Friday 25 November 2022

వేగపడక వివరింపదగున్...

 వేగపడక వివరింపదగున్...

https://kasthephali.blogspot.com/2022/11/blog-post_23.html   (నిన్నటి తరవాయి) 



వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనె వేగడక వివరింపదగున్

విని కల్లనిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!


ఎవరుచెప్పినా విను. విన్న వెంఠనే ఉద్వేగపడిపోకు, విన్నదానిని విశ్లేషించుకో! విన్నదానిలో నిజానిజాలు తేల్చుకున్నవాడే తెలివైనవాడు అన్నారు, బద్దెన.


వినినంతనె  వేగపడక

ఎవరెవరో రరకాలుగా చెప్పేరు కదా!   ఎలా చెప్పేరు? ఒకరు చాలా కటువుగా,వాస్తవానికి దగ్గరగా చెప్పేరు, మరొకరు ఆకుకి అందకపోకకి పొందకుండా చెప్పేరు, మరొకరు ఇప్పటికే సర్వం నాశనమయిందిమరి బాగుపడే ఆశ లేదన్నారు. మరొకరు అసాధ్యాన్ని చెప్పి అది చేస్తే సమస్య తీరుతుందన్నారు. చివరగా ఒకరు చాలా తియ్యగా చెప్పరు, సాధ్యంకూడా అయ్యేదే! విన్నాం కదా! విన్నవెంఠనే ఉద్వేగం చెందడం, ఆవేశపడటం, కోపగించడం చేసుకోవద్దు! 


వివరించదగున్..

ఇప్పుడు చెప్పినవి ఒక్కొకటీ గుర్తుకు తెచ్చుకోవాలి. చెప్పినవాటిని కూలంకషంగా కీడుమేళ్ళు, సాధ్యా సాధ్యాలూ వివరించుకోవాలి, అదే విశ్లేషించుకోడం. ఇలా చెప్పినవారి స్వార్ధం ఉందా అని కూడా పరిశీలించాలి. అన్ని సలహాలనీ ఇలా చూసుకుంటే పొల్లుతో ఉన్న ధాన్యాని ఎగరబోస్తే పొల్లు దూరంగాపోయి, ధాన్యం కాళ్ళముందు పడినట్టు, ఏది సాధ్యమో, ఆపద గడుస్తుందో తెలుస్తుంది. అప్పుడు వారెవరో చూసుకుంటే తెలుస్తుంది, వారు బంధు మిత్రులా,చుట్టాలా, శత్రువులా, గూఢ శత్రువులా అన్నది. వీటిలో సాధ్యమైన మేలైనదాన్ని ఎన్నుకుని మనదైన ఆలోచన జోడించుకుని అప్పుడు కార్యాచరణకి దిగాలి. నిజంగా పైన చెప్పినదంతా రంధ్రాన్వేషణే...


ఎంతచెప్పినా అర్ధం చేయడం వల్లకాని పని కావచ్చు, ఒక చిన్న ఉదాహరణ, భారతం  నుంచి.

సందర్భం:- ధృతరాష్ట్రుడు రాజుగా ధర్మరాజు యువరాజుగా పరిపాలన సాగుతున్నకాలం.దుర్యోధనుడు తండ్రి చేత పాండవులను దూరంగా పంపి, మట్టు పెట్టాలని ఆలోచిస్తున్న కాలం.

ఘట్టం:- పాండవులు వారణావత ప్రయాణం, లక్క ఇల్లు... 

ధృతరాష్ట్రుడు ధర్మరాజు ను పిలిచి, కొంతకాలం వారణావతంలో ఉండి గంగాస్నానం చేస్తూ, దానధర్మాలు చేసి రావలసిందిగా, తల్లి తమ్ములతో వెళ్ళవలసిందిగా చెబుతాడు. ధర్మరాజు విని ప్రయాణానికి తయారవుతాడు. అందరూ రధాలెక్కేరు, ధర్మరాజు రధం ఎక్కుతుండగా విదురుడు పంచభూతాలనుంచి జాగ్రత్త వహించు అని చెబుతాడు. విన్న ధర్మరాజు మిన్నకుంటే, కుంతి అడిగింది, కొంత దూరం పోయాకా! విదురుడు గూఢంగా ఏదో చెప్పేడు,ఏమది, చెప్పవచ్చనుకుంటే చెప్పూ! అని. దానికి ధర్మరాజు అగ్ని,జల ప్రమాదాలనుంచి జాగ్రత్త వహించమని చెప్పేడని చెబుతాడు.

