Tuesday, 3 February 2026

కలికి చిలకల కొలికి .......

 కలికి చిలకల కొలికి .......

                              

 చిత్రం :  సీతారామయ్యగారి మనవరాలు (1991)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  చిత్ర


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

అత్తమామల కొలుచు అందాల అతివ

పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి


మేనాలు తేలేని మేనకోడల్ని

అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని

వాల్మీకినే మించు వరస తాతయ్య

మాయింటికంపించవయ్య మావయ్యా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి

ఆ మాట యీ మాట పెద్ద కోడలికి

నేటి అత్తమ్మా నాటి కోడలివి

తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి

తలలోని నాలికై తల్లిగా చూసే

పూలల్లొ దారమై పూజలే చేసే

నీ కంటి పాపలా కాపురం చేసే

మా చంటిపాపనూ మన్నించి పంపూ


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


మసకబడితే నీకు మల్లెపూదండ

తెలవారితే నీకు తేనె నీరెండ

ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు

ఏడు జన్మలపంట మా అత్త చాలు

పుట్టగానే పూవు పరిమళిస్తుంది

పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది

తెలుసుకో తెలుసుకో తెలుసుకో

తెలుసుకో తెలుసుకో మనసున్న మామ

సయ్యోధ్యనేలేటి సాకేత రామా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

*****


ఈ పాట వింటుంటే ఒక తెనుగు జానపదగీతం గుర్తొస్తుంది. అది ఇదే ..


Courtesy:Whatsapp

మొదటి పాటలో ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అనే చరణం ఉంది. దీని అర్ధమేమి అనే ఒక ప్రశ్న చూసాను.సమాధానం చూడలేకపోయా! నాకు తోచినది చెబుతున్నా!


ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి.......

ఈ అద్దగోడ గురించి తెలియాలంటే ఆచారం చేసేవారి వంటిల్లు ఎలా ఉంటుందో తెలియాలి. ఈ వంటిల్లు 15/8 కొలతల్లో ఉంటుంది. ఇందులో 10అ పొడుగు తరవాత అడ్డంగా ఒక గోడ 5 అడుగులపొడుగు రెండడుగుల వెడల్పు 4 అడుగుల ఎత్తునా ఉంటుంది. ఇందులో 10 అడుగులవైపు వంటపొయ్యిలు,పాలు,పెరుగు,పప్పూ ఉప్పులు పెట్టుకునే అలమారలు. వండుకున్నవి పెట్టుకోడానికి వేరుగా అలమార,పైన దండేలు,మడిబట్టలు ఆరేసుకోడానికి,ఎండుపుల్లలు తాళ్ళు వేలాడదీసి మధ్యలో పెట్టే ఏర్పాటు, అద్దగోడలో మడి మంచినీళ్ళ బిందెలు పెట్టుకునే ఏర్పాటూ ఉంటుంది. ఇది 'మడి' పక్క ఉండేది,దీన్నే ఆచారం వైపు అనగా అచారం చెయ్యి. ఇక రెండో భాగంలో తరవాణీ కుండ,చద్దెన్నాల ఊరగాయి జాడీలు, చద్దెన్నపు కంచాలూ, ఇలా ఉంటాయి. ఇది అనాచారం చెయ్యి. (అనాచారమంటే పనికిరానిదనికాదు,కొద్ది ఆచారం తక్కువ చేసేది.) ఈ ఆచారం చేతికి అనాచారం చేతికి హద్దు ఒకగోడ. ఆ గోడ అర్ధగోడ, హద్దుగోడ, కాలంలో అర్ధగోడ ఆతరవాత అద్దగోడగా రూపాంతరం చెందిది. ఇదే ఆచేయి ఈ చేయి అద్దగోడలికి కత.     

ఇక ఆమాట ఈ మాట పెద్దకోడలికి..

