కష్టేఫలి
2, జూన్ 2026, మంగళవారం
28, మే 2026, గురువారం
పాఠకదేవుళ్ళు-సందేహాలు.
పాఠకదేవుళ్ళు-సందేహాలు.
ఎవరో మెయిలిచ్చారు. ఈ టపాలో,కామెంట్లలో ఉన్న కొన్ని మాటల అర్ధం, వివరణ ఇవ్వండి, అన్నారు. ఆ మాటలేవో చెప్పలేదు. అనగా ఆ మాటలు నేనే కనుక్కొవాలి,వాటి అర్ధమూ నేనే చెప్పాలి,చిత్రం. మరో విశేషం సమాధానం ఇక్కడే బ్లాగులోనే చెప్పాలి,ఇది తియ్యటి ఆజ్ఞ,పాఠకదేవులది. వీలు వెంబడి చెబుతా,ముందు వాటిని వెతికి పట్టుకుని. 🤣😘 వేడి దంచుతో ఉంది మరి.
ఆ ప్రకారంబుగా టపాను,కామెంట్లను చదివినవాడనై సోచాయించితి కాని నాకెక్కడను కొత్తపదముల జాడ కనుపట్టనే లేదు. మరలనొకసారి జాగరూకుడనై టపా మొత్తము పదము పదముగా చదువగా రెండు నిత్యమూ వాడుకలో లేని పదములు కనుపట్టినవి. ఆపై కామెంట్లలో మరొకటిన్ని కనుపట్టినది,అవి ఈ విధముగానున్నవి.
1. కరారావుడు చుట్టడం.
2. గుంటబెట్టి గంట వాయించడం.
3. నెత్తిన చేటగొట్టడం.
వీటిని నానుడులని కూడా అంటారు. వీటిని మా పల్లెటూరివాసులు బహు రమ్యంగా వాడుతుంటారు,అందుకు అలా దొర్లిపోయాయనమాట సందర్భానుసారంగా. వీటిని వివరించమన్నారు గనుక.
కరారావుడు చుట్టడం:- క కింద రవత్తిస్తే క్ర, ఈ రావత్తును వడి చుట్టడం అనగా ముందుకు,వడిగా చుట్టడం,అంటే రవత్తును పూర్తిచేస్తే సున్నా అయింది. దీన్ని 'క్రావడి' చుట్టడం అనేవారు కాలంలో సున్నా అని చెప్పడానికి గాను కరారావుడు చుట్టేసేరు అంటుంటారు. ప్రస్థుత సందర్భం, " DMK కాంగ్రెస్ ను తమిల్నాట ఇకముందు కరారవుడు చుట్టేసినట్టే". అంటే DMK ఇకముందు కాంగ్రెస్ కు తమిల్నాటు సున్న చుట్టేసినట్టే అని అర్ధం.
గుంటబెట్టి గంట వాయించడం:- చనిపోయినవారిని తగులబెట్టడంగాని పూడ్చి పెట్టడంగాని చేస్తారు. భారత దేశంలో వైవిధ్యం ఎక్కువ. కొందరు తగులబెడితే కొందరు పూడ్చి పెడతారు. ఈ పూడ్చి పెట్టడం లోనూ తేడాలున్నాయి. కొందరు పడుకోబెడితే కొందరు కూర్చోబెట్టి ఖననం చేస్తారు. ఈ కూర్చోబెట్టి ఖననం చేసేవారిలో కూడా తేడలున్నాయి. కొందరు కొందరు కూర్చోబెట్టి పూడ్చేటప్పుడు గంట కొడతారు. గుంటబెట్టి గంట వాయించేరంటే ఖననం చేసేరని అర్ధం. ప్రస్థుత సందర్భం "ఇండీ అలయన్సును గుంటబెట్టి గంట వాయించినట్టే" అంటే ఇండీ అలయన్సును ఖననం చేసినట్టే అని.
నెత్తిన చేటగొట్టడం:- ఇంట్లోని దుమ్మును చీపురుతో ఊడుస్తారు,అదే చీపురుతో చేటలోకి ఎత్తుతారు. దుమ్ముతో ఉన్నచేటను బయట పారబోస్తూ చేత ఉన్న చీపురుతో చేటను కొడతారు,మిగిలినది కూడా పోవడానికి. ఇక ప్రస్థుత సందర్భం, "రాఘవఛద్దా కబుర్లు చెప్పి కేజ్రీవాల్ నెత్తిన చేటగొట్టి, మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయేడు బి.జె.పిలో చేరిపోయాడు". రాఘవ ఛద్దా ఆమాద్మీ పార్టీగుర్తు చీపురును పట్టుకుని పార్టిలో ఉన్న దుమ్ము తుడిచి చేటలో ఎత్తి కేజ్రీవాల్ నెత్తిన చేటతో పోస్తూ చీపురుతో కొట్టినట్టు, తన కూడా ఉన్న మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయాడు,బి.జె.పిలో చేరి పోయాడే అదికదా బాధ.
ఇక్కడికీ అంకం అయినట్టేనా?
మరో ముచ్చట, మరో పాఠకదేవులదే! దీనికి ఓ వారం ముందేమో, ఒకరు మెయిలిస్తూ మీ బ్లాగు టపాల పి.డి.ఎఫ్ పంపగలరన్నారు. ఏడుపే వచ్చింది, నా బ్లాగుటపాలు పుస్తకాలుగా వేసేను. కినిగేవారు వేసేరు,కొంత సొమ్మూ రావాలి, ఈ లోగా కినిగే మూసేసేరు,నా సొమ్ములూ రాలేదు,వారు కనీసం నా books పంపలేదు. ఇదే పాఠకదేవునికి విన్నవించా!
శలవు.
25, మే 2026, సోమవారం
రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.
రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.
ఈ రోజు రోహిణి ప్రవేశించింది. From May 1st.ఇప్పటి వరకు 40/45 డిగ్రీల వేడి మలమల మాడ్చింది. వేడిగాలులు వీచాయి. నేటి నుంది 44/48 మధ్య వేడి ఉంటుందని సూచనుంది తగినట్టుగానే నేడు 44/46 మధ్య వేడి దంచుతోంది.వేడి గాలులు వీస్తున్నాయి. కరంటు ఉండడం మా అదృష్టం మీద ఆధార పడిఉంది. కరంటు వాళ్ళు మాత్రం మనుషులు కారా! వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వేడికి జంపర్లు కాలుతున్నాయో,ట్రాన్స్ఫార్మర్లు పేల్తున్నాయొ! మరో వారందాకా ఇంతేలా ఉంది. వారందాకా మా లాటి ఘటాలు ఉంటాయా? భగవదేఛ్ఛ.
11, మే 2026, సోమవారం
రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.
రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.
అసోం,ప.బంగాల్,తమిల్నాడు,పుదుచ్చేరి,కేరళం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి,ఫలితాలూ వచ్చాయి. ఒక్కో రాష్ట్రరాజకీయం ఒకోలా వుంది,చూదాం,స్థూలంగా.
అసోంలో ఎన్.డి.ఎ పరిపాలిస్తోంది,ఆ పార్టీయే మళ్ళీ 102/126 లో మెజరిటీలో ఉంది. ప్రతి పక్షంగా ఇండీ అలయెన్స్ కు 24/126 వచ్చాయి. కాంగ్రెస్ కలిసిన ప్రతిపక్షం,ఇక్కడ మరియు ప.బంగాల్ లో ఎన్నికలు దొంగిలించబడ్డాయంటోంది. తాను మెజారిటీ సాధించిన చోట దొంగిలింపబడలేదా? అంటున్నారు,నెట్ జనులు🤣. ఇక్కడే రాజకీయంలేదు.
ప.బంగాల్ లో స్వతంత్రం రాకముందూ రక్తపుటేరులు పారేయి.
https://rayssolassspace.quora.com/If-the-BJP-comes-into-power-in-Delhi-in-2025-will-Jawaharlal-Nehru-University-be-shut-down
https://india-and-the-world.quora.com/Revenge-of-Hindus-how-KOLKATA-was-saved-from-becoming-part-of-Pakistan-the-story-of-GOPAL-PATHA-Jinnah-chose-Kol
ఇప్పుడూ పారుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్.డి.ఎ 206/294 సాధించింది, అధికారంలో ఉన్న మమత దీదీ నేనే నెగ్గేను,ము.మంత్రి పదవికి రాజీనామా చెయ్యనంటోంది. ఆ తరవాయి గవర్నరు సభనే రద్దు చేసేరు,ఇక మమత రాజీనామా చేసిన మానినా ఒకటే! దీదీ పరిపాలనలో మాటాడటమే కాదు,వోటెయ్యడానికీ జనం భయ పడ్డారంటున్న వార్తలు మిక్కుటం. రక్తం పారింపుకు ఆదిగా సువేందు అధికారి పి.ఎ హత్య చేయుబడ్డాడు,ఎన్నికల తరవాత. ఇక కలకత్తాలో రక్తం పారిన సంఘటనలు కోకొల్లలు.
స్వతంత్రం తరవాత కాంగ్రెస్ పాలనలో మొదటగా బి.సి.రాయ్ లాటివారు ముఖ్యమంత్రయితే చివరికి సిద్ధార్థ శంకర్ రాయ్,(ఇందిరమ్మకి ఎమర్జన్సీ పెట్టమని సలహా ఇచ్చినవాడు) లాటివాడు CM.. ఆ కాలంలో ఆ రోజుల్లో పేపరు తీస్తే ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తల హత్యలే కనపడేవి అలా కమ్యూనిస్టులు భయం సృష్టించి ప.బంగాల్ ని వశపరచుకున్నారు. 34 సంవత్సరాల పరిపాలనలో భయమే నెలకొంది. ఆపై కాంగ్రెస్, బాజపాయి ల సహాకారంతో మమత ప.బంగాల్ను స్వాధీన పరచుకుని కమ్యూనిస్టులను తలెత్తుకోనీయక0డా వారిపంధాలోనే పరిపాలన చేసి 15ఏళ్ళ తరవాత ఓడిపోయింది. ఇంతకాలంలోనూ ప్రజల రక్తంపారింది,భయోత్పాతమే సృష్టంపబడింది. ఇక ముఖ్యమ0త్రిగా ఎన్నికైన సువేందు అధికారి ఎన్.డి.యే పాలనలో ఎలా ఉంటుందో చూడాలి.
పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరిగేయి,కనుకలిగినట్టుగా. అక్కడ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి సైకిల్ మీద తిరుగుతూ బడ్డీ కొట్టు దగ్గర టీ తాగి డబ్బులిచ్చి వెళ్ళే రకం. మళ్ళీ ఆయనే ఎన్నికయ్యాడు,మెజారిటీ వచ్చింది,మళ్ళీ ముఖ్యమంత్రీ అవుతాడు. ఈ రాష్ట్రమూ ఎన్.డి.ఎ కాతాలో ఉన్నదే!
తమిల్నాడులో ఎన్నికలు జరిగి డి.ఎం.కె ను మట్టికరిపించి మరో పార్టీని కూడా ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ను కూడా అధికారానికి దూరంగా ఉంచారు. ఇక మూడో శక్తి టి.వి.కె నుకూడా అధికారానికి పూర్తిగా దగ్గరకు చేరనివ్వక మెజారిటీకి పదికి తక్కువగా సీట్లిచ్చి నిలబెట్టేరు. ఇక తమిల్ సినిమా కత మొదలయింది. ఎక్కువ సీట్లొచ్చాయి,మెజరిటీ లేకపోయినా నేనే ముఖ్యమంత్రి అంటాడు,ప్రమాణ స్వీకారం చేయించెయ్యండి, అన్నాడు. నిన్ను బలపరుస్తున్నవారి సంతకాలతో letters పట్టుకురావయ్యా అంటే మూడు సార్లు తిరిగాడు, పనికాలేదు. ఈలోగా గవర్నర్ను,బి.జె.పిని తిట్టుకున్నవారు కోకొల్లల్లు. చివరగా మద్దతు ఇచ్చిన MLAలు ఇద్దరున్న పార్టీ హిరణ్యాక్షవరాలతో మద్దతివ్వడంతో, నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది, 13వ తారీకు లోగా సభలో మెజారిటీ నిరూపించుకోవాలి,ఇది గవర్నర్ తాకీదు. ఏమి జరగనుందో,చూడాలిసిందే!
పెద్ద చిత్రం తమిల్నాట జరుగుతోంది. డి.ఎం.కె పనుపున CPI,CPM,IUML,CVK పార్టీలు అధికారకుర్చీ నాలుగుకోళ్ళులా మారాయి, విజయ్ పార్టీని, అధికార కుర్చీబలపరుస్తున్నాయి,ఇదెంతకాలం కొనసాగేనో! కాంగ్రెస్,CPI,సిపిఎం,సివికె పైకి కుస్తీ లోపల దోస్తీ రాజకీయం జరుగుతోందా? ఎవరి తరఫున? ఇది బయటపడుతుంది,నెమ్మదిగా!!!
ఇక చివరగా కేరళంలో ఎల్.డీ.ఎఫ్ ను దించి యు.డి.ఎఫ్ కు అధికారమిచ్చారు. ముఖ్యమంత్రెవరో దగ్గరగా పదిరోజులవుతున్నా అధికారానికొచ్చిన కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోందంటున్నారు.
ఇన్ని ఎన్నికలలోనూ జాతీయ పార్టీలకి జరిగిన లాభనష్టాలేమి? కొచ్చను.
జాతీయ పార్టీలు బి.జె.పి,కాంగ్రెస్,సి.పి.ఐ,సి.పి.ఎం. చివరై రెండు పార్టీలు జాతీయపార్టీలా అంతర్జాతీయ పార్టీలో తేల్చుకోలేకపోయాను. బి.జె.పి. అసోం,పుదుచ్చేరిలను తననుంచి వదులుకోలేదు, ఇక ప.బంగాలు లో అధికారం చేజిక్కించుకుంది. ఇక tamilnaadu లో,కేరళంలో అధికారానికొస్తానని అనుకుని ఉండదు.
కాంగ్రెస్ కు చెప్పుకోతగ్గ విజయం కేరళ. అసోంలో 24/126 ప్రతిపక్షం. ప.బంగాలులో-2,తమిల్నాట-5 సీట్లు గెల్చుకుంది.కాంగ్రెస్ కి లాభం కంటే నష్టమే ఎక్కువ,దేశవ్యాప్తంగా. తమిల్నాట అధికారకుర్చీ కోడుగా మారిపోవడమేకాదు,డి.ఎం.కె తనను మోసంచేసిందని తెగతెంపులు చేసుకుంది.DMK congress ను తమిల్నాట, ఇకముందు కరారావుడి చుట్టేసినట్టే! ఇక ఉత్తరాదిని ఎస్.పి ఆలోచనలో పడింది. ఇండీ అలయన్సును గుంటబెట్టి గంటవాయించినట్టే.
ఇక సిపిఎం,సిపీఇ పార్టీలు. సి.పి.ఎం ప.బంగాల్ లో-2 సాధించింది. తమిల్నాట-2 సాధించి తమిల్నాట అధికార కుర్చీకోడుగా మారిపోయింది,తమ సహచర సి.పి.ఐ-2 తో కలసి.
చిత్రం ఏమంటే ప.బంగాల్ లో పదిహేనేళ్ళుగా మమతపరిపాలనలో తృణమూల్ స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్,సి.పి.ఎం పార్టీలు తమ ప్రాంతీయ ఆఫీసులను, (బి.జె.పి అధికారంలో కొచ్చిన తరవాత) తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టు వార్తలు.
26, ఏప్రిల్ 2026, ఆదివారం
రాముని రాజ్యం-భరతుని పట్టం-4
రాముని రాజ్యం-భరతుని పట్టం-4
ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
భరత గుహుల మధ్య మొదటి బేటీ ముగిసింది.తరవాత భేటీ రాత్రి, పురంలో మొదలయింది,ఆదర గౌరవాల మధ్య. గుహుడు మాటాడుతూ ఆ రోజు రాముడు పురంలోకి రాలేదు,కారణం వనవాసం చెప్పేడు, ఆ రాత్రికి గారచెట్టుకింద గడ్డిలో శయనించాడు. మేమిచ్చిన పళ్ళు కూడా తీసుకోలేదు,కారణం ముని వృత్తి అనిచెప్పేడు.లక్ష్మణడు తెచ్చిన గంగతాగేరు,అంతే! ఏమీచేయలేకపోయాం అని చెబుతూ సీతారాములు ఆ రోజు రాత్రి శయనించిన గారచెట్టు దగ్గరకి దారితీసాడు. గారచెట్టుకింది గడ్డిని పరిశీలించిన భరతుడు అక్కడ సీతారాములు శయనించిన గుర్తులు చూసి, అన్నా, వదినలు హంసతూలికా తల్పం మీద శయనించేవారు,ఇలా గడ్డిలో పడుకోవడాన్ని చూసి, ఇవిగో రాత్రి పడుకున్నపుడు గడ్డి ఒత్తుకున్న ఆనవాళ్ళు,ఇదిగో సీతమ్మ చీరకొంగునుంచి గడ్డిని అంటుకున్న బంగారు జలతారు పోగు , ఇలాపరిపరివిధాల వేదనపడి మూర్ఛపోయాడు. తల్లులు ముగ్గురూ వచ్చి భరతుని సేద తీర్చారు.
ఆపై గుహుడు భరతునితో ఇలా చెప్పేడు. సీతారాములు శయనించగా లక్ష్మణుడు విల్లంబులతో రక్షణగా నిలిచాడు. అప్పుడు నేను లక్ష్మణా నేనే స్వయంగా విల్లంబులు తీసుకుని రక్షణగా ఉంటా నీవూ శయనించన్నా! వినలేదు. ఇక్కడ ఆకు కదిలినా మాకు తెలియక కదలదు,ఈ ప్రాంతంలో మమ్మల్ని గెలవగలవారు లేరు. ఇక్కడ నీటి పైనగాని అడవిలోగాని మా ఆధిపత్యానికి తిరుగులేదు,నీవు భయపడకు అని చెప్పినా వినక లక్ష్మణుడు సీతారాములకు రక్షణగా రాత్రి అంతా నిలిచాడు అని చెబుతూ లక్ష్మణుని గుణాలు చాలా సేపు పొగిడాడు. ఇంత చేసిన గుహుడు భరతుని నమ్మలేదు,ఏమాటాలోనూ!
ఆ రాత్రి గడచింది,మర్నాడు ఉదయం గుహుడు భరతుని సైన్యంతో సహా గంగ దాటించాడు,ఏనుగులతో సహా,పడవలమీద. ఏనుగుల్ని కూడా దాటించిన పడవలు ఎంత పెద్దవో! గంగ దాటించాకా వారికి భరద్వాజ ఆశ్రమం దాకా దారి చూపి వస్తాడు.
ఇప్పుడు విశ్లేషణ. దీనినుంచి మూడు ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.
1. రక్షణగా నిలచిన లక్ష్మణునికి చెప్పినట్టు గుహుడు భరతునికి ఇంత వివరంగా తమ బలం,బలగం గురించి ఎందుకు వివరించాడు?
2. భరతుని దగ్గర లక్ష్మణుని అంతగా గుహుడు ఎందుకు పొగిడాడు?
3. ఇంత చేసిన గుహుడు,భరతుని నమ్మక, మర్నాడు ఉదయం,తన బలం,బలగం ప్రదర్శిస్తూ భరతుని సేనతో సహా గంగ ఎందుకుదాటించాడు.
తార్కికమైన సమాధానాలకోసం చూదాం.
1.గుహుడు అంత వివరంగా భరతునికి చెప్పడమంటే "ఈ ప్రాంతంలో నీటి మీద,అడవిలోనూ మా అధిపత్యానికి తిరుగులేదు,ఎంతటి సైన్యం మా ముందు దాసోహం కావలసిందే! నీవు బలప్రయోగం చేదామనుకుంటే కుదరనిదే. మమ్మల్ని నీ సైన్యంతో జయించలేవనే" బలమైన హెచ్చరిక చేయడం.
2.లక్ష్మణుడు రామునికి అంత నమ్మకమైన తమ్ముడు రామునిపై ప్రేమ కలవాడు,గొప్పవాడు; నీవూ రాముని తమ్ముడివే,అంత ప్రేమ అభిమానాలున్నవాడివా? అని ప్రశ్నించడం,పరోక్షంగా
3. ఇది గంగ దాటించడమనే ఉపకారంలా కనపడుతుంది. కాని ఇదొక పెద్ద సైనిక వ్యూహం. భరతుడు నిజంగా రాముని వెనక్కి తీసుకురావడానికే వెళుతున్నట్టైతే ఇది సహాయం. లేదూ,రామునితో యుద్ధం చేయడానికి రాముణ్ణి అడవులలో కూడా ఉండకుండా చేయడానికి ప్రయత్నంగా అనుకుంటే. రామునితో యుద్ధం జరిగితే, అటునుంచి రాముడు ఎదుర్కుంటాడు,వెనకనుంచి గుహుడు తనపరివారంతో ఎదుర్కుంటాడు, అప్పుడు భరతుని సైన్యానికి దిక్కు తోచడు. అది అసలే అడవి, వెనక గంగ. వెనక్కి పోడానికీ దారిలేదు,గుహుని సైన్యం చంపుతుంది,అడవిలోనూ,గంగమీద కూడా. భరతుని సైన్యం అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయి,రామునికి దాసోహం కావలసిందే!. ఇది మిత్రుడైన రామునికి సాయమే కాక అత్మరక్షణ కూడా!
ఇప్పుడు చెప్పండి రామాయణం చదవాలా? చదివితే కాదు,పారాయణ చేయండి,బుద్ధిని ఉపయోగించండి. జీవితాలను ఫలవంతం చేసుకోండి.
స్వస్తి.
25, ఏప్రిల్ 2026, శనివారం
నెట్ కి మూడినట్టే...నా?
నెట్ కి మూడినట్టే...నా?
రష్యా యూక్రైన్ యుద్ధం నాలుగేళ్ళుగా జరుగుతూనే ఉంది. రష్యానుంచి యూరప్ దేశాలకి ఆయిల్ సరఫరా చేసే గొట్టాలు యూక్రైన్ మీదుగా ఉన్నాయి. వాటిని పాడుచేసేరు. యూరప్ కి ఆయిల్ సరఫరా రష్యానుంచి ఆగిపోయింది. రష్యాకి నష్టం చేస్తున్నామనుకుని యూరప్ కాళ్ళు నరికినట్టయి ఆయిల్ సరఫరాలేక యూరప్ అల్లాడుతోంది. ఆ గొట్టాలని సరిజేసేరు, అవి రెండురోజుల్లో ఉపయోగం లోకి రావచ్చనుకుంటున్నారు. ఇప్పటిదాకా చెల్లింపులలా కాక వేరువిఢంగా చెల్లింపులు కావాలంటోంది,రష్యా. ఇది కుదిరితే మళ్ళీ ఆయిల్ యూరప్ కి ప్రవహించచ్చు.
