Monday 27 July 2020

ఈ పాపం ఎవరిది రాజా

ఈ పాపం ఎవరిది రాజా

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టెక్కి భేతాళుణ్ణి భుజాన వేసుకు చెట్టు దిగి నడక ప్రారంభించాడు. రాజా నీకు శ్రమ తెలియకుందికిగాను కత చెబుతా సమస్యకి పరిష్కారం తెలిసి చెప్పకపోతే నీ బుర్ర వెయ్యి ముక్కలవుతుంది. సమస్యకి నిజమైన పరిష్కారం చెబితే నేను చెట్టెక్కుతాను.నీవు చెప్పిన పరిష్కారం తప్పైతే నీతో వస్తానన్నాడు. చెప్పడం ప్రాంభించాడిలా.

అనగా అనగా కరోనా రోజులు. అదో పల్లెటూరు. ఒకామెకి ఆయాసం రోగం ఉంది. గత పదిరోజులుగా వర్షం ఎడతెరపిలేక కురుస్తోంది. రాత్రికి రోగం ఎక్కువైతే, ఉదయమే వర్షంలో ఆటో లో పక్క పట్నానికి వైద్యానికి తీసుకు బయలుదేరారు.కరోనా కు ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా వైద్యం చేస్తాయంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళేరు, ఏ వైద్యమైనా అక్కడే చేయించచ్చని.

 హాస్పిటల్ వారు చూసి కరోనా టెస్ట్ చేయించుకురమ్మని ఒక లేబ్ పేరిచ్చారు. అక్కడకి పేషంటుని తీసుకుపోతే టెస్ట్ చేసి పాతిక వందలు పుచ్చుకుని, కరోనా ఉంది, నాలుగో స్టేజిలో ఉంది అని చెప్పేరు.హాస్పిటల్ కి టెస్ట్ తో తిరిగొచ్చేరు. పేషంటును చూసిన వైద్యులు వీరి చికిత్సకు తగిన పరికరాలు మా దగ్గర లేవు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపొమ్మన్నారు. వర్షం ఆగదు. 

అలాగే గర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే, వారు వివరాలడిగి, మీరు ఇక్కడికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి. అక్కడ వైద్యం చేస్తారని చెప్పి పంపేరు.

 ఆ హాస్పిటల్ కి తీసుకెళితే కరోన టెస్ట్ చేయించండి. ఇక్కడికి రెండు కీలో మీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ లేబ్ లో చేస్తారన్నారు. కరోన టెస్ట్ ఫలాన చోట చేయించామని కాయితం చూపించారు. ఇది కుదరదు, మళ్ళీ చేయించండన్నారు. పేషంటుని అలాగే లేబ్ కి తీసుకెళితే టెస్ట్ చేసి రేపుగాని రిసల్ట్ ఇవ్వలేమన్నారు. 

ఏం చెయ్యాలో తోచనివారు, పేషంటును తీసుకుని ఇంటికి బయలుదేరి ముఫై కిలో మీటర్లు దూరం పోయాకా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పేషంటుకి కరోన ఉంది, తీసుకురండి వెనక్కి, అని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మొదటి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళితే, ఇక్కడకాదు, ఇక్కడి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళమన్నారు. 

అలాగే తీసుకెళ్ళేరు. పేషంట్ తడిపొడి బట్టలతో ఉండగా స్ట్రెచర్ మీదకి చేర్చారు. అంతే లోపలికి తీసుకుపోవలసిన అవసరం కలగలేదు.మార్చురీకి శవాన్ని తీసుకుపోయారు. ఇప్పుడు బంధువులు శవం కోసం పడిగాపులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది మొదలైన తిరుగుడు రాత్రి తొమ్మిదికి పేషంట్ ఊపిరి అనంతవాయువుల్లో కలవడంతో పూర్తయ్యింది . ఈ పేషంట్ ప్రాణం పోవడానికి ఎవరు కారణం చెప్పు రాజా! 


13 comments:



  1. కరోన


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ పేషంట్ ప్రాణం పోవడానికి కారణం వ్యవస్థాగత లోపాలు. ఇలాంతి లోపభూయిష్ఠమైన వ్యవస్థను డబ్బులకోసం ప్రతిభావంతంగా నడిపిస్తున్న రాజకీయరాబందుల్ని తెలిసితెలిసీ ప్రతిసారీ బుధ్ధిపూర్వకంగానే ఎన్నుకొంటున్న మన ప్రజానీకమే అంతకంటే పెద్దకారణం.

      Delete
    2. జిలేబి,శ్యామలరావు గారు

      భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ
      బహు బాగున్నదయా నీ మాయ
      ఒకరికి ఖేదం ఒకరికి మోదం
      సకలము తెలిసిన నీకు వినోదం
      నీవారెవరో పైవారెవరో ఆ విధికైనను తెలియదయా

      Delete
  2. ఈ దుర్ఘటన ఇటీవలే పది పదిహేను రోజుల క్రితం గుంటూరులో జరిగింది. శవాల మీద పేలాలు ఏరుకునే స్ధితికి దిగజారింది వైద్యరంగం. వారి నుండి నీతి, నిజాయితీ, వారు ప్రమాణం చేసిన Hippocratic Oath ను ఆచరించడం ... ఇవన్నీ ఈ కాలంలో ఆశించడం ప్రజల అమాయకత్వం మాత్రమే.

    ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినది ఒకటి హాస్పిటళ్ళను చూస్తే గుర్తుకొస్తుంది. హాస్పిటల్ బాధలు పడలేక ఒక ముసలాయన (రోగి) “ఇంత కన్నా ఇంటి దగ్గర సహజమైన చావు చస్తాను” అంటూ లేచి ఇంటికెళ్ళి పోయాడట. ఇది ఈ కాలానికి మరింతగా అన్వయిస్తుందేమో? . అఫ్-కోర్స్ “కరోన” వంటి మహమ్మారి రోజుల్లోనూ, గుండె నెప్పి లాంటి ఎమర్జెన్సీలకూ హాస్పిటల్ కు వెళ్ళక తప్పదేమో లెండి?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు
      ఇది ఇంటింటి కథ, ఊరూరి కథ సార్.డిల్లీ లో అసిస్టెంట్ సెక్రెటరీలు భార్యా భర్తలు, ఇద్దరున్నూ. అతనికి కరోన వచ్చింది. ఆమె పడ్డ యాతన మరో మాధ్యమంలో వర్ణించినది చదివి,మీరు చెప్పినట్టు ఇంటి దగ్గరే ఛస్తే మంచిది అనిపించింది. మరి ఇటువంటివి నాలుగు కేస్ లో నా దృష్టి కి వచ్చాయి.బాధితులు సరిగా చెప్పలేకపోయారనుకున్నా, వారి బాధ ఉరవడిలో. నిన్ననే ఒకటి ఇటువంటిది వచ్చింది. ఇక నా మనసు బాధ తట్టుకోలేకపోయింది. ఎవరిని నిందించలేని సంగతి.
      ఇంతకి రాజావారేం చెబుతారో సమాధానం:)

      Delete
  3. ఈపాపంఎవరిదిరా
    జా?పైగానన్నడిగెనుసారు,చెప్పై
    నా?పుట్టినవారందరు
    ఆపైగిట్టుదురు,పాపమాపైవాడ్దే .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అంతే అంతే.
      వడ్లగింజంత ఆయుస్సుంటే కొండంత ఆపద కాపాడుతుంది రాజా :)

      Delete
  4. పాముకుట్టి బయటపడీ బ్రతికిన వాడు
    చీమకుట్టి చచ్చుటేమి యున్న
    ఆయు వొక్క టున్నదా యన్నదే ప్రశ్న
    విశ్వదాభిరామ వినురవేమ

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు.
      ఆ ఆవగింజంత ఆయుస్సు మన చేతిలో లేదండి.ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా! ఎన్ని ఉన్నా ఏం ఉన్నా ఉపయోగపడనివే!మంచి పద్యం చెప్పేరు.

      Delete
  5. గురువుగారూ 🙏లు.
    విక్రమార్కుడికి ఇప్పటి రాజకీయం అర్ధం కాదు, కానీ అర్ధం ఐతే "చప్పట్లు, ప్లేట్లు, పారాసిటమాళ్ళూ, బ్లీచింగ్ పౌడర్లూ ... సరిగా పనిచెయ్యకపోవడమే," అనేసేవాడు, భేతాళుడు చెట్టెక్కాలో లేదో తెలీని కన్ఫ్యూజన్లో పడేవాడు.

    ReplyDelete
    Replies
    1. YVR's అం'తరంగంసార్,
      చాలా కాలం తరవాత. కుశలమే కదా! నిజమే సుమా!! ఆ ఆలోచనే రాకేదండీ. బాగా చెప్పేరు. :)

      Delete
  6. సమకాలీన స్థితి గతి
    సమ కాలిన స్థితి గతి

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసిన నీతి కథ చెబుతాను:
      ఒకనొక ఊరిలో ఓ బామ్మ మనవడు ఉండేవారుట
      ఒనానొక రోజున హఠాన్మరణం పొందిన బామ్మను గాఁచి ఆ యువకుడు ఈ తప్పంతా ఆ దేవుడిదే.. మా బామ్మ పరమపదించింది ఆ దేవుడి వల్లనే అన్నాడట.. ఐతే భగవంతుడామెకి మరల ప్రాణం పోయటం జరిగిందిటా.. నెలరోజులు దాటినాక ఓ పెద్ద తూఫాను మొదలయ్యి ఆమే నివాసముంటున్న ఇల్లు కూలటంతో అందులోనే కుప్పకూలిపోయిందిటా.. అపుడా మనవడు.. అయ్యో.. ఇల్లు కూలీపోయి నా బామ్మ చనిపోయింది దేవుడా అన్నాడట..
      తప్పు ఎవరిదైనను కాలానూగుణంగా జరిగే పర్యవసానాలనే అందుకు బాధ్యులను చేస్తుంది సమాజం..

      Delete