15, నవంబర్ 2022, మంగళవారం

జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు

 అత్తచుట్టం గూదపగ


అత్తచుట్టం గూదపగ, అనేదోనానుడి. పాతకాలందే. ఏంటిదీ ఒక చిన్నకత చెప్పేసుకుందాం.సరేనా!


అనగనగా ఒక పల్లెటూరు అందులో ఒక చిన్న కుటుంబం. ఒకడే కొడుకు. వయసొచ్చింది, పెళ్ళి చేసేరు. కోడలమ్మ ఒచ్చింది. కాలంగడిచి, ఇంటి యజమాని కాలం చేసేడు. కొడుకు ఇంటి యజమానయ్యాడు. అత్త స్థానం మారింది, యజమానురాలు నుంచి. కోడలికి అత్త చుట్టమే కాని రెండు పూటలా తింటోంది, చాకిరీ చేస్తున్నా, ఇది కోడలికి కంటకంగా ఉంది. ఏమీ చేయలేదు. కొంతకాలం గడిచింది, అత్త లొంగుబాటులో కొచ్చేసింది, ఆరోగ్య రీత్యా, కాని రెండుపూటలా తింటూనే ఉంది. కోడలు విసవిసలాడుతూ ముద్ద పడేస్తోంది. అలాగ అత్త చుట్టం గూద పగ అయ్యాయా కోడలికి. 


జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు


ఇదీ ఒకనానుడే! పాతకాలందే!! జంతికొచ్చి చక్కిలాన్ని నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించింది. నేటికాలానికి ఇదేంటో తెలీదుకదా! మరిప్పుడంతా పిజ్జాలు బర్గర్లేగా తింటున్నది. జంతికల్నిచక్కిలాలని చూసినవారే అరుదైనట్టుంది. చక్కిలానికి లెక్కగా చిల్లులుంటాయి, జంతికకి లెక్కలేనన్ని చిల్లులుంటాయి. లెక్కగా చిల్లులున్న చక్కిలాన్ని లెక్కలేనన్ని చిల్లులున్న జంతిక నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించిందనమాట. ఎలా చెప్పినా నేటి కాలానికి అర్ధం చెయ్యడం కష్టమే కనక నేటి కాలం ఉదాహరణ బాగుంటుంది కదూ!


ఒక జంతిక, చక్కిలం బ్లాగుల్లో కొంతకాలం కలిసున్నాయి. ఈ జంతిక బ్లాగుల్లోంచి పారిపోయింది, బుఱ్ఱలో గుంజెండిపోయి, రిపీట్ చెయ్యడానికి కూడా పాత గుంజులేక. . చక్కిలం ఇంకా కుంటుకుంటూ బ్లాగుల్లోనే ఉంది, పాతవి రిపీట్ చేస్తూనో, కొత్తవి రాస్తూనో. కొంతకాలంపోయాకా, ఒక పాత టపా రిపీట్ చేస్తే ఆ జంతిక, చక్కిలాన్ని బుర్రలో గుంజెండిపోయి, పాత టపాలు రిపీట్ చేస్తున్నాట్టా అని అడిగినట్టు.

14, నవంబర్ 2022, సోమవారం

అభిమానులు

 అభిమానులు



దయా బెన్ 
ఎవరీ దయాబెన్?
హిందీ టి.వి. సీరియల్లో ఒక పాత్ర పేరు.
ఎంటి సంగతి?
ఈ పాత్రని ఒక అమ్మాయి పోషించింది. ఆమె అసలు పేరు దిశా వాకాని. దయా బెన్ అన్నది పాత్రపేరో, ఆ నటి పేరో, తెలియనంతగా కలగలిసిపోయింది, ప్రజలలో.  ఆ హిందీ సీరియల్ పేరు తారక్ మెహతా కా ఉల్టా చష్మా! చాలామంది ఆమె అసలు పేరే మరచిపోయారు. మూడేళ్ళకితం పెళ్ళి చేసుకుంది. గర్భవతి అని తెలిసిన తరవాత ఒక సంవత్సరం పాటు ఎపిసోడ్ లకి పని చేసి ముందే ఇచ్చేసింది.సీరియల్ నుంచి తప్పుకుంది. 

ఆ తరవాత బిడ్డని కన్నది. షో నిర్మాత మరల షో కి రమ్మని పిలిచాడు,బిడ్డని సాకాలి రానంది. అదొగో అప్పుడు మొదలయింది కథ, చిలవలు పలవలుగా, ప్రెస్ లో.అభిమానులు బాధపడ్డారు. డబ్బులు ఎక్కువడిగితే నిర్మాత ఇవ్వనన్నాడని, మరొకరిని తీసుకుంటామని అన్నారని, ఎన్నెన్ని వన్నెలు చిన్నెలో, ప్రెస్ లో కనపడ్డాయి. ఆమెకు బదులు మరొకరి కోసం, అటువంటి వారి కోసం వెదుకులాటకి వీధిని పడ్డారు, సహనటులు,నిర్మాత అంతా. ఉహు! చాలామందిని చూసినా ఎవరూ సరిపోలేదు. ఆమెకు  బదులు మరొకరు దొరకలేదు. ఇక ఈ కాలం లో అభిమానులు చూపిన ఆదరమూ మరువలేనిదే! రెండేళ్ళ వెతుకులాట ఫలించలేదు.మరొకరు దొరకలేదు. బిడ్డకి రెండేళ్ళొచ్చేయి. ఆమెనే మరల అడిగాడు నిర్మాత. అమె మరల షో లో పాల్గోబోతోందన్నది సంచలన వార్త.   అభిమానులు పండగ చేసుకుంటున్నట్టు వార్త. 

ఆమె ఒక సామాన్య నటి. గ్లామర్ ఉన్నదేంకాదు, కాని అభిమానుల అనుగ్రహం పూర్తిగా పొందినది.


ఇక్కడి దాకా రాసేటప్పటికి మా సత్తిబాబు,సుబ్బరాజు వచ్చారు. రాసినది చూసి, మీకీ అలవాటు (తెగులు) తగ్గిందనుకున్నాను ( కుదిరింది )అనుకున్నాను. కుదరలేదనమాట! అంటూ మానిటర్ తన పక్క తిప్పుకుని చదివేడు, ఆ తరవాత సుబ్బరాజు చదివి, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి ఏం చేస్తాం లే! అని, సత్తిబాబూ నాకు కొన్ని అనుమానాలు తీర్చుదూ! అన్నాడు.  

ఈ తారకి అభిమాన సంఘం ఉందంటావా? మరో పెద్దనుమానం, 

మన తెనుగునాట సినీ తారళ్ళకి అభిమాన సంఘాలున్నాయి, మరి తారలకి లేవేం? ఇప్పటి తారలంతా దిగుమతీ సరుకే అంటావా?, అటైతే మన తెనుగువాళ్ళే ఐ గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన తారలు, సావిత్రి,భానుమతి, షావుకారు జానకి లాటి తారలకి అభిమాన సంఘాలెందుకు లేవు?

 ఈ అభిమాన సంఘాలున్న తారళ్ళు కట్టుకున్న గుడ్డలాళ్ళవిగావు,నిర్మాతవి. తెరమీద మాటాడే తూటాల్లాటి మాటలాడివిగావు,మాటల రచయితవి. ఆడు పాడే పాటాడిదిగాదు, పాటల రచయిత తెలివి.

    పాట, ఎనకమాల పాడే ప్లేబాక్ సింగర్ ది. ఇకాడు ఏసే స్టెప్పులు, ఆడెవడు కొరియొగ్రాఫర్ చెప్పినయి. మరి నటన, డైరెక్టర్ చెప్పినది. మరీళ్ళు చేసేదేటంటావ్? గొప్పంతా ఈళ్ళకే పులిమేత్తన్నారేటీ?    

మా సత్తిబాబు తన పక్కనే ఆటం బాంబు పడినంత కంగారు పడిపోయి, అవన్నీ పెద్ద విషయాలు సుబ్బరాజూ, నీకు చెప్పినా తెలియవులే అని వెళిపోయాడు.  పాపం మా సుబ్బరాజు తెనుగు ప్రజల్లా నిలువుగుడ్లేసుకునుండిపోయాడు.
(9.10.2019)

13, నవంబర్ 2022, ఆదివారం

తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి.

 తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి.



''తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి'' అని ఒక నానుడి చెబుతారు, మా పల్లెపట్టున. అనగానేమి?


నువ్వు పెద్దవాడివికావచ్చు, గొప్ప సంపాదన పరుడివి కావచ్చు, గొప్ప హోదా కలిగినవాడివి కావచ్చు లేదా గొప్ప ఆస్తి,ధనం కలిగినవడివే కావచ్చు, కాని నీ పక్కనున్నవారు, నిన్ను భరించేలా ఉండాలి. అంటే అర్ధం కాలేదు :)


నీది నువ్వు తిను, అనుభవించు ఎవరూ కాదనరు,నీ ఉనికి, మాట, పలుకు,చేష్ట నీ పక్కవారికి ఇబ్బంది కలగజేయకూడదు. ఇబ్బంది కలగజేస్తే, ఎదుటివారెంతగా సహించినా ఏదో ఒక రోజు బాధ వెలిబుచ్చక మానలేరు. నీవెంత గాలిలో తిరిగేవాడివైనా ఏదో ఒక రోజు భూమి మీదా కాలు పెట్టక తప్పదు. ''నేల విడిచి సాము ఉండదు'' కదా! అనగా రోజులెప్పుడూ ఒకలా గడవవు. ''ఎంత బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు తప్పదు''. ఆ గోడ మట్టిదే ఐ ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు సామాన్యుడి అవసరం పడుతుంది, ఆ రోజు ఏవగించుకునేలా బతకద్దని, భావం. వైభవం,ఆస్తి,ధనం,దర్పం,హోదా అతి ప్రదర్శన పనికిరాదు. ఇలా కావాలంటే నీ పక్కవారు కూడా తిన్నారా? ఉన్నారా?ఆలోచించు, వారి కష్ట సుఖాలు విచారించు. వారి తలపుళ్ళన్నీ కడగలేకపోయినా అత్యవసరాల్లోనైనా ఆదుకోలేని జన్మ వ్యర్థమని చెప్పడమే ఈ నానుడి భావం. చివరగా మనిషిలా బతుకు అని చెప్పడం. ''ఈ వేళ చస్తే రేపటికి రెండు'' అంటే రేపటికే ఎవరూ గుర్తుపెట్టుకోరు సుమా అని హెచ్చరించడం. ఎవరుగుర్తు పెట్టుకుంటారు నిన్ను? ఎవరు మిగిలేరీ లోకంలో? 

 ''కారే రాజులు? రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకుని బోవంజాలిరే భూమిపై
బేరైనంగలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు?వారలన్ మఱచిరే? ఇక్కాలమున్?
 భార్గవా''

''జరిగినన్నాళ్ళే వెయ్యి మొహం మీద కాగడా''.   అలా బతకద్దు, ఎదో ఒక రోజు ఆ కాగడాయే నిన్ను కాల్చేస్తుంది సుమా అని చెప్పడమే!


12, నవంబర్ 2022, శనివారం

అనాయాసేన మరణం

 

అనాయాసేన మరణం వినా దుఖేఃన జీవితం.


అనాయాసేన మరణం వినా దుఖేఃన జీవితం.

