ఉండి, ఒక కఱ్ఱపుచ్చుకుని నేల మీద కొడుతూ దారిన పోయే ప్రయాణీకులను ’లేస్తే మనిషిని కాదు, సొమ్ములక్కడ పెట్టి కదల’మని భయపెడుతూ సొమ్ము కాజేస్తూ ఉండేవాడు. ఇలా చాలా కాలమే జరిగింది. ఆదోవన పోయేవారంతా అలా సొమ్ము సమర్పించుకుంటూనే ఉన్నారు.

కొంత కాలం జరిగింది. మీలాటి ఒక తెగువ ఉన్న యువకుడు ఆ దారిన పోతున్నాడు. దొంగ అలాగే బెదిరించాడు, ఈ యువకుడు ఆలోచించాడు. చాలా కాలంగా ఈ దొంగ ఇలా 'లేస్తే మనిషిని కాదని' బెదిరిస్తూ ఉన్నట్టే చెబుతున్నారు తప్పించి, ఎప్పుడూ ఇతను లేచిన దాఖలా కనపడటం లేదనుకుని, ఏమైతే అదే అవుతుందని 'లే, లేచి చూపించు నీ వీరత్వం' అని ఎదురు తిరిగాడు. యువకుడు మళ్ళీ మళ్ళీ ఎదిరిస్తూనే ఉన్నాడు కాని సొమ్ము ఇవ్వలేదు. దానితో విసుగొచ్చిన దొంగ తన దగ్గరున్న కఱ్ఱ విసిరేశాడు, యువకుని మీదకి. యువకుడు లాఘవంగా తప్పుకుని అదే కఱ్ఱ పుచ్చుకుని ధైర్యంగా దొంగ దగ్గరకెళ్ళి, అతని పైనున్న కంబళీ లాగేశాడు, లే లెమ్మంటూ. తన దగ్గరా మరే ఆయుధమూ లేని దొంగ ఏమీ చెయ్యలేకాపోయాడు.... కారణం రెండు కాళ్ళూ లేకపోవడం. 

అప్పుడీ యువకుడు ఆ దొంగను రాజుగారి దగ్గర ప్రవేశపెట్టేడు. రాజు విచారించి ఎందుకు లేస్తే మనిషిని కాదని అంటున్నావో చెప్పమన్నాడు. దానికి దొంగ "మహరాజా! నాకు చిన్నప్పటినుంచి రెండు కాళ్ళూ లేవు.నేను అందరిని యాచించి బతికినంత కాలం లోనూ, ఎవరూ నా పై దయ చూపలేదు. అందుకే అడవిలో మకాం పెట్టేను. కఱ్ఱపుచ్చుకుని బెదిరించాను తప్పించి ఎవరినీ గాయపరచలేదు, నేటి దాకా. మార్గస్థులను భయపెట్టి పొట్టపోసుకుంటున్నాను. నేను నిజమే చెప్పేను, లేస్తే మనిషిని కాదని, అందరూ ఆ మాటను తప్పుగా అర్ధం చేసుకుని సొమ్ములిస్తూ వచ్చారు. మహరాజా! ఇందులో నా తప్పేమీ లేద"న్నాడు. 

ఆలోచించిన రాజు తన తప్పు కూడా ఉందని గుర్తించి, ఆ దొంగకి శిక్ష విధించి, ఆ తరవాత అతనినే వికలాంగుల బాగోగులు చూసే అధికారిగా నియమించాడట, అతని సత్య వాక్యానికి. 

ఇందులో ఉన్న చిన్న మాట. తప్పు చేస్తూ సత్యం చెప్పడం

Wednesday 21 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-తోలుబొమ్మలాట.