మరో యుద్ధం ఇరాన్-ఇస్రయెల్,అమెరికాలమధ్య రెండు నెలలుగా జరుగుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణలో ఉన్నారు,ఇరు పక్షాలూ. ఎవరూ తగ్గుతున్నట్టు లేదు. ఎవరిమాట వారిదేలా ఉంది. ఇరాన్ జలసంధిని మూసేసింది. మరోపక్క అమెరికా మూసేసింది. ఆయిల్ సరఫరాలు తగ్గిపోయాయి,ప్రపంచానికి. దీనికితోడుగా IRGC గల్ఫ్ కి వచ్చే International OFC cables పాడుచేసి ప్రపంచాన్ని స్థంభింపజేస్తామంటో ఉంది. అదే జరిగితే మళ్ళీ శాంతి నెలకొని కేబుళ్ళు బాగుచేసేటప్పటికి ఎంతకాలం పదుతుందో. ఎన్ని దేశాలు దీనికి బలైపోతాయో తెలియదు. నెట్ కి మూడినట్టే ఉంది.
https://www.moneycontrol.com/world/iran-s-irgc-flags-undersea-cables-cloud-networks-as-potential-targets-in-persian-gulf-amid-fragile-truce-article-13896622.html
18, ఏప్రిల్ 2026, శనివారం
పిలక కత్తిరింపు మహోత్సవం.
పిలక కత్తిరింపు మహోత్సవం.
వేసవిలో తలపై జుట్టు చికాకుగా ఉందని నిన్న అంబష్టుడిని రమ్మాన్నా! గుండు గీస్తూ పిలక దగ్గర కొచ్చాడు. దాన్ని ముట్టుకోడు,ఎప్పుడూ. నేనే పిలక చిక్కుబడినట్టుంది,చూడు! అన్నా. ఉత్సాహంగా దాన్ని పట్టుకుని చూసి,చిక్కడిపోయిందండీ! చిక్కు రాదు అన్నాడు.
ఎలా అన్నా! అదేమో జానడు పిలక.
కత్తిరించక తప్పదండి తీసెయ్యనా! అంటే, వద్దు దాన్ని అలా వదిలెయ్యి,నేను చూసుకుంటా! అనడంతో,ఒక్కవేటు, తీసేస్తాకదండి అని ముందుకెళ్ళబోయాడు.నేనే తీసేస్తా! ఈ రోజుల్లో పిలక పెట్టుకునేవాళ్ళే లేరు,మాటల్లో నైనా శర్మగారి పిలక కత్తిరించేననక,ఉండలేవు,అంచేతా నేనే కత్తిరించుకుంటే సరిపోతుందిగా! అనగా ఊరుకుని మిగిలిన కార్యక్రమం పూర్తిచేసేడు. ఆతరవాయి నేను పిలకని పరిశీలించి,చిక్కు ముడి విప్పడానికి ప్రయత్నం చేసి విఫలమై చివరకి ముడిపైకి కత్తిరింపు మహోత్సవం విజయవంతంగా పూర్తి చేసేను. ఇప్పుడు చూస్తే బెత్తెడు పిలక మిగిలింది. అమ్మయ్యా,అనుకున్నా!
శ్రీ వందేమాతరం రామచంద్ర రావుగారని ఒక రాజకీయనాయకుడు. ఈయన అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వానికి,బయట ఉంటే అంటే ఓడిపోతే ఆయనపై నెగ్గినవాడికి దినదిన గండమే అనుకునేవారు. ఆయన మహామహులమీద పోటీ చేసి తనపై నెగ్గినవారందరిని కోర్టుకు ఈడ్చి నెగ్గి, పదవులు ఊడగొట్టినవాడు.
శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు, వీరిని తెలియనివారు ఉండరు, తలపై టోపీ లేకుండా ఎప్పుడూ కనపడలేదాయన. ముఖ్యమంత్రిగా ఉండగా సభలో టోపీ కనక సద్దితే ఎవరికో మూడిందని చెప్పుకునేవారు.
ఇక మర్రి చెన్నారెడ్డిగారు, ఈయన చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉండేది. దీనిపై చాల కతలున్నాయి. కర్రచెయ్యి మారితే అయినట్టే అని చెప్పుకునేవారు. అంతేకాదు 'నాట్ అప్రూవ్డ్',తరవాత కాలంలో 'నోట్ అప్రూవ్డ్' అవడాని ఒక అక్షరం తేడా అనీ అనేవారు.
నిన్న వుమన్స్ బిల్లు వీగిపోయింది మూడిట రెండు వంతుల మజారిటీ లేక, మేం నెగ్గేం అంటే మేం నెగ్గేమంటున్నారు,ఇరువురూ. మరి చూసినవాళ్ళు స్వయం పిలక కత్తిరింపుకీ దీనికి పోలికుందా? అనుకుంటున్నారు.
15, ఏప్రిల్ 2026, బుధవారం
ఆబోతుల కుమ్ములాటలో......
ఆబోతుల కుమ్ములాటలో...........
1.కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.
2.కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు.
3. అంచుకు తొగరు లేనట్టు
4.కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.
5.ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కినట్టు.
6.ఉండలేక సిండ కాల్చుకున్నట్టు.
7.చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.
8.పెనం మించి పొయ్యిలో పడ్డట్లు.
9.అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు.
10.వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు.
11. కుండ వేరైతే గుణం వేరయినట్టు.
7, ఏప్రిల్ 2026, మంగళవారం
ఏడ్చేదాని మొగుడొస్తే .....
ఏడ్చేదాని మొగుడొస్తే
1.బండరాళ్లు గాలికి కొట్టుకుపోతుంటే పుల్లియాకు నా గతేమని ఏడ్చినట్టు.
2.ఏడ్చేదాని మొగుడొస్తే ఏకులొడికేదాని మొగుడొచ్చినట్టు.
3.మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకున్నట్టు.
4.కాలు జారితే వెనక్కి తీసుకోగలం, నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్నట్టు.
5.గంగకి ఇద్దరి మేలు అద్దరి కీడు లేనట్టు.
3, ఏప్రిల్ 2026, శుక్రవారం
చద్ది కంటె ఊరగాయ ...
