Monday 30 August 2021

అమ్మా తమ్ముడు మన్ను తినేను...


https://youtu.be/YpTb3VvqQ5Q

అమ్మా తమ్ముడు మన్ను తినేను...
మన్నేటికి భక్షించెదు ? మన్నెందుకు తిన్నావయ్యా? మన ఇంట తినడానికేం లేదా అడిగింది యశోద.

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరిమాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ
రి మ్మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మాదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే...

అమ్మా మన్ను తినడానికి నేను చిన్నపిల్లాడినా,వెఱ్ఱివాడినా?వీరి మాటలు నమ్మకు. నేను మన్ను తిన్నానంటే నువ్వు నమ్మేసి నన్ను కొడతావు చూడు, అలా నన్ను నీ చేత కొట్టించాలని వీరి పన్నాగం. కావాలంటే నా నోరువాసన చూడమ్మా? అని నోరు తెఱచి  నిలబడిన కన్నయ్య నోట్లో అమ్మకి కనపడిందేంటీ? సర్వజగత్తూ.  చూసిన తల్లి ఏమనుకుంది?

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్..

కలగంటున్నానా? మాయా? మరో ఆలోచన చేస్తున్నానా? నిజమా? ఆలోచించలేకపోతున్నాను. అసలు నేను యశోదనేనా?వేరే లోకంలో కాని ఉన్నానా? చిన్ని బాలుని ముఖంలో ఈ విశ్వమంతా కనపడటానికి కారణం ఏంటని ఆశ్చర్యపోయిందా తల్లి. 

ఒకప్పుడు ఆటపాటలతో మట్టి తినడం కూడా ఒక బాల్య చేష్ట. నేడు మట్టి కనపడటం లేదు కనక మట్టి తినడం, మట్టిలో ఆడుకోవడం, మట్టిని ఆనందంగా ఒంటినిండా పట్టేలా దొర్లడం అనేది వికృత చేష్ట, ఏం చేస్తాం కాలం మారింది కదా! ఉస్స్.. కాలం మారలేదు, మనుషులే మారేరు...బుద్ధులు మారేయి.

ఒకప్పుడు చద్దెన్నం తింటూ అన్నం పారేసాను. పెంచుకున్న తల్లి తిట్టలేక యశోదలాగానే ”నాన్నా! అన్నం పారేయ కూడదయ్యా!! అన్నం పరబ్రహ్మ స్వరూపం''. అని చెప్పింది. అప్పుడు అర్ధం కాకపోయినా ఆ మాటలు గుర్తుండిపోయాయి. కాలంలో అవగతమయ్యాయి. అప్పుడే మరో మాటా చెప్పింది. ”కరువు కాలం లో అన్నం లేక జనులు మట్టి తినేవారు సుమా" అని. నాకున్న కొద్దిపాటి జ్ఞానం ప్రదర్శించా! మట్టి ఎలా తింటారని? అమ్మ మాట నిజం కాదనుకుని. అప్పుడు అమ్మ వివరంగా చెప్పిందిలా" 

“ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || ”

“ సమస్త ప్రాణులూ ‘ అన్నం ’ నుంచి పుడ్తున్నాయి … అన్నోత్పత్తి ‘ వర్షం ’ వల్ల కలుగుతోంది; ‘ వర్షం ’ ‘ యజ్ఞం ’ వల్ల కలుగుతుంది ; ‘ యజ్ఞం ’ సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది.
Courtesy: pssmovement.org

వర్షం లేకపోతే పంటలేదు. పంట లేక ఆహారం లేదు, అన్నం లేదు. అప్పుడు ప్రజలు గంజి,అంబలి తాగి బతికేవారు. ఆ తరవాత ఆకులు ఉడక బెట్టుకుని తినేవారు. ఆ తరవాత కరువు తీవ్రమైతే రేగడి మట్టి పిసుక్కుని మజ్జిగలో/పెరుగులో కలుపుకుని తాగేవారు, అలా మట్టి తినేవారయ్యా! ఇప్పుడు మనకు అన్నం దొరుకుతోంది అదృష్టవంతులం, అన్నమెప్పుడూ పారెయ్యకూ" ఇది అస్తిగతమైపోయింది, నేటికీ...

అమ్మ చెప్పిన అన్నం పారెయ్యద్దన్న మాట ఆచరించాగాని, మట్టి తింటారన్న మాట, నమ్మలేకపోయాను, మొన్నటి దాకా. 

మనం తీసుకునే ఆహారం మట్టి నుంచి పుట్టినదే! మట్టితో మిగిలిన నాలుగు భూతాలూ సంయోగం చెంది పుట్టేదే అన్నం. అన్నం నుంచే జనులు పుడతారు. అది తిని మనుషులు పెరుగుతారు. అది తిన లేకపోతే మరణిస్తారు. పంచభూతాలూ సంఘటితమైతే జననం, విఘటితమైతే మరణం, ఇంతే ఇది..ఇదే సృష్టి..


 వీడియో చూడండి. హైతీ అనే దేశంలో అన్నం దొరక్క మట్టి తింటున్నారు, ఎలాగో చూడండి...

Saturday 28 August 2021

జకార పంచకం

జకార పంచకం

జామాతా జఠరం జాయా జాతవేదా జలాశయః

పూరితేనైవ పూర్యన్తే జకారాః పంచ దుర్లభాః (దుర్భరా)


తృప్తి పడనివారు జకారంతో ఉన్నవారు ఐదుగురు.


ఎంత పూరించినా తృప్తి లేనివారు,

జామాతా ( అల్లుడు):- నిజానికి ఇది నాటి మాటే అనుకుంటున్నాను. 

జఠరం:- ఆకలి, ఎంత తిన్నా పరగడుపే.

జాయా:- పత్ని. ఎంత సంపాదించినా తృప్తి పడనిది, ఏమి చేసినా తృప్తి కానిది.

జాతవేదా:- అగ్ని, ఈయన ఎంతటీవాడంటే, తనను అర్చించేవానిని కూడా కాల్చేస్తాడు, ఎంత తిన్నా తృప్తి లేదు.

జలాశయః:- సముద్రం. ఎన్ని వరదలొచ్చినా నీరంతా సముద్రంలో కి పోయేదే! ఎంతైనా తీసుకుంటుంది కొంచం వెనక ముందులంతే తేడా.


వకార పంచకమని మరొకటి ఉంది. వీరితో పని పడ కూడదుగాని....

Friday 27 August 2021

పెడితే పెళ్ళి

 పెడితే పెళ్ళి లేకపోతే శ్రార్ధం.


ఇది జన సామాన్యంలో ఉన్నమాట. మనకి ఉపకారం జరిగేటట్టు ప్రవర్తించిన వారికి మంచి జరగాలనీ లేకపోతే చెడు జరగాలనీ అనుకోవడంగా చెబుతారు.అసలేమి?


పెడితే పెళ్ళి:- పెళ్ళి ఇంట పదిమంది చెయికడగాలని అనుకుంటారు. అలా తృప్తిగా భోజనం చేసినవారు వధూ వరులను ఆశీర్వదించాలని పెద్దల కోరిక. అటివంటి చోట ఒక యాచకునికి తినడానికే దొరకదా? అదే పెడితే పెళ్ళి. పెళ్ళిరోజు పెడతారు.


ఇక


పెట్టకపోతే శ్రార్ధం:- ఇది నిజం, సమాజంలో ఉన్నది జరుగుతున్నదిన్నూ. శ్రార్ధం అంటే శ్రద్ధగా చేసేది, అంటే తద్దినం, అంటే తత్+దినం. అనగా ఆరోజు, ఏరోజు, ఆ ఇంట పెద్దలెవరో కాలం చేసినరోజు. ఆ రోజుగనక యాచకుడు ఆ ఇంటికి యాచనకొస్తే,ఏమీ పెట్టరు, పైకెళ్ళమంటారు లేదా మళ్ళీ రమ్మంటారు, లేదా ఈరోజు తద్దినం అని చెబుతారు. అంటే ఇప్పుడు వీలు కుదరదని చెప్పడం. కాలం చేసిన వారికి అర్చన పూర్తి కాకుండా ఇతరులెవరికి ఏమీ పెట్టరు. ఇదీ లోకంలో ఉన్న ఆచారం. తద్దినాన్ని తిథి అని కూడా అంటారు.ఏరోజూ సూర్యోదయానికి ఉన్న తిథిని ఆరోజు  తిథిగా చెబుతారు, కాని తద్దినానికి తిథి ఐతే మాత్రం ఏరోజు అపరాహ్నానికి పోయినవారి తిథి ఉంటుందో ఆరోజే తద్దినం పెట్టాలి.


ఇదీ పెడితే పెళ్ళి పెట్టకపోతే శ్రార్ధం కత.

Thursday 26 August 2021

కన్యా వరయతే రూపం…

 కన్యా వరయతే రూపం…

కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా ధనం
బాంధవా కులమిఛ్ఛంతి
మృష్టాన్నమితరే జనాః.

ఇది పూర్వ కాలంలో చెప్పిన మాట. ఏంటిటా? కన్యా వరయతే రూపం, ఇది తెలుస్తూనే ఉంది, నేటి కాలానికి కూడా అమ్మాయి ముందు చూస్తున్నది, కాబోయే వాడు అందగాడేనా? అని. ఇది అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మారని సత్యం. ఆత్మ సౌందర్యమే అసలు సౌందర్యమన్న మాట తెలిసేటప్పటికి చేతులు కాలుతున్నాయి. ఆ వయసులో ఆలోచన అలాగే ఉంటుంది, అది ప్రకృతి సిద్ధమైన ఆకర్షణ కనక. తరవాతది మాతా విత్తం, ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం, అప్పుడూ, ఇప్పుడూ కూడా. తల్లి అనగా కన్యా ప్రదాత భార్య, కాబోయే అత్తగారు, తన అల్లుడికి ఉన్న సంపాదనా మార్గాలు, రాబోయే, లేక ఉన్న ఆస్థిపాస్థులు, అల్లుడు అమ్మాయికి పెట్టబోయే నగలు, నాణ్యాలు, ఇంటి వస్తువులు, తన కూతురు అనుభవించబోయే సుఖ, భోగ, సంతోషాలగురించి ఆలోచిస్తుందట, అందుకే మాతా విత్తం అన్నారు.  ఇప్పటికి ఇందులో మార్పు రాలేదు, ఇక ముందుకూడా రాదు. “పెళ్ళి సంబంధం చూసొచ్చానోయ్! మనమ్మాయికి, కలిగినవారు, బలగం ఉన్నవారు, సరసులు” అంటే. ” అది సరేగాని అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు, ఇతని వాటా కొచ్చే ఆస్థి ఎంత? ఇతని సంపాదన పెరుగుతుందా? జీతమేనా పైన గీతం కూడా ముడుతుందా” ఇదీ ప్రశ్న, తల్లినుంచి వచ్చేది. ఆ తరవాతది పితా ధనం, ఇదేంటీ, తల్లి విత్తం చూస్తోందిగా అని అనుమానం రావచ్చు, విత్తానికి ధనానికి తేడా ఉంది. తండ్రి చూసేది ధనం కదా! అది అభిమానధనం, పౌరుషధనం, మరి ఇతరమైన ధనాలు అనగా విద్య వగైరా చూస్తాడు. ఇది కూడా నేటి కాలానికీ నిజమే, అబ్బాయి చిన్న ఉద్యోగం లో ఉన్నాడని అనుకోవద్దు, అతనికి పెద్ద ఉద్యోగానికి, సంపాదనకి తగిన హంగులున్నాయి, వృద్ధిలోకి వస్తాడు అన్నది చూస్తాడట, ఇది తండ్రి ముందు చూపు. ఇది కూడా నిజమే ఇప్పటికీ.  బాంధవా కులమిఛ్ఛంతి, కుర్రాడి తల్లి తండ్రులు తమ కులం అనగా తమ కట్టుబాట్లలో వారేనా కాదా, రేపు ఆ ఇంటివారితో సంబంధ బాంధవ్యాలు నెరిపేసావకాశం ఉందా, ఇవి చూస్తారట, తోటివారు.  ఇది కూడా నేటికీ సత్యమే.

ఇక చివరిది మృష్టాన్నమితరే జనాః పప్పన్నమే పెడతాడా? ఇంకా ఘనంగా చెస్తాడా, పెళ్ళి? మొన్ననెవరో పెళ్ళిలో అరవైనాలుగు పదార్ధాలు పెట్టేరు, ఈయన అంతకంటే ఎక్కువ చేస్తాడా, తక్కువ చేస్తాడా అని చూస్తారట.  చిప్పలో కూడెట్టినా, తిని వచ్చి “అహా! ఏం గొప్పగా చేసేడండి పెళ్ళి” ఆంటారు. ఇది కూడా నిజమే నేటి కాలానికి కూడా. ఇంక తేడా ఎక్కడండీ అని కదా మీ ప్రశ్న.

నేటి కాలంలో అమ్మాయి తన వరుణ్ణి తనే ఎంచుకుంటున్నప్పుడు, అంటే గాంధర్వ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నపుడు, అమ్మాయే తల్లి తండ్రి, ఇతర బంధువులు చేయవలసిన పనులు చేసుకుంటూ ఉంది, తన పనితో, అనగా కన్యా వరయతే రూపంతో. నిజంగా నేటి అమ్మాయి ఎంత బాధ్యత తీసుకుంటూ ఉంది చెప్పండి. ఇదంతా చెప్పిన మాట వినకపోడంగా పరిగణించుకుంటే ఎలా? నేటి అమ్మాయిలు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోడం తప్పు లేదుకాని, తప్పుడు నిర్ణయాలు తీసుకుని అవస్థలు పడుతున్నారనుకుంటా. శకుంతల తండ్రికి చెప్పక వివాహం చేసుకుని కొడుకుని కని, ఎన్ని అవస్థలుపడి భర్తను చేరుకుందీ తెలుసుగా. అవి సత్య కాలపు రోజులు, మరి ఇప్పుడో…..

(3.1.2013)

Wednesday 25 August 2021

కరోనా పొరలు

కరోనా పొరలు


కరోనా ప్రవేసించి సంవత్సరం దాటింది. మొదటి పొరలో జాగ్రత్తలే ఇప్పటికి పాటించమంటున్నారు. ప్రజలు మాస్కులు వేసుకుంటున్నారు గాని దూరం పాటించటం లేదు, ఎక్కడా! 


రెండు పొరలు పూర్తయ్యాయంటున్నారు. దేశం అంతలోనూ కరోనా వెనకబడుతున్నా, కరోనా పుట్టింటివారి బంధువుల ఇంట కథాకళీ చేస్తూనే ఉందిట. చదువుకున్నవారు మేధావులు ఎక్కువగా ఉన్నచోట ఇలా ఎందుకు జరుగుతోందో మరి. స్థానికంగా కూడా విదేశాలతో రాకపోకలు ఎక్కువగా ఉన్న మండలాలలోనే కరోనా ఉన్నట్టు వార్తలు.


రెండొ పొర నడిచింది మూడో పొర తథ్యం అని చెబుతున్నారు, మేధావులు. చిన్నపిల్లలకే ప్రాణాంతకం ఈ పొర అని కూడా చెబుతున్నారు,కాని అన్ని చోట్ల బడులు తీసేస్తున్నారు. ఈ రోజునుంచి పిల్లలు బడికి వెడుతున్నారు. మనవరాలు చెప్పిన ప్రకారం క్లాసులో అరవై మంది ఉంటే మూడో వంతు బడికి హాజరైనట్లు తెలుస్తోంది.


మొదటి పొరలో వ్యాప్తికి పద్నాలుగురోజుల వ్యవధి తీసుకునే  కరోనా, తరవాత పొరకి వ్యాప్తి సమయం తగ్గింది అన్నారు. కాని రాబోయే మూడో పొరలో వ్యాప్తి సమయం అన్నది లేదు, లక్షణాలేం కనపడవు, వస్తే ఇంతే సంగతులని మేధావులు ఊదరకొడుతున్నారు, ఏమో ఏం జరుగునో తెలీదు.ఇక వేక్సీన్ యుద్ధ ప్రతిపదికన వేస్తున్నారు. వాక్సిన్ వేసినవారికి కరోనా వస్తోందంటున్నారు. కరోనా వాక్సీన్ ప్రభావం మూడు నెలలే అని మరొక వార్త. ఇలా రకరకాల వార్తలు ప్రజల్ని ఊదరకొడుతూనే ఉన్నాయి.కరోనా సమయంలో ఎవరికి ఓపికను బట్టి వారు దండుకున్నారు, ప్రజలనుంచి.ఇమ్యూనిటీ డ్రింక్స్ పేరిటా వ్యాపారం జోరుగా నడుస్తోంది.


