12, ఆగస్టు 2019, సోమవారం

Sinking Ship






ములిగే ఓడ. 

ఓడ  ఎందుకు ములుగుతుందీ? ఓడ కెప్టెను, ఓడలో వేసే సామాను, వేసేటపుడు సరిగా సమతూకంగా  ఉండేలా సద్దించుకోకపోతేనూ, ఓడను అలలపై కాచుకుంటూ సరిగా నడపలేకపోతేనూ  వీడియోలో లా ములిగిపోతుంది. మరి  ఓడ కెప్టెన్ ఏం చేయాలి? 



ఓడ ములిగే పరిస్థితి వస్తే కెప్టెన్ ఓడలోవారందరిని సురక్షితం చేసి చివరగా ఓడను వదలి రావడంగాని లేదా ఓడతో ములిగి జలసమాధి కావటంగాని చేయడం సముద్రం మీద బతికే వారి పరిపాటి. అదివారి ఆచారం కూడా. ఎప్పుడూ ఓడను రక్షించుకోవడం కుదరకపోవచ్చు,అప్పుడు అందరిని రక్షించుకుని బతికి బయటపడి మరో ఓడతో జీవించడం మంచి పని, ఇది ధీరుని లక్షణం. 


 ఓడ ములుగుతోందని తెలిసి ఓడలోవారిని  ఓడను వారి కర్మానికి వారినొదిలేసి తాను బయట పడటం, భీరువైన కెప్టెన్ లక్షణం. భీరువు చరిత్రలో కలిసిపోతాడు, ధీరువు చరిత్రలో మిగిలిపోతాడు, అంతే తేడా!

4, ఆగస్టు 2019, ఆదివారం

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి.

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.

Courtesy: Owner


నృసింహ శతకంలో పద్యం చదువుకుంటున్నాం కదూ! మొన్న మొదటి పాదం చదివేంగా. ఇప్పుడు రెండో పాదం, అవధరించండి. 




మొదటిపాదంలో అధిక విద్యావంతులు అప్రయోజకులౌతున్నారన్నారు. అప్రయోజకులంటే పనికిరానివారని అర్ధం. ఈ శుంఠ శబ్దానికి అదే అర్ధం చెబుతోంది ఆంధ్రభారతి. తేడా ఏంటీ?




పండిత పుత్ర పరమ శుంఠ అన్నది పెద్దలమాట.ఈ మాటలోని పరమ శుంఠ పదాన్ని కవిగారు పూర్ణ  శుంఠ అన్నారనుకుంటా! పైవాళ్ళు అర్ధ శుంఠలైతే వీరు పూర్ణశుంఠలట. పూర్ణశుంఠ అనడం లో అవసరమూ ఉన్నది సుమా! పై పాదంలో పనికిరానివారు అన్నవారు పూర్ణశుంఠలు కారు. కొంత సానబడితే వారు పనికిరావచ్చు గాని ఈ పూర్ణశుంఠలు మాత్రం పుటమేసినా పనికిరారని చెప్పడానికే పూర్ణశుంఠ అన్నారనుకుంటా. 




పండిత పుత్రులు పరమశుంఠలు ఎలా అవుతారు? అలా పరమ శుంఠలైనవారు సభాపూజ్యులెలా అవుతారు అన్నదే అనుమానం.పండితునికి తన పాండిత్యం ద్వారా కలిగే వ్యవహారాలమీద తప్పించి సంతానం ఎలా ఉన్నదో పట్టించుకునే తీరిక ఉండదు. మరి వీరిని చూసేవారెటువంటివారుంటారు? వీరు సమయం గడుపుకోవాలనే స్వార్ధపరులై ఉంటారు.ఇతరులను పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకునేవారవుతారు. వీరు ఆ పండితుని పొగిడి అవసరం గడుపుకునేవారు కావడంతో పిల్లలికి చెడ్డ బుద్ధులే అబ్బుతాయి, వీరి చదివు సంధ్యలు వెనకబడతాయి. వీరిని సరి దిద్దేవారుండరు, ఎత్తుచేతివారి బిడ్డలు కదా!.పిల్లలను కూడా పండితుని కంటే గొప్పవారని పొడ్తలలో ముంచి పబ్బం గడుపుకుంటూ, పండితుని పిల్లలను పరమ శుంఠలుగా తయారు చేస్తారు.  ఆ తరవాత వారు కూడా ఈ పండితుని గౌరవంలో కాలం గడిపేస్తారు. పిచ్చి ప్రజలు పండితుని ప్రజ్ఞ పాటవాలు వీరిలో కూడా ఉన్నాయనుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమైపోతుంది. కాలం గడుస్తుంది, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి. అప్పటి దాకా ఈ పరమ శుంఠలు సభాపూజితం పొందుతూనే ఉంటారు.  

1, ఆగస్టు 2019, గురువారం

అధిక విద్యావంతు లప్రయోజకులైరి

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner

నృసింహ శతకకర్త కాకుత్స్థం శేషప్ప కవి. పద్దెనిమిదవ శతాబ్దం వాడన్నారు. కవిగారి ఊరు ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ధర్మపురి దగ్గర అని తెలుస్తోంది. తెలుగు కవుల స్థల కాలాల మీద చాలా చర్చ జరుగుతోంది, అప్పుడప్పుడు. నిజం మాత్రం తెలియటంలేదు. అప్ప,అయ్య,అన్న, అమ్మ,అక్క నామాంత్యాలుగా తెలుగునాట పేర్లున్నమాట నిజం, ఇప్పుడవి లోపించడమూ నిజం. ఏమైనా ఈ శతకాన్ని వారే రాశారన్నదాని మీద విచాదం మాత్రం లేదు, నాకు తెలిసి, ధన్యుడను. 



చిన్నప్పుడు నాలుగు శతకాలు బట్టీ వేయించేవారు. అవి సుమతీ శతకం,వేమన శతకం, భాస్కర శతకం, నృసింహ శతకం. కొద్ది వయసొచ్చాకా మరి కొన్ని శతకాలూ చదువుకున్న రోజులు.  ఈ కోవలోనివే భర్తృహరి శతకాలు. ఇవి సంస్కృతంలో ఉండడంతో ఏనుగు లక్ష్మణ కవిగారు తెలుగు చేసిన పద్యాలే సంస్కృతం వాటికంటే అందంగా ఉంటాయి నాకు. భాగవతం వ్యాసుడు సంస్కృతంలో రాసినా నాకు పోతరాజుగారు రాసిన తెలుగు భాగవతమే అసలైనదనిపిస్తుంది, నచ్చుతుంది కూడా. 

పలికెడిది భాగవతమట

పలికించెడువాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా! 

భాగవతం చెబుతున్నా! పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు,భాగవతం చెబితే ముక్తి లభిస్తుందిట, మరెందుకు మరొకటి చెబుతానూ! మరొకగాధ చెప్పను, భాగవతమే చెబుతానన్నది అర్ధం. 



దీనికేంగాని నృసింహ శతకంలో కవిగారు కాచి వడబోసిన జీవిత సత్యాలు చెప్పేరు, అవి సార్వజనీనం, అంతే కాక ఏకాలానికైనా సరిపోయేవే! ఈ పద్యంలో కవిగారు చెప్పినది నేటి కాలానికి అతికినట్టు సరిపోతుంది చూడండి. 

”అధిక విద్యావంతులప్రయోజకులైరి” దీనితో మొదలు పెట్టేరు, పద్యం. ఏ దేశంలోనైనా ఎక్కువ చదువుకున్నవారు విజ్ఞానులనీ ఆత్మాభ్యుదం తరవాత, దేశాభ్యుదయం కోసం పని చేస్తారనీ, చెయ్యాలనీ సామాన్యులు కోరుకుంటారు. అసలీ అధిక విద్యావంతులెక్కడుంటారు? ప్రభుత దగ్గర, విశ్వవిద్యాలయాల్లోనూ కదా! నిజంగానే వీరిలో కొందరు నేడు మనదేశంలో అప్రయోజకులుగానే ఉన్నారు. వీరిలో ఆడ మగ తేడా కనపడటం లేదు. 


విశ్వవిద్యాలయాలలో ఉన్నవారు సొమ్ముకు సర్టిఫికట్లు అమ్ముకునే వ్యాపారంలో ఉన్నారు. లేదూ స్త్రీ లోలత్వానికి లోబడిపోయారు. ఇక వీరు స్త్రీలైతే చదువుకోడానికొచ్చినవారిని వ్యభిచారం రొంపిలో దింపి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని యువతని ప్రేరేపిస్తున్నారు. వీరి 
పిల్లలు మాత్రం విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు చెప్పేదాన్ని మీరెందుకు అమలు చేయరంటే, నేను సిద్ధంత కర్తను మాత్రమే, నా భార్య పిల్లలికి కూడా చెప్పేను, వారు వినిపించుకోలేదు. వ్యక్తి స్వాతంత్ర్యం ఉన్నదికదా,వారినెలా బలవంత పెట్టగలను అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న మేధావులు ఇలా ఉన్నారు, అందరూ అనను సుమా!

ఇక ప్రభుతలో ఉన్న మేధావులెలా ఉన్నారయ్యా అంటే, దేశం ఏమైనా బాధలేదు, ఎవరేమనుకున్నా ఇబ్బందీ లేదు,ధన సంపాదనే ధ్యేయమన్నవారున్నారు.  దేశ వనరులపై కొంతమందికి మాత్రమే ప్రథమహక్కుందన్నవారూ ఉన్నారు.  ఇలా అధిక విద్యావంతులలో కొంతమంది కవిగారు చెప్పినట్టే ఉన్నారు కదా!



ఇప్పటికే టపా చాలా పెద్దదయింది, మిగిలినవి తరవాత 

28, జులై 2019, ఆదివారం

తెలివి తక్కువ వాళ్ళు

తెలివి తక్కువ వాళ్ళు ఇళ్ళు కడతారు, తెలివైనవాళ్ళు కాపరం ఉంటారు. 


25, జులై 2019, గురువారం

ఆచూకి తెలిస్తే దయచేసి చెప్పండి.




ఎత్తుకుపోబడ్డ బాలుడు దొరికాడు. మా వూరికి పది కిలో మీటర్ల దూరంలోని కుతుకులూరు గ్రామంలో అమ్మవారి గుడివద్ద ఉదయమే బాలుని ఎత్తుకుపోయినవారు వదలిపోయినట్టు వార్త. 

21, జులై 2019, ఆదివారం

ఇళాపంచమి

Courtesy:Whats app

ఇళాపంచమి

ఇద్దరు భార్యలని పెళ్ళి చేసుకోవచ్చా? ఒకసారి ఇద్దరిని కట్టుకుంటే తప్పు లేదా? ఏమో లా తెలిసినవారు చెప్పాలి. కాని శ్రీనాథుడు మాత్రం ఇలా అనేశారు.

సిరిగలవానికి జెల్లును 
తరుణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.

డబ్బున్నవాడు పదహారు వేలమందినైనా పెళ్ళి చేసుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుని పై ఎత్తిపొడుపు, ఆయన పదారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడు, వారు కోరితేనే. ఎవరిదగ్గ వారికే స్వంతమైనట్లూ ఉన్నాడన్నారు. ఎందుకు చేసుకోగలిగాడు ఆయనకేం సొమ్ముందిగనక పదారు వేలమందిని చేసుకున్నాడు. పరమేశ్వరా! నీవేమో బిచ్చగాడివా!! నీకు ఇద్దరు పెళ్ళాలా? చాలు చాలు ఒకతినే పోషించలేనివాడికి ఇద్దరు పెళ్ళలెందుకయ్యా! ఒకదాన్ని వదిలెయ్యమన్నాడు. సరే అది కూడా నిర్దిష్టం చేసి చెప్పేసేడు, ఆవిడే తనకు కావాలట, అదే గంగ అని తేల్చి చెప్పేడు. కవయః నిరంకుశః అన్నారు గాని మరీ ఇంత నిరంకుశత్వమా? అనిపించింది. కొంచం నీళ్ళివ్వయ్యా అని అడగచ్చుగా!

ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో జేరేం కదూ. ఇళా పంచమి అన్నది ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజు వివాహం చేసుకోవచ్చంటారు. ఆషాఢ మాసంలో పెళ్ళి నిషిద్ధం,కాని ఈ ఒక్కరోజు వివాహం చేసుకోవచ్చట. అది కూడా ఎప్పుడంటే మిడసరలగ్గం అంటారు చూడంది అదే ఇది. అనగా సూర్యుడు నడినెత్తికి వచ్చేవేళ అనగా అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం అనగా సూర్యోదయానికి ఉండే లగ్నం నుంచి 4వ లగ్నం అనగా, ఆషాఢంలో సింహలగ్నం తో తూరుపు తెల్లవారుతుంది, దాని నుంచి  4వలగ్నం మిట్టమధ్యాహ్నానికి  వృశ్చికలగ్నం వస్తుంది. (Roughly 11.30to 12.20) అప్పుడు వివాహం చేసుకోడానికి మరేం చూడక్కర లేదంటారు. ఈ లగ్నం లో ఆషాఢ శుద్ధ పంచమి రోజున ఇళా దేవిని శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడట. అదండి ఇళాపంచమి మాట.   ఇక అభిజిత్ లగ్నంలో మొదలు పెట్టిన ఏపని ఐనా నిర్విఘ్నంగా జరుగుతుందంటారు, దీనికి తిథి,వార,నక్షత్రాలతో, వర్జ్యం,దుర్ముహూర్తం లతో నిమ్మిత్తం లేదని ఉవాచ.  

 వీడియోలో పెళ్ళి కొడుకు అదృష్టవంతుడు. ఒకదాన్ని పెళ్ళి చేసుకుందామన్నా ఆడ పిల్లలు దొరకని కాలం, బ్రహ్మచారులు ముదురు బెండకాయల్లా ఐపోతున్న కాలంలో ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. డబల్ ధమాకా!
 నేడు ఆషాఢ బహుళ పంచమి. 

19, జులై 2019, శుక్రవారం

ఏం పని కావాలి?

 ఇల్లు మారాలా?
సామాను పేక్ చేయడం దగ్గరనుంచి ఇల్లు చూసి పెట్టడం దగ్గరనుంచి, సామాను కొత్తింటికి చేర్చి సద్ది పెట్టడం దాకా అన్ని పనులు చేసి పెడతాం.

పండగలకి ఫంక్షన్ లకి ఇల్లు దులపాలా? రంగులేయాలా? కడగాలా? తుడవాలా? మాకు చెప్పండి, చేసి పెడతాం.

ఇంటిలో కరంటు పనులు చిన్నచిన్నవైనా చేయాలా? నీళ్ళ కుళాయిలు బాగు చెయ్యాలా? అలంకరణ చేయాలా? మొక్కలు అలంకరించాలా? మాకు చెప్పండి. 

పెళ్ళి చేయించాలా? భోజనాలు పెట్టాలా? ఇంటి దగ్గరే వంట చేయించాలా? ఏ ఆచారంలో పెళ్ళి, భోజనాలు కావాలో చెప్పండి, ఒక గంటలో పెళ్ళి నుంచి ఐదురోజుల పెళ్ళి దాకా అన్ని ఏర్పాట్లూ చేస్తాం. కావాలంటే ఫంక్షన్ హాల్ తో సహా బుక్ చేసి పెడతాం.

అంతెందుకు మీ ఇంట్లో పని ఏదైనా సరే మీకు నచ్చినట్లు చేసి పెడతాం. మిమ్మల్ని చీపురు కావాలి,బ్రష్ కావాలి, ఎత్తు పీట కావాలి అని దేని గురించి అడగం. మాకు ఫోన్ చేయండి. మా సూపర్వైసర్ వచ్చి చూసి పని చూసి సొమ్ము ఎంతవుతుందో చెబుతారు. ఎప్పటిలోగా పని పూర్తి చేయగలమో చెబుతాం. మీ ఇంటిలో సామానుకు మాది పూచీ! ముందుగా వీడియో తీసి మీకిచ్చి దులిపి, కడిగిన తరవాత ఎప్పటిలా సద్ది మళ్ళీ వీడియో మీకిస్తాం. ఏ వస్తువూ బీరు పోదు. మరో ముఖ్యమైన సంగతి, మీ కిచ్చిన తరవాత వీడియో మాదగ్గరుండదు, మళ్ళీ మీరు కావాలన్నా దొరకదు, అంత ప్రైవసీ మెయెంటైన్ చేస్తాం. మీ ఇంటి గురించి మరొక చోట మాట్లాడం.

ఇదివరకు పట్టణాలలో ఈ రకం సర్వీసులున్నట్టు విడ్డూరంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు పల్లెలలో కూడా ఇవి మొలుచుకొచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇదే సందడి.  

ఏమాటకామాటే చెప్పుకోవాలి, శుభ్రంగా చేసిపెడుతున్నారు.    

9, జులై 2019, మంగళవారం

అల్పజీవి-అర్ధనారి....2

అల్పజీవి-అర్ధనారి.

అంచిత కావ్య కంఠ బిరుదాంకు, అమోఘ వచస్కు,అంబికా
చంచల కింకిణీ నినద సౌమ్య సుసంస్కృత వాగ్విలాసు,ని 
శ్చంచల యోగి పుంగవుని, జ్ఞాన విశోధిత లబ్ధ తత్త్వ భా
సాంచిత రాజహంసు,రమణాశ్రమ వాసు నుతింతు "నాయనన్".....6

తెప్పున గారె ముక్కలను తేనెల ముంచుక తిన్న రీతిగా
గొప్పలు కాదుగాని కవికోటి శిరంబుల నూచి మెచ్చగా,
చప్పున నాదు పల్కులకు శంకరుడే విని నవ్వునట్లు; నే
చెప్పెద పద్దెముల్ రసిక శేఖరు లెల్లరు బాగు బాగనన్.....7

చొక్కపు పిల్ల తెమ్మెరల సోకుకు కోయిల కూసినట్లుగన్
చక్కని నాదు భావముల సౌరభమెంచి ప్రశంస చేయగా
నొక్కడు చాలు; లోతెఱుగ కూరక త్రిప్పగ నేల శీర్షముల్
రక్కెస తుప్పలున్ మరియు రావులు తా తలలూపవా! శివా!....8

తూరుపు దిగ్గజంబైన ధూర్జటి తోటి సాటి యౌదనన్
కోరిక నాకు లేదు, మరి కోరెద నాతని చెంత నిల్వగా;
దూరపు చుట్టమై ప్రజకు తోచిన చాలును సంతసించెదన్
సారమ సారమున్ తెలియ సర్వగతుండవు నీవెగా! శివా!........9

సరగున పూర్ణిమా విమల చారుతరోజ్వల చంద్రకాంతికిన్
కరగును చంద్రకాంతములు, కాక ద్రవించున గండ శైలముల్
వరకవి మాధురీగుణ విభాసిత కోమల వాక్యరీతులన్
సరసుడు సంతసించి నటు ఛాందసు డాదర మొందునా! శివా!....10


నింగిని తోచినట్టి నెల నిండిన  జాబిలిజూచి సంద్రము
ప్పొంగును, బావి నీళ్ళకును పొంగులు కల్గునె?  బిడ్డ ముద్దుమో
ముంగని పాలచే పాదువ మోదము బిడ్డల తల్లి చెందెడిన్
తొంగుడు నాకు చాలనెడి తొత్తుకు పాపడు తీపియా! శివా!.......11


బంగరు సుద్దు లయ్యమరవాణిని గైకొని చెప్పినాడ నే 
పొంగుచు కొన్ని పద్దెముల,పూర్వులొసంగిన యాస్తిగాన నీ
వెంగిలి ముక్కలంచు మది నెంచకు, కీరము ముట్టినట్టి యా
రంగగు దోరకాయ ధర రాలిన రుచ్యము గాదటో! శివా....12

అప్పయ శంకరాది ఘనులాత్మ విచారణ దక్షు లందముల్
కుప్పలు గాగ పోసి నిను గొల్చిరి కైతల, వారి ముందు నే
చప్పన యౌదుగాక,విను చక్కెర మెక్కియు పండు చీకుచో
చప్పన గాక ఎప్పుడు రసాలము మెప్పును పొందునా! శివా!....13

లలిత కవిత్వ సంపద ధరాస్థలి నెంతటి భూరి పుణ్యమూ
ర్తులకు లభించు? దాన సరితూగునె రాజ్యము గీజ్య మీ క్షితిన్!
నిలుచును నిత్యుడై కవి మనీషను,తక్కిన వారు మట్టిలో
కలిసెడు వారె, నిల్చు  నొక కావ్యము నందిన భర్తయున్ శివా....14

ఒకపద్యము చెప్పువాడె కవియౌ యూరేగు ఈ రోజులం
దొక కావ్యంబు గూర్ప,వాడికను నర్హుండే గదా కాళిదా
సుకు తా పెద్దకుమారుడంచు సకల సర్వజ్ఞుండంచు విద్వాంసులం

దొక లెక్కుంచక నిందసేయ, కలిలో నూహింప వింతల్ శివా!...15


*”నాయన”..కావ్యకంఠ గణపతి ముని.

5, జులై 2019, శుక్రవారం

అల్పజీవి-అర్ధనారి-1

అల్పజీవి-అర్ధనారి
(శివ శతకం)

రచయిత: విశ్వనాథం సత్యనారాయణ మూర్తి 

ఒకవైపు అంచల నూరించు మంజీర - మహిరాజ ఫూత్కర మవలివైపు
స్కందాదిరోహణోత్సంగంబు నొకవైపు - అవ్వల గణపతి నవ్వుమోము
పద్మకాండము మించు బాహువు నొకవైపు - కరితుండమును మించు కరము నవల
ఒకవైపు కుముదాళి గికురించు నయనంబు - నీరజ శ్రీజూపు నేత్రమవల
పారిజాతకలతా పల్లవంబొకవైపు - ఉల్లోల మాలిక లొక్కవైపు

లాస్యమొకవైపు తాండవార్భటియు మెరయ
అమృతకిరణుండు - ఉమ్మడి ఆస్తి కాగ
వెలుగుచీకట్లు కలిసిన విధము తోప 
కలిసి కాపుర మొనరించు కలిమిలేము
లనగ రూపించు జంటకు అంజలింతు......1

తేలుచున్నవి నింగి నీలాభ్రములు రెండు - ఒండొంటి నొరయంగ ఉత్సహించి

వ్రాలుచున్నవి లీల బాల మృణాలముల్ - మలయానిలాహతి మలగి మలగి
క్రాలుచున్నవి హేల నీలకంఠంబులు - పురివిప్పి నాట్య వైఖరుల కలిమి
సోలుచున్నవి క్రీడ లీలాకపోతముల్ - కువకువ ధ్వనులతో కవసికవసి

వెలుగు చీకట్లు, కలిమి లేములును, అస్తి

నాస్తులును... ఏవో! ఏవో! అణగి పెనగి
జంట జంటలై.. ఒకటియై సర్వసృష్టి
అర్ధనారీశ్వర విలాసమగుచు తోచు.....2


శంకరు జేరి గౌరి సరసమ్ముగ హాసము లాడు వేళ "ని
శ్శంకను సామి! నేగనుక సైచితి నివ్విధి లేమి కాపురం
బింకొక లేమ యెవ్వతెయు నిట్టుల సైచునె" యంచు బల్క, యా


వంకను జూచి నవ్వు భగవంతుడు శంకరుడిచ్చు కోరికల్....3

"హత్తిన ప్రేమ జూచుటకు అమ్మయు నాన్నయు నాకు కల్గగా
నెత్తఱి నెంచి చూచినను ఎక్కువ నేనని గౌరి పల్క,"నా
కత్తయు మామగారు కల"రంచు నవ్విన శూలి నేర్పుకున్

బిత్తరి చూపులన్ నిలిచి "నేర్పరులే" యను గౌరి కొల్చెదన్.....4

రాజిత సుందరానన,పరాజిత రాజమరాళ యాన,వి

భ్రాజిత సుందరాలక,విరాజిత రాజ మనోజ్ఞరూప,ఉ
త్తేజిత సింహవాహన, జితేంద్రియ  మానస రాజహంస, సం 

పూజిత రాజమౌళి, వర భూషణి, గౌరి శుభంబు లీవుతన్.....5

27, జూన్ 2019, గురువారం

పురోగతి?


Courtesy: Whats app

గోనె సంచిని నిలువునా రెండు కొనలు ఒకదానిలో ఒకటి ఇమిడేలా మడచి నెత్తి మీద నుంచి వేసుకుని, వర్షం నుంచి తడవకుండేందుకు పల్లెలలో వాటం అలవాటే! మరి ఇదేమో!

పురోగతియా? తిరోగతియా? ఫేషనా? నాగరికత వెర్రితలా?

10, జూన్ 2019, సోమవారం

విదేశాలకు ముంజలు ఎగుమతి

Courtesy: Whats app

ఇక విదేశాలలో కూడా తాటి ముంజలు ఆరునెలలు దొరుకుతాయి. ఐదేళ్ళకితం సరదాగా అనుకున్నమాటిది. ఇక ముందు తేగలు,బుర్రగుంజు, కొబ్బరి పువ్వు 

కూడా ఎగుమతి కావచ్చు. 
కాదేదీ వ్యాపారానికనర్హం?

అడివిలో ఉప్పమ్ము, సముద్రపొడ్డున మామిడికాయ అమ్ము. ఈ రేండిటినీ కలిపి ఊరగాయ పెట్టి ఊళ్ళో అమ్ము. అదీ వ్యాపార రహస్యం.

5, జూన్ 2019, బుధవారం

హస్త ముద్రలు-ఆరోగ్యం
























Disclaimer:ముద్రలతో అనారోగ్యం తగ్గుతుందా? వెంఠనే ఫలితం కనపడకపోవచ్చు. వైద్యుని సంప్రదించి మందువాడుతూ వీటిని కూడా పట్టడంతో ఉపశమనం హెచ్చుగా ఉండచ్చు. ఆహారంలో మార్పువలన,
వీటిని ఆచరించినందువల్ల ప్రమాదమూ, ఖర్చూ లేవు.
ఎవరిష్టం వారిది. 


1, జూన్ 2019, శనివారం

అద్భుత భారతీయ నృత్యం


CourtesyWhats app



ఈ అద్భుత భారతీయ నృత్యం కేరళ లోని పదహారేళ్ళ అమ్మాయి చేసింది. ఇటువంటి నృత్యం అరవై సంవత్సరాల కితం చూసిన గుర్తు. ఆ తరవాత చూడలేదు. ఈ నృత్యానికో పేరు కూడా ఉన్నది.

కళాకారిణి సోదరులు పక్క వాద్యాలతో సహకరించారు. ఇంతకుమించి వివరాలు తెలియవు. 



26, మే 2019, ఆదివారం

రోహిణీ కార్తె ముచ్చట్లు


Courtesy:Whats app
రోహిణీ కార్తె ముచ్చట్లు

మేరా భారత్ మహాన్!!!

24, మే 2019, శుక్రవారం

చలో! హమారా దేశ్ బచ్ గయా!!


చలో! హమారా దేశ్ బచ్ గయా!!



సర్వమంగళ మాంగళ్యే
శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవీ
నారాయణి నమోస్తుతే 

మేరా భారత్ మహాన్!!!

19, మే 2019, ఆదివారం

ప్రపంచం మారిపోతోంది-నీటితో నడిచే హైడ్రోజన్ ఇంజన్.




అరవై ఏళ్ళ కితం మాట, ఉద్యోగంలో చేరిన కొత్త.   కారు కొనుక్కోవాలనిపించింది. ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ ఖరీదు పదివేలు! నా జీతం వంద రూపాయలు!!

జీతం పట్టుకెళ్ళి అమ్మకిస్తూ అడిగాను

”ఎప్పటికైనా కారు కొనుక్కోగలనంటావా అమ్మా!” అని.

విన్న అమ్మ ''నీటితో నడిచే కార్లొచ్చే రోజులొస్తాయి అప్పుడు కొనుక్కుందువు”  అన్నది.

నిజమే డిస్టిలెడ్ వాటర్ పోస్తే దానిని హైడ్రోజన్ ఆక్సిజన్ లుగా విడదీసి, హైడ్రోజన్ తో ఇంజను నడిపి ఆక్సిజన్ విడుదల చేసే ఇంజను కనుక్కోబడింది. జపాన్ లో విడుదల జేయబడుతోంది, తొందరలో. ఇంతకి కనుక్కునదెవరో తెలుసా? ఒక భారతీయుడు.