 వారణావతం చేరిన కొంతకాలం తరవాత లక్క ఇంటికి చేరేరు.లక్క ఇంట్లో చేరగానే విదురుని మాట గుర్తుచేసుకున్న ధర్మరాజు భీముని కూడా తీసుకుని లక్క ఇల్లంతా తిరిగి పరిసరాలూ గమనించి, భీమునితో ఇలా అన్నాడు. తమ్ముడూ! ఈ ఇల్లు లక్క నెయ్యితో నిర్మించబడింది,ఏ క్షణంలోనైనా అగ్నిప్రమాదం జరగచ్చు, దానికితోడు ఇది ఆయుధాగారానికి దగ్గరలో కూడా ఉన్నది, అన్నాడు.విన్న భీముడు విషయం అర్ధం చేసుకుని, ఐతే ఈ ఇంటిని మనమే కాల్చేద్దామన్నాడు. దానికి ధర్మరాజు, మనం కాల్చేయచ్చు కాని శత్రువు మరో పన్నాగం పన్నుతాడు, మనం మళ్ళీ దాన్ని తెలుసుకోవాలి, ఛేదించాలి, దానికంటే శత్రువు పన్నాగాన్నే ఎరగనట్టు కొనసాగిస్తూ సమయం వచ్చినపుడు పనిచేసుకుపోవడం మేలన్నాడు. విషయం గ్రహించిన భీముడు మిన్నకుండిపోయాడు. తరవాతేం జరిగింది తెలిసినదే కదా!

ఘట్టాన్ని విశ్లేషిస్తే

ధృతరాష్ట్రుడు తియ్యగా వారణావతం వెళ్ళి గంగలో ములిగి దానధర్మాలు చేస్తూ కొంతకాలం గడపవయ్యా! తల్లి,తమ్ముళ్ళతో అని చెప్పేడు, ఒక పెద్ద పథకం దృష్టిలో ఉంచుకుని,చూడ్డానికి, వినడానికి ఇదెంత చక్కగా ఉంది.తమను వారణావతం వెళ్ళమని ధృతరాష్ట్రుడు చెప్పినదానిలో సత్యం లేదని గ్రహించినా ధర్మరాజు, ఆవేశపడలేదు.వేగపడకపోవడమంటే ఇదే

ధర్మరాజు విదురుడు చెప్పినది విని విననట్టు ఊరుకుని సమయం వచ్చినపుడు అనగా లక్క ఇంట్లో చేరిన వెంఠనే చర్యతీసుకున్నాడు కదా! ఇది విశ్లేషణలో భాగం. భీముడు లక్క ఇల్లు కాల్చేద్దామని ఉద్వేగపడ్డాడు, చెప్పినవెంఠనే! ఇదే కూడనిది కదా! ధర్మరాజు శత్రువు పన్నాగం ఎరగనట్టు కొనసాగిస్తూ తిప్పికొట్టాలనే ఆలోచన వివరించడంలో భాగం కదా!  

ఆత్మరక్షణకి శత్రువును ఉపయోగించుకోడం ఎలా? ఎవరేనా చెప్పండి.


Wednesday 23 November 2022

వినదగునెవ్వరు చెప్పిన

వినదగునెవ్వరు చెప్పిన

 


వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

విని కల్లనిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!


ఎవరుచెప్పినా విను. విన్న వెంఠనే ఉద్వేగపడిపోకు, విన్నదానిని విశ్లేషించుకో! విన్నదానిలో నిజానిజాలు తేల్చుకున్నవాడే తెలివైనవాడు అన్నారు, బద్దెన.


తెనుగుపద్యానికి కూడా అర్ధం చెప్పాలా? అందులోనూ సుమతీ శతకపద్యానికి అని కోప్పడ వద్దు. నేటికాలంలో తెనుగు పద్యానికే అర్ధం చెప్పవలసిన రోజులొచ్చాయి.  దీనికేంగాని ముందుకెళదాం.



ఎవరు చెప్పినా విను, విను, విను, అని ముమ్మారు నొక్కిచెప్పారు శతకకర్త.

ఎవరు చెబుతారు?

బంధుమిత్రులు,శత్రువులు,అయాచితులు.

ఎవరు బంధువులు?

తల్లి,తండ్రి,భార్య/భర్త వీరే బంధువులు. మిగిలినవారంతా చుట్టాలే. బంధువులు ఏపరిస్థితులలోనూ మనమంచి కోరతారు.

ఎవరు మిత్రులు?

చాలాపెద్దది సమాధానం, టూకీగా. (పాపన్నివారయతి,యోజయతే హితాయ)పాపాన్నించి రక్షించేవాడు, ఎప్పుడూ మనహితంకోరేవాడు, అవసరంలో సాయం చేసేవాడూ, రహస్యాన్ని దాచి ఉంచేవాడూ,మనలోని గుణాలని ప్రకటించేవాడు. వీరే ఆత్మీయమిత్రులు.

ఎవరు శత్రువులు?

వీరు రెండు రకాలు. ప్రత్యక్ష శత్రువులు,పరోక్ష శత్రువులు.వీరెప్పుడూ మన నాశనమే కోరతారు. ప్రత్యక్ష శత్రువునుంచి కాచుకునే ఉంటాం ఎప్పుడూ, మరి ఈ పరోక్ష శత్రువే ప్రమాదకారి. వీరితోనే జాగ్రత హెచ్చుగా అవసరం.

పైవారంతా తెలిసినవారే!

అయాచితులు, వీరెవరో తెలీదు, వీరికి మనకి సంబంధమూ ఉండదు, వీరు ప్రతిఫలాపేక్ష లేక సమయ సంధర్భాలూ, సాధ్యాసాధ్యాలూ, వేటినీ పట్టించుకోరు, మనం ఆపదలో ఉంటే గట్టెక్కే మాట చెప్పిపోతారు, చెప్పాలనిపించింది, చెప్పేశా! ఈబాపతనమాట.

వింటే ఏమిటి ఉపయోగం?

ఎవరే చెప్పినా వినడం అలవాటు చేసుకుంటే ముందుగా అలవడేది ఓపిక. ఆ తర్వాత అలవడేది సహనం. ఇదేమిటీ? చెప్పినవారంతా మనకి నచ్చినదే చెప్పరు.  నచ్చినది విన్నంతలో కోప్పడిపోయే అలవాటు తప్పి సహనం అలవాటవుతుంది. 

ఎవరేనా చెప్పడం మొదలుపెట్టగానే వీరు,బంధువులు,మిత్రులు,శత్రువులు,అయాచితులు అని వర్గీకరీంచుకోవద్దు. ఎందుకువద్దో తరవాత చెబుతా. శత్రువు మన శ్రేయస్సు కోరడు, వారినెందుకు వినాలి?   ఇది సందేహం. 

శత్రువును కూడా ఆపదనుంచి కాపాడుకోడానికి వాడుకోవాలి, చెప్పినదానిలో మనకు ఉపయోగపడేవాటిని తీసుకోవాలి. అదేగాక శత్రువు మనని ఎలా పక్కదోవ పట్టించాలని చూస్తుంటాడో తెలుస్తుంది. రాబోయే అడ్డంకులు ముందు తెలిసినట్టవుతుందిగా! అందుచేత శత్రువును తప్పక వినాలి. ఇక చుట్టాలెవరూ ఆపదలో కనపడరు, కొంతమంది కనపడచ్చు, వారు ఆత్మీయమిత్రుల కోవకి చెందుతారు.


ఇప్పటికి వినడమయిందిగదా! ఎవరు చెబుతారో,ఎందుకు చెబుతారో!  తరవాత వినినంతనె వేగపడక వివరింపదగున్.

వేచి చూడండి.    


Thursday 17 November 2022

చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టేడు మెతుకులే ఖర్చు !

 చస్తే చాలా ఖర్చు బతికుంటే  పట్టెడు మెతుకులే ఖర్చు  !


జాతస్య మరణం ధృవం. పుట్టినవారు గిట్టకతప్పదు, చావుకూడా ఎప్పుడు,ఎక్కడ,ఎలా అన్నది కూడా తెలీదు.  చావు కూడా చాలా ఖర్చు తో కూడుకున్నదైపోయింది." చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టెడు మెతుకులే ఖర్చు  "  అన్నమాట పెద్దలనుండి ఎక్కువగా వినపడేది.