రెండొ పొరలో హాస్పిటళ్ళలో బెడ్లు లేవు,ఆక్సిజన్ లేదనే మాటలు బలంగానే వినపడ్డాయి, కారణం నువ్వంటే నువ్వనుకునేదీ జరిగిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలలో రెండవపొర నడుస్తోంది. అక్కడ కూడా హాస్పిటల్ సౌకర్యాలు అంతంతగానే ఉన్నట్టు వార్తలు. ఏ దేశమైనా దేశప్రజలందరికి హాస్పటల్ లో బెడ్లు కేటాయించలేదేమో.ఒకవేళ బెడ్లూ ఉన్నా అప్పటికప్పుడు నర్సులు డాక్టర్లు పుట్టుకురావడం సాధ్యమా? ఏమో ఏమి జరగనుందో భగవంతునికే ఎరుక.

Tuesday 24 August 2021

అర్ధ చంద్ర ప్రయోగం.

 అర్ధ చంద్ర ప్రయోగం.

అర్ధ చంద్రుడంటే సగం చంద్రుడనికదూ! సగంచంద్రుని ప్రయోగమేంటి బాబూ! అసలిటువంటి మాటలిపుడు వాడటం లేదు కదూ!! అందుకే అదేంటో తెలుసుకుందాం!!! కుడిచెయ్యి ఎత్తండి,ఎత్తేరా గుప్పిటముయ్యండి, బొటనవేలు పైకి ఉండేలాగానూ! ఆ( ఇప్పుడు నెమ్మదిగా గుప్పిటవిప్పండి…చాలు,చాలు ఇప్పుడు బొటనవేలునుంచి చూపుడు వేలు చేసే ఆకారమెలా ఉంది? అర్ధ చంద్రునిలా ఉందికదూ! ఇప్పుడీ చేతిని ఇలాగే ఎవరి మెడమీదనైనా ప్రయోగిస్తే దాన్నేమంటారు? అర్ధ చంద్రప్రయోగం అనికదా. అంటే ఏంటిటా? అర్ధ చంద్రప్రయోగం అంటే మెడపట్టి గెంటెయ్యడం!!! ఆ( అదా! ఆశ్చర్యపోయారా!! అవాక్కయ్యారా!!!

చంద్రహాసం.

చంద్రహాసమంటే చంద్రుని నవ్వు కదా! కాదు, మరేంటీ అని అనుమానం. చంద్రహాసం అంటే చాలా పదునైన కత్తి అని అర్ధం. మరీ అర్ధం ఎందుకొచ్చిందో తెలీదు. చంద్రహాసుడు అంటే పదునైనకత్తిలాటి కుర్రాడు అని అర్ధం 🙂 చంద్రహాసిని అని పేరు లేదు మరెందుకో తెలీదు గాని హాసిని,సుహాసిని,పేర్లయితే ఉన్నాయి కాని చంద్రహాసిని మాత్రం లేదు 🙂 . కత్తిలాటి అమ్మాయికి పేరులేదా! లేకేం వాడకంలో లేదంతే! అది జాణ, తెలివైన,అందమైన అమ్మాయిని జాణ అనేవారు.

నలభైయవ సంవత్సరం.

నలభయ్యో సంవత్సరం వచ్చిందీ అంటారు. అంటే పరాభవం జరిగిందీ అని. పరాభవానికి నలభయ్యో సంవత్సరానికి సంబంధం ఏంటీ? తెనుగు సంవత్సరాలు ప్రభవనుంచి మొదలయి అక్షయతో ముగుస్తాయి కదా! వరసగా లెక్కెట్టుకుంటూ వెళ్ళండి సంవత్సరాలు, ఆ( ఆగండి నలభై దగ్గరకొచ్చేటప్పటికి ఏ పేరొచ్చిందీ! పరాభవ కదా! అదీ సంగతి. నలభయ్యో సంవత్సరమంటే జీవితంలో సగానికి పైన జరిగిపోయినట్టు లెక్కా! ఇకనుంచి జీవితంలో ప్రతి నిత్యమూ చూసేవి పరాభవాలే అని…

తారతమ్యాలు.

తారతమ్యాలేంటీ? తారతమ్యాలు.  లేవుటయ్యా? అంటే తేడా లేదుటయ్యా అని, అలగే తారత్మ్యాలు చూడకుండా పని చేస్తున్నాం కదా అంటే తేడా చూడకుండా పని చేస్తున్నామని అంటాం. మరీ తారతమ్యాలేంటీ? ఇవి తారతమ్యాలు. కాదు ‘తరము’ ‘తమము’ లు. అంటే కష్టము,కష్టతరము, కష్టతమము, ఇలా ఈ మాటలలో మొదటివానిని తీసేసి వాడుకలో తారతమ్యాలుగా వాడేస్తుంటాం…

In English as more and most used before the adjectives as difficult, more difficult,most difficult. The degrees of comparison Comparative and Superlative.

(17.2.2016)

Monday 23 August 2021

ఆషాడమాసం-ములగాకు

 


ఆషాడమాసం-ములగాకు


కరోన పుణ్యామా అని బయట కాలు పెట్టింది లేదు, డాక్టర్ దగ్గరికి,నెలకోసారి తప్పించి. వారానికోసారి పక్క దోడ్లో ములగాకు కోసమూ.నడక పెరట్లొనే కానిచ్చేస్తూంటే గేటు తీసి బయటకు వెళ్ళే పనే కనపడటం లేదు.మొన్న ములగాకు కోసం బయలు దేరా! ములగ చెట్టుకి కరంటు వారు క్షవర కళ్యాణం చేసినట్టుంది, కిందకి అందే కొమ్మలూ కొట్టేసారు.కర్రతో ప్రయత్నం చేసినా ఆకు అందేలా లేకపోయింది. అప్పుడు రెండు వీధుల అవతల కిందకి అందేలా ఉన్న ములగ చెట్టు గుర్తొచ్చి, నెమ్మదిగా అడుగులేశా.ములగ చెట్టు దగ్గరో పాకుండేది,అదిలేదు,చెట్టు గుర్తు పట్టేలా లేదు. ఈ చెట్టుకు కూడా క్షవర కళ్యాణం అయిపోయింది, కొమ్మలందేలా లేవు. కర్రతో సాధ్యం చేసి ములగాకు కోస్తున్నా. 

''ములగాకెందుకూ?'' అని వినపడింది.

''ములగాకు పప్పులో వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు'' అంటూ చూశా! తెలిసినవారు.

''ఆషాఢం వెళ్ళిపోయింది కదండి'' అన్నారు.

''ఆషాఢంలోనే తినాలని కాదు, ఎప్పుడూ తింటూనే ఉండాలి, ఆకు కూరలా. తమిళ్ నాడులో తొమ్మిది జిల్లాలనుంచి ములగ ఉత్పత్తులు విదేశాలకి ఎగుమతి చేస్తున్నారట.ఇందులో ఇనుము, విటమిన్లు ఇంకా ఏవో చాలా ఉన్నాయట, నేటి కాలంలో ఇమ్యూనిటీకి చాలా అవసరమట, అందుకే తినాలని'' అన్నా ! నా తెలివి ప్రదర్శిస్తూ.దానికి వారు

''ఒక మాత్ర కొని పడేసుకుంటే సరిపోయేదానికి ఇన్ని తిప్పలా'' అన్నారు

తుళ్ళిపడ్డాను, ఎవరో గుర్తొచ్చారు.

వెంటనే నిజమండి, అలాగే అంటూ నమస్కారం చేసి వచ్చేశా, ములగాకు పుచ్చుకుని.

మౌనేన కలహో నాస్తి.   మనకి తోచదు మరొకరు చెబితే వినం .




Saturday 21 August 2021

తనకు కాని పనికి పోరాదు.

 


తనకు కాని పనికి పోరాదు.


చిన్నకథ, పాతదే ,తెలిసినదే.  

