30, అక్టోబర్ 2022, ఆదివారం
మనం ఇంతే!
27, అక్టోబర్ 2022, గురువారం
పిట్టనికొట్ట పొయిలోపెట్ట.
పిట్టనికొట్ట పొయిలోపెట్ట.
పిట్టనికొట్ట పొయిలోపెట్ట.
పూటబత్తెం పుల్లవెలుగు
రెక్కడితేగాని డొక్కాడదు.
అన్నీ ఒకలాటి నానుడులే ఐతే మొదటిది చాలా పురాతనమైనదనిపిస్తుంది. అన్నిటి అర్ధం ఒకటే ఏరోజు కూలితో ఆ రోజు గడపడమనీ, పని చేస్తేగాని పూటగడవదనీ, ఆహారం ఉండదనీ.
పొయ్యిలో పిల్లి లేవలేదు.
పొయ్యిలో పిల్లి లేవలేదంటే, వంట ప్రయత్నమే లేదని అర్ధం. ఎలా? వంట ఉదయమే చేసుకునేవారు, ఆ రోజుల్లో వేసిన పొయ్యిలమీద కట్టెలతో వంట చేసుకునేవారు. సాయంత్రానికి సూర్యాస్తమయం కాకుండానే భోజనాలు చేసేసేవారు, అందుకే " నోట్లో మెతుకు గూట్లో దీపం" అని నానుడి, అందుకు చాలా ముందుగానే వంటైపోయేది.అప్పటినుంచి మరలా ఉదయందాకా పొయ్యి ఖాళీ,ఈ పొయ్యి వెచ్చగా ఉంటుంది కనక పిల్లి పడుకుంటుంది, దానిని అక్కడ పడుకోనిచ్చేవారు, ఎందుకూ? పొయ్యి వంటింట ఉంటుంది, ఆహారపదార్ధాలు అక్కడే కొంతైనా ఉంటాయి, మరి అక్కడికి ఎలకలు చేరతాయి కదా! పిల్లి కాపలా అనమాట, దొరికితే ఎలకని భో0చేసి పడుకుంటుంది.పొద్దుటే వంట ప్రయత్నానికి ముందు పొయ్యిలో నిప్పు వేస్తారు గనక పిల్లి లేవక తప్పదు, అదనమాట,అంటే వంట ప్రయత్నమే లేదు, అంటే పొయ్యిలో పిల్లి లేవలేదు, లేపలేదని అర్ధం,పొయ్యిలో నిప్పే వేయలేదని చెప్పే ప్రయత్నం .
24, అక్టోబర్ 2022, సోమవారం
తాటాకు టపాకాయలు

23, అక్టోబర్ 2022, ఆదివారం
తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు
తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు
తల్లిపుట్టిల్లు మేనమామకి తెలియనట్టు,తల్లిపుట్టింటి గురించి మేనమామకి చెప్పినట్టు,తల్లిపుట్టిల్లు మేనమామకి ఎరుకే, ఇలా రకరకాలుగా చెబుతుంటారీ నానుడిని.ఏమిది?
మేనమామ అంటే తల్లి అన్న లేక తమ్ముడు. అనగా ఈ తల్లి ఆమె అన్న/తమ్ముడు ఒక ఇంట పుట్టినవారే! మేనమామకి ప్రత్యేకంగా తల్లిపుట్టిల్లు గురించి చెప్పడం హాస్యాస్పదం. ఇద్దరూ ఒక ఇంట పెరిగినవారే! ఆ తల్లి ఎలాపెరిగిందో ఆమె అలవాట్లేంటో, ఎంత వైభవంగా పెరిగిందో,ఆ ఇంటి ఆచార వ్యవాహారాలేంటో ప్రత్యేకంగా మేనమామకి చెప్పాలా?తెలియవూ!
21, అక్టోబర్ 2022, శుక్రవారం
తాతకి దగ్గులు నేర్పడం.
తాతకి దగ్గులు నేర్పడం.
ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, పూర్తి జీవితం అనుభవించిన అనుభవజ్ఞునికి జీవితం గురించి చెప్పబోవడం అంటారు.
ఇలా చెప్పబోయినవారు ఎవరూ? ఒక పిల్లకాకి, కళ్ళు పూర్తిగా తెరవని పసికూన, మనవడో/మనవరాలో, ఆ తాత కళ్ళెదుట పుట్టినవాళ్ళు, ఆ తాత చెయ్యిపట్టినడచినవాళ్ళు. ఇలా చెప్పబోయారంటే వారు జీవితంలో అప్పుడే అడుగుపెట్టినవారై ఉంటారు, అంటే వయసు పాతిక ముఫై మధ్య,అదే జీవితమనుకుని. ఇక వీరి తండ్రి అంటే అరవై వయసు దగ్గరమాటే. మరితాతాంటే వీరితండ్రికదా! అంటే ఆయన వయసు ఎనభై ఆ పైమాటే కదా!
ఇంతవయసు అనుభవమున్నవారికి జీవితంలో ఒడిదుడుకులగురించి చెప్పబోయినవారికి మధ్య వయసుతేడా ఒక అర్ధశతాబ్ది, అనుభవంతేడా అంతే కదా!. మరీ తాత ఎనభై పైబడ్డ వయసులో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత మందిని చూసి ఉంటాడు. ఎన్ని రకాల మనుషులని చూసి ఉంటాడు?
ధూర్తులు,దుర్మార్గులు,వంచకులు, వదరుబోతులు, స్వప్రయోజనపరులు,నమ్మించి మోసంచేసినవారు, ఇలా చెప్పుకుపోతే ఇది అనంతంకదా! జీవిత పరుగులో ఎన్నిసార్లు పడిపోయి లేచి మళ్ళీ పరుగందుకుని ఉంటాడు, ఎంత కష్టపడి వీళ్ళని పెంచి ఉంటాడు? నేడు కనుతెరచినవారింత అనుభవమున్నవారికి చెప్పబోవడమంటేనే తాతకి దగ్గులు నేర్పడం, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందనడం. దీనినే నక్కపుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంతగాలివాన చూడలేదంది అన్నట్టు కదా!
19, అక్టోబర్ 2022, బుధవారం
చెప్పాలనిపించింది,చెప్పేశా!
చెప్పాలనిపించింది,చెప్పేశా!
పెదరాయుడు లుంగీ,తెల్ల చొక్కా,చేత పొడుగాటి చేపాటికర్ర, కాళ్ళకి ఆకుచెప్పులు, ఆహార్యంతో, ఉదయమే కనుచీకటితో, కాలేజికి నడకకి బయలుదేరుతా . ఒక వీధివెంటేవెళతా!ఎప్పుడూ. కారణం, అరకిలోమీటరు పైన పొడవుంటుంది,అదేకాక సిమెంటు రోడ్డు, దానికి తోడు ఉదయం వెళ్ళేటపటికి,సంచారం ఉండదు, ఎవరూ లేవరు. మరోమాట, వీధిలో రెండు పక్కలా ఇళ్ళు, అవికూడా నాలాటి 'రెక్కాడితే కాని డొక్కాడని' వారివే! తిరిగొచ్చేటప్పుడు ఉదయపు జీవిన చిత్రం కనపడుతూ ఉంటుంది. మొన్న తిరిగొస్తున్న సమయం, ఒక పడుచు రోడ్ దాటి ఎదురుగా ఉన్న చెత్తకుండీలో తనచేతిలో ఉన్న, గిన్నెనిండా ఉన్న అన్నం ఒలకబోసి వెనుతిరిగిన సమయం. సరిగా నేను అక్కడికి చేరుకున్న సమయం, ఎదురుబొదురయ్యాం. నేను రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ నిలబడేటపటికి, పడుచు ముఖంలో ఆశ్చర్యం,అరెరె అన్నం అనవసరంగా పారబోశానే! ఈ బిచ్చగాడు పట్టుకెళ్ళేవాడేమో! అనే భావం జమిలిగా కనపడ్డాయి ఆమె ముఖంలో. పడుచు, ఏమిచేయాలో తోచక, చేత అంట గిన్నెతో నిలబడిపోయింది. నేను, "తల్లీ అన్నం ఎప్పుడూ పారెయ్యకూ, ఎవరికేనా పెట్టు, లేదంటే మిక్సీలో అన్నంతో ఒక ఉప్పరాయి,మిరపకాయ,జీలకర్ర పలుకు వేసి ఒక తిప్పుతిప్పి వడియాలలా పెట్టు ఎండిపోతాయి, వాటిని వేయించుకో, నూనెలో, తిను బాగుంటాయి, ఇంకా చాలా చెప్పచ్చు, సమయం కాదు, ఏమనుకోకూ ఇలా చెప్పేనని, అన్నా! " ఏమనుకోనని చెప్పి వెళ్ళింది, ముందుకు కదిలా! చెప్పాలనిపించింది ,చెప్పేశా!
17, అక్టోబర్ 2022, సోమవారం
నేలవిడచి సాము
నేలవిడచి సాము
15, అక్టోబర్ 2022, శనివారం
చావు కాలానికి లావు దుఃఖం.
చావు కాలానికి లావు దుఃఖం.
1. చావు కాలానికి లావు దుఃఖం.
వయసు మీదపడేటప్పటికి దుఃఖమే ఎక్కువగా ఉంటుందన్నది పిండితార్ధం. లావు అన్న మాటకి బలం,ఎక్కువ, అనే అర్ధాలున్నాయి. లావు మాటని పోతనగారు వాడేరు భాగవతంలో, 'లా'వొక్కింతయులేదు (లావు+ఒకింత=లావొక్కింత).
వయసులో ఉన్నపుడు కష్టం తెలియదు,బాధా తెలియదు. శరీర బాధలుండవు. వయసుమళ్ళితే బంధువులు గతించడం,జీవిత భాగస్వాములే గతించడం, శరీరం సహకరించకపోవడం, ఇక శంఖు,చక్రాలు నేటి కాలంలో అందరి ఉన్నవే!వాటిని పట్టివచ్చేబాధలు, కొడుకులు కోడళ్ళు చూడకపోవడం, స్వయంగా ఏపనీ చేసుకోలేకపోవడం, ఇతరులపై ఆధారపడక తప్పకపోవడం,
అనాధాశ్రమాల్లోనూ,వృద్ధాశ్రమాల్లోనూ గడపడం, ఇక ఇంట్లో ఉంటే పిలిస్తే పలికే దిక్కులేకపోవడం,బాధ చెప్పుకుందామంటే వినేవారు లేక, అనుభవించేది నరకం.
ఇలా కష్టాలు,దుఃఖాలు జమిలిగా స్వారీ చేస్తుంటాయి, చెప్పుకోగలిగినవి,చెప్పుకోలేనివి.కాలుడూ కరుణించడు,సమయమొచ్చేదాకా,అన్నీ దుఃఖాలే
2.కుంచం నిండాలి.
మనది వ్యవసాయం ప్రాధమికమైన దేశం,అందుకే నానుడులన్నీ వ్యవసాయం దాని అనుబంధంలో ఎక్కువ ఉంటాయి. కొలతకి ఉపయోగించే సాధనమే కుంచం. పాతరోజుల్లో అన్నీ కొలిచి అమ్మేవారు.ధాన్యాలు, నెయ్యి,నూనిలాటి ద్రవాలు, పిండిలాటివాటిని కూడా కొలిచి అమ్మేవారు. ఇక పండ్లు వగైరాలని లెక్కపెట్టి అమ్మేవారు, పరక,పాతిక,ఏభై, వంద అని. వర్షం కూడా కుంచాలలో చెప్పేవారు. పాపాన్ని కూడా కుంచాలలో చెప్పేవారు, అందుకే పాపం పండాలి,కుంచం నిండాలంటారు.
3.నక్క పుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన చూడలేదందిట.
నక్కపుట్టి మూడాదివారాలు కాలేదు, అంటే నక్క వయసు ఇరవై ఒక్కరోజులు కూడా కాదు.
ఇరవై ఒకటో రోజు నాడు తొట్టిలో వెయ్యడం లాటి వేడుకలు చేసేవారు. నాటికాలంలో పుట్టిన మూడు నెలలదాకా కళ్ళు తెరవనివారూ,గుప్పెళ్ళు కూడా విప్పనివారు
13, అక్టోబర్ 2022, గురువారం
ఏకచక్రే మహాభోగే
ఏకచక్రే మహాభోగే
ఏకచక్రే మహాభోగే
ద్విచక్రే మహాపండితః
త్రిచక్రే లోక సంచారే
చతుశ్చక్రే మహాబలాః
ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి, రెండు చక్రాలున్నవాడు, మహా పండితుడు, త్రి చక్రే, మూడు చక్రాలున్నవాడు, లోక సంచారి, తిన్నచోట నిద్రపోడు, నిద్రపోయిన చోట తినడు, తిరుగుతూనే ఉంటాడు. నాలుగు చక్రాలున్నవాడు మహా బలవంతుడు. :) ఇదండీ సంగతి, ఏంటిటా? ఇది సాముద్రికంలో మాటంటారు. చక్రం, శంఖం,అనేవి చేతిలోనూ గద,పద్మం అనేవి కాళ్ళలోనూ ఉంటాయిట. ఇందులో కూడా సవ్య చక్రం,అపసవ్య చక్రం, దక్షణావర్త శంఖం, ఉత్తరావర్త శంఖం అని రకాలూ ఉన్నాయట. :) ఇదంతా మనకొద్దు, మనం అధునికులం కదా! మన దారిలోకి పోదాం :)
ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి కదా! సత్యం.రెండు కాళ్ళే ఏకచక్రం, కాలినడకన తిరిగేవాడు, సైకిల్ కొనడు,కారు అసలే కొనడు.పెట్రోల్/డిజిల్ ధరలు పెరిగాయనే గోల లేదు. సైకిల్ కొననివాడు సైకిల్ బాగుచేయించే పనిలేదు. వీడు కాలి నడకన తిరుగుతుంటాడు కదా! రోగం రొచ్చు రాదు, డాక్టర్ దగ్గరకెళ్ళడు. మందులు కొనడు. మందు మొదలే కొనడు. సినిమా కెళ్ళడు, నడిచిపోవాలిగా!ఇంటి దగ్గర టివి చూస్తాడు, పెళ్ళాంతో కబుర్లాడుతాడు, వెచ్చగా తింటాడు, వెచ్చగా పడుకుంటాడు, హాయిగా నిద్దరోతాడు. వీని వల్ల ఎకానమీకి ఉపయోగం...లేదు. సైకిల్,కారు,మందులు, వైద్యం ఇండస్ట్రీకి శత్రువు. గోల లేదు,గొడవలేదు.మరి మహా భొగమేగా నేటిరోజుల్లో :)
నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారో మహానుభావుడు. ఈ సామాన్యుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఏడు కరువులొస్తాయంటే, మొదటి కరువుకే చచ్చిపోతే మిగిలిన ఆరు కరువులూ నన్నేంచేస్తాయనగల ధీరుడు. కరంటు పోతే విసనకర్రతో సరిపెట్టేసుకుంటాడు. కుళాయి నీళ్ళు రాకపోతే టేంక్ దగ్గరకెళ్ళి తెచ్చుకుంటాడు. ఏ పార్టీ వాళ్ళడిగినా నా వోటు మీకే అంటాడు. అంతా దరిద్రమో అని ఏడుస్తుంటారు, దరిద్రం అన్నదో భావన అంటాడు. ఉన్నది తింటాడు, లేకపోతే పస్తుంటాడు. కట్టలు, కట్టలు డబ్బు పోగేసెయ్యాలన్న తపన లేదు. ఇ.డి వాళ్ళొస్తారో, దొంగే వస్తాడో అన్న భయం లేదు, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్దరోగలడు, నిద్దర మాత్రల పనిలేదు.
కారేరాజులు రాజ్యముల్ గల్గవే
వారేరీ? సిరి మూట గట్టుకొని పోవన్ జాలిరే? అని అడగగల ధీమంతుడు.
వేయిమాటలేల?
మితంగా తినడం భోగం. కంటినిండా నిద్ర భోగం. భార్య/భర్త తో ఊసులాడుకోడం,సరస సల్లాపాలు భోగం. తల్లితండ్రులుండటం భోగం. తల్లితండ్రులతో కలసి ఉండటం భోగం. పిల్లల్ని కని పెంచడం భోగం. కష్టసుఖాలు కావలసినవారితో పంచుకోడం భోగం. సన్మిత్రులను కలిగి ఉండటం భోగం. ఆరోగ్యమే మహాభాగ్యం, భోగం. చివరగా తన సంతానం,బంధుమిత్రుల మధ్య తనువు చాలించడం భోగం.
ఏకచక్రే మహాభోగే!
వీలును బట్టి మిగతా చక్రాలు చూద్దాం
11, అక్టోబర్ 2022, మంగళవారం
ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.
ఆవు,దూడ బాగానే ఉన్నాయి, గుంజకొచ్చింది గురక తెగులు.
ఇదొక నానుడి, తెనుగునాట చెప్పుకునేది, ముఖ్యంగా గోజిలలో చెప్పుకునీదీ.
గుంజ అనేది అవు,దూడలని కట్టే కఱ్ఱ. ఇది వంపుతిరిగి భూమిలో పాతపెట్టబడి ఉంటుంది. పలుపుతాడును ఆవు మెడలోనూ గుంజకి కట్టేస్తారు. ఈ గుంజని కట్టుకొయ్యి,కట్రాట వగైరా పదాలతోనూ వాడుకలో ఉంది.
ఇక గురక తెగులు అనేది పశువులకొచ్చే భయంకర వ్యాధి. దీనినే దొమ్మ తెగులు అని కూడా అంటారు. గిట్టలు చీలివున్న పశువులకొచ్చేది. ఈ వ్యాధి వస్తే పశువు జ్వరంతో బాధ పడుతుంది, గొంతువాస్తుంది, నోట పుళ్ళు పడతాయి, గిట్టల మధ్య ఒరుస్తుంది, కొంతకాలం బాధపడి పశువు చనిపోతుంది. ఈ వ్యాధికి నేటికీ మందులేదు. వాక్సిన్ కూడా లేదు. ఈ వ్యాధిలో చాలా రకాలుండడమే వాక్సిన్ లేకపోడానికి కారణం. దీనిని ఇంగ్లీష్ లో ఫుట్ అండ్ మౌథ్ అంటారు. ఇది వ్యాపించడం గిట్టల ద్వారా జరుగుతుంది గనక.
విషయంలో కొస్తే ఈ తెగులు వస్తే ఆవుకి రావాలి లేదా దూడకి రావాలి గాని వాటిని కట్టేసే ప్రాణం లేని గుంజకెందుకు వస్తుంది? రాదు. అంటే ఈ వ్యాధికి గుంజకి అసలు సంబంధమే లేదు.
మరి ఇలా ఎందుకంటారు? ఆవుకి రాక దూడకీ రాక ఈ వ్యాధి గుంజకొచ్చిందంటే, అపసవ్యమని, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన అభిప్రాయభేదం గురించి, అసలు వారు బాగానే ఉన్నా, ఇబ్బందులు లేక, సంబంధం లేని మధ్యవారు బాధపడిపోడంగా, కొట్లాడుకోడంగా, చెబుతారు, ఈ నానుడి.
9, అక్టోబర్ 2022, ఆదివారం
పరాధికారము పైనవేసుకొనరాదు.
పరాధికారము పైనవేసుకొనరాదు.
అనగనగా ఒక పల్లెటూరు, అందులో ఒక మడేలు, ఒక కుక్కని, గాడిదని పెంచుకుంటున్నాడు. కుక్క ఇంటి దగ్గర కాపలా. గాడిద ఇంటికి రేవుకి మధ్య బట్టలు మోసుకుపోవడం, పనులు. కుక్కకి ఉదయమే మడేలుతో పాటు చద్దిబువ్వ. మధ్యాహ్నం మడేలుతో పాటు వేడి బువ్వ పెడుతుంది, చాకిత. కుక్క యజమాని మంచంకిందే పడుకుంటుందెప్పుడూ. అప్పుడప్పుడు రాజభోగాలు కూడా కుక్కకే, ముద్దులు, మురిపాలు సహా! ఇక గాడిద, రేవున్నరోజున బట్టలు రేవులో పడేసాకా, సాయంత్రందాకా ఏటిపట్టున మెయ్యడం, ఏట్లో నీళ్ళు తాగడం. రేవులో పనిలేనిరోజున ఉదయమే వదిలేస్తే ఏటిపట్టున తిని, ఏట్లో నీళ్ళు తాగి ఎండవేళ ఏ చెట్టుకిందో పడుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం.
కుక్క, గాడిద ఎంత స్వేఛ్ఛ అనుభవిస్తోందో, నేనో పగలూ రాత్రీ ఇంటిదగ్గరే! గాడిద పని ఎంత బాగుందీ అని ఈర్ష్య చెందింది. గాడిద, కుక్కకి ఎంత ముద్దు,మురిపెం, ఇల్లు కదలనివ్వరు, రాజభోగాలు, మరినేనో ఉదయం నుంచి రాత్రిదాకా ఏటిపట్టునే బతుకు, రాత్రికి ఇంటికి చేరడం, తిన్నావా ఉన్నావా అని అడిగే దాతా,దూతా లేరు, ఇదీ బాధ.
రోజులు గడుస్తున్నాయి, ఎవరి మనసులో వారు, మరొకరిపై ద్వేషం పెంచుకున్నారుగాని, పైకి పొక్కనివ్వలేదు. ఒక వేసవిరోజురాత్రి మడేలు, చాకిత గాలికోసం పెరట్లో మంచాలేసుకుని పడుకున్నారు. కుక్క మడేలు మంచంకింద పడుకుంది. గాడిదను దగ్గరలోనే కట్టేసేరు.
ఓరాత్రి వేళ ఒక దొంగ ఇల్లు దూరుతున్నాడు. కుక్క చూసింది, ముడుచుకు పడుకుంది, మొరగలేదు. గాడిద కుక్కని లేపి మొరగవేం. దొంగ ఇల్లు దూరుతున్నాడు, చూసావుగా అంది. దానికి కుక్క, ఉదయమే నాలుగు మెతుకులు పడేస్తాడు,మధ్యాహ్నం మరికొంచం పెడతారు. రాత్రికి కూడు పెట్టరు. ఆకలి కడుపుతో కాపలా కాయాలి. నీకేం ఏటిపట్టున కావలసినంత తింటావు, ఇంటికొచ్చి పడుకుంటావ్, నాలుగు మూటలు మొయ్యడం పెద్ద పనా? అడిగింది కుక్క. నీకేం కావలసినంత స్వేఛ్ఛ. బయట కావలసింది తింటావ్, ఏట్లో నీళ్ళు తాగుతావ్, చింతచెట్టుకింద పడుకుని నిద్దరోతావ్, అని దెప్పింది.
దానికి గాడిద ఉదయమే నీకు పిలిచి మరీ చద్దిబువ్వ పెడుతుంది, చాకిత. మధ్యాహ్నం మడేలు తిన్నదే నువ్వూ తింటావు, మడేలు మంచం కిందే పడుకుంటావ్, నువ్వు పడిపోతున్న కష్టం ఏంటబ్బా! నిలదీసింది గాడిద. నేను మొరగను, మడేలుని హెచ్చరించను,నువ్వేమనుకున్నా మరేం బాధ లేదు, తెగేసి చెప్పేసింది, కుక్క.
దానికి గాడిద, నువ్వు తప్పుచేస్తున్నావు,యజమానికి ద్రోహం చేస్తున్నావు, సహించలేనని, గట్టిగా ఓండ్ర పెట్టింది. నిద్రా భంగమైన మడేలు, చాకిత లేచేరు,చూసారు, ఏమీ తేడా కనపడలేదు, తిని పడుకుందిగా, ఏందుకు ఓండ్ర పెట్టినట్టు అని చికాకుపడి, పక్కనే ఉన్న కఱ్ఱతో గాడిద వీపుమీద కఱ్ఱ తిరగేసాడు. ఈ హడావుడిలో దొంగ పారిపోయాడు. గాడిద మీద కఱ్ఱ తిరగేసిన తరవాత మడేలు ఇంటివైపు చూస్తే తలుపులు తీసి ఉన్నాయి, దొంగ ఇల్లు దూరినట్టున్నాడని, ఇల్లు వెతుక్కుంటే, చక్కబెట్టుకోవలసినవి చక్కబెట్టుకునే దొంగ పారిపోయాడని తేలింది. అప్పుడు ఆయ్యో! గాడిదను అనవసరంగా చెయిచేసుకున్నానే అని మడేలు బాధ పడ్డాడు, ఉపయోగమే లేకపోయింది. కుక్క చక్కగా మంచంకిందే పడుకుంది, కదలక మెదలక.
అయ్యో! ఉపకారం చేయబోయి దెబ్బలు తిన్నానే అని గాడిద విచారించింది, తనలో.
కత చిన్నదే కాని నేర్చుకోవలసినదెంతేనా ఉంది.
1.ఒకరిపని పరిధిలో జోక్యం చేసుకోకు.పరాధికారము పైన వేసుకొనరాదు.
2.మరొకరిని చూసి ఈర్ష్య పడకు.
3.ఎవరి పని వారిదే, ఎవరి పనిలో కష్టసుఖాలు వారివే.నేను కష్టపడిపోతున్నాను, ఎదుటివారంతా సుఖపడుతునారనుకోకు.
4.తొందరపాటు పనికిరాదు.
5.చేతులు కాలేకా ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. జరగవలసిన నష్టం జరిగిపోతుంది.
6.పని అవసరాన్ని బట్టి యజమాని ఉద్యోగులను నియమిస్తూ ఉంటాడు.
7.యజమాని తెలివితక్కువ వాడనుకోకు.
8.యజమానికి నష్టం కలగజేస్తే నీవూ నష్టపోతావు, గుర్తుంచుకో!
7, అక్టోబర్ 2022, శుక్రవారం
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.
పులి బంగారం రంగులో ఉండి,ఆపై నల్ల మచ్చలుంటాయా? నల్ల ఒంటి మీద బంగారపు మచ్చలుంటాయా? తేలలేదు. కాని అందరూ నల్లమచ్చలే ఉంటాయంటారు. పులిని చూస్తే భయం, రాజసం అందుకు అడవిలో జంతువులంతా అణిగిమణిగి ఉంటాయి. ఇది చూసిన నక్కకి కన్నుకుట్టింది. ఎలాగైనా తానూ పులిలా కావాలనుకుంది. మార్గం ఏంటీ? అలోచించింది. ఒంటి మీద మచ్చలు వేసుకుంటే తానూ పులిలాగే ఉంటాననుకుంది.ఒంటి మీద మచ్చలు శాశ్వతం కావాలంటే, ఆలోచించింది,అట్లకాడ కాల్పించి మచ్చలేయించికుంది,వాతలు పెట్టించుకుని , బాధ సహిస్తూ. ఒంటి మీద మచ్చలొచ్చాయి గాని తోటి నక్కలు చూసి అసహ్యించుకున్నాయి, ఇప్పుడు తాను అటు పులీ కాదు, ఇటు నక్కాకాదు . రెండికీ చెడ్డ రేవడు అయింది.
మరో చిన్నకత, విష్ణుశర్మ పంచతంత్రంలోది.
