Wednesday, 29 November 2023

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.

 

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.


సిల్క్ యారా దగ్గర నిర్మాణం లో ఉన్న సొరంగంలో ప్రమాదవశాత్తు 41 మంది శ్రామికులు చిక్కుకుపోయారు, 17 రోజులుగా.  నిన్న అర్ధరాత్రి బయటికొచ్చేరు,క్షేమంగా


ప్రమాదం జరిగినప్పటినుంచి చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు రాత్రిపవలు తేడా లేక ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. బయటనుంచి చిక్కుకుపోయినవారి దగ్గరికి ఒక ఒక మార్గం ఏర్పాటు చేయడం ఒక ప్రయత్నం. దీనికోసం పెద్దపెద్ద యంత్రాలని హుటాహుటిన తరలించడం జరిగింది. ఒక యంత్రం కొంత పనిచేసి పాడయింది.ఆ తరవాత మరొక పెద్దయంత్రం ఆ పని కొనసాగించి రిపేరుకి సాధ్యం కానంతగా పాడయింది. ఏర్పాటు చేస్తున్నదారి, చిక్కుకున్నవారి నుంచి పన్నెండు మీటర్ల దూరాన ఆగిపోయింది. అప్పుడు సనాతనమైన ఎలుక బొరియ విధానమే అక్కరకొచ్చి చివరి పన్నెండు మీటర్లు పద్దెనిమిది గంటలలోపున నిపుణులు పూర్తిచేసేరు. దానిలోకి స్టీల్ పైపుని అమర్చారు, మనిషిపట్టి   ప్పించుకోను వీలున్నదానిని. దాని ద్వారా లోపల చిక్కుకున్న శ్రామిక సోదరలంతా క్షేమంగా బయటకొచ్చేరు. శ్రామికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు పని చేసిన సంస్థలకి,ఆందుకోసం పని చేసిన వారందరికి జేజేలు! ఇక చిక్కుని ఉండిపోయిన శ్రామికులు నమ్మకం కోల్పోక ఉండి జయప్రదంగా బయటకు వచ్చినందులకు అభినందనలు. ప్రయత్నం సఫలం చేసిన భగవానునునికి నమస్కారాలు.


ఎలుకబొరియ విధాన తవ్వకం భారతదేశం లో నిషేధింపబడింది, కాని అదేవిధానం నేడు అక్కరకొచ్చింది..

పాతంతా రోతకాదు! కొత్త వింతాకాదు!! పాతకొత్త విధానాల మేళవింపు  అద్భుతఫలితాలిస్తుంది.

Sunday, 26 November 2023

Friday, 24 November 2023

చిలికి చిలికి గాలివానయినట్టు.

 చిలికి చిలికి గాలివానయినట్టు.

ఇది ఒక నానుడి. చిన్నదిగా ప్రారంభమయినది ఆ తరవాత ప్రళయంగా మారడానికి వాడుతుంటారు.  నిజానికిది చినుకు చినుకు గాలివానయిందన్నది అసలు స్వరూపం అనుకుంటా. చిన్నదిగా ప్రారంభమైన ది  ఆ తరవాత చూస్తుండగా పెద్ద గాలివానైనట్టు. ఈ మాటని, చిన్న చిన్నగా, సరదా సరదాగా, ప్రారభమైన తగువు, ఆతరవాత పెద్ద కొట్లాటగాను ఆ తరవాత యుద్ధమే ఐనట్ట్లు కూడా చెబుతుంటారు

ఊరలేనిదే పేర పిలవరు

ఇదొక నానుడి. ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి ఆ ఊళ్ళోవాళ్ళు ఏదో పేరుతో పిలుస్తుంటారు.ముద్దు పేరైనా కావచ్చు. చిన్నబాబు,కన్నబాబు,ఎంకన్నబాబు,కొండబాబు ఇలా. ఇవి అసలు పేర్లూ కావచ్చు ముద్దుపేర్లూ కావచ్చు. ఇదే మనిషి, ఎక్కువకాలం ఊళ్ళో ఉండక ఎప్పుడేనా ఊరికి  వెళితే, ఎవరుబాబూ మీరు? అనే అడుగుతారు. ఎందుకంటే ఎక్కువకాలం ఎవరూ ఎవరినీ గుర్తు పెట్టుకోరు, గుర్తుంచుకోలేరు, కారణం రూపురేఖలు మారిపోతాయి, కాలంతో. ఇది నాకు చాలా స్వానుభవం, పుట్టి పెరిగిన ఊరిలో. అంతెందుకు నా సహాధ్యాయి, ఒరే అంటే ఒరే అనుకున్న వాళ్ళం మా ఊళ్ళో అన్నయ్య ఎదురుగా కలిసేం. అతను ఆ రోజుకు గ్రామ ప్రెశిడెంట్, ఏదో విషయం మాట్లాడడానికి వచ్చేడు, అన్నయ్యతో. నేనూ, అతనూ కూడా పలకరించుకోలేదు, గుర్తు పట్టలేదు ఇద్దరమున్నూ. అప్పుడు అన్నయ్య ఇతనెవరో తెలుసా? అడిగారు, నన్ను. తెలీదని బుర్రూపాను, అతన్ని అడిగితే అతనూ అంతే చెప్పేడు. అప్పుడు అన్నయ్య చెప్పేడు ఇద్దరికిన్ని ఇతను నీ స్నేహితుడు పాపోలు నాగరాజు అని, వీడు నా తమ్ముడు శర్మ అని చెప్పడంతో ఒక్క సారి నిర్ఘాంతపోయాం. ఆ తరవాత ఇద్దరమూ మీరు,మీరు అంటూ మాటాడుకున్నాం. చాలా సేపటికిగాని ఒరే అంటే ఒరే అనుకోలేకపోయాం. చిత్రం కదా! ