19, సెప్టెంబర్ 2022, సోమవారం

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1

విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1


ఈ ప్రశ్న విపక్షాలని తీవ్రంగా కలవరపెడుతోంది. నితీష్ కాంగ్రెస్ పక్కకి చేరడంతో చర్చ ఊపందుకుంది.చిత్రం ఏమంటే, బి.జె.పి నుంచి,తదుపరి ప్రధాని అభ్యర్ధి  మోడీ యేనని ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించేశాయి.


కాంగ్రెస్ దేశంలోని ఐదు పెద్ద రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయింది. అవి ఆ.ప్ర 25,ఉ.ప్ర80,బెంగాల్ 42,తమిల్నాడు 39,తెలంగాణా 17, మొత్తం సీట్లు 203. కాంగ్రెస్  కి ఇక్కడ పోటీకి మనుషులు కూడా దొరికేసావకాశాలు సన్నగిల్లేయంటారు.


ఇక కొన్ని రాష్ట్రాలలో అధికారంలోఉంది.  అవి రాజస్థాన్,చత్తీశ్ ఘర్, ఇక ఈ మధ్యనే మహారాష్ట్రలో,పంజాబ్ లో అధికారం కోల్పోయి బీహార్ లో అధికారం పంచుకుంటోంది. ఈ రాష్ట్రాలలో కూడా చెప్పుకోతగ్గ జనం పార్టీ వెంట ఉన్నట్టులేదు. 


ఇక మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్, కేరళా,గుజరాత్ లలో విపక్షంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో ఈ పార్టీ అడుగంటిపోయింది.      


దేశం మొత్తం మీద పార్టీ పలుకుబడి సన్నగిల్లిపోయింది, భారత్ జోడోయాత్ర  తో బలం పుంజుకుంటుందేమో చూడాలి. ”భారత్ జోడోయాత్ర” ”కాంగ్రెస్ ఛోడో” యాత్ర కాకుంటే చాలని అభిమానుల ఆవేదన. ఎలా చూసినా పెద్ద రాష్ట్రాలలో పట్టులేక అధికారం సంపాదించడం తేలిక కాదు.కాంగ్రెస్ కి ఇప్పుడున్నట్టుగానే ఏబై సీట్లు దాకా రావచ్చు,అంతకు మించి పెరిగేసూచనలేం కానరావటం లేదు.ఇక మిత్రులు చూదామంటే ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పార్టీలన్నీ విరోధులే. మిత్రులుగా  ఉన్నది ఒక్క తమిల్నాడులో డి.ఎమ్.కె మాత్రమే. ఈ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచే అధికారం గుంజుకుంది.

ఈ పార్టీ నుంచి ముఖ్యనాయకులందరూ వరసకట్టి బయటకుపోతున్నారు. ఇటువంటి వారిలో ముఖ్యమైనవారు గులాం నబీ ఆజాద్,రేపో,నేడో  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా బి.జె.పి లో చేరుతున్నట్టు వార్త.  ఈ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోడానికి తిప్పలుపడుతోంది. రాహుల్ గాంధీ యే మరలా అధ్యక్ష పదవి తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి తీర్మానించినట్టు వార్త. ఏమైనా రాహుల్ గాంధీ తప్పించి మరొకరు ఈ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి అయే సావకాశాలే లేవు. ఐతే ఎందరు విపక్షంనుంచి రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.


ఒకప్పుడు స్వాతంత్ర్యం సంపాదించడానికి కారణభూతమయ్యామని చెప్పుకునే పార్టీ, నేడు ఎందుకు ఇంత దిగజారిపోయింది?స్వయంకృతాపరాథం అని ఒక్కమాటలో చెప్పెయ్యచ్చు. ఈ పార్టీ నాయకుల ఆస్థులు స్వాతంత్ర్యం ముందు ఎంత? నేడు ఎంత ఉన్నాయి, వారేం చేసి ఇప్పుడున్న ఆస్థులు సంపాదించారన్నది విచారిస్తే నిజం బయటపడుతుంది. అధికార దాహం, కుహనా గాంధీ కుటుంబ పరిపాలనే దీనికి కారణమని వారి పార్టీ నుంచి బయటికొచ్చిన వారు ఎలుగెత్తి చెబుతున్నమాట. కర్ణుని చావుకి కారణాల్లా ఈ పార్టీ అంతరించిపోయే దశలో కారణాలు చాలానే కనపడుతున్నాయి. గొడ్డు గోతిలో పడితే తలో బెడ్డా వేసేరన్న నానుడికి సరిపోతుంది.


ఇతర పార్టీలనుంచి, చాలా మంది నాయకులు ప్రధాని కావాలని ఆశ పడుతున్నారు, ఒక్కొకరిని చూదాం! పార్టీల బలాబలాల నుంచి వారి శక్తి యుక్తుల దాకా!

(సశేషం)   


18, సెప్టెంబర్ 2022, ఆదివారం

తా వలచింది రంభ తా మునిగింది గంగ

తా వలచింది రంభ తా మునిగింది గంగ



1.సొమ్ములున్నవాడికి పార్టీ టిక్కట్టు ఇచ్చి, సొమ్ములకి పార్టీ టిక్కట్లు అమ్ముకుని, గెలిచిన వాడు ఎదుటిపార్టీ వాళ్ళకి అమ్ముడు పోయాడని అనుకోడం

మన బంగారం మంచిదయితే కంసాలిని ఆడిపోసుకోడం ఎందుకూ? 


2.విపక్ష ఎమ్.ఎల్.ఎ లని తన పక్షంలోకి తాము చేర్చుకుంటే అభివృద్ధిని చూసి మా పార్టీలో చేరేరంటాం, అదే పని మరొకరు చేస్తే హోల్ సేల్ గా కోనేసేరంటాం :)

మనం చేస్తే శృంగారం అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం.



3.తల్లీతండ్రీ బూతులు మాటాడుతోంటే కొడుకు కూతురు నీతులు మాటాడతారా?

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?



4.తనకి నచ్చిన పార్టీ దొంగలగుంపైనా ప్రజస్వామ్యం ఉన్నపార్టీ అదే మరో పార్టీ ఐతే నిక్కచ్చి కుటుంబ పార్టీ అంటాం.

తా వలచింది రంభ తా మునిగింది గంగ


మాటకి మాట తెగులు నీటికి నాచు తెగులు

ఇదే రాజకీయం.


ఒక రాజకీయనాయకుడు తమ పార్టీ గురించి వెలిబుచ్చిన సత్యం.

మా పార్టీలోకి రావడం తేలిక, బయటికి పోవడమూ తేలికే, కాని పార్టీని అంటి పెట్టుకుని ఉండటం కష్టం.

పచ్చి నిజం :)

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

పిల్లి మెళ్ళో గంట కట్టాలె

  పిల్లి మెళ్ళో గంట కట్టాలె


బహు కుటుంబీకుడైన ఒకరి ఇల్లు. ఆ ఇంట్లో ధాన్యం,బియ్యం దాచుకునే ఒక గది, పశువులకి అవసరమైన చిట్టూ,తవుడూ దాచుకునే మరోగది, చల్లగది,వంటగది, భోజనాలశాల,సరుకులు దాచుకునేగది,అదే కొట్టుగది , ఆహారపదార్ధాలు దాచుకునేగది, పడకగదులు, ఇలా చాలా గదులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ ఇంట్లో పందికొక్కులు, ఎలకలున్నాయి. పందికొక్కులు, ఎలకలు అన్నిటిని తిన్నంత తిని, మిగిలినది పాడు చేస్తున్నాయని,కొంప తవ్విపోస్తున్నాయని,  యజమాని సాయంత్రానికి అన్ని గదుల తలుపులు మూయిస్తూ వచ్చాడు, కాని ఎలకలు మాత్రం చూరుల వెంబడి కదులుతూ,తలుపులు చిల్లుపెట్టి, ఒక గదినుంచి మరోగదికి నేలలో పందికొక్కులు  బొరియలుచేసి యధేచ్చగా అన్నిటిని పాడు చేస్తూనే ఉన్నాయి. పడకగదులుల్లో కూడా ఎలకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  యజమాని బాధపడుతూనే ఉన్నాడు.  ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. కాని తలుపులు మూసి ఉండటంతో ఎలుకలు చిక్కడం కష్టమయింది,పిల్లికి.  యజమాని, కుటుంబ సభ్యులు విసిగిపోయారు, రాత్రులు తలుపులు మూయడం మానేశారు, దాంతో పిల్లికి వీలు చిక్కి దొరికిన పందికొక్కును, ఎలుకను దొరికినట్టు స్వాహా చేస్తూ వచ్చింది. చూసిన యజమానికి చేసిన పని బాగున్నట్టనిపించింది. ఎలుకలకి కొంత స్వేఛ్ఛ తగ్గింది, దీనితో ఎలుకలన్నీ కటకట పడ్డాయి. ముసలి ఎలుకలు, ముసలి పందికొక్కు అధ్యక్షతన  ఒక సభ చేయాలని, పిల్లి నుంచి ఎలుకలకు కలిగే నష్టాన్ని లేకుండా చేసుకోవాలని  తీర్మానించుకున్నాయి. ఆ సభకు ముసలి పందికొక్కును అధ్యక్షునిగా చేసుకుని సభ తీర్చి ఏమి చేయాలనేది ఆలోచించాలని, అనుకున్నాయి. 