భారతదేశం కళలకు కాణాచి, అందునా తెనుగునేలపై వివిధ కళారూపాలు పురుడుపోసుకున్నాయి. హరికథ, బుఱ్ఱకథ,జముకులకథ, ఒగ్గు కథ, ఇలా చాలా చాలా కళారూపాలున్నాయి. వీటన్నిటికి పరమార్ధం ఒకటే, ఆనంద సందర్శనం. ఈ ఆనంద సందర్శనం భగవంతుని రూపంలో పొందాలునుకోవడమే భారతీయ కళల ముఖ్యోద్దేశం.  అటువంటి వాటిలో ఒకటి, ఈ తోలుబొమ్మలాట. ఇది నేటి సినిమాకి చాలా దగ్గర రూపం. నిజానికి నేను చూసిన తోలుబొమ్మలాట అరవై సంవత్సరాల పై బడినది. బహుశః అరవై సంవత్సరాల కితం నేను చూసిన తోలుబొమ్మలాటకి, నాలుగురోడ్ల కూడలిలో ఒక వైపుగా రామాలయం దగ్గర నాలుగు గుంజలు పాతి, దాని చుట్టూ మూడు వైపులా బట్ట కట్టి, ముందు వైపు ఒక పల్చటి, తెల్లటి బట్టను తెరగా ఎత్తుగా కట్టి కింది భాగంలో దళసరిపాటి బట్టను కట్టి తోలుబొమ్మలాటకి తగిన వసతి ఏర్పాటు చేసారు. మూడు వైపులా మూయబడిన దానిలోపల రెండు కాగడాలు వెలిగించి తెరకు కొద్ది దూరంలో ఉంచుతారు, ఇరుపక్కలా. కాగడాలు ముందుకుంటే తెర అంటుకునే ప్రమాదం. దూరంగా ఉంటే తెరమీది బొమ్మ కనపడకపోవడం కాక, బొమ్మల్ని ఆడించేవారి నీడ పడుతుంది, అందుచేత సమదూరంలో కాగడాలు పెట్టాలి. చీకటిలో కూచున్న ప్రేక్షకులు తెరమీద బొమ్మలు కదలటం, వెనుకనుంచి పాట, మాట వింటారు.ఆ తరవాత కావలసిన సాధనాలు, రెండు బల్లలు, రెండు చెక్కలు, హార్మోనియం, ఫ్లూట్, మృదగం వగైరా వాద్యాలు, ఆ గదిలాటిదానిలో పెట్టుకుంటారు. ఇక ఆడించవలసిన బొమ్మలని పెద్దపెద్ద వెదురు బుట్టలలో తెస్తారు.



సరస్వతీ ప్రార్ధన


 వీటిని తాయారు చేయడం కూడా ఒక పెద్ద పని. చనిపోయిన జంతు చర్మాన్ని ఒలవాలి, బాగుచెయ్యాలి, ఎక్కువగా ఆవు చర్మమే అయి ఉంటుంది. దానిని సరియైన విధంగా కత్తిరించాలి. వాసనలేకుండా చూడాలి, అబ్బో ఇది చాలా కష్టంతో కూడుకున్నపనే. ఇలా తయారు చేసిన బొమ్మలకి రంగులద్ది ఎండబెట్టి....అప్పుడు తెరమీద వేయడానికి అనువుగా ఏర్పాట్లు చేసి కాళ్ళూ చేతులూ ఆడించడానికి తగు ఏర్పాట్లు చేసి వాటిలో చిన్న కఱ్ఱ, పొడుగైనదాన్ని దూర్చి ఆడించడానికి తయారు చేసి, తోలుబొమ్మలాట మొదలుపెడతారు, గణేశ ప్రార్ధనతో, సరస్వతీ ప్రార్ధనతో.


నిజానికి జానపదుల కళా రూపమన్న పేరేకాని పలికే ప్రతిపలుకులో సరస్వతి లాస్యం చేస్తుందంటే అతిశయోక్తి కాదు, ఆ పలుకు అచ్చ తెనుగు నుడికారమై కమ్మని ఆవునేయిలా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ప్రతి పలుకు అంత స్పష్టంగానూ, ఉఛ్ఛారణా దోషాలు కూడా లేని విధంగా కళాకారులుంటారంటే, వారి నిజజీవితంలో కూడా ఇంత నిష్ఠా కలిగి ఉంటారంటే, ఆనందమే కలుగుతుంది. వీరు రామాయణ, భారత,భాగవతాలనుంచి కొన్ని ఘట్టాలు ప్రదర్శిస్తారు. పూర్వం రోజుల్లో వీరు బళ్ళు కట్టుకుని, కుటుంబాలతో సహా ప్రయాణాలు చేసి, వారాల తరబడి ఒకే ఊళ్ళో ప్రదర్శనలూ ఇచ్చేవారు. కథ చెప్పే, పాట పాడే, వాయిద్యాలు వాయించే కళాకారులంతా ఆ కుటుంబ సభ్యులే అయి ఉండేవారు.ఇక ఈ తోలుబొమ్మలాటలో హాస్యానికి గాను కేతిగాడు, బంగారక్కల జంట, గాందోళిగాడు, జుట్టుపోలిగాడు అనే వారూ కనపడతారు. ఆట మధ్యలో వీరిని తెరపై ప్రవేశపెట్టి హాస్యం పండిస్తారు. నేనెరిగినరోజులనాటికే ఈ హాస్యం కాస్తా అపహాస్యంగానూ ద్వందార్ధాలతో కూడిన బూతులుగానూ ఉండేవి. అసలు కళా రూపమే అంతరించి పోయిందనుకున్నా. ఇన్ని ఏర్పాట్లు చేస్తే కాని తోలుబొమ్మలాట జరగదు. అందుకే దీనిని తెరవెనక భాగవతం అన్నారు. నిజంగా ఇది నేటి సినిమా స్క్రీన్ ప్లే.  హరికథ,బుఱ్ఱకథ, నాటకాలని సినిమా మింగేసింది. సినిమాను టి.వి. మింగేసింది. టి.వి. ని ఇంటర్నెట్ మింగేసింది. మరింక కొత్తదేం పుడుతుందో చూడాలి. అందుకే పురాతన జానపద కళారూపాల్ని బతికించుకోవాలి. ఇప్పుడిపుడే ఈ స్పృహ కలుగుతోంది. మళ్ళీ పల్లెలలో జానపద కళారూపాలు ఆదరింపబడాలి.


