Friday 29 November 2019

కాకినాడ జ్ఞాపకాలు




 విన్నకోటవారు కాకినాడ జ్ఞాపకాలని కదిలించారు. 

నిన్న కొన్ని జ్ఞాపకాలు కామెంట్ గా వర్మ గారి బ్లాగ్ లో వేశాను.
వర్మగారి బ్లాగ్ కబ్జా చేస్తున్నానేమో అనే భయం, అందుకు ఇక్కడ టపా ముఖ్యమైనవి చెప్పి ముగించేస్తా. ఇవన్నీ ఏభై సంవత్సరాల కితం మాట, కొన్ని మార్పులూ జరిగి ఉండచ్చు.

జగన్నాధపురంలో మునసబుగారి వీధి ప్రాంతంలో ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారిల్లు.రంగూన్ మేడ వెనక పెద్ద పెద్ద పడవల తయారీ కేంద్రం. ఈ పడవలు చాలా పెద్దవి,ఓడ దగ్గరకి సరుకులు తీసుకెళ్ళేవి. ఇంత పెద్ద పడవలని కాకినాడలోనూ కలకత్తాలోనూ తయారు చేసేవారు,నాటి కాలంలో. పాతవంతెన దాటితే వార్ఫ్ రోడ్ వైపు ఒన్ టవున్ పోలిస్ స్టేషను అలా ముందుకెళిపోతే రైల్ గేట్ ముందు మైన్ రోడ్ చివర రెండవ పోలీస్ స్టేషను. మైన్ రోడ్ వెంట ముందుకొస్తే ఎడమవైపు మేడ మీద తేలుకాటుకి మంత్రం వేసి వేడి కాఫీ ఫ్రీగా ఇచ్చి పంపే ఉడిపి అయ్యరు హోటలు. పట్నాల చిట్టెయ్య సెంటర్ నుంచి ఎడమవైపు వీధిలో జైన్ దేవాలయం. వీరిదే దిల్వారా టెంపుల్ అంత ప్రాధాన్యం ఉన్న దేవాలయం మండపేట నుంచి ఆలమూరు వెళ్ళే రోడ్లో కుడి పక్క గుమ్మిలేరు గ్రామానికి ఇవతల ఉన్న జైన్ దేవాలయం. కుడి వైపు వీధిలో కూరగాయల మార్కెట్ దాన్ని ఆనుకుని ఒక చెరువు. మైన్ రోడ్లో మసీదుకు పక్కగా కొద్ది దూరంలో కోటయ్య కాజా ఇల్లు,మసీదు సెంటర్ దాటిన తరవాత సెంటర్లో ఎడమ వైపు సుధితా బుక్ స్టోర్స్, ఇంజనీరింగ్,మెడికల్ పుస్తకాలు దొరికేవి. సెంటర్లో మూల మీద నూర్జహాన్ కిళ్ళీ షాప్ జానీ.ముందు కెళితే టవున్ హాల్ సెంటర్లో టవున్ హాల్ లైబ్రరీ, ఎదురుగా ఉడిపి గణేశ్ భవన్, ఆపక్క వేదార్ధ నిధి జటావల్లభుల సూర్యనారాయణ శాస్త్రిగారిల్లు, ఆ పక్కనే కోదండరామస్వామి ఆలయం. టవున్ హాల్ సెంటర్ నుంచి ఎడమపక్క వీధిలో జడ్జి బంగళా. టవున్ హాల్ సెంటర్ నుంచి కుడి వైపు వీధిలో కాంగ్రెస్ ఆఫీస్ దాని ఎదురుగా ఐ.సి.హెచ్, కల్పనా ధియేటర్, మునిసిపల్ ఆఫీస్. జడ్జి బంగళా కి ఎదురుగా మెక్లారిన్ హైస్కూల్. ముందుకెళితే ఆక్సిడెంట్ స్పాట్, పక్కనే పిండాల చెరువు, దాని వెనక రాజ రాజేశ్వరి ఆలయం. బాలాజీ చెరువు, దీన్ని మూసేసి టి.టి.డి కల్యాణమంటపం, దగ్గరలోనే తాలూకా ఆఫీస్.. కోర్ట్ కాంప్లెక్స్ పక్క పాత బస్ స్టాండ్. కలక్టర్ ఆఫీస్ పక్క లేడిస్ క్లబ్బు. (లాకులు)బ్రిడ్జ్ దాటితే చీడిగ పోస్టాఫీస్ పక్క శివ పురాణాన్ని తెనుగు చేసిన మా మిత్రులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ మూర్తిగారిల్లు.

వాకలపూడి లైట్ హవుజ్.
సర్పవరం,పండూరు మామిడితాండ్ర
చిత్రాడ మొక్కలు,పువ్వులు,అంట్లు,తాటి తాండ్ర, తేగలు
కుళాయి చెరువు దగ్గర జరిగే సంవత్సరపు ఫల పుష్ప ప్రదర్శన
ఊరుకి దూరంగా నీటిపై విహారానికి బోగందాని చెరువు 

ఇలా ఎన్నెన్నో! ఆపేస్తా, దీనికి అంతు కనపట్టం లేదు.. :)

Thursday 28 November 2019

చిటకా!