కలిగినవారింట చావు కూడా ఉత్సవమే! స్వతంత్రదేశంలో చావుకూడా పెళ్ళిలాటిదే బ్రదర్ అని ఒక సినీకవిగారిమాట. పదిమందితో చావూ పెళ్ళిలాటిదే అనే మాటా వినపడుతో ఉంటుంది మా పల్లెలలో. సామాన్యుల ఇళ్ళలోనే ఇబ్బందులన్నీ. స్వంత ఇల్లుంటే కొంత మేలు. !!అద్దె ఇంట ఉన్నవారైతే అదో నరకం.  నేటిరోజుల్లో అద్దె ఇళ్ళు వేరుగా లేనట్టే! అన్నీ అపార్ట్మెంటులే!! ఇక్కడే చిక్కులన్నీ! అపార్ట్మెంట్లో శవాన్ని ఉంచడానికి లేదని చెప్పేవారే ఎక్కువ. కామన్ ప్లేస్ లో కూడా ఉంచడానికి ఇష్టపడిని గేటెడ్ కమ్యూనిటీ లెన్నో! హాస్పిటల్ లో పోతే అప్పటికే తడిపిమోపెడు ఖర్చయి ఉంటుంది. మార్చురీలో శవాన్ని ఉంచడానికి, దాన్ని బయటికి తెచ్చుకోడానికి పడేవన్ని చెప్పుకోలేని తిప్పలు. మార్చురీలు లేనిచోట ఐస్ బాక్సుల్లో ఉంచడం కూడా ఖర్చుతో కూడిన పనే. ఇక పుట్టెడు పుల్ల లెక్క. దీని ఖరీదూ పెరిగిపోయింది. కొందరు ధర్మాత్ములు పుల్ల ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లూ ఉన్నాయి అక్కడక్కడ, పల్లెలలో. పట్నవాసాల్లో అన్నీ ఇబ్బందులే.శవాన్ని శ్మశానానికి తరలించడం కూడా ఖర్చుతో కూడినదైపోయింది. కొన్ని చోట్ల ధర్మ సంస్థలు,ధర్మాత్ములు ఉచిత వాహనాలు ఏర్పాటు చేసినవీ ఉన్నాయి. లేనిచోట అంతా ఖర్చే!


ఇటువంటి పరిస్థితులలో తల్లి,తండ్రి ఎవరిదైనా పార్ధివదేహాన్ని పంచభూతాలలో కలిపైడానికి అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ పాతికవేలంటే నమ్మగలరా? పెళ్ళి కెళ్ళి తినో, తినకో, ఎంతో కొంత సొమ్ము ఇచ్చి వస్తున్నాం, చదివింపులని. మరి, చావులో సామాన్యుడు పడే బాధని ఇబ్బందిని మనమెవరం గుర్తించటం లేదు, సాయమూ చెయ్యటం లేదు. మనలో మార్పురావాలి, తప్పదు. ఆలోచించండి. ఈ కింది మెసేజ్ నాకు వాట్సాప్ లో ఒక మిత్రుని దగ్గరనుంచి వచ్చింది, అది అతని ఆలోచనే, నాకు నచ్చింది, మీరేమంటారు? 


Courtesy:Whats app


పన్నెండో తారీకున ఇంతదాకా రాశాను, నడకనుంచి తిరిగొచ్చిన తరవాత ప్రచురిద్దామనుకున్నా, కాని అనుకోని దుర్ఘటన జరగడంతో వెనకబెట్టేను. మర్నాడు మరణించిన వాకర్ కుటుంబానికి సహాయం చెద్దామని పెద్దలు నిర్ణయించడం, దానికోసం మా వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజి ఇవ్వడం, వెంట వెంటనే సహాయాలు ప్రకటించడం,  ఆ సొమ్మును నేడు మా ఎమ్.ఎల్.ఎగారి చేతులమీదుగా ఒకలక్ష అరవైవేలు  చనిపోయినవాకర్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగిపోయాయి. 

 ఇలా మన కుటుంబాలలో, గేటెడ్ కమ్యూనిటీలలో ఇతరత్రా కూడా చేసుకుని మనం సహాయ సహకారాలందిస్తూ బలపడాలి తప్ప, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా!


Tuesday 15 November 2022

జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు

 అత్తచుట్టం గూదపగ


అత్తచుట్టం గూదపగ, అనేదోనానుడి. పాతకాలందే. ఏంటిదీ ఒక చిన్నకత చెప్పేసుకుందాం.సరేనా!