 నేడు,రేపు అంటూనే సభ వాయిదా పడుతూ వచ్చింది. చివరికో రోజు సభ తీరాయి. ముసలిపందికొక్కు అధ్యక్షతన. అధ్యక్షులవారు స్వాగతోపన్యాసం ఇస్తూ జరుగుతున్నది చాలా అన్యాయం, దీన్ని ఎదుర్కోవలసిందే! అని శలవిచ్చి,పందికొక్కులు త్యాగాలు చేసినవని, అన్యాయాలను ఎదుర్కొని పోరాడినవని, మాది త్యాగధనుల వంశమని పొగుడుకుని, మిగతావారికి సావకాశం ఇచ్చారు.  యువ ఎలుకలు,  ఆవేశంగా ఉపన్యాసాలిచ్చాయి. యువ ఎలుకలు పందికొక్కులే త్యాగధనులు కాదు, మా వంశాలలలోనూ త్యాగధనులున్నారు, పోరాడుతూ ప్రాణాలూ పోగొట్టుకున్నవారున్నారు, ఇలా విడతీసి మాట్లాడటం అధ్యక్షులవారికి తగనిపని అన్నాయి. దానికి పందికొక్కులు ఉన్నమాట చెప్పేరు అధ్యక్షులవారు,వారి వంశం త్యాగధనుల వంశం అని వంత పాడేయి. దీనికి ఎలుకలు కినిశాయి. మమ్మల్ని కించపరచడానికే సభ చేసినట్టుందని పందికొక్కులు బయటకి పోతామని బెదిరించాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక సమస్య చర్చించాలిగాని ఇలా పక్కదోవ పట్టించకండని సుతి మెత్తగా అందరిని మందలిస్తే ఆవేశాలు చల్లారాయి. 


 పిల్లిని కట్టడి చేయాలి, మన వంశాలు నాశనం కాకుండా చూడాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ లోగా పిల్లి సడి పసికట్టిందో ఎలక, పక్కదానిని హెచ్చరించింది, అది మరోదాన్ని హెచ్చరించడంతో ఎలకలన్నీ సభ వదలి పారిపోయాయి. మళ్ళీ సభ చేయాలని అనుకున్నాయి. ఆవేశంగా ఉపన్యాసాలివ్వడం కాదు ఏమి చేయాలన్నిది సూచనలు చేయాలని అనుకున్నాయి. వాయిదా పడుతూ పడుతూ సభ జరిగింది మరోరోజు. ముసలి పందికొక్కును అధ్యక్షత వహించమన్నాయి, ఎలుకలు, దానికి ము.ప నాకా వయసు చెల్లింది, నా స్థానంలో నా వంశం వారిని అధ్యక్షులుగా చేసుకుని సభ చేయమని సలహా చెప్పింది. దానికి కొన్ని ఎలుకలు వ్యతిరేకించాయి, మరికొన్ని మద్దతు పలికాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక ఇదంతా వ్యర్థం, అది పిల్లి, దొరికితే నోట కరుచుకుపోతుంది, సభ చాలించి ప్రాణ రక్షణ చూసుకోండని, సలహా ఇచ్చింది. దానికో పందికొక్కు,ఇది పిల్లి పక్షం మాటాడుతోంది, పిల్లి దీనికేమైనా ఎర చూపిందేమో అన్నాయి పందికొక్కులు. దానికి ఎలకలు ఉన్నమాట చెప్పినదానికి అంత ఉలుకెందుకని నిలదీశాయి. ముసలి ఎలక మాటాడుతూ అది పిల్లి, ఎవరినైనా నోట కరుచుకుపోతుంది, ఉన్నమాట చెప్పి చెడ్డయ్యాను,   నాకెందుకొచ్చిన గోలంటూ, సభ వదలిపోయింది.   ఒక యువ ఎలుక పిల్లి చప్పుడు చేయక వచ్చి మనమీద దాడి చేస్తోంది కనక, పిల్లి వస్తున్నట్టు తెలియాలంటే మెడలో గంట కడితే సరికదా అని సలహా ఇచ్చింది. దీనికి సభలో వారంతా భేష్! భేషని చంకలు గుద్దుకున్నారు. ఇంతలో పిల్లి వస్తున్న సడి వినపడింది, ఎలకలు,పందికొక్కులు పరిగెట్టేయి. 

( సశేషం )


15, సెప్టెంబర్ 2022, గురువారం

గాడిద మాలక్ష్మికీ జై

గాడిద మాలక్ష్మికీ జై   

వ్యాధి నిరోధక శక్తి అనేది బజారులో కొనుక్కుంటే దొరికేది కాదు. దీనికోసం మనవారు చాలా ప్రయత్నాలే చేశారు, అందులో కొన్ని, దొండాకుపసరు తాగించడం, వసపోయడం, తిప్పతీగనుంచి తిప్పసత్తు తయారు చేసుకువాడటం, గాడిదపాలు తాగటం, ఒంటెపాలు తాగటం ఇలా చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక టపారాస్తూ గాడిద పాల వ్యాపారం లాభసాటి అన్నాను.అది నిజమని నిరూపించబడింది. చూడండి. 

https://kastephale.wordpress.com/2016/02/27/


శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం  తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో,  మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!


12, సెప్టెంబర్ 2022, సోమవారం

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)


కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో,కృపాచార్యునితో, దుర్యోధనుడు, కర్ణుని గురించి మాటాడుతూ చెప్పిన మాట. 


కులము గలవాడు శౌర్యము గలవాడును నధికసేన గలవాడును భూ

తలమున రాజనునామము విలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్

ఆంధ్ర మహాభారతం,ఆది పర్వం షష్ఠాశ్వాసం, 46


కులములో పుట్టినవాడు, శౌర్యం ఉన్నవాడు, అధికమైన సేన కలవాడు, ప్రపంచంలో రాజని పిలవబడతాడు.


 మారాజా! మా మంచిమాట సెలవిచ్చావయ్యా!! నాటి కాలం మాట దేవుడెరుగుగాని, నేటి కాలానికి తమరు చెప్పిన మాట అచ్చరాలా నిజం బాబయ్యా! 


కులంలో పుట్టినవాణ్ణి ఎలాగా రాజనే పిలుస్తారు, కాని రాజకుమారుడే రాజవుతాడు. శౌర్యముకలవాడు అంటే, రక్షకుడు, ధైర్యవంతుడు,వీరుడు అని అర్ధాలు చెప్పటం లేదు దొరా! నాటికాలానికి పెక్కుమందిని రక్షించగలవాడినే వీరుడు,శౌర్యవంతుడనేవారు. నేటి కాలానికి ఎంత ఎక్కువ మందిని భయపెట్ట గలవాడినే రాజు కాదుగాని నాయకుడని అనేస్తున్నారు. తమరు చెప్పినట్టు ఇక్కడ కులంతో పనిలేదు దొరా! భయపెట్టడం అంటే మామూలుగా కాదు దొరా! చంపడం దగ్గర నుంచి, చంపుతానని, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని, లేదా నీ పెళ్ళాన్నే ఎత్తుకుపోతానని, లేదూ నీ ఎదురుగానే నీ కూతురునీ,పెళ్ళాన్నీ మానభంగం చేస్తానని, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నావని పట్టిస్తానని, ఇలా రకరకాలుగా భయపెట్టి, చేయగలవాడినే మేము నాయకుడని పిలుస్తున్నాం దొరా!! వాడు ఎవరికి చెబితే వాడికే ఓటు వేస్తున్నాం, ఇదేగా మరి జరుగుతున్నది దొరా!!!


అధిక సేనగలవాడు రాజంటారన్నారు తమరు. దేవరా!! సేన ఊరికే వస్తుందా? సొమ్ము లేనిది సేనెక్కడినుంచి వస్తుంది దేవరా!! నిజం దొరా! నేడు ప్రపంచంలో ఎక్కువ సేన, గొప్పగొప్ప, కొత్తకొత్త,మారణాయుధాలు ఎక్కువ ఉన్నదేశనాయుకుడే నేడు ప్రపంచ పోలీసు దొరా!!! ఆ దేశం పేరు చెప్పి  నాయకుడు ఏదైనా చేస్తాడు దేవరా!! 

 మాది ప్రజాస్వామ్యం, మాకు రాజులుండరు అన్న దేశాలవారి నాయకులు, ఇతరదేశాలవారిని అనేకరకాలుగా అణచేస్తున్నారు దొరా! 

ఇక ప్రజాస్వామ్యం కాదు, మాది సోషలిజం అంటున్న దేశాలూ అదే పని చేస్తున్నాయి దొరా! 

మరికొన్ని ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం వెళ్ళబోస్తున్నాయి. ప్రపంచంలో మంచి,మంచివన్నీ ఎత్తుకొచ్చి, తెచ్చినవన్నీ బహిరంగంగా సిగ్గులేక ప్రదర్శిస్తూనూ ఉన్నాయి. ఈ పెద్ద దేశాలని చెప్పుకుంటున్నవారొక సంస్థను ఏర్పాటు చేసి, వారు చెప్పినదే వేదమని, నిరంకుశత్వం చేస్తూ దాన్ని ప్రజాస్వామ్యం అని నమ్మమంటున్నాయి దొరా! ఇటువంటి దేశాల వారే రాజులుగా చెలామణీ అవుతున్నారు దేవరా!! తమమాట నిలబెట్టేరు దొరా!!!


ఇంతకీ సొమ్మున్నవాడే రాజంటారు, అంతేగా దేవరా!!!


10, సెప్టెంబర్ 2022, శనివారం

తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!

  తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!



పార్టీ అధికారంలో ఉన్నపుడు-నాయకులు


ఎప్పుడు సంపద గల్గిన

యప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెరువు నిండిన

గప్పలు పది వేలు చేరు గదరా సుమతీ!

సంపదలు కలిగినప్పుడు అందరూ బంధువులే, ఎక్కడెక్కడినించీ పుట్టుకొచ్చేస్తారు, ఎలా? చెఱువు నిండితే,నీటితో, కప్పలు పదివేలు చేరాతాయన్నట్టు.


పార్టీ వదిలేసిన నాయకులు 


కమలములు నీటబాసిన

కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్

 మతమ నెలవులు దప్పిన

తమమిత్రులె శత్రులగుట  తథ్యము  సుమతీ

కమలం నీటిలో ఉన్నంతకాలం నవనవలాడుతూ ఉంటుంది. అదే కమలాన్ని నీటిలోంచి తీసేసి బయట పడేస్తే వాడిపోతుంది, ఎందుకు? కమలాక్షుని రస్మిసోకి, అంటే సూర్యుని కాంతికి వాడిపోతుంది. అలాగే ఎవరి స్థానాలలో వారున్నంత కాలం సవ్యంగానే ఉంటుందంతా, కాని తమతమ నెలవులు దప్పిన మిత్రులే శత్రువులైపోతారోయ్! 


అధిష్టానం-పార్టీ వదిలేసిన నాయకులు


కూరిమిగలదినములలో

నేరములెన్నడుడును గలుగ నేరవు మరి యా

 కూరిమి విరసంబైనను

నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!

స్నేహం కలిగినన్నాళ్ళు తప్పులేం కనపడవు,కాని ఈ స్నేహం కనక చెడితే అన్నీ తప్పులే కనపడుతూ ఉంటాయ్! జాగర్తా!!! 


గొడ్డు గోతిలో తలో బెడ్డా వేసేరని.


గొడ్డు చాలా బలమైనది, అవసరం లేకపోయినా ఒక నమస్కారం పెట్టి తప్పుకున్నారు, అది బయట ఉన్నకాలంలో తప్పుకు తిరిగేరు. కాని అది కాలవశాన గోతిలో పడింది, ఇక అందరూ వీరులే,అందరూ తలో బెడ్డా విసిరేవారే!!! 


లోకంబాబూ!!! లోకం!!!


7, సెప్టెంబర్ 2022, బుధవారం

ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.





ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.


 బాల భాస్కరుడు




ఉదయమే నిద్ర లేచి మంచం దిగే ముందు పడకమీదనుంచే సెల్ ఫోన్ మొహం చూసిగాని మంచందిగటం లేదెవరూ! నేటి కాలంలో, కాని, కొంతమంది ఇంకా ఈ శ్లోకాలు పఠించి చివరి శ్లోకంతో మంచం దిగుతూ భూమికి నమస్కరించే వారున్నారు, అరుదుగా! 
అసలీ శ్లోకాలేంటి? వాటి అర్ధ పరమార్ధాలేంటీ?


గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః

గురువు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్తు దేవుడు, అటువంటి గురువుకు నమస్కారం.

ఆపదామపహర్తారం
దా తారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

ఆపదలనుంచి కాచేవాడు, సంపదలిచ్చేవాడు,ఎల్లరచే కొనియాడబడేవాడైన రామునకు మరల, మరల నమస్కారం.

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనం

చేతి చివర లక్ష్మి,మధ్య సరస్వతి, చెయి మొదట గోవిందుడు ఆవాసం చేస్తున్న చేతిని చూస్తున్నానని,అంటూ కనులు తెరచి,అరచేతుల్ని చూచి కనులకద్దుకుంటాం.

సముద్రే వసనే దేవీ
పర్వతే స్తనమండలే
విష్ణుపత్నీనమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వ మే

సముద్రంలో తేలియాడుతున్న దేవత, పర్వతాలే స్తనమండలాలుగా ఉన్న విష్ణుపత్నియైన భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను క్షమించు.
అంటూ కాలు భూమి మీద పెడతాం. 


జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు బ్రహ్మ స్వరూపం, చిటికినవేలు పట్టి నడిస్తే లోకాన్ని చూపించిన గురువు తండ్రి విష్ణు స్వరూపం, అజ్ఞానాంధకారాన్ని జ్ఞానమనే వెలుతురుతో పాలద్రోలిన గురువు మహేశ్వర స్వరూపం. ఆ తదుపరి గురువే దైవ స్వరూపం అని నొక్కి వక్కాణించారు,అనగా తల్లి,తండ్రి, గురువులే దైవ స్వరూపాలని చెప్పేరు, గురు సాక్షత్ పరబ్రహ్మ అంటూ.అటువంటి గురువులైన తల్లి,తండ్రులకు, గురువుకు దైవానికి నమస్కారం. 
ఆతదుపరి

రామో విగ్రహవాన్ ధర్మః ఇది మారీచునిమాట, రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షతిః రక్షితః, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. అటువంటి ధర్మానికి మరల,మరల నమస్కారం,అంటే ధర్మాన్ని ఆచరిస్తానని ప్రతిన, ధర్మం రక్షిస్తుందని నమ్మకం. ధర్మానికి నమస్కారం.



చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారు. గోవిందా అంటే నారాయణి,  నారాయణి,నారాయణులకు అభేధం, అక్కడ గోవిందా అంటే పార్వతి, లలితాదేవి స్వరూపం. లలితా దేవికి మరో పేరు ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణీ అంటారు. ఈ మూడు రూపాలూ బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల శక్తి రూపాలు. సర్వమూ నా చేతిలో ఉంది, నా ప్రయత్నంతో సర్వమూ సమకూడుతుందనే నమ్మిక,ప్రతిన. నా ప్రయత్నానికి దైవ శక్తి తోడవాలి,తోడవుతుందని కనులు తెరచి అరచేతులను చూచి కళ్ళకద్దుకుంటాం, ఇది స్వశక్తి మీద నమ్మకం కలగజేసుకోవడం.

