30, జూన్ 2024, ఆదివారం

పిల్ల చచ్చినా పురిటి కంపు పోదు.

 పిల్ల చచ్చినా పురిటి కంపు పోదు.


ప్రసవించిన స్త్రీ దగ్గరనుంచి కొద్ది వాసనొస్తుంది,దీన్ని పురిటి వాసన అంటారు. ఇది ప్రసవానికిగాను శరీరం నుంచి బయటకొచ్చే కొన్ని హార్మోన్ల ప్రభావం. దురదృష్టం కొద్ది బిడ్డ దక్కకపోయినా ఈ వాసన తప్పదు,మూడు నెలలుంటుంది.


ఎన్నికలైపోయాయి దగ్గరగా నెల కావొస్తోంది, కాని ఆనాడు ఓటేసినట్టు వేలు మీద పెట్టిన గుర్తు మాత్రం ఇంకా పోలేదు, ఎన్నాళ్ళుంటుందో చూడాలి.

అనారోగ్యంతో బాధ పడుతున్నా రాసే అలవాటు మానలేనట్టు.  :) :) :) 


28, జూన్ 2024, శుక్రవారం

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.

  తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.


కన్నగాడు కత్తి మరవడు.

పడ్డవాడు చెడ్డవాడు కాదు.

 తంతే (తన్నితే)  బూరెల బుట్టలో పడ్డట్టు.

లాభం లేని వ్యాపారం జీతంలేని ఉద్యోగం ఉండవు.

బోడిచేతికి శనగలు తినడం నేర్పినట్టు.

కోడెకు పొట్లు నేర్పినట్టు.


20, జూన్ 2024, గురువారం

సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

 సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

nmrao bandi14 June 2024 at 05:47

''అవును గురూజీ నేనూ అనుకుంటూ ఉంటాను, నేను పోయినా నా బ్లాగు ఇలాగే ఉంటుంది కదా అని. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు - అలా నా వెనక!? దేవుడికే అది ఎరుక, తెలిసేది లేదు కనక!! మనం ఎగిరెళ్ళిపోయినా బ్లాగు చూసే మిగిలున్న వాళ్ళకి ఆ విషయం తెలీదు కనక! ఓ విధంగా ఆ విధంగా సజీవులమే కొన్నాళ్ళు, ఇంకొన్నాళ్లు - అదెన్నోళ్ళో మరి! ఇది కన్నోళ్ళు విన్నోళ్ళు ఏమంటారో మరి? ఔనంటారా సరి! రామ్మా, పజ్జెమేసుకో బామ్మా :)''




మిత్రుని వ్యాఖ్యకి సమాధానం రాయబోతే టపా అయ్యేలా ఉందని వెనకబెట్టేను. ఈ రోజుదయం సింహాసనం ఎక్కి రాయడం మొదలు పెట్టేటప్పటికి కరంటు పుటుక్కున పోయింది. అయ్యో! అనుకుంటూ వచ్చాకా మొదలెడితే మళ్ళీ పోయింది.(వారం కితం మాట)  ఎన్నిసార్లు లెక్కేయడం మానేసా! విసిగి రాయడమే మానేసాను! మొదలెట్టిన ప్రతిసారి కొత్త ఆలోచన, ఆలోచనలు ముసిరి,విషయం పక్కకి పోయి,చిందరవందరైపోతే! మొత్తం ఎత్తి కట్టేసాను! రాత్రి మొదలెడితే, అనుకుంటే వేడి రాత్రికీ దిగలేదు. మొదలెట్టేనుగాని వేడి భరించలేక మానేసాను. తెల్లవారుగట్ల మొదలెడదామని! (ఇదంతా నాలుగురోజుల కితం మాట) వేడి ఇంకా దంచుతోనే ఉంది,చినుకులు అక్షంతల్లా పడ్డాయి.


ఎక్కడ మొదలెట్టాలి? సమస్య అలాగే ఉండిపోయింది. ఎక్కడో ఒకచోట మొదలెట్టాలిగా! అని ఇలా!

మొదటగా ఆకాశం వ్యక్తమయింది. దానినుంచి గాలి, గాలినుంచి అగ్ని,అగ్నినుంచి నీరు,నీటి నుంచి భూమి. వీటన్నిటి సంయోగంతో సర్వసృష్టి వ్యక్తమయ్యాయని మన తత్త్వం చెబుతోంది,సయిన్సూ చెబుతోంది. ఆకాశం ఎక్కడినుంచి పుట్టిందీ? మహత్తు నుంచి అంటోంది భారతీయ తత్త్వం, అదే శక్తి అనికూడా అంటోంది,సయిన్సూ. ఆశక్తినే మనవారు లలితా దేవి అనికూడా అన్నారు. లలితా సహస్రనామాలో ఒక నామం ”వియదాది జగత్ప్రసూః” అని అంటే వియత్తు అనగా ఆకాశం మొదలుగా,వియదాది, జగత్ ప్రసూః అనగా సర్వజగత్తునూ కన్న తల్లి అని. అనగా ఆకాశం మొదలుగా పంచభూతాలను వ్యక్తపరచిన శక్తి అని అర్ధం. ఇలా సర్వజగత్తునూ వ్యక్తం చేయడం మరలా అవ్యక్తం, తనలోకి తీసుకోవడం చేయడం అనేది, ఈ శక్తి ఎక్కడా? అంటే! భాగవతం 'లోకంబులు లోకేశులు,లోకస్థులు దెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుంగు'.... అంటుంది ఆ శక్తిని వర్ణిస్తూ! అక్కడే పోతనగారు 'ఒకపరి జగముల వెలినిడి,ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానై' అంటూ చెబుతారు. సయిన్స్ చెప్పే,మన తత్త్వం చెప్పే ఈ ఎవల్యూషన్,డివల్యూషన్ రెండూ పక్కపక్కలే జరిగిపోతుంటాయి.ఒక్క సారిగా అన్ని వ్యక్తం కావు అన్నీ ఒక్కసారిగా అవ్యకతమూకావు, కాలంలో వచ్చి వెళుతుంటాయి. మొత్తం ఒక్క సారిగా ప్రళయం సంభవించి అన్నీ ఏకమవుతాయి. అప్పటిదాకా ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. అన్నీ కాలంలో వచ్చి కాలంలో వెళుతుంటాయి. అందుకే దీనిని జగత్ అని అంటారు. జాయతే గఛ్ఛతే ఇతి జగత్, వచ్చేది,వెళ్ళేది. అన్నీ కాలంతో పాటివే! కొన్ని, కొన్ని క్షణాలే ఉంటే కొన్ని వందల సంవత్సరాలుంటే, మరికొన్ని వేల సంవత్సరాలు ఉంటాయంటున్నారు. సముద్రం లో వేల సంవత్సరాలుండే జీవులున్నాయని సయిన్స్ చెబుతోంది. కాలం మాత్రం ఆ శక్తికిలోబడి ఉంటుంది, దానినే ,కాలాతీత శక్తి, అని అంటాం.చెప్పుకుంటే చాలా ఉంది. ఇక్కడికాపుదాం. 

మనకతలో కొస్తే!


న+క్షరం='అక్షరం', అనగా నశింపు లేనిది. మనం రాసే ఈ అచ్చరాలెంతకాలముంటాయన్నదే ప్రశ్న. రామాయణం రాస్తూ వాల్మీకి, ''ఈ కావ్యం, నదులు పర్వతాలు ఉన్నంత కాలం ఉంటుంద''న్నారు. ఇటువంటి మాట ఆ తరవాత కవుల్లో ఎవరూ అనలేకపోయారు,నేటిదాకా.  ప్రకృతిలోకి వ్యక్తమయ్యేది ప్రతిదీ, కాలం తో ముడిపడి ఉన్నట్టే మన అచ్చరాలూ ముడిపడి ఉన్నాయి.   ప్రతిజీవికి కాలం ఉన్నట్టే  అచ్చరాలకీ కాలం ఉంది. కాలం తరవాత మరుగునపడతాయి,నశించవు. అక్షరాల సమూహానికో త్రాణ,త్రాణని బట్టి కాలం, కాలమే ప్రాణం. అది ఎంత? అదిగదా ప్రశ్న,సమాధానం లేని ప్రశ్న.  


 ఒకప్పుడు అచ్చరానికి మాధ్యమం శ్రవణం, కాలం మారి, అనేకరూపుల్లో పుస్తకాలొచ్చి చాలా మార్పొచ్చింది. ఇప్పుడు పుస్తకాన్ని ముట్టుకునే ఓపిక,తీరిక ఎవరికిన్నీ లేదు. అంచేత మరలా శ్రవణానికే మారిపోతున్నకాలం.


ఇక ఎలక్ట్రానిక్ యుగంలో మార్పులు చాలా తొందరగా వస్తున్నాయి. ఈ మాధ్యమాలు మనం చూస్తుండగా పుట్టాయి,పెరిగాయి, కొన్ని మరుగున పడిపోయాయి. ఈ అచ్చరం రాసే అలవాటున్నవాళ్ళు కొద్ది. చదివేళ్ళూ వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. మాధ్యమాలు వెనకబడితే, రాసేవాళ్ళు వెనకబడితే,చదివేవాళ్ళు వెనకబడితే అన్ని మరుగున పడతాయి. అదెంతకాలం? అదీ పెద్ద కొచ్చను.????


16, జూన్ 2024, ఆదివారం

సామాన్యుని సణుగుడు- దిన దిన గండం

 సామాన్యుని సణుగుడు- దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు.