అనగనగా ఒక పల్లెటూరు అందులో ఒక చిన్న కుటుంబం. ఒకడే కొడుకు. వయసొచ్చింది, పెళ్ళి చేసేరు. కోడలమ్మ ఒచ్చింది. కాలంగడిచి, ఇంటి యజమాని కాలం చేసేడు. కొడుకు ఇంటి యజమానయ్యాడు. అత్త స్థానం మారింది, యజమానురాలు నుంచి. కోడలికి అత్త చుట్టమే కాని రెండు పూటలా తింటోంది, చాకిరీ చేస్తున్నా, ఇది కోడలికి కంటకంగా ఉంది. ఏమీ చేయలేదు. కొంతకాలం గడిచింది, అత్త లొంగుబాటులో కొచ్చేసింది, ఆరోగ్య రీత్యా, కాని రెండుపూటలా తింటూనే ఉంది. కోడలు విసవిసలాడుతూ ముద్ద పడేస్తోంది. అలాగ అత్త చుట్టం గూద పగ అయ్యాయా కోడలికి. 


జంతికొచ్చి చక్కిలాన్ని ఎక్కిరించినట్టు


ఇదీ ఒకనానుడే! పాతకాలందే!! జంతికొచ్చి చక్కిలాన్ని నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించింది. నేటికాలానికి ఇదేంటో తెలీదుకదా! మరిప్పుడంతా పిజ్జాలు బర్గర్లేగా తింటున్నది. జంతికల్నిచక్కిలాలని చూసినవారే అరుదైనట్టుంది. చక్కిలానికి లెక్కగా చిల్లులుంటాయి, జంతికకి లెక్కలేనన్ని చిల్లులుంటాయి. లెక్కగా చిల్లులున్న చక్కిలాన్ని లెక్కలేనన్ని చిల్లులున్న జంతిక నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎక్కిరించిందనమాట. ఎలా చెప్పినా నేటి కాలానికి అర్ధం చెయ్యడం కష్టమే కనక నేటి కాలం ఉదాహరణ బాగుంటుంది కదూ!


ఒక జంతిక, చక్కిలం బ్లాగుల్లో కొంతకాలం కలిసున్నాయి. ఈ జంతిక బ్లాగుల్లోంచి పారిపోయింది, బుఱ్ఱలో గుంజెండిపోయి, రిపీట్ చెయ్యడానికి కూడా పాత గుంజులేక. . చక్కిలం ఇంకా కుంటుకుంటూ బ్లాగుల్లోనే ఉంది, పాతవి రిపీట్ చేస్తూనో, కొత్తవి రాస్తూనో. కొంతకాలంపోయాకా, ఒక పాత టపా రిపీట్ చేస్తే ఆ జంతిక, చక్కిలాన్ని బుర్రలో గుంజెండిపోయి, పాత టపాలు రిపీట్ చేస్తున్నాట్టా అని అడిగినట్టు.

Monday 14 November 2022

అభిమానులు

 అభిమానులు



దయా బెన్ 
ఎవరీ దయాబెన్?
హిందీ టి.వి. సీరియల్లో ఒక పాత్ర పేరు.
ఎంటి సంగతి?
ఈ పాత్రని ఒక అమ్మాయి పోషించింది. ఆమె అసలు పేరు దిశా వాకాని. దయా బెన్ అన్నది పాత్రపేరో, ఆ నటి పేరో, తెలియనంతగా కలగలిసిపోయింది, ప్రజలలో.  ఆ హిందీ సీరియల్ పేరు తారక్ మెహతా కా ఉల్టా చష్మా! చాలామంది ఆమె అసలు పేరే మరచిపోయారు. మూడేళ్ళకితం పెళ్ళి చేసుకుంది. గర్భవతి అని తెలిసిన తరవాత ఒక సంవత్సరం పాటు ఎపిసోడ్ లకి పని చేసి ముందే ఇచ్చేసింది.సీరియల్ నుంచి తప్పుకుంది. 

ఆ తరవాత బిడ్డని కన్నది. షో నిర్మాత మరల షో కి రమ్మని పిలిచాడు,బిడ్డని సాకాలి రానంది. అదొగో అప్పుడు మొదలయింది కథ, చిలవలు పలవలుగా, ప్రెస్ లో.అభిమానులు బాధపడ్డారు. డబ్బులు ఎక్కువడిగితే నిర్మాత ఇవ్వనన్నాడని, మరొకరిని తీసుకుంటామని అన్నారని, ఎన్నెన్ని వన్నెలు చిన్నెలో, ప్రెస్ లో కనపడ్డాయి. ఆమెకు బదులు మరొకరి కోసం, అటువంటి వారి కోసం వెదుకులాటకి వీధిని పడ్డారు, సహనటులు,నిర్మాత అంతా. ఉహు! చాలామందిని చూసినా ఎవరూ సరిపోలేదు. ఆమెకు  బదులు మరొకరు దొరకలేదు. ఇక ఈ కాలం లో అభిమానులు చూపిన ఆదరమూ మరువలేనిదే! రెండేళ్ళ వెతుకులాట ఫలించలేదు.మరొకరు దొరకలేదు. బిడ్డకి రెండేళ్ళొచ్చేయి. ఆమెనే మరల అడిగాడు నిర్మాత. అమె మరల షో లో పాల్గోబోతోందన్నది సంచలన వార్త.   అభిమానులు పండగ చేసుకుంటున్నట్టు వార్త. 