పాత తరం ఉమ్మడి కుటుంబాలంటే ఇంటిపెద్ద, ఆయన భార్య, వారి సంతానం. ఒక్కో ఇంట్లో 5 నుంచి 7 మంది కొడుకులు,అదేలెక్కన కూతుళ్ళూ ఉండేవారు. అటువంటి ఉమ్మడి కుటుంబం నేడు ఊహించనుకూడా లేము.  అటువంటి ఇంట పెద్దకోడలిది ప్రత్యేక హోదా,బాధ్యత,(చెప్పబడని)అధికారం.  ఈమె పెద్దలలో చిన్నది,చిన్నవాళ్ళలో పెద్దది. ఈమె తరాల మధ్య సరిహద్దులోది. పెద్దవాళ్ళ బాధలు కష్టాలు దగ్గరగా చూసేది,అర్ధం చేసుకోగల వయసుకు దగ్గరగా ఉన్నదీ. ఇక చిన్నవాళ్ళలో పెద్దది,చిన్నవాళ్ళ ఇష్టాలు,సరదాలు, ఇబ్బందులూ తెలిసున్నది. ఈమె అటు పెద్దవాళ్ళనూ ఇటు చిన్నలనూ సముదాయించగల స్థితిలో ఉంటుంది,చెప్పి ఒప్పించేవయసులో ఉంటుంది. సంసారం ఒడుదుడుకులు లేకనడుస్తోందంటే పెద్దకోడలు చాలా బాధ్యత తీసుకున్నట్టే. అటువంటి పెద్దకోడలు ఇటు పెద్దలమాట,ఇటు చిన్నలమాటా వింటూ సందర్భాన్ని బట్టి చెప్పి ఒప్పించడం,సముదాయించడం చేసేది గనక,ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అన్నారు. ఇదీ పెద్దగోడలికి,అద్దగోడకి పోలిక. అందుకే 'అద్దగోడకి,పెద్దకోడలికి పనెక్కువ'అనే నానుడి పుట్టింది.
=====

Tuesday, 27 January 2026

దొందూ దొందే!!!

దొందూ దొందే!!!

ఒకకొత్తగా పెళ్ళయిన జాయ,పతి. ఇద్దరూ కలసి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నది దాటాల్సి వచ్చింది. పడవెక్కి, ప్రయాణం తరవాత దిగేరు. నది ఒడ్డు ఎక్కుతూ తలపైకెత్తి చూస్తే, ఒడ్డున విరగబూసిన చింతచెట్టు కనపడింది ఇద్దరికీ,

పతి అసంకల్పితంగా   

తింతతెట్టు పూసిందే అన్నాడట!

చింతచెట్టు పూసిందే అన్నమాట.

దానికి జాయ మాటకలుపుతూ

తాతే పూతే తాలానికి తాయదా? పూయదా? అందట.

కాచే పూచే కాలానికి కాయదా?పూయదా అని ఆమె మాట. 

ఒకరికి "చ"పలకదు,మరొకరికి "క" "చ" రెండూ పలకవు.

ఇది విన్న పడవ సరంగు దొందూ దొందే!అన్నాడు.

ఇద్దరూ ఇద్దరే అన్నమాట. ఇతని "ఇ", "ర", ఒత్తులు పలకవు. 

ఈ చిన్ని కతని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మేధావుల పరంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఒకరిని మరొకరు ఉత్పేక్షాలంకారలో పొగుడుకుంటూ ఉంటారు.

Monday, 26 January 2026

కలికాలం

 భారత గణతంత్రదిన శుభకామనలు


కలికాలం 


కలికాలం I

ఇది కలికాలం II


ఆకలి కాలం, 

మూకల కాలం,

కేకల కాలం,

రూకల కాలం. 


కలికాలం I

ఇది కలికాలం II


రూపుల కాలం,

మాపుల కాలం,

రేపుల కాలం, 

పాపుల కాలం.


కలికాలం I

ఇది కలికాలం II


చూపుల కాలం

రాపిడి కాలం

చావుల కాలం

దోపిడి కాలం.

Thursday, 22 January 2026

రోగం రొష్టు-సంసారం గుట్టు

 రోగం రొష్టు-సంసారం గుట్టు


ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!

 రోగం రొష్టు

ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి  ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి.   నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన  దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో!  ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ  రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు.  టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.   


ఇక సంసారం గుట్టు. 

సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట  వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం.   బయట చెప్పుకునేవా?  అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే  అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు


ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం 

మంత్రమౌషధ సంగమౌ 

దానమానావమానశ్చ

నవగోప్యా మనీషిభిః 


వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం.  ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.    

Friday, 16 January 2026

తీర్థానికి వెళ్ళొచ్చా!

       తీర్థానికి వెళ్ళొచ్చా!

 తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట. 

మళ్ళీ సంవత్సరమేమో మనమేమో అని ఒకసారి తీర్థం చూసిరావాలనుకున్నా

ఈ  ఊరువచ్చింది మొదలు తీర్ధం చూస్తూనే ఉన్నా. భోగినాడు ఉదయమే అమ్మను దర్శించడం ఆనవాయితీ,కాని తీర్ధానికి వెళ్ళాలంటే దీపాలు పెట్టేకానే వెళ్ళాలి,అందుకు సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళడానికి ముందుగా కోడలమ్మాయికి చెప్పేను. అబ్బాయికి చెప్పినట్టుంది, ఎప్పుడు వెళదాం తీర్థానికని అడిగాడు. సంక్రాంతిరోజు రాత్రి 6 దాటాకా అనడంతో నా తీర్థానికి ప్రయాణం నిశ్చయమయింది. నా చిన్నకొడుకు ఇప్పుడు నువ్వు తీర్థానికి వెళ్ళకపోతే నష్టమేం లేదు,జనంలో నడవలేవని విసుక్కోలేదు.  బండి మీద తీసుకెళ్ళి తీసుకొస్తా,భయము లేదని చెప్పి ఒప్పించాడు. 

ఎక్కడికి ఒకడినే వెళ్ళే సాహసం చెయ్యడం మానేసి చాలాకాలమయింది,పిల్లలతోడు అవసరమూ అయింది. బయలుదేరాలంటే ముందు కోడలమ్మాయి స్వెట్టరు తొడికి మంకీ కేప్ పెట్టి కర్ర చేతికిచ్చి తయారుచేసి బండెక్కించింది. బండి ఎక్కడ పెట్టాలో వగైరా చెప్పబోతుంటే నేను చెబుతారండి అనేసేడు. నాకేమో, వాడు చిన్నపిల్లాడిలా కనపడతాడు. వాడేమో ఏభైదాటి లోకం చూస్తున్నవాడు. అన్నీ తెలుసని వాడనుకుంటే చిన్నపిల్లాడు ఏమీ తెలియనివాడని నేననుకుంటా ఇక్కడొస్తుంది తేడా కాలం మారిందన్న విషయం మరచిపోతుంటా,పిల్లల దగ్గర.  

అలా తీర్ధాని చేరి దూరంగా భద్రంగా ఉండే చోట బండి పెట్టేకా నా కర్రతో నా నడక తీర్థంలోకి మొదలయింది.  జనం,ఒకటే జనం. అదేమో 100 అడుగులరోడ్డు  రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి-కాకినాడ కాలగట్టు రోడ్డు దాకా ఒక కిలో మీటర్ పొడుగు, దానిలో ఈ తీర్థం. ఎల్.ఇ.డి దీపాలతో తీర్థం వెలిగిపోతోంది. లోపలికి అడుగెట్టగానే గుండెలవిసేలా డి.జె సౌండు, గుండెలు పట్టేసినట్టయింది. గబగబా ఆ ప్రదేశం నుంచి కదలిపోయా,ముందుకు.,జనంలో. 

                                                      అమ్మగారబ్బాయి.


గ్రామ దేవత వీరుళ్ళమ్మ

కత్తి చేతితో దొరికిందట,మ్మఅందుకు వీరులమ్మ
( వీరుల తల్లి) అని నామకరణం చేసేరు. ఆ తరవాత అదికాస్తా వీరుళ్ళమ్మ ఐపోయింది. ఇది ఒకప్పటి ఫోటో,నేడు గుడి చాలా అభివృద్ధి చేసేరు. అమ్మను మొన్న భోగిరోజు ఉదయమే దర్శించి వచ్చా..

మా (స్లోగన్)నినాదం అందరూ బాగుండాలి,అందులో మనముండాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.




ఈ సారి గాజు సామాను కొట్లు,పింగాణీ సామాను కొట్లు ఎక్కువ వచ్చాయి.
తీర్థంలో అడుగెట్టగానే ఛాట్ మసాలా వాసన గుప్పున కొట్టింది. తీర్థంలో  పానీ పూరి,ఇతర తినుబండారాల కొట్లే ఎక్కువ కనపడ్డాయి. అక్కడే జనం ఉన్నారు. 

జైశ్రీరాం జండాలు బాగానే అమ్ముడుపోతున్నాయి.ఒకటి కొన్నా!


బతికి ఉన్న త్రాచునే మెడలో వేయించుకుందో అమ్మాయి. ఫోటో తీసేలోపు తీసేసింది. నీ ధైర్యానికి మెచ్చే, అని చెప్పేను. భర్త అనుకుంటా ఆ తరవాత ఆముదం తాగినవాడిలా మొహం పెట్టి పామును మెడలో వేయించుకున్నాడు,తాను భయపదటం లేదని. నేను ఆ అమ్మాయిని ప్రశంస చేస్తుంటే జనం మూగేసేరు,చుట్టూ. ఈ సందర్భంగా ఒక శ్లోకం గుర్తొచ్చింది.