ప్రయాసలేక జీవితం ముగించడం,శోకం లేక జీవించడం అన్నవి బహుశః పూర్వ జన్మ సుకృతాలే! అనాయాసంగా మరణించచ్చుగాని దుఖః లేక జీవితం గడవదు. 


రోజూలాగే ఉదయమే నడుస్తున్నాం, అందరం. ఎవరి కార్యక్రమం వారు చేస్తున్నారు. నేను ప్రాణాయామానికి కూచుంటున్న సమయం. ఒక్క సారిగా కలకలం, ఒకరెవరో పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్ కి పరుగెట్టేరు. ఏమయింది తెలుసుకునేలోగానే దుర్వార్త, ఒక వాకర్ నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతే, వెనకవారు ట్టుకుంటే, పక్కవారు, కేంపస్ లోనే టెన్నిస్ ఆడుతున్న డాక్టర్ గారికోసం పరుగెడితే, వారొచ్చి, ప్రథమచికిత్స చేసినా ఉపయోగం లేక హంస లేచిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. వాకర్లంతా నిలబడిపోయాం, బిక్కచూపులు చూస్తూ. పెద్దలం అక్కడే వుండటంతో క్షణాలలో పార్థివ శరీరాన్ని తరలించడానికి వేన్ ని చెప్పడం, కావలసినవారికి కబుర్లు చెప్పడం జరిగిపోయాయి. జరిగినదానికి దిగ్భ్రాంతి చెందిన వాకర్లంతా కర్తవ్యా విమూఢులై నిలబడిపోయాం. మా వూళ్ళో పార్థివ శరీరాలని శ్మశానానికి చేర్చడానికి ఇబ్బందులు లేకుండేందుకు ఇప్పటికే రెండు సంస్థలు రెండు వేన్లు నడుపుతున్నాయి.  అరగంటలో పార్థివ శరీరాన్ని తరలించిన తరవాత చైతన్యం పొంది కదిలాం, పోయిన వారెవరో తెలియదు, ముఖ పరిచయం తప్ప. ఎవరైనా వారి ఆత్మ పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకుంటూ.


ఓం శాంతి! శాంతి!! శాంతిః!!!


10, నవంబర్ 2022, గురువారం

ఆ వూరికి ఈ వూరెంతదూరమో ...............

 ఆ వూరికి ఈ వూరెంతదూరమో ఈ వూరుకి ఆవూరూ అంతే దూరం.


ఆ వూరికి ఈ వూరెంతదూరమో, ఈ వూరుకి ఆవూరూ అంతే దూరం, ఇదొక నానుడి మా పల్లెటూళ్ళలో చెప్పుకుంటూ ఉంటారు. ఆవూరునుంచి ఈ వూరు ఎంతదూరమో ఈ వూరునుంచి ఆవూరూ అంతే దూరం ఒక్కంగుళం అంటే ఒక్క అంగుళం కూడా తేడా ఉండదు. అంటే వారు వీరికెంత గౌరవం ఇస్తే వీరూ అంతే గౌరవం ఇస్తారు. అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, దేశాలు కావచ్చు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలి.


మనం ఎదుటివారిని ఒరే అంటే వారూ ఒరే అనే అంటారు, ఏమండీ అనరు. మనం ఏమండీ అంటే వారూ అదే అంటారు. మనం వెధవా అంటే వారు వెధవన్నర వెధవా! అంట్ల వెధవా!! అని వడ్డి చెల్లించి మరీ తిడతారు. కొండొకచో అంతేవాసులూ తిడతారు, అక్కుపక్షీ అని.మురబ్బీ చెల్లదు సుమా! ఒకవేళ చెల్లించుకున్నా, ఖర్చు లేకుండా జీవితకాల శత్రువును కొనుక్కున్నట్టే :)


కొందరికి నోరు అదుపులో ఉండదు, బహుశః మెదడు మోకాటిలో ఉంటుందేమో!బలవంతంగా గౌరవం పొదలేరు, ఒక వేళపొందినా అది చాలా కొద్దికాలమే! మనం తిడితే మన అంతేవాసులు, వందిమాగధులు కీర్తించచ్చు,ఆ తరవాత జరిగేదానికి వగచి ఉపయోగం ఉండదు, తస్మాత్ జాగ్రత! జాగ్రత!! 


6, నవంబర్ 2022, ఆదివారం

ఉబోస కావాలి

ఉబోస కావాలి 

ఒక నెలనుంచి ఒక పెద్దాయన ఉదయం నడకకొస్తున్నారు, ఒకటి రెండు రోజులు నడవగా చూసాను, ఆ తరవాత ఆయన నడిచింది చూడలే! ట్రేక్ దగ్గరే బెంచి మీద కూచుని ఉంటున్నాడు, నడిచేవాళ్ళని చూస్తూ! ఈయనకేం పెద్ద వయసనుకోకండి, మొన్ననే అరవై వచ్చినవాడు, కొత్తగా స్టెంటు వేయించుకున్నవాడు.డాక్టర్ బహుశః నడవమని చెప్పి ఉంటాడు. కాళ్ళకి నీ కేప్ లు వేసుకుని అవస్థ పడుతుండగా చూసాను. తెలిసినవాడే! తెల్లగా పాలిపోయాడు, ఏంటి సంగతంటే, నాకే అనిపించినది. ఆయన ఒక ఏ.సి బాధితుడని. ఇంటిదగ్గర ఏ.సి, ఆఫీసులో ఏ.సి, కారులోనూ ఏ.సి. అదీ బాగా కూల్ గా. మనిషి పాలిపోక మరెలా ఉంటాడు? కష్టపడి ఉదయం సూర్యుని కోసం చూస్తూ ఉంటాడు, సూర్యుడు కనపడ్డాకా పావుగంటకి వెళిపోతుంటాడు. ఆయన చుట్టూ భజంత్రీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు :)


ఇది చూసి కొంచం బాధ కలిగింది, ఆగలేకపోయా! చెప్పాలనిపించింది 

 చెబుతున్నా, ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! అని చెప్పేసానిలా!

మోకాళ్ళ నెప్పులు తగ్గలంటే బరువు తగ్గాలి, అది అంత తొందరగా జరగదు, నడిస్తే బరువు తగ్గుతుంది, నడవాలంటే మోకాళ్ళనెప్పులు,ఇలా ఇది ఒక విషవలయం. నడవడానికి ప్రయత్నించాలంటే, మోకాళ్ళకి చిన్న చెంచాడు ఆవునెయ్యి,నాలుగు చుక్కల నిమ్మరసంకలిపిరాయండి, నెప్పులు తగ్గిపోతాయనను,  

 నడవడానికి కొంత అనుకూలిస్తాయి, చెప్పాలనిపించింది, 

చెప్పేసా! ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! 


వద్దనుకుంటూ ఉన్నా ఉబోసలు పెరిగాయి :) తగ్గేదెలా? ఎవరేనా స్పందించకుండా ఉండేందుకు 

 ఉబోస చెప్పరాదూ?  :) 



30, అక్టోబర్ 2022, ఆదివారం

మనం ఇంతే!

 




మనం ఇంతే!


 సంఘటన తరవాత ఆ వీధిని వెళ్ళడం మానేసాను, ఎందుకైనా మంచిదని.మరో వీధిన రాకపోకలు సాగిస్తున్నా! ఈ వీధి పరిస్థితి ఆ వీధికంటే అధ్వాన్నంగా ఉంది. ఇంటికో డస్టుబిన్ను, దానినిండా పారేసిన అన్నం, చూస్తే కడుపు తరుక్కుపోయింది,మళ్ళీ ఆవేశం వచ్చేసిందిగాని తమాయించుకున్నా! తలొంచుకుని వెళిపోడం అలవాటు చేసుకున్నా! సాధ్యం కావటం లేదు. ఈ డస్టుబిన్నులు ఎత్తుగా స్థంబాలకి కట్టేరు, విశేషం ఏమని అడిగా ఒకరిని. వారు చెప్పినది,ఈ డస్టుబిన్ను నిండితే, పందులని పెంచుకుంటున్నవారొచ్చి పట్టుకుపోతారనీ, డస్టుబిన్ను నిండా ఇలా ఇచ్చినదానికి డబ్బులు కూడా ఇస్తారని చెప్పేరు, నాకు ఒళ్ళు కంపరమే పుట్టింది. ఏం చేయగలను, అశక్తుడిని, తలొంచుకుని పోతున్నా! ఎవరికి ఉ.బో.స లు చేయకూడదని తీర్మానించుకున్నా.

చలితిరిగింది, ఉదయం నడక మంచిదికాదనిపించింది. సాయంత్రం ఏ సమయానికి వెళితే బాగుంటుందని బయలుదేరా నాలుగున్నరకి. ఇది చాలా హడావుడి సమయం. కేంపస్ లో కెజి నుంచి పిజి దాకా ఉంటారు విద్యార్థులు, నాలుక్కి చిన్న పిల్లలతో మొదలయ్యే పిల్లలు వెళ్ళడం పి.జివాళ్ళు చివరవెళ్ళడంతో హడావుడి ముగుస్తుంది. ఈ లోగా బస్సులరాకపోకలు, అబ్బో పెళ్ళివారిల్లే! ఈ మధ్యలో నడకకి వచ్చే స్త్రీలు, ముసలాళ్ళ రాకపోకలు. 

 ఇక గ్రవుండ్ కి వెళితే  మూలనుంచి ఫుట్బాలే కాళ్ళలో  , పడుతుందో, బేస్కెట్బాలే నెత్తిన పడుతుందో, క్రికెట్బాలే పక్కటెముకల్ని ముద్దు పెట్టుకుంటుందో,చెప్పలేం. :) ఇక ఏ కుర్రాడో, కుర్రదో పరిగేట్టుకొచ్చి గుద్దేస్తారో అని పీకుతూ ఉంటుంది. ఈ మధ్యలో ముసలాళ్ళు, ఆడాళ్ళు నడక, ఏం చెప్పను ఆనందం పొంగిపొర్లుతూ ఉంటుంది. పిల్లలికి ఆడుకునే సమయం కాదంటే ఎలా? వాళ్ళని అలా ఉత్సాహంగా చూడడం కూడా ఉత్సాహం తెచ్చుకున్నట్టే :) మరొకొంచం చలిపెరగనిద్దామని తీర్మానించుకుని ఉదయపు నడకే మళ్ళీ మొదలెట్టా.

అనుకోకుండా పాతవీధినే వచ్చేస్తున్నా. షరా మామూలే. ఆ పడచు గిన్నెతో అన్నం బయట పారబోసి వెళుతోంది, నన్ను చూసింది కాని తలొంచుకుని గబగబా లోపలికెళిపోయింది. నేనూ మరి మాటాడక తలొంచుకుని వచ్చేసాను.