చద్ది కంటె ఊరగాయ.....
చద్ది కంటె ఊరగాయ ఎక్కువైనట్టు.
కన్నుపోయేటట్టు కాటుక పెట్టుకున్నట్టు.
కునికే నక్కమీద తాటిపండు పడ్డట్టు.
ఆశకి అంతు ఆకాశానికి చివర లేనట్టు.
12, మార్చి 2026, గురువారం
Tax on GB
Tax on GB
ఒకప్పుడు నెలకి నాలుగు వందలు నెట్ బిల్లు కట్టుకుంటే కష్టంగా ఉండేది. మరి ఎన్ని జి.బి ఇచ్చేవారో గుర్తులేదు,15 ఏళ్ళకితం మాట. జి.బి 400 రోజులు కూడా ఉండేవిట. ఇప్పుడో ఒక జి.బి నాలుగు రూపాయలంటే రోజుకి వంద జి.బి వాడేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాకే రోజుకి 10 జి.బి దాకా అవుతోంది😂😜 ఇంటి మొత్తమ్మీద 8 మంది జనాభాకి నెలకి 1500 జి.బి అవుతోంది,వాడకం. పన్ను వేద్దామని ఆలోచించక్కరలేదు,వేయడమే మంచిది.
ఎందుకంటే డాటా ఖరీదు తగ్గడంతోనే అవసరవాడకం కంటే అనవసర వాడకం,అనగా సోషల్ మీడియాలో, గోచీ పెట్టుకోడం కూడా చేతకానివాడు కూడా నాలాగ ఎదో ఒకటి చేస్తూనే ఉన్నాడు.😂 అవి బ్లాగులు కావచ్చు,ఇన్స్టా కావచ్చు,టెలిగ్రాం కావచ్చు,ఫేస్ బుక్కు కావచ్చు, వాట్సాప్ కావచ్చు. చిత్రంగా ఆరట్టై వాడేవారు కనపట్టంలేదు,దేశీ కదా ,అంతా విదేశీ మోజే.
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్
శ్యామలీయం బలే తిట్టేరు. ఐ లైక్ ఇట్.
ఇక యు చ్యూబ్ గురించి చెప్పేదే లేదు. ఏదో ఒకటి షూట్ చేసి పెట్టెయ్యడమే. ఆ ఆకు తిను, సుగర్ మాయం,మూడు రోజుల్లో అనేవాడు, కాళ్ళు తిమ్మిర్లా,ఇది రాయి దెబ్బకి తగ్గుతాయనేవాడు,ఇలా అందరూ వైద్యులే. ఇందులో ఏ ఒక్కటి పనిచేసినా మందుల కంపెనీలు మూసుకోవాలి,డాక్టర్లు గోచీలు పెట్టుకుని పందుల్ని కాచుకోవాలి లేదా పల్లీలు అమ్ముకోవాలి. కుక్క ఎదురొచ్చి ఏ పక్కనుంచి వెళితే మంచిది,దీనిమీద ఒకడికి పండితుడి వేషంవేసి కార్యక్రమం, ఇలా ఎన్నని చెప్పేదీ? కొన్ని ఉదాహరణలే .
ఇక సోషల్ మీడియాలో హేటువాదులకి దేశద్రోహులమాట చెప్పేదే లేదు. కట్పేస్టు,కాపీ పేస్టు ప్రొఫెసర్లు గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి విదేశాల సొమ్ము చేరడం వీటికోసం అదనం. ప్రభుత్వం మీద విషం చిమ్మేవారికి లోటే లేదు. వీరి వీరభక్తులకు లెక్కా,జమా లేనేలేదు. వీరందరి డాటా ఉపయోగం మీద పన్ను వేయాల్సిందే. తల్లిపాలుతాగి రొమ్ముగుద్దిన చందంగా విదేశాలనుంచి దేశద్రోహ ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. ఇక కమే (ఎ.ఐ) వచ్చాకా ఫేక్ వీడియోలు,ఆడియోలు రకరకాలు కనపడుతున్నాయి,వీటి మీద అదుపు కనపడటం లేదు.
నెట్ కి అతుక్కుపోయే పిన్నా పెద్దా అంతా ఒకలాగే ఉన్నారు. ఎవరూ చెప్పేవారు లేరు,వినేవారసలే లేరు.
సులభా పురుషా రాజన్
సతతః ప్రియవాదినః
అప్రియస్య చ పధ్యస్య
వక్తా శ్రోతాచ దుర్లభః
మారీచుడు
ప్రియమైనమాటలు చెప్పేవాళ్ళే దొరుకుతారు,ఎప్పుడూ. అప్రియమైనా సత్యం చెప్పేవాడు దొరకడు దొరికి చెప్పినా వినేవాడు లేడని, మారీచుడు రావణునికి చెప్పినమాట. 🙏
ఇలా టేక్స్ వేస్తేనైనా వాడే సమయం తగ్గుతుందని ఆశట.ఇది జరిగేనా? ఏమో చూదాం .
7, మార్చి 2026, శనివారం
రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో
రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో
మాటలొచ్చిన కుక్కని వేటకు తీసుకెళితే ఉసుకోమంటే,ఉసుకోమంది.
రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసినంతలో పిల్లలు పుట్టరు.
పచ్చకామెర్లరోగికి లోకం పచ్చగా కనపడుతుంది.
విడవమంటే పాముకి కోపం కరవమంటే కప్పకు కోపం.
2, మార్చి 2026, సోమవారం
కార్లు బాబోయ్ కార్లు.
కార్లు బాబోయ్ కార్లు.
