Friday 23 September 2022

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

 విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

Continuation of

 https://kasthephali.blogspot.com/2022/09/2024-1.html

విపక్షం నుంచి ఏ ఒక్క పార్టీ బిజెపిని ఒంటరిగా దేశం మొత్తం మీద ఎదుర్కోగల స్థాయిలో లేదు. ఆర్జెడి నేత "కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీరుపోటీ చేయండి, స్థానిక పార్టీలు బలంగా ఉన్నచోట వాటిని బలపరచండి" అని సూచించారు, దానికి కాంగ్రెస్ వారిచ్చిన సమాధానం " మేమింకా బలహిన పడదలుచుకోలేదని" పురిటిలోనే సంధికొడుతుంటే పొత్తులెక్కడా? అనేదే  సందేహం. 


ప్రధాని పదవికి పోటీ పడాలని అనుకునేవారు ఈ కిందివారని ప్రజలమాట, మీడియా మాట.

రాహుల్ గాంధి: వీరి పార్టీకి స్థానిక పార్టీలకి చుక్కెదురు, అన్ని రాష్ట్రాలలోనూ. పాలనానుభవం శూన్యం, కనీసం పంచాయతి ప్రెశిడెంట్ గా కూడా పని చేసిన అనుభవం లేదు. పైనుండి చెప్పడం వేరు, పని చేయడం వేరు. ఇది వీరికి పెద్ద మైనస్ పాయింటే. ఎత్తుచేతివారి బిడ్డ గనక పాలనానుభవం పుట్టుకతోనే వచ్చేస్తుందనేవారూ లేకపోలేదు. ఇతనికి సమయం సందర్భం తెలిసిమాటాడే అలవాటు పూజ్యం అని అంటారు. విపక్షంలో కాకలు తీరిన యోధులున్నారు, పాలనానుభం కొల్లలుగా ఉన్నవారున్నారు. ఇతనిని ప్రధానిగా ఒప్పుకోగలరా అన్నది, పెద్ద ప్రశ్న.మరొకరిని వీరి పార్టీ నుంచి ఎన్నుకునే సావకాశం చెప్పలేనిదే!వీరికి రాగల సీట్లు 50. శత్రువులెక్కువ. 


మమత: వీరు బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి బెంగాల్లో తప్పించి మరో రాష్ట్రంలో పలుకుబడి లేదు. బెంగాల్ దాటి వీరి ప్రభ లేదు,సామాన్యులెవరికి తెలియనివారే! తృణమూల్ పార్టీకి, కాంగ్రెస్ కి, సి.పి.ఎమ్ లు రాష్ట్రంలో ప్రత్యర్థులు.  బెంగాల్లో ఎక్కువలో ఎక్కువ  వీరికి 20 సీట్లకంటే వచ్చే సావకాశం లేదు. మరొక పార్టీకి అదే తమిల్నాడులో డి.ఎమ్.కె కి మాత్రం వీరితో సమానంగా సీట్లు వచ్చే సావకాశం.మమత తాము,అఖిలేష్, ఝర్ఖండ్ వారు ఒక జట్టని ప్రకటించారు. వీరికి రాబోయే సీట్లు 20.


నితీష్: వీరు బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం నుంచే ఉన్నారు. పాలనానుభవం దండిగా ఉన్నవారే!ఇప్పటికే చాలా సార్లు తమపార్టీని కాంగ్రెస్ నుంచి, బి.జె.పి కి మరల ఇటునుంచి అటు కప్పగంతులు వేసి అధికారం నిలబెట్టుకున్నారనే అపప్రథ ఉన్నది. ఇప్పుడైతే ఎన్నికల తరవాత మళ్ళీ బి.జె.పి లోకి గెంతరనే నమ్మకం ఎక్కువమందికి లేదు.అంతేగాక వీరు బి.జె.పి తరఫున పనిచేస్తూ కాంగ్రెస్ వైపుకొచ్చారు, గూఢచారిగా అనే మాట కూడా వినపడుతోంది. వీరికి బీహార్లో తప్పించి మరో రాష్ట్రంలో పట్టులేదు.  నితీష్ ఉ.ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నేటి వార్త. వీరికి ఉ.ప్ర లో పట్టులేదు, కాని వీరికి ఉ.ప్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ తన సీటు ఫూల్పూర్ వీరి పోటికి త్యాగం చేయబోతున్నట్టు వార్త.నితీష్, బాబోయ్! నేనసలు విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ లో ఉన్నానని చెప్పలేదు మొర్రో! అని మీడియా ముందు గోల. వీరికి అందరూ మిత్రులే అలాగే అందరూ శత్రువులే!!! వీరికి రాబోయే సీట్లు 6.