రోజూ అన్నం ఇలా ఎందుకు పారేస్తున్నారు, ప్రశ్న దొలిచింది. ఒక అవ్వని అడిగా! నీకెందుకీ గోల ఈ వయసులో విదిలించింది. తెలుసుకుందామనీ, నసిగేసా! ఏమనుకుందోగాని, అన్నం పారెయ్యడం ఆడాళ్ళకి ఇష్టమా? కాని తప్పక పారేస్తున్నారు, ఎంత బాధపడుతూ పారేస్తారో చెప్పలేను. రోజూ రాత్రి అన్నం వండుతుంది, ఎదురు చూస్తుంది భర్తకోసం, ఆశ నిరాశే! తను తాళలేకపోతే తింటుంది, లేదంటే తనూ పస్తే ఉంటుంది. ఏ రాత్రికో తూలుకుంటూ ఇంటికొస్తాడా మనిషి. వచ్చినవాడు, మూడు నిమిషాలు పొల్లి పక్కకి తిరిగి పడుకుంటాడు. తిండి లేదు, ఇదేమని అడిగితే సమాధానంలేదు, లేదా చెయ్యి చేసుకుంటాడు. ఏం చెప్పమన్నావ్! గవళ్ళ గంగమ్మగారి హస్తోదక మహిమ, అని కొంగు దులుపుకుని లోపలికెళిపోయింది.  

27, అక్టోబర్ 2022, గురువారం

పిట్టనికొట్ట పొయిలోపెట్ట.

పిట్టనికొట్ట పొయిలోపెట్ట.


 పిట్టనికొట్ట పొయిలోపెట్ట.

పూటబత్తెం పుల్లవెలుగు

రెక్కడితేగాని డొక్కాడదు.

అన్నీ ఒకలాటి నానుడులే ఐతే మొదటిది చాలా పురాతనమైనదనిపిస్తుంది. అన్నిటి అర్ధం ఒకటే ఏరోజు కూలితో ఆ రోజు గడపడమనీ, పని చేస్తేగాని పూటగడవదనీ, ఆహారం ఉండదనీ.


పొయ్యిలో పిల్లి లేవలేదు.

పొయ్యిలో పిల్లి లేవలేదంటే, వంట ప్రయత్నమే లేదని అర్ధం. ఎలా? వంట ఉదయమే చేసుకునేవారు, ఆ రోజుల్లో వేసిన పొయ్యిలమీద కట్టెలతో వంట చేసుకునేవారు. సాయంత్రానికి  సూర్యాస్తమయం కాకుండానే భోజనాలు చేసేసేవారు, అందుకే  " నోట్లో మెతుకు గూట్లో దీపం" అని నానుడి, అందుకు చాలా ముందుగానే వంటైపోయేది.అప్పటినుంచి మరలా ఉదయందాకా పొయ్యి ఖాళీ,ఈ పొయ్యి వెచ్చగా ఉంటుంది కనక పిల్లి పడుకుంటుంది, దానిని అక్కడ పడుకోనిచ్చేవారు, ఎందుకూ? పొయ్యి వంటింట ఉంటుంది, ఆహారపదార్ధాలు అక్కడే కొంతైనా ఉంటాయి, మరి అక్కడికి ఎలకలు చేరతాయి కదా! పిల్లి కాపలా అనమాట, దొరికితే ఎలకని భో0చేసి పడుకుంటుంది.పొద్దుటే వంట ప్రయత్నానికి ముందు పొయ్యిలో నిప్పు వేస్తారు గనక పిల్లి లేవక తప్పదు, అదనమాట,అంటే వంట ప్రయత్నమే లేదు, అంటే పొయ్యిలో పిల్లి లేవలేదు, లేపలేదని అర్ధం,పొయ్యిలో నిప్పే వేయలేదని చెప్పే ప్రయత్నం .  


24, అక్టోబర్ 2022, సోమవారం

తాటాకు టపాకాయలు

దీపావళి శుభకామనలు.
(సినీవాలి శుభకామనలు)
తాటాకు టపాకాయలు


తాటాకు టపాకాయలు దీపావళికి కాల్చడం ఆనవాయితీ. వీటి తయారు మాత్రం సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటుంది. మామూలు తాటాకులు పనికి రావు, చిట్టిమట్టల ఆకులు తెచ్చుకుని ఎండబెట్టి, ఆ పై మట్టలు నరికి, ఓపికగా కూచుని ఒక్కొక్క ఆకునూ వేరు చేసి, ఈనెలు తీసి, అకుల్ని లెక్కబెట్టి కట్టగట్టాలి. 

మాదగ్గరలో మందుగుండు తయారు చేసేవారున్నారు.వారు ఈ తాటాకులు కొనుక్కుపోతుంటారు.



 

ఆకును తయారుచేయడానికి ఓపిక శ్రద్ధ కావాలి.సంవత్సరం పొడుగునా చేయాలి, ఒక రోజులో అయేపని కాదు.



ఇంత కష్టపడ్డా మిగిలేది తక్కువ శ్రమ ఎక్కువ.


ఇక తాటాకు టపాకాయల్లో ఉపయోగించేది సూరేకారం, పటాసు , గంధకం,బొగ్గుపొడి, ఒక్క జొన్నగింజ.


ఒక తాటాకును ముక్కచేసి పైచెప్పినవాటిని అందులో వేసి ఒక వత్తిని మూలగా బయటికి పెట్టి ఆకును మడతపెట్టి, మిగిలిన ఆకును దానిపై ఒడుపుగా దానిపైచుట్టి బిగిస్తే టపాకాయ తయారు. బిగింపులో కూడా పేలుడు తేడా ఉంటుంది.  

Courtesy. What's app

ఢిల్లీ దీపావళి సంబరం 

23, అక్టోబర్ 2022, ఆదివారం

తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు

 

తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు


తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు,తల్లిపుట్టింటి గురించి మేనమామకి చెప్పినట్టు,తల్లిపుట్టిల్లు మేనమామకి ఎరుకే, ఇలా రకరకాలుగా చెబుతుంటారీ నానుడిని.ఏమిది?


మేనమామ అంటే తల్లి అన్న లేక తమ్ముడు. అనగా ఈ తల్లి ఆమె అన్న/తమ్ముడు ఒక ఇంట పుట్టినవారే! మేనమామకి ప్రత్యేకంగా తల్లిపుట్టిల్లు గురించి చెప్పడం హాస్యాస్పదం. ఇద్దరూ ఒక ఇంట పెరిగినవారే! ఆ తల్లి ఎలాపెరిగిందో ఆమె అలవాట్లేంటో, ఎంత వైభవంగా పెరిగిందో,ఆ ఇంటి ఆచార వ్యవాహారాలేంటో ప్రత్యేకంగా మేనమామకి చెప్పాలా?తెలియవూ!

21, అక్టోబర్ 2022, శుక్రవారం

తాతకి దగ్గులు నేర్పడం.

 తాతకి దగ్గులు నేర్పడం.

ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, పూర్తి జీవితం అనుభవించిన అనుభవజ్ఞునికి జీవితం గురించి చెప్పబోవడం అంటారు. 


ఇలా చెప్పబోయినవారు ఎవరూ? ఒక పిల్లకాకి, కళ్ళు పూర్తిగా తెరవని పసికూన, మనవడో/మనవరాలో, ఆ తాత కళ్ళెదుట పుట్టినవాళ్ళు, ఆ తాత చెయ్యిపట్టినడచినవాళ్ళు. ఇలా చెప్పబోయారంటే వారు జీవితంలో అప్పుడే అడుగుపెట్టినవారై ఉంటారు, అంటే వయసు పాతిక ముఫై మధ్య,అదే జీవితమనుకుని.  ఇక వీరి తండ్రి అంటే అరవై వయసు దగ్గరమాటే. మరితాతాంటే వీరితండ్రికదా! అంటే ఆయన వయసు ఎనభై ఆ పైమాటే కదా! 


ఇంతవయసు అనుభవమున్నవారికి జీవితంలో ఒడిదుడుకులగురించి చెప్పబోయినవారికి  మధ్య వయసుతేడా ఒక అర్ధశతాబ్ది, అనుభవంతేడా అంతే కదా!. మరీ తాత ఎనభై పైబడ్డ వయసులో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత మందిని చూసి ఉంటాడు. ఎన్ని రకాల మనుషులని చూసి ఉంటాడు? 


ధూర్తులు,దుర్మార్గులు,వంచకులు, వదరుబోతులు, స్వప్రయోజనపరులు,నమ్మించి మోసంచేసినవారు, ఇలా చెప్పుకుపోతే ఇది అనంతంకదా!  జీవిత పరుగులో ఎన్నిసార్లు పడిపోయి లేచి మళ్ళీ పరుగందుకుని ఉంటాడు, ఎంత కష్టపడి వీళ్ళని పెంచి ఉంటాడు? నేడు కనుతెరచినవారింత అనుభవమున్నవారికి చెప్పబోవడమంటేనే తాతకి దగ్గులు నేర్పడం, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందనడం. దీనినే నక్కపుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంతగాలివాన చూడలేదంది అన్నట్టు కదా!

19, అక్టోబర్ 2022, బుధవారం

చెప్పాలనిపించింది,చెప్పేశా!

చెప్పాలనిపించింది,చెప్పేశా!


పెదరాయుడు లుంగీ,తెల్ల చొక్కా,చేత పొడుగాటి చేపాటికర్ర, కాళ్ళకి ఆకుచెప్పులు, ఆహార్యంతో,  ఉదయమే కనుచీకటితో, కాలేజికి నడకకి బయలుదేరుతా . ఒక వీధివెంటేవెళతా!ఎప్పుడూ. కారణం, అరకిలోమీటరు పైన పొడవుంటుంది,అదేకాక సిమెంటు రోడ్డు, దానికి తోడు ఉదయం వెళ్ళేటపటికి,సంచారం ఉండదు,  ఎవరూ లేవరు. మరోమాట, వీధిలో రెండు పక్కలా ఇళ్ళు, అవికూడా నాలాటి 'రెక్కాడితే కాని డొక్కాడని' వారివే! తిరిగొచ్చేటప్పుడు ఉదయపు జీవి చిత్రం కనపడుతూ ఉంటుంది. మొన్న తిరిగొస్తున్న సమయం, ఒక పడుచు రోడ్ దాటి ఎదురుగా ఉన్న చెత్తకుండీలో తనచేతిలో ఉన్న, గిన్నెనిండా ఉన్న అన్నం ఒలకబోసి వెనుతిరిగిన సమయం. సరిగా నేను అక్కడికి చేరుకున్న సమయం, ఎదురుబొదురయ్యాం. నేను  రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ నిలబడేటపటికి, పడుచు ముఖంలో ఆశ్చర్యం,అరెరె అన్నం అనవసరంగా పారబోశానే! ఈ బిచ్చగాడు పట్టుకెళ్ళేవాడేమో! అనే భావం జమిలిగా  కనపడ్డాయి ఆమె ముఖంలో. పడుచు, ఏమిచేయాలో తోచక, చేత అంట గిన్నెతో నిలబడిపోయింది.  నేను, "తల్లీ అన్నం ఎప్పుడూ పారెయ్యకూ, ఎవరికేనా పెట్టు, లేదంటే మిక్సీలో అన్నంతో ఒక ఉప్పరాయి,మిరపకాయ,జీలకర్ర పలుకు వేసి ఒక తిప్పుతిప్పి వడియాలలా  పెట్టు ఎండిపోతాయి, వాటిని వేయించుకో, నూనెలో, తిను బాగుంటాయి, ఇంకా చాలా చెప్పచ్చు, సమయం కాదు, ఏమనుకోకూ ఇలా చెప్పేనని, అన్నా! " ఏమనుకోనని చెప్పి వెళ్ళింది, ముందుకు కదిలా! చెప్పాలనిపించింది ,చెప్పేశా!   