ఒకపల్లెలో ఒక పెద్ద చింతచెట్టుకింద ఒక పెద్ద రంపంగొయ్యి.ఆ గోతి మీద పెద్ద పెద్ద దుంగలని కోస్తూ ఉండేవారు.పెద్ద దుంగలు కోసేటపుడు రంపం ఆడడానికి ఒక సీల దిగగొట్టేవారు, కోత చీలికలో, రెండు కోతభాగాలూ కొద్ది ఎడం అయి రంపం అడేందుకు వీలుగా. ఆ చింత చెట్టు మీద ఒక కోతి నివాసం ఉంటోంది. రంపంగొయ్యి అక్కడ ఉండడం కోతికి ఇబ్బంది లేదు. కోతి చెట్టు మీద ఉండడం కోత పనివారికీ ఇబ్బంది లేదు. కోతి రోజూ ఈ కోత పని చూస్తూ ఉంది.రోజూ కోత పనివారు ఉదయమే వచ్చి కోత మొదలెట్టి మధ్యాహ్నం భోజనాలకి వెళ్ళి తిరిగొచ్చి సాయంత్రం దాకా కోత కోసేవారు. ఒక రోజు పనివారంతా మధ్యాహ్న భోజనాలకి వెళ్ళేరు, కోత ఆపి. కోతి చెట్టు దిగి వచ్చి కాసేపు రంపంతోనూ గోతిలోనూ ఆడుకుంది. చివరగా కోస్తున్న దూలం చీలికలో దిగ గొట్టిన సీల పీకడానికి ప్రయత్నించింది అది రాలేదు. దానితో దానిని ఎలాగైనా పీకాలని ఒక కాలు, చీలికలో వేసి మరోకాలు బయటకు వేసి బలంగా సీల పీకింది. సీల ఊడి రావడంతోనె కోస్తున్నదూలం రెండు భాగాలూ దగ్గరకు చేరిపోయాయి. కోతి కాలు చీలికలో చిక్కుకుపోయింది. పనివారు తిరిగొచ్చేసరికి కోతి ప్రాణవాయువులు గాల్లో కలిసిపోయాయి.


కోతికి అవసరంలేని పని సీలను పీకడం, దానిని అనవసరంగా పీకి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే తనకు కాని పనికి పోరాదన్నారు పెద్దలు.




Tuesday 17 August 2021

పెళ్ళికుదిరితే …..

 పెళ్ళికుదిరితే …..

     పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది,పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుందని ఒక సామెత. ఎంతకీ తెగని సమస్యకి అనగా సమస్యల గొలుసుకి ఇది తార్కాణం. ఒక సమస్య తేలితే మరొక సమస్య తేలుతుంది, ఇది అది ముడిపడి ఉంటాయనమాట. ఏదీ జరగదు సమస్య తేలదు. జీవితంలో ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి, ఏమీ చేయలేక,సమస్య పరిష్కరించుకోలేక కాలానికి,దైవానికి దానిని వదిలేసి ఊరుకుంటాం. ఇదిగో ఇటువంటి సమస్యలనే ఎదుటివారు, కావలసినవారమని, రేపి బాధపడుతున్నట్టు నటిస్తూ బాధపెడుతుంటారు. ”ఏం వదినా! మీ అమ్మాయికి పెళ్ళి సంబంధం కుదురుతోందన్నావు, ఏమయిందీ?” ఇది తెలిసి కెలుకుతూ వేసిన ప్రశ్న. ఎద్దు పుండు కాకికి నొప్పా? పెళ్ళి కుదిరితే సామెత గురించి మొదలెట్టి ఇలా పోచుకోలు కబుర్లు చెప్పడం బాగుందా అంటారా? వస్తున్నా! వస్తున్నా!! 🙂 ఈ సామెత గురించి ఒక కత చెప్పుకుందాం,చిన్నదే! సరేనా! ఊ అన్నారా? 🙂

అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక బాగా కలిగిన కుటుంబం, ఒకడే కొడుకు, లేకలేక కలిగాడు. అల్లారు ముద్దుగా పెంచారు, తెలివితేటల మాట దేవుడెరుగుగాని కుర్రాడు మాత్రం ఎర్రగా బుర్రగా పెరిగాడు, జాంపడులా. వయసొచ్చింది, పెళ్ళి చేయాలని నిశ్చయించారు, తల్లితండ్రులు. కలిగిన కుటుంబం, జాంపడులాటి కుర్రాడేమో పెళ్ళి సంబంధాలు విరగబడి మీద పడుతున్నాయి. పెళ్ళిళ్ళ పేరయ్యలు రోజుకో సంబంధం తెస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయికి అమ్మాయి నచ్చకా, అబ్బాయికి అమ్మాయి నచ్చితే వియ్యపురాలికి లాంఛనాలు నచ్చకా, ఇవి రెండూ నచ్చితే వియ్యంకుడికి కట్నం నచ్చకా, ఇవన్నీ నచ్చుబాటైతే అమ్మాయి వంశం గౌరవం హోదా నచ్చకా సంబంధాలు తిరిగిపోతున్నాయి. ఇదెంతదాకా అంటే ఎవరేనా పెళ్ళిళ్ళ పేరయ్య వీరి సంబంధం గురించి ఆడపిల్లవాళ్ళకి చెబితే ”వారికి నచ్చదయ్యా! ఏదో ఒకటి చెప్పి కాదంటా”రనే పేరు పడిపోయేటంతగా.

కాలామాగదుగదా! నడుస్తూనే ఉంది. అబ్బాయికి ఏళ్ళొస్తూనే ఉన్నాయి. ఏమయిందో తెలీదుగాని అబ్బాయి తిక్కతిక్కగా మాటాడుతున్నాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకోడం మొదలెట్టేరు. ఇది తల్లి తండ్రులకీ అనుభవంలోకొచ్చి వైద్యుని దగ్గరకి తీసుకుపోయారు. వైద్యుడు కారణాలు విచారించి వైద్యం చేశాడు. కొంతకాలం గుట్టుగా సాగింది, గుట్టు ఎంతకాలం సాగుతుంది? అబ్బాయికి మతిభ్రమణమని అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం తరవాత వైద్యుడు తేల్చినదేమంటే ”అబ్బాయికి పెళ్ళైతే ఈ మతి భ్రమణం తగ్గుతుందీ” అని. పిచ్చని తెలియడం తోనే పెళ్ళి సంబంధాలు రావడం ఆగిపోయాయి. వైద్యుడు చెప్పింది బాగానే ఉందిగాని, పెళ్ళిళ్ళ పేరయ్యలు తుపాకి దెబ్బకి కూడా కనపట్టం లేదే! పిల్లనిస్తానని వచ్చేవాడూ, చేసుకుంటాననే పిల్లా కనపట్టం లేదే! ఏం చెయ్యాలి? పెద్ద సమస్య ఐపోయింది.

పెళ్ళిళ్ళ పేరయ్యలని సంప్రదిస్తే అంతావిని, ”అలాగే చూద్దాం, నాలుగైదు సంబంధాలకి చెప్పానండీ” అని సాచేస్తున్నారుగాని ఒక్క సంబంధమూ తీసుకురావటం లేదు. పైపెచ్చు, ”ఆ రోజు చిలకలాటి అమ్మాయి,అందగత్తె,చదువుకున్నది, కుర్రాణ్ణి చూసి మోజుపడింది,అని సంబంధం చెబితే, వాళ్ళని డబ్బు లేనివాళ్ళని చులకనగా మాటాడి తిరగ్గొట్టెయ్యలేదూ! ఇప్పుడు పిచ్చాణ్ణి చేసుకోడానికే పిల్ల ముందుకొస్తుందిటా? సంబంధం చూడాలిట, సంబంధం….”అనొకడూ, ”చక్కటి సంబంధం, పిల్ల అందగత్తె,కట్నానికీ లోటు లేదు, అందరికి నచ్చింది కూడా, కాని ఏం చేసేరు, ’పెళ్ళికూతురు మేనత్త తోటికోడలు లేచిపోయిందిటా’ అని సంబంధం తిరగ్గొట్టేశారే… ఇప్పుడు సంబంధాలెక్కడినుంచి వాస్తాయిటా…. పిచ్చాడికి పిల్లనిచ్చే వాళ్ళుంటారా!” అని గొణుక్కుంటున్నారు పెళ్ళిళ్ళపేరయ్యలు. సమస్య తేల లేదు, కాలం గడుస్తోంది, పిచ్చీ తగ్గలేదు, పెళ్ళీ కుదరలేదు. మరికొంతకాలం గడిచింది. పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుంది. ఏది ముందూ? కాలం గడుస్తుండగా వైద్యుడు మరికొంత ధనవంతుడయ్యాడు 🙂

పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి

పై కథకి కొనసాగింపే ఈ సామెత కూడా దాని కతే మిగిలినదిన్నూ…

కొంతకాలం గడిచింది, బ్రహ్మచారి ముదిరిపోయాడు, తల్లితండ్రులలో, తల్లి ఉండబట్టలేక ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని ”అన్నయ్యా! కుర్రాడు ముదిరిపోతున్నాడు, ఇంత ఆస్థిపాస్థులకు వారసులు లేకుండాపోతారేమోననే దిగులు పట్టుకుందయ్యా! లేనింటి పిల్లనైనా సరే! పెద్ద అందగత్తె కాకపోయినా బాధలేదు, అందం కొరుక్కుతింటాముటయ్యా! పిల్లను చూసి మూడుముళ్ళూ వేయిస్తివా,చచ్చి నీకడుపున పుడతా! నాలుగేళ్ళలో, నీ కూతురు పెళ్ళి చేయాలి నువ్వు, దానిని సకల ఖర్చులతో నిర్వహించే బాధ్యత నాది,నన్ను నమ్ము” అని బతిమాలి, బులిపించినట్టు మాటాడితే, మెత్తబడిన పేరయ్య కాలికి బలపంకట్టుకుని పెళ్ళి కూతుళ్ళ వేటలో పడ్డాడు. పెళ్ళి కూతుళ్ళ తల్లితండ్రులకి వీరి గురించి వైనవైనాలుగా కొత్తగా చెప్పేడు. ”కొంతకాలం అబ్బాయి మతిభ్రమణంతో బాధపడ్డమాట నిజమే! ఇప్పుడు బాగున్నాడు,తెలివైనవాడూ! ఒక సారి అబ్బాయిని చూడండి, నచ్చితేనే చేద్దాం, చూడ్డానికేం పోయే” అన్నాడు. దానికి తల్లితండ్రులు పిచ్చాడికి పిల్లనివ్వడానికెళుతున్నామంటారయ్యా! ఎగతాళీ చేస్తారూ” అన్నారు. ”అదా మీ అనుమానం, పిల్లనివ్వడానికెళుతున్నట్టు తెలియనివ్వద్దూ, దారేపోతూ చుట్టం చూపుగా వెళ్ళినట్టు రండి, ఆ సమయానికి నేనూ వస్తా,చూడండి, ఒక రోజుండండి,చూడండి, నచ్చితేనే” అని బలవంతం మీద ఒప్పించాడు. ఒక రోజు అమ్మాయి తల్లి తండ్రులు చూడ్డానికి ఒప్పుకుని వచ్చారు, అనుకున్నట్టే సమయానికి పేరయ్యా చేరాడు.

అబ్బాయితోనూ అబ్బాయి తల్లితండ్రులతోనూ మాటాడుతూ వచ్చారు, అమ్మాయి తల్లి తండ్రులు. చూస్తే అబ్బాయి బాగున్నవాడేనేమో, పిచ్చి లేదేమో, ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమేమో అనిపించింది, కొంత సేపటికి. సాయంత్రమవుతుండగా, అబ్బాయి తల్లితండ్రులు,అబ్బాయి,అమ్మాయి తల్లితండ్రులు, పెళ్ళిళ్ళ పేరయ్య తీరుబడిగా కూచుని లోకాభిరామాయణం చెప్పుకోడం మొదలెట్టేరు, ఇంతలో అమ్మాయి తల్లికి, లోపల ఉన్న అనుమానం తొలుస్తుండగా, అబ్బాయితో ”బాబూ! నీకేదో అనారోగ్యం చేసిందిట,ఇప్పుడెలా ఉందీ” అని ప్రశ్నించింది. దానికి అబ్బాయి ”పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి” అన్నాడు. ఈ మాట విన్న అందరూ విస్తుపోయారు. అమ్మాయి తల్లి ఐతే ఒక క్షణం మూర్ఛపోయినంతై తేరుకుని మొగుడితో ”ఇంకా కూచున్నావేంటీ?” అంటూ చరచరా వెళ్ళిపోయింది…… ఇంకేముంది……

అదండి పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి కత.

(2-2-2018)

Sunday 15 August 2021

అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు.


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 



అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు.




ఇది ఒక నానుడి. మాచకమ్మకి వాళ్ళ అక్కకి వయసు తేడా తక్కువే. మాచకమ్మ అక్క ఈడేరింది, అందమైనది కూడా.  కులగోత్రాలకీ లోటు లేదు,పేదవారైనా. దానితో పక్కవూరి ఊరి మోతుబరి కొడుకు కోరి వరించేడు.పెళ్ళి ఘనంగానే జరింది. అప్ప అత్తారింటికీ వెళ్ళింది.అక్కడ అప్ప మహరాణీలా వున్నట్టు కబురులూ తెలుస్తున్నాయి. ఇంట్లో అత్తామామల దగ్గరనుంచి, భర్త, నౌకర్లు చాకర్లు అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి. పెళ్ళైన సంవత్సరం తిరగ్గానే అప్ప నీళ్లోసుకుంది. ఇక అప్ప అత్తారింట్లో ఆనందానికి పట్ట పగ్గాలూ లేవు. ఈవార్తలు తెలుస్తుండడంతో పుట్టింట అందరూ ఆనందంలో ములిగి తేలుతున్నారు, మాచకమ్మతో సహా. కాలం గడచింది, అప్ప మగ బిడ్డను కన్నది. అప్ప అత్తవారు కోడలిని అడుగు కింద పెట్టనివ్వటం లేదు. రెండో ఏడు పూర్తికాకుండానే బిడ్డ తల్లీ అయింది. అప్ప భర్తకి వ్యాపారం కలిసొచ్చి కొత్తగా పొలమూ కొన్నాడు. అప్ప  జీవితం వేలేస్తే కోలు దిగబడేలా ఉంది,అత్తారింటిలో.


మాచకమ్మకి అప్పకి జరుగుతున్నదంతా మొదటిలో అంతా ఆనందంగానే గడచినా, రెండేళ్ళలో కూడా మాచకమ్మ ఈడేరలేదు సరిగదా స్త్రీ లక్షణాలే పూర్తిగా ఏర్పడ లేదు. 

చూస్తేనే మాచకమ్మ సంసారానికి పనికి రాదని తెలిసిపోతూ ఉంది. ఎవరూ మాచకమ్మ పెళ్ళి మాటే ఎత్తటంలేదు, దానితో అప్ప వైభోగం చూస్తున్న మాచకమ్మకి మొదటిలో అప్ప పట్ల అసూయ పుట్టి ఆ తరవాతది పెరిగి ఈర్ష్యగా మారింది, కాని ఏం చేయగలదు? మడమలు తొక్కుకోవడం తప్పించి. మడమలు తొక్కుకోవడం అంటే నాట్యం చెయ్యడం చేతకాక కాళ్ళు తొక్కుకోడం అంటారు.ఇలా నిరాశతో అసూయ చెంది, దానిని ఈర్ష్యగా మార్చుకుని బాధ పడడాన్నే అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టని అంటారు. 


ఎవరి పుట్టుకవారిదే,ఎవరి అదృష్టం వారిదే, ఒకే తల్లి పిల్లలైనా. ఎవరి అందం, తెలివి,రాత, జీవితం వారివే. ఎవరి వైభొగమూ మనకు రాదు, ఎవరి దరిద్రమూ మనిని అంటదు, ఎవరి చావూ వారిదే. ఒకరిని చూసి అసూయ చెంది ఈర్ష్య పడితే జీవితం లో ఏదీ సాధించలేరు, నిరాశ తప్ప

Friday 13 August 2021

మూడంకె వేస్తే


 Courtesy:BAPU

Courtesy:What's app

అలిగి అలివేణి అలకపాన్పుపై మూడంకె వేస్తే 
 (వయసు ముచ్చట)

Thursday 12 August 2021

మూర్ఖులెవరో పోల్చుకోడం ఎలాగ?