ఒకప్పుడు ఊరికో కారుంటే గొప్ప. అదిన్నీ అంబాసిడరే. కారంటే అంబాసిడర్ మాత్రమే అనుకున్నరోజులూ ఉన్నాయి. ఆ తరవాత పడవంత కారు ప్లిమత్ చూడ్డం జరిగింది. ఆ తరవాత బుల్లికారున్న షోకిలా అబ్బాయి అన్నట్టు ఫియట్ చూసాను. ఎప్పుడూ కార్లు నాచుట్టూ ఉన్నాయిగాని కారెక్కిందే బహు తక్కువ. ఇప్పుడు చెప్పెదేలేదు ఇంటి చుట్టూ కార్లే. ఇంటి ముందు మూడు కార్లు ఎప్పుడూ నిలబడి ఉంటాయి. బయటికి లోపలికి తిరిగేందుకు జాగా ఉండదు ఒక్కో సారి.ఇంటి ముందు, ఒక కార్ పార్క్ స్థలం ఖాళీ చేయించుకోడానికి కష్టపడ్డాము.
మాది పెద్దపల్లెటూరనే చెప్పాలి.మా చుట్టూ 20 దాకా గేటెడ్ కమ్యూనిటీ లు ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ 400 కార్లు లెక్క. ఇక బయటవాటితో లెక్కేస్తే 500 ఉండచ్చు,మా ఏరియాలోనే . ఊరు మొత్తం మీద 100 పైన గేటెడ్ కమ్యూనిటీ లున్నాయి. ఎన్ని కార్లున్నట్టు? ఏ గేటెడ్లో కూడా కార్ పార్క్లు ఖాళీగా ఉండవు.ఒంటరి ఇళ్ళలో కార్లు లెక్కేయ లేదు. ఊళ్ళో అద్దెకు కార్ పార్కులు వెలిసాయి. నెలకు 3000 అద్దె ఒక కార్ పార్క్ కి. మల్టీ స్టోరీ కార్ పార్క్ లు తొందరలోనే వచ్చే సావకాశం ఉందనుకుంటున్నాను. ఒక్కొక ఇంట్లో మనుషులకంటే కార్ల సంఖ్య ఎక్కువున్నటే ఉంది. ఒకాయన పక్క కాళీ స్థలంలో కార్ పార్క్ కట్టరాదా అని అడిగితే వేసిన లెక్కిది.
1. 50 లక్షల విలువైన 400చ.గ స్థలంలో మరో 50 లక్షలు ఖర్చుచేసి ఇల్లు కట్టి అద్దెకిస్తే నెలకు వచ్చే అద్దె 10వేలు మించదు.
2. 50 లక్షల విలువైన 400 చ.గ ల స్థలంలో ఒక కార్ పార్క్ కడితే అయే కర్చు 3నుంచి 4 లక్షలు. ఒక తాళం వేసే కార్ పార్క్ లో 8 కార్లు నిలపచ్చు.కరంటు ఖర్చు నెలకు 500.పంచాయతి పన్ను సం.కి 5 వేలు మించదు.
3. పై స్థలంలో,రెండంగుళాల బోర్ కొట్టి, (300 అడుగుల్లోగాని నీరు దొరకదు,నాలుగు లక్షలవుతుంది). కార్ వాష్ షెడ్ కు,ఉన్న చెట్లు వగైరా కదల్చకుండా ఉంచి, సంవత్సరానికి 12వేలు అద్దె ఇస్తూ, నాలుగేళ్ళ తరవాత బోర్,సబ్మెరిస్బుల్ మోటార్లను పనిచేసే స్థితిలో వదిలేసి వెళ్ళడానికి అద్దెకివ్వడం. 3ఫేస్ కరంటు ఇవ్వాలి,బిల్లులు కట్టుకుంటాడు. పై షరతులతో అద్దెకివ్వడం.
ఏది తెలివైన పెట్టుబడి?
26, ఫిబ్రవరి 2026, గురువారం
చెత్త బ్లాగులు-వాసన లేని పువ్వు
చెత్త బ్లాగులు-వాసన లేని పువ్వు
వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్,
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్
సోషల్ మీడియా మొదట్లో ఇదొక్కటే మాధ్యమం.అందరూ ఇక్కడికే గుంపుగా చేరేరు. అప్పుడే తెనుగులో రాయడానికి రావదంతో బ్లాగులు జోరందుకున్నాయి. సాధారణంగానే ఈర్ష్యాద్వేషాలు రాజ్యమేలాయి,కొంతకాలానికి. అప్పటికి మొదటి దెబ్బ ఫేస్ బుక్ రూపంలో తగిలింది. ఆ తరవాత రకరకాల మీడియాలొచ్చేసినా,ఇంకా బ్లాగుల్నే పట్టుకు వేలాడుతున్న జీవులు కొన్ని మాత్రమే ఉండిపోయాయి. కొందరు ద్విచరాలు,త్రిచరాలు,చతుశ్చరాలు, బహుళచరాలవారు ఉన్నారనుకోండి.దాంతో మజ్జిగ పలచబడింది, మంది పెరిగితే మజ్జిగ పల్చబడిందన్న నానుడికి ఉల్టాగా మంది తగ్గితే మజ్జిగా పలచబడిందికదండీ. ఏ మాధ్యమంలో చూసినా ఈర్ష్యాద్వేషాలు,కులద్వేషం కొట్టొచ్చినట్టు కనపడుతూనే ఉన్నాయి కదు సార్! ఇక్కడికి ఇంక చదువరులు వస్తారని ఆశించడం పేరాశ కాగలదేమో సార్! ఇదంతా నా ఊహ సుమా!
ఇవన్నీ నా పిచ్చి,పిచ్చి మాటలు,ఇందులో ఎవరినీ ఎత్తిపొడిచిందిగాని,ఎకసెక్కెం చేసిందిగాని,అపహాస్యం చేసిందిగాని,ఏవిధంగానూ కించపరచిందిగాని లేదని సవినయంగా మనవిచేస్తూ,చివరిగా ఎవరిష్టం వారిది,ఎవరిని ఎవరూ కట్టడి చేయలేరనే మాట చెబుతూ విరమిస్తున్నా! పొరపాట్లు మన్నించెయ్యండి.
స్వస్తి.