17, అక్టోబర్ 2022, సోమవారం

నేలవిడచి సాము

 నేలవిడచి సాము



సాము అంటే కత్తితిప్పడం, కఱ్ఱతిప్పడం. పూర్వకాలంలో కత్తులు, కర్రలతోనే యుద్ధాలు చేసుకునేవారు. ఈ కఱ్ఱ,కత్తి తిప్పే అలవాటు ఒక్క రోజులో వచ్చెయ్యదు, దానికి కొంత నిత్య అభ్యాసం అవసరం, దీన్నే సాము నేర్చుకోడం అంటారు.ఇందులో చాలా మెలకువలూ ఉన్నాయి. ఏది చేసినా నేలమీదనే చెయ్యాలి.అవసరాన్ని బట్టి ఎగరడం దూకడం కూడా ఉంటాయి. ఎగిరినా దూకినా అది గాలిలో ఉండడం కొద్ది క్షణాలే, ఆ తరవాత నేలకి రాక తప్పదు. అంటే నేల విడిచి సాము చెయ్యలేరు. అదే ఈ నేల విడచిసాము. ఇదెందుకూ ఇప్పుడని కదా! వస్తున్నా!!



సుగర్ వ్యాధి లేనివాళ్ళు తక్కువ, నేటి కాలంలో. దీనికి అలోపతి వైద్యం తప్ప, మరో వైద్యం లేదూ అంటున్నారు.ఆయుర్వేదం బహు పురాతన వైద్యం, కాని ఇది నెమ్మదిగా అడుగంటి పోయింది, గత వందేళ్ళలో. నేనెరిగి కూడా ఆయుర్వేదమే పల్లెలలో వైద్యం. మనదగ్గర వైద్యం లేదు, అంతా పడమటివారిదే అనే మేధావులూ ఉన్నారు, నమస్కారం. ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదాన్ని బతికించాలనే ప్రయత్నం సాగుతూ ఉంది, సంతోషం.  ఈ సందర్భంలో సోషల్ మీడియాలో సుగర్ గురించిన వైద్యం, మందులు, విచ్చలవిడిగా కనపడుతూనే ఉన్నాయి. ఏది నిజం, తెలియటం లేదు. ఒక వేళ ఏదైనా ఒకరి దగ్గర మందువాడితే అది వికటిస్తే, అప్పుడు అలోపతీ వైద్యానికెళితే, జరిగేదేమో చెప్పాలా? ఈ ఆయుర్వేద వైద్యులు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, అందుబాటులో ఉండరు, పల్లెలలో ఆయుర్వేద వైద్యులు లేరు, అక్కడక్కడ కొద్దిగా హోమియో వైద్యులు ఉన్నారు. కొన్ని మందులను భారతప్రభుత సర్టిఫయ్ చేసిందని చెబుతూ ప్రకటనలు వస్తున్నాయి. సంతోషించే సంగతే, కాని వైద్యులు లేకుండా మందులు ఎవరిమటుకు వారు వేసుకుని స్వంతవైద్యం చేసుకుంటే...వికటిస్తుంది. వైద్యుడూ,వైద్య పర్యవేక్షణ లేక వైద్యమా? అందుచేత భారత ప్రభుత, ఆయుర్వేదమందులు తయారు చేసే కంపెనీలూ వైద్యులను తయారు చేయకపోతే ఇది నేల విడచి సామే అవుతుంది.

15, అక్టోబర్ 2022, శనివారం

చావు కాలానికి లావు దుఃఖం.

చావు కాలానికి లావు దుఃఖం.


1. చావు కాలానికి లావు దుఃఖం.

  వయసు మీదపడేటప్పటికి దుఃఖమే ఎక్కువగా ఉంటుందన్నది పిండితార్ధం. లావు అన్న మాటకి బలం,ఎక్కువ, అనే అర్ధాలున్నాయి. లావు మాటని పోతనగారు వాడేరు భాగవతంలో, 'లా'వొక్కింతయులేదు (లావు+ఒకింత=లావొక్కింత).


వయసులో ఉన్నపుడు కష్టం తెలియదు,బాధా తెలియదు. శరీర బాధలుండవు. వయసుమళ్ళితే బంధువులు గతించడం,జీవిత భాగస్వాములే గతించడం, శరీరం సహకరించకపోవడం, ఇక  శంఖు,చక్రాలు నేటి కాలంలో అందరి ఉన్నవే!వాటిని పట్టివచ్చేబాధలు, కొడుకులు కోడళ్ళు చూడకపోవడం, స్వయంగా ఏపనీ చేసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడక తప్పకపోవడం,

 అనాధాశ్రమాల్లోనూ,వృద్ధాశ్రమాల్లోనూ గడపడం, ఇక ఇంట్లో ఉంటే పిలిస్తే పలికే దిక్కులేకపోవడం,బాధ చెప్పుకుందామంటే వినేవారు లేక, అనుభవించేది నరకం. 

 ఇలా కష్టాలు,దుఃఖాలు జమిలిగా స్వారీ చేస్తుంటాయి, చెప్పుకోగలిగినవి,చెప్పుకోలేనివి.కాలుడూ కరుణించడు,సమయమొచ్చేదాకా,అన్నీ దుఃఖాలే

 అందుకే చావుకాలానికి లావు దుఃఖం అన్నారు.


2.కుంచం నిండాలి.

మనది వ్యవసాయం ప్రాధమికమైన దేశం,అందుకే నానుడులన్నీ వ్యవసాయం దాని అనుబంధంలో ఎక్కువ ఉంటాయి. కొలతకి ఉపయోగించే సాధనమే కుంచం. పాతరోజుల్లో అన్నీ కొలిచి అమ్మేవారు.ధాన్యాలు, నెయ్యి,నూనిలాటి ద్రవాలు, పిండిలాటివాటిని కూడా కొలిచి అమ్మేవారు. ఇక పండ్లు వగైరాలని లెక్కపెట్టి అమ్మేవారు, పరక,పాతిక,ఏభై, వంద అని. వర్షం కూడా కుంచాలలో చెప్పేవారు. పాపాన్ని కూడా కుంచాలలో చెప్పేవారు, అందుకే పాపం పండాలి,కుంచం నిండాలంటారు.  


3.నక్క పుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన చూడలేదందిట.

నక్కపుట్టి మూడాదివారాలు కాలేదు, అంటే నక్క వయసు ఇరవై ఒక్కరోజులు కూడా కాదు.

ఇరవై ఒకటో రోజు నాడు తొట్టిలో వెయ్యడం లాటి వేడుకలు చేసేవారు.  నాటికాలంలో పుట్టిన మూడు నెలలదాకా కళ్ళు తెరవనివారూ,గుప్పెళ్ళు కూడా విప్పనివారు

 ఉండేవారంటే నమ్మలేరు,ఒంటికి నూనిరాసి, ఒక సన్నని నూలు బట్ట కప్పేవారు.''నూని గుడ్డుకి నూరాపదలు'' అనేవారు. ఇరవైఒకటోనాడు నలుగుపెట్టి స్నానం చేయించి ఉయ్యాలలో వేసేవారు.

   ఇరవై ఒక్క రోజుల వయసుదాటని నక్క ఇంతపెద్దగాలివాన చూడలేదంది. అంటే వయసేలేదు, అనుభవమూ లేదు కాని ఆరిందాలా మాట్లాడితే ఇలా అంటారు.

ఇక నానుడికొస్తే అనుభవం లేనివారు పెద్ద అనుభవజ్ఞులలా మాటాడటాన్ని ఈ నానుడితో చెబుతారు. 

13, అక్టోబర్ 2022, గురువారం

ఏకచక్రే మహాభోగే

 ఏకచక్రే మహాభోగే


ఏకచక్రే మహాభోగే

ద్విచక్రే మహాపండితః

త్రిచక్రే లోక సంచారే

చతుశ్చక్రే మహాబలాః


ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి, రెండు చక్రాలున్నవాడు, మహా పండితుడు, త్రి చక్రే, మూడు చక్రాలున్నవాడు, లోక సంచారి, తిన్నచోట నిద్రపోడు, నిద్రపోయిన చోట తినడు, తిరుగుతూనే ఉంటాడు. నాలుగు చక్రాలున్నవాడు మహా బలవంతుడు. :) ఇదండీ సంగతి, ఏంటిటా? ఇది సాముద్రికంలో మాటంటారు. చక్రం, శంఖం,అనేవి చేతిలోనూ గద,పద్మం అనేవి కాళ్ళలోనూ ఉంటాయిట. ఇందులో కూడా సవ్య చక్రం,అపసవ్య చక్రం, దక్షణావర్త శంఖం, ఉత్తరావర్త శంఖం అని రకాలూ ఉన్నాయట. :) ఇదంతా మనకొద్దు, మనం అధునికులం కదా! మన దారిలోకి పోదాం :)


ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి కదా! సత్యం.రెండు కాళ్ళే ఏకచక్రం, కాలినడకన తిరిగేవాడు, సైకిల్ కొనడు,కారు అసలే కొనడు.పెట్రోల్/డిజిల్ ధరలు పెరిగాయనే గోల లేదు.  సైకిల్ కొననివాడు సైకిల్ బాగుచేయించే పనిలేదు. వీడు కాలి నడకన తిరుగుతుంటాడు కదా! రోగం రొచ్చు రాదు, డాక్టర్ దగ్గరకెళ్ళడు. మందులు కొనడు. మందు మొదలే కొనడు. సినిమా కెళ్ళడు, నడిచిపోవాలిగా!ఇంటి దగ్గర టివి చూస్తాడు, పెళ్ళాంతో కబుర్లాడుతాడు, వెచ్చగా తింటాడు, వెచ్చగా పడుకుంటాడు, హాయిగా నిద్దరోతాడు. వీని వల్ల ఎకానమీకి ఉపయోగం...లేదు. సైకిల్,కారు,మందులు, వైద్యం ఇండస్ట్రీకి శత్రువు. గోల లేదు,గొడవలేదు.మరి మహా భొగమేగా నేటిరోజుల్లో :)   

నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారో మహానుభావుడు. ఈ సామాన్యుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఏడు కరువులొస్తాయంటే, మొదటి కరువుకే చచ్చిపోతే మిగిలిన ఆరు కరువులూ నన్నేంచేస్తాయనగల ధీరుడు. కరంటు పోతే విసనకర్రతో సరిపెట్టేసుకుంటాడు. కుళాయి నీళ్ళు రాకపోతే టేంక్ దగ్గరకెళ్ళి తెచ్చుకుంటాడు. ఏ పార్టీ  వాళ్ళడిగినా నా వోటు మీకే అంటాడు.  అంతా దరిద్రమో అని ఏడుస్తుంటారు, దరిద్రం అన్నదో భావన అంటాడు. ఉన్నది తింటాడు, లేకపోతే పస్తుంటాడు. కట్టలు, కట్టలు డబ్బు పోగేసెయ్యాలన్న తపన లేదు. ఇ.డి వాళ్ళొస్తారో, దొంగే వస్తాడో అన్న భయం లేదు, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్దరోగలడు, నిద్దర మాత్రల పనిలేదు.

కారేరాజులు రాజ్యముల్ గల్గవే

వారేరీ? సిరి మూట గట్టుకొని పోవన్ జాలిరే? అని అడగగల ధీమంతుడు. 