స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే. 

మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.


పచ్చబొట్టు వేసేవాళ్ళు ఇద్దరు కనపడ్డారుగాని,వేయించుకునేవాళ్ళే కనపడలేదు. కిందటి సారి ఇల్లాలితో  వచ్చినపుడు జరిగిన సంభాషణ గుర్తొచ్చి మనసు చేదు తిన్నట్టయింది  


వాచీల కొట్టు. ఇంకా వాచీ పెట్టుకునేవాళ్ళు ఉన్నారా అనుకున్నా ఏదైనా 150, కొంటున్నారు. రెండు కొట్లు కనపడ్డాయి. 



కాలవగట్టు రోడ్డు,మైన్రోడ్డు కలిసేదగ్గర వెలసిన రాజరాజేశ్వరీ దేవి. వీరుళ్ళమ్మ,రాజరాజేశ్వరీ దేవిల ఆలయాల మధ్య ఈ తీర్థం. ఇద్దరమ్మల కాపు.


మెత్తటి రాయి (సోప్ స్టోన్) తో తయారు చేసిన పిల్లల ఆటవస్తువులు,రుబురోళ్ళు,వగైరా


జీళ్ళు,ఖర్జూరం కొట్లు తక్కువగానే ఉన్నాయి,రెండో మూడో కనపడ్డాయి.



                                                    బొమ్మల కొట్లు ఎక్కువే ఉన్నాయి.


జనంలో నడవడమే కష్టమయింది. ఎక్కువ ఫోటో లు తీయలేకపోయా.మొత్తానికి స్త్రీల అలంకరణ సామాను,పిల్లల ఆటబొమ్మల కొట్లు ఎక్కువ. జయింట్ వీల్ ఉన్నవైపు పోలేదు. ఇక్కడికే నీరసమొచ్చింది. దేవి సెంటర్ లో గుడి పక్క క్రీనీడలో నిలిచాడొక ఎస్.ఐ గారు,నీరసం మొహాన కొట్టినట్టు కనపడుతూనే ఉంది. భోజనం చేసేరా? అడిగా, లేదు, అన్నాడు. అయ్యో! అని, కేరేజి తెప్పించుకోవచ్చుగా ఇంటినుంచి అన్నా! భోజనం చేయడం కుదరదండి, ఈ మూడు రోజులూ ఇంతే,టిఫిన్ తోనే కాలం గడపాలన్నాడు. దగ్గరేం లేకపోయింది,తినడానికి ఇవ్వడానికి. పాపం! పోలీస్ జీవితం ఇంతేనా అనిపించింది. 

Wednesday, 14 January 2026

పట్నాలలో, పల్లెలలో కూడా,

                                               పట్నాలలో, పల్లెలలో కూడా

తెల్లవారు ఝామున లేచే అలవాటు లేదు.
ఒంటిని నువ్వులనూనె రాసింది లేదు.
సున్నిపిండి లేదు.
నలుగు మొదలే లేదు. 
మాగిళ్ళు వదిలింది లేదు.
కుంకుడు కాయ,షీకాయ తలంట్లు లేవు.
సాంబ్రాణి పొగ వేసే అలవాటు లేదు. 
నిప్పుల కుంపటి లేదు.
నీళ్ళ పొయ్యి, బొగ్గులసలే లేవు. 
టైలర్ కుట్టిన బట్టలు లేవు.
లంగా ఓణీ వేసిన ఆడపిల్లలేదు.
పంచగట్టిన, కోరమీసమున్న మగాడు లేడు.
తెనుగు రాయను చదవను వచ్చినవారు లేరు.
రెండు మాటలకు ఒక ఇంగ్లీషు పదం మాటాడని తెనుగువాడు లేడు. 
పిజ్జాలు బర్గర్లు అల్పాహారం, ఆవిరికుడుములు వగైరాలు లేవు.
వంట చేసిన ఇల్లు లేదు. 
దానం లేదు,ధర్మం మొదలే లేదు.
హస్తకళలు లేవు.
హరిదాసులు,కొమ్మదాసర్లు,గంగిరెద్దులు లేవు.
ముగ్గు వేసిన వాకిలి లేదు.
వరి కళ్ళాలు లేవు.
కంది చేలు కనపడటం లేదు.
పెరడున్న ఇల్లు లేదు.
మొక్కలు,చెట్లు ఉన్న ఇళ్ళు మొదలే లేవు.
కార్నివాల్స్ తప్పించి తీర్థాలు లేవు.
వేష భాషల్లో ఆడా,మగా తేడా లేదు.
ఉమ్మడి కుటుంబాలు లేవు.
బంధువులే లేరు.
వదిన,మరదళ్ళ సరసం లేదు.
బావా మరదళ్ళ హాస్యం లేదు.
దొంగ ముద్దులు లేవు.
పడుచు జంటలు లేవు.
పిల్లలు లేరు.
సెల్ ఫోన్ లేనివారు లేరు.
నెట్ లేనిఫోన్ లేదు. 
మందుకు తప్ప, తిండికి డబ్బు లేదు.
కోడిపందాలు లేని ఊరు లేదు. 