గండం అంటే ప్రాణ ప్రమాదం. దినదినమూ ప్రాణప్రమాదమే కాని వందేళ్ళూ బతుకుతాడని భావం.ప్రళయం అంటే లయం, అనగా కలిసిపోవడం.ప్రాణులన్నిటికి నిద్ర నిత్య ప్రళయం,తప్పనిదిన్నీ! అలాగైతే నూరేళ్ళెలా బతుకుతారని కదా!బతుకుతారు అదే చిత్రం. దినదినమూ నిద్రపోతారు, మేల్కొంటారు. ప్రళయం గడుస్తుంది. ఇలా అలావాటైన నిత్య ప్రళయాన్ని ఎవరూ లెక్క చెయ్యరు. ఎప్పుడో ఒక రోజు నిద్ర లేవరు అంతే!!! అందుకే దాన్నే దీర్ఘనిద్ర న్నారు. అదీ ఈ నానుడి భావం.








ఎవరు తప్పుకున్నా ప్రభుత్వం పడిపోదని తెలిసినవారి మాట. ప్రభుత్వంతో ఉన్న పార్టీలకి బి.జె.పి కి పరస్పరాశ్రయ న్యాయం వర్తిస్తుందిట. వీరవసరం వారికుంది,వారవసరం వీరికుంది. ఎవరూ విడిచిపోయేవారు లేరు. ప్రతిపక్షంలోనే చీలికలొచ్చే సూచనలు కనపడుతున్నాయి.

జగన్ మాకు 15 మంది ఎమ్.పి లు ఉన్నారు. మా బలమేం తగ్గలేదు, దేశావసరాలు,రాష్ట్ర అవసరాలని బట్టి అవసరం మేరకు ప్రభుత్వాన్ని బలపరుస్తామన్నారు. మహారాష్ట్రలో లకలుకలు బయలు దేరాయి ప్రతిపక్షంలో!! దినదినగండం నూరేళ్ళాయుస్సే!!!!


13, జూన్ 2024, గురువారం

సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.

 సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.


ఏది శాశ్వతం? ఏదీ కాదన్నదే సమాధానంట.మనకి కనపడే జంగమాలు,స్థావరాలు,ఉద్భిజాలు సర్వం ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవే కాలంలో. అంచేత అన్నీ కాలంలో లయం కావలసినవే! కాలమే శాశ్వతమా? కాదు. మనకి శాశ్వతంగా కనపడే కాలాన్ని కూడా లయం చేసే శక్తి ఉంది. అదే శాశ్వతం. ఏంటో దీనికి అంతులేదు,ఆదీ లేదు.


నా తరవాత నేను సంపాదించిన ఇళ్ళు,పొలాలు,,బంగారం వగైరా వగైరా ఏమవుతాయి? అసలు నేనేమవుతాను? నేను పోయిన తరవాత ఏం జరిగితే నాకెందుకు? ఏమవుతానో నాకు తెలీదు కదా? మరి దేనికి చింత? అనుకోగలిగితే కొచ్చనే లేదు.కాని అలా అనుకోదే మనసు. నా తరవాత నా పేరైనా శాశ్వతంగా ఉండాలని తాపత్రయం. ఇది నాతోనే మొదలవలేదు. అబ్బో మానవజాతి పుట్టినప్పటినుంచీ ఉంది,ఈ ఆలోచన. 


 మహరాజులు,రాణులు గుళ్ళు కట్టించారు,చెరువులు తవ్వించారు, అన్న సత్రాలు పెట్టించారు, కావ్యాలు రాయించారు, కృతులు పుచ్చుకున్నారు, ఇలా చాలాచాలా చేసేరు. పోషణకై ఆస్థులిచ్చారు.  కలిగినవారు చేశారీ పని. వేశ్య కూడా ఈ పని చేసింది. బోగందాని చెరువు పేరుండిపోయింది,ఆవిడపేరు తెలియకపోయినా!


నా తరవాత ఏం జరగాలో విల్లు రాసాను, ఆస్థులు అలా పంచుకుంటారు,తగువు లేదు, రాయకపోయినా పంచుకుంటారు, మానెయ్యరు, ఇదో చాదస్తం అంతే! ఒక రోజేడుస్తారు లోకంకోసమే! అమ్మయ్య ముసలాడి గొణుగుడు తప్పింది,చాకిరీ తప్పిందని.ఆ తరవాత మరిచే పోతారు, సహజం, నేను తాతని గుర్తుపెట్టుకున్నానా? పేరెట్టుకున్న, గనక, గుర్తు అంతే!


అతి సామాన్యులు ఐతే గుడి మెట్ల మీద పేర్లేయించుకునీవారు. మెట్టుకి పావలా పేరు లో అక్షరానికి అణా ఇలా ఉండేవి.నేటికీ కొన్ని దేవాలయాలకి మెట్లు వాడుతున్నారు, వాటి మీద నేటికిన్నీ పేర్లు కనపడుతుంటాయి. మా తాతపేరు అన్నవరం గుడి మెట్లమీదుందోచ్! అని చెప్పుకునీవారూ ఉన్నారు.


ఇంత అశాశ్వత జగత్తులో మన రాతలో లెక్కా! ఉంటే ఎక్కడో మూలుంటాయి,లేదూ కొట్టుకుపోతాయి, కాలంతో. నాబ్లాగొకదాన్ని రెండేళ్ళ కితం వదిలేసా! అప్పుడప్పుడు చూస్తుంటా,తెరుస్తా! ఉందా? పోయిందా అని! ఇంకా ఉంది, చిత్రం ఎవరికో అవసరం, రోజూ పాతికనుంచి ఏభై హిట్లుంటాయి. ఎన్నాళ్ళుంటాయి? అదే తెలీదు :) 

8, జూన్ 2024, శనివారం

సామాన్యుడి సణుగుడు

సామాన్యుడి సణుగుడు 

ఎన్నికల్లో చిత్రాలు.


  ఎన్నికల యజ్ఞం,ఫలితాల రాకా,  పూర్తయింది. చూసే కన్ను, మనసు ఉంటే చిత్ర విచిత్రాలే ఉన్నాయి.  ఎన్నికల్లో సామాన్యుడు చేసిన చిత్రం చూద్దాం.


మొన్నటిదాకా ఇ.వి.ఎమ్ లమీద అనుమానాలతో చెలరేగిపోయిన వారు ఫలితాల తరవాత నోరు మెదిపిన పాపాన పోలేదేమో!

ఇక ఎన్నికల కమిషన్ని, కమిషనర్లని, ప్రభుత్వoలో ఉన్న పార్టీకి కట్టుబానిసలని, తిట్టిన నోళ్ళు, తెరుచు   కోలేదు,ఫలితాల తరవాత.

కొంతమంది మేధావులు ఎన్నికల కమిషన్ కు,సుప్రీం కోర్టుకు ఉమ్మడి ఉత్తరం రాసేసి, ప్రభుత్వం పైన  తమకడుపులో కుళ్ళు వెళ్ళగక్కు కున్నారు.


ఎన్నికల తరవాత మోడీ మరో దేశం పారిపోతాడు అని నోరు పారేసుకున్న లాలూ ఎక్కడా? అరడజను సీట్లైనా గెల్చుకున్నాడా? లేదు 4 సీట్ల దగ్గరాపేసేరు.


మోడీ మళ్ళీ ప్రధానైతే గుండు గీయించుకుంటానన్నాడో  రాష్ట్ర మంత్రి,(తనకి నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు) ఏమయ్యాడో? 


భారతీయ పౌరులలో ఎక్కువమంది, చదువులేనివాళ్ళే కావచ్చు, మేధావులు కాకపోవచ్చు, పేదవాళ్ళే కావచ్చు, డబ్బుకి వోట్లు వేసేవాళ్ళు కావచ్చు, ఉచితాలకి ఎగబడేవాళ్ళే కావచ్చు కాని అవసరం వచ్చినపుడు, మండుటెండలో నిలిచి ఓటేసి, కొఱ్ఱు కాల్చి వాత పెట్టడం లో నిపుణులన్న  సంగతి ఎన్నికలని చూస్తే తెలుస్తుంది.  ఒక్కొకటే చూదాం!


నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు, అని సొల్లు కొట్టిన కేజ్రివాల్, పంజాబ్ లో మూడు సీట్లు గెల్చుకుని, డిల్లీలో, సోదిలోకి రాకుండా పోయాడు. ఉచితాలకి ఓట్లు రాలవన్న మొదటి మాట. 


ఉడుకెత్తించే ఉపన్యాసాలకి ఓట్లు రాలవని కూడా కన్నయ్యకి కాల్చి వాతేట్టేరు,డిల్లీలో!


బీహార్ లో లాలూకి,కాంగ్రెస్ కీ   తమ స్థానమేంటో చెప్పింది సామాన్యులే!

బెంగాల్లో కాంగ్రెస్ కీ, పూర్తిగా ఉద్వాసన చెప్పేసింది దీదీ! ఒకే ఒక్కడుగా పోరాడిన యోధుడు Adhir ranjan chowdary కూడా మమత దెబ్బకి నేలకొరిగాడు.   బెంగాల్లో కాంగ్రెస్ నీ వారి మిత్రులు కమ్యూనిస్టులని మమత కర్చు రాస్సినట్టే! ఒంటరి వీరుడు అధీర్ రంజన్ చౌదరీ ఆర్తనాదాలు కాంగ్రెస్ వారి చెవులబడుతున్నట్టు లేదు. నాకు మరో పని చెయ్యడం చేత కాదు,సంపాదనా మార్గమూ లేదు, కూతురు చదువుకుంటోంది. నేడో రేపో ఢిల్లీ వెళ్ళి క్వార్టరు కాళీ చేసి రావాలన్న ఆకలి కేకలు కూడా, నిన్నటివరకు  లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఆర్తనాదాలు కాంగ్రెస్ కోటలోకి చేరుతున్నట్టు లేదు.  కావాలంటే నన్నేమైనా చేసుకో కాని కార్యకర్తలని ఏమీ చెయ్యకని, మమతని ఫలితాల తరవాత జరిగే హింసనుంచి కాపాడమని, చేతులు జోడించి వేడుకున్నదైనా చెవులబడుతోందో లేదో,విన వలసిన వారికి, తెలియదు.    