చిటకా!

పళ్ళు గార కట్టేయి. ఏ పేస్ట్ తో తోమినా పోవటం లేదు. డాక్టర్ దగ్గరకెళితే డి స్కేల్ చేస్తారు, ఓక గంట కూచోవాలి. అబ్బా!

చిన్న చిటకా చేసి చూడండి, పళ్ళు మిలమిలా మెరుస్తాయి. కొద్దిగా ”ఈనో”  ENO తీసుకోండి పళ్ళు తోముకుని పుక్కిలించి ఉమ్మెయ్యండి, ఇప్పుడు చూడండి. పళ్ళు మిలమిలా!! 

చేతులోకి తీసుకుని తోముకునే పళ్ళా? :) ఇబ్బందేలేదు.. 

Monday 18 November 2019

కోళ్ళగంప


కోళ్ళగంప లో పిల్లి పడ్డా
కచ్చలో నిప్పు పడ్డా
కచ్చేరీ లో కాయితం పడ్డా   నష్టం తప్పదు. 

Saturday 2 November 2019

పదుగురాడు మాట

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు 
నొక్కడాడు మాట ఎక్కదెందు
నూరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ

పదిమంది మాటాడేమాట చెల్లుతుంది. ఒక్కడు మాటాడేది చెల్లదు. అలాగే ఊరుకుని ఉన్నవాడిని ఊరు మొత్తం ఏం చేయలేదు అన్నారు వేమనతాత.

పదిమందిమాటాడేది అంటే మెజారిటీ మాటాడేది,నిర్ణయించేది చెల్లుబాటవుతుంది, అదే డెమోక్రసీ అంటారు తాత. డెమోక్రసీ అంటే ఏంటో తెలియని కాలం లోనే రాబోయే డెమోక్రసీ గురించిన నిర్వచనం చెప్పినవాడు మన వేమన తాత. డెమోక్రసీ అంటే చెబుతున్న నిర్వచనం నూటికి ఏభయ్యొక్కమంది చెప్పేమాట చెల్లుబాటు కావాలి,మిగిలిన నలభతొమ్మిది మంది చెప్పేమాట మెజారిటీ వినాలి, కాని మెజారిటీ చెప్పినదాన్నే అమలు చేయాలి.  ఎవరిదోవ వారిదే అనడానికి లేదు. ఎందుకంటే ఇది మనందరిది అనుకోవాలి. ప్రభుత్వ పక్షము ప్రతి పక్షము, రెండూ   ప్రజలకు జవాబుదారీయే. ప్రతి పక్షమూ ప్రభుత్వంలో భాగమే. మందిని ఆకట్టుకోవడమే గొప్ప.  ప్రభుత్వ పక్షాన్ని ఎప్పుడు చీల్చి చెండాడాలో తెలిసినదే అసలైన ప్రతి పక్షం, లేకపోతే అది రెక్కలు తెగిన పక్షి. అసందర్భంగా నోరు పారేసుకుంటే నవ్వుల పాలే!

అలాగే, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని సామెత. అలాగే మన మాట సాగదని అనిపించినపుడు ఊరుకుని ఉండడమే ఉత్తమం. ఊరుకు ఉన్నవానిని ఊరంతా కలసి కూడా ఏం చేయలేదు కదా! 


వ్యక్తుల విషయంలో, లోకులు కాకులు. ఎలాగైనా అరుస్తారు,సావకాశాన్నిబట్టి, అందుచేత లోకులను పట్టీంచుకోక ఊరుకుని తనపని తాను చేసుకునేవాడిని లోకం ఏమీ చేయలేదు కదా!

పదుగుర్ని ఒక మాట మీదకి తేవడం కష్టం, విడదీయడం తేలిక,ద్వేషం రెచ్చకొట్టడం బహు సులభం. ఆశయాలు ప్రధానంగా సంస్థలు కొనసాగించండి. వ్యక్తులు ప్రధానంగా సంస్థల మనుగడ కొద్దికాలం దే. 


విడదీసి పాలించడం కొంతకాలమే సాగుతుంది, అంతకాలమూ సాగదు. దేశము, ప్రజల అభ్యున్నతి ముఖ్యాశయాలుగా సంస్థలని నడపండి. ప్రభుత్వాలు ప్రజలకోసమే ఉండాలి. ప్రభుత్వం వేరు,ప్రజలు వేరు కాదు. చేస్తున్న పనిలో పొరబాట్లు తప్పులు ఎత్తి చెప్పినపుడు తప్పులు దిద్దుకునే ప్రభుత్వాలే కొనసాగుతాయి. ప్రజలనాడికి స్పందించని ప్రభుత్వాలు కూలిపోతాయి,ఎంత గొప్ప వ్యక్తులు అధికారంలో ఉన్నా! పదుగురాడు మాట పాటియై ధరజెల్లు! అదీ తాతమాట.