ఏ కళా రూపానికైనా ముఖ్యమైనవారు ప్రేక్షకులు. వారు చూసి ఆనందించి అభినందించినపుడే కళాకారుని తృప్తి, సంతృప్తి. తోలుబొమ్మలాట చూడడానికి ఎవరొస్తారనుకున్నా. ఎక్కువగా వచ్చినది స్త్రీలు, పిల్లలు. నిజంగానే నాకు ఆనందం వేసింది. చిన్నపిల్లలకి ఈ కళారూపాన్ని దగ్గర చేయడానికి ముఖ్యులు స్త్రీలు, ఇంకా ఈ దేశంలో సంస్కృతి, సంప్రదాయం మిగిలున్నాయంటే, అదంతా స్త్రీల చలవే సుమా.  


 ఈ కళాకారులు, ఈ కళారూపాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకొస్తున్నారు. ఏ జానపద కళ ఐనా ప్రజల మన్ననా, ఆదరం, గౌరవం పొoదలేనపుడు మాత్రమే కనుమరుగైపోతుంది. ఈ కార్య క్రమాన్ని నేను పూర్తిగా చూడలేకపోయాను కాని, చాలా బాగుందని చెప్పేరు. ఆ తరవాత, ఇదే కళాకారులు కాకినాడ బీచ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శన ఇచ్చారనీ,ప్రజల ఆదరణ బాగుందనీ పేపర్లో చూశా. ఆనందమనిపించింది. ఇంతకీ మీకు ఈ కళా రూపం మీద అభిమానానికి కారణం? ఒకప్పుడు మావూరు, నరిసిపూడి ఈ కళారూపానికి పుట్టిల్లు. గోదావరి జిల్లాలో మా ఊరి కళా కారులుకి మంచి పేరుండేది. నేడు అక్కడ ఈ కళా రూపం పేరు చెబితే గుర్తు పట్టేవారు కూడా లేరు, ఆ కళ వీరి దగ్గర బతికి బట్ట కట్టినందుకే ఆనందం.  

మా ఊళ్ళో శ్రీ శారదా సంగీత కళా సమితి అనే ఒక సంస్థ ఉంది. దాని యాజమాన్యంలో, కొంత కాలం సంగీతం మటుకు కార్యక్రమాలు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో జరిపించేవారు. కాలంతో మార్పు తెచ్చి, సంగీతంతో పాటు ఇతర కళా రూపాల్ని కూడా నిర్వహించడం మొదలు పెట్టి, హరి కథ, బుఱ్ఱకథ, మొదలైనవాటిని కూడా ప్రదర్శన లిప్పించడం మొదలు పెట్టేరు. ఈ సంవత్సరం తోలుబొమ్మలాట ను పెట్టేరు. ఈ కళ చాలా కాలం గా మరుగున పడిపోయే ఉంది. 

ఈ జానపద కళ గురించి నేను చెప్పేకంటే వారిచ్చిన్ బ్రోచర్ చూడండి. 