వేయిమాటలేల?

మితంగా తినడం భోగం. కంటినిండా నిద్ర భోగం. భార్య/భర్త తో ఊసులాడుకోడం,సరస సల్లాపాలు భోగం. తల్లితండ్రులుండటం భోగం. తల్లితండ్రులతో కలసి ఉండటం భోగం. పిల్లల్ని కని పెంచడం భోగం. కష్టసుఖాలు కావలసినవారితో పంచుకోడం భోగం. సన్మిత్రులను కలిగి ఉండటం భోగం. ఆరోగ్యమే మహాభాగ్యం, భోగం. చివరగా తన సంతానం,బంధుమిత్రుల మధ్య తనువు చాలించడం భోగం. 


ఏకచక్రే మహాభోగే!

వీలును బట్టి మిగతా చక్రాలు చూద్దాం 

 

11, అక్టోబర్ 2022, మంగళవారం

ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.

 ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.


ఇదొక నానుడి, తెనుగునాట చెప్పుకునేది, ముఖ్యంగా గోజిలలో చెప్పుకునీదీ.

గుంజ అనేది అవు,దూడలని కట్టే కఱ్ఱ. ఇది వంపుతిరిగి భూమిలో పాతపెట్టబడి ఉంటుంది. పలుపుతాడును ఆవు మెడలోనూ గుంజకి కట్టేస్తారు. ఈ గుంజని కట్టుకొయ్యి,కట్రాట వగైరా పదాలతోనూ వాడుకలో ఉంది. 

ఇక గురక  తెగులు అనేది పశువులకొచ్చే భయంకర వ్యాధి. దీనినే దొమ్మ తెగులు అని కూడా అంటారు.  గిట్టలు చీలివున్న పశువులకొచ్చేది. ఈ వ్యాధి వస్తే పశువు జ్వరంతో బాధ పడుతుంది, గొంతువాస్తుంది, నోట పుళ్ళు పడతాయి, గిట్టల మధ్య ఒరుస్తుంది, కొంతకాలం బాధపడి పశువు చనిపోతుంది. ఈ వ్యాధికి నేటికీ మందులేదు. వాక్సిన్ కూడా లేదు. ఈ వ్యాధిలో చాలా రకాలుండడమే వాక్సిన్ లేకపోడానికి కారణం. దీనిని ఇంగ్లీష్ లో ఫుట్ అండ్ మౌథ్ అంటారు. ఇది వ్యాపించడం గిట్టల ద్వారా జరుగుతుంది గనక. 

విషయంలో కొస్తే ఈ తెగులు వస్తే ఆవుకి రావాలి లేదా దూడకి రావాలి గాని వాటిని కట్టేసే ప్రాణం లేని గుంజకెందుకు వస్తుంది? రాదు. అంటే ఈ వ్యాధికి గుంజకి అసలు సంబంధమే లేదు.

మరి ఇలా ఎందుకంటారు? ఆవుకి రాక దూడకీ రాక ఈ వ్యాధి గుంజకొచ్చిందంటే, అపసవ్యమని, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన అభిప్రాయభేదం గురించి, అసలు వారు బాగానే ఉన్నా, ఇబ్బందులు లేక, సంబంధం లేని మధ్యవారు బాధపడిపోడంగా, కొట్లాడుకోడంగా, చెబుతారు, ఈ నానుడి.

9, అక్టోబర్ 2022, ఆదివారం

పరాధికారము పైనవేసుకొనరాదు.

 పరాధికారము పైనవేసుకొనరాదు.


అనగనగా ఒక పల్లెటూరు, అందులో ఒక మడేలు, ఒక కుక్కని, గాడిదని పెంచుకుంటున్నాడు. కుక్క ఇంటి దగ్గర కాపలా. గాడిద ఇంటికి రేవుకి మధ్య బట్టలు మోసుకుపోవడం, పనులు. కుక్కకి ఉదయమే మడేలుతో పాటు చద్దిబువ్వ. మధ్యాహ్నం మడేలుతో పాటు వేడి బువ్వ పెడుతుంది, చాకిత.  కుక్క యజమాని మంచంకిందే పడుకుంటుందెప్పుడూ. అప్పుడప్పుడు రాజభోగాలు కూడా కుక్కకే, ముద్దులు, మురిపాలు సహా! ఇక గాడిద, రేవున్నరోజున బట్టలు రేవులో పడేసాకా, సాయంత్రందాకా ఏటిపట్టున మెయ్యడం, ఏట్లో నీళ్ళు తాగడం. రేవులో పనిలేనిరోజున ఉదయమే వదిలేస్తే ఏటిపట్టున తిని, ఏట్లో నీళ్ళు తాగి ఎండవేళ ఏ చెట్టుకిందో పడుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం. 


కుక్క, గాడిద ఎంత స్వేఛ్ఛ అనుభవిస్తోందో, నేనో పగలూ రాత్రీ ఇంటిదగ్గరే! గాడిద పని ఎంత బాగుందీ అని ఈర్ష్య చెందింది. గాడిద, కుక్కకి ఎంత ముద్దు,మురిపెం, ఇల్లు కదలనివ్వరు, రాజభోగాలు, మరినేనో ఉదయం నుంచి రాత్రిదాకా ఏటిపట్టునే బతుకు, రాత్రికి ఇంటికి చేరడం, తిన్నావా ఉన్నావా అని అడిగే దాతా,దూతా లేరు, ఇదీ బాధ.


రోజులు గడుస్తున్నాయి, ఎవరి మనసులో వారు, మరొకరిపై ద్వేషం పెంచుకున్నారుగాని, పైకి పొక్కనివ్వలేదు. ఒక వేసవిరోజురాత్రి   మడేలు, చాకిత గాలికోసం పెరట్లో మంచాలేసుకుని పడుకున్నారు. కుక్క మడేలు మంచంకింద పడుకుంది. గాడిదను దగ్గరలోనే కట్టేసేరు.


ఓరాత్రి వేళ ఒక దొంగ ఇల్లు దూరుతున్నాడు. కుక్క చూసింది, ముడుచుకు పడుకుంది, మొరగలేదు. గాడిద కుక్కని లేపి మొరగవేం. దొంగ ఇల్లు దూరుతున్నాడు, చూసావుగా అంది. దానికి కుక్క, ఉదయమే నాలుగు మెతుకులు పడేస్తాడు,మధ్యాహ్నం మరికొంచం పెడతారు. రాత్రికి కూడు పెట్టరు. ఆకలి కడుపుతో కాపలా కాయాలి. నీకేం ఏటిపట్టున కావలసినంత తింటావు, ఇంటికొచ్చి పడుకుంటావ్, నాలుగు మూటలు మొయ్యడం పెద్ద పనా? అడిగింది కుక్క. నీకేం కావలసినంత స్వేఛ్ఛ. బయట కావలసింది తింటావ్, ఏట్లో నీళ్ళు తాగుతావ్, చింతచెట్టుకింద పడుకుని నిద్దరోతావ్, అని దెప్పింది.


దానికి గాడిద ఉదయమే నీకు పిలిచి మరీ చద్దిబువ్వ పెడుతుంది, చాకిత. మధ్యాహ్నం మడేలు తిన్నదే నువ్వూ తింటావు, మడేలు మంచం కిందే పడుకుంటావ్, నువ్వు పడిపోతున్న కష్టం ఏంటబ్బా! నిలదీసింది గాడిద. నేను మొరగను, మడేలుని హెచ్చరించను,నువ్వేమనుకున్నా మరేం బాధ లేదు, తెగేసి చెప్పేసింది, కుక్క.  


దానికి గాడిద, నువ్వు తప్పుచేస్తున్నావు,యజమానికి ద్రోహం చేస్తున్నావు, సహించలేనని, గట్టిగా ఓండ్ర పెట్టింది. నిద్రా భంగమైన మడేలు, చాకిత లేచేరు,చూసారు, ఏమీ తేడా కనపడలేదు, తిని పడుకుందిగా, ఏందుకు ఓండ్ర పెట్టినట్టు అని చికాకుపడి, పక్కనే ఉన్న కఱ్ఱతో గాడిద వీపుమీద కఱ్ఱ తిరగేసాడు. ఈ హడావుడిలో దొంగ పారిపోయాడు. గాడిద మీద కఱ్ఱ తిరగేసిన తరవాత మడేలు ఇంటివైపు చూస్తే తలుపులు తీసి ఉన్నాయి, దొంగ ఇల్లు దూరినట్టున్నాడని, ఇల్లు వెతుక్కుంటే, చక్కబెట్టుకోవలసినవి చక్కబెట్టుకునే దొంగ పారిపోయాడని తేలింది. అప్పుడు ఆయ్యో! గాడిదను అనవసరంగా చెయిచేసుకున్నానే అని మడేలు బాధ పడ్డాడు, ఉపయోగమే లేకపోయింది. కుక్క చక్కగా మంచంకిందే పడుకుంది, కదలక మెదలక. 


అయ్యో! ఉపకారం చేయబోయి దెబ్బలు తిన్నానే అని గాడిద విచారించింది, తనలో.


కత చిన్నదే కాని నేర్చుకోవలసినదెంతేనా ఉంది.


1.ఒకరిపని పరిధిలో జోక్యం చేసుకోకు.పరాధికారము పైన వేసుకొనరాదు.

2.మరొకరిని చూసి ఈర్ష్య పడకు.

3.ఎవరి పని వారిదే, ఎవరి పనిలో కష్టసుఖాలు వారివే.నేను కష్టపడిపోతున్నాను, ఎదుటివారంతా సుఖపడుతునారనుకోకు.

4.తొందరపాటు పనికిరాదు.

5.చేతులు కాలేకా ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. జరగవలసిన నష్టం జరిగిపోతుంది. 

6.పని అవసరాన్ని బట్టి యజమాని ఉద్యోగులను నియమిస్తూ ఉంటాడు.

7.యజమాని తెలివితక్కువ వాడనుకోకు.

8.యజమానికి నష్టం కలగజేస్తే నీవూ నష్టపోతావు, గుర్తుంచుకో!


7, అక్టోబర్ 2022, శుక్రవారం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.

 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.


పులి బంగారం రంగులో ఉండి,ఆపై నల్ల మచ్చలుంటాయా? నల్ల ఒంటి మీద బంగారపు మచ్చలుంటాయా? తేలలేదు. కాని అందరూ నల్లమచ్చలే ఉంటాయంటారు. పులిని చూస్తే భయం, రాజసం అందుకు అడవిలో జంతువులంతా అణిగిమణిగి ఉంటాయి. ఇది చూసిన నక్కకి కన్నుకుట్టింది. ఎలాగైనా తానూ పులిలా కావాలనుకుంది.   మార్గం ఏంటీ? అలోచించింది. ఒంటి మీద మచ్చలు వేసుకుంటే తానూ పులిలాగే ఉంటాననుకుంది.ఒంటి మీద మచ్చలు శాశ్వతం కావాలంటే, ఆలోచించింది,అట్లకాడ కాల్పించి   మచ్చలేయించికుంది,వాతలు పెట్టించుకుని , బాధ సహిస్తూ. ఒంటి మీద మచ్చలొచ్చాయి గాని తోటి నక్కలు చూసి అసహ్యించుకున్నాయి, ఇప్పుడు తాను అటు పులీ కాదు, ఇటు నక్కాకాదు . రెండికీ చెడ్డ రేడు అయింది.                            