ఆమె ఒక సామాన్య నటి. గ్లామర్ ఉన్నదేంకాదు, కాని అభిమానుల అనుగ్రహం పూర్తిగా పొందినది.


ఇక్కడి దాకా రాసేటప్పటికి మా సత్తిబాబు,సుబ్బరాజు వచ్చారు. రాసినది చూసి, మీకీ అలవాటు (తెగులు) తగ్గిందనుకున్నాను ( కుదిరింది )అనుకున్నాను. కుదరలేదనమాట! అంటూ మానిటర్ తన పక్క తిప్పుకుని చదివేడు, ఆ తరవాత సుబ్బరాజు చదివి, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి ఏం చేస్తాం లే! అని, సత్తిబాబూ నాకు కొన్ని అనుమానాలు తీర్చుదూ! అన్నాడు.  

ఈ తారకి అభిమాన సంఘం ఉందంటావా? మరో పెద్దనుమానం, 

మన తెనుగునాట సినీ తారళ్ళకి అభిమాన సంఘాలున్నాయి, మరి తారలకి లేవేం? ఇప్పటి తారలంతా దిగుమతీ సరుకే అంటావా?, అటైతే మన తెనుగువాళ్ళే ఐ గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన తారలు, సావిత్రి,భానుమతి, షావుకారు జానకి లాటి తారలకి అభిమాన సంఘాలెందుకు లేవు?

 ఈ అభిమాన సంఘాలున్న తారళ్ళు కట్టుకున్న గుడ్డలాళ్ళవిగావు,నిర్మాతవి. తెరమీద మాటాడే తూటాల్లాటి మాటలాడివిగావు,మాటల రచయితవి. ఆడు పాడే పాటాడిదిగాదు, పాటల రచయిత తెలివి.

    పాట, ఎనకమాల పాడే ప్లేబాక్ సింగర్ ది. ఇకాడు ఏసే స్టెప్పులు, ఆడెవడు కొరియొగ్రాఫర్ చెప్పినయి. మరి నటన, డైరెక్టర్ చెప్పినది. మరీళ్ళు చేసేదేటంటావ్? గొప్పంతా ఈళ్ళకే పులిమేత్తన్నారేటీ?    

మా సత్తిబాబు తన పక్కనే ఆటం బాంబు పడినంత కంగారు పడిపోయి, అవన్నీ పెద్ద విషయాలు సుబ్బరాజూ, నీకు చెప్పినా తెలియవులే అని వెళిపోయాడు.  పాపం మా సుబ్బరాజు తెనుగు ప్రజల్లా నిలువుగుడ్లేసుకునుండిపోయాడు.
(9.10.2019)

Sunday 13 November 2022

తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి.

 తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి.



''తనది తనుతిన్నా భరించే పొరుగుండాలి'' అని ఒక నానుడి చెబుతారు, మా పల్లెపట్టున. అనగానేమి?


నువ్వు పెద్దవాడివికావచ్చు, గొప్ప సంపాదన పరుడివి కావచ్చు, గొప్ప హోదా కలిగినవాడివి కావచ్చు లేదా గొప్ప ఆస్తి,ధనం కలిగినవడివే కావచ్చు, కాని నీ పక్కనున్నవారు, నిన్ను భరించేలా ఉండాలి. అంటే అర్ధం కాలేదు :)