శరద్ పవార్: వయసు మీద బడింది,ఆరోగ్యమూ సరిలేదు, వీరు కేంద్ర మంత్రిగానూ ఉన్నారు, మరాఠా చాణుక్యుడంటారు. వీరికి మహరాష్ట్రలో ఓ చెంపనే బలముంది,మరే రాష్ట్రంలోనూ చెప్పుకోతగ్గ బలం లేదు.  వీరికి రాబోయే సీట్లు 6 కి పెరగవు.  వీరికి కొత్త మిత్రులు పాత శత్రువులు ఒకటే! ఎవరితోనైనా కలసిపోతారు, తమ పని ముఖ్యం,అంతే.


 అఖిలేష్ యాదవ్ : ఉ.ప్ర. కి ఉన్న సీట్లు 80. వీరికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.హిందీ రాష్ట్రాలలో కూడా వీరికి పట్టులేదు, తమ రాష్ట్రం తప్పించి. వీరికి బి.ఎస్.పి కి కుదరదు.  వీరికి రాగల సీట్లు ఇరవైలోపే.ప్రధాని కావాలనే కోరిక ఎక్కడా వెలిబుచ్చినట్లు లేదు.


కేజ్రివాల్: వీరినంతా క్రేజివాల్ అంటారు,అదేమో మరి. వీరు ఢిల్లీ లోనూ పంజాబ్ లోనూ అధికారంలో ఉన్నారు. రేపు హిమాచల్ లోనూ గుజరాత్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామంటున్నారు. వీరికి కాంగ్రెస్ అంటే చుక్కెదురు. మేము అప్పుడే బి.జె.పి వ్యతిరేక ఫ్రంటులో చేరమని ప్రకటించారు. అంటే  తటస్థంగా ఉండి, ఎక్కువ లాభం పొందాలని ఆశ, దురాశ కాకుంటే మంచిదేనేమో!. 


ఇక దక్షణాది కొస్తే, ఇక్కడ్నుంచి ప్రధాని అయ్యే సావకాశాలే తక్కువ.మొత్తం దక్షణాది రాష్ట్రాలలో సీట్లు అన్నీ కలిపి ఆంధ్ర25+తెలంగాణా17+తమిల్నాడు39+కేరళా20+కర్నాటక28=129.ఇక్కడినుంచి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతూ మోడీ ని దించేస్తాం, ఆ తరవాత మాదే ప్రభుత్వం అంటున్న కె.సి.ఆర్ అనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రథములు.పోనీ ఈ దక్షణాదివారంతా ఒక మాట మీదుంటారా అంటే సాధ్యం కానిదే! వీరికి కాంగ్రెస్ కీ కుదరదు. వారున్నచోట వీరుండరు. కాంగ్రెసేతర,బిజెపియేతర ప్రతిపక్షపార్టీలకూటమా? ఇదివరలో చాలా ప్రయత్నాలే జరిగాయి, కాని ఏదీ బతికి బట్టకట్టలేదు.కొత్త పార్టీ స్థాపనా? ఎమో చూడాలి.ఒక రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో నెగ్గుకురాగలగినవారు ఎన్.టి.ఆర్ మాత్రమే! దేశం మొత్తం మీద కొత్త పార్టీ పెట్టి ఆశయాలు చెప్పి అన్ని రాష్ట్రాలలో ఒప్పించగల కార్యకర్తలు, మంది, మార్బలం సమకూర్చుకోవడం తేలికా, రెండేళ్ళలో సాధ్యమా? అభిమానులు జరుగుతుందంటే విని ఆనందించచ్చు.కాని ఇది నిజానికి దూరమేమో! అన్ని పార్టీలు ఎక్కడివారక్కడ పోటీ చేసి ఎన్నికలయ్యాక పొత్తులు కుదుర్చుకుంటాం అంటే ప్రజలు నమ్ముతారా? 


కెసిఆర్: వీరి పార్టీ తెలంగాణా లో పదేళ్ళుగా పాలనలో ఉంది. తెలంగాణాలో పట్టున్నది. కాని రాష్ట్రం దాటి వీరి మాట వినేవారెవరనేది పెద్ద ప్రశ్న.కొత్త పార్టి పెడుతున్నా! ఖబడ్దార్ అని గర్జిస్తున్న మాట నిజం. వీరి రాష్ట్రం లో మొత్తం సీట్లు 17 కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ స్థానాన్ని బి.జె.పి ఆక్రమిస్తున్నందుకే వీరి గర్జనలని విజ్ఞుల మాట. వీరికి మహా ఐతే 10 సీట్లు రావచ్చు. వీరికి కాంగ్రెస్ కి పొత్తు లేదు. వారి నీడ కూడా పడటానికి ఇష్టపడని వీరు కాంగ్రెస్ లేక కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా?వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 

చంద్రబాబునాయుడు: తెలుగుదేశం పార్టి బిజెపితో అంటకాగి YSR CP వేసిన ఎత్తుకు చిత్తయి,బిజెపితో కటీఫ్ చేసుకున్నారు,ప్రభుత్వం నుంచీ బయటికొచ్చారు. దీనికీ ఎవరూ తప్పుపట్టాలేదు. కాని, బద్ధ వ్యతిరేకి ఐన కాంగ్రెస్ తో 2019 లో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నంతో ప్రజలు తిరస్కరించారు. అప్పటినుంచి,ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారానికి దూరమై ఉన్నవారు.నలభై ఏళ్ళ పాలనానుభవం, రాజకీయానుభవం పనిచేయలేదు.వీరికి రాష్ట్రంలో పది సీట్లురావచ్చు.మరో రాష్ట్రంలో పట్టులేదు.పట్టుందని ప్రయత్నించిన కర్ణాటకలో ఎదురు దెబ్బే తగిలింది. వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 


కమ్యూనిస్టులు:అంతర్జాతీయ పార్టీ మాదని చెప్పుకునే వీరు దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు. బెంగాల్ లో తృణమూల్ దెబ్బకి మట్టికరిచి మరి తేరుకోలేకపోయారు. ఇక వీరికి పట్టున్న మరోచోటు కేరళా, కాని ఇది కూడా కుటుంబ పార్టీ ఐపోతోందంటున్నారు. చారిత్రిక తప్పిదాలు చేయడం వీరి అలవాటు. మరెక్కడా ఉనికి ఉన్నట్టు లేదు. కేరళాలోనే వీరికి రాగల సీట్లు 10.


1962 లో మొదటి సారి ఓటేసిన వాడిని, నాటినుంచి ఎన్నికలు చూస్తున్నవాడిని,రాజకీయనాయకులతో,

రాజకీయపార్టీలతో సన్నిహితంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిపినవాడిని. ఆరోజుల్లో కూడా కాంగ్రెస్ నీ గద్దె దించేస్తామన్న వారే అందరూ, కాని ఆ పార్టీ చిత్తు కావడానికి దగ్గరగా ఏభై ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం మూలంగానే!స్వాతంత్ర్యం తరవాత పాలూ తేనెలు ఈ పార్టీ దేశంలో ప్రవహించేస్తుందని నమ్మి మా తాతలు ఆస్థులు తెగనమ్మి ఈ పార్టీని బతికించారు, మమ్మల్ని వీధులపాలూ చేశారు. 

అంతర్గత ప్రజాస్వామ్యం తో దేశప్రజల ఆకాంక్షలు తీర్చగల మరో పార్టీ ఉండటం మంచిదే! అటువంటి పార్టీని నిర్మాణం చేస్తే ఆనందమే.స్వార్ధమే, పరమావధిగానూ, ద్వేషమే ఊపిరితో బతికే పార్టీలు ఏమి చేయగలవన్నదే ప్రశ్న.

పై చెప్పినవారే కాక వెలుగులోకి రాని వారు చాలామందే ఉన్నారు, అందరూ పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరన్నదే ప్రశ్న.

  అనుకున్నట్టే కాక ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయని ఊహిస్తూ అంచనా

CON60+TMC 25+DMK25+NCP10+AAP10+SP 20+RJD 20+TDP10+TRS10 +CPM10 Total 200 small parties say 30.Now the total is 230 along with congress, 170 without congress. It is difficult to understand how a governemt can be formed at centre. 

ఇందులోనే, ఒకరినీడ మరొకరిపై పడినా సహించలేరు.ఒకరిపై ఒకరికి నమ్మకమూ లేదు వీరికి పొత్తెలా? ప్రజలని ఎలా నమ్మిస్తారు?అటువంటి కూటమికి విదేశీ విధానం ఏమిటి? చాలా ప్రశ్నలకి సమాధానం లేదు.కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారంలో ఉన్నవారితో అంటకాగుతాయి, అది సహజం కూడా. ఎన్నికల తరవాత ఎంతమంది ఈ కూటమిలో ఉంటారో! ఎవరు జారుకుంటారో ఎవరు చెప్పగలరు?

బలవంతంగా వీరంతా కలిసినా అదెంతకాలం? అలా కలపగల వారెవరు? సామాన్యునికి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!


11 comments:

  1. విశ్లేషణ బాగుంది. మీకు విశేష పరిజ్ఞానం ఉన్నట్లుందే దేశరాజకీయాలతో ! 🙂

    శరద్ పవార్ లాంటి వృద్ధులు ఇంకా ఎంత కాలం సర్? మాటలో స్పష్టత కూడా తగ్గింది. తెర వెనకాల కూర్చుని మంత్రాంగం నడపాలి కానీ స్వయంగా పదవులకు పోటీ పడతానంటే ఎలాగ?

    చంద్రబాబు నాయుడు గారి గురించి మీరన్నది మరోసారి ఆలోచించండి. కొడుకుని ముఖ్యమంత్రి చెయ్యాలని ఆశ పడుతుండచ్చేమో గానీ తను కేంద్రంలో ప్రధాని అయ్యి చక్రం తిప్పాలనుకుంటున్నారంటారా? తన ప్రభ దివ్యంగా వెలుగుతున్న రోజుల్లోనే ఢిల్లీలో చురుకుగా తిరుగుతూ చక్రం తిప్పుతున్నప్పుడు కూడా ప్రధాని కావాలని అనుకోలేదనుకుంటాను. అఫ్కోర్స్ అప్పటికి కొడుకు బాగా చిన్న పిల్లవాడనుకోండి. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్ర పగ్గాలు కొడుకు చేతిలో పెడతాడని అనుకోను.

    చివరికి ఎవరు అధికారంలోకి వచ్చినా దేశప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కదా. అంతటా స్వార్థపూరిత రాజకీయం అయిపోయింది.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు,
      సహవాస దోసహమనుకుంటానండి. :)

      శరద్ పవార్ నా కంటే సంవత్సరం పెద్దవారు, మేమంతా తెర వెనక్కి వెళ్ళిపోవాలంటారు, ఏదో రోజు తప్పదు లెండి :) విపక్షం బలంగా ఉన్నదని చెప్పడానికి చేసే ఎత్తుగడలు కావచ్చు. పాపం ఆయనేం అనలేదు, మొన్న ఉపాధ్యక్షుల ఎన్నిక సమయంలో కూడా ఆయన పేరిలాగే బయటకు తెచ్చేరు కదా!

      ఇక సిబిఎన్ Vajapayee టైములో ఎన్డిఎ కన్వీనర్ కదా! అప్పుడు ప్రధాని అయ్యే సమస్యే లేదు. రెండో సారికి బిజెపికే స్వంతంగా బలం వచ్చింది అప్పుడు సిబిఎన్ ఆసించే సావకాశమే లేదు. ఇక సిబిఎన్ NDA నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ ను బలపరచినపుడు, ఆయన కొడుకును స్టేట్ లో సిఎమ్ చేసి సెంటర్ లో రాహుల్ ని ప్రధాని చేసి ఇక్కడా అక్కడా చక్రం తిప్పాలనుకున్నారని అనుకున్నారు.ఏదీ జరగలేదనుకోండి.
      ఇప్పుడాయన ప్రధాని అభ్యర్థిని అని ఎక్కడా అనలేదు.మీడియా అంటున్నదామాట. అయనగాని మళ్ళీNDA లో చేరిపోతాడేమో అని ముందుగానే ఆయనకు ప్రధాని అభ్యర్థి అని ఎరవేస్తే అని మీడియా అనుకుంటూ ఉండచ్చు. నిజమేంటో పెద్దలు చెప్పాలి.