చిభాశర్మ

శుభం

శుభం







 

Monday, 12 January 2026

నిషేధం

నిషేధం.


ఏరకుమీ కసుగాయలు

దూరకుమీ బంధుజనుల దోసము సుమ్మీ

బారకుమీ రణమందున

మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ

పచ్చి కాయలు కొయ్యకు.బంధువులలో లోపాలు ఉండచ్చు,అంతలో వారిని తూలనాడడం తగదు,తప్పు సుమా! యుద్ధరంగం నుంచి పిరికివాడిలా పారిపోకు.దేశానికి అవసరమైనపుడు పారిపోవడం తప్పు.గురువు చెప్పిన మాట అతిక్రమించకు.


నేటికాలంలో పచ్చికాయలే కోసి, రకరకాల కృత్రిమ పద్ధతుల ద్వారా పండబెడుతున్నారు. అన్ని స్థాయిలలోనూ, కృత్రిమంగా పెంచుతున్నారు. అన్ని కాయలకి పళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు. చివరికి, కొబ్బరికాయ కల్తీ లేనిదనుకున్నా నేటి దాకా,కాదు కొబ్బరికాయకి చెట్టున గెలపై ఉండగా ఇంజక్షన్ చేస్తున్నారు. మనల్ని దేవుడే రక్షించాలి.  


బంధుజనలెక్కడబాబూ! ఒకప్పుడు ఇద్దరు లేక ముగ్గురుచాలు మారోజుల్లో మాట, అరవైయేళ్ళ పైమాట. ఆ తరవాత మేమిద్దరం మాకిద్దరు,ఇదీ స్లోగను. ఆపై మేమిద్దరం మాకొక్కరు. ఇప్పుడు స్లోగన్ పెళ్ళొద్దు పెళ్ళాం కావాలి,పెళ్ళొద్దు మొగుడు కావాలి,ఇదీ స్లోగను. ఏరోజుకారోజే కొత్త మొగుడు,కొత్తపెళ్ళాం. లివ్ ఇన్ చాలు,పిల్లలా? బెడద. ఇక బంధువులెక్కడనుంచి వస్తారు? ఎవడి పెళ్ళాంతో ఎవడేనా తిరగచ్చు, లైనేయచ్చు, తప్పుకాదు.. ఆడామగాకి తేడాలేని రూలు, ఇదే చట్టం,ఇదే న్యాయం. ఇప్పుడు రాజకీయ నాయకులు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి, ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నాను,లేదూ, ఎవడి పెళ్ళానికైనా లైనెయ్యాలి.  

  

మూడో ప్రపంచయుద్దం  రాబోతోంది. అంతా సిద్ధం కావాల్సిందే,ముసలి,ముతకతో సహా!  చావో! రేవో!! నేటికాలంలో అందరూ కీబోర్డ్ వారియర్లే, అలా కుదరదు.


గురువు? ఎక్కడబాబూ! అంతలోనూ కట్,పేస్టు ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది. కట్ పేస్టుకి, కాపీ పేస్టుకి తేడా తెలియని గొప్పోళ్ళూ తయారవుతున్నకాలం. ఏమవుతుంది,ముందు కాలంలో? భగవాన్ జానే!!!  


Wednesday, 31 December 2025

గడచిన సంవత్సరం 2025

 గడచిన సంవత్సరం 2025


2019లో అనుకుంటా,రతన్ టాటా గారిని అడిగారట. 'ఈ సంవత్సరం మీరు సాధించిందేమిటీ?' అని, దానికి వారు 'ఈ సంవత్సరం బతికున్నాను,అదే ఘనకార్యం' అన్నారట. ఆ సంవత్సరంలో పెద్దవయసు వాళ్ళు చాలామంది కాలంచేసేరు,కరోనా మూలంగా. అప్పటికి ఆయన వయసు 80 దగ్గరనుకుంటా.
ఇప్పుడెందుకిదని అనుమానం రావచ్చు. నాకు తొమ్మిదో పది సమయం కనుచూపుమేరలో కనపడుతోంది. గత సంవత్సరం ముక్కుతోనో మూలుగుతోనో గడిపేసాను. రోజు గడిస్తే పండగ,బోనస్సు అనేలా గడుస్తోంది.
కుంతీ దేవి మేనల్లుడే ఐన శ్రీ కృష్ణుని ఇలా వేడుకుంటుంది.


యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి

చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!


శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!


ఇందులో వేడుకోలు  
 అంటే, ఈ భవలతలు అనగా ఇహలోక బంధాలను తుంచెయ్యవయ్యా, ఆంటుంది. పాండవులందు యాదవులందు మోహ విఛ్ఛేదము,     ఇలా ఒక్క కొడుకులనే కాదు అటు పుట్టింటివైపు వారిమీదా తనకున్న బంధాలను తుంచేలా చెయ్యమంది. ఇలా వేడుకున్నా చివరిదాకా కుంతికి భవలతలు వదలలేదు. అలాగే నాకున్నూ ఈ భవలతలు వదలటం లేదు. ఇవి ఎంత సున్నితం అంటే సాలెపురుగు తననోటి నుంచి స్రవించిన ద్రవంతో అల్లే సాలెగూటి దారమంత సున్నితంగా కనపడతాయి. చిత్రం ఆ సాలెగూటి దారం పెనుగాలివానలకూ తెగదు. నిజo 100 కి.మీ వేగంతో వీచేగాలి దానిని తెంపలేదు.అలా నేటికిన్నీ భవలతలు కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నా ప్రయత్నం వ్యర్ధమవుతూనే ఉంది.



https://kasthephali.blogspot.com/2024/05/blog-post_24.html

విష్ణుమాయ దేనినీ వదలలేకపోతున్నాని తెలుసు, కాని సంపూర్ణ శరణాగతి చెయ్యలేకపోతున్నా! అదే విష్ణుమాయ. దానిని దాటడానికి మహామహుల ప్రయత్నాలే చెల్లలేదు,నేనెంత? అలా అని ఊరుకోలేకపోతున్నా! ఎప్పటికి ఆయన దయ కలుగుతుందో!



శాంతి శాంతి శాంతిః

స్వసి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు. 
ఇక సెలవు
🙏🙏🙏

Sunday, 28 December 2025

ఇందుగలడందులేడని

ఇందుగలడందులేడని 


Courtesy: Whatapp




Courtesy: Whatapp

 

ఇందుగలడందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుండు

ఎందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే!


ఇందుకలడందు లేడను సందేహము వలదు హరి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు,చూసేకన్ను చూడగల మనసు ఉంటే ఎక్కడేనా ఉన్నాడు,అంతెందుకు నీలో ఉన్నాడు చూసుకో! అది చూసుకోలేకనే తిప్పలు పడుతూ ఉన్నాము.

Friday, 26 December 2025

ఊరు పొమ్మంటోంది.....

ఊరు పొమ్మంటోంది..... 

ఊరుపొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అని ఒక నానుడి చెబుతారు, అదేమో చూదాం.

మొన్న, కూచుంటే కాదని కర్రబోటుతోనే వీధిచివరి ఇంటిదాకా వెళ్ళేను. బాబాయ్! నువ్వేవచ్చేవు,బాగున్నావా! ఏరోజుకారోజే వద్దామనుకుంటున్నాను, ఏదీ కుదిరితేనా!! కళ్ళులేని పెద్దపులి,ఈ సంసారంతోనే సరిపోతోంది లెద్దూ అంది,కూచుంటే లేవలేకుండా ఉన్న ఓ కూతురు వరసమ్మాయి. అమ్మా! నీదొడ్లో ఎర్రబచ్చలుంది కదా,నాలుగు కాడలు పట్టుకెళ్ళి, కందా బచ్చలీ కూర చేయించాలని, అన్నా! అయ్యో! బాబాయ్! కబురంపితే నేనే తెద్దును,లేదంటే మీ అల్లుడినే పంపుదును కదూ! వయసైపోయిందిగా తిరక్కు,జాగర్తా! అని నాలుగు కాడలు బచ్చలి కూర చేతిలోపెట్టి కుంటుకుంటూ గేటుదాకావచ్చి సాగనంపింది, ఆ కూతురు.