ఒక పోతరించిన నక్క, అడవిపక్క గ్రామంలో కొచ్చింది.ఒక కోడిని తరిమింది . ఆ కోడి ఒక సాలీల ఇంట్లో దూరింది. తరుముకు వెళుతున్న నక్క చూసుకోక, సాలివాడు బట్టలకి వేద్దామని కలిపి ఉంచిన నీలి రంగులో పడింది.ఒళ్ళంతా నీలి రంగు పట్టేసింది. కోడి దొరకలేదు, ఈ సందడిలో అది పారిపోయింది. అలాగే అడవికొచ్చిన నక్కని చూసి జంతువులు భయపడ్డాయి. వెళ్ళి పులికి చెప్పేయి, ఏదో భయంకరమైన జంతువు అడవిలో తిరుగుతోందని, అది చాలా కౄరమైనదని, రకరకాల కతలు , పులిని భయపెట్టేయి. పులి కూడా చూసీ చూడనట్టు ఉండిపోయింది. నీలినక్క ఎవరితో పలకలేదు, మాటలేదు. దీనితో ఆ జంతువు నక్కేనని గుర్తించలేకపోయాయి, జంతువులన్నీ. కాలం గడిచింది, ఓ రోజు వర్షం వస్తే ఆ వర్షంలో తడిసిన నీలి నక్క ఒంటిమీద రంగు కరిగింది కొంత, వికారంగా తయారయింది. ఇది చూసిన తోటినక్కలు గుసగుసలు పోయాయి. ఇంతలో పున్నమి వచ్చింది, తోటి నక్కలన్నీ సభచేసి గొంతెత్తి ఊళలు పెట్టాయి. నీలినక్క కూడా ఆనందం పట్టలేక గొంతెత్తి ఊళపెట్టింది. దానితో ఇది నక్కేనని తెలిసిపోయి, తోటి నక్కలు తిట్టేయి, ఇది తెలిసి పులొచ్చి ఒక్క పెట్టు పెట్టింది, పోతరించిన నక్క కత సమాప్తం.
పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా రవీoద్రనాథ ఠాకూర్ అంతవారవుతారా?
పెద్దతెల్లగడ్డం పెంచుకున్నవాళ్ళంతా ప్రధాని అవుతారా?
పెద్దతెల్లగడ్డం కాకపోతే నల్లగడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?
పోనీ మల్టీ కలర్ గడ్డం పెంచుకుంటే ప్రధాని అవుతారా?
పాదయాత్ర చేసినవాళ్ళంతా
ముఖ్యమంత్రులయ్యారు. నడవనివాళ్ళూ ముఖ్యమంత్రులయ్యారు.
పాదయాత్రవాళ్ళంతా ముఖ్యమంత్రులవుతారా?
రథయాత్రలు చేసినవాళ్ళు ప్రధాని అయ్యారా?
రథయాత్రచేస్తే ప్రధాని అవుతారా?
గొప్పవారి పేరుకు దగ్గరగా మనం పేరు పెట్టుకున్నంతలో వారి గొప్ప మనకొస్తుందా?
పెద్దవాళ్ళని తిట్టినవాళ్ళంతా మేధావులైపోతారా?
మేధావులంతా పెద్దవాళ్ళని తిడతారా?
పులినిజూసి నక్క వాతలు పెట్టుకోడం అంటే ఇదేనా?
5, అక్టోబర్ 2022, బుధవారం
అత్యవసర ద్వారము./EMERGENCY.
అత్యవసర ద్వారము. EMERGENCY.
ఎల్లరకు
విజయదశమి శుభకామనలు
.
4, అక్టోబర్ 2022, మంగళవారం
సిరిఅబ్బదు చీడబ్బినట్టు
సిరిఅబ్బదు చీడబ్బినట్టు, ఇదో నానుడి.
మంచి అలవాట్లు కావడం కష్టం, కాని చెడు అలవాట్లు తొందరగా అవుతాయంటారు, ఇదీ పెద్దలమాట.
సిరి అంటే లక్ష్మి, మనవారు లక్ష్ములని ఎనిమిదిగా చెప్పారు. ఆధునికులు మరో అడుగు ముందుకేసి, పెళ్ళాం పిల్లలు చెప్పిన మాట వినేవారైతే సిరి,ఇంట్లో ఉన్నవాళ్ళంతా కలసి భోజనం చెయ్యడం సిరి, తల్లితండ్రులతో కలసి ఉండడం సిరి అని ఇంకా ఏవో చెప్పేరు, ఇదంతా మా వాట్సాప్ యూనివర్సిటీ విజ్ఞానం :)
ఇలా మంచి అలవాట్లు కావడం కష్టం చెడు అలవాట్లు కావడం చాలా సులభం, అన్నది, పెద్దల మాట.
కుండలో,రాగిపాత్రలో,ఇత్తడిపాత్రలో వండుకోండి. గంజివార్చండి, వార్చిన గంజి పారబోయక అన్నంలో కలుపుకు తినండి.అతివేడిగా, అతి చల్లగా ఆహారం తీసుకోకండి, వండుకున్న అన్నం ఉమ్మగిలనివ్వండి,ఉమ్మగిలడం అంటే సాధారణ ఉష్ణోగ్రతకు చేరడం, ఇలా కావాలంటే అన్నం వండుకున్నతరవాత దానిని కలియబెట్టి ఆరనివ్వడమే. ఇలా ఆరనిస్తే కార్బోహైడ్రేట్లలో మార్పు జరిగి, వరిఅన్నపు గ్లైసిమిక్స్ ఇండెక్స్ తగ్గుతుందిట. దంపుడు బియ్యపు అన్నం మంచిది,కాని డబుల్ పాలిష్ బియ్యమే తింటున్నాం. సనాతనమైనది కాదనుకుని, తాతతండ్రులు తిన్నదాన్ని నిరసిస్తూ పురోభివృద్ధి సాధించామా లేదా?కుండ,రాగిపాత్ర,ఇత్తడి పాత్రలలో వండుకోడం అనాగరికమని అల్యూమినియం బొచ్చల్లో వండుకుంటున్నామా లేదా? నాగరికతంటే ఇదేకదా అని అడుగుతున్నాం కూడా!
ఈ మధ్య ఒక అంతర్జాతీయ సదస్సులో ఒక శాస్త్రవేత్త ఆఫ్రికా ఖండం వాడు, నీరుల్లిపాయ సుగర్ ని అదుపులో ఉంచుతుందన్నారు,మెట్ఫార్మిన్ తో కలిపితీసుకుంటే . మిగిలిన ఆధునికులు ఈ మాటమీద ఇంకా దీనిపై పరిశోధన జరగాలని విషయాన్ని బుట్టదాఖలా చేసేసారు.
నాకైతే ఒకమాటనిపించింది. భారతదేశంలో ఉల్లివాడకం ఎక్కువకదా! మరిక్కడ ఇన్ని సుగర్ కేస్ లూ ఎందుకున్నట్టు? ఇదిగదా కొచ్చను :)
మనం తీసుకునే ఆహారంలో రకరకాల ఆహార పదర్ధాలుంటాయి. అన్నిటికి ఒకటే జి.ఐ (G.I )ఉండదు, ఎక్కువ తక్కువలుంటాయి. వీటిని కలిపితీసుకున్నపుడు జి.ఐ తగ్గుతుంది, అది 50 కి లోపు ఉంటే మంచిదే, దానికంటే ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర శాతం తొందరగా పెరుగుతుంది. ఇక పచ్చిఉల్లి జి.ఐ 10, అదే ఉడికిస్తే అది కాస్తా 40 అయి ఊరుకుంటుంది. మనకు పచ్చి ఉల్లిని తినడమూ అలవాటే కాని ఈ మధ్యనే ఈ అలవాటు తప్పించుకుంటున్నాము. పచ్చి ఉల్లిని ఆహారంలో తీసుకుంటే మొత్త జి.ఐ తగ్గుతుంది, మందులు, సమర్ధవంతంగా పనీ చేస్తాయనుకుంటున్నా! పచ్చి ఉల్లి తినిచూస్తే పోయిందేంలేదు.పంజాబీలు రోటీతో ఒక పెద్ద ఉల్లిపాయ,ఒకపచ్చిమిరపకాయ కూడా తింటారనుకుంటా.
ఇక ఈ మధ్యనే ఒకదేశి డాక్టరమ్మ,అలోపతి డాక్టరమ్మే చద్దన్నం తినండి అన్నారు, శాబాసో! అనుకున్నా, ఆ తరవాతే చెప్పిందా తల్లి, నిన్నరాత్రి మిగిలిన అన్నం ఫ్రిజ్ లో పెట్టుకుని మర్నాడు ఉదయం తినమన్నారు. అన్నం ఉడికిన తరవాత దానిని ఫ్రిజ్ లో పెట్టి ఉంచి చల్లబడ్డ తరవాత మళ్ళీ వేడి చేసుకు తినండీ, అని. అసలే కుక్కర్లో వండిన వాటిలో పోషక విలువలు చస్తున్నాయంటున్నారు, ఇక ఫ్రిజ్ లో పెట్టి తీసి మళ్ళీ వేడి చేసి తింటే అసలు పోషక విలువలుంటాయా? నా ఉద్దేశం ఈ అలవాటు మాత్రం చాలా తొందరగానే అందరిని చేరచ్చు అనుకుంటున్నా!
1, అక్టోబర్ 2022, శనివారం
మొండివాడు రాజుకంటే బలవంతుడు.
మొండివాడు రాజుకంటే బలవంతుడు.
ఇది పాతకాలం మాట, కాని నేటికీ వర్తిస్తుంది. ఏం? ఏలా?
రాజుకి కొన్ని నియమాలుంటాయి, అవి దాటితే కౄరుడు అన్నమాట పడిపోతానని, ఇతరులు ఏమనుకుంటారోనని,ప్రజలేమనుకుంటారోనని, భయపడతాడు, ఎంతో కొంత. కాని మొండివాడో? అటువంటి శసభిషలేం ఉండవు. ఎవరేమనుకున్నా ఈ మొండివానికి బాధాలేదు, భయమూ లేదు.తనకి ఎంతతోస్తే అంతే! మరి నేటికాలానికెలా వర్తింపూ అనికదా కొచ్చను :)
నేడు సోషల్ మీడియా అన్నదో కోతికి కొబ్బరికాయ దొరికిన చందమైయింది. వాక్స్వాతంత్ర్యం అన్నది రాజ్యాంగం
ప్రసాదించింది,ఇంకేం కావాలి? ఏదైనా అంటాం! ఎవరినైనా అంటాం!! ఇదీ నేటి వరస. సుప్రీం కోర్ట్ కూడా వాక్స్వాతంత్ర్యానికి కూడా హద్దులుంటాయంటోంది. కాని వినేవారే కనపట్టం లేదు. సోషల్ మీడియాలో యుట్యూబ్, ఒక పెద్ద సాధనమయింది. ఏంతోస్తే అదే షూట్ చేసి పెట్టెయ్యడమే! బాధితులు కొంతకాలం సహిస్తారు. అందరూ సహించరుగా!! కోర్టే కినుక వహిస్తే జైల్లో పారేస్తే, ప్రభుత్వం ఉద్యోగం పీకేస్తే, నిరాహారదీక్ష...
దీనికితోడు మరోటి, గాంధీగారు చచ్చి ఏలోకాన్న ఉన్నాడోగాని, దేశం లో అలవాటు చేసినది మరొకటి నిరాహారదీక్ష. సరే ఇందులో రకాలనుకోండి. ఇక నిరవధిక నిరాహారదీక్ష. దాని అర్ధమైనా తెలుసునో లేదో, చేసేవారికి, తెలియదు. ఆపై దీని గురించి మీడియావారి హడావుడి, ఇక చెప్పేదేముంది? అసలే కోతి, కల్లు తాగింది,ముల్లు గుచ్చుకుంది, దయ్యం పట్టింది, మరేం కావాలి?
మొండివాడు రాజుకంటే బలవంతుడు కాదా?
29, సెప్టెంబర్ 2022, గురువారం
చెఱపకురా చెడేవు.
చెఱపకురా చెడేవు.
చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు.
చెట్టు పాడవడాన్ని "పుల్ల విరిగింద"ంటాo, మా పల్లెటూరీ భాషలో. చెట్టు కాని, పాదుకాని కాపు పూర్తయి, ఇక ముందు కాయదు అనడానికి సంకేతంగాను, ఇక ముందు చనిపోతుందని సంకేతంగా ఇటువంటి పిందెలు దిగుతాయి. వీటిని కుక్కమూతి పిందెలంటారు. ఇలాగే మనుషుల్లో కూడా, పిదపకాలపు బుద్ధులు పుడతారంటారు.
.
25, సెప్టెంబర్ 2022, ఆదివారం
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.
సాధారణంగా ఉట్టి ఎత్తుగానే కడతారు. రోజూ వాడుకునేదైతే కొంచం తక్కువ ఎత్తులో అంటే ఆ ఇంటి ఇల్లాలు నిలబడి చేతులెత్తితే అందేలా కట్టుకుంటారు. ఇందులో పాలు,పెరుగు దాచుకుంటారు, పిల్లి నుంచి రక్షించుకోడానికి.ఇక స్వర్గమన్నది ఉందో లేదో తెలీదు, ఉంటే ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపుతారు, ఎంత దూరమంటే తెలీదు.ఎగిరి వెళితే ఎంత కాలం పడుతుందంటే తెలీదు. ఇటువంటి ఏమీ తెలియని స్వర్గానికి, నిలబడి చేతులెత్తి ఉట్టి అందుకో లేని ఇల్లాలు, ఎగిరి వెళ్ళిపోతానందిట, ఆంటే హాస్యాస్పదంగా ఉందని అంటారు గిరీశం భాషలో గోతాలు కొయ్యడం.ఇదే మరోలా కూడా చెబుతారు, కూచుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెళతానంది, అని.ఒక అత్తా ,కోడలు. అత్త ముసలిదై కూచుంటే లేవలేక లేస్తే కూచో లేక తిప్పలు పడుతోంది. నడుం ఒంగిపోవడంతో తిన్నగా నిలబడలేక, నడవలేక ఉన్నది, లేస్తే ఒంగుని నడుస్తుంది,కఱ్ఱపోటుతో.ఒక రోజు కోడలితో తీర్థం వెళతానంది. అత్తా! కూచుంటే లేవలేకున్నారు, ఎలా వెళ్ళగలరు తీర్థానికి? అక్కడ జన సమ్మర్దం, తోసుకుంటారు, మీకంత ఓపిక ఉందా? నడవగలరా? అడిగింది. దానికి అత్త, కూచుని లేవలేకపోవచ్చుగాని , ఒంగుని నడిచి తీర్థం వెళతానూ అందిట. విన్న కోడలు ముసి ముసి నవ్వులు నవ్వుకుందిట, పగలబడి నవ్వలేదు? ఎందుకూ?పంచాయతి ప్రెసిడెంట్ గా నెగ్గలేనివాడు ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తానన్నట్టు.ఇవి రెండూ తెనుగునాట చెప్పుకునే నానుడిలే సుమా!
23, సెప్టెంబర్ 2022, శుక్రవారం
విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2
విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2
Continuation of
https://kasthephali.blogspot.com/2022/09/2024-1.html
విపక్షం నుంచి ఏ ఒక్క పార్టీ బిజెపిని ఒంటరిగా దేశం మొత్తం మీద ఎదుర్కోగల స్థాయిలో లేదు. ఆర్జెడి నేత "కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీరుపోటీ చేయండి, స్థానిక పార్టీలు బలంగా ఉన్నచోట వాటిని బలపరచండి" అని సూచించారు, దానికి కాంగ్రెస్ వారిచ్చిన సమాధానం " మేమింకా బలహిన పడదలుచుకోలేదని" పురిటిలోనే సంధికొడుతుంటే పొత్తులెక్కడా? అనేదే సందేహం.
ప్రధాని పదవికి పోటీ పడాలని అనుకునేవారు ఈ కిందివారని ప్రజలమాట, మీడియా మాట.
రాహుల్ గాంధి: వీరి పార్టీకి స్థానిక పార్టీలకి చుక్కెదురు, అన్ని రాష్ట్రాలలోనూ. పాలనానుభవం శూన్యం, కనీసం పంచాయతి ప్రెశిడెంట్ గా కూడా పని చేసిన అనుభవం లేదు. పైనుండి చెప్పడం వేరు, పని చేయడం వేరు. ఇది వీరికి పెద్ద మైనస్ పాయింటే. ఎత్తుచేతివారి బిడ్డ గనక పాలనానుభవం పుట్టుకతోనే వచ్చేస్తుందనేవారూ లేకపోలేదు. ఇతనికి సమయం సందర్భం తెలిసిమాటాడే అలవాటు పూజ్యం అని అంటారు. విపక్షంలో కాకలు తీరిన యోధులున్నారు, పాలనానుభం కొల్లలుగా ఉన్నవారున్నారు. ఇతనిని ప్రధానిగా ఒప్పుకోగలరా అన్నది, పెద్ద ప్రశ్న.మరొకరిని వీరి పార్టీ నుంచి ఎన్నుకునే సావకాశం చెప్పలేనిదే!వీరికి రాగల సీట్లు 50. శత్రువులెక్కువ.
మమత: వీరు బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి బెంగాల్లో తప్పించి మరో రాష్ట్రంలో పలుకుబడి లేదు. బెంగాల్ దాటి వీరి ప్రభ లేదు,సామాన్యులెవరికి తెలియనివారే! తృణమూల్ పార్టీకి, కాంగ్రెస్ కి, సి.పి.ఎమ్ లు రాష్ట్రంలో ప్రత్యర్థులు. బెంగాల్లో ఎక్కువలో ఎక్కువ వీరికి 20 సీట్లకంటే వచ్చే సావకాశం లేదు. మరొక పార్టీకి అదే తమిల్నాడులో డి.ఎమ్.కె కి మాత్రం వీరితో సమానంగా సీట్లు వచ్చే సావకాశం.మమత తాము,అఖిలేష్, ఝర్ఖండ్ వారు ఒక జట్టని ప్రకటించారు. వీరికి రాబోయే సీట్లు 20.
నితీష్: వీరు బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం నుంచే ఉన్నారు. పాలనానుభవం దండిగా ఉన్నవారే!ఇప్పటికే చాలా సార్లు తమపార్టీని కాంగ్రెస్ నుంచి, బి.జె.పి కి మరల ఇటునుంచి అటు కప్పగంతులు వేసి అధికారం నిలబెట్టుకున్నారనే అపప్రథ ఉన్నది. ఇప్పుడైతే ఎన్నికల తరవాత మళ్ళీ బి.జె.పి లోకి గెంతరనే నమ్మకం ఎక్కువమందికి లేదు.అంతేగాక వీరు బి.జె.పి తరఫున పనిచేస్తూ కాంగ్రెస్ వైపుకొచ్చారు, గూఢచారిగా అనే మాట కూడా వినపడుతోంది. వీరికి బీహార్లో తప్పించి మరో రాష్ట్రంలో పట్టులేదు. నితీష్ ఉ.ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నేటి వార్త. వీరికి ఉ.ప్ర లో పట్టులేదు, కాని వీరికి ఉ.ప్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ తన సీటు ఫూల్పూర్ వీరి పోటికి త్యాగం చేయబోతున్నట్టు వార్త.నితీష్, బాబోయ్! నేనసలు విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ లో ఉన్నానని చెప్పలేదు మొర్రో! అని మీడియా ముందు గోల. వీరికి అందరూ మిత్రులే అలాగే అందరూ శత్రువులే!!! వీరికి రాబోయే సీట్లు 6.
శరద్ పవార్: వయసు మీద బడింది,ఆరోగ్యమూ సరిలేదు, వీరు కేంద్ర మంత్రిగానూ ఉన్నారు, మరాఠా చాణుక్యుడంటారు. వీరికి మహరాష్ట్రలో ఓ చెంపనే బలముంది,మరే రాష్ట్రంలోనూ చెప్పుకోతగ్గ బలం లేదు. వీరికి రాబోయే సీట్లు 6 కి పెరగవు. వీరికి కొత్త మిత్రులు పాత శత్రువులు ఒకటే! ఎవరితోనైనా కలసిపోతారు, తమ పని ముఖ్యం,అంతే.
అఖిలేష్ యాదవ్ : ఉ.ప్ర. కి ఉన్న సీట్లు 80. వీరికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.హిందీ రాష్ట్రాలలో కూడా వీరికి పట్టులేదు, తమ రాష్ట్రం తప్పించి. వీరికి బి.ఎస్.పి కి కుదరదు. వీరికి రాగల సీట్లు ఇరవైలోపే.ప్రధాని కావాలనే కోరిక ఎక్కడా వెలిబుచ్చినట్లు లేదు.
కేజ్రివాల్: వీరినంతా క్రేజివాల్ అంటారు,అదేమో మరి. వీరు ఢిల్లీ లోనూ పంజాబ్ లోనూ అధికారంలో ఉన్నారు. రేపు హిమాచల్ లోనూ గుజరాత్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామంటున్నారు. వీరికి కాంగ్రెస్ అంటే చుక్కెదురు. మేము అప్పుడే బి.జె.పి వ్యతిరేక ఫ్రంటులో చేరమని ప్రకటించారు. అంటే తటస్థంగా ఉండి, ఎక్కువ లాభం పొందాలని ఆశ, దురాశ కాకుంటే మంచిదేనేమో!.
ఇక దక్షణాది కొస్తే, ఇక్కడ్నుంచి ప్రధాని అయ్యే సావకాశాలే తక్కువ.మొత్తం దక్షణాది రాష్ట్రాలలో సీట్లు అన్నీ కలిపి ఆంధ్ర25+తెలంగాణా17+తమిల్నాడు39+కేరళా20+కర్నాటక28=129.ఇక్కడినుంచి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతూ మోడీ ని దించేస్తాం, ఆ తరవాత మాదే ప్రభుత్వం అంటున్న కె.సి.ఆర్ అనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రథములు.పోనీ ఈ దక్షణాదివారంతా ఒక మాట మీదుంటారా అంటే సాధ్యం కానిదే! వీరికి కాంగ్రెస్ కీ కుదరదు. వారున్నచోట వీరుండరు. కాంగ్రెసేతర,బిజెపియేతర ప్రతిపక్షపార్టీలకూటమా? ఇదివరలో చాలా ప్రయత్నాలే జరిగాయి, కాని ఏదీ బతికి బట్టకట్టలేదు.కొత్త పార్టీ స్థాపనా? ఎమో చూడాలి.ఒక రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో నెగ్గుకురాగలగినవారు ఎన్.టి.ఆర్ మాత్రమే! దేశం మొత్తం మీద కొత్త పార్టీ పెట్టి ఆశయాలు చెప్పి అన్ని రాష్ట్రాలలో ఒప్పించగల కార్యకర్తలు, మంది, మార్బలం సమకూర్చుకోవడం తేలికా, రెండేళ్ళలో సాధ్యమా? అభిమానులు జరుగుతుందంటే విని ఆనందించచ్చు.కాని ఇది నిజానికి దూరమేమో! అన్ని పార్టీలు ఎక్కడివారక్కడ పోటీ చేసి ఎన్నికలయ్యాక పొత్తులు కుదుర్చుకుంటాం అంటే ప్రజలు నమ్ముతారా?
కెసిఆర్: వీరి పార్టీ తెలంగాణా లో పదేళ్ళుగా పాలనలో ఉంది. తెలంగాణాలో పట్టున్నది. కాని రాష్ట్రం దాటి వీరి మాట వినేవారెవరనేది పెద్ద ప్రశ్న.కొత్త పార్టి పెడుతున్నా! ఖబడ్దార్ అని గర్జిస్తున్న మాట నిజం. వీరి రాష్ట్రం లో మొత్తం సీట్లు 17 కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ స్థానాన్ని బి.జె.పి ఆక్రమిస్తున్నందుకే వీరి గర్జనలని విజ్ఞుల మాట. వీరికి మహా ఐతే 10 సీట్లు రావచ్చు. వీరికి కాంగ్రెస్ కి పొత్తు లేదు. వారి నీడ కూడా పడటానికి ఇష్టపడని వీరు కాంగ్రెస్ లేక కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా?వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు.
చంద్రబాబునాయుడు: తెలుగుదేశం పార్టి బిజెపితో అంటకాగి YSR CP వేసిన ఎత్తుకు చిత్తయి,బిజెపితో కటీఫ్ చేసుకున్నారు,ప్రభుత్వం నుంచీ బయటికొచ్చారు. దీనికీ ఎవరూ తప్పుపట్టాలేదు. కాని, బద్ధ వ్యతిరేకి ఐన కాంగ్రెస్ తో 2019 లో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నంతో ప్రజలు తిరస్కరించారు. అప్పటినుంచి,ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారానికి దూరమై ఉన్నవారు.నలభై ఏళ్ళ పాలనానుభవం, రాజకీయానుభవం పనిచేయలేదు.వీరికి రాష్ట్రంలో పది సీట్లురావచ్చు.మరో రాష్ట్రంలో పట్టులేదు.పట్టుందని ప్రయత్నించిన కర్ణాటకలో ఎదురు దెబ్బే తగిలింది. వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు.
కమ్యూనిస్టులు:అంతర్జాతీయ పార్టీ మాదని చెప్పుకునే వీరు దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు. బెంగాల్ లో తృణమూల్ దెబ్బకి మట్టికరిచి మరి తేరుకోలేకపోయారు. ఇక వీరికి పట్టున్న మరోచోటు కేరళా, కాని ఇది కూడా కుటుంబ పార్టీ ఐపోతోందంటున్నారు. చారిత్రిక తప్పిదాలు చేయడం వీరి అలవాటు. మరెక్కడా ఉనికి ఉన్నట్టు లేదు. కేరళాలోనే వీరికి రాగల సీట్లు 10.
1962 లో మొదటి సారి ఓటేసిన వాడిని, నాటినుంచి ఎన్నికలు చూస్తున్నవాడిని,రాజకీయనాయకులతో,
రాజకీయపార్టీలతో సన్నిహితంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిపినవాడిని. ఆరోజుల్లో కూడా కాంగ్రెస్ నీ గద్దె దించేస్తామన్న వారే అందరూ, కాని ఆ పార్టీ చిత్తు కావడానికి దగ్గరగా ఏభై ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం మూలంగానే!స్వాతంత్ర్యం తరవాత పాలూ తేనెలు ఈ పార్టీ దేశంలో ప్రవహించేస్తుందని నమ్మి మా తాతలు ఆస్థులు తెగనమ్మి ఈ పార్టీని బతికించారు, మమ్మల్ని వీధులపాలూ చేశారు.
అంతర్గత ప్రజాస్వామ్యం తో దేశప్రజల ఆకాంక్షలు తీర్చగల మరో పార్టీ ఉండటం మంచిదే! అటువంటి పార్టీని నిర్మాణం చేస్తే ఆనందమే.స్వార్ధమే, పరమావధిగానూ, ద్వేషమే ఊపిరితో బతికే పార్టీలు ఏమి చేయగలవన్నదే ప్రశ్న.
పై చెప్పినవారే కాక వెలుగులోకి రాని వారు చాలామందే ఉన్నారు, అందరూ పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరన్నదే ప్రశ్న.
అనుకున్నట్టే కాక ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయని ఊహిస్తూ అంచనా
CON60+TMC 25+DMK25+NCP10+AAP10+SP 20+RJD 20+TDP10+TRS10 +CPM10 Total 200 small parties say 30.Now the total is 230 along with congress, 170 without congress. It is difficult to understand how a governemt can be formed at centre.
ఇందులోనే, ఒకరినీడ మరొకరిపై పడినా సహించలేరు.ఒకరిపై ఒకరికి నమ్మకమూ లేదు వీరికి పొత్తెలా? ప్రజలని ఎలా నమ్మిస్తారు?అటువంటి కూటమికి విదేశీ విధానం ఏమిటి? చాలా ప్రశ్నలకి సమాధానం లేదు.కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారంలో ఉన్నవారితో అంటకాగుతాయి, అది సహజం కూడా. ఎన్నికల తరవాత ఎంతమంది ఈ కూటమిలో ఉంటారో! ఎవరు జారుకుంటారో ఎవరు చెప్పగలరు?