 ఇక బెంగాల్ అంటే ఒకప్పుడు ఎఱ్ఱవారి కంచుకోటని పేరు, పాపం సోదిలోకి కూడా రాకుండా పోయారేమో! సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఒడిషా ది మరో చిత్రం. ఒడిషా అంటే పట్నాయక్ అని మారుపేరు, పాతికేళ్ళగా మచ్చ లేని ముఖ్యమంత్రి, కాని బయటికి పంపేసేరు, రాష్ట్ర ఎన్నికల్లో, ఇక పార్లమెంటుకి ఒక్క సీటిచ్చెరు,BJP కి పందొమ్మిది సీట్లిచ్చేరు.కారణం, తను మెచ్చిన ఒక తమిళ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని పూర్తిగా చంకనెత్తుకోవడం,చివరికి అతన్ని ఉద్యోగం మాన్పించి పార్టీ లో చేర్చి పెత్తనమప్పగించడం, సహించ లేదు. ప్రతిపక్షంలో కూచో బెట్టేరు.సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఉత్తరప్రదేశ్ యోగి బాబా పరిపాలన, కాని అక్కడ సమాజవాది పార్టీకి 37 సీట్లిచ్చేరు, కూడా ఉన్న కాంగ్రెస్ కి ఆరిచ్చేరు. కాంగ్రెస్ తమగొప్పే అని చంకలు గుద్దేసుకుంటోంది. గొప్ప సమాజ్ వాది పార్టీ దనుకోడం లేదు.దూకుడు తగ్గించమని యోగిబాబాకి చిన్న చురక. 

 

తెలంగాణాలో, సర్వమూ నేనే అని చెప్పిన బి.ఆర్.ఎస్ కి లోక్ సభలో స్థానమే లేకుండా చేసేరు. ఎంత చిత్రం.


ఇక ఆంధ్రా గురించి చెప్పక్కరనే లేదు. జగన్ 11 MLA సీట్లు గెల్చుకుంటే గొప్పయి పోయింది. 4 ఎమ్.పి లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉచితాలనేకం ఇచ్చానే! అయ్యో! ఇంత అన్యాయమా? అని ఆక్రోసించి ఉపయోగం లేదు. ఉచితాలు గండం గడుపుతాయన్న వారికి పెద్ద పాఠమే! ఉచితాలు మేమడగలేదు, మీరిచ్చారు,పుచ్చుకున్నాం. ఉచితాలిస్తే ఓట్లేస్తామని మీరనుకోడం పొరబాటు. చురకేసి చెప్పినట్టు కాలేదా?    కేజ్రి తరవాత రెండో వారికి పాఠం చెప్పిన సామాన్యుడు.    ఏదో జరిగింది ఆధారాలు లేవని ఆక్రోశం ఉపయోగం లేనిది.  


ఎక్కడైనా కాలు పెట్టేరేమోగాని తమిల్ నాడులోకి బి.జె.పి ని రానివ్వకుండా చేసిన ఘనత స్టాలిన్ మరియు పుత్ర రత్నానిదే!  అదే మరి ప్రజాస్వామ్యమంటే! కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే! చివరికి భూమిమీద పేరైనా ఉందా? లేదే! ఇటువంటివారు కాలగతిలో ఎందరు చేరిపోలేదు? హిందూ సంస్కృతి డెంగూ, వగైరా అంటూ నేడు పేలుతున్నవారికి రోజు రావాలి! వస్తుంది!! అప్పటిదాకా ఇంతే!! దోస్తులకి ఇది వినపడుతోందా? 

  ఎ.ఐ.డి.ఎమ్.కె కనపడకుండా పోయింది, బి.ఆర్.ఎస్ లాగా!

చిట్ట చివరికి కేరళాలో సురేష్ గోపి, చిత్ర నటుడు రూపంలో బి.జె.పి కాలు పెట్టింది. ఇదొక రికార్డే! సామాన్యుని చిత్రం. కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లిచ్చి గెలిపించారు.సి.పి.ఎమ్ కి ఒక్క సీటిచ్చారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకి పెద్ద చురక. దేశం మొత్తం మీద ఒకే ఒక కమ్యూనిస్ట్ ఎమ్.పి అనుకుంటా! సామాన్యుడు వేసిన పెద్ద చురక.

   M.Pలో వృద్ధ కాంగ్రెస్ వాదులందరిని తుడిచి పెట్టేసి, మొత్తం సీట్లు బి.జె.పి కే ఇచ్చేసేరు. రాహుల్, ఈ వృద్ధ కాంగ్రెస్ వాదుల్ని వదిలించుకో లేకపోయాడు. ఆ పని బి.జె.పి చేసి పెట్టింది. కాంగ్రెస్ కి పెద్ద లాభం  

కర్ణాటకా లో ఉచితాలు ఉచితాలే, కేంద్ర ఎన్నికలు ఎన్నికలే అని తొమ్మిదే సీట్లిచ్చారు కాంగ్రెస్ కి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా!  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా BJP కి  17 సీట్లిచ్చారు  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా ! సామాన్యుడు వేసిన పెద్ద చురక,కాంగ్రెస్ కి!


BJP:-మీరు దేశ భద్రత,రక్షణ,విదేశీ వ్యవహారాల్లో చూపిన నిపుణతకి జే జేలు చెప్పేం! ఐతే దేశపు అంతర్గత వ్యవహారాలలో కొంత పట్టు విడుపు అవసరం,దాన్ని విస్మరించి, ఒంటెత్తు పోకడ పోయినందుకు, మిమ్మల్నిప్రతిపక్షంలో   కూచోబెట్టలేదుగాని మీకుగా స్వతంత్రంగా 272 సీట్లు ఇవ్వటం లేదు, మరో నలుగుర్ని తోడిస్తున్నాం! వారితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి! అని చెప్పి నాలుగు పార్టీలతో కలిపి 293 సీట్లిచ్చినది పెద్ద హెచ్చరిక!  BJP కి,  మీతో ఇప్పుడు. తీసుకున్న నిర్ణయం కచ్చితoగా అమలు చేసే మోడీ అంటే చాలామందికి కడుపుమంట, దేశంలోనూ విదేశాల్లోనూ కూడా!   BJP పార్టీకి పెద్ద హెచ్చరిక!ఇది సామాన్యుని హెచ్చరిక

Congress:- పార్టీని మా తాత,తండ్రులు నిర్మించుకున్నది, నేటికి ఒక కుటుంబానికి చెందిపోయింది. మీ నుంచి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, అందులో ఒక్కటి మచ్చుకి. మీ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం వివరాలు దేశానికి చెప్పేరా? ఏమిటవి? ఇప్పుడు మీకిచ్చిన 99 సీట్లు మీ ప్రతిభకి మెచ్చి ఇచ్చినవి కావు. బి.జె.పికి,  ఒక చిన్న చురక అంటించడానికి చేసిన కసరత్తు.పదేళ్ళు పరిపాలన చేసినవాళ్ళని ప్రతిపక్షంలో కూచోబెడ్తారు,ఆ పని చెయ్యలేదు. ఈ 99 సీట్లు,  మీప్రతిభే అనుకుంటే పొరబాటు, మరోమాట కూడా! ప్రభుత్వాన్ని పడకొట్టేస్తాం! రంకెలేస్తున్నారు, అస్తు! మరచిపోకండి! ఆ తరవాత మీరు నిర్మించే ప్రభుత్వం ను, మీరు ఆరు నెలలు నిర్వహించలేరు. ఇప్పుడే మీ దోస్తు మమత నిన్నటిదాకా మీ పల్లకీ మోసిన బోయీ అధీర్ రంజన్ చౌదరిని నానాగడ్డీ కరిపించేస్తోంది. నేడు మీతో ఉన్నవాళ్ళెవరూ మీ మిత్రులు కారు, ఇంతటి గొప్ప దోస్తుతో మీ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉండబోతోంది? మీ యోధుడినే రక్షించలేని మీరు దేశాన్నేం రక్షిస్తారు? దేశo కుక్కలు చింపిన విస్తరైపోయి, మళ్ళీ మోడీకే ఈ సారి 400  సీట్లిచ్చి  పట్టం కడతారు. ఆ తరవాత మీ అడ్రసులు గల్లంతు, జాగ్రత్త! చూసుకుని అడుగేయండి. పశ్చిమ దేశాలన్నీ తమ స్వార్ధం చూసుకుంటాయి. అంతేకాదు భారత్ ఎప్పుడూ వాటికి అణిగిమణిగి ఉండాలనీ,వాటిమీద ఆధారపడి బతకాలనీ అనుకుంటాయి. అది తెలుసుకు మసలండి. మీ స్వంతంగా 272 స్థానాలూ వచ్చేదాకా ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రయత్నాలు చేస్తే ఫలితాలు విపరీతంగా ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక,చురక, సామాన్యుడి నుంచి.


29, మే 2024, బుధవారం

లోకులు పలుగాకులు.

 

    లోకులు పలుగాకులు.


లోకుల్ని కాకులతోనే ఎందుకు పోల్చేరు? 