నీది నువ్వు తిను, అనుభవించు ఎవరూ కాదనరు,నీ ఉనికి, మాట, పలుకు,చేష్ట నీ పక్కవారికి ఇబ్బంది కలగజేయకూడదు. ఇబ్బంది కలగజేస్తే, ఎదుటివారెంతగా సహించినా ఏదో ఒక రోజు బాధ వెలిబుచ్చక మానలేరు. నీవెంత గాలిలో తిరిగేవాడివైనా ఏదో ఒక రోజు భూమి మీదా కాలు పెట్టక తప్పదు. ''నేల విడిచి సాము ఉండదు'' కదా! అనగా రోజులెప్పుడూ ఒకలా గడవవు. ''ఎంత బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు తప్పదు''. ఆ గోడ మట్టిదే ఐ ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు సామాన్యుడి అవసరం పడుతుంది, ఆ రోజు ఏవగించుకునేలా బతకద్దని, భావం. వైభవం,ఆస్తి,ధనం,దర్పం,హోదా అతి ప్రదర్శన పనికిరాదు. ఇలా కావాలంటే నీ పక్కవారు కూడా తిన్నారా? ఉన్నారా?ఆలోచించు, వారి కష్ట సుఖాలు విచారించు. వారి తలపుళ్ళన్నీ కడగలేకపోయినా అత్యవసరాల్లోనైనా ఆదుకోలేని జన్మ వ్యర్థమని చెప్పడమే ఈ నానుడి భావం. చివరగా మనిషిలా బతుకు అని చెప్పడం. ''ఈ వేళ చస్తే రేపటికి రెండు'' అంటే రేపటికే ఎవరూ గుర్తుపెట్టుకోరు సుమా అని హెచ్చరించడం. ఎవరుగుర్తు పెట్టుకుంటారు నిన్ను? ఎవరు మిగిలేరీ లోకంలో? 

 ''కారే రాజులు? రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకుని బోవంజాలిరే భూమిపై
బేరైనంగలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు?వారలన్ మఱచిరే? ఇక్కాలమున్?
 భార్గవా''

''జరిగినన్నాళ్ళే వెయ్యి మొహం మీద కాగడా''.   అలా బతకద్దు, ఎదో ఒక రోజు ఆ కాగడాయే నిన్ను కాల్చేస్తుంది సుమా అని చెప్పడమే!


Saturday 12 November 2022

అనాయాసేన మరణం

 

అనాయాసేన మరణం వినా దుఖేఃన జీవితం.


అనాయాసేన మరణం వినా దుఖేఃన జీవితం.

ప్రయాసలేక జీవితం ముగించడం,శోకం లేక జీవించడం అన్నవి బహుశః పూర్వ జన్మ సుకృతాలే! అనాయాసంగా మరణించచ్చుగాని దుఖః లేక జీవితం గడవదు. 


రోజూలాగే ఉదయమే నడుస్తున్నాం, అందరం. ఎవరి కార్యక్రమం వారు చేస్తున్నారు. నేను ప్రాణాయామానికి కూచుంటున్న సమయం. ఒక్క సారిగా కలకలం, ఒకరెవరో పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్ కి పరుగెట్టేరు. ఏమయింది తెలుసుకునేలోగానే దుర్వార్త, ఒక వాకర్ నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతే, వెనకవారు ట్టుకుంటే, పక్కవారు, కేంపస్ లోనే టెన్నిస్ ఆడుతున్న డాక్టర్ గారికోసం పరుగెడితే, వారొచ్చి, ప్రథమచికిత్స చేసినా ఉపయోగం లేక హంస లేచిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. వాకర్లంతా నిలబడిపోయాం, బిక్కచూపులు చూస్తూ. పెద్దలం అక్కడే వుండటంతో క్షణాలలో పార్థివ శరీరాన్ని తరలించడానికి వేన్ ని చెప్పడం, కావలసినవారికి కబుర్లు చెప్పడం జరిగిపోయాయి. జరిగినదానికి దిగ్భ్రాంతి చెందిన వాకర్లంతా కర్తవ్యా విమూఢులై నిలబడిపోయాం. మా వూళ్ళో పార్థివ శరీరాలని శ్మశానానికి చేర్చడానికి ఇబ్బందులు లేకుండేందుకు ఇప్పటికే రెండు సంస్థలు రెండు వేన్లు నడుపుతున్నాయి.  అరగంటలో పార్థివ శరీరాన్ని తరలించిన తరవాత చైతన్యం పొంది కదిలాం, పోయిన వారెవరో తెలియదు, ముఖ పరిచయం తప్ప. ఎవరైనా వారి ఆత్మ పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకుంటూ.


ఓం శాంతి! శాంతి!! శాంతిః!!!


Thursday 10 November 2022

ఆ వూరికి ఈ వూరెంతదూరమో ...............

 ఆ వూరికి ఈ వూరెంతదూరమో ఈ వూరుకి ఆవూరూ అంతే దూరం.