బలవంతంగా వీరంతా కలిసినా అదెంతకాలం? అలా కలపగల వారెవరు? సామాన్యునికి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!
21, సెప్టెంబర్ 2022, బుధవారం
ఎద్దు పుండు కాకికి నొప్పా?
ఎద్దు పుండు కాకికి నొప్పా?
స్వంతవైద్యం చేసుకోకూడదు. అలాగే ఇంట్లో వారెవరూ వైద్యమూ చేయకూడదు,ఎంత గొప్ప వైద్యులైనా. ఎందుకు? ఇదిగదా మన ప్రశ్న :) సందేహజీవులం కదా!
మొన్న నిమ్స్ డిరెక్టర్ అపోలో లో చేరితే నిమ్స్ లో వైద్యం బూటకం వగైరా అనేశారు. కాని ఆయన అపోలో లో చేరి మంచిపని చేశారు. నిమ్స్ లోనే కనక చేరితే అక్కడ ఆయన రోగిగా గుర్తించబడి వైద్యం జరగదు. ఆయన డైరెక్టర్ గానే గుర్తిస్తారు, అందరూ. ఇది ఎంత చెప్పినా వైద్యులు మిగతా సిబ్బంది మీద ఉంటుంది. ప్రమాద సమయాల్లో నిర్ణయం తీసుకోడానికి వైద్యులు జంకుతారు. అందుకు స్వంతవైద్యమూ పనికిరాదు, స్వంత ఇంటిలో వైద్యుడే ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కావలసినవారికి వైద్యం చేయకూడదు. తెలిసిన వైద్యులెవరూ అలా చేయరు. పెరటిలో మనం చెట్టు వేస్తేనే పెరుగుతుంది, దానికి ఎంతో కొంత దోహదం చేస్తాం, అది సహజవాతావరణం పెరిగినదై ఉండదు,దానిలో కొన్ని సహజ గుణాలు లోపిస్తాయి. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు.
సందేహజీవులం కదా మరో సందేహం ప్రాథమిక చికిత్స చేయవచ్చా? ప్రాథమిక చికిత్స ఎప్పుడు చేస్తారు? ప్రమాదం జరిగినపుడు కదా! ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అత్యవసరం, అది ఎవరైన, ఎవరికైనా చేయచ్చు, ఆ తరవాత అవసరాన్ని బట్టి వైద్యుల దగ్గరకు తీసుకుపోవాలి.
పెరటి చెట్టు మందుకు పనికిరాదు
యజమాని ఎద్దును కాడి మెడమీద వేసి బండికి, నాగలికి కడతాడు. ఐతే పని చేసేటపుడు ఎద్దు మెడమీద అధికభారం మోపితే పుండు పడుతుంది. యజమాని పుండు పడినా పనికి మలుపుతూనే ఉంటాడు, ఎద్దు ఎత్తుబడిపోయేదాకా! . ఎద్దు మెడ మీదపడ్డ పుండు మీదనే కాకివాలుతుంది, మాంసం పొడుచుకుతినడానికి. ఎద్దు కాకిని తోలుకో లేదు. తోక మెడదాకా అందదు, చెవులాడించినా, అవీ మెడమీద కాకిని బయటికి తోలలేవు, ఎద్దు మెడ ఆడించినా కాకి ఎగిరి మళ్ళీ అక్కడే వాలుతుంది. పాపం ఎద్దు అసహాయం గా కాకితో హింసింపబడుతూ ఉంటుంది. కాకికి బాధేంటి ఎద్దుకుగాని?
సమాజంలో కాకిలాటి వారుంటారు, ఎద్దులా అసహాయంగా బాధ అనుభవిస్తున్నవారూ ఉంటారు. తస్మాత్ జాగ్రత!!!
ఎద్దు పుండు కాకికి నొప్పా?
19, సెప్టెంబర్ 2022, సోమవారం
విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1
విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1
ఈ ప్రశ్న విపక్షాలని తీవ్రంగా కలవరపెడుతోంది. నితీష్ కాంగ్రెస్ పక్కకి చేరడంతో చర్చ ఊపందుకుంది.చిత్రం ఏమంటే, బి.జె.పి నుంచి,తదుపరి ప్రధాని అభ్యర్ధి మోడీ యేనని ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించేశాయి.
కాంగ్రెస్ దేశంలోని ఐదు పెద్ద రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయింది. అవి ఆ.ప్ర 25,ఉ.ప్ర80,బెంగాల్ 42,తమిల్నాడు 39,తెలంగాణా 17, మొత్తం సీట్లు 203. కాంగ్రెస్ కి ఇక్కడ పోటీకి మనుషులు కూడా దొరికేసావకాశాలు సన్నగిల్లేయంటారు.
ఇక కొన్ని రాష్ట్రాలలో అధికారంలోఉంది. అవి రాజస్థాన్,చత్తీశ్ ఘర్, ఇక ఈ మధ్యనే మహారాష్ట్రలో,పంజాబ్ లో అధికారం కోల్పోయి బీహార్ లో అధికారం పంచుకుంటోంది. ఈ రాష్ట్రాలలో కూడా చెప్పుకోతగ్గ జనం పార్టీ వెంట ఉన్నట్టులేదు.
ఇక మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్, కేరళా,గుజరాత్ లలో విపక్షంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో ఈ పార్టీ అడుగంటిపోయింది.
దేశం మొత్తం మీద పార్టీ పలుకుబడి సన్నగిల్లిపోయింది, భారత్ జోడోయాత్ర తో బలం పుంజుకుంటుందేమో చూడాలి. ”భారత్ జోడోయాత్ర” ”కాంగ్రెస్ ఛోడో” యాత్ర కాకుంటే చాలని అభిమానుల ఆవేదన. ఎలా చూసినా పెద్ద రాష్ట్రాలలో పట్టులేక అధికారం సంపాదించడం తేలిక కాదు.కాంగ్రెస్ కి ఇప్పుడున్నట్టుగానే ఏబై సీట్లు దాకా రావచ్చు,అంతకు మించి పెరిగేసూచనలేం కానరావటం లేదు.ఇక మిత్రులు చూదామంటే ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పార్టీలన్నీ విరోధులే. మిత్రులుగా ఉన్నది ఒక్క తమిల్నాడులో డి.ఎమ్.కె మాత్రమే. ఈ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచే అధికారం గుంజుకుంది.
ఈ పార్టీ నుంచి ముఖ్యనాయకులందరూ వరసకట్టి బయటకుపోతున్నారు. ఇటువంటి వారిలో ముఖ్యమైనవారు గులాం నబీ ఆజాద్,రేపో,నేడో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా బి.జె.పి లో చేరుతున్నట్టు వార్త. ఈ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోడానికి తిప్పలుపడుతోంది. రాహుల్ గాంధీ యే మరలా అధ్యక్ష పదవి తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి తీర్మానించినట్టు వార్త. ఏమైనా రాహుల్ గాంధీ తప్పించి మరొకరు ఈ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి అయే సావకాశాలే లేవు. ఐతే ఎందరు విపక్షంనుంచి రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఒకప్పుడు స్వాతంత్ర్యం సంపాదించడానికి కారణభూతమయ్యామని చెప్పుకునే పార్టీ, నేడు ఎందుకు ఇంత దిగజారిపోయింది?స్వయంకృతాపరాథం అని ఒక్కమాటలో చెప్పెయ్యచ్చు. ఈ పార్టీ నాయకుల ఆస్థులు స్వాతంత్ర్యం ముందు ఎంత? నేడు ఎంత ఉన్నాయి, వారేం చేసి ఇప్పుడున్న ఆస్థులు సంపాదించారన్నది విచారిస్తే నిజం బయటపడుతుంది. అధికార దాహం, కుహనా గాంధీ కుటుంబ పరిపాలనే దీనికి కారణమని వారి పార్టీ నుంచి బయటికొచ్చిన వారు ఎలుగెత్తి చెబుతున్నమాట. కర్ణుని చావుకి కారణాల్లా ఈ పార్టీ అంతరించిపోయే దశలో కారణాలు చాలానే కనపడుతున్నాయి. గొడ్డు గోతిలో పడితే తలో బెడ్డా వేసేరన్న నానుడికి సరిపోతుంది.
ఇతర పార్టీలనుంచి, చాలా మంది నాయకులు ప్రధాని కావాలని ఆశ పడుతున్నారు, ఒక్కొకరిని చూదాం! పార్టీల బలాబలాల నుంచి వారి శక్తి యుక్తుల దాకా!
(సశేషం)
18, సెప్టెంబర్ 2022, ఆదివారం
తా వలచింది రంభ తా మునిగింది గంగ
తా వలచింది రంభ తా మునిగింది గంగ
1.సొమ్ములున్నవాడికి పార్టీ టిక్కట్టు ఇచ్చి, సొమ్ములకి పార్టీ టిక్కట్లు అమ్ముకుని, గెలిచిన వాడు ఎదుటిపార్టీ వాళ్ళకి అమ్ముడు పోయాడని అనుకోడం
మన బంగారం మంచిదయితే కంసాలిని ఆడిపోసుకోడం ఎందుకూ?