సముద్రంలో నివసించే దేవీ, పర్వతాలే స్తనాలుగా కలిగిన, విష్ణుశక్తి స్వరూపిణి భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను,క్షమించమని వేడటం. 

సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, "సర్వం విష్ణుమయం జగత్", విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం.  



1, సెప్టెంబర్ 2022, గురువారం

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)


భయపడి వరాలిచ్చాడు.

ఎవరికి భయపడ్డాడు?

ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి.

ఎవరువారు?

1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి.

ఎందుకుభయపడ్డాడు

గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె ’జయోస్తు’ ని దీవించలేదు, ’యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. 


గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   


ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!.... ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు

కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.


ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! 

 స్వస్తి.



29, ఆగస్టు 2022, సోమవారం

మళ్ళీ జూదం (అనుద్యూతం)

మళ్ళీ జూదం (అనుద్యూతం)

అంధ్రమహాభారతం,సభాపర్వం,ద్వితీయాశ్వాసం 270 నుండి 279 వరకు స్వేఛ్ఛానువాదం.


 జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ధర్మరాజుకి,కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పి, వారి రాజ్యం వారికిచ్చి పంపించాడు. వారంతా ఇంద్రప్రస్థం వెళ్ళారు. 


"ఇక్కడ జరిగిన సంగతంతా దుశ్శాసనుడు అన్న దుర్యోధనుని చెవిని వేశాడు. దుర్యోధనుడు, కర్ణ, శకుని,సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి,ఎంతమంచి చేసినా పాండవులకు ప్రీకరమైనవాళ్ళమవుతామా? పగపట్టిన పాముని మెడలో వేసుకున్నట్టయింది, పొరపాటు చేసేసేం.బలవంతులైన అర్జున,భీమ, నకుల సహదేవులను యుద్ధంలో గెలవగలమా? అంచేత మళ్ళీ వాళ్ళని ద్యూతం లో ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టడం చేయవలసిన పనని ధృతరాష్ట్రుని చెప్పగా ఒప్పుకుని మళ్ళీ జూదానికి రమ్మని ప్రాతికామిని పంపించాడు. ప్రాతికామి చెప్పినకబురుతో ధర్మరాజు, అనుజ,భార్యా సహితుడై హస్తిన చేరాడు, తండ్రి మాట జవదాటలేనని, మిత్రులు ప్రజలు గోలపెడుతున్నా!. ఇదివరలాగే అదే సభాభవనంలో ఆసీనులుకాగా, శకుని ధర్మరాజుతో సంపదలు రాజ్యము మీకు ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇచ్చేడు, కనక వాటిని పందెంగా ఒడ్డి అడటం కుదరదు.ఇప్పుడు నేను చెప్పే పందెం అపూర్వం. ఇందులో ఓడినవారు నారచీరలుగట్టి,బ్రహ్మచర్యంతో, కందమూలఫలాలు తింటూ, పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి, పదమూడో ఏట జనపదంలో అజ్ఞాతవాసమూ చెయ్యాలి. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసమూ, ఆపై అజ్ఞాతవాసమూ చెయ్యాలి. ఇందుకు ఇష్టపడితే జూదమాడదామన్నాడు. ధర్మారజు పందెం ఒడ్డేడు, ఓడిపోయాడు. అన్నట్టుగానే నారచీరలుగట్టి వనవాసానికి పోయారు."  

కొద్దికాలం కితం జూదం జరిగినదానికి, కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పిన ధృతరాష్ట్రుడు, మళ్ళీ జూదానికెందుకొప్పుకున్నట్టు?


కొడుకు మొహమాటం లేకుండానే చెప్పేసేడు, వాళ్ళు బలవంతులు, యుద్ధం చేసి నెగ్గలేం. ఎలాగైనా వాళ్ళని రాజ్యం నుంచి బయటకి తోలెయ్యడమే కావలసింది, అనికూడా చెప్పేసేడు. ధృతరాష్ట్రునికి కావలసింది కూడా పాండవులు బయటికిపోవడమే! కాని అది తను చేస్తున్నట్టు ఉండకూడదు, అదీ ఉద్దేశం. మూలకారణం ధృతరాష్ట్రుడే! 

కితం సారి జూదం జరిగినపుడు సభంతా కలగుండుపడింది, నాడు జరిగిన విషయాలన్నీ అందరికి బాధ కలిగించాయి. గాంధారి అగ్నిపర్వతంలా ఉంది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేనట్టు ఉంది. ఇక ద్రౌపది బద్దలైన అగ్ని పర్వతమే, వాళ్ళని చల్లార్చకపోతే నాడు కురుక్షేత్రం అక్కడే జరిగుండేది. అందుకు వరాలిచ్చి బులిబుచ్చి మాటలు చెప్పి వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కొడుకు చెప్పిన పథకం నచ్చింది. ఇందులో రాజ్య ప్రసక్తిగాని, స్త్రీలను అవమానించే ప్రసక్తిగాని లేదు. పదమూడేళ్ళ తర్వాత ఏమగునో? ఎవరి కెరుక? అదేగాక అజ్ఞాతంలో దొరికితే మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చెయ్యాలి, పథకం బాగా నచ్చింది, ధృతరాష్ట్రునికి, అందుకే మళ్ళీ కబురు పెట్టేడు. ధర్మరాజుకి బుద్ధి లేదా? ఆయనదొకటే మాట తండ్రి చెప్పేడు, అంతే!


27, ఆగస్టు 2022, శనివారం

ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.

 ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.


జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. 

మహాభారతం, కవిత్రయ ప్రణీతం, సభాపర్వం,ద్వితీయాశ్వాసం 264నుండి 267 వరకు.


"అనిన ధృతరాష్ట్రుండు కోడలిగుణంబుకు ధర్మంబెరుగుటకు సంతసిల్లి యనుజ సహితంబుగా యుధిష్ఠరు రావించి నీవు సర్వసంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖంబుండుము నీకు లగ్గయ్యెడు మని వెండియు.......264


నీవు నిత్యము వృద్ధోపసేవజేసి యెరుగు దెల్లధర్మంబుల నెరుక లేక

కడగి నీ కెగ్గు సేసె నాకొడుకు దీని మఱచునది నీకు నొండ్లు గఱపనేల...265


మనమున వేరమి దలపమియును సక్షమచిత్తుడగుటయును గుణంబులుకై

కొని దోషంబులు విడుచుటయును నుత్తముడయిన పురుషునుత్తమగుణముల్....266


యేను బుద్ధిలేక జూదంబుపేక్షించితి. నల్పబుద్ధిసత్వుం డయిన నన్నును మీతల్లి యయిన గాంధారినిం దలచి,దుర్యోధనాదులు సేసినదుర్నయంబులు సేకొనకుండునది. సర్వశాస్త్ర విదుండయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండువుగా నిక్కురుకులంబునకు లగ్గగునని ధర్మరాజు బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన...267"


//నీ సంపదలు,స్వరాజ్యం తీసుకుని ఇంద్రప్రస్థం వెళ్ళి సుఖంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది.నీవు పెద్దవాళ్ళని సేవించడం మూలంగా ధర్మాలన్నీ తెలుసు, నాకొడుకు ధర్మం తెలియక నీకు కీడు చేసేడు, దీన్ని మరచిపో! అన్నీ తెలిసినవాడివి నీకు మరొకరు చెప్పాలా! మనసులో వేరుగా తలపకపోవడం, క్షమాచిత్తం కలిగి ఉండడం, మంచిని తీసుకుని చెడును వదలిపెట్టడం ఉత్తములైనవారి ఉత్తమగుణాలు.

నేను బుద్ధిలేక జూదాన్ని తేలికగా, అశ్రద్ధగా,తీసుకున్నాను. నిర్లక్ష్యం చేశాను.  అల్పబుద్ధి కలిగిన నన్నూ మీతల్లి గాంధారిని తలచి, దుర్యోధనాదులు చేసిన చెడ్డపనులు మనసుకు తీసుకోకు. సర్వశాస్రాలూ తెలిసిన విదురుడు మంత్రిగా నీవు రక్షకుడవుగా ఉంటే ఈ కురుకులానికి మంచి జరుగుతుందని చెప్పి ధర్మరాజుకు పాండురాజు రాజ్యం సమర్పించాడు. //


నాకు బుద్ధిలేకపోయిందయ్యా! నాకు బుద్ధి లేకపోయి జూదాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేశాను. స్వార్ధబుద్ధి కల నన్నూ మీ తల్లి గాంధారి ముఖాలు చూసి నాకొడుకు వాని అనుచరులు మీ పట్ల చేసిన చెడ్డపనులు మరిచిపో, క్షమించు. 

26, ఆగస్టు 2022, శుక్రవారం

నమస్కారం



 నమస్కారం


బ్లాగులో రాయడం అన్నది ఒక వ్యసనమైపోయింది, నాకు, కాని బ్లాగు రాయడం కూడా ఒక కళే! కలకాదు సుమా! :) 


కాదు సుమా! కలకాదు సుమా!! అమృతపానమున అమరగానమును, గగనయానమును కల్గినట్లుగా గాలినితేలుచు  సోలిపోవుటిది, 

కాదు సుమా! కలకాదు సుమా!! 


 బ్లాగు మొదలుపెట్టి పదకొండేళ్ళవుతోంది. ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుభవిస్తూ వాటిని బ్లాగులో పంచుకోవడం అలవాటయిపోయింది. ఈ అలవాటు ఎప్పుడు తప్పుతుందో తెలియటం లేదు. నేనా సహస్రచంద్ర దర్శనానికి దగ్గరలో ఉన్నాను, శని ప్రస్తుతం మకరం లో ఉన్నారు, శని మేషం లోకి వచ్చేదాకా ఇది కొనసాగగలదని అనుకుంటున్నాను :). 

దీనికి తోడు కవిని కూడా (కవి,కనపడదు, వినపడదు)ఇప్పుడు మాటాడాలంటే ఎవరు ఉంటారు?ఉన్నన్నాళ్ళూ ఇల్లాలు వినేది, నాలుగేళ్ళయింది, దాటిపోయి.  నా చెవిటి గోల వినడానికి ఎవరు ఉంటారు  ? ఎవరిగోల వారిది కదా! అందుకు వాటిని బ్లాగులో ఒలకబోసుకోవడం. :) బ్లాగులో రాసేవి ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించినవి కావు. నాకెవరి మీద కోపం, కసి,ద్వేషం లేవు, రావు కూడా! మౌనేన కలహో నాస్తి అని నమ్మినవాడిని. చదువుకోనివాడిని, పల్లెటూరివాడిని, మా పల్లెటూరి మాటలు సున్నితంగా ఉండవు, కొంచం మోటు కూడా!. డిగ్రీలు లేవు, యూనివర్సిటీలు ఎరగను, కాలేజి మెట్లే ఎక్కనివాడిని యూనివర్సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం కదా! చిన్నప్పుడు బట్టీ వేసిన కొన్ని శతకాలు మాత్రం అస్తిగతాలు. అవే బయటపడుతుంటాయి.  మనసులో బాధ, సంతోష వ్యక్తం చేయడమే! ఎవరేనా కొన్నిమాటలు గాని, కొన్ని టపాలుగాని తమను ఉద్దేశించినవి అని అనుకుంటే అసహాయుడను.

నమస్కారం.


 ఆగండి! ఆగండి!! ఎవరో ఏదో అన్నారని, అనుకున్నారని బ్లాగులో రాయడం మాత్రం మానలేను, లేను,లేను.   


మరోసారి నమస్కారం పెట్టను ఎందుకో చెప్పండి :)

25, ఆగస్టు 2022, గురువారం

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

 ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?


ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264 వరకు స్వేఛ్ఛానువాదం


ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. 


ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు,దుర్యోధనుడు. 

దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృద్ధులు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. 


దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే!  నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు.

ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. 


విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి

’నా కోడళ్ళంద’రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. 


నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు. ధర్మరాజా! నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,  ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు.


 ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి...



23, ఆగస్టు 2022, మంగళవారం

రుచి చేకురునటయ్య భాస్కరా!

 రుచి చేకురునటయ్య భాస్కరా!


కొంతమందితో మాటాడకపోవడం తప్పు. మరికొంతమందితో మాటాడటమూ తప్పే. ఎవరితో మాటాడాలి ఎంతవరకు మాటాడాలి, ఎలా మాటాడాలి అన్నదే వివేకం. దానినే భాస్కరశతకంలో ఇలా చెప్పేడు,శతకకారుడు. 


చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము జేసినయైన యందు ఇం  

 పొదవెడునుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా!


ఎంతచదువు చదివినా మాటాడకూడని చోట మాటాడటం మాటాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పే! ఇది తెలుసుకోవడమే రుచి కలిగించే ఉప్పులాటి రసజ్ఞత.


ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని 

హీనుడవగుణంబు మాన్చలేడు

బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు 

విశ్వదాభిరామ వినుర వేమ


పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదు.పాముకి పాలు పోసిపెంచినా విషమే కక్కుతుంది. ఇది తెలుసుకోవడం విజ్ఞత.


ఎంత విజ్ఞానం ఉండి ఆచరణలేని విజ్ఞానం నిష్పలం, ఉపయోగంలో లేని విజ్ఞానం అడవికాచిన వెన్నెల.


21, ఆగస్టు 2022, ఆదివారం

వాక్స్వాతంత్ర్యం

 వాక్స్వాతంత్ర్యం


ఏంటో! 

వాక్స్వాతంత్ర్యం,ఈ మాట రాయడమే ఇంత కష్టంగా ఉందే!ఈ హక్కును నిలుపుకోడం ఎంత కష్టమో కదా! 


ఈ హక్కు గురించి మాటాడేవారంతా, వారేమైనా అనచ్చు, కాని ఎదుటివారు ఏమీ అనకూడదు, ఇదీ వారి వాక్స్వాతంత్ర్యం. సుప్రీం కోర్టువారేమో, ప్రతి స్వాతంత్ర్యానికి హద్దుంటుంది, అదేముద్దు అంటారు.సుప్రీం కోర్టు లెక్కా :) సుప్రీం కోర్టు నే ఏమైనా అంటాం అంటున్నారు.   


ముఫై ఎకరాల మా కాలేజి కాంపౌండ్ రోజంతా పెళ్ళివారిల్లులాగే ఉంటుంది. ఉదయం నాలుక్కి నడిచేందుకొచ్చేవాళ్ళతో ప్రారంభం, నడిచేవాళ్ళు,యోగా చేసేవాళ్ళు, ఇండోర్ లో టెన్నిస్ అడేవాళ్ళు, ఇలా రకరకాలుగా మొత్తం దగ్గరగా రెండొందలమంది ఉంటారు,ఉదయం. 

పున్నమినాడు అస్తమిస్తున్న చంద్రుడు  


 ఇలా నడుస్తుంటారు, జట్లు,జట్లుగా  


ఉదయం నా కార్య స్థానం, అప్పటికే యోగా చేస్తున్న మిత్రుడు.  



యోగా క్లాస్  


 నాది తక్కువ అంచనా!! మాకో కల్బ్ ఉంది దానిపేరు జి.బి.ఆర్ వాకర్స్ క్లబ్, దీనికి అనుబంధంగానే మిగిలిన సబ్ క్లబ్బులన్నీ, అవే యోగా క్లబ్,టెన్నిస్ క్లబ్. ఎనిమిది దాటితే వీళ్ళెవరూ ఉండరు. పిల్లలొచ్చేస్తారు. సాయంతరం నాలుగు దాటిన తరవాత పిల్లలంతా వెళ్ళిపోతారు. ప్పుడు స్త్రీలు ఎక్కువా, పురుషులు తక్కువా, ముసలాళ్ళు ఉదయం సాయంత్రం సమానంగా ఉంటూంటారు,నడకకి.   


వీళ్ళూ మరో మూడువందల మందిదాకా ఉంటారు,అదిన్నూ రాత్రి ఎనిమిది దాకా. కేంపస్ అంతకీ లైటింగ్ ఉంటుంది,ఉదయం నాలుగునుంచి ఆరు, సాయంత్రం ఆరునుంచి ఎనిమిది.మా ఊళ్ళో మూడు వాకింగ్ ట్రేక్ లు ఉన్నాయి. మాదే మొదటిదిన్నూ! రెండోది పక్క హైస్కూల్ గ్రవుండ్లో, మూడోది రైల్ ఫైఓవర్ కి అప్రోచ్ రోడ్ కింద, ట్రేక్ అవతల. నాలుగోది రైల్వే ప్లాట్ఫారం.ఇన్ని చోట్ల చాలమంది నడుస్తూనే ఉంటారు,రోజూ, ఉదయం,సాయంత్రం.   


నేను వేసవి,వర్షకాలాలలో ఉదయమూ, శీతకాలంలో సాయంత్రమూ నడవడానికి వెళతాను. చాలామందికి నా పేరు తెలియకపోయినా నన్ను ఎరుగుదురు,పాతికేళ్ళ దగ్గర సమయంలో ఆ వాకర్స్ క్లబ్ స్థాపకుల్లో నేనూ ఒకడిని.  కవిని కూడా కదా! :) కర్ర పుచ్చుకు తిరుగుతుంటాను, అందుకు అందరికి ఎరుకే! :) నేనెవరితోనూ మాటాడగా ఎవరూ చూసి ఉండరు ఆ కేంపస్ లో! :)

మామూలు రోజుల్లో ఎక్కడవాళ్ళు అక్కడ, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వర్షం వస్తే మటుకు అందరూ చాలా పొడుగైన మా వరండాలని ఆక్రమించేస్తారు :) ఈ వరండాలో ఒక యువకుడు యోగా చేస్తాడు, రోజూ, ఎండవానలు వేటిని లెక్క చేయక, మరొకరు కూడా ఆయనతో ఉంటారు, కాని చెప్పలేం. ఇక నేను నా కోటా నడక తరవాత ఈ వరండాలో యువకుని పక్క చేరి ప్రాణాయామం చేస్తాను, ఒక అరగంటపాటు. అలుకు తీర్చుకోడానికి కొంతమంది ఈ వరండా మీద కూచుంటుంటారు, అది అలవాటు.  


ఇలా జరుగుతుండగా,నిన్న ఉదయం నా పక్క యోగాసనాలు వేస్తున్న మిత్రుడు నా దగ్గరకొచ్చి,మీరు టెలిఫోన్ లో పని చేశారు కదా! పని చేయకుండా జీతాలు తీసుకున్నారని తిడుతున్నాడని అక్కడే  అలుకు తీర్చుకోడానికి కూచున్న యువకుడిని చూపించాడు.


ఒక క్షణం విస్తుపోయా! తేరుకుని మాటాడటం మొదలెట్టా! నేనెప్పుడూ మాటాడగా చూడని చుట్టు పక్కలవారంతా కూడిపోయారు. నిన్న మొన్నలో, మనం స్వాతంత్ర్య అమృతోత్సవం జరుపుకున్నాం కదా! మనకు పెద్దలు     సంపాదించి పెట్టిన స్వాతంత్ర్య హక్కుల్లో వాక్స్వాతంత్ర్యం ఒకటి. అతనలా తిట్టుకుంటున్నాడా? కాదనే హక్కు మనకు లేదు,తిట్టుకోమను, అడ్డుపడకు. అతనికో సలహా చెప్పు అతనితో పాటుగా మనల్ని తిట్టడానికి మరో పది మందిని కూలీకి నియమించుకోమను,తిట్టడానికి, మరెక్కడో వద్దు, ఇక్కడే ఎదురుగా తిట్టించమను, మన గ్రవుండ్ లో ఉన్నవాళ్ళందరిని పిలుద్దాం! తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని చెప్పు. ఆ తరవాత మాట, తిట్టిన ప్రతి తిట్టుకు ఒక రూపాయి ఇమ్మను! అంత చెయ్యలేడా పోనీ మొత్తానికి ఒక రూపాయి నా చేతులో పెట్టమను, అదీ చేయలేడా సరే! ఒక నమస్కారం పెడదాం, ఏమంటావు? అని ఊరుకున్నా! 


ఇది విన్నవాళ్ళంతా ఒక్క సారి గొల్లు మన్నారు.కార్యక్రమం ఎప్పుడో చెబితే తీరుబడి చేసుకుంటా 

 టైమయింది వస్తానూ అని తువ్వాలు దులుపుకుని భుజాన వేసుకుని ఎలబారేను :)

ఇదండీ! మన వాక్స్వాతంత్ర్యం సంగతి  


19, ఆగస్టు 2022, శుక్రవారం

పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?

 

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.


https://kasthephali.blogspot.com/2022/08/blog-post_6.html


పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?


ఈ కొచ్చనుకి సమాధానం ఎవరేనా చెబుతారేమోనని ఎదురు చూశా, ఇంక నేనే నాకు తోచినది చెప్పక తప్పలేదు.


అదేమో పాతకాలపుపల్లె. పూరి గుడిసెలన్నీ పడిపోయి ఉన్నాయి.నష్టం జరగని ఇల్లు కనపడలేదు. తన ఇంట విలువైనవన్నీ పాడయ్యాయి, రాత్రి ఉడకేసుకోడానికి బియ్యమూ లేవు, పిండీలేదు. పిడకలగూడు తడిసిపోయి పనికిరాకపోయింది, ఎండు కట్టెలాచూద్దామంటే ఎక్కడాలేవు ఊరు మొత్తం మీద. పడిపోయిన ఇంట వెతికితే కూడు వండుకోడానికి కుండ దొరకచ్చు.కూడు వండుకోడానికి ఎవరేనా బియ్యం సాయం చేయచ్చు. కొంప కూలింది కనక పొయ్యీ పనికిరాకపోయె. మూడు రాళ్ళు, వెతుక్కుంటే దొరుకుతాయి,పొయ్యి అవసరం తీరిపోతుంది. మరి పొయ్యి కిందకి  ఎండుకట్టెలు దొరకవు, పోనీ పిడకలంటే పిడకలగూడు పోయె, ఎవరినైనా అడుగుదామంటే, ఏమైనా ఇస్తారుగాని పిడకలు ఇవ్వరెవరూ అందునా ఇలా గాలివాన సమయంలో, కావాలంటే ఓ ముద్ద కూడు పెడతారు.  


అయ్యో! కడవలే!!కణ్ణా!!!ఎంత కష్టం తెచ్చిపెట్టేవు పిడకలగూడు తడిపేసి, అని పిడకలగూటి కోసమే ఏడ్చింది.


ఇక ఒక నామకం పొలిటికల్ సెటైరా? అనడగి అధికారంపోయె,ఆస్థులు ఇ.డి పాలా అన్నారు. దాన్ని వివరిస్తే, నిజమేనేమో అనిపించింది. పిండి, బియ్యం లాటి విలువైనది అధికారం, అది పోయె! మరి వేల కోట్ల రూపాయల ఆస్థి పిడకలగూడు లాటిది. ఇదిపోతే? అధికారం ఎప్పుడేనా, ఎలాగైనా సంపాదించుకోవచ్చు కాని సొమ్మెవరిస్తారు.ఇన్ని వేలకోట్ల రూపాయలని ఎన్నేళ్ళలో సంపాదించేం. అధికారం సంపాదించాలంటే సొమ్ములవసరం కదా!అందుకు పిడకలగూడులాటి ఆస్థికోసం ఏడవటం సహజమేనేమో :) 

17, ఆగస్టు 2022, బుధవారం

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

 కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో  పన్నెండేళ్ళవనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.

14, ఆగస్టు 2022, ఆదివారం

స్వాతంత్ర్యం జన్మ హక్కు




స్వాతంత్ర్యం  జన్మ హక్కు.
 ఇది ముమ్మాటికి నిజం. 
హక్కుతోపాటే బాధ్యత కూడా ఉంటుంది, వెలుగు వెనకే నీడ ఉన్నట్టు. 
హక్కు గురించి మాటాడేటపుడు బాధ్యత మరచిపోరాదు. 
 

