Monday 26 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-కనిపించేవాడు దైవం కాదా?



"పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్" ఇవి పంచభూతాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తన్మాత్రలు. ఆకాశం నుంచి వాయువు, వాయువునుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలంనుంచి భూమి పుట్టేయని శాస్త్రాలు చెబుతున్నాయి, నేటి సయిన్సూ చెబుతోంది. అకాశానికి ఒకటే గుణం శబ్దం, మానవ శరీరంలో ఇంద్రియం చెవి, వాయువుకు రెండు గుణాలు శబ్దం స్పర్శ, మానవ శరీరంలో ఇంద్రియం చర్మం. తేజస్సు, దీనికి ఖగోళం లో సూర్యుడూ, భూమి పై నిప్పు ప్రతీకలు,ఈ భూతానికి మూడు గుణాలు శబ్ద, స్పర్శ, రూపాలు. ఇంద్రియం కన్ను. నాల్గవది జలం దీనికి నాలుగు గుణాలు. శబ్ద,స్పర్శ,రూప, రసాలు, ఇంద్రియం నోరు. చివరిది భూమి దీనికి ఐదు గుణాలు శబ్ద,స్పర్శ, రూప,రస,గంధాలు. ఇంద్రియం ముక్కు. పంచ భూతాలకి మానవ శరీరం లొ ఉన్న ఇంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలంటాం.

తేజస్సు అంతరిక్షంలో సూర్యునిగాను, భూమి మీద అగ్నిగాను కనపడతాయి. సూర్యుడు మిగిలిన నాలుగు భూతాలతో సంపుటీ కరణం చెంది, ఈ సర్వ జగత్తుకూ కారణమవుతున్నాడు. అలా భూమిపై పుట్టిన జీవులలో మానవుడు సర్వ శ్రేష్ఠుడు అన్నారు, జంతూనాం నరజన్మ దుర్లభం, శంకరులన్నారు. ఇలా పుట్టిన జీవులు మరలా భూమినుంచి సూర్యుని ద్వారా తయారైన ఆహారం తీసుకుని పెరుగుతున్నాయి. పెరుగుతున్న జీవులు పెద్దవవుతున్నాయి. పెద్దవైన ప్రాణులు భూమినుంచి సూర్యుని ద్వారా ఇవ్వబడిన ఆహారం, పురుషులలో శుక్రంగాను, స్త్రీలలో శోణితంగానూ పరిణామం చెంది, వారి కలయిక ద్వారా మరలా జీవులు పుడుతున్నాయి. వయసు మళ్ళితే మరణిస్తున్నాయి. మరణిస్తే మరలా సూర్యుని దయవల్లే బూడిదవుతున్నాయి, మట్టిలో కలసిపోతున్నాయి. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో కలియడానికి అన్నిటికి సూర్యుడే కారణం. ఇది కాలంలో జరుగుతోంది, ఈ కాలం కూడా సూర్యుని వలననే ఏర్పడుతోంది, పగలు, రాత్రుల రూపంలో. జీవుల ఆరోగ్యానికి కారకుడు,ఆలోచనలకు కారకుడు, అనారోగ్యానికి కారకుడు, మనుషులకు కావలసిన సర్వ వస్తువులూ భూమి ద్వారా సమకూర్చేవాడు సూర్యుడు. ఇంత చేస్తున్న సూర్యుడు దేవుడు కాదా? సూర్యుడు కనపడని రోజును దుర్దినం అంటారు, ఆ రోజు భోజనం చెయ్యనివారూ ఉంటారు, ఇదేమి మూఢనమ్మకమని కదా అధునికులవాదన, కాని ప్రకృతికి దగ్గరగా జీవించడమని ఆచరించేవారి వాదన.

Image courtesy: also see post.
http://navarasabharitham.blogspot.in/2014/03/blog-post.html

ఆరోగ్యం కోసం ఈ కింది శ్లోకం పారాయణ చెయ్యండి. ఉదయించే, అస్తమించే సూర్యుని చూడకండి. ఉదయించిన అస్తమయానికి ముందు సూర్యుని చూడండి. సూర్యుడికి మతాలు, కులాలూ లేవు, అందరిపట్లా ఒకలాగే ప్రవర్తిస్తాడు.