ఈ కళని బతికించడమెలా? ప్రభుత్వం...ఆగండి ప్రభుత్వం ఎంత చేస్తుందో మనకి తెలియదా? మరెలా? మనమే ఈ కళని ప్రోత్సహించాలి. అదెలా? మన ఊరిలో సంబరాలకి,గణపతి నవరాత్రులకు, దుర్గా నవరాత్రులకు మరే ఇతర ఊరుమ్మడి కార్యక్రమానికైనా ఈ ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. మరలా పాత రోజుల్లో లా పెళ్ళి చేసుకోవాలనే అనుకుంటున్నది యువత, ఆ పెళ్ళికి ఈ కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఇక విదేశాలలో వారికి నేను చెప్పక్కరలేదు కదా! ఇప్పటికే వీరిని తానా వారు,ఇతర దేశాలవారూ ఆదరించారు. మరెందుకు ఆలస్యం, అవసరమైనవారు వివరాలు గుర్తుపెట్టుకోగలరు.

వీరిని పరిచయం చేస్తానని మాటిచ్చాను,స్కేన్ చేయాల్సిన కాగితం పని కాలేదు, అందుకే ఆలస్యమైపోయింది, కళాకారులు మన్నించ వేడుతున్నా. 

Saturday 17 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-కల నిజమౌనా?


ఈ వేళ తెల్లవారుగట్ల ఒక కలొచ్చింది, సాధారణంగా నాకు కలలు రావు. వచ్చినా మరచిపోతానేమో, ఇది మాత్రం గుర్తుంది.కల ఇది

" నా పై ఆఫీసర్ నా గురించి తన పై ఆఫీసర్ కి ఫిర్యాదు చేసేరట. ఏమనీ " ’ఇతను చెప్పినమాట వినటం లేదు, ప్రతిదానికి వ్యతిరేకిస్తున్నాడు, అందుచేత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసెయ్యమని’ ’ఈ సంగతి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పేడట, సలహా కూడా ఇచ్చేడు, నువ్వొక సారి పెద్ద ఆఫీసర్ గారిని కలిసి నీ సంగతి చెప్పుకోమనీ"  కల చెదిరింది, కథ మారిందీ, మెలకువ  వచ్చేసింది. ఈ కథకు అర్ధమేమీ? 

నిజ జీవితంలో ఇలా చాలా సార్లే జరిగేయి, నాకిది కొత్తా కాదు. ఇప్పుడు రిటయిర్ అయి కూచున్నవాడికి ట్రాన్స్ఫర్ ఏమి? అసలు కలలెందుకొస్తాయి? తెల్లవారుగట్ల వచ్చిన కలలు నిజమౌతాయంటారు, నిజమా? 

Friday 16 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వడబ్బా!



స్వకుచ మర్దనం, పరకుచ మర్దనం, పరస్పర కుచ మర్దనం అని ఇది మూడు రకాలూ అన్నారు, పూర్వీకులు. దీనికి తెనుగు అర్ధం చెప్పడం అశ్లీలoగా ఉంటుందనుకున్నా, అందుకుగాను దీనిని స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా అని తెనుగులో చెప్పుకోవచ్చనుకుంటా. ఇది పూర్వకాలం నుంచీ ఉందండి. ఇది చూడండి. 

రామో విగ్రహవాన్ ధర్మః

సాధుః సత్యపరాక్రమః
రాజా సర్వస్య లోకేస్య
దేవానామివ వాసవః.


దీని అర్ధం రాముడు మూర్తీభవించిన ధర్మం, సాధు పురుషుడు, సత్యవంతుడు, పరాక్రమవంతుడు, అదీకాక దేవతలకి ఇంద్రునిలాటివాడు అని చెప్పేడు! ఎవరూ? చెప్పినది? మారీచుడు. ఎవరితో? సాక్షాత్తు రావణునితో. శత్రువు గురించి,  మంత్రి తన రాజు దగ్గర చెప్పిన మాటలివి.  రావణుడేమనుకున్నాడూ మారీచుడు భయపడి రాముడి డబ్బా కొడుతున్నాడనుకున్నాడు తప్పించి, అది నిజమని నమ్మలేకపోయాడు. 