మరో చిన్నకత, విష్ణుశర్మ పంచతంత్రంలోది.

ఒక పోతరించిన నక్క, అడవిపక్క గ్రామంలో కొచ్చింది.ఒక కోడిని తరిమింది  . ఆ కోడి ఒక సాలీల ఇంట్లో దూరింది. తరుముకు వెళుతున్న నక్క చూసుకోక, సాలివాడు బట్టలకి వేద్దామని కలిపి ఉంచిన నీలి రంగులో పడింది.ఒళ్ళంతా నీలి రంగు పట్టేసింది. కోడి దొరకలేదు, ఈ సందడిలో అది పారిపోయింది. అలాగే అడవికొచ్చిన నక్కని చూసి జంతువులు భయపడ్డాయి. వెళ్ళి పులికి చెప్పేయి, ఏదో భయంకరమైన జంతువు అడవిలో తిరుగుతోందని, అది చాలా కౄరమైనదని, రకరకాల కతలు , పులిని భయపెట్టేయి. పులి కూడా చూసీ చూడనట్టు ఉండిపోయింది. నీలినక్క ఎవరితో పలకలేదు, మాటలేదు. దీనితో ఆ జంతువు నక్కేనని గుర్తించలేకపోయాయి, జంతువులన్నీ. కాలం గడిచింది, ఓ రోజు వర్షం వస్తే ఆ వర్షంలో తడిసిన నీలి నక్క ఒంటిమీద రంగు కరిగింది కొంత, వికారంగా తయారయింది. ఇది చూసిన తోటినక్కలు గుసగుసలు పోయాయి. ఇంతలో పున్నమి వచ్చింది, తోటి నక్కలన్నీ సభచేసి గొంతెత్తి ఊళలు పెట్టాయి. నీలినక్క కూడా ఆనందం పట్టలేక గొంతెత్తి ఊళపెట్టింది. దానితో ఇది నక్కేనని తెలిసిపోయి, తోటి నక్కలు తిట్టేయి, ఇది తెలిసి పులొచ్చి ఒక్క పెట్టు పెట్టింది, పోతరించిన నక్క కత సమాప్తం.


పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా రవీoద్రనాథ ఠాకూర్ అంతవారవుతారా?


పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా ప్రధాని అవుతారా?


పెద్దతెల్లగడ్డం కాకపోతే నల్లగడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?


పోనీ మల్టీ కలర్ గడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?


పాదయాత్ర చేసినవాళ్ళంతా 

ముఖ్యమంత్రులయ్యారు. నడవనివాళ్ళూ ముఖ్యమంత్రులయ్యారు.


పాదయాత్రవాళ్ళంతా ముఖ్యమంత్రులవుతారా?


రథయాత్రలు చేసినవాళ్ళు ప్రధాని అయ్యారా?

రథయాత్రచేస్తే ప్రధాని అవుతారా? 


గొప్పవారి పేరుకు దగ్గరగా మనం పేరు పెట్టుకున్నంతలో వారి గొప్ప మనకొస్తుందా?


పెద్దవాళ్ళని తిట్టినవాళ్ళంతా మేధావులైపోతారా?


మేధావులంతా పెద్దవాళ్ళని తిడతారా?


పులినిజూసి నక్క వాతలు పెట్టుకోడం అంటే ఇదేనా?


ఏంటో సమాధానం లేని ప్రశ్నలు 

5, అక్టోబర్ 2022, బుధవారం

అత్యవసర ద్వారము./EMERGENCY.

అత్యవసర ద్వారము. EMERGENCY.


 ఎల్లరకు

విజయదశమి శుభకామనలు



అత్యవసర ద్వారము.

                                   అత్యావసర ద్వారము.

అత్యవసర ద్వారము.
అత్యావసర ద్వారము.
అసలు మాటేదీ? 

4, అక్టోబర్ 2022, మంగళవారం

సిరిఅబ్బదు చీడబ్బినట్టు

 సిరిఅబ్బదు చీడబ్బినట్టు, ఇదో నానుడి.

 మంచి అలవాట్లు కావడం కష్టం, కాని చెడు అలవాట్లు తొందరగా అవుతాయంటారు, ఇదీ పెద్దలమాట.


సిరి అంటే లక్ష్మి, మనవారు లక్ష్ములని ఎనిమిదిగా చెప్పారు. ఆధునికులు మరో అడుగు ముందుకేసి, పెళ్ళాం పిల్లలు చెప్పిన మాట వినేవారైతే సిరి,ఇంట్లో ఉన్నవాళ్ళంతా కలసి భోజనం చెయ్యడం సిరి, తల్లితండ్రులతో కలసి ఉండడం సిరి అని ఇంకా ఏవో చెప్పేరు, ఇదంతా మా వాట్సాప్ యూనివర్సిటీ విజ్ఞానం :)


ఇలా మంచి అలవాట్లు కావడం కష్టం చెడు అలవాట్లు కావడం చాలా సులభం, అన్నది, పెద్దల మాట. 


కుండలో,రాగిపాత్రలో,ఇత్తడిపాత్రలో వండుకోండి. గంజివార్చండి, వార్చిన గంజి పారబోయక అన్నంలో కలుపుకు తినండి.అతివేడిగా, అతి చల్లగా ఆహారం తీసుకోకండి, వండుకున్న అన్నం ఉమ్మగిలనివ్వండి,ఉమ్మగిలడం అంటే సాధారణ ఉష్ణోగ్రతకు చేరడం, ఇలా కావాలంటే అన్నం వండుకున్నతరవాత దానిని కలియబెట్టి ఆరనివ్వడమే. ఇలా ఆరనిస్తే కార్బోహైడ్రేట్లలో మార్పు జరిగి, వరిఅన్నపు గ్లైసిమిక్స్ ఇండెక్స్ తగ్గుతుందిట. దంపుడు బియ్యపు అన్నం మంచిది,కాని డబుల్ పాలిష్ బియ్యమే తింటున్నాం. సనాతనమైనది కాదనుకుని, తాతతండ్రులు తిన్నదాన్ని నిరసిస్తూ పురోభివృద్ధి సాధించామా లేదా?కుండ,రాగిపాత్ర,ఇత్తడి పాత్రలలో వండుకోడం అనాగరికమని అల్యూమినియం బొచ్చల్లో వండుకుంటున్నామా లేదా? నాగరికతంటే ఇదేకదా అని అడుగుతున్నాం కూడా! 


ఈ మధ్య ఒక అంతర్జాతీయ సదస్సులో ఒక శాస్త్రవేత్త ఆఫ్రికా ఖండం వాడు, నీరుల్లిపాయ సుగర్ ని అదుపులో ఉంచుతుందన్నారు,మెట్ఫార్మిన్ తో కలిపితీసుకుంటే . మిగిలిన ఆధునికులు ఈ మాటమీద ఇంకా దీనిపై పరిశోధన జరగాలని విషయాన్ని బుట్టదాఖలా చేసేసారు.  


నాకైతే ఒకమాటనిపించింది. భారతదేశంలో ఉల్లివాడకం ఎక్కువకదా! మరిక్కడ ఇన్ని సుగర్ కేస్ లూ ఎందుకున్నట్టు? ఇదిగదా కొచ్చను :)


మనం తీసుకునే ఆహారంలో రకరకాల ఆహార పదర్ధాలుంటాయి. అన్నిటికి ఒకటే జి.ఐ  (G.I )ఉండదు, ఎక్కువ తక్కువలుంటాయి. వీటిని కలిపితీసుకున్నపుడు జి.ఐ తగ్గుతుంది, అది 50 కి లోపు ఉంటే మంచిదే, దానికంటే ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర శాతం తొందరగా పెరుగుతుంది. ఇక పచ్చిఉల్లి జి.ఐ 10, అదే ఉడికిస్తే అది కాస్తా 40 అయి ఊరుకుంటుంది. మనకు పచ్చి ఉల్లిని తినడమూ అలవాటే కాని ఈ  మధ్యనే ఈ అలవాటు తప్పించుకుంటున్నాము. పచ్చి ఉల్లిని ఆహారంలో తీసుకుంటే మొత్త జి.ఐ తగ్గుతుంది, మందులు, సమర్ధవంతంగా పనీ చేస్తాయనుకుంటున్నా! పచ్చి ఉల్లి తినిచూస్తే పోయిందేంలేదు.పంజాబీలు రోటీతో ఒక పెద్ద ఉల్లిపాయ,ఒకపచ్చిమిరపకాయ కూడా తింటారనుకుంటా. 


ఇక ఈ మధ్యనే ఒకదేశి డాక్టరమ్మ,అలోపతి డాక్టరమ్మే  చద్దన్నం తినండి అన్నారు, శాబాసో! అనుకున్నా, ఆ తరవాతే చెప్పిందా తల్లి, నిన్నరాత్రి మిగిలిన అన్నం ఫ్రిజ్ లో పెట్టుకుని మర్నాడు ఉదయం తినమన్నారు. అన్నం ఉడికిన తరవాత దానిని ఫ్రిజ్ లో పెట్టి ఉంచి చల్లబడ్డ తరవాత మళ్ళీ వేడి చేసుకు తినండీ, అని. అసలే కుక్కర్లో వండిన వాటిలో పోషక విలువలు చస్తున్నాయంటున్నారు, ఇక ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్ళీ వేడి చేసి తింటే అసలు పోషక విలువలుంటాయా? నా ఉద్దేశం ఈ అలవాటు మాత్రం చాలా తొందరగానే అందరిని చేరచ్చు అనుకుంటున్నా!


1, అక్టోబర్ 2022, శనివారం

మొండివాడు రాజుకంటే బలవంతుడు.

  మొండివాడు రాజుకంటే బలవంతుడు.


ఇది పాతకాలం మాట, కాని నేటికీ వర్తిస్తుంది. ఏం? ఏలా?

రాజుకి కొన్ని నియమాలుంటాయి, అవి దాటితే కౄరుడు అన్నమాట పడిపోతానని, ఇతరులు ఏమనుకుంటారోనని,ప్రజలేమనుకుంటారోనని, భయపడతాడు, ఎంతో కొంత. కాని మొండివాడో? అటువంటి శసభిషలేం ఉండవు. ఎవరేమనుకున్నా ఈ మొండివానికి బాధాలేదు, భయమూ లేదు.తనకి ఎంతతోస్తే అంతే! మరి నేటికాలానికెలా వర్తింపూ అనికదా కొచ్చను :)


నేడు సోషల్ మీడియా అన్నదో కోతికి కొబ్బరికాయ దొరికిన చందమైయింది. వాక్స్వాతంత్ర్యం అన్నది  రాజ్యాంగం

 ప్రసాదించింది,ఇంకేం కావాలి? ఏదైనా అంటాం! ఎవరినైనా అంటాం!! ఇదీ నేటి వరస. సుప్రీం కోర్ట్ కూడా వాక్స్వాతంత్ర్యానికి కూడా హద్దులుంటాయంటోంది. కాని వినేవారే కనపట్టం లేదు. సోషల్ మీడియాలో యుట్యూబ్, ఒక పెద్ద సాధనమయింది. ఏంతోస్తే అదే షూట్ చేసి పెట్టెయ్యడమే! బాధితులు కొంతకాలం సహిస్తారు. అందరూ సహించరుగా!! కోర్టే కినుక వహిస్తే జైల్లో పారేస్తే, ప్రభుత్వం ఉద్యోగం పీకేస్తే, నిరాహారదీక్ష... 