వికర్తనో వివశ్చాంచ్య మార్తాండో భాస్కరో రవిః
లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్గహేశ్వరః
లోక సాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రహా
తపన స్తాపనశ్చైవ శుచి స్సప్తాశ్వవాహనః
గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వ దేవ నమస్కృతః
ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టస్సదా మమః
శరీరారోగ్యద శ్చైవ ధన వృద్ధి యశస్కరః
స్తవరాజః ఇతి ఖ్యాతస్త్రిషులోకేషు విశ్రుతః

 సూర్యుని జీవితకాలం తో పోలిస్తే మన జీవిత కాలం చాలా స్వల్పం, సముద్రంలో నీటి బిందువు. ఈ సూర్యుడు కూడా మహాలయ కాలంలో అంతరిస్తాడు. వేదం ఇలా చెబుతోంది " సూర్యచంద్ర మసౌధాతా యథాపూర్వమకల్పయాత్, పృధివీంచాంతరిక్ష మధోస్వసః" సూర్యచంద్రులతో, భూమి మిగిలిన భూతాలను బ్రహ్మగారు మరల యధాప్రకారంగా పూర్వంవలె సృష్టి చేశారు. కారకులెవరు? శివ శక్తులన్నారు.

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి I
అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి

Cortesy:-http://shaktiputram.blogspot.in/2014/12/ii-ii.html

శివుడు లేని శక్తిలేదు, శక్తిలేని శివుడు లేడు. ఈ ఇద్దరూ కలసిన ఏక స్వరూపమే దేవుడు, నేటి ప్రోటాన్, న్యూట్రాన్ లనుకోవచ్చు, ఈ రెండూ కలసిన ఆటం అనుకోనూవచ్చు. ఈ అణువులతో ఉన్న ఈ సర్వ ప్రపంచమే విశ్వం,విష్ణుః...అదే పరమాత్మ...కనపడుతున్నవాడు దేవుడు కాదా? 
నేడు సూర్య జయంతి.

7 comments:

  1. సూర్యదర్శనం జరుగని రోజును దుర్దినం అని పిలవటం సంప్రదాయం. అది సబబే, బయట సూర్యరశ్మి లేని దినాన మన జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందుకే పూర్వాచారపరాయణులు కొందరు సూర్యదర్శనం లేనినాడు ఉపవాసం ఉండేవారు. మా బామ్మగారు ప్రొద్దు చూడందే ముద్దముట్టెవారు కారు.

    సూర్యుడిని సూర్యనారాయణుడనీ ప్రత్యక్షనారాయణుడనీ అంటాము భక్తిపూర్వకంగా. ఈ రోజుల్లో శాస్త్రజ్ఞులు భూమిలాగా జీవులకు ఆవాసంగా ఉండే అవకాశం గల గ్రహాలకోసం అన్వేషిస్తున్నారు. ఖగోళాన్ని జల్లెడపడుతున్నారు. వారి అన్వేషణలో ముఖ్యమైన ఆధారాలుగా గ్రహించేవి మొదటగా భూమిలాగా తగినంత ఉష్ణశక్తిని మాతృనక్షత్రం నుండి అందుకోవటమూ, గ్రహంపైన జలం ఉండటమూ అన్నవి. అందుచేత సూర్యుడు మన ఉనికికి కారణం ఐనందున కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడిగా అర్చించటం సదాచారమే కాని మూఢత్వం కాదు - అది మూఢత్వం అనే వారే మూఢులు. భారతం ఆదిపర్వంలో ఒక కథ ఉంది. దాన్ని మనం స్మరించుకుందాం. పోషించేవాడిని ఇంద్రుడని పొగడటంలో తప్పేమీ లేదని ఆ కథ సారాంశం. అటువంటప్పుడు సకలజగత్పోషకుడిని భగవంతుడిగా అర్చించటం మిక్క్లి ఉచితమైన పని.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,
      కాల స్వరూపుడు,సృష్టి, స్థితి, లయాలకి కారకుడు, ఆరోగ్యప్రదాత, ప్రత్యక్షంగా రోజూ కనపడేవాడు, ఇంతకు మించి దైవం ఎవరండీ? కనపడని దైవాని కోసం వెతకడం కంటే కనపడేవారిని ఆరాధించడం మేలు.
      నన్ను పెంచుకున్నమ్మ పొద్దు చూసేదిట, అలా ఉపవాసాలు చేయలేక నాకు భాస్కరుని పేరు కన్నమ్మ చేత పెట్టించి, పొద్దు చూడటం మానేసిందిట. అప్పటినుంచి ఆమెకు అనారోగ్యం పట్టుకుంది. పద్నాల్గు సంవత్సరాల తరవాత నన్ను పెంచుకుంది. చిత్రంగా ఆమెరోగం ఏ మందులతోనూ అవసరం లేకనే తగ్గింది. ఆరోగ్యంగా జీవించింది.
      ధన్యవాదాలు.