అవి సత్య కాలపు రోజులు కదా! భయపడినా నిజమే చెప్పేడు. ఇప్పుడు ఎవరి డబ్బా వారే వాయించుకోవాలి, మరొకరు ఎవరూ వాయించరు, అంత ఖాళీ ఎవరికీ లేదు. అదీగాక ఎదుటివాడి గొప్పతనం అంగీకరించడానికి మనం తెనుగువాళ్ళం కదూ! ఆత్మాభిమానం మెండు. అవసరాన్ని బట్టి పరస్పర డబ్బా ఉంటుందనుకోండీ! దీనికి ఉదాహరణలు కావాలా? నిన్నటిదాకా మన దేశాన్నేలిన పార్టీవారేమన్నారు, గుర్తు తెచ్చుకోండి, మేము తప్పించి ఈ దేశాన్ని పాలించగలవారు ఎవరూ లేరని కదా డబ్బా కొట్టుకున్నది, మరి వారికి తోడు నట్టువగాళ్ళు మరికొంత పరడబ్బా కొట్టేరు కదండీ, వీరికంటే గొప్ప పరిపాలకులు, ధర్మాత్ములు, ఉండబోరని.అసలు పరిపాలనే మరెవరు చేయబోలేరని కూడా చెప్పేరు కదా! ప్రజలా తెలివి తక్కువ వారు? చాలు బాబూ! మీపరిపాలన అని, ముసుగేసి మూల కూచోబెట్టేరు, ఇద్దరినీ. దీనితో నట్టువగాళ్ళకి ఒంటికి కారం రాచుకున్నంత సుఖంగానూ ఉంది. అందుకుగాను తెగ డబ్బా కొట్టేసుకుంటున్నారు,తెగ రెచ్చిపోయి, ఇప్పుడు. ఆఖరిమాట శత్రుదేశంవారు, ’భారతదేశం లో ఇదివరకు సున్నితంగా స్పందించే ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం మొరటుగా ప్రవర్తిస్తోందని’. శత్రువుతో సున్నితంగా ఎలా ఉంటారు? రాజకీయమేమో! డబ్బా కొట్టుకోడం ఏ స్థాయికి చేరిందో!


ఇక ఈ విషయంలో కవులు కళాకారులదంతా అదో తరహా.ఇక వీరికి డబ్బా కొట్టడం లో పత్రికలది మరోతరహా. గొప్పనటుడు "న ’బూతో’ నభవిష్యతి" వీరు నోరు విప్పితే పలికేవన్నీ బూతులే మరి. ’నవరసభరిత నటుడు, కళ్ళతోనే భావాలు పలికించగలదిట్ట’, ఇది పత్రికలవారు, ఆ నటుడికి కొట్టే డబ్బా. చెక్కపేడు  ముఖంతో, ఆ నటుడి ముఖంలో ఏ ఒక్క భావమూ కనపడదు, చివరికి శోకం కూడా. అది మనని ఆవరిస్తే నటుడి దగ్గరెందుకుంటుంది చెప్పండి, కర్మ కాలి సినిమా చూస్తున్నందుకుగాను. మరి సినిమాలెందుకాడుతున్నాయని కదా మీ అనుమానం. అవికాగోర్ లాటి అమ్మాయిని తెచ్చి, హీరోయిన్ ని చేస్తే, ఆ నటి నటిస్తోందా? పాత్రలో జీవిస్తోందా అనిపించేలా ఉంటే సినిమా ఎందుకుపోదూ? మరి ఆ నటికి ఆ డబ్బా మాత్రం ఉండటం లేదు, కలికాలం.


ఇక కవులు, ఛస్తే మరొకరి గొప్ప ఒప్పుకోరుకదా! ఏమైనా అంటే ’ఏ గతి రచించినన్ సమకాలికులెవ్వరు మెచ్చరే కదా’ అని చామకూర వేంకన్న ఎప్పుడో చెప్పేడు, మాకు పార్వతీ దేవి శాపం ఉంది లెండి అంటారు. కాని ఒక చిత్రం గమనించేరో లేదో వీరు మాత్రం ఒకరి వీపు మరొకరు బహు పసందుగా గోక్కుంటారు. తేడాలొస్తే వీధిన కూడా అలాగే పడతారు. సవతుల కయ్యంలా ఉంటుంది. అప్పుడు బహు పసందుగా ఉంటుంది లెండి, చెప్పడం కష్టం, వినాల్సిందే, అవి బూతులు కదా.


ఇంతకీ మీ గోలేమని కదా మీ అనుమానం. నేను ’కష్టేఫలె’https://kastephale.wordpress.com/ అనే ఒక బ్లాగు మొదలు పెట్టి రాశాను. చాలాకాలమే రాశాను. అందులో 750 పైబడిన టపాలూ ఉన్నాయి. ఈ మధ్య కూడలి లో నా బ్లాగు టపాలు కనపడటం లేదు. వారికి చెబితే, ఇబ్బందులున్నాయి, సాంకేతికంగా, సరి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పేరు. ఈ ఆగ్రిగేటర్ నెమ్మదిగా పని చేసినా, టపాలు చూడటానికి చాలామంది దీనినే ఎంచుకుంటారన్నది బహిరంగ రహస్యం.