21, ఫిబ్రవరి 2026, శనివారం
రేగు వడియం
రేగు వడియం
19, ఫిబ్రవరి 2026, గురువారం
ఊసుపోకపోతే ......
ఊసుపోకపోతే .......
ఊసుపోకపోతే ఊళ్ళో చుట్టరికం!
ఏమీ తోచుబాటు కాకపోతే,అంటే కాలక్షేపం కాకపోతే, ఊళ్ళో వియ్యమందమని ఈ నానుడి భావన. దెబ్బలాటకి కావలసినంత సావకాశం,కావలసినంత తోచుబాటున్నూ...
ఏ ముడ్డిలో వేలెట్టినా పీతికంపే!
పల్లెలలో చెప్పుకునే నానుడులు ఇలాగే ఉంటాయి. మానవులు ఎంతటివారైనా అందరి మనస్తత్వం ఒకటే మార్పు ఉండదు. ఎలాగంటే అందరూ తినేది ఆ ఆహారమే విసర్జించేదీ అదే! ఆహారం శరీరంలో శోషించినపుడు జరిగే ప్రక్రియలో ఎమినో ఆసిడ్స్ పీతికంపు కొడతాయి. అందుకే ఎవరు విసర్జించినదైనా ఒకటే వాసన,మసస్తత్వం లాగా!
పెరటి చెట్టు మందుకు పనికిరాదు.
పెరటిలో పెరిగిన చెట్టు మందుకు పనికిరాదంటే సంరక్షణ జరిగినది కనక ఔషధ గుణాలు కోల్పోతుందని చెప్పడం.
14, ఫిబ్రవరి 2026, శనివారం
అంతా పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరు?
అంతా పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరు?
పిల్లిమెడలో గంట కట్టేవారెవరు?
అమ్మకి ఇల్లు కడదాం.
13, ఫిబ్రవరి 2026, శుక్రవారం
నోరుమంచిదైతే ఊరు మంచిదే!
నోరుమంచిదైతే ఊరు మంచిదే!
యత్భావో తత్భవతి.
ఆలోచించినట్టే జరుగుతుంది.
ధీరాణాం నిశ్చలం మనః
ధీరుల మనసు నిశ్చలంగా ఉంటుంది.
నోరుమంచిదైతే ఊరు మంచిదే!
తగినట్టుగా మాటాడితే అందరూ మంచిగానే చూస్తారని చెప్పడం.
ఊపిరి పీలిస్తే బొజ్జ పెరగదు.
ఊపిరి పీల్చినంతలో బలం రాదు. శరీరానికి తగిన తిండి తింటే బలమొస్తుందని అర్ధమంటారు.
5, ఫిబ్రవరి 2026, గురువారం
రాముని రాజ్యం-భరతుని పట్టం-3
రాముని రాజ్యం-భరతుని పట్టం-3
ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
3, ఫిబ్రవరి 2026, మంగళవారం
కలికి చిలకల కొలికి .......
కలికి చిలకల కొలికి .......
చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : చిత్ర
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి
ఆ మాట యీ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటిపాపనూ మన్నించి పంపూ
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేత రామా
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
*****
ఈ పాట వింటుంటే ఒక తెనుగు జానపదగీతం గుర్తొస్తుంది. అది ఇదే ..
27, జనవరి 2026, మంగళవారం
దొందూ దొందే!!!
దొందూ దొందే!!!
ఒకకొత్తగా పెళ్ళయిన జాయ,పతి. ఇద్దరూ కలసి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నది దాటాల్సి వచ్చింది. పడవెక్కి, ప్రయాణం తరవాత దిగేరు. నది ఒడ్డు ఎక్కుతూ తలపైకెత్తి చూస్తే, ఒడ్డున విరగబూసిన చింతచెట్టు కనపడింది ఇద్దరికీ,
పతి అసంకల్పితంగా
తింతతెట్టు పూసిందే అన్నాడట!
చింతచెట్టు పూసిందే అన్నమాట.
దానికి జాయ మాటకలుపుతూ
తాతే పూతే తాలానికి తాయదా? పూయదా? అందట.
కాచే పూచే కాలానికి కాయదా?పూయదా అని ఆమె మాట.
ఒకరికి "చ"పలకదు,మరొకరికి "క" "చ" రెండూ పలకవు.
ఇది విన్న పడవ సరంగు దొందూ దొందే!అన్నాడు.
ఇద్దరూ ఇద్దరే అన్నమాట. ఇతని "ఇ", "ర", ఒత్తులు పలకవు.
ఈ చిన్ని కతని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మేధావుల పరంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఒకరిని మరొకరు ఉత్పేక్షాలంకారలో పొగుడుకుంటూ ఉంటారు.
26, జనవరి 2026, సోమవారం
కలికాలం
భారత గణతంత్రదిన శుభకామనలు
కలికాలం
కలికాలం I
ఇది కలికాలం II
ఆకలి కాలం,
మూకల కాలం,
కేకల కాలం,
రూకల కాలం.
కలికాలం I
ఇది కలికాలం II
రూపుల కాలం,
మాపుల కాలం,
రేపుల కాలం,
పాపుల కాలం.
కలికాలం I
ఇది కలికాలం II
చూపుల కాలం
రాపిడి కాలం
చావుల కాలం
దోపిడి కాలం.
22, జనవరి 2026, గురువారం
రోగం రొష్టు-సంసారం గుట్టు
రోగం రొష్టు-సంసారం గుట్టు
ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!
రోగం రొష్టు
ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి. నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో! ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు. టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.
ఇక సంసారం గుట్టు.
సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం. బయట చెప్పుకునేవా? అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు
ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం
మంత్రమౌషధ సంగమౌ
దానమానావమానశ్చ
నవగోప్యా మనీషిభిః
వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం. ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.
16, జనవరి 2026, శుక్రవారం
తీర్థానికి వెళ్ళొచ్చా!
తీర్థానికి వెళ్ళొచ్చా!
తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట.
మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.