మరి జపాన్ లో ఎందుకు విడుదలజేయబడుతోంది. ఇటువంటి ఇంజన్ తయారు చేస్తున్నాను, సాయం చేయమని మన దేశ ప్రభుత్వాలని పదేళ్ళు అడిగి అడిగి నోరు నొప్పి పుట్టి జపాన్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. తొందరలోనే భారత దేశంలో కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్టు చెప్పేడు. అనుమానమా! ఈ కింద లింక్ లో చూసెయ్యండి. 


https://www.ndtv.com/tamil-nadu-news/tamil-nadu-engineer-invents-engine-that-uses-hydrogen-releases-oxygen-2036119?pfrom=home-topstories


ప్రపంచ ముఖచిత్రం మారిపోతోంది. oil రాజకీయాలకి చెల్లు చీటీ రాసినట్టే.ప్రపంచ రాజకీయమే మారిపోతోంది. బహుపరాక్. ఆయిల్ కంపెనీల షేర్లు ఢమాల్, బహుపరాక్ 
మరో మాట.


ఈ కుర్రాణ్ణి చూశారా? 

Harshwardhan Zala

ఏం? ఏఅమ్మాయికైనా లైనేసేడా? కాదు కాదు.ఇంకా మీసం కూడా మొలవని మొనగాడు.

 ప్రపంచాన్ని మహమ్మారిలా పట్టి పీడిస్తున్న మైన్ (మందు పాతర)ల మూలంగా ఎంతో మంది చనిపోతున్నారు, police and military personnel. ఈ కుర్రాడో డ్రోన్ కనిపెట్టేడు. అది ఎక్కడ ఏమూల మందుపాతరున్నా కనిపెట్టేసి పనికి రాకుండా చేసేస్తుంది. ఎన్నో దేశాలు ఈ డ్రోన్ కోసం పోటీ పడ్డాయి. ఇవ్వనుగాక ఇవ్వనని దేశం లో వినియోస్తున్నాడు. Now Indian forces are free from the death of personnel due to land mine explosion.


ఇటువంటి వారిని మనం పట్టించుకుంటామా? ఉహు!

మేరా భారత్ మహాన్


16, మే 2019, గురువారం

హస్త లాఘవం








Courtesy: Whats app

వీడియోలు చూసారా? హస్త లాఘవం కనపడలేదు కదూ! మరో సారి నిదానంగా చూడండి!! ఆశ్చర్యపొండి!!!

ఇది మీకూ జరుగుతుంది!!!!!

15, మే 2019, బుధవారం

తల్లి



ప్రకృతిలో ఏతల్లి ఐనా ఇంతే! తల్లికి తండ్రికి తేడా అంతే!!

23, ఏప్రిల్ 2019, మంగళవారం

వడగళ్ళ వాన

 పండిన చేనులో వడగళ్ళు

ఉండ్రాళ్ళు కాదు వడగళ్ళు 





 వడగళ్ళు దెబ్బకి నాలుగు పెచ్చులుగా మారిన బూడిద గుమ్మడి

ఆకాశం నుంచి జారిపడ్డ మంచు రాయి ( ఖండం )
కోడిగుడ్లు కాదు వడగళ్ళే 


రాళ్ళలాటి వడగళ్ళు











 వడగళ్ళ వాన

ఈనెల 21వ తారీకు సాయంత్రం తూగోజి కోరుకొండలో కురిసిన వడగళ్ళవాన 

27, ఫిబ్రవరి 2019, బుధవారం

ధర్మవరం పట్టు చీర


పెళ్ళి చీర అంతా ప్రత్యేకతే. చేనేత చీర. పమిటంచులో వధూవరుల చిత్రాలు, అదీ నేతలో. ఎంత అందంగా ఉందో! కలిగినవారి సంపదకి మంచి వినియోగం. ఎంతోనా ఐదు లక్షలే. కోట్లు ఖర్చుపెట్టేవారికి ఐదు లక్షలో లెక్కా!

4, జనవరి 2019, శుక్రవారం

బావా బావా పన్నీరు

బావా బావా పన్నీరు
బావను పట్టుకు తన్నేరు

పట్టెడ మంచం వేసేరు
పది గుద్దులు గుద్దేరు

పందిరి గుంజకి కట్టేరు

పాతిక గుద్దులు గుద్దేరు


నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు

చావిడి చూరుకి కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు.

వీశెడు గంధం పూసేరు
వీశె గుద్దులు గుద్దేరు.

వీశెడు గంధం పూసేరు
వీధి వీధి తిప్పేరు,

బావా బావా పన్నీరు 
బావను పట్టుకు తన్నేరు.


తంతే బావా ఊర్కోడు

తాళి కట్టి లాక్కెళ్తాడు.