  ఇక మాలిక ఇందులో కూడా టపాలు కనపడకపోతే చెప్పేను, టపాలు కనపడేలా సరి చేసేరు,వెంటనే. మరి కామెంట్లు ఆక్సిజన్ కదా! అవి కనపడకపోయేయి. మళ్ళీ చెప్పేను, సాంకేతికలోపం సరి చేయడానికే ప్రయత్నిస్తున్నామన్నారు.ఇందులో కామెంట్లూ, టపాలూ కూడా వేగంగా కనపడతాయి. కూడలి తరవాతది ఇదే, ఎక్కువ మంది కామెంట్లనుంచి వచ్చి టపా చదువుతారు. 


ఇక మూడవదైన బ్లాగిల్లు లో టపాలూ, కామెంట్లూ కూడా కనపడుతున్నాయి, కాని ఎందుకోగాని ఈ ఆగ్రిగేటర్ నుంచి ఎక్కువమంది క్లిక్ చెయ్యరు, కారణం తెలియదు. ఈ ఆగ్రిగేటర్ కొద్ది నెమ్మది, కామెంట్ల విషయంలో. 


ఉన్నమాటనుకోవాలి, ఈ ఆగ్రిగేటర్ల వారిని మా టపా కనపడటం లేదు, మా కామెంట్ కనపడటం లేదు అని అడుగుతున్నాం కాని పని చేసిన కాలంలో వారిచ్చిన సహకారానికిగాను, సేవలకు గాను, వారి డబ్బా కొట్టవలసిన అవసరం మనమీద ఉందా లెదా? మరి మనమెందుకు ఆ పని చెయ్యటం లేదు? భాష మీది పిచ్చి ప్రేమతో వారీ పని చేస్తున్నారు తప్పించి మరొకటి కాదని మనం గుర్తించాలా వద్దా? పక్క రాష్ట్రం లో  ఆగ్రిగేటర్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి, బ్లాగర్ నుంచి, డబ్బులు వసూలు చేస్తే మనలో ఎంత మంది కట్టడానికి సిద్ధంగా ఉన్నమో చెప్పండి. మనమేమో కామెంట్ కనపడలేదని ఎగురుతున్నాం కాని, వారు ఇంత చేస్తున్నందుకు వారికి ఒక సారి జే జే లు చెబుతున్నామా? వారూ మనలాటివారే కదా! మనకి ఒకరు ప్రోత్సాహం ఇస్తే సంతసిస్తున్న మనం, సేవలందించేవారికి జేజేలు పలకాలా? వద్దా?, అందరమూ, మాట కలపండి, జేజే లు చెప్పండి. ఆగ్రిగేటర్ల ఆర్ధిక పరిపుష్టికి మనం చేయగలదేమైనా ఉందా? ఆలోచించండి, ఆగ్రిగేటర్ల వారికీ ఒక మనవి, ఏడ్ లు తీసుకుంటే కొంత సౌకర్యం ఉంటుందికాదా, ఆలోచించండి.


ఈ సందర్భంగా నాకున్న రెండవ బ్లాగు ఇదే, దీనిలో రాద్దామని సంకల్పించా, అదీ తిరకాసు. ఇందులో ఫోటో లు మాత్రం పెట్టేవాడిని. ఇప్పుడు రాతలకి ఉపయోగిద్దామని ప్రయత్నం, అదనమాట సంగతి,నాలుగురోజులాగచ్చుగా? ప్రశ్న. అరవై ఏళ్ళ కితం చూసి, ఆ తరవాత కను మరుగైపోయిన ఒక కళా రూపాన్నిచూశా, దాని గురించి చెప్పెయ్యాలని, కడుపు ఉబ్బిపోతోంది, అదీ సంగతి.  మరి దీన్నేమంటారు? స్వడబా కదా!


ఇక https://kastephale.wordpress.com/,ఆ బ్లాగును ప్రైవేట్ బ్లాగ్ చేశాను, పా టపాలు చదువుకోవాలనుకుంటే అందులోకి ప్రవేశించాలి. మెయిల్లో టపా అందుకునేవారు మరల ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి, మంచిరోజులొస్తే మళ్ళీ అందులోకి మారిపోదాం. ఇబ్బంది కలగ చేసినందులకు క్షంతవ్యుడిని.


Thursday 15 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-గంగిరెడ్లు-1880



                                          అందరికి సంక్రాంతి శుభకామనలు.