  మూర్ఖులెవరో పోల్చుకోడం ఎలాగ?


ప్ర: మూర్ఖులకి దూరంగా ఉండమని చెప్తుంటారు. మూర్ఖులెవరో పోల్చుకోడం ఎలాగ?


జవాబు:


మూర్ఖస్య  పంచ చిహ్నాని

గర్వీ దుర్వచనీ తథా

హరీ చాఽప్రియవాదీ చ 

పరోక్తం నైవ మన్యతే 


మూర్ఖుని ఐదు లక్షణాలు

 1. గర్వం ఎక్కువగా వుండటం 2. చెడ్డ మాటలు మాట్లాడే నైజం 3. మొండి పట్టుదల 4. అప్రియంగా మాట్లాడటం, వాదించడం 5.ఎదుటివాళ్ళు చెప్పిన దానిని వ్యతిరేకించి దానిని కాదనడమే లక్ష్యంగా పెట్టుకోవడం.  ఈ ఐదు లక్షణాలున్నవారిని దూరంగా వదలిపెట్టాలని శాస్త్రం.

Courtesy:What's app

Tuesday 10 August 2021

పాపి చిరాయువు.

 పాపి చిరాయువు.


”అయ్యా! చాలా కాలం అయ్యింది మీరు మీ బ్లాగుని దర్శించి “పాపి చిరాయువు” అని అంటారు ఎందుకని.” ఇలా మెసేజి వచ్చింది నాలుగు రోజుల కితం. మెసేజి ఇచ్చిన దెవరు, కాంటాక్ట్ డిటైల్స్ మిస్సయ్యాయి,వెతుక్కున్నా. దోరకలేదు,చివరికి దొరికేయి. అది మరో కత మరోసారి….

మెసేజి రెండు భాగాలు, మొదటిది అభియోగం. తలవంచి నమస్కరిస్తున్నా! ఇక రెండవది,రాయక తప్పలేదు, అదేమనగా…….

పాపి చిరాయువు కదా! ఇందులో పాపియన నెవ్వరు? పాపం చేసినవాడు. పాపమననేది? మరో ప్రశ్న. దీనికి మనపెద్దలు చెప్పిన సమాధానం. ”పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం” అనగా ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఎవ్వారినైనా పీడించడం పాపం.

దీన్ని వివరిస్తే ఎంతేనా ఉంది. కొద్దిలో తేల్చేస్తా. ఇతరులకు అవసరంలో మాట సాయం నుంచి సొమ్ము సాయం చేసేదాకా ఏదైనా ఉపకారమే! దీనిలో ప్రతిఫలాపేక్ష ఉండదు, కాని పుణ్యం మాత్రం చేరుతుంది, మన ప్రమేయం లేకనే! ఇక పాపం అన్నది ఇతరులను పీడించడం, ఇది కూడా మాట దగ్గరనుంచి సొమ్ము దాకా ఆపై శారీరికంగా, మానసికంగా హింసించడం దాకా పాపకార్యాలే!

తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, నిప్పు ముట్టుకుంటే కాలకమానుతుందా! అలాటిదే ఇదిన్నూ! ఇటువంటి పనులు చేసేటపుడు మన అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది, పాపం చేస్తున్నావూ అని కాని మనం అంతరాత్మని జో  కొట్టేస్తాం.

. అందుకే ”నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవించడం అని” సామెత. పుణ్య పాప కర్మలకి ఫలితం తప్పదు, ఫలితం అనుభవించకా తప్పదు.”ఎవరు చేసిన కర్మవారనుభవింపకా ఏరికైనా తప్పదన్నా! ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పాగలరు, అనుభవింపక తప్పదన్నా!” తత్త్వం.

ఈ పాపపుణ్య కర్మల ఫలితం మరొకరు అనుభవించడం కుదరనిదిన్నూ! పుణ్యకర్మకి భాగస్థులు ఒక్కరే అది భార్య మాత్రమే! భార్య చేసుకున్న పుణ్యంలో మాత్రం భర్తకి భాగం లేదు. భర్త చేసిన పాపంలో భార్యకు వాటాలేదు. అలాగే పాపానికి కూడా భాగస్థులున్నారు. కర్త,కారయిత,అనుమోదకులు.అనగా కర్త పాపం చేసేవాడు, కారయిత పాపం చేయించేవాడు, అనుమోదక అనగా చేస్తున్న  పాపాన్ని  చూసి చంకలెగరేసి బాగుంది,బాగుందన్నవాడు.

ఉత్కృష్టమైన పుణ్యపాపాల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి. పుణ్యాన్ని అనుభవించాలంటే దేవతవుతారు. పుణ్య ఫలం పూర్తికాగానే మళ్ళీ మానవలోకంలో పుడతారు. ఎలా పుడతారు? అందంగా,ఆరోగ్యంగా, ధనవంతులుగా,తెలివైనవారుగా పుడతారు. అసలు కత ఇప్పుడు ప్రారంభమవుతుంది. పూర్వజన్మ పుణ్య ఫలం చేత ఇలా పుట్టేమన్న స్పృహ పోతుంది. ఇక ధన యవ్వన ఇతర గర్వాలు పెరిగిపోతాయి. కామక్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు పెరిగిపోతాయి. ఇంక చూడండి చేసేవన్నీ పాపాలే ఐ ఉంటాయి. పుణ్య ఫలం వల్ల కలిగిన దీర్ఘాయువు ఇలా దుర్వినియోగం అవుతుంది. చేస్తున్నవేమో పాపాలు కాని దీర్ఘాయువుగా ఉంటాడు. చూడ్డానికి ఇవి రెండు భిన్నంగా కనపడుతూంటాయి. అయ్యో ! దేవుడా ఈ పాపాలు చేస్తున్నవాడిని దీర్ఘాయువుగా ఉంచావే అని వాపోతుంటాం. అదీ పాపీ చిరాయువు కత.

అసలు విషయం చెప్పాల్సి వస్తే చాలా ఉంది కాని మధ్యలోచే దారి తప్పించేశాను,ఏమనుకోవద్దు. క్లుప్తంగా చెప్పి ముగించేశానంతే!బాకీ తీర్చేసుకున్నాను.

(21.03.2020)

Saturday 7 August 2021

టచ్చి మనది సెర్చి మనది

 టచ్చి మనది సెర్చి మనది


ఏం బతుకో!బానిస బతుకైపోయింది!!కుదురులేదు కదా!!!

పుట్టింట ఉన్నకాలంలో అల్లారు ముద్దుగా పెరిగాను. ఒకరి చేతిలో పడ్డ దగ్గరనుంచి నా తిప్పలు మొదలయ్యాయి. ఏమని చెప్పుకోను, ఎన్నని చెప్పుకోను?


కొత్తలో ఈగ మీదవాలకుండా అబ్బో ఎన్ని జాగర్తలు,కొత్త కొత్త డ్రస్సులూ,ఉదయాన్నే నా మొహం చూసిగాని పడక దిగకపోవడాలు.నా గురించి గొప్ప చెప్పుకోడాలూ

 ఆ తరవాత చెయ్యి వదలిన క్షణమేదీ? కడుపు నిండడానికి టైమ్ లేదు, ఒక ముద్ద తినేటప్పటికి ఏదో పని పురమాయింపే! ఏ అర్ధరాత్రికో రెప్పలు మూసుకుపోతుంటే కడుపు కాలిపోతోందని గోల చేస్తుంటే అప్పుడు తినమని కంచం ముందు పెట్టేవాళ్ళే అంతా. ఆ తరవాత కడుపునిండిపోయినా వద్దని మొత్తుకున్నా వినే నాథుడు లేడు. ఒక్కొక్కప్పుడు కడుపు పగిలిపోతుందేమోననిపిస్తుంది. కొంతమందికి నేను కూడా లేకపోతే కాలూ చెయ్యీ ఆడవు, ఆఖరి మాట కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా కూడా ఉండాలి. అబ్బా మరీ ఘోరం స్నానం చేస్తూ కూడా దూరంగా కనపడకపోతే...వద్దులెండి.ఏ క్షణాలలోనైనా దగ్గరుండాల్సిందే.  ఇంకక్కడనుంచి నా చాకిరీ ఎక్కడేక్కడో తిప్పి తిప్పి చంపుతారు. కడుపు కాలిపోతున్నా వినరే, మొండికేస్తే అప్పుడు రెండు ముద్దలు తిననిచ్చి మళ్ళీ మామూలే. ఇలా తిప్పలు పెడుతుంటే నాకు మాత్రం అనారోగ్యం చెయ్యదా చెప్పండి.నాకు అంటురోగాలే ఎక్కువ,వైరస్లు నెమ్మదిగా చేరిపోతాయి,అరుస్తూనే ఉంటా ఏదో చేరిపోయిందీ అని వింటేనా? ఏదో రోజు మొరాయిస్తే అప్పుడు హాస్పిటల్ పారేస్తారు, ఆ డాక్టరు నన్ను తిప్పి తిప్పి చంపి బతికించచ్చు, లేదా పూర్తిగా చంపెయ్యా వచ్చు.హాస్పిటల్ నుంచి బయటకు రావడం పాపం మళ్ళీ చాకిరీయే కదా! నాకీ బానిసత్వం వదలదా? నాకూ స్వాతంత్ర్యం కావాలి.



