Thursday 30 March 2023

రాముని రాజ్యం-భరతుని పట్టం-1

రాముని  రాజ్యం-భరతుని పట్టం-1 


రామం దశరథం విద్ధి

మాం విద్ధి జనకాత్మజం

అయోధ్యా అటవీం విద్ధి

గఛ్ఛ తాత యధా సుఖం

                                                సుమిత్రా దేవి

రాజ్యం రామునిదే, నాకీ రాజ్యం వద్దు, అన్నవాడు భరతుడు, ఇది నిజం కూడా, కాని ఈ నిజాన్ని నమ్మించడానికి భరతుడు పడ్డపాట్లు తెలుసుకోవలసినవే!    ''రామునిరాజ్యం-భరతుని పట్టం'' అన్నదానిని ''రామరాజ్యం-భరతుని పట్నం'' అని కూడా అంటుంటారు. నిజానికి, రాముని రాజుగా పట్టాభిషేకం చేసినది భరతుడే!!!

***

ఋషులు,మునులు, పౌరులు,జానపదుల అనుమతితో రామునికి యువరాజ పట్టాభిషేకానికి తలపెట్టేడు, దశరథుడు. సంగతి తెలిసిన కైక చాలా ఆనందించింది.  కాని మంథర, దశరథుడు కైకకిచ్చిన వరాలను గుర్తుచేసి, వాటిని కోరి, ''నీకుమారునికి పట్టాభిషేకం చేయించుకో'' అని బోధచేసింది. ఆ మాట తలకెక్కిన కైక 

 వరాలు కోరింది.  రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి, భరతునికి పట్టాభిషేకం చేయాలి. సీతారామ,లక్ష్మణలు నార చీరలుగట్టి అరణ్యవాసానికి వెళ్ళారు, దశరథుడు కైకకిచ్చిన వరాలు అమలు చేయడానికి. రాముని విడచి ఉండలేని దశరథుడు అసువులుబాసాడు. రామలక్ష్మణులు అడవులకు పోయారు, భరత శత్రుఘ్నులు, భరతుని మేనమామ ఇంట ఉన్నారు. దశరథునికి నలుగురు కొడుకులున్నా, చనిపోయేనాటికి ఒక్కరూ దగ్గరలేకపోవడంతో, అంత్యక్రియలు జరుపడానికి, తైలద్రోణిలో వేసి ఉంచారు. 


వశిష్టులు ఇలా కబురు పెట్టారు, భరత,శత్రుఘ్నులకు,"రాజకుమారులు అత్యవసరంగా అయోధ్యలో నెరవేర్చవలసిన కార్యం ఉన్నందున, సత్వరం రావలసింది". కబురందుకున్న భరతుడు మేనమామ,తాతగార్ల అనుమతితో అయోధ్యకు  బయలుదేరాడు.

అయోధ్య చేరిన భరతునికి పట్టణం వెలవెల బోతూ కనపడింది. తిన్నగా తల్లి దగ్గరకు చేరాడు. తండ్రి మరణవార్త తెలిసింది, దానితో సీతారామలక్ష్మణులు అడవులకెళ్ళేరు, వనవాసానికనీ తెలిసింది. పెద్దవార్త తల్లి చెప్పింది, దశరథుని తాను వరాలు కోరినట్టూ, వాటి అమలుకుగాను రాముడు పదునాలుగేళ్ళు వనవాసం వెళ్ళినట్టు, భరతుని  పట్టాభిషేకం చేసుకోమని చెప్పింది.  విన్న భరతుడు హతాశుడయ్యాడు. తల్లిని  తూలనాడాడు, చివరగా తానెప్పుడైనా నవ్వులాటకైనా రాజ్యపాలన చేయాలని అన్నానా!  అని కూడా అడిగాడు.   పట్టాభిషేకం చేసుకోమన్న మంత్రి, పురోహిత,పౌరులకు తామందరం రామునివద్దకు వెళుతున్నామనీ, రాముని వెనక్కు తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపిద్దామనీ చెప్పాడు.