కాకి కూత కఠోరంగానే ఉంటుంది. ఏమిటి లోకం? పలుగాకుల లోకం   న్నారో సినీ కవి.    

కాకుల్లో చాలా రకాలట, బొంతకాకులు,నల్లకాకులు,పిల్లకాకులు. మిరపకాయి తిన్న కాకిలా అరవకంటారు, ఇంకా ఐతే మిరపకాయ తిన్న పిల్ల కాకిలా అరవకంటారు. పిల్ల కాకి బాగా అరుస్తుందిట. ముసలికాకులూ బాగానే అరుస్తాయిట.  బొంతకాకులు మిగిలిన కాకుల్ని బెదిరిస్తూ ఉంటాయి. తెల్లకాకులు లేవన్నాడు బద్దెనగారు. ఇప్పుడంతా తెల్ల కాకులదే మహిమ. వారు చెప్పిందే వేదం.  మెతుకులు కనపడ్డ చోటనే కాకి చేరుతుంది, మరిన్ని కాకుల్ని పిలుస్తుంది, కూతతో.

కాకి కూసిందని మన పని మనం చేయడమూ మానకూడదు, కాకి కూత కోసం ఎదురూ చూడ కూడదు. ఈ పలుగాకుల్లో చాలా రకాలుంటాయి. కాకి కూతలు వినాలి. కాకులు కూస్తున్నాయని వాటిని తోలుకుంటూ కూచుంటే మన పని చేయలేం. కాకి కూతలు వినాలి, కాకి కూతల్ని ఆస్వాదించి, నవ్వుకోవాలి.  

హేటు కూసే  కాకి,  కూసి కూసి, కొంతకాలానికి, కాకి అలసిపోతుంది. కాకిని అలసిపోనివ్వ కూడదు.  మెతుకులేస్తూ ఉండాలి.  కాకితో సహజీవనం తప్పదు. మరీ మీద మీదకొచ్చే కాకుల్ని ఉపేక్షించ కూడదు. కాకి కూతలు మన పనికి అడ్డంకి కాదు, అడ్డంకి చేసుకోరాదు. ఇది మనచేతనే ఉంది. కాకులు మొత్తాన్ని తోలుకుంటూ కూచుంటే ఎలా? మన పని చేసుకుంటూ, కాకి కూతలు వింటూ, కాలక్షేపం చెయ్యాలి. కాకి కూతని కాలక్షేపం చేసుకోవాలి. మరో సంగతి మరచిపో కూడనిది, మెతుకులున్న చోటకే కాకి చేరుతుంది.  కాకి కూతలు విని మనం పయనిస్తున్న దిశ సవ్యంగా ఉందా? లేదా? అనేది నిర్ణయించుకో కూడదు.ఇది తెలిస్తే ఆచరిస్తే జీవితమే హాయి!!!! అంచేత కాకుల్ని తరిమేయకండి. కాకి కూతలు వినండి.రోజూ ఉదయమే కూసే కాకి కొన్ని రోజులు కనపడకపోతే, కాకి కూత వినపడకపోతే కాకి ఆరోగ్యం గురించి విచారించండి.కాకి జిందాబాద్!!!




అధో సూచిక:- ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలి. నేనూ కాకుల్లో ఒకడినే :)

28, మే 2024, మంగళవారం

కడుపుతో ఉన్నమ్మ

 కడుపుతో ఉన్నమ్మ


కడుపుతో ఉన్నమ్మ కనక మానదు.

ఒండుకున్నమ్మ తినక మానదు. 


ఇదొక నానుడి కడుపుతో ఉన్న ఆవిడ సమయానికి ప్రసవిస్తుంది. అలాగే వంట చేసుకోడమెందుకు? తినడానికే! దానికీ సమయం ఉంటుంది. అది ఆకలేసిన సమయం. అప్పుడే తింటుంది, వద్దన్నా మానదు. పల్లెటూరివాళ్ళు ఈ మాటని జరగవలసిన పని జరగవలసిన  సమయం లో జరిగి తీరుతుంది, వద్దంటే మానదని చెప్పడానికి చెబుతారు. ఒక్కొకపుడు సమయం నడుస్తున్నట్టే కనపడదు, ఒక్కొకప్పుడు సమయం పరిగెడుతున్నట్టే ఉంటుంది. మనం చెప్పినట్టూ, మనకి కావలసినట్టూ సమయం నడవదు. ఎన్నికలవుతున్నాయి. పూర్తైన తరవాత లెక్కింపూ,ఆపై ఫలితాల ప్రకటనా ఉంటుంది. మనం కంగారు పడినంతలో సమయం పరుగెడుతుందా? 


కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు.


   కూతురుంటే తల్లికి చేదోడని ఈ నానుడి భావం. కూతురు 

పెద్దదై తల్లికి తోడవుతుంది. కొడుకు పెద్దవాడై తండ్రికి శత్రువవుతాడు. ఇది లోకరీతి. 


చిన్న పామైనా పెద్ద కఱ్ఱతో కొట్టాలి

 

 విషమున్న పాము చిన్నదైనా వదలకూడదని భావం. అంటే సమస్య చిన్నదే కదా అని ఉపేక్ష చేయకూడదు. అగ్ని కణం చిన్నదే అని ఊరుకుంటే కొంపలు కాల్చేస్తుంది, అలాగే శత్రువు బలహీనపడైపోయాడనుకుని వదిలేయకు. ప్రయత్నం పెద్దది చేసైనా దండించాల్సిందే! మరో మాట పిల్లపాముకే విషమెక్కువుంటుంది, ముదిరిన పాముకి విషం తగ్గిపోతుంది, కక్కి,కక్కి ఉంటుందిగా! 

26, మే 2024, ఆదివారం

ఆశ.

 ఆశ.


ఆశ మానవుణ్ణి నడిపిస్తుంది.

పేరాశ మానవుణ్ణి పరుగుపెట్టిస్తుంది. ఫలితం ఉండదు.

దురాశ మానవుణ్ణి పరుగుపెట్టించి బోల్తా పడేలా చేస్తుంది.

నిరాశ మానవులకి దూరంగానే ఉండాలి. ఇది కమ్ముకుందా మరిలేవడు.  పొరబాటుగా నిరాశలో చిక్కుకున్నా, పడిపోయినా అది క్షణికంకావాలి. పడిపోయినందుకు సిగ్గుపడ కూడదు. నిరాశనుంచి బయటపడాలి బంతిలా పైకి లేవాలి.



కందుకమువోలె సుజనుడు 

కిందంబడి మగుడ మింటి కెగసెడును జుమీ

మందుడు మృత్పిండము వలె 

కిందంబడి అణగియుండు కృపణత్వమునన్


543 స్థానాలున్న లోక్ సభలో అన్ని స్థానాలకూ పోటీ చేసి లేదా ( 272 ఆపై స్థానాలకు)  మెజారిటీ రాగల స్థానాలకు పోటీ చేసిన పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం, ఆశ. ఎందుకంటే నెగ్గిన తరవాత పార్టీ కూడా ఎన్నుకోవాలిగా:)


543 స్థానాల్లో మెజారిటీ స్థానాలుకి (272) కూడా పోటీ చేయలేని పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం పేరాశ. ఎందుకంటే,ఆ పార్టీ వారు, ఈ పార్టీవారు నన్ను ఎన్నుకుంటారనుకోడమే పేరాశ.


543 స్థానాల్లో పదిస్థానాలకీ పోటీ చేయలేని పార్టీవాడు ప్రధాని ఐపోతానని ఆశ పడటం చెప్పుకోవడం దురాశ.   

25, మే 2024, శనివారం

అల్లో నేరేడు పళ్ళు

  అల్లో నేరేడు పళ్ళు

 నేరేడు పళ్ళు, జంబూ ఫలం, Jamun Fruit,Black berry 

 kg. 400/- 

నిరుడు kg 3౦౦/-

24, మే 2024, శుక్రవారం

విష్ణుమాయ

 


(సామాన్యుడు వేంకటేశ్వరునికి విన్న వించుకుంటున్న తీరు. అన్నమాచార్యల వారి పెద్ద కుమారుడు పెద తిరుమలయ్య తన కీర్తనలో వెలిబుచ్చుతున్న విధం)  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ


జీవులన్నిటిలోను మానవజన్మ గొప్పది,అది పొందేను..  మానవజన్మ ఎందుకు గొప్పది? జీవులన్నిటిలోనూ మానవునికే అన్నీ అధికం, ఈ జన్మనుంచి మాత్రమే జన్మరాహిత్యం పొందడానికి సావకాశం. మిగతా ఉపాధులలో జన్మరాహిత్యం పొందేందుకు తగిన కర్మలు చేసే సావకాశం లేదు. అటువంటి జన్మ ఎత్తినా ఫలితం కనపడటం లేదు. ఇక నిన్నే నమ్ముకున్నా! ఇది నిజం, అంటే నీవేదప్ప ఇతఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద మన్నింపు భద్రాత్మకా! అని గజేంద్రుడు శరణాగతి చేసినట్టు చెబుతున్నా! ఇక నీ చిత్తం పాలముంచినా నీట ముంచినా నీవే దిక్కని వేడుకోలు.


మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద  సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా


మూడు పూటలా కంచం దగ్గరకి చేరడం మరిచిపోను, రాత్రికి మంచం దగ్గరకి చేరడమూ మరచిపోను (స్త్రీ సుఖమూ మరువను)సరే! ఇంతతో సరిపెడతానా? మిగిలిన ఇంద్రియ సుఖంకోసము పరుగులు పెడతాను.( మంచి సినిమా చూసేస్తాను, దమ్మరో దమ్ సంగీత కచేరి! ముందుంటాను. మంచి అత్తరొచ్చిందిట ఇంకేం కొనేస్తాను, ఈ శరీరానికి రాసేస్తాను. ఇవేవి మరచిపోను.) మాధవా నీమాయ సుమా! మంచిమాట మరచిపోతాను. నిన్ను తెలుసుకునే రహస్యం చెప్పినది మరచిపోతాను. చిత్రం చూడు! గురువునూ మరచిపోతాను,నిన్నే మరచిపోతాను!!! ఏంటయ్యా ఈ మాయ?



విడువను బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయా

పాపమంటాను, పుణ్యమనీ అంటాను కాని ఏదీ వదలిపెట్టను, పాపాలు చేస్తూనే ఉంటాను. నా దుర్గుణాలు వదలను,పేరాశ, దురాశ, అంటూ ఉంటాను కాని వదలిపెట్టను, దేనినీ. ఇదంతా నీ మాయ విష్ణుడా! షట్కర్మలు వదిలేస్తా ( ఏమిటవి? అధ్యయనం,అధ్యాపనం;యజనం,యాజనం; దానం,ప్రతిగ్రహం.(చదవడం,బోధించడం;యజ్ఞం చేయడం,చేయించడం; దానమివ్వడం,పుచ్చుకోవడం) నిన్ను చేరే చదువు వదిలేస్తా, ఆచారమా గాడిదగుడ్డేం కాదూ! వదిలేస్తా!  గుర్తే రాదు, ఇదే కదా విష్ణుమాయ. 


తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధమ్ముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా

అనవసర విషయాలో వేలు పెట్టేస్తా, అనవసర బంధాల్లో తగులుకుంటా!!! మోక్ష మార్గం సుంతైనా తలపుకు రానివ్వను. అంతర్యామివైన నువ్వు నవ్వుతుంటావు, నా ఏలికవై  నీవుండగా  నాకేల ఈ విష్ణుమాయ, వేంకటేశ్వరునిగా నవ్వుతూ దర్శనమీయరాదా.  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ

అన్నమయ్యను స్మరించుకుంటూ...


ధన్యవాదాలు.:-మొన్న ఒక కామెంట్ రాస్తూ ఈ కీర్తన చరణం మొదటి పాదమే రాయగలిగా మిగిలినది గుర్తుకు రాలేదు. >>>> పెట్టి వదిలేసా! మిత్రులు విన్నకోటవారు ఈ కీర్తన పట్టుకుని నాకు పంపించారు. దానినిలా సద్వినియోగం చేసుకున్నాను. విన్నకోటవారికి మరొక సారి ధన్యవాదాలు.

23, మే 2024, గురువారం

వీరంతా ఒకటేనా?

వీరంతా ఒకటేనా? 


 అడ్వొకేటు


లాయరు


ప్లీడరు


వకీలు

వీరంతా ఒకటేనా? ఐతే ఇన్నిపేర్లెందుకున్నాయి?

22, మే 2024, బుధవారం

దిష్టిచుక్క.

 


దిష్టిచుక్క. 


అంతా ఆనందం కోసమే వెతుకుతారు. ఎక్కడుందీ?

మనిషికి ఐదు జ్ఞానేంద్రియలు,ఐదు కర్మేంద్రియాలు, మనసు, ఇదొక గుత్తి. దీనినే మనోమయకోశం అంటారు. సామాన్యులు ఈ గుత్తి దాటిపోలేరు. ఆనందం వెతుకుతూ ఉంటారు. ఎఖ్ఖడా కనపడదు. ఆనందో బ్రహ్మా అంటే ఆనందమే పరమాత్మ, అదే తురీయావస్థ.  మనోమయకోశం లో, మనసు అధికారి, ఇంద్రియాల ద్వారా అనందం పొదాలని చూస్తుంటాడు. కొందరు చూపుద్వార, కొందరు నోటిద్వారా,కొందరు చెవి ద్వారా, కొందరు నాలుక ద్వారా, మరికొందరు స్పర్శ, ఆలింగనం ద్వారా ఇంద్రియ సుఖం పొంది, ఆనందం పొదాలని తాపత్రయ పడతారు. ఇదే ఇదే బ్రహ్మానందమనుకుంటారు.


ఎక్కడుంది ఆనందం అనే పరబ్రహ్మ (అదే దేవుడు)? అందంలోనే ఉంది ఆనందమన్నారు,చిరకాలంగా. అందమైన ఆడపిల్లని (ఆడవారిదే అందం అని అప్రాచ్యులు దాన్ని పరాయత్తం చేసేసేరు. ఇది మగవారి సొత్తు) అందంగా అలంకరించి,  చివరగా బుగ్గన పెట్టేదే దిష్టిచుక్క. పరమాత్మ ఎక్కడా అని వెతికే, హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే! అని చెప్పేడు. చూసే కన్ను కావాలోయ్!! అన్నాడు.


చూస్తే! పరికిస్తే!! పరిశీలిస్తే!!! అందమైన, అలంకరింపబడ్డ, ఆడపిల్ల మొహంలోని దిష్టి చుక్కలో లేడూ పరబ్రహ్మ? 


అన్నమయ కోశం,ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ మనోమయ కోశం మధ్యలోది. ఇది దాటి ఆనందమయ కోశంలో అడుగిడితే! ఆనందమే ఆనందం, అదే పరబ్రహ్మ!!!!!!!  


20, మే 2024, సోమవారం

కొంతమంది నవ్వితే.......

 కొంతమంది నవ్వితే.....


కొంతమంది నవ్వితే అందం, కొంతమంది నవ్వకుంటేనే అందం,కొంతమంది మూతి ముడిస్తే అందం.కొంతమంది ఏడ్చినా అందమే. ముద్దు పళని నాయిక ముద్దు ముద్దుగా ఏడిస్తే పెద్దనగారి నాయిక బావురుమని ఏడిచిందట, అదీ అందమేనట.  కొంతమంది మాటాడితే అందం,కొంతమంది మాటాడకుంటే అందం, కొంతమందితో మాటాడక ఉండడమే అందం. కొంతమంది ఏం చేసినా అందమేట. హసితం మథురం, వదనం మథురం,గమనం మథురం, వచనం మథురం, మథురాధిపతేరఖిలం మథురం అన్నారు ఇంక ప్రత్యేకంగా చెప్పలేను, ఎన్నని చెప్పనని. ఏడ్చే మగాడిని మాటకి ముందు నవ్వేఆడదాన్ని నమ్మొద్దన్నారు పెద్దలు. కొంతమంది నవ్వితే ఏడ్చిట్టుంటుంది.


కొంతమంది మాటాడితే అందం, కొంతమందితో మాటాడితే అందం, కొంతమందితో మాటాడకుంటేనే అందం,  ఇది మరో  సారీ చెప్పిన మాట. కొంతమందిని తలుచుకుంటేనే అందం, కొంతమందిని తలుచుకోకుంటేనే అందం, ఆనందం .

  కొంత మంది మాటాడితే తిట్టినట్టుండే అందం, కొంతమంది మాటాడుతూ తిట్టినా అందమే!అరటాకెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకు మీద పడ్డా, చిరిగేది అరటాకే, అలాగే, అందమొచ్చి మీద పడ్డా, మనమెళ్ళి అందం మీద పడ్డా, కలిగేది ఆనందమన్నాడో కుర్రకవి. అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అన్నారో పూర్వకాలపు సినీకవి.

 ఏంటో  వింత  లోకంకదా!

విష్ణుమాయ!!!



18, మే 2024, శనివారం

ఏం పీకుదామని?

ఏం పీకుదామని?


పేషంట్:- డాక్టర్ గారు నావయసు 60 మరో 20 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?


డాక్టర్:- స్మోకింగ్  చేస్తారా?


పే:- లేదు డాక్టర్.


డా:- డ్రింక్ వగైరా అలవాటేమైనా..?


పే:_ ఛ..ఛ..మా ఇంటా..వంటా..లేదు.


డా:-మరో 20 ఏళ్ళు ఏం పీకుదామని..?

Courtesy: Whats app


 దీని భావమేమి తిరుమలేశా?



13, మే 2024, సోమవారం

వోటేసేను.

 వోటేసేను.



 ఈ వేళ పొద్దుటే బూత్ దగ్గరకెళితే లైన్ లో నిలబడమన్నాడు పోలీసు, కర్చుకిచ్చేసేను, ఎనభై ఏళ్ళు దాటినవాడిని లైన్ లో నిలబడక్కరలేదు, తెలియకపోతే తెలుసుకో అంటూ, లోపలకెళ్ళిపోయా, వోటేసేను. 


మొదటిసారి వోటెప్పుడేసేనని ఆలోచిస్తే 67 లో వేసేను. 62 లోనే ఉద్యోగంలో చేరినా అప్పటికి ఇంకా 21 పూర్తికాలేదు కనక, ఒక చోట ఉండకపోవడం కారణాలు.  ఆరోజుల్లో మాకు వోటెయ్యడానికి గంట సమయం ఇచ్చేవారు, శలవు లేనే లేదు, దానికి ప్రతిఫలమూ లేదు, అందరికి శలవున్నా. ఆ తరవాత ఎన్ని సార్లు వేసేను,గుర్తులేదు. వోటెయ్యడం ఇదే ఆఖరు సారి కావచ్చు.