 టచ్చిమనది సెర్చి మనది

దొర ఏందిరో వాని పీకుడేందిరో   IIటచ్చి మనదిII


బైతు కాడ మనం రైతుజాడ  మనం

బాసుకాడ మనం బంట్రోతు జాడ మనం

తల్లికాడ మనం సెల్లి జాడ మనం

పెల్లాంకాడ మనం గిల్లాం జాడ మనం 

పోరికాడ మనం పోరని జాడ మనం

దొర ఏందిరో వాని పీకుడేందిరో.    IIటచ్చి మనదిII


ఊసుకాడ మనం కాసుజాడ మనం 

బాసుజాడ మనం గ్లాసుకాడ మనం

బండి జాడ మనం తిండి కాడ మనం

దారిజాడ మనం గోరికాడ మనం

సెల్ఫీ జాడ మనం  ఫోటో కాడ మనం

దొర ఏందిరో వాని పీకుడేందిరో    IIటచ్చి మనదిII


ఆడియో కాడ మనం  వీడియోజాడ మనం 

చీట్లాటజాడ మనం   కొట్లాటకాడమనం

చుక్కకాడ మనం పక్కకాడ మనం

సానికాడ మనం సంసారిజాడ మనం

సావుకాడ మనం బతుకుజాడ మనం

దొర ఏందిరో వాని పీకుడేందిరో

Who am I


Monday 2 August 2021

శ్రీ విశ్వనాథ స్మృతి-నివాళి

 

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మూర్తి గారు

జననం:23.3.1941

మరణం: 30.6.2021.


శ్రీ విశ్వనాథ వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి

 బహుగ్రంధ రచయిత.

శ్రీ విశ్వనాథ వారు 30-6-2021 తేదీని స్వగృహంలో పరమపదించారు,శివైక్యం చెందారు.వారి గురించి ఈ కింది టపాలలో చూడచ్చు.

ఎనిమిదేళ్ళ కితం వారిని కలిసినపుడు మాటల సందర్భంగా ఎనభై సంవత్సరాలు నిండిన తరవాత ఈ శరీరం విడిచిపెడుతున్నానన్నారు.అప్పుడు నాకంతగా అనిపించలేదు.కాని సరిగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసిన 3  నెలలోనే వారు శివైక్యం చెందారు,ఆశ్చర్యకరమైన విషయం.మరో మాట ఆ సందర్భంగానే వారు మరణానంతరం వారి పార్ధివ శరీరాన్ని శ్రీరంగరాయ మెడికల్ కాలేజి వారికి విద్యార్థులకు అనాటమీ పాఠ బోధనకు వినియోగించేందుకు దానం చేశారు. 

ధన్యజీవి
 శ్రీవిశ్వనాథ శివైక్యం చెందారనే విశ్వసిస్తాను,

శ్రీవిశ్వనాథ వారికి నమస్కరిస్తూ

https://kastephale.wordpress.com/2013/05/06/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b6%e0%b1%8d/

https://kastephale.wordpress.com/2013/05/08/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-193/

https://kastephale.wordpress.com/2013/05/10/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5/

Sunday 1 August 2021

ఎవరు స్నేహితులు?

 ఎవరు స్నేహితులు?

స్నేహితుల దినోత్సవ శుభకామనలు.

అసలు స్నేహితులెవరు? ఈ ప్రశ్న నన్ను చాలా కాలం నుంచీ వేధిస్తోంది. స్నేహితుడు అనే మాటకి అర్ధం చెప్పమంటే ఫ్రెండ్ అని చెబితే కాని తెలియని రోజులొచ్చాయి. అసలు స్నేహితుడు/స్నేహితురాలు అనేవారెవరు? ఇప్పుడు ఫేస్ బుక్ లో లైక్ కొట్టేవాళ్ళూ, ట్వీట్ చేసేవాళ్ళూ అంతా స్నేహితులేనా? స్నేహితునికి/స్నేహితురాలికి ఉండవలసిన లక్షణాలేమిటి? అన్ ఫ్రెండ్ అనే మాటకి అర్ధం ఏమిటి? శత్రువనుకోవాలా? అని చూస్తే,

ఇదిగో ఈ శ్లోకం కనపడింది, అవధరించండి.

పాపాన్నివార్యతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలేః
సన్మిత్రలక్షణం మిదం ప్రపదన్తిసన్తః……భర్తృహరి.

అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు బోషించు గుణము
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్త్రు డీలక్షణంబుల మెలగుచుండు…..లక్ష్మణ కవి.

చెడుపనులనుంచి రక్షించుట,మంచిపనులకు ప్రోత్సహించడం, రహస్యాన్ని దాచిపెట్టడం, కష్టంలో వదలిపెట్టకపోవడం,లేని సమయంలో సొమ్ము ఇచ్చి ఆదుకోవడం, ఇవి సన్మిత్ర లక్షణాలు అన్నారు కవిగారు.

పాపాన్నివార్యతి అంటే పాపం చేయడం నుంచి వారించాలి. పాపం, తప్పుచేస్తే కలుగుతుంది. తప్పునుంచి మళ్ళించడం సాధ్యమా? ఎవరైనా చెప్పగలరుకాని చేయించలేరు కదా! ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు తక్కువ జరుగుతాయి, మందలో ఉంటే….”పబ్బుకెళదాం రావే!” ”అమ్మో! రాను”, ”వాడిదేం కరిగిపోదు, నీదేం అరిగిపోదులే! ఒక్కరోజు పబ్బుకెళ్ళినంతలోనే పాతివ్రత్యం పోదులే”, ఇదెవరిమాట? నీతి మీద అసలు నియమం లేనివారిది. దీనికి తోడెక్కువుంటుంది, మిగతావారు భజన చేస్తారు. మంచిమాట వినరు గాని చెడ్డమాటకి ఊపెక్కువ. రాను అని చెప్పగలిగినవారెంతమంది ఉంటారు. ”ఒకసారికే కదా!” మానవ బలహీనత, ”ఆ( ఎవరు చూసారు లెద్దూ, ఎవరిగోలవారిది”, ఇది సమర్ధింపు.. తప్పు, ఒక సారి మొదలు, తరవాత అలవాటు, ఆ తరవాత వ్యసనం. దీనినుంచి రక్షించేవారుండరు. అసలెవరు చూశారు? మనల్ని ఎవరు పట్టించుకుంటారు! ఇది మనల్ని మనం మోసం చేసుకోడం. మనకెందుకుపోనిద్దూ ఎవరిష్టంవారిది అనుకుంటారంతే, ఎవరూ తప్పని చెప్ప సాహసించరు.. మారీచుడు కూడా సులభా పురుషా రాజన్ అని ఎప్పుడు చెప్పేడు? నిన్ను చంపుతా వెళ్ళకపోతే అన్నపుడు కదా! బాగున్నంతకాలం హాయి, హాయ్ అనేసుకుంటే పోలా! ఉన్నమాట చెప్పి విరోధమెందుకు తెచ్చుకోడం అనుకునేవారే హెచ్చు. ఇదీ మానవ బలహీనతే. వేమనతాత ఏమన్నారు

వేరు పురుగుజేరి వృక్షంబు జెరచును
చీడ పురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు జేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ.