****

అవగాహన:

తన ప్రమేయం లేకనే తనపట్ల నష్టం జరిగిపోయింది. విచలుతుడై తల్లిని తూలనాడినా, నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.

తండ్రి మరణం, నష్టం పూడ్చుకోలేనిది, తండ్రి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేయడం తప్ప.

తన రాజ్య పట్టాభిషేకం, తన ప్రమేయం లేకనే తల్లి నిర్ణయించడం.  తన ప్రమేయం ఆ నిర్ణయంలో లేకపోయినా, అపార్ధం చేసుకునేవాళ్ళు. పెదతల్లులు, అన్న,వదిన,తమ్ముడు, మిగిలినవారు, బంధుకోటి,ప్రజలు. మొదట నష్ట నివారణ చర్యగా మంత్రులకు రాముని దగ్గరకు వెళుతున్నాం, వెనక్కి తీసుకురావడానికి, సిద్ధం చేయమని చెప్పడం.తండ్రికి అంత్య క్రియలు చేయడం.


ఇంకా కలిగిన నష్టాలను భరతుడు ఎలా అధిగమించాడో తరవాత  చూదాం.

**** 

ఆలోచన.

నాటి కాలానికే పార్థివ శరీరాలని పాడవకుండా ఉంచే ప్రక్రియలున్నాయని తెలుస్తోంది.

భరతునికి కబురుపంపినది వశిష్ఠులు, ఇదేమి? గురువులు కబురుపంపండం అనే ఆలోచనే రాలేదెవరికి. అయోధ్యలో జరిగినదేమో భరతునికిగాని అతని మేనమామ,తాతగార్లకూ తెలియదు. కబురు పంపినవిధం విచారణీయం.


భరతుడు తల్లిదగ్గరకు రాగానే తెలిసినవి పిడుగులాటి వార్తలు.తండ్రి మరణం, అన్నదమ్ములు,

వదిన అడవులపాలవడం, రాజ్యభారం వహించమని తల్లి చెప్పడం (తన ఇష్టానికి వ్యతిరేకంగా)ఒక్కసారిగా సంయమనం కోల్పోయేలా చేసాయి భరతుని. ఇంతటికి కారణం తల్లి అని గుర్తించి, తల్లిని తూలనాడేడు. 


జరిగినదానికి విచారించిన భరతుడు కర్తవ్యాన్ని గుర్తించి, తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మంత్రులకు తాము రాముని వెనక్కు తీసుకురావడానికి వెళుతున్నామని, బాటలు ఏర్పాటు చూడమని,సైన్యాన్ని సిద్ధం చేయమని, పట్టపుటేనుగును సిద్ధం చేయమని,తాను రాజ్యభారం వహించటం లేదని, రాముడే రాజ్యాధికారని చెప్పడం జరిగింది, మంత్రులు,పురోహితులు, పౌరజానపదులూ, పట్టాభిషేకం చేసుకోమని చెబుతున్నా.కొద్ది రోజులకితమే ఈ పౌరులే రాముని వెంబడించి అడవులకీ వస్తామన్నావారు. (Public memory short lived, అంటే ఇదేనేమో.)  

******

(విషయం పెద్దది. ఒక టపాలో రాయడం నా వల్ల కాలేదు. అందుకు భాగాలు చేయక తప్పలేదు, మన్నించాలి.  మొదలుపెట్టి చాలాకాలంగా పూర్తి చేయక వదలివేసినది. నేటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈ భాగాన్ని పూర్తి చేయగలిగాను. మిగిలినది పూర్తి చేయాలని కోరిక, ఆపై అమ్మదయ.)

(విషయ సంగ్రహణ: వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం నుంచి. ప్రచురణ:గీతా ప్రెస్)


Friday 24 March 2023

Wednesday 22 March 2023

ఉగాది శుభకామనలు.

శ్రీ మాత్రేనమః



నమః శంభవే చ మయోభవే చ

నమః శంకరాయ చ మయస్కరాయ చ

నమః శివాయ చ శివతరాయ చ 

***

 తిట్టినవారికి,దీవించినవారికి;

 శత్రువులకు,మిత్రులకు;

అనామకులకు,అనామకంగా చరిస్తున్న నామకులకు

 పెద్దలకు,పెద్దమనసున్నవారికి;

అభిమానులకు,వీరాభిమానులకు  

ఎల్లరకు

 శోభకృతు 

నామ సంవత్సర 

ఉగాది శుభకామనలు.