వోటేసిన తరవాత అబ్బాయి అక్కడ తెలిసినవారి ఇంటి దగ్గర కూచోబెట్టేడు, తను వోటేసొస్తాను, అప్పటి దాకా కూచోమని. ఈ లోగా ఒక నాలాటి ఆవిడే వచ్చింది, వేటేసేరా? అంటూ. వేలు చూపించా, ఎవరికేసేరంది, చెప్పేను, మీరెవరికేసేరన్నా? కమ్మోరమ్మాయికి రెడ్డోరబ్బాయికి ఓటేసా అంది. ఇద్దరూ  రెడ్డోరబ్బాయి లేగా అడిగా! అది సీక్రెట్టూ అని క్రాస్ వోటింగ్ జరుగుతుందని నవ్వేసింది, ఈలోగా మరోకరు మాలాటివాడే వస్తూ వోటేసేరా అని అడిగి, కరువొచ్చేలా ఉందండీ అన్నారు నర్మగర్భంగా. మొదటి కరువుకే చచ్చిపోలేదు, వచ్చే కరువులు మనల్ని ఏం చేస్తాయి లెద్దురూ, వయసైపోయినవాళ్ళం, చచ్చిపోతే గొడవేలేదందావిడ. ఈలోగా అబ్బాయొచ్చేడు, నేనొచ్చేసా!

11, మే 2024, శనివారం

గవళ్ళగంగమ్మగారి....




 గవళ్ళగంగమ్మగారి....


కల్లు మానండోయ్ బాబూ! కళ్ళు తెరవండని నాటిరోజుల్లో మొత్తుకున్నారు. మానినట్టెఖ్ఖడా కనపడలేదు.నేడు అది కాస్తా పెరిగి పెద్దదిపోయిందంటే అనుమానం లేదు. ఒకప్పుడు పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కంపెనీ సరుకే తాగుతారానుకునీ వారు.కాలం మారింది. భూమి గుండ్రంగా ఉంది. ఆడా మగా తేడా లేక నేడు కార్లు పల్లెలకి పరిగెడుతున్నాయి,ఉదయమే. తాడి చెట్టునుంచి దించిన కల్లుకుండ చెట్టు మొదటిలోనే కాళీ ఐపోతోంది. చదువుకున్న ఆడపిల్లలు వయసుతో సంబంధం  లేక కల్లు తాగుతున్నారు. కల్లు తాగుతున్న వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


తాటికల్లూ సరిపోయేలా లేదు కొబ్బరికల్లు కూడా గీయచ్చు, ఇక ముందు.


గవళ్ళగంగమ్మగారి హస్తోదకం జిందాబాద్!!! 

10, మే 2024, శుక్రవారం

మూడు పువ్వులు....

 


మూడు పువ్వులు....


వాడికేంట్రా! వాడిపని మూడు పువ్వులూ ఆరు కాయలా ఉందీ, అంటారు, దీనర్ధం, ఏలేస్తే కోలు దిగేలా ఉందంటారు, పల్లెటూరివాళ్ళు. దీనికి ఆశ్లీలార్ధమూ చెప్పేవారున్నారు.


అబ్బాయిగారి పని మూడు పువ్వులూ ఆరుకాయల్లాగే ఉందిట. మొదట అమేటీ లో నెగ్గేరు అది సొంత సామ్రాజ్యం.   పువ్వు పిందయింది, అది ఉడుకు పిందయి రాలిపోయింది..

 అది దూరాక్రమణ పాలయిందనుకుని చింతించి,వగచి మరో పచ్చటి చోటుకి మారేరు. ఆ పూవు పిందయింది, ఇదీ ఉడుకుపిందయి రాలిపోతుందా? ఇప్పుడది ఎర్ర వారి కళ్ళ బడి దురాక్రమణ, మిత్రుల పేర వెన్నుపోటు తగిలేలా ఉంది, ఈపువ్వు పిందయ్యేనా? అనుమానమే! ఇప్పుడు మూడో పువ్వు చూసుకోక తప్పటం లేదు, అది బరేలీ. అమ్మ త్యాగమయి, తన స్వంత సీటు కొడుక్కోసం వదిలేసి రాజ్య సభకెళ్ళిపోయింది. అమ్మ ఒడి కదా భయమేల వెంటనే నామినేషన్ వేయచ్చుగా అడిగాడో సందేహి. నిజమేగాని ఇక్కడా మరే దురాక్రమణ దారు తయారవుతాడో చెప్పలేం కదా! అందుకే సస్పన్స్, దేశం ముక్త కంఠంతో పోటీ చెయ్యమనలేదూ! ఈ పూవు పిందయ్యేనా? పురిటిలోనే సంధి కొట్టేనా? కాలమే చెప్పాలి.


మూడు పువ్వులు ఆరు కాయలవుతాయా?  

9, మే 2024, గురువారం

ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక

 ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక


పెళ్ళి ఐదురోజులు నుంచి సమయం తగ్గి మూడు రోజులు,ఒకరోజుకు తగ్గిన కాలం. ఒక పెళ్ళి జరుగుతోంది. బ్రహ్మగారు అగ్నిహోత్రం దగ్గర దంపతుల్ని కూచో బెట్టి హోమం చేయిస్తున్నారు. పొగ కమ్ముతోంది.పెళ్ళి కూతురుకి పొగ బాధగా ఉంది. కళ్ళ నీళ్ళొస్తున్నాయి. కొంగునగాని గుడ్డతోగాని తుడుచుకోలేదు,కారణం పెళ్ళి కూతురు ఏడుస్తోంది,పెళ్ళి ఇష్టం లేదేమో అని గుసగుసలు రావచ్చు. అందుకు కళ్ళు నులుపుకోడం చేస్తూ వచ్చింది. కళ్ళకి కొంచం దండిగానే కాటుక పెట్టడం తో అదికాస్తా మొహాన అలుముకుపోయింది. అందమైన పెళ్ళికూతురు మొహం భయంకరంగా మారింది.అందం కోసం కాటుక పెట్టుకుంటే అదికాస్తా భయంకరంగా మారినట్టు. అదుగో అలాపుట్టిందీ నానుడి. 


ఇప్పుడిదెందుకూ! శంక. ఎండ మలమల మాడబెడుతోంది ఇరవైరోజుల్నించి. చల్లబడితే బాగుణ్ణు అన్నది కోరిక. మొన్న మంగళవారం మధ్యాహ్నం పన్నెండు ఎండ దంచుతోంది, అప్పుడు గాలేసింది, కరంటుపోయింది,మబ్బేసింది,చినుకులు,పెరిగాయి. వర్షం నిలిచి మూడు గంటలు కురిసింది. కరంటు రాలేదు. చల్లబడిందనుకున్నాం కాదు పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్టనిపించింది. ఇప్పటిదాకా లోపల చల్లగా బయట వేడిగా ఉందేది ఇప్పుడు బయటలోపలా కూడా వేడి,ఉక్కపోత దంచుతున్నాయి. ఇదేమని ఆలోచిస్తే చుట్టూ ఉన్న కాంక్రీట్ జంగిల్ నుంచి విడుదలైన వేడి, ఇంటి గోడలు వేడెక్కి ఉన్నవి నీరు పడటంతో వేడి లోపలికి వదలితే పొయ్యిలో ఉన్నట్టే, కుమ్ములో పెట్టన చిలకడదుంపయింది మా పని. అప్పటి నుంచీ బేటరీ మీదనే ఫేన్లు తిరుగుతూనే ఉన్నాయి. కరంటెప్పుడొస్తుందంటే ఆరు గంటల కిస్తామన్నారు. వాళ్ళేం అవస్థపడుతున్నరో అనుకుని మరి అడగ లేదు. (మొన్ననోరోజు సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కిపోతే, కాలిపోకుండేందుకుగాను, కరంటు గంట సేపు ఆపి, ఫైర్ ఇంజన్లతో వాటిపై వర్షం కురిపించి, మళ్ళీ కరంటిచ్చారు) మెతుకులు కతికా, బెడ్ మీద పడుకోలేను,వేడి. కింద పడుకుంటే అలవాటు లేదు. ఇలా అవస్థపడి మడతమంచమేసుకుని పడుకుని,కూచుని బాధ పడితే ఒంటిగంటకి కరంటొచ్చిపోయింది. అసలు ఊపిరొచ్చింది గనక బతికే సావకాశం ఉందని సంతసించి ఎదురుచూస్తే రెండు గంటలకి కరంటు స్థిరంగా నిలబడితే ఎ.సి వేసుకు పడుకుంటే నాలుగుకే అలవాటుగా మెలుకువ వచ్చేసింది.

వర్షం పడితే చల్లబడుతుందనుకుంటే ఒకరోజుపెళ్ళికి మొహమంతా కాటుక సామెతయింది. 


8, మే 2024, బుధవారం

ఎవరెక్కువ తడుస్తారు?

 

ఎవరెక్కువ తడుస్తారు?



 నిలిచి కురుస్తున్న వర్షంలో ఎవరెక్కువ తడుస్తారు?

నడుస్తున్న 

లావుపాటివారా? సన్నపాటివారా?

6, మే 2024, సోమవారం

శుభాకాంక్షలు.

 శుభాకాంక్షలు.


దేశ విదేశాల్లో ఉన్న మిత్రులూ,శత్రువులకూ,

ఎల్లరకూ


ఏప్రిల్ రెండో వారంలోనే మొదలైన

మలమాడ్చే ఎండలు (41,42,43,44,45,46,47 డిగ్రీల వేడి)

వడగాలి, ఉక్కపోత 

శుభాకాంక్షలు.


2, మే 2024, గురువారం

ఎండ మలమల మాడుస్తోంది.

 ఎండ మలమల మాడుస్తోంది.