10, ఆగస్టు 2022, బుధవారం

కౘ్చలో నిప్పు పడ్డా, కోళ్ళగంపలో పిల్లి పడ్డా, కచేరిలో కాయితం పడ్డా నష్టం తప్పదు...



కోక అంటే స్త్రీలు కట్టుకునే వస్త్రం చీర, అనే అర్ధం స్థిరపడిపోయింది నేడు, కాని స్త్రీ,పురుషులు ఎవరైనా నడుముకిందనుంచి కట్టుకునే వస్త్రాన్ని కోక అనడమే పాతకాలపు అలవాటు. "కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ దొడ్వితిన్" ఇది శ్రీనాథుని మాట. స్త్రీలు, పురుషులు కోక కట్టేటప్పుడు ముందు వైపు కుచ్చెళ్ళు పెడతారు. అవి చాలా ఒత్తుగా ఉంటాయి, చాలా మడతలుంటాయి. ఒక కొంగు రెండుకాళ్ళ మధ్యనుంచి వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి వెనక దోపుతారు. దీన్నే కౘ్చ అంటారు, వాడుకలో గోచీ దోపడం అంటారు. ఒకప్పుడు ఎనిమిదిగజాల పంచలు,చీరలు ఉండేవి, అవి ఆ తరవాత ఆరుగజాలకు, ఆ తరవాత ఐదు గజాలకు కుంచించుకుపోయాయి. ఇక కచ్చ దోపడానికి వస్త్రమెక్కడ? కచ్చపోసి కోక కట్టిన ఆడదిగాని మగాడుగాని కనపట్టం లేదు. దీన్నే మడికట్టు అంటారు తమిళులు. ఈ కౘ్చలో నిప్పు పడితే, ఎక్కడ పడిందో వెతుకులాటకే ఎక్కువ సమయం పడుతుంది. నిలబడి దులుపుకున్నా, నిప్పురవ్వ ఆ మడతలలో నుంచి బయట పడ్టం తేలికకాదు.ఈ లోగా అది చేయాల్సిన నష్టం చేసేస్తుంది, అందుకు నష్టం తప్పదు. లేదా కోక, పంచ విప్పేసినా విప్పిన వాటిని కాల్చేస్తుంది, నిప్పు. అంచేత కచ్చలో నిప్పు కష్టం,నష్టం కలగజేస్తుంది.



కోళ్ళగంప


కోళ్ళగంపవేరు,కోళ్ళగూడు వేరూనూ. కోళ్ళగూడంటే  రెండడుగుల పొడవు వెడల్పు,ఎత్తులతో ఒక చిన్న కట్టడం.మూడు పక్కల పైన ఇటుకల కట్టుబడి, ఒక వైపు ఖాళీ దీనిలో పులి బోనులాగా ఒక కటకటాల తలుపు పైనుంచి తీసి కిందికి వదిలేలా. పగలు కోళ్ళు ఇంటిచుట్టు తిరిగినా రాత్రికి గూట్లోకి పెట్టేవారు. కోళ్ళు క్షేమంగా ఉండేవి. ఇక కోళ్ళగంప అనేది ఒక వెదురు బుట్టలాటిది. ఒక్కొకప్పుడు కోళ్ళను పిల్ల
తో దీనికింద పెట్టేసి వదిలేసేవారు, రాత్రులు కూడా,కొందరు. పిల్లి ఈ వెదురుబుట్టను పైకి లేపి పిల్లల్ని ఎత్తుకుపోయే సావకాశం. పిల్లిగనక ఈ కోళ్ళగంప మీదపడితే కనీసం ఒక కోడిపిల్లనైనా పట్టుకుపోతుంది. అంటే కోళ్ళగంపలో పిల్లి పడితే నష్టం తప్పదనమాట.


కచేరి అంటే కోర్టు. ఇందులో కాయితంపడటం అంటే, మనం ఎవరిమీదనో దావా చేయడం, లేదా మరొకరు మనమీద దావా చేయడమనమాట. కోర్టులో దావా నెగ్గినవాడు ఇంట్లోనూ, ఓడినవాడు వీధిలోనూ ఏడ్చారని నానుడి. నెగ్గినవాడెందుకు ఏడ్చాడు? నెగ్గినవాడు లాయర్లకి కోర్టు ఖర్చులకి, తిరుగుళ్ళకి, సాక్షులకి అయిన ఖర్చు తలుచుకు,ఇంటిలోనే  ఏడ్చాడు. ఓడిన వాడు వీటన్నిటితో కేసూ పోయిందని భోరున కోర్టులోనే ఏడ్చాడు. అందుకే కచేరిలో కాయితం పడితే నష్టమనమాట స్థిరపడిపోయింది.  




6, ఆగస్టు 2022, శనివారం

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.



"పిండీ, బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచిందనేది" ఒక నానుడి. పిండి, బియ్యం అనేవి ఆహారపదార్ధాలు, పిడకలంటే ఇంధనం,పొయ్యిలో మంటకి ఉపయోగించేవి. పెద్ద లెక్కలోకి తీసుకునేవి కావు, మరి అటువంటి పిడకలకోసం ఎందుకేడిచిందీ? విలువైనవాటికోసం కాక విలువ తక్కువైన వాటి కోసం ఎందుకు ఏడ్చిందీ? అదిగదా అసలు ప్రశ్న.  కతలో కెళ్ళే ముందు కొంత చెప్పాలి. పిండి, బియ్యం అంటే తెలిసినవే! ఇక పిడకలగూడేంటనేదే తెలియవలసినది. సరే! పిడక కూడా తెలీదా?  పాతకాలంలో, అదేం లెండి నేటికిన్నీ పశువులు విసర్జించినదాన్ని పేడ అంటారు. పేడని అలాగేగాని,దీనితోపాటు, రంపంపొట్టు, బొగ్గుపొడి, ఊక ఇలా మండే స్వభావం ఉన్నవాటిని కలిపి ముద్దగా చేసి గుండ్రంగా చపాతీలా చేసి వాటిని ఎండబెడతారు. ఆ తరవాత వాటిని ఆహారం పచనం చేసుకోడానికి ఇంధనంగా వాడుతారు,కట్టెలతో పాటు, లేదా పిడకలే, నేటికీ పల్లెలలో, కొంతమంది.  ఇలా ఎండిన పిడకల్ని ఆరుబయట ఎత్తైనచోట గుండ్రంగా పేరుస్తారు. ఆతరవాత వాటిపైన వరసగా పేర్చుకుంటూ వస్తే అదొక శంకువు ఆకారంకి తేలుతుంది. దీనిపైన కొన్ని తాటాకులు కప్పుతారు, తడవకుండా, పైన ఒక రాయి ఎత్తు పెడతారు, ఆకులు ఎగిరిపోకుండా. 

కావాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో వెతకండి, ఒక్కో పిడక ఖరీదు ఎనభైతొమ్మిది రూపాయలే.



మరో మాట,ఆవు పేడని ఎగుమతి చేస్తున్నారట, భారతదేశం నుంచి. దిగుమతి చేసుకుంటున్న దేశాలు U.A.E,U.S.A., Malaysia. నేడు,  15000 టన్నుల ఆవుపేడ U.A.Eకి ఎగుమతి అవుతోందిట, రాజస్థాన్ నుంచి, ఎందుకూ వారికిదీ? అదిగదా కొచ్చను. ఆవుపేడ ఎరువుగా వేసి పెంచిన ఖర్జూరాలు పెద్దవిగానూ, నాణ్యంగానూ ఉన్నాయని వారి సైంటిస్టులు చెబుతున్నారష. పిడకల వ్యాపారం బాగున్నట్టుందే! కంగారు పడిపోకండి, ఇప్పటికే చాలామంది ఆ వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు కతలో కొద్దాం.