అమ్మలకు వందనం,  ఉగాది శుభకామనలు.

పిన్నలకు దీవెనలు,  ఉగాది శుభకామనలు. 

శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి 

శతమేన మేన శతాత్మానంభవతి  శతమనంతం భవతి 

    శతమైశ్వర్యం భవతి  శతం దీర్ఘమాహుః మరుతయేనా వర్ధయంతి.

దీర్ఘాయుష్మాన్భవ  


అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతంగమయ.

ఓం శాంతి శాంతి శాంతిః

సర్వేజనాః సుఖినో భవన్తు.



శోభకృత్ శోభను కలగజేస్తుంది. ఈ రోజు మార్చి 22 ప్రత్యేకమైనరోజే!  రోజూ సూర్యుని ఉదయమే గమనిస్తే ఈ రోజు మార్చ్ 21/22 భూమద్యరేఖమీద ఉంటాడు. రాత్రి పగలు సమానంగా ఉండే రోజు. 


వేచి వీడియో పూర్తిగా చూడండి.   

*** 

Wednesday 15 March 2023

కత వెనకకత

 కథ వెనకకత

తిక్కమొగుడుతో తీర్థమెళితే..... కథ రాయాలనుకున్నా! దీనికి పూర్వకథేం లేదు, అనుశ్రుతంగా చెప్పుకునీదిన్నీ. రాయడం మొదలెట్టా. ఎంతసేపు రాసినా తీర్థంలో తిప్పడం సరిపోయింది తప్ప, కత చదివించేలా అనిపించలా! మూడు నాలుగు రోజులు, నాలుగైదుసార్లు రాసి చెరిపేను, నచ్చక. చిరాకొచ్చి వదిలేసేను,మనసు మరల్చేను, బుఱ్ఱలో పురుగు తొలుస్తూనే ఉంది. ఒకరోజు ఉదయం నడుస్తుండగా ఒక మెరుపు ఆలోచనొచ్చింది. తీర్థంలో పిల్లలు తప్పిపోకుండేందుకు వారికి కనపడ్డానికి, పిల్లల్ని మెడలమీద ఎక్కించుకోవడం గుర్తొచ్చింది. ఆ! కొస దొరికిందని సంబరపడి కత మొదలెట్టి రాసా! పెద్దగా రాలేదు, అంత అందగించనూ లేదు. ఏం చెయ్యాలీ? ఆ రోజులనాటికి తిక్కపనులనిపించినవాటిని చొప్పించాలనుకున్నా! తాహతుకి మించి కర్చు, గూటి పడవ, మంది మార్బలం, ఇలా పెంచేను. ఇంతచేసేం కదా! మనకి తెలిసిన తీర్థం, పట్టిసీమను చొప్పిస్తే, శివరాత్రికి

 కత పూర్తిచేస్తే, అక్కడ జరిగే వేద సభను జొనిపిస్తే, అలా జరిగిపోయి, తీర్థంలో పెళ్ళాం అలసిపోతే భుజాలమీద ఎక్కింపజేసి,   గూటిపడవలో పడుకోబెట్టించి,

 కత పూర్తి చేసేను. కాని అసంపూర్తి అనిపించింది. ఈలోగా ఆ అసంపూర్తి కతని ఒక మందస్మితవదనారవిందసుందరి చదివి కత బాగుంది ఐపోయిందా? అడిగింది. నేననుకున్నట్టే అనుకుందే అనుకుని పూర్తి చెయ్యాలన్నా!