      Delete
  2. |ఎవరు అధికారంలోకి వచ్చినా దేశప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కదా|

    నిజమేనండీ. కానీ, ఒరిగేది లేకపోవటం అటుంచి తరిగేది మాత్రం అనంతంగా ఉండే ప్రమాదం ఉండే సందర్భాలూ తటస్థపడ వచ్చునేమో. ఆలోచించండి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,
      ప్రజలంత వెర్రివాళ్ళు కాదనుకుంటానండి.

      Delete
    2. మిత్రులు శర్మ గారు,
      నేను కూడా ప్రజ లంత వెఱ్ఱివాళ్ళు కారనే అనుకొనేవాడి నండీ. ఎంత వెఱ్ఱివాడిని!

      Delete
    3. శ్యామలీయం,విన్నకోటవారు,
      రాజకీయనాయకులతో, రాజకీయపార్టీలతో సావాస దోషం ఉందేమోగాని అనుభవజ్ఞుల మాట కాదనే ధైర్యం లేదండి :)

      Delete
  3. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నాకు అలనాటి జనతాపార్టీ ప్రయోగం గుర్తుకు వస్తోంది. కేవలం‌ ఇందిరను కుర్చీలోంచి దించెయ్యటం మాత్రమే తక్షణ & ఏకైక ప్రయోజనంగా ఎన్నో పార్టీలు కలిసి ఏర్పడిన మంచి కిచిడీ పార్టీ అధికారంలోనికి ఐతే బ్రహ్మాండంగా రాగలిగింది. కాని ఆపార్టీ వట్టి కప్పలతక్కెడ అని తేలిపోవటం ఎంత చెరుపు చేసిందంటే, విసిగిపోయిన ప్రజానీకం ఆ యిందిరనే పిలిచి పట్టంకట్టారు.

    ఇప్పుడు కూడా అన్ని రకాల ప్రతిపక్షాలదీ ఒకేఒక్క ఎజెండా - మోదీని దించేయటం. అందుకోసం ఎవరైనా సరే ఎవరితోనైనా పొత్తుకు సై అనేస్తారట. కాని ఈకలగూరగంప నుండి ఎవరిచేతికి ఇస్తారండీ ప్రధానిపదవి అనృ మంత్రదండం? ఆవిషయంలో వాళ్ళల్లో ఎవరికీ స్పష్టత లేదు - రాదు కూడా. ఇంక వాళ్ళే స్పష్టత ఇస్తారూ ప్రజానీకానికి? అప్పుడు ప్రజలు మాత్రం వీళ్ళకి ఎందుకు ఓట్లు పొలోమని వేసేస్తారు?

    ఐనా సరే, మనదేశంలో ఏదైనా జరుగవచ్చును. ప్రజల విజ్ఞతమీద ఎంత నమ్మకం పెట్టుకోవచ్చునో అంతకన్నా ఎక్కువనమ్మకం ప్రజల అజ్ఞతమీద పెట్టుకోవచ్చునని ఈమధ్యకాలంలో బాగానే ఋజువు అవుతూ ఉన్నది కాబట్టి.

    నిజానికి ఈఅవకాశవాద రాజకీయవాదుల ఆశ అంతా ఈప్రజల అజ్ఞతమీదనే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చును. అందరూ నోటికివచ్చిన అసత్యాలను నిత్యం వండి వడ్డించేస్తున్నారంటే ఆవిషయంలో వాళ్ళకు గట్టినమ్మకం కాబట్టే.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,
      ఎవరి లెక్కలు వారికుంటాయి కదండీ!ఎవరూ చేతులు ముడుచుకు కూచోరుగా!ఎన్నికలలోపు ఏం జరుగుతుందో చెప్పలేం కదా! వాక్శ్వాతంత్ర్యం ఉన్నదికదండీ. ____/\____

      Delete
  4. మీకెందుకండీ మానసిక శ్రమ, ఒక్కోటుతో ఏమైనా మారేనా పెట్టేనా

    ReplyDelete
    Replies
    1. అనామకా!
      ఇంటింటికో పూవు ఈశ్వరునికో మాల :)

      Delete