మొన్న ఒక వైద్య మిత్రుడు కలిసేడు. సుగర్ అదుపులో ఉంది చాలాకాలంగానే , ఒకప్పుడు,సుగర్ ఎక్కువ అదుపులో లేక ఉండిపోవడంతో తిమ్మెరలు వగైరా చిన్నెలు అందుకున్నాయి. డాక్టర్ మందులు రాసారు,వాడుతున్నా, విడవక,కాని తగ్గటం లేదు,ఏమని డాక్టర్ గారినడిగితే మందులు లేట్ గా పని చేస్తాయని అంటున్నారు. ఏమి సంగతన్నా! డాక్టర్ చెప్పినది నిజం వయసైపోయింది కదూ. మందులు పని చెయ్యకాపోవచ్చు. కాని అది చెప్పం, కారణం మీరు నిరాశపడిపోతారని చెప్పం.వయసు మీరిన కొద్ది శరీరంలో రోగాన్ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది,అందుకు మందులు పని చెయ్యవు, పని చేసినా తగ్గినట్టుంటాయి,మళ్ళీ వచ్చేస్తాయని గుట్టు విప్పేసేడు. 

వయసైపోయి వ్యాధి నిరోధకశక్తి పూర్తిగా తగ్గిపోయిన ముసలాళ్ళు కుటుంబాలకి పెద్ద బరువు. వారినేం చెయ్యలేరు,బతికుండగా చంపెయ్యలేరు.వాళ్ళ నిత్య జీవితంలో ప్రతి పనికి వీళ్ళు అడ్డుగానే ఉంటారు. వయసైపోవడంతో వాళ్ళతో కలసి సినిమాలు షికార్లు చెయ్యలేరు,ఒంటరిగా ఇంట్లో ఉండలేరు. ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఒంటరిగా వదిలేసి బయటికిపోతే ముసలాళ్ళు బాధపడిపోతారు.అందుకే వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నారు. ఇది పెద్ద ఇబ్బంది,ఇదీ వయసైపోయినవారి కత.

ఇక కాడు రమ్మనడమేమి? కాడు అనగా శ్మశానము, అది రమ్మని పిలవదు. అక్కడికి తీసుకుపోబడ్డవాడెవడూ తిరిగిరాడు. మరిదేంమాటా? వారణాశిని మహా శ్మశానం  అంటారు. స్మశానం పిలవడం అంటే, కాశీ విశ్వేశ్వరుని మహాశ్మశానంలో అగా వారణాశిలో అంతిమ శ్వాస విడవాలని సనాతనుల కోరిక. అనగా కాశీ రమ్మని పిలుస్తోంది అని చెప్పడం. యువ సంసారాలకి బరువైనవారిని కాశీ పిలుస్తోందని అంటారు.అంటే సంసార బంధాలు వదలిపెట్టు చివరికాలం వానప్రస్తంలో కాశీలో గడపమని అర్ధం.  అదీ ఊరుపొమ్మంటోంది కాడు రమ్మంటోంది కత.  

Wednesday, 24 December 2025

నాహం కర్తా హరిః కర్తా

                                 నాహం కర్తా హరిః కర్తా          

తిరుమల  కొండమీద వేంకటేశ్వరుని       ఆలయంలో ధ్వజస్తంభం  మాను పుచ్చిపోయింది!                                       

 

శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. 


అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.

"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."


...  మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే,  ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది.                                     మరి ఎలా నిలబడింది ? 

ధ్వజస్థంభంపై నున్న  బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...


పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.  

నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ... 

రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు... 

మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ... 


50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని  సంపాదించి  ప్రతిష్టించాలి.  

ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు. 

కొమ్మలు ఉండకూడదు. 

ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.

దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి. 

... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?  


అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. 

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది.  ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !! 


ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’


అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో  లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....  

……..

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి. 


ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.


అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?


విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది. 


వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?)....... 


ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది. 

అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.


‘‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’ 

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే  ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.  


మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.                            

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు.   ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది. 


ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!


ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?) 


- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. 


మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్దలయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ? 

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’ 


ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. 

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’- 


బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి  ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు. 

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది. 

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?


అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !  

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. 


ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. 

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను. 


ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...! 


అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు : 

‘‘నాహం కర్తా హరిః కర్తా

తత్పూజా కర్మ చాఖిలం

తదాపి మత్కృతా పూజా

తత్ప్రసాదేన నా అన్యథా’’


“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.”