ఆ వూరికి ఈ వూరెంతదూరమో, ఈ వూరుకి ఆవూరూ అంతే దూరం, ఇదొక నానుడి మా పల్లెటూళ్ళలో చెప్పుకుంటూ ఉంటారు. ఆవూరునుంచి ఈ వూరు ఎంతదూరమో ఈ వూరునుంచి ఆవూరూ అంతే దూరం ఒక్కంగుళం అంటే ఒక్క అంగుళం కూడా తేడా ఉండదు. అంటే వారు వీరికెంత గౌరవం ఇస్తే వీరూ అంతే గౌరవం ఇస్తారు. అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, దేశాలు కావచ్చు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలి.


మనం ఎదుటివారిని ఒరే అంటే వారూ ఒరే అనే అంటారు, ఏమండీ అనరు. మనం ఏమండీ అంటే వారూ అదే అంటారు. మనం వెధవా అంటే వారు వెధవన్నర వెధవా! అంట్ల వెధవా!! అని వడ్డి చెల్లించి మరీ తిడతారు. కొండొకచో అంతేవాసులూ తిడతారు, అక్కుపక్షీ అని.మురబ్బీ చెల్లదు సుమా! ఒకవేళ చెల్లించుకున్నా, ఖర్చు లేకుండా జీవితకాల శత్రువును కొనుక్కున్నట్టే :)


కొందరికి నోరు అదుపులో ఉండదు, బహుశః మెదడు మోకాటిలో ఉంటుందేమో!బలవంతంగా గౌరవం పొదలేరు, ఒక వేళపొందినా అది చాలా కొద్దికాలమే! మనం తిడితే మన అంతేవాసులు, వందిమాగధులు కీర్తించచ్చు,ఆ తరవాత జరిగేదానికి వగచి ఉపయోగం ఉండదు, తస్మాత్ జాగ్రత! జాగ్రత!! 


Sunday 6 November 2022

ఉబోస కావాలి

ఉబోస కావాలి 

ఒక నెలనుంచి ఒక పెద్దాయన ఉదయం నడకకొస్తున్నారు, ఒకటి రెండు రోజులు నడవగా చూసాను, ఆ తరవాత ఆయన నడిచింది చూడలే! ట్రేక్ దగ్గరే బెంచి మీద కూచుని ఉంటున్నాడు, నడిచేవాళ్ళని చూస్తూ! ఈయనకేం పెద్ద వయసనుకోకండి, మొన్ననే అరవై వచ్చినవాడు, కొత్తగా స్టెంటు వేయించుకున్నవాడు.డాక్టర్ బహుశః నడవమని చెప్పి ఉంటాడు. కాళ్ళకి నీ కేప్ లు వేసుకుని అవస్థ పడుతుండగా చూసాను. తెలిసినవాడే! తెల్లగా పాలిపోయాడు, ఏంటి సంగతంటే, నాకే అనిపించినది. ఆయన ఒక ఏ.సి బాధితుడని. ఇంటిదగ్గర ఏ.సి, ఆఫీసులో ఏ.సి, కారులోనూ ఏ.సి. అదీ బాగా కూల్ గా. మనిషి పాలిపోక మరెలా ఉంటాడు? కష్టపడి ఉదయం సూర్యుని కోసం చూస్తూ ఉంటాడు, సూర్యుడు కనపడ్డాకా పావుగంటకి వెళిపోతుంటాడు. ఆయన చుట్టూ భజంత్రీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు :)


ఇది చూసి కొంచం బాధ కలిగింది, ఆగలేకపోయా! చెప్పాలనిపించింది 

 చెబుతున్నా, ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! అని చెప్పేసానిలా!

మోకాళ్ళ నెప్పులు తగ్గలంటే బరువు తగ్గాలి, అది అంత తొందరగా జరగదు, నడిస్తే బరువు తగ్గుతుంది, నడవాలంటే మోకాళ్ళనెప్పులు,ఇలా ఇది ఒక విషవలయం. నడవడానికి ప్రయత్నించాలంటే, మోకాళ్ళకి చిన్న చెంచాడు ఆవునెయ్యి,నాలుగు చుక్కల నిమ్మరసంకలిపిరాయండి, నెప్పులు తగ్గిపోతాయనను,  

 నడవడానికి కొంత అనుకూలిస్తాయి, చెప్పాలనిపించింది, 

చెప్పేసా! ఉబోస అనుకున్నా ఏమనుకున్నా! 


వద్దనుకుంటూ ఉన్నా ఉబోసలు పెరిగాయి :) తగ్గేదెలా? ఎవరేనా స్పందించకుండా ఉండేందుకు 

 ఉబోస చెప్పరాదూ?  :)