అనగనగా అదొక పల్లెటూరు, నాటి కాలం పల్లెటూరు.  ఆ పల్లెలో నాడు ఉన్నవన్నీ పూరిళ్ళే! అంటే తాటాకు ఇళ్ళుగాని, ఆవిరిగడ్డి నేసిన పూరిళ్ళుగాని. అటువంటి పల్లె ఒక వర్షాకాలంలో గాలితుఫానులో చిక్కుకుంది. చినుకు చినుకుగా మొదలైన వాన కుండపోతయింది. ఇక గాలి వెర్రెత్తినట్టు వీచింది. అసలే పూరిళ్ళు, గాలికి కొన్ని పడిపోయాయి. మరికొన్ని మట్టి ఇళ్ళు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్ళకి తాటాకులెగిరిపోయాయి, మరొకొన్నిటికి నడికొప్పులెగిరిపోయాయి. ఇలాటి సమయంలో ఒక ఇల్లాలు తన తాటాకిల్లు కూలిపోతుండగా తప్పించుకుని బయట పడింది. కొంచం తడవని చోటకి చేరుకుంది. కొంత సేపటికి గాలి తగ్గింది. చిన్న చినుకు పడుతూంది, సాయంత్రమవుతూన్న సమయం. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా! కూలిపోయిన ఇంటి లో ఏమున్నాయో ఏమిపోయాయో వెతుకులాట ప్రారంభించింది, పడిపోయిన వాటిని తప్పిస్తూ,రాత్రి భోజనం తయారు చేసుకోడానికి..  

చూస్తే సర్వం నాశనం. కుండలో పోసిన బియ్యం పూర్తి నేలపాలయ్యాయి,మట్టి గొట్టుకుపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. కుండ మీద ఏదో పడటం మూలంగా, కుండ బద్దలైంది. ఆ పక్కనే పెట్టిన కుండ కూడా బద్దలైంది, పోసివుంచిన పిండీ  మట్టి చేరడం తో పనిరాకుండా పోయింది. బట్టలు సర్వం తడిసిపోయాయి, కొన్ని ఎగిరిపోయాయి,పొడి బట్టలేదు. నిలవడానికి పొడి జాగా లేదు.  ఇదంతా చూసిన ఆ ఇల్లాలికి బాధ కలిగింది. . . ఆ తరవాతామె పెరటిలోకి పోయి చూస్తే చెట్టూ, చేమా అన్నీ పడిపోయాయి. అక్కడే ఎత్తుమీదున్న పిడకలగూడు చెదిరిపోయింది, పిడకలన్నీ నీటిపాలయి ముద్దయిపోయాయి. ఇప్పుడు ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. అయ్యో! పిడకలగూడు పోయిందే అని బావురు మని ఏడ్చింది.


ఇన్ని పోయినా బావురుమని ఏడవని ఆమె పిడకలగూటికోసం ఎందుకు బావురుమని ఏడ్చింది చెప్మా!!!



3, ఆగస్టు 2022, బుధవారం

టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు

 టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు


అరవై ఏళ్ళ కితం అమ్మకి సుగర్,మూత్రం   టెస్ట్ కి, ఉదయమే  రోజు పక్క పట్నం సైకిల్ మీద  వెళ్ళి టెస్ట్ చేయించుకొచ్చి ఇంజక్షన్ చేసేవాడిని. నా తిరగుడు చూసిన డాక్టర్ గారు, టెస్టు చేయడం నేర్పించారు. టెస్ట్ చేయడం నేర్చుకున్నా, సరే, మరి పరీక్షనాళిక ఏదీ? డాక్టర్ గారే ఒకటిచ్చి కొద్దిగా సొల్యూషనూ ఇచ్చి ఇంటి దగ్గరే చేసుకో అన్నారు. ఇక ఇక్కడినుంచి నా తిప్పలు మొదలయ్యాయి. స్పిరిట్ లేంప్ లేదు, కుంపటి మీద నిప్పు సెగ వాడేను, టెస్ట్ ట్యూబ్ వేడెక్కుతుంది కదా చెయ్యి కాలకుండా పట్టుకోడానికి, తంటసం లేదు,గుడ్డ తో పట్టుకునేవాడిని. పొరబాటున కిందబడి పగిలిపోతే? ఈ ఆలోచనే భయపెట్టింది. 


కంపౌండర్ని అడిగా ఇవెక్కడ దొరుకుతాయీ,అని.   మెడికల్ షాప్ లో అడుగూ అన్నాడు.  ఆ ఊరికి పెద్ద షాపు కరెడ్లా మెడికల్స్,తొమ్మిదవలేదు, అప్పుడే షాపు తలుపులు తీస్తున్నాడు. టెస్ట్ ట్యూబు, సొల్యూషనూ, స్పిరిట్ లేంప్ ఉన్నాయా? అని అడిగా . కొట్టు తీస్తూనే సరుకు లేదనలేక, మళ్ళీ రండి, చెబుతానన్నాడు. చేసేది లేక కాళ్ళీడ్చుకుంటూ సైకిలెక్కి, మెడికల్ షాపుల వెంట పడ్డా. ఎవరినడిగినా కరెడ్లలో అడగమన్నవారే. ఆశ! దొరుకుతుందా? రెండు గంటల తరవాత మళ్ళీ కరెడ్లకి వెళ్ళేను. అతను నన్ను చూస్తూనే, దొరకవండి అనేశాడు, నిరాశ!. తెప్పించగలరా? చెప్పలేనండీ!. మరో నిరాశ!. మీదగ్గర దొరకచ్చని డాక్టర్ గారు చెప్పేరన్నా. పోనే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, దయచేసి, అని ప్రాధేయపడ్డా. దానికి అతను కొంచం మొహమాట పడుతూ, ఇప్పుడు బేరాల టైము, భోజనానికి కొట్టు కట్టేసే ముందు రండి. ఆశ చిగురించింది. బయటికిపోయా, ఎమీ చెయ్యాలి? ఉదయం చద్దెన్నం తిని బయలుదేరా సైకిల్ మీద,పదకొండు దాటుతోంది, కడుపులో కరకరలాడుతోంది, జేబులో డబ్బులు  నిండుకున్నాయి. అవసరం మనది కదా, అశక్త దుర్జనత్వంతో,  ఊరు పిచ్చి తిరిగుడు తిరిగి మళ్ళీ కరెడ్ల చేరాను. 


అతను నన్ను చూసి నక్షత్రకునిలా తగులు కున్నాడనుకున్నాడో ఏమో,నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా నా అవసరం, వైనవైనాలుగా అతనికి జాలి పుట్టించేలా చెప్పేను. తను కుర్చీలో కూచుంటూ, కూచోండి అన్నాడు, ఆశ మొలిచింది,కూచున్నా, ఇవి అస్తమానం అవసరముండవండీ, డాక్టర్ గారు చెబుతారు, మేము రిప్ లకి చెబితే వాళ్ళు వీటిని పంపేస్తారు, అక్కడితో అది పూర్తవుతుంది, స్టాక్ పెట్టం అంటూ పాత ఫైల్ దులిపి కాగితాలు తిరగేస్తూ ఆ అడ్రస్ దొరికింది అన్నాడు. ఆశ బతికింది.  ఇవి  ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ మచిలీ పట్నం లో దొరుకుతాయి, అన్నాడు. నిరాశ!. . మరోమాట ఈ కంపెనీకి కాకినాడలో బ్రాంచ్ కాబోలు ఉంది అన్నాడు,అడ్రస్ లేదు, ఆశ చావలేదు. ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పల్లె చేరేను రెండు దాటింది.మర్నాడు రెప్లై కార్డ్ కొన్నా, ''ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ, కాకినాడ'' కి ఓ ఉత్తరం రాసి పడేసి, టేస్ట్ ట్యుబు వి.పి.పి లో పంపమన్నా. జవాబు కోసం ఎదురు చూపు. జవాబు లేదు, అసలు  ఉత్తరం  అందిందా? అడ్రస్ రాయక కంపెనీ పేరు రాసి పడేస్తే, అనుమానం, ఏం చేయాలో తోచలేదు.  కాకినాడ నుంచి జవాబు రాకపోతే మచిలీపట్నం వివరాల కోసం ఉత్తరం రాయాలనుకుంటుండగా ఆశ నిరాశలో కొట్టుకుంటుండగా వారం దాటేకా పోస్ట్ మేన్ సూరయ్య రిప్లై కార్ద్ ఇచ్చాడు. మళ్ళీ ఆశ బతికింది. మీరడిగిన వస్తువులు మా దగ్గర దొరుకుతాయి కాని వి.పి.పి పంపం. ఒక వార్త ఆశ మరొకటి నిరాశ.ఏం చేయాలి?ధరల వివారాలిచ్చారు, అదే పదివేలనిపించింది.