వేడి పాపం పెరిగినట్టు రేసు గుఱ్ఱంలా పరిగెడుతోంది 40 నుంచి 45. ఎక్కడా బెత్తెడు నేల కనపట్టంలేదు,మొక్క లేదు. అంతా కాంక్రీటే! ఎన్ని సార్లనుకుని ఉపయోగం లేదు. ఇది ఒకరోజు పాపం కాదు తరాల పాపం. అనుభవించక తప్పదు. 


చేసుకున్న కర్మమోయ్ శంభు లింగమా! 

అనుభవింపక తప్పదోయ్ ఆత్మ లింగమా!


ఎండ వేడి నుంచి రక్షించుకోడమెలా? పాపం! విపత్తు నివారణ సంస్థ వారు రేపటి గురించి ఈ రోజో ఇంట్లో ముసలాళ్ళలా కురుపు సలిపినట్టు ఒక మెసేజి ఇస్తూనే ఉన్నారు. లెక్క చేసేవారే కనపట్టం లేనట్టుంది.


వేసవి వేడి మూలంగా వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడుకోవాలంటే కొన్ని పనులు తప్పవు. బయట తిరక్క తప్పని వారు చెవులకి గుడ్డ కట్టుకోవాలి,అందుకే మనవారు తలపాగా చుట్టేవారు. జేబులో ఒక బళ్ళారి ఉల్లిపాయ ఉంచుకుంటే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ఎండలో దాహంగా ఉన్నపుడు,వడ తగిలిందేమో అనుమానం కలిగినపుడు, ఈ ఉల్లిపాయను నమిలిమింగండి, ప్రాణం కాపాడుతుంది, దాహం కడుతుంది. ఇది చాలా పురాతనంగా అనాగరికంగా కనపడచ్చు, కాని ఇది నిజం.


ఇక నీడపట్టునున్నవారు, ఎ.సి ఉన్నవారు, ఎ.సి లో ఉండేవారు, ఎ.సిని 27 లో ఉంచుకుని ఉంటే బహు బాగుంటుంది. ఇక తినే ఆహారంలో నీరుల్లి ఎక్కువ వాడితే మంచిది. నీళ్ళు ఎక్కువపోసిన మజ్జిగ నిమ్మకాయతో ఆరారా తాగడం  మంచిది. కొబ్బరి నీళ్ళు నిలవవికాక దొరికితే తాగడం మంచిది. తాటిముంజలు దొరికితే మంచిదే. వేసవి అంటే పళ్ళే. అన్నిటిని తినచ్చు,మితంగా. తాగేవాటిలో సబ్జా గింజలు నానబెట్టినవి,నీళ్ళతో గాని,మజ్జిగతో గాని, ఉప్పు,పంచదారలతో లేదా బెల్లం మహ మంచిది. ఈ అనుపానాలు వాడలేనివారు సబ్జా గింజల్ని నానబెట్టి మజ్జిగతో తీసుకోవచ్చు. ఆరారగ తాగితే బహుమంచిది. ఎ.సి లో ఉంటే నీళ్ళెక్కువ తాగాలి, అప్పుడు ఈ సబ్జా గింజల మజ్జిగ బహుమంచిది. ఎట్టి పరిస్తితులలోనూ ఫ్రిజ్ ఉన్న నీళ్ళు తాగద్దు, గది వేడి దగ్గరున్నవి,రాగి బిందెగాని ఇత్తడి బిందెలో ఉన్న నీళ్ళు తాగండి. ఆరోగ్యానికి మంచిది. సబ్జా గింజలంటే మరేమో కాదు తులసి విత్తనాలే! వీటి ఉపయోగాలనేకం, ఆరోగ్యానికి గొప్ప అవసరం.   ఛీ తులసి విత్తనాలా నానబెట్టుకుని తాగుతారా? అసలొప్పం కోకాకోలా తాగుతాం ,పిజ్జ తింటాం ఈ పిచ్చి తిళ్ళేం తింటామంటారా! అస్తు. 

చెప్పడమే నా ధర్మం 

వినకపోతె నీకర్మం


29, ఏప్రిల్ 2024, సోమవారం

రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే

 రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి.

రాజుఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా ఉంటాడు. చుట్టూ మంది మార్బలం, కైవారాలు , వందిమాగధులు ఇలా ఉంటాడు. ఊరేగితే ఏనుగు మీద ఎక్కి తిరుగుతాడు. అటువంటివాడిని చూసిన ఇల్లాలు, మొగుణ్ణి చూస్తే లోకువగానూ,చీదరించుకునేలా కనపడడూ? ఎందుకంటే రాజులా ఎర్రగా బుర్రగా ఉండడు,కూడా ఎవరూ ఉండరు, చెప్పినమాట వినేవాడే ఉండడు. 

ఈ దేశంలో పుట్టిపెరిగి ఇక్కడ పల్లెలో,చెరువులో పిత్తపరిగిలు పట్టుకునే  వాడికి,  తల్లితండ్రులు కడుపుకట్టుకు చదివిస్తే, దశ తిరిగి అమెరికా వెళితే,  ఇక్కడ దేశం దరిద్రంతో ఓడుతున్నట్టు కనపడదూ? ఇక్కడ జనాలంతా అనాగరికుల్లా కనపడరూ?   తల్లితండ్రులు బిచ్చగాళ్ళలా అనిపించరూ?

పేదవానికోపము పెదవికిచోటు.

పేదవాడికి కోపమొస్తుంది,ఎందుకు? తనకి అన్యాయం జరిగినపుడు. ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. చేయగలది తననుతాను తిట్టుకోవడం. అదే పేదవానికోపము పెదవికి చోటు,చేటు కాదు.

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

అడిగేవాడు తాను గొప్పవాణ్ణనుకుంటాడు.  అడుగుతూనే  ఉంటాడు. వాడికి సమాధానం చెప్పినకొద్దీ లోకువ కదా! అలా అడుగుతూనే ఉంటాడు. ఇదే లోక రీతి. వినేవాడికి చెప్పేవాడులోకువ ఇదీ మరొక లోకోక్తి.

25, ఏప్రిల్ 2024, గురువారం

ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ఉచ్చై రధ్యయనం, చిరంతన కథా:, స్త్రీభి: సమాలాపనమ్,

తాసా మర్భక లాలనం, పతినుతి:, తత్పాక మిథ్యాస్తవమ్
మిథ్యా దాన, మభూత పూర్వ చరితం, సాముద్రికం, జ్యోతిషం
వైద్యం, గారుడ మంత్రజాల మధికం భిక్షాటనే ద్వాదశ

గట్టిగా చదవటం,
ఎక్కడెక్కడివో గాథలు చెప్పటం,
స్త్రీలతో సక్కగా మాట్లాడటం,
వారి బిడ్డలను ముద్దుచేయడం,
పై అధికారిని పొగడడం,
వండిన వంటను మెచ్చుకోవడం,
దానం చేసినట్లు కనిపించడం,
లేని కథలు అల్లి చెప్పడం,
హస్తసాముద్రికం,
జ్యోతిషం,
వైద్యం,
పాము తేలు మంత్రం
- అనేవి ఇతరులను ఆకర్షించు విద్యలు.
Courtesy:http://sahitinandanam.blogspot.in/


నేటికీ రాజకీయులు ఉపయోగిస్తున్న ట్రిక్కులు ఇవేనేమో సుమ్మీ/సూవె/సుమా! 

23, ఏప్రిల్ 2024, మంగళవారం

ఆడలేక....

 ఆడలేక....


మా వాళ్ళు వాట్సాప్ మీటింగేసేరు,పొద్దుటే!


బి.జె.పి కి నాలుగొందల సీట్లొస్తాయంటావా? అన్నాడు సుబ్బరాజు. రాకెక్కడికిపోతాయిలే సూరత్ లో లాగా చేస్తే అన్నాడు పొడిగింపుగా.


సుబ్బరాజూ! నాలుగొందలొస్తాయో లేదో చెప్పలేనుగాని సూరత్ లో వేసినట్టు నామినేషన్లు వేసుకుంటే ఐదొందలూ వస్తాయి.నూరేళ్ళు నిండిన పార్టీ అని జెప్పుకుంటారుగా! నామినేషన్లు కూడా సరిగా వేసుకోలేరా? దానికీ ఆళ్ళనే తిడ్తావా? జనాలు నవ్వుతారయ్యా! మనపల్లెలలో ముతక సామెత జెపుతారు, నీకూ తెలిసిందే!! ఇక్కడ జెపితే బాగోదనుకో, ఇనుకో! ఆడలేక మద్దెల ఓడన్నదట ఒక సాని. అలాగుందో! అన్నాడు సత్తిబాబు.


మనదగ్గరేటి చెప్పూ అన్నాడు సుబ్బరాజు. వద్దో!నా నోరు తిన్నగుండదు,నీకేమో బాధ కలుగుద్ది. నే పోతన్నా! ప్రచారానికిపోవాల! అని వెళ్ళిపోయాడు మా సత్తిబాబు. 

18, ఏప్రిల్ 2024, గురువారం

ఎండలు మండుతున్నాయి

 ఎండలు మండుతున్నాయి


వాట్సాప్ లో మీటింగెట్టేరు మావాళ్ళు.


ఎండలు మండుతున్నాయన్నాడు మా సుబ్బరాజు.


ఎండలు మండవో! మంటబెడతాయి, అన్నాడు మా సత్తిబాబు.


కోసట్టుకున్నావుగాని.ఎండలకి నీళ్ళు లేక బెంగళూరు సగం ఖాళీ అట, ఎడారి దేశంలో వరదలట.వరుణజపం చేస్తే వర్షాలు కురుస్తాయటగా? ఏంటయ్యా ఇదీ!