తీర్థంలో పెళ్ళాన్ని ఎత్తుకుంటే తీర్థంలో వాళ్ళు చూస్తారు, వీడెవడెవడురా! తిక్కమొగుడు అనుకుంటారు, అంతతో సరికదా! ఊళ్ళో వాళ్ళనుకుంటే కదా ఇదొకనానుడయ్యేది. అందుకు కతలో చిన్న మార్పు, కొండమీద జరిగిన, తీర్థంలో జరిగిన విషయాలు ఊళ్ళోకి, తీర్థానికొచ్చిన ఊరివాళ్ళు ఊరికి చేరేసినట్టు మార్చి, ఊళ్ళో మగా

ళ్ళూ ఆడాళ్ళూ చర్చ పెట్టి ఒక వృద్ధురాలి చేత జాయతో, పతి తీర్థం తిక్కపనిలా ఉన్నా జాయ మనసెరిగి, జాయ కోరిక తీర్చాడు అనిపించి, తిక్కమొగుడు కత పూర్తి చేసాను. ఇందుకు పదిహేనురోజులూ పట్టింది.


కతరాయడం తేలికైన విషయంకాదు. గర్భవతైన స్త్రీ కనడానికి పడినన్ని నొప్పులూ పడితేగాని కత బయటికిరాదు. ఒకటిన్నర నిమిషం చదివించే కతలో ఎన్ని చూసుకోవాలి? కత నడక చూడాలి, అక్షరాల వెంట కళ్ళు పరుగుపెట్టేలా చెప్పాలి,భాష చూడాలి, అప్పుడే ఐపోయిందా? అనిపించాలి.మనుషుల మనస్తత్వం చూడాలి, కత ముగింపు బాగోవాలి, చెప్పగల్గితే ఒక కొత్త విషయం చెప్పాలి. ఇంత బాధాపడాల్సిందే. ఎందుకింత బాధపడి కతరాయాలి? స్త్రీ చావు అంచులదాకా వెళ్ళి కూడా బిడ్డను కనాలని ఎందుకనుకుంటుంది? ఇదీ అంతే!అంతే సుమా!  

ఇక తల్లి తనకిపుట్టిన బిడ్డలందరిని ప్రేమిస్తుంది, అలాగే రాసిన ప్రతి కతా అందంగానే కనపడుతుంది, నాకుమాత్రం.  కత బతికి బట్టకడుతుందా? అది కాలమే చెప్పాలి, కాలానికి వదిలేయక తప్పదు.

తిక్కమొగుడితో తీర్థమెళితే... 

https://kasthephali.blogspot.com/2023/02/blog-post_17.html

Monday 13 March 2023

నా దరిద్రమే పోయింది.

  నా  దరిద్రమే పోయింది.


ట్రేక్ మీద సాయంత్రం నడుస్తున్నా! ట్రేక్ మీద ఒకపక్క చివరగా ఇసక ఉంటుంది. చెప్పులు లేకుండా ఆ ఇసకలో నడిచే అలవాటు చాలామందికుంటుంది. నాకూ ఆ అలవాటు. ఒక పక్క పచ్చికుంటుంది. ఎండలు ముదురుతున్నాయిగా, పచ్చిక ఎండిపోయింది. పచ్చికపై చెప్పులు లేకుండా నడవడమూ మంచిదే! మంచి నిద్ర పడుతుంది. టెన్షన్ తగ్గుతుంది.   BP  తగ్గుతుంది

 చెప్పులు ట్రేక్ దగ్గర వదిలేస్తే కుక్కలు పాడుజేస్తున్నాయి, అందుకు అరుగు దగ్గర వదిలేసి నడకకి వెళ్ళడం అలవాటు. కొంచం దూరంలో ఉన్నా, నడక పూర్తి చేసుకుని. చూస్తుండగానే ఎవరో, తెలిసిన వ్యక్తే తనజోళ్ళు అక్కడ వదిలేసి నా జోళ్ళు తొడుక్కుపోతున్నాడు. పొరపాటు కాదని తెలుస్తూనే ఉంది. ఒక్క నిమిషం, కొత్త చెప్పులు, పదిరోజులకితం కొన్నవి, తొడుక్కుపోతున్నాడని బాధ కలిగింది, కేకేద్దామనుకుని ఆగిపోయా!.  చెప్పులు తొడుక్కుని పట్టుకుపోతున్నందుకు సంతోషించా! 