దీనికితోడు మరోటి, గాంధీగారు చచ్చి ఏలోకాన్న ఉన్నాడోగాని, దేశం లో అలవాటు చేసినది మరొకటి నిరాహారదీక్ష. సరే ఇందులో రకాలనుకోండి. ఇక నిరవధిక నిరాహారదీక్ష. దాని అర్ధమైనా తెలుసునో లేదో, చేసేవారికి, తెలియదు. ఆపై దీని గురించి మీడియావారి హడావుడి, ఇక చెప్పేదేముంది? అసలే కోతి, కల్లు తాగింది,ముల్లు గుచ్చుకుంది, దయ్యం పట్టింది, మరేం కావాలి? 


మొండివాడు రాజుకంటే బలవంతుడు కాదా?  

29, సెప్టెంబర్ 2022, గురువారం

చెఱపకురా చెడేవు.

 చెఱపకురా చెడేవు.


ఎవరికీ చెడ్డకోరకూడదు. అదే మనకు తిరిగొస్తుందంటారు. 

"చేసిన ర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట" తత్త్వం, తెలిసి చేసినా తెలియక చేసినా, నిప్పులో చెయ్యి పెడితే కాలి తీరుతుంది కదా! అంతే మరి, చెడ్డ చేస్తే ఫలితమూ చెడ్డగానే ఉంటుంది. చెడు ఎలా చేస్తాం? ఎలా చేస్తామో చెబుతుందీ శ్లోకం,

కరచరణ కృతంవా
మనోవాక్కాయజం వా చ
తవాపరాధం క్షమస్వ
మహా దేవ దేవ శంభో!
కాళ్ళూ చేతులతో, మనసు,వాక్కు, కర్మలతో చేసే సర్వ అపరాధాలనీ క్షమించమని వేడుకోలు. వేడుకున్నంతలో ఫలితం ఉండదు, ప్రతిఫలమూ తప్పదు. అందుకే మనవాళ్ళు "ఎప్పుడు చేసిన కర్మో! ఇప్పుడిలా కట్టికుడుపుతోంద"ంటారు.మరో మాట కూడా చెబుతారు, "నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలం అనుభవిస్తావ"ని. "Karma returns" today saying.  అబ్బే! జాంతానై! గురువూ నై!! దేవుడూ నై!!!,నేటి మాట అస్తు! అస్తు!!


చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు.


చెట్టు పాడవడాన్ని "పుల్ల విరిగింద"ంటాo, మా పల్లెటూరీ భాషలో. చెట్టు కాని, పాదుకాని కాపు పూర్తయి, ఇక ముందు కాయదు అనడానికి సంకేతంగాను, ఇక ముందు చనిపోతుందని సంకేతంగా  ఇటువంటి పిందెలు దిగుతాయి. వీటిని కుక్కమూతి పిందెలంటారు. ఇలాగే మనుషుల్లో కూడా, పిదపకాలపు బుద్ధులు పుడతారంటారు. 


25, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.

 ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.




సాధారణంగా ఉట్టి ఎత్తుగానే కడతారు. రోజూ వాడుకునేదైతే కొంచం తక్కువ ఎత్తులో అంటే ఆ ఇంటి ఇల్లాలు నిలబడి చేతులెత్తితే అందేలా కట్టుకుంటారు. ఇందులో పాలు,పెరుగు దాచుకుంటారు, పిల్లి నుంచి రక్షించుకోడానికి.

ఇక స్వర్గమన్నది ఉందో లేదో తెలీదు, ఉంటే ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపుతారు, ఎంత దూరమంటే తెలీదు.ఎగిరి వెళితే ఎంత కాలం పడుతుందంటే తెలీదు. ఇటువంటి ఏమీ తెలియని స్వర్గానికి, నిలబడి చేతులెత్తి ఉట్టి అందుకో లేని ఇల్లాలు, ఎగిరి వెళ్ళిపోతానందిట, ఆంటే హాస్యాస్పదంగా ఉందని అంటారు గిరీశం భాషలో గోతాలు కొయ్యడం. 


ఇదే మరోలా కూడా చెబుతారు, కూచుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెళతానంది, అని. 


ఒక అత్తా ,కోడలు. అత్త ముసలిదై కూచుంటే లేవలేక లేస్తే కూచో లేక తిప్పలు పడుతోంది. నడుం ఒంగిపోవడంతో తిన్నగా నిలబడలేక, నడవలేక ఉన్నది, లేస్తే ఒంగుని నడుస్తుంది,కఱ్ఱపోటుతో.

 ఒక రోజు కోడలితో తీర్థం వెళతానంది. అత్తా! కూచుంటే లేవలేకున్నారు, ఎలా వెళ్ళగలరు తీర్థానికి? అక్కడ జన సమ్మర్దం, తోసుకుంటారు, మీకంత ఓపిక ఉందా? నడవగలరా? అడిగింది. దానికి అత్త, కూచుని లేవలేకపోవచ్చుగాని , ఒంగుని నడిచి తీర్థం వెళతానూ అందిట. విన్న కోడలు ముసి ముసి నవ్వులు నవ్వుకుందిట, పగలబడి నవ్వలేదు? ఎందుకూ?   



పంచాయతి ప్రెసిడెంట్ గా నెగ్గలేనివాడు ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తానన్నట్టు.

ఇవి రెండూ తెనుగునాట చెప్పుకునే నానుడిలే సుమా!

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

 విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

Continuation of

 https://kasthephali.blogspot.com/2022/09/2024-1.html

విపక్షం నుంచి ఏ ఒక్క పార్టీ బిజెపిని ఒంటరిగా దేశం మొత్తం మీద ఎదుర్కోగల స్థాయిలో లేదు. ఆర్జెడి నేత "కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీరుపోటీ చేయండి, స్థానిక పార్టీలు బలంగా ఉన్నచోట వాటిని బలపరచండి" అని సూచించారు, దానికి కాంగ్రెస్ వారిచ్చిన సమాధానం " మేమింకా బలహిన పడదలుచుకోలేదని" పురిటిలోనే సంధికొడుతుంటే పొత్తులెక్కడా? అనేదే  సందేహం. 


ప్రధాని పదవికి పోటీ పడాలని అనుకునేవారు ఈ కిందివారని ప్రజలమాట, మీడియా మాట.

రాహుల్ గాంధి: వీరి పార్టీకి స్థానిక పార్టీలకి చుక్కెదురు, అన్ని రాష్ట్రాలలోనూ. పాలనానుభవం శూన్యం, కనీసం పంచాయతి ప్రెశిడెంట్ గా కూడా పని చేసిన అనుభవం లేదు. పైనుండి చెప్పడం వేరు, పని చేయడం వేరు. ఇది వీరికి పెద్ద మైనస్ పాయింటే. ఎత్తుచేతివారి బిడ్డ గనక పాలనానుభవం పుట్టుకతోనే వచ్చేస్తుందనేవారూ లేకపోలేదు. ఇతనికి సమయం సందర్భం తెలిసిమాటాడే అలవాటు పూజ్యం అని అంటారు. విపక్షంలో కాకలు తీరిన యోధులున్నారు, పాలనానుభం కొల్లలుగా ఉన్నవారున్నారు. ఇతనిని ప్రధానిగా ఒప్పుకోగలరా అన్నది, పెద్ద ప్రశ్న.మరొకరిని వీరి పార్టీ నుంచి ఎన్నుకునే సావకాశం చెప్పలేనిదే!వీరికి రాగల సీట్లు 50. శత్రువులెక్కువ. 


మమత: వీరు బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి బెంగాల్లో తప్పించి మరో రాష్ట్రంలో పలుకుబడి లేదు. బెంగాల్ దాటి వీరి ప్రభ లేదు,సామాన్యులెవరికి తెలియనివారే! తృణమూల్ పార్టీకి, కాంగ్రెస్ కి, సి.పి.ఎమ్ లు రాష్ట్రంలో ప్రత్యర్థులు.  బెంగాల్లో ఎక్కువలో ఎక్కువ  వీరికి 20 సీట్లకంటే వచ్చే సావకాశం లేదు. మరొక పార్టీకి అదే తమిల్నాడులో డి.ఎమ్.కె కి మాత్రం వీరితో సమానంగా సీట్లు వచ్చే సావకాశం.మమత తాము,అఖిలేష్, ఝర్ఖండ్ వారు ఒక జట్టని ప్రకటించారు. వీరికి రాబోయే సీట్లు 20.


నితీష్: వీరు బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం నుంచే ఉన్నారు. పాలనానుభవం దండిగా ఉన్నవారే!ఇప్పటికే చాలా సార్లు తమపార్టీని కాంగ్రెస్ నుంచి, బి.జె.పి కి మరల ఇటునుంచి అటు కప్పగంతులు వేసి అధికారం నిలబెట్టుకున్నారనే అపప్రథ ఉన్నది. ఇప్పుడైతే ఎన్నికల తరవాత మళ్ళీ బి.జె.పి లోకి గెంతరనే నమ్మకం ఎక్కువమందికి లేదు.అంతేగాక వీరు బి.జె.పి తరఫున పనిచేస్తూ కాంగ్రెస్ వైపుకొచ్చారు, గూఢచారిగా అనే మాట కూడా వినపడుతోంది. వీరికి బీహార్లో తప్పించి మరో రాష్ట్రంలో పట్టులేదు.  నితీష్ ఉ.ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నేటి వార్త. వీరికి ఉ.ప్ర లో పట్టులేదు, కాని వీరికి ఉ.ప్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ తన సీటు ఫూల్పూర్ వీరి పోటికి త్యాగం చేయబోతున్నట్టు వార్త.నితీష్, బాబోయ్! నేనసలు విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ లో ఉన్నానని చెప్పలేదు మొర్రో! అని మీడియా ముందు గోల. వీరికి అందరూ మిత్రులే అలాగే అందరూ శత్రువులే!!! వీరికి రాబోయే సీట్లు 6.


శరద్ పవార్: వయసు మీద బడింది,ఆరోగ్యమూ సరిలేదు, వీరు కేంద్ర మంత్రిగానూ ఉన్నారు, మరాఠా చాణుక్యుడంటారు. వీరికి మహరాష్ట్రలో ఓ చెంపనే బలముంది,మరే రాష్ట్రంలోనూ చెప్పుకోతగ్గ బలం లేదు.  వీరికి రాబోయే సీట్లు 6 కి పెరగవు.  వీరికి కొత్త మిత్రులు పాత శత్రువులు ఒకటే! ఎవరితోనైనా కలసిపోతారు, తమ పని ముఖ్యం,అంతే.


 అఖిలేష్ యాదవ్ : ఉ.ప్ర. కి ఉన్న సీట్లు 80. వీరికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.హిందీ రాష్ట్రాలలో కూడా వీరికి పట్టులేదు, తమ రాష్ట్రం తప్పించి. వీరికి బి.ఎస్.పి కి కుదరదు.  వీరికి రాగల సీట్లు ఇరవైలోపే.ప్రధాని కావాలనే కోరిక ఎక్కడా వెలిబుచ్చినట్లు లేదు.