      Delete
  2. శర్మ గారూ ,
    నమస్తే .
    మీకు , శ్యామలీయం గారికి
    ఈ 66 వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .

    ఈ ప్రపంచంలోని ఏ ప్రాణికోటికైనా కృతఙ్నత అనేది ప్రధమ కర్తవ్యం . అడుగడుగునా ఈ కృతఙ్నత మానవుల జీవన గమనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది . మానవులు మినహా మిగిలిన ప్రాణికోటి వ్యక్తీకరించలేకపోవచ్చు అర్ధమయ్యే రీతిలో .

    కృతఙ్నత చూపగలిగేది మానవ జన్మలోనే . అందుకే శంకర భగవత్పాదుల వారు అన్నారు " జంతూనాం నరజన్మ దుర్లభం " అని .
    మీరన్నట్లు ఈ ప్రపంచం ఒక్కాటిగా వున్నది రెండు అయి , మరల ఒక్కటి అయ్యేటందులకు ప్రయత్నం చేస్తూనే వున్నది . ఈ ప్రయత్నంలోనే ఈ సృష్టి కావించబడినట్లుగా భావిస్తున్నాను నాకున్న చిన్ని ఆలోచనలతో .

    చాలా చక్కగా విడమఱచి విశదీకరించారు . సంతసం కలిగించారు .

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ,
      చక్కగా చెప్పేరు.
      ధన్యవాదాలు.

      Delete

  3. ఇలా సూర్య దర్శనం జరగని రోజు అభోజనం గా ఉండాలి అనుకుంటే నార్త్ పోల్ దగ్గిర ఉన్నవాళ్ళు అర్ధ సంవత్సరం పస్తు తో ఉండాల్సిందే మరి ! జేకే !

    రథ సప్తమి శుభాకాంక్షల తో
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      మనకి సూర్యుడు నిత్యమూ కనపడతాడు, కనపదని రోజులు అరుదు, వాటినే దుర్దినాలని అంటాం. ఇక ధృవాల దగ్గరుండేవారికి ఆరు నెలలు సూర్యుడు కనపడతాడు, ఆరు నెలలు కనపడడు, కాని వారి జీవగడియారం మాత్రం ప్రతి పన్నెండు గంటలకూ విశ్రాంతికోరుతుంది. ఇదెలా జరుగుతోంది?
      ఈ నియమాలు ఆ ప్రదేశాల్లో ఉండేవారికి మాత్రమే పరిమితం, అంటే సూర్యుడు నిత్యం కనపడేవారికే. ధృవాల దగ్గరవారికి మనవారు చెప్పలేదు, అవసరం లేదు కనక, చెప్పివున్నారేమో నాకు తెలియదు
      ధన్యవాదాలు.

      Delete
    2. అట్లా గాలెం వేస్తే నే చేపలు పడును !
      ఈ జవాబు భేషైన జవాబు

      జిలేబి

      Delete