2.విపక్ష ఎమ్.ఎల్.ఎ లని తన పక్షంలోకి తాము చేర్చుకుంటే అభివృద్ధిని చూసి మా పార్టీలో చేరేరంటాం, అదే పని మరొకరు చేస్తే హోల్ సేల్ గా కోనేసేరంటాం :)
మనం చేస్తే శృంగారం అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం.
3.తల్లీతండ్రీ బూతులు మాటాడుతోంటే కొడుకు కూతురు నీతులు మాటాడతారా?
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
4.తనకి నచ్చిన పార్టీ దొంగలగుంపైనా ప్రజస్వామ్యం ఉన్నపార్టీ అదే మరో పార్టీ ఐతే నిక్కచ్చి కుటుంబ పార్టీ అంటాం.
తా వలచింది రంభ తా మునిగింది గంగ
మాటకి మాట తెగులు నీటికి నాచు తెగులు
ఇదే రాజకీయం.
ఒక రాజకీయనాయకుడు తమ పార్టీ గురించి వెలిబుచ్చిన సత్యం.
మా పార్టీలోకి రావడం తేలిక, బయటికి పోవడమూ తేలికే, కాని పార్టీని అంటి పెట్టుకుని ఉండటం కష్టం.
పచ్చి నిజం :)
16, సెప్టెంబర్ 2022, శుక్రవారం
పిల్లి మెళ్ళో గంట కట్టాలె
పిల్లి మెళ్ళో గంట కట్టాలె
బహు కుటుంబీకుడైన ఒకరి ఇల్లు. ఆ ఇంట్లో ధాన్యం,బియ్యం దాచుకునే ఒక గది, పశువులకి అవసరమైన చిట్టూ,తవుడూ దాచుకునే మరోగది, చల్లగది,వంటగది, భోజనాలశాల,సరుకులు దాచుకునేగది,అదే కొట్టుగది , ఆహారపదార్ధాలు దాచుకునేగది, పడకగదులు, ఇలా చాలా గదులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ ఇంట్లో పందికొక్కులు, ఎలకలున్నాయి. పందికొక్కులు, ఎలకలు అన్నిటిని తిన్నంత తిని, మిగిలినది పాడు చేస్తున్నాయని,కొంప తవ్విపోస్తున్నాయని, యజమాని సాయంత్రానికి అన్ని గదుల తలుపులు మూయిస్తూ వచ్చాడు, కాని ఎలకలు మాత్రం చూరుల వెంబడి కదులుతూ,తలుపులు చిల్లుపెట్టి, ఒక గదినుంచి మరోగదికి నేలలో పందికొక్కులు బొరియలుచేసి యధేచ్చగా అన్నిటిని పాడు చేస్తూనే ఉన్నాయి. పడకగదులుల్లో కూడా ఎలకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యజమాని బాధపడుతూనే ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. కాని తలుపులు మూసి ఉండటంతో ఎలుకలు చిక్కడం కష్టమయింది,పిల్లికి. యజమాని, కుటుంబ సభ్యులు విసిగిపోయారు, రాత్రులు తలుపులు మూయడం మానేశారు, దాంతో పిల్లికి వీలు చిక్కి దొరికిన పందికొక్కును, ఎలుకను దొరికినట్టు స్వాహా చేస్తూ వచ్చింది. చూసిన యజమానికి చేసిన పని బాగున్నట్టనిపించింది. ఎలుకలకి కొంత స్వేఛ్ఛ తగ్గింది, దీనితో ఎలుకలన్నీ కటకట పడ్డాయి. ముసలి ఎలుకలు, ముసలి పందికొక్కు అధ్యక్షతన ఒక సభ చేయాలని, పిల్లి నుంచి ఎలుకలకు కలిగే నష్టాన్ని లేకుండా చేసుకోవాలని తీర్మానించుకున్నాయి. ఆ సభకు ముసలి పందికొక్కును అధ్యక్షునిగా చేసుకుని సభ తీర్చి ఏమి చేయాలనేది ఆలోచించాలని, అనుకున్నాయి.
నేడు,రేపు అంటూనే సభ వాయిదా పడుతూ వచ్చింది. చివరికో రోజు సభ తీరాయి. ముసలిపందికొక్కు అధ్యక్షతన. అధ్యక్షులవారు స్వాగతోపన్యాసం ఇస్తూ జరుగుతున్నది చాలా అన్యాయం, దీన్ని ఎదుర్కోవలసిందే! అని శలవిచ్చి,పందికొక్కులు త్యాగాలు చేసినవని, అన్యాయాలను ఎదుర్కొని పోరాడినవని, మాది త్యాగధనుల వంశమని పొగుడుకుని, మిగతావారికి సావకాశం ఇచ్చారు. యువ ఎలుకలు, ఆవేశంగా ఉపన్యాసాలిచ్చాయి. యువ ఎలుకలు పందికొక్కులే త్యాగధనులు కాదు, మా వంశాలలలోనూ త్యాగధనులున్నారు, పోరాడుతూ ప్రాణాలూ పోగొట్టుకున్నవారున్నారు, ఇలా విడతీసి మాట్లాడటం అధ్యక్షులవారికి తగనిపని అన్నాయి. దానికి పందికొక్కులు ఉన్నమాట చెప్పేరు అధ్యక్షులవారు,వారి వంశం త్యాగధనుల వంశం అని వంత పాడేయి. దీనికి ఎలుకలు కినిశాయి. మమ్మల్ని కించపరచడానికే సభ చేసినట్టుందని పందికొక్కులు బయటకి పోతామని బెదిరించాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక సమస్య చర్చించాలిగాని ఇలా పక్కదోవ పట్టించకండని సుతి మెత్తగా అందరిని మందలిస్తే ఆవేశాలు చల్లారాయి.
పిల్లిని కట్టడి చేయాలి, మన వంశాలు నాశనం కాకుండా చూడాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ లోగా పిల్లి సడి పసికట్టిందో ఎలక, పక్కదానిని హెచ్చరించింది, అది మరోదాన్ని హెచ్చరించడంతో ఎలకలన్నీ సభ వదలి పారిపోయాయి. మళ్ళీ సభ చేయాలని అనుకున్నాయి. ఆవేశంగా ఉపన్యాసాలివ్వడం కాదు ఏమి చేయాలన్నిది సూచనలు చేయాలని అనుకున్నాయి. వాయిదా పడుతూ పడుతూ సభ జరిగింది మరోరోజు. ముసలి పందికొక్కును అధ్యక్షత వహించమన్నాయి, ఎలుకలు, దానికి ము.ప నాకా వయసు చెల్లింది, నా స్థానంలో నా వంశం వారిని అధ్యక్షులుగా చేసుకుని సభ చేయమని సలహా చెప్పింది. దానికి కొన్ని ఎలుకలు వ్యతిరేకించాయి, మరికొన్ని మద్దతు పలికాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక ఇదంతా వ్యర్థం, అది పిల్లి, దొరికితే నోట కరుచుకుపోతుంది, సభ చాలించి ప్రాణ రక్షణ చూసుకోండని, సలహా ఇచ్చింది. దానికో పందికొక్కు,ఇది పిల్లి పక్షం మాటాడుతోంది, పిల్లి దీనికేమైనా ఎర చూపిందేమో అన్నాయి పందికొక్కులు. దానికి ఎలకలు ఉన్నమాట చెప్పినదానికి అంత ఉలుకెందుకని నిలదీశాయి. ముసలి ఎలక మాటాడుతూ అది పిల్లి, ఎవరినైనా నోట కరుచుకుపోతుంది, ఉన్నమాట చెప్పి చెడ్డయ్యాను, నాకెందుకొచ్చిన గోలంటూ, సభ వదలిపోయింది. ఒక యువ ఎలుక పిల్లి చప్పుడు చేయక వచ్చి మనమీద దాడి చేస్తోంది కనక, పిల్లి వస్తున్నట్టు తెలియాలంటే మెడలో గంట కడితే సరికదా అని సలహా ఇచ్చింది. దీనికి సభలో వారంతా భేష్! భేషని చంకలు గుద్దుకున్నారు. ఇంతలో పిల్లి వస్తున్న సడి వినపడింది, ఎలకలు,పందికొక్కులు పరిగెట్టేయి.
( సశేషం )
15, సెప్టెంబర్ 2022, గురువారం
గాడిద మాలక్ష్మికీ జై
గాడిద మాలక్ష్మికీ జై
వ్యాధి నిరోధక శక్తి అనేది బజారులో కొనుక్కుంటే దొరికేది కాదు. దీనికోసం మనవారు చాలా ప్రయత్నాలే చేశారు, అందులో కొన్ని, దొండాకుపసరు తాగించడం, వసపోయడం, తిప్పతీగనుంచి తిప్పసత్తు తయారు చేసుకువాడటం, గాడిదపాలు తాగటం, ఒంటెపాలు తాగటం ఇలా చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక టపారాస్తూ గాడిద పాల వ్యాపారం లాభసాటి అన్నాను.అది నిజమని నిరూపించబడింది. చూడండి.
https://kastephale.wordpress.com/2016/02/27/
శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..
”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….
ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం తెనుగునాట బాగా అలవాటు.
చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.
మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.
చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!
కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!
ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో, మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!
ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.
గాడిద మహాలక్ష్మికీ జై!!!