కేజ్రివాల్: వీరినంతా క్రేజివాల్ అంటారు,అదేమో మరి. వీరు ఢిల్లీ లోనూ పంజాబ్ లోనూ అధికారంలో ఉన్నారు. రేపు హిమాచల్ లోనూ గుజరాత్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామంటున్నారు. వీరికి కాంగ్రెస్ అంటే చుక్కెదురు. మేము అప్పుడే బి.జె.పి వ్యతిరేక ఫ్రంటులో చేరమని ప్రకటించారు. అంటే  తటస్థంగా ఉండి, ఎక్కువ లాభం పొందాలని ఆశ, దురాశ కాకుంటే మంచిదేనేమో!. 


ఇక దక్షణాది కొస్తే, ఇక్కడ్నుంచి ప్రధాని అయ్యే సావకాశాలే తక్కువ.మొత్తం దక్షణాది రాష్ట్రాలలో సీట్లు అన్నీ కలిపి ఆంధ్ర25+తెలంగాణా17+తమిల్నాడు39+కేరళా20+కర్నాటక28=129.ఇక్కడినుంచి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతూ మోడీ ని దించేస్తాం, ఆ తరవాత మాదే ప్రభుత్వం అంటున్న కె.సి.ఆర్ అనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రథములు.పోనీ ఈ దక్షణాదివారంతా ఒక మాట మీదుంటారా అంటే సాధ్యం కానిదే! వీరికి కాంగ్రెస్ కీ కుదరదు. వారున్నచోట వీరుండరు. కాంగ్రెసేతర,బిజెపియేతర ప్రతిపక్షపార్టీలకూటమా? ఇదివరలో చాలా ప్రయత్నాలే జరిగాయి, కాని ఏదీ బతికి బట్టకట్టలేదు.కొత్త పార్టీ స్థాపనా? ఎమో చూడాలి.ఒక రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో నెగ్గుకురాగలగినవారు ఎన్.టి.ఆర్ మాత్రమే! దేశం మొత్తం మీద కొత్త పార్టీ పెట్టి ఆశయాలు చెప్పి అన్ని రాష్ట్రాలలో ఒప్పించగల కార్యకర్తలు, మంది, మార్బలం సమకూర్చుకోవడం తేలికా, రెండేళ్ళలో సాధ్యమా? అభిమానులు జరుగుతుందంటే విని ఆనందించచ్చు.కాని ఇది నిజానికి దూరమేమో! అన్ని పార్టీలు ఎక్కడివారక్కడ పోటీ చేసి ఎన్నికలయ్యాక పొత్తులు కుదుర్చుకుంటాం అంటే ప్రజలు నమ్ముతారా? 


కెసిఆర్: వీరి పార్టీ తెలంగాణా లో పదేళ్ళుగా పాలనలో ఉంది. తెలంగాణాలో పట్టున్నది. కాని రాష్ట్రం దాటి వీరి మాట వినేవారెవరనేది పెద్ద ప్రశ్న.కొత్త పార్టి పెడుతున్నా! ఖబడ్దార్ అని గర్జిస్తున్న మాట నిజం. వీరి రాష్ట్రం లో మొత్తం సీట్లు 17 కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ స్థానాన్ని బి.జె.పి ఆక్రమిస్తున్నందుకే వీరి గర్జనలని విజ్ఞుల మాట. వీరికి మహా ఐతే 10 సీట్లు రావచ్చు. వీరికి కాంగ్రెస్ కి పొత్తు లేదు. వారి నీడ కూడా పడటానికి ఇష్టపడని వీరు కాంగ్రెస్ లేక కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా?వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 

చంద్రబాబునాయుడు: తెలుగుదేశం పార్టి బిజెపితో అంటకాగి YSR CP వేసిన ఎత్తుకు చిత్తయి,బిజెపితో కటీఫ్ చేసుకున్నారు,ప్రభుత్వం నుంచీ బయటికొచ్చారు. దీనికీ ఎవరూ తప్పుపట్టాలేదు. కాని, బద్ధ వ్యతిరేకి ఐన కాంగ్రెస్ తో 2019 లో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నంతో ప్రజలు తిరస్కరించారు. అప్పటినుంచి,ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారానికి దూరమై ఉన్నవారు.నలభై ఏళ్ళ పాలనానుభవం, రాజకీయానుభవం పనిచేయలేదు.వీరికి రాష్ట్రంలో పది సీట్లురావచ్చు.మరో రాష్ట్రంలో పట్టులేదు.పట్టుందని ప్రయత్నించిన కర్ణాటకలో ఎదురు దెబ్బే తగిలింది. వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 


కమ్యూనిస్టులు:అంతర్జాతీయ పార్టీ మాదని చెప్పుకునే వీరు దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు. బెంగాల్ లో తృణమూల్ దెబ్బకి మట్టికరిచి మరి తేరుకోలేకపోయారు. ఇక వీరికి పట్టున్న మరోచోటు కేరళా, కాని ఇది కూడా కుటుంబ పార్టీ ఐపోతోందంటున్నారు. చారిత్రిక తప్పిదాలు చేయడం వీరి అలవాటు. మరెక్కడా ఉనికి ఉన్నట్టు లేదు. కేరళాలోనే వీరికి రాగల సీట్లు 10.


1962 లో మొదటి సారి ఓటేసిన వాడిని, నాటినుంచి ఎన్నికలు చూస్తున్నవాడిని,రాజకీయనాయకులతో,

రాజకీయపార్టీలతో సన్నిహితంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిపినవాడిని. ఆరోజుల్లో కూడా కాంగ్రెస్ నీ గద్దె దించేస్తామన్న వారే అందరూ, కాని ఆ పార్టీ చిత్తు కావడానికి దగ్గరగా ఏభై ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం మూలంగానే!స్వాతంత్ర్యం తరవాత పాలూ తేనెలు ఈ పార్టీ దేశంలో ప్రవహించేస్తుందని నమ్మి మా తాతలు ఆస్థులు తెగనమ్మి ఈ పార్టీని బతికించారు, మమ్మల్ని వీధులపాలూ చేశారు. 

అంతర్గత ప్రజాస్వామ్యం తో దేశప్రజల ఆకాంక్షలు తీర్చగల మరో పార్టీ ఉండటం మంచిదే! అటువంటి పార్టీని నిర్మాణం చేస్తే ఆనందమే.స్వార్ధమే, పరమావధిగానూ, ద్వేషమే ఊపిరితో బతికే పార్టీలు ఏమి చేయగలవన్నదే ప్రశ్న.

పై చెప్పినవారే కాక వెలుగులోకి రాని వారు చాలామందే ఉన్నారు, అందరూ పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరన్నదే ప్రశ్న.

  అనుకున్నట్టే కాక ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయని ఊహిస్తూ అంచనా

CON60+TMC 25+DMK25+NCP10+AAP10+SP 20+RJD 20+TDP10+TRS10 +CPM10 Total 200 small parties say 30.Now the total is 230 along with congress, 170 without congress. It is difficult to understand how a governemt can be formed at centre. 

ఇందులోనే, ఒకరినీడ మరొకరిపై పడినా సహించలేరు.ఒకరిపై ఒకరికి నమ్మకమూ లేదు వీరికి పొత్తెలా? ప్రజలని ఎలా నమ్మిస్తారు?అటువంటి కూటమికి విదేశీ విధానం ఏమిటి? చాలా ప్రశ్నలకి సమాధానం లేదు.కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారంలో ఉన్నవారితో అంటకాగుతాయి, అది సహజం కూడా. ఎన్నికల తరవాత ఎంతమంది ఈ కూటమిలో ఉంటారో! ఎవరు జారుకుంటారో ఎవరు చెప్పగలరు?

బలవంతంగా వీరంతా కలిసినా అదెంతకాలం? అలా కలపగల వారెవరు? సామాన్యునికి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!


21, సెప్టెంబర్ 2022, బుధవారం

ఎద్దు పుండు కాకికి నొప్పా?

 ఎద్దు పుండు కాకికి నొప్పా?

స్వంతవైద్యం చేసుకోకూడదు. అలాగే ఇంట్లో వారెవరూ వైద్యమూ చేయకూడదు,ఎంత గొప్ప వైద్యులైనా. ఎందుకు? ఇదిగదా మన ప్రశ్న :) సందేహజీవులం కదా!


మొన్న నిమ్స్ డిరెక్టర్ అపోలో లో చేరితే నిమ్స్ లో వైద్యం బూటకం వగైరా అనేశారు. కాని ఆయన అపోలో లో చేరి మంచిపని చేశారు. నిమ్స్ లోనే కనక చేరితే అక్కడ ఆయన రోగిగా గుర్తించబడి వైద్యం జరగదు. ఆయన డైరెక్టర్ గానే గుర్తిస్తారు, అందరూ. ఇది ఎంత చెప్పినా వైద్యులు మిగతా సిబ్బంది మీద ఉంటుంది. ప్రమాద సమయాల్లో నిర్ణయం తీసుకోడానికి వైద్యులు జంకుతారు. అందుకు స్వంతవైద్యమూ పనికిరాదు, స్వంత ఇంటిలో వైద్యుడే ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కావలసినవారికి వైద్యం చేయకూడదు. తెలిసిన వైద్యులెవరూ అలా చేయరు. పెరటిలో మనం చెట్టు వేస్తేనే పెరుగుతుంది, దానికి ఎంతో కొంత దోహదం చేస్తాం, అది సహజవాతావరణం పెరిగినదై ఉండదు,దానిలో కొన్ని సహజ గుణాలు లోపిస్తాయి. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు.


సందేహజీవులం కదా మరో సందేహం ప్రాథమిక చికిత్స చేయవచ్చా? ప్రాథమిక చికిత్స ఎప్పుడు చేస్తారు? ప్రమాదం జరిగినపుడు కదా! ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అత్యవసరం, అది ఎవరైన, ఎవరికైనా చేయచ్చు, ఆ తరవాత అవసరాన్ని బట్టి వైద్యుల దగ్గరకు తీసుకుపోవాలి. 


పెరటి చెట్టు మందుకు పనికిరాదు


యజమాని ఎద్దును కాడి మెడమీద వేసి బండికి, నాగలికి కడతాడు. ఐతే పని చేసేటపుడు ఎద్దు మెడమీద అధికభారం మోపితే పుండు పడుతుంది. యజమాని పుండు పడినా పనికి మలుపుతూనే ఉంటాడు, ఎద్దు ఎత్తుబడిపోయేదాకా! . ఎద్దు మెడ మీదపడ్డ పుండు మీదనే కాకివాలుతుంది, మాంసం పొడుచుకుతినడానికి. ఎద్దు కాకిని తోలుకో లేదు. తోక మెడదాకా అందదు, చెవులాడించినా, అవీ మెడమీద కాకిని బయటికి తోలలేవు, ఎద్దు మెడ ఆడించినా కాకి ఎగిరి మళ్ళీ అక్కడే వాలుతుంది. పాపం ఎద్దు అసహాయం గా కాకితో హింసింపబడుతూ ఉంటుంది. కాకికి బాధేంటి ఎద్దుకుగాని? 


సమాజంలో కాకిలాటి వారుంటారు, ఎద్దులా అసహాయంగా బాధ అనుభవిస్తున్నవారూ ఉంటారు. తస్మాత్ జాగ్రత!!! 


ఎద్దు పుండు కాకికి నొప్పా?