నీళ్ళు లేక బంగళూరు ఖాళీ అవుతోంది,ఎడారి దేశంలో వరదలూ నిజమే! నువ్వంటే నువ్వనుకుని నీళ్ళు లేకుండా చేసారు. ఎడారిదేశం వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి వర్షం కురిపించుకుంటే అదెక్కువై వరదలొచ్చేయి. మనకి టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకునేది లేదు. వరుణ జపాలమీద నమ్మకమూ లేదు. యతోభ్రష్ఠః తతో భ్రష్ఠః మనమింతేలే అనేసేడు సత్తిబాబు.


చైనాలో సింగపూర్ లో ఎండలు లేవంటగా అడిగాడు సుబ్బరాజు.


అవున్లే! భక్తులకట్టనే ఉంటదబ్బయా!


మనకీ ఎండలెక్కువగానే ఉన్నాయి 40,42,43,44,45 అంటున్నారు అన్నాడు సుబ్బరాజు.


కరువుబాబుగారు కుర్చీ ఎక్కుతాడు దానికి సూచనే ఈ ఎండలని చెప్పుకుంటన్నారులే వాళ్ళోళ్ళే. ఎల్తా! అన్నాడు సత్తిబాబు. 


ఓ! నిమిషం కూచోవో అడిగాడు సుబ్బరాజు.


నీది కడుపు నిండినబేరం. ఎండనబడి ఎవడో ఒకడి జండా భుజానవేసుకుపోకపోతే నాకు డొక్కాడదు. వస్తా అనెళ్ళేడు మా సత్తిబాబు. 


9, ఏప్రిల్ 2024, మంగళవారం

ఉగాది శుభకామనలు

 క్రోధి నామ సంవత్సర ఉగాది శుభకామనలు

చిగురేసె మొగ్గేసే సొగసంతా పూతపూసె ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాపా ఎన్నాళ్ళు దాస్తావేమి అన్నాడట సినీకవి . ఈ సంవత్సరం పూతలేదు కాపు లేదు,చిగురొచ్చేసింది చెట్టునిండా, 
 కాపు మళ్ళీ సంవత్సరానికి వాయిదా వేస్తూ!!!


ఇంత చిగురులోనూ రెండు కాయలు కనపడ్డాయి,చిత్రమే బహుచిత్రమే అంటూ!!!


చైత్ర వైశాఖమాసమౌలు-వసంత ఋతువు-- చెట్లు చిగిర్చి పూలు పూయును,కాయలు కాయును.


జ్యేష్ట ఆషాఢ మాసములు- గ్రీష్మ ఋతువు--ఎండలు మెండుగా కాయును.


శ్రావణ భాద్రపద మాసములు- వర్ష ఋతువు-వానలు ఎక్కువగా కురియును,నదులు పొంగును.


ఆశ్వయుజ కార్తీక మాసములు- శరదృతువు-- వెన్నెల బాగుగా కాయును.


మార్గశిర పుష్య మాసములు-- హిమవంత ఋతువు-- మంచుకురియును. చలి ఎక్కువగా ఉండును.


మాఘ ఫాల్గుణ మాసములు శిశిర ఋతువు-- చెట్లు ఆకు రాల్చును.


ఇవన్నీ పాతకాలం మాటలు. అంతా మార్పే! ఇప్పుడు వసంత ఋతువు రాకుండానే  గ్రీష్మ ఋతువు కనపడుతోంది, అందునా రోహిణీ కార్తె ఎండలు కాస్తున్నాయి. వేడి శివరాత్రికే 34 నుంచి రేసు గుఱ్ఱంలా ఈ రోజుకు, నలభై ఐదు రోజుల్లో 43  కి చేరిపోయింది, వేడి. 

ఇక ముందెలా ఉంటుందో చెప్పలేం. ఉన్నవి మూడు ఋతువుల్లాగా ఉంది.వసంత ఋతువు గ్రీష్మ ఋతువుతో కలిసిపోయి గ్రీష్మ ఋతువే కనపడుతోంది. అలాగే శిశిరం హేమంతంలో కలిసిపోయింది. 


 కారణాలు మీరంటే మీరంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ది చెందుతున్న దేశాలని తప్పుపడుతున్నాయి. మొన్ననో సారి గుయానా అద్యక్షునితో బి.బి.సి విలేకరి ఇలా తప్పుపట్టినట్టు మాటాడితే నోరెత్తనివ్వకుండా జవాబిచ్చారు. అలా జవాబిచ్చినపుడే ఆ దేశాలకి తెలుస్తుంది, తమ తప్పేంటో! 


4, ఏప్రిల్ 2024, గురువారం

రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం


ఓం యం!! ఈశానసర్వవిద్యానా మీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్తు సదా శివోమ్.


వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశతత్త్వాత్మకం

తస్మాదుత్తమ తత్త్వమక్షరమిదం ధ్యేయం సదాయోగిభిః

ఓం కారాది సమస్త మన్త్రజనకం సూక్ష్మాతిసూక్షం పరం

శాంతం పంచమ మీశ్వరస్యవదనం ఖంవ్యాపి తేజోమయమ్.


ఓం నమోభగవతే రుద్రాయ. యం ఓం ఊర్ధ్వముఖాయనమః

-------------------------------------------------------

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అను రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు,  శాంతమునును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

-------------------------------------------------------------------------

పూర్వే పశుపతిఃపాతు దక్షిణేపాతు శంకరః

పశ్చిమేపాతు విశ్వేశో నీలంకంఠస్తదోత్తరే.


ఐశాన్యం పాతుమేశర్వో హాగ్నేయాం పార్వతీ పతిః

నైరృత్యాం పాతుమే రుద్రో వాయువ్యాం నీలలోహితః


ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః

ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతుశంకరః

---------------------------------------------------------------------

ఊర్ధ్వముఖ దర్శనం ముక్తిదాయకం.

3, ఏప్రిల్ 2024, బుధవారం

రుద్ర పంచముఖధ్యానం-ఉత్తర ముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఉత్తర ముఖం 


ఓం వాం!!  వామదేవాయ నమో జ్యేష్ఠాయనమశ్రేష్ఠాయ నమోరుద్రాయ నమః   కాలాయనమః   కలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనమో బలప్రమథనాథాయనమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయనమః


గౌరంకుంకుమపంకిలం సుతిలకం వ్యాపాండు గండస్థలం

భ్రూవిక్షేప కటాక్షవీక్షణ లసత్సంక కర్ణోత్పలమ్

స్నిగ్ధబింబఫలాధరం ప్రహసితం నీలాలకాలంకృతం

వందేపూర్ణశశాజ్ఞ్క మణ్డలనిభం వక్త్రంహరస్యోత్తరమ్


ఓ నమో భగవతే రుద్రాయ! వాం ఓం ఉత్తరముఖాయ నమః

-------------------------------------------------------------------------------------------------

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో   నిండినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనముకల చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవి పై పెదవి స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని   ముంగురులచే  అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)


------------------------------------------------------------------------------

ఈ ముఖాన్ని వామదేవమని అంటారు, వాసుదేవమనీ పెద్దలమాట. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే!

ఉత్తర ముఖ శివ దర్శనం వలన ఆరోగ్య ఐశ్వర్యాలు సంరక్షింపబడతాయి,సక్రమ వృద్ధి చెందుతాయి,అనుభవింపబడతాయి.

2, ఏప్రిల్ 2024, మంగళవారం

రుద్ర పంచముఖధ్యానం-పశ్చిమ ముఖం

 రుద్ర పంచముఖధ్యానం-పశ్చిమ ముఖం


ఓం శిం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః. భవే భవేనాతిభవే భవస్త్వమాం భవోద్భవాయ నమః


ప్రాలేయాచల మిందుకుంద ధవళం గోక్షీర ఫేనప్రభం

భస్మాభ్యక్త మనంగ దేహదహన జాలావళీ లోచనమ్

బ్రహ్మేన్ద్రాది మరుద్గణై స్స్తుతి పదైరభ్యర్చితం యోగిభిః

వందేహం సకలం కళంక రహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్.


ఓం నమో భగవతే రుద్రాయ. శిం ఓం పశ్చిమ ముఖాయ నమః

--------------------------------


హిమవత్పర్వతం,చంద్రుడు,మొల్లపువ్వు వీటివలె తెల్లనిది పాలనురుగువలె తెల్లని కాంతికలది విభూతిపూయబడినదీ,మన్మధుని శరీరాన్ని దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను కలది స్తోత్రము చేయుచున్న బ్రాహ్మ,ఇంద్రాది దేవతలు,మరుత్తులచేత ,యోగులచేత స్తుతింపబడుచున్నదైన,నిర్మలమైన నిండువదనముతో నున్నదైన శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 

--------------------------------------------

పశ్చిమంగా ముఖమున్న శివుని సద్యోజాతాయ నమః అని నమస్కరించాలి. సద్యొజాత శివుడు కోరికల్ని సత్వరం నెరవేరుస్తూ ఉంటాడు. ఇది అనుభవం కూడా! ఇటువంటి శివాలయం దొరకడం అదృష్టమే! ఈ పంచముఖ శ్లోకాలు చదవడమే కష్టంగా ఉంది పలకడం మరెంత కష్టం అనిపిస్తుంది. కాని చాలా తేలిక. వర్ణక్రమం తెలిసుండాలి. వర్ణక్రమమేమని అడ్గద్దు, దాన్నే ఇంగ్లీషులో స్పెల్లింగ్ అంటారు. ఒక్క సారి విని స్పెల్లింగ్ చదవగలిగితే! ఆనందమే,ఆనందం!! అర్ధంకూడా బాగా తెలుస్తుంది.