(Source: పూర్వ ఐఏఎస్ అధికారి  పివిఆర్ కె ప్రసాద్ గారు రచన  'నాహం కర్తా, హరిః కర్తా')

ఓం నమో వేంకటేశాయ 10 what's app గ్రూప్స్ కి షేర్ చేయండి అంత మంచి జరుగుతుంది 🙏

Courtesy:Whats aapp

Monday, 22 December 2025

కొడుకుని నమ్ముకునేకంటే...

 కొడుకుని నమ్ముకునేకంటే...



కొడుకుని నమ్ముకునేకంటే కొబ్బరిచెట్టును నమ్ముకుంటే మేలు అని, కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టును పెంచుకోవడం మేలు అనీ మా కోనసీమ వాసులు అనుకునేమాట. అలా అనుకోలేదుగాని ఇల్లాలు ఈ కొబ్బరిమొక్కని పది పన్నెండేళ్ళకితం నాటింది. ఎవరింటికో ముత్తయిదు వాయనానికి పిలిస్తే వెళ్ళగా వారు ఇచ్చిన బొండం ఇంటిలో ఉంచగా,దానికి మొలక కనపడింది. దానిని సద్వినియోగం చేస్తానని పక్క పెరటిలో పాతింది. దానిని సంరక్షణ చేయకపోయినా పెరిగి పెద్దదయింది. నాటిన అమె కాలం చేసి 7 ఏళ్ళు దాటింది. మొదటి సారిగా కాయలు దింపితే దగ్గరగా నలబై కాయలు లెక్కకొచ్చాయి. మంచి పని చేసిపోతే ఫలితం తరవాత వారైనా అనుభవిస్తారుగా!          

Sunday, 21 December 2025

డిసెంబర్ 21 (Longest night) -భాస్కరదర్శనం

 డిసెంబర్ 21 -భాస్కరదర్శనం


 డిసెంబర్ 21 తేదీనాడు సూర్యుడు, భూమి యొక్క దక్షణార్ధగోళం లోని మకరరేఖకి అభిముఖంగా ఉంటాడు. దీనివల్ల ఇప్పటికే వేసవితో అల్లాడుతున్న అస్ట్రేలియా,న్యూజిలాండు,దక్షణ ఆఫ్రికా,దక్షణ అమెరికాదేశాలకి మండుటెండ, ఐతే మనకి చలి చాలా బాధ పెడుతోంది. మనకంటే యూరప్ ఉత్తర అమెరికా,రష్యా దేశాలైతే చలికి వణుకుతున్నాయి. సూర్యుని రెండు ఆయనాలలో ఉత్తరాయణంలో మనకు మండుటెండలు కదా. అందునా కర్కాటకరేఖ మనదేశం మీదుగా ఉంటుంది.నేడు మనకి రాత్రి భాగం ఎక్కువుంటుంది,అనగా సూర్యాసమయ,సూర్యోదయ కాలాలమధ్య సమయం సంవత్సరంలోని ఇతరరోజులకంటే ఎక్కువ ఉంటుంది. (Longest night) నేడు యాదృఛ్ఛికంగా ఒక మిత్రుడు గ్రూప్ లో పెట్టిన వీడియోలో ఉషా,ఛాయా,పద్మినీ,సౌజ్ఞా  సహిత సూర్యనారాయణమూర్తి నిజదర్శన భాగ్యం కలిగింది. ఎన్నిసార్లు గొల్లలమామిడాడలోని స్వామిని దర్శించినా ఈ దర్శన భాగ్యం నోచుకోలేదు. 

Friday, 19 December 2025

నెలగంట

 

నెలగంట

ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంది,అనగా సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశికి మారే రోజు సంక్రమణం. మూడు రోజులకితం సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనూరాశికి మారాడు. ఈ నెలకాలాన్నీ ధనుర్మాసం అంటారు.రాబోయే మాసం మకరమాసం. మకరసంక్రమణం రోజునే మనం పెద్దపండగ అంటాం. ఈ ధనుర్మాసంలో మొదటిరోజునుంచి నెల చివరి వరకు  వైష్ణవాలయల్లో ఉదయం నాలుగు గంటలకి జరిగే  ఉత్సవం,ఈ నెలగంట. ఉదయమే నాలుగు గంటలకి నిద్రలేచే అలవాటు చేయడమేమో! అలాగే నగరసంకీర్తనం అనగా విష్ణుభక్తికి సంబంధించి కీర్తనలు పాడుతూ నగరవీధులలో ఉదయమే నాలుగు మొదలు ఆరుదాకా చేసే ఉత్సవం.