అదేంటి కొత్త చెప్పులుపోతే సంతోషమా అనకండి. నిజం! ఎందుకంటే శని పాదాలలో ఉంటాడు, అందునా వాడుతున్న చెప్పుల్నీ అనుసరించి ఉంటాడు. ఈ రోజుతో నా శనిపోయింది, దరిద్రమూ పోయింది, అందుకే సంతోషం.


    షోలాపూర్ చెప్పులు రెండు పోయాయీ, మెత్తగ హత్తుకుపోయేవీ!!!

 రేపు కొత్తవి కొనుక్కుంటా. ఇంటికొచ్చేటప్పుడు కొంచం ఇబ్బందిపడ్డా,చెప్పులు లేక రోడ్డు పై నడకకి.  కాళ్ళకి వేసుకునే చెప్పులు గుడి దగ్గర, ఇతరచోట్ల కావాలని తొడుక్కుపోయే జనాలు ఉంటారు. బాధ పడద్దు, శనిపోయినందుకు సంతోషించండి. ఈ వేళ శని నా కాళ్ళలో ఉన్నాడంటారు, తిరుగుడు ఎక్కువైన రోజు, ఇది నిజం, శరీరం కింది భాగంలో కాళ్ళలో అందునా పాదాలు శనిస్థానం. 


పెద్దవాళ్ళు కాలం చేసిన తరవాత తొమ్మిదో రోజు వారు వాడుకునే కఱ్ఱ,చెప్పులు, మంచం, పరుపు, బట్టలు ఇచ్చేస్తారు. ఇతరులు అవి తీసుకోడమూ తప్పుగా భావించరు.  పాత కాలంలో కుటుంబం అంటే కొడుకులు,కోడళ్ళు; కూతుల్లు,అల్లుళ్ళు; మనవలు,మనవరాళ్ళు; కొండొకచో మునిమనవలు,మనవరాళ్ళు కూడా ఉండేవారు. పెద్దవాళ్ళతో వీరిలో కొందరికి చెప్పలేని అనుబంధం ఉండేది. తాతగారి జోళ్ళు,కఱ్ఱ రోజూ కనపడుతూ, తాతగారు లేకుంటే నిత్యమూ మనసుకి కోత, దానినుంచి తప్పించుకోడానికే వీటిని ఇచ్చేసేవారు.


 స్త్రీలైతే, పోయినవారు కట్టుకున్న చీరలని, కుటుంబంలోని  తీసుకునేవారు. దీనికో కారణమూ ఉంది, చనిపోయినవారితో ఆ కుటుంబంలోని ఆడపడచులకు,కోడళ్ళకు ఉన్న అనుబంధాన్ని తెలిపేదే ఇది. అంతేకాదు, ఆ పెద్దవారిని దగ్గరగా ఉంచుకున్న అనుభూతి కూడా. మీరు నవ్వచ్చు, కాని ది నిజం. మనం కట్టి వదిలేసిన బట్టలకి మన ఫెరుమోన్స్ అంటి ఉంటాయి, అవి ఎన్ని సార్లు ఉతికినాపోవు. అందుకే ఆ అనుభూతి.ఇంకా మా అత్తగారిచ్చిన నగ, మా అమ్మ ఇచ్చిన గాజులు,  మా మామ్మ ఇచ్చిన గొలుసు, మా అమ్మమ్మ ముక్కుపుడక,  అనుభూతి పెంచేవే! ఇది చెప్పుకోడం స్త్రీ లకి ఇష్టమే, నేటికిన్నీ!

 

వాడుతున్న చెప్పులుపోతే సంతోషమే సంతోషం, ఎందుకంటే మన శనిని స్వంతం చేసుకుంటున్న అభాగ్యుడు.  


Saturday 11 March 2023

వయసై పోయింది కదూ!

 వయసై పోయింది కదూ!


నిన్న సాయంత్రం నడకనుంచి తిరిగొస్తుంటే ”వారంగా కనపట్టం లేదూ!”  అడిగిందో ఎత్తుపళ్ళ సుందరి. ''నువు కనపట్టంలేదని ఎవరినడిగానబ్బా!'' అనుకుంది స్వగతంలో.