వేరుపురుగు చేరితే ఎంత పెద్ద వృక్షమైనా చచ్చిపోతుంది. చాలాపెద్దదాన్ని వృక్షం అని చిన్నదాన్ని చెట్టు అని అంటారు. ఎంత పెద్దదయిన వృక్షాన్నయినా చిన్న వేరుపురుగు చంపేస్తుంది,తల్లి వేరు కొరికేసి జీవనాడి లేకుండా చేస్తుంది..దానితో వృక్షమైనా చస్తుంది. చీడ పురుగుచేరితే చెట్టు చెడుతుంది, చచ్చిపోదు, చీడపురుగు చెట్టుని పాడు చేస్తుంది.. చెడ్డవాడు మంచివాడిని పాడుచెయ్యడానికే చూస్తాడు, అదివాడి నైజం, నైజ గుణానికి లొట్టకంటికీ మందులేదని సామెత కదా! అందుచేత పాపాన్నుంచి రక్షించే స్నేహితుడు కావాలి.

యోజయతే హితాయ స్నేహితుని మంచిగురించి ఆలోచిచాలంటారు, జరిగేమాటా? ఎవరి స్వార్ధం వారిదే! మరొకరిగురించి ఆలోచనే కనపట్టంలేదు. పొరబాటు జరిగిందేమోనని, అది ముందు జీవితానికి మంచిది కాదేమోనని, ఒకరికి ఒకమాట చెప్పేను, వారికామాట నచ్చినట్టులేదు, మాటాడటమే మానేశారు. ఇప్పుడు ఎవరు ఎవరిగురించి ఆలోచిస్తారు? ఇక ముందు నేనెవరైకైనా చెబుతానా, ఈ అనుభవంతో?

గుహ్యం నిగూహతి, రహస్యాన్ని కాపాడాలన్నారు, ప్రతిజీవితంలోనూ కొన్ని రహస్యాలుంటాయి, తెలిసినవారు వాటిని పదిమందిలో చెప్పకూడదు, కాని నేడు జరుగుతున్నది దానికి వ్యతిరేకమే. ఇంతకుమించి చెప్పుకోడం బాగోదు. కావాలని తప్పులు చేయించి వేధించేవారే కనపడుతున్నారు. రహస్యాన్ని కాపాడే స్నేహితులు కావాలి.

గుణాన్ ప్రకటికరోతి, మిత్రునిలో ఉన్న సుగుణాన్ని పదిమందిలో చెప్పాలన్నారు, ఇప్పుడు జరుగుతున్నదేంటీ? అందరిలో ”మావాడుట్టి వెధవాయండీ” అన్నట్టు మాటాడి, ఒకరూ ఉన్నపుడు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తగిన గుర్తింపురాలేదనేవారే కనపడుతున్నారు. దీన్నే ముడ్డి కాల్చి ఉప్పు పెట్టడం అంటారు. ఎవరిడబ్బా వారు కొట్టుకోడానికే సమయం చాలటం లేదు, మరొకరి గొప్ప చెప్పే పెద్దమనసున్నవారు కావాలి.

ఆపద్గతం చ న జహాతి, ఆపదలో ఉన్నప్పుడు వదలిపెట్టకూడదు. దీని గురించిన టపాలే రాశాను. ఒకప్పుడు ఒక ఆఫీసర్ గారితో గొడవొచ్చింది, నాకు. అది తెలిసినది మొదలు నా స్నేహితులంతా నాతో మాటాడటమే మానేశారు. అంతా బాగున్న కాలంలో హాయ్ హాయ్ అన్నవారే నావల్ల ఉపకారం పొందినవారే.. ఒక స్నేహితుడు మాత్రం ”ఒరే బాధపడకు, రోజులిలాగే ఉండవు, నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చేస్తున్నపని తప్పుకాద”నేవాడు, నిన్న మొన్న మాటాడి, జ్ఞాకానికొచ్చావు, రాత్రి పదిగంటలవేళ, పడుకుని ఉంటావని పిలవలేదని, ఉదయమే మాటాడేడు.

దదాతి కాలేః, ప్రపంచంలో గొడవలన్నిటికి మూలకారణం కాంతా కనకాలే, సొమ్ముకావలసివచ్చి అడుగుతాడేమోనని పారిపోయేవారే ఎక్కువ. ధనమూలమిదం జగత్. ఇదే సత్యం…డబ్బుంటే అందరూ స్నేహితులే, చుట్టాలే…లేకపోతే ఒక్కడు కనపడడు.

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ…
సొమ్ములున్నపుడు అందరూ చుట్టాలే, అందరూ స్నేహితులే, ఎలా వస్తారటా? కవి చమత్కారంగా చెప్పేరు, నిండా నీరున్న చెరువులోకి కప్పలు చేరినట్టనీ, బలే ఉపమానం, నీరుతగ్గిపోతే కప్ప ఒక్కటీ కనపడదు, అలాగే సొమ్ము తగ్గిపోతే ఒక్క బంధువూ, స్నేహితుడూ కనపడడు.

ఇలా కవిగారు చెప్పిన మంచిగుణాలున్న వారు స్నేహితులుగా దొరుకుతారా? అసలు ఆ స్నేహితులు, మన చుట్టూ అలా ఎందుకు తిరగాలి, ఇన్ని ఉపకారాలు చేస్తూ? ఇన్ని సుగుణాలూ ఒకరిలో ఉంటాయా? అసలు ఇటువంటి స్నేహితులు కావాలనుకుంటే, మనలో ఈ మంచి గుణాల్లో ఎన్నుండాలి? మనలో మంచి గుణాలు లేక మంచివారు స్నేహితులుగా ఎలాదొరుకుతారు? అంటే ముందు మనలో మంచిగుణాలు, కవిగారు చెప్పినవి కొన్నయినా ఉండాలి కదా! అబ్బా! కవిగారెంత డొంకతిరుగుడుగా చెప్పేరో చూడండి, ఇటువంటి గుణాలుండాలిరా అబ్బీ అంటే ఎవరు వింటారు? 🙂

ఇటువంటి స్నేహం ఎలా ఉండాలి, మొదలవాలి?

ఆరమ్భగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్……..భర్తృహరి.

మొదలు చూచిన కడుగొప్ప పిదప గుఱుచ
యాది కొంచము తర్వాత నధికమగుచు
దనరు దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనులమైత్రి…..లక్ష్మణ కవి.

మొదట ఎక్కువగానూ తర్వాత చిన్నదైపోయే, మొదట చిన్నదిగానూ ఆ తరవాత పెద్దదయే,ఉదయ, మధ్యాహ్న కాలాలలో ఉండే మన నీడలా, దుర్జనుల, సుజనులతో మైత్రి ఉంటుంది.

ఉదయపునీడ పెద్దదిగా ఉండి మధ్యాహ్నానికి మనమీదనే పడుతుంది, అంటే పొడవు తగ్గి, తొందరగా మొదలయే స్నేహాలు, అలాగే వదలి ఉండలేనట్టుగా మొదలయి, తొందరగానే ముగుస్తాయి,అదే మంచివారితో స్నేహం మధ్యాహ్నపు నీడలా చిన్నదిగా మొదలయి సాయంత్రపు నీడలా పెరుగుతుంది. సూర్యుడు అస్తమించినపుడు నీడ అస్తమించినట్లు, ఆ వ్యక్తులు అస్తమించిన తరవాతనే ఆ స్నేహమూ అస్తమిస్తుంది. అదీ అలా ఉండాలి స్నేహమంటే. లేకపోతే

కూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ…

స్నేహం ఉన్నకాలంలో వారే వీరు, వీరేవారు చెప్పడమే కష్టం,ఎవరెవరో. ఆ స్నేహం కాస్తా విరిగింది, కారణం ఏదయినాకావచ్చు, చిన్నదే అయిన కారణం కూడా పెద్ద భూతం లా పెద్దదిగానూ కనపడచ్చు, అప్పుడు ఎవరు మాటాడినా రెండవవారికది తప్పుగానే తోస్తుంది, ”వెధవ! వాడిపాపాన వాడేపోతాడు” అని తిట్టుకుంటూ