రాముని రాజ్యం-భరతుని పట్టం-4
ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
భరత గుహుల మధ్య మొదటి బేటీ ముగిసింది.తరవాత భేటీ రాత్రి, పురంలో మొదలయింది,ఆదర గౌరవాల మధ్య. గుహుడు మాటాడుతూ ఆ రోజు రాముడు పురంలోకి రాలేదు,కారణం వనవాసం చెప్పేడు, ఆ రాత్రికి గారచెట్టుకింద గడ్డిలో శయనించాడు. మేమిచ్చిన పళ్ళు కూడా తీసుకోలేదు,కారణం ముని వృత్తి అనిచెప్పేడు.లక్ష్మణడు తెచ్చిన గంగతాగేరు,అంతే! ఏమీచేయలేకపోయాం అని చెబుతూ సీతారాములు ఆ రోజు రాత్రి శయనించిన గారచెట్టు దగ్గరకి దారితీసాడు. గారచెట్టుకింది గడ్డిని పరిశీలించిన భరతుడు అక్కడ సీతారాములు శయనించిన గుర్తులు చూసి, అన్నా, వదినలు హంసతూలికా తల్పం మీద శయనించేవారు,ఇలా గడ్డిలో పడుకోవడాన్ని చూసి, ఇవిగో రాత్రి పడుకున్నపుడు గడ్డి ఒత్తుకున్న ఆనవాళ్ళు,ఇదిగో సీతమ్మ చీరకొంగునుంచి గడ్డిని అంటుకున్న బంగారు జలతారు పోగు , ఇలాపరిపరివిధాల వేదనపడి మూర్ఛపోయాడు. తల్లులు ముగ్గురూ వచ్చి భరతుని సేద తీర్చారు.
ఆపై గుహుడు భరతునితో ఇలా చెప్పేడు. సీతారాములు శయనించగా లక్ష్మణుడు విల్లంబులతో రక్షణగా నిలిచాడు. అప్పుడు నేను లక్ష్మణా నేనే స్వయంగా విల్లంబులు తీసుకుని రక్షణగా ఉంటా నీవూ శయనించన్నా! వినలేదు. ఇక్కడ ఆకు కదిలినా మాకు తెలియక కదలదు,ఈ ప్రాంతంలో మమ్మల్ని గెలవగలవారు లేరు. ఇక్కడ నీటి పైనగాని అడవిలోగాని మా ఆధిపత్యానికి తిరుగులేదు,నీవు భయపడకు అని చెప్పినా వినక లక్ష్మణుడు సీతారాములకు రక్షణగా రాత్రి అంతా నిలిచాడు అని చెబుతూ లక్ష్మణుని గుణాలు చాలా సేపు పొగిడాడు. ఇంత చేసిన గుహుడు భరతుని నమ్మలేదు,ఏమాటాలోనూ!
ఆ రాత్రి గడచింది,మర్నాడు ఉదయం గుహుడు భరతుని సైన్యంతో సహా గంగ దాటించాడు,ఏనుగులతో సహా,పడవలమీద. ఏనుగుల్ని కూడా దాటించిన పడవలు ఎంత పెద్దవో! గంగ దాటించాకా వారికి భరద్వాజ ఆశ్రమం దాకా దారి చూపి వస్తాడు.
ఇప్పుడు విశ్లేషణ. దీనినుంచి మూడు ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.
1. రక్షణగా నిలచిన లక్ష్మణునికి చెప్పినట్టు గుహుడు భరతునికి ఇంత వివరంగా తమ బలం,బలగం గురించి ఎందుకు వివరించాడు?
2. భరతుని దగ్గర లక్ష్మణుని అంతగా గుహుడు ఎందుకు పొగిడాడు?
3. ఇంత చేసిన గుహుడు,భరతుని నమ్మక, మర్నాడు ఉదయం,తన బలం,బలగం ప్రదర్శిస్తూ భరతుని సేనతో సహా గంగ ఎందుకుదాటించాడు.
తార్కికమైన సమాధానాలకోసం చూదాం.
1.గుహుడు అంత వివరంగా భరతునికి చెప్పడమంటే "ఈ ప్రాంతంలో నీటి మీద,అడవిలోనూ మా అధిపత్యానికి తిరుగులేదు,ఎంతటి సైన్యం మా ముందు దాసోహం కావలసిందే! నీవు బలప్రయోగం చేదామనుకుంటే కుదరనిదే. మమ్మల్ని నీ సైన్యంతో జయించలేవనే" బలమైన హెచ్చరిక చేయడం.
2.లక్ష్మణుడు రామునికి అంత నమ్మకమైన తమ్ముడు రామునిపై ప్రేమ కలవాడు,గొప్పవాడు; నీవూ రాముని తమ్ముడివే,అంత ప్రేమ అభిమానాలున్నవాడివా? అని ప్రశ్నించడం,పరోక్షంగా
3. ఇది గంగ దాటించడమనే ఉపకారంలా కనపడుతుంది. కాని ఇదొక పెద్ద సైనిక వ్యూహం. భరతుడు నిజంగా రాముని వెనక్కి తీసుకురావడానికే వెళుతున్నట్టైతే ఇది సహాయం. లేదూ,రామునితో యుద్ధం చేయడానికి రాముణ్ణి అడవులలో కూడా ఉండకుండా చేయడానికి ప్రయత్నంగా అనుకుంటే. రామునితో యుద్ధం జరిగితే, అటునుంచి రాముడు ఎదుర్కుంటాడు,వెనకనుంచి గుహుడు తనపరివారంతో ఎదుర్కుంటాడు, అప్పుడు భరతుని సైన్యానికి దిక్కు తోచడు. అది అసలే అడవి, వెనక గంగ. వెనక్కి పోడానికీ దారిలేదు,గుహుని సైన్యం చంపుతుంది,అడవిలోనూ,గంగమీద కూడా. భరతుని సైన్యం అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయి,రామునికి దాసోహం కావలసిందే!. ఇది మిత్రుడైన రామునికి సాయమే కాక అత్మరక్షణ కూడా!
ఇప్పుడు చెప్పండి రామాయణం చదవాలా? చదివితే కాదు,పారాయణ చేయండి,బుద్ధిని ఉపయోగించండి. జీవితాలను ఫలవంతం చేసుకోండి.
స్వస్తి.