''ఎండ పెరిగినట్టుంటే నడక టైమ్ మార్చాను. అందుకు కనపడ్డం లేదనుకుంటా!'' అన్నా.'' వయసైపోయిందికదూ! ఎండవేళ జాగర్త'' అని వెళ్ళిపోయింది,లోనికి.


పదిరోజుల కితం నడకైపోయాకా కూచున్నా, సాయంత్రపు వేళ, స్కూల్ అరుగుమీద.ఇద్దరు ముఫైలోపు కుర్రాళ్ళొచ్చారు. అందులో ఒకడు, సమయం,సందర్భం లేక మీ వయసెంత? అడిగాడు. ఎనిమిదపదులు దాటిందని చెప్పేను. ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతలో వెనకనుంచి చీపురు చేత్తో పుచ్చుకునొచ్చిందో లోలాక్షి.  నీ పనికి అడ్డా? అన్నట్టు చూసా! కాదని చెయ్యితిప్పుతూ!   ''బాబూ! ఇంత వయసున్నోనివి, పెద్దోనివి, వయసునిజం చెప్పకూడదు, తెలీదా?'' అనేసి, ''ఆ సన్నాసోళ్ళు ఏం కూసారో తెలుసా? ఇసుమంటి వయసైపోయిన  ముసలోల్లే దేసానికి బరువు అనుకుంటాపోయారు, నీకినిపించి ఉండదు.నీకేం కూడెట్టేరా?గుడ్డెట్టేరా ఎదవలు,నీ బరువేం మోసుకున్నారు, సన్నాసి ఎదవలు'' అని తిట్టిపోసింది.

అప్పుడుగుర్తొచ్చింది 

”ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్ర మౌషధ...”

వయసు,ఇంటిపోరు,మంత్రం,ఔషధం, ఇలా తొమ్మిదీ గుట్టుగా ఉండాలని చెప్పెరు కదా పెద్దలూ, అని

 పరమేశ్వరా! ఏమిది? అనిపించిందో క్షణం.ఈ తల్లికి నా పట్ల కలిగిన కరుణకు కారణం, ఆ కుర్రాళ్ళకి నా పట్ల కలిగిన  అకారణ ద్వేషానికి  కారణమేమి ప్రభూ! అని యోచించా!! తెలియలేదు, అదేకదా మాయ. 


.''తాతా! కుంటుతున్నావేం? ట్రేక్ మీద నడుస్తూ'' అడిగిందో చిలిపికళ్ళ సీతమాలచ్చి.''ఇంటి దగ్గర మెట్టు తగిలి వేలు చితికిందన్నా!'' ''చిన్నపిల్లాడివా? చూసుకునడవాలి, వయసైపోలేదూ!'' అనేసింది


నిన్న సాయంత్రం ట్రేక్ మీద నడుస్తున్నా! ముందు ఇద్దరమ్మాయిలు నడుస్తున్నారు. దుమ్ము రేగుతోందేమని పరిశిలించా. ఒకమ్మాయి స్కర్ట్ వేసుకుంది.రెండో అమ్మాయి పరికిణీ వేసుకుంది. ఆ పరికిణీ నేలమీద బెత్తెడు పైగా ఉంది. ముందుకెళిపోయి  వెనక్కితిరిగా! ''అమ్మలూ పరికిణీ నేలని తుడుస్తోంది చూసావా! కొంచం పొట్టిగా కట్టుకోవచ్చు, లేదా పొడుగు తగ్గించుకోవచ్చుగా!'' అనేసి,గబుక్కున నాలిక కరుచుకుని ''నీకెందుకు వయసైపోయిన ముసలోడా'' అని తిడుతుందేమోనని భయమేసి, ''చెప్పేసేనమ్మా! పొరబాటే సుమా!! ఏమనుకోకూ'' అనేస్తే నవ్వు నవ్వేసింది. ముందుకెళిపోయా. వయసైపోతే ఇలా అనవసరంగా కలగజేసుకుని వాగడం అలవాటైపోతుందేమో సుమా!!


ఏ రోగానికైనా వైద్యుడు వైద్యం చేయగలడుగాని, ఆయుస్సు పోయలేడు, అంతేకాదు ఇమ్యూనిటీ బజారులో దొరకదు. మందులికి రోగం తగ్గటం లేదంటే వయసైపోయిందిగా! ఇమ్యూనిటీ ఉండదంటారు.


తల్లీ! కనపడ్డవాళ్ళంతా వయసైపోయింది, వయసైపోయింది అంటున్నారు, అంటే నీ అవసరం ఇక ఇక్కడలేదు నిష్క్రమించచ్చు అని చెప్పినట్టే అనిపిస్తోంది. ”జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని”వైన నీకనిపించలేదా!  ఈ ఉపాధికి (శరీరానికి)  విశ్రాంతి ఇవ్వాలని తల్లీ!, ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, కాని అదే ఎప్పుడూ అని కదా! అంతేకాదు ఈ శరీరం ఇక బాధలు తట్టుకునేలా లేదు తల్లీ! త్వరగా దీనినుంచి విడుదలకావాలి.  

  


Sunday 5 March 2023

నడిరేయి ఏ జాములో

 నడిరేయి ఏ జాములో


సామీ!   

నడిరాత్రేల ఎలబారకపోతే, అమ్మనే సందలడే కాడికి కొండమీనకి  బయలెల్లమనచ్చుగా!

తప్పైపోనాది సావీ! అమ్మకేటి ఎడం?  

 ”ఆబ్రహ్మకీట జనని”, నాలాటోల్లెంతమంది కతకనేదో సూడాలిగందా!


తవరేటి బావులూ సందలడ్డంతో బయలెల్లచ్చుగా! అమ్మకాడికి?

ఇదీ ఒల్లకోనిదేనా  సావీ! తమకేటి, ఎన్ని రాసకారేలో!! ఇదేటి కుటుమానం సావీ! అమ్మో కాడ!, అయ్యో కాడా! ఏటో పిచ్చోణ్ణి తవరిగారి కుటుమానంలో నా ఊసేటి సెప్పుమీ!!


అద్సరేగాని సావీ! రాత్రేల పారెలతంటే పురుగో, పుట్రో; పులో మెకవో, ఆటికేటి తెలుస్తది సావీ! తమరెవురో!

ఏటో సావీ! బుఱ్ఱతక్కువోడిని ఊసాడ్డం తెలీనోన్ని, అనేసినాను.

ఓలమ్మ! ఓలమ్మ!!,  ఏటాసిరునవ్వు, ఆ యమ్మ యశోదమ్మ కాడ నవ్వినావంటగందా, నోరు చూయించినావంట! అల్లది నాకు చూయించుమీ!!!


సరేగాని బావులూ సందెపొద్దులూ నిలువు జీతమే! కాల్లు నొవ్వవేటి? నాలాటోనికి కూసేపు కాల్లు నొక్కనీకి ఒల్లకోరాదా?

అది నీవల్లకాదంటావా! అది బ్రహ్మ కడిగినపాదమంటావా! చాలామంది మహామహులకే సాధ్యం కాలేదంతావా! నాకేటి ఎరిక సావీ, నాలాటోడివేననుకుంతా!


సావీ! ఏడేడనించో ఎలబారి పారొస్తాం! సూడాలి, సూడాలనుకుంతాం! సూదామనుకునీ తలికి కల్లేటి మూతలడిపోతాయో సావీ!ఎరికవదు.  కల్లిప్పి నిన్ను సూచీ తలికి,ఇక సూడు, నడు, నడు, అని తరుముతారు సావీ!

అదిచాలురా! అంతకుమించి చూడలేవు, నీవల్లకాదు. నిన్నిక్కడే కూచో ఒకరోజంతా అంటే, కూచోలేవు. నీమనసు, ఇల్లూ వాకిలీ;పెళ్ళామూ,పిల్లలూ; పొలమూ,పుట్రా; గొడ్డు,గోదా అని అక్కడ తిరుగుతుంది. నేనిక్కడే కాదు, అక్కడా ఉన్నాను, ఎక్కడా ఉన్నాను, అంతెందుకు నీ మనసులో ఉన్నా! తొంగిచూడు.  నువ్వెక్కడున్నా, నీ మనసు నా దగ్గరుంటే చాలంతావా సావీ. ఇద్దెలుసుకో లేకపోనా చామీ!


బావూ! నీ కుటుమానంలో ఇసయం, మన్లోమాట, లగ్గానికిజేసిన అప్పేపాటున్నదేటింకా! కుంచాల కుంచాలు, రాసులకొద్దీ సొమ్ములు కొలిసిచ్చి, సోలిపోయిగందా! కుంచం తలకాడెట్టుకు తొంగుండి పోనాడా సావి! ఎప్పటికి తీరుద్ది బావూ అప్పూ! ఏటి వడ్డీ తీరడం లేదంతావా! నెక్కా? డొక్కా తిన్నగున్నట్టు  లేదు సావీ, ఆ సావి అలుకొచ్చి తొంగుండిపోనాడు, మజ్జగాలోల్లు, ఎంత సొమ్ము నొక్కీసినారో ఎరుకేనేదు బావూ!

ఆల్లేతి క్షేత్రపాపు లంతావా!

ఎంత పాపిష్టోల్లన్నా! ఇంత సేటా సావీ, ఓపాలిటూ సూడుమీ 

బావులూ అమ్మతో ఓపాలి అప్పూసనరాదా?

బావూ! లగ్గానికి అమ్మ కట్నమేటి తెచ్చినాది? 

అమ్మే నచ్చిందేవి మరి కట్నమేటంతావా?


అమ్మ! తల్లితల్లి, ఊసాడ్డం తెలీనోన్ని ఏటేటో ఓగీసినాను దొరకాడ! అమ్మవుగందా !దొరసానీ! నాకేటొద్దు దొరకాలు నొక్కుతూ పొద్దుపోవాలని ఊసు తల్లీ! దొరకి చెప్పుమీ!!! 


"ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందీ" నీవున్న అనుభూతి,అనుభవం  కొనసాగితే చాలు, నా జీవితానికి మరేం వద్దు తల్లీ!


Thursday 2 March 2023

గతం గతః

 గతం గతః

పరమాత్మా! 

ఇన్నేళ్ళ జీవితంలో కష్టాలూ పడ్డాను, సుఖాలూ అనుభవించాను. తట్టుకోలేనంత కష్టం వచ్చినపుడు కుంగిపోయాను, పడిపోయాను, జీవితం ఐపోయిందనుకున్నా! కాని నీ లీల తెలియనిదే సుమా! కాలం దాటరానిదిన్నీ! "బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్...." నీవే నా బలం సుమా!


కష్టాలొచ్చినప్పుడు ఏడ్చాను, ఇప్పుడూ వాటిని తలుచుకుని ఏడ్చి ఉపయోగం లేదు. ఏడిస్తే పోయినవాళ్ళు లేచొస్తారా? చంటిపాప నవ్వులో, మొక్కను పూసిన పువ్వులో, మంచిమనిషి హృదయంలో నువ్వున్నావని నమ్ముతున్నా. 


ఇరవై ఏళ్ళపుడున్న ఆరోగ్యం ఇప్పుడుంటుందా? ఉండదని తెలుసు. చివరిదాకా కాలూ,చెయ్యీ ఆడే, కదుపుకునే ఆరోగ్యం ప్రసాదించు, చాలు.  ఇప్పటిదాకా నాకు కావల్సినదానికంటే ఎక్కువే ఇచ్చావని నమ్ముతున్నా!


 నీ మీద భక్తి ఉన్నదని చెప్పుకోను, ఈ వయసులో పూజలు,వ్రతాలూ చెయ్యలేను,  నువ్వున్నావని

 నమ్ముతాను. 


నీ పాదకమల సేవయు, నీ పదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయును, తాపసమందార! నాకు దయ సేయగదే!


నిన్నెప్పుడూ మరువని స్థితి ప్రసాదించు చాలు. చింతాకంతయు భక్తి నిల్వదుగదా శ్రీకాళహస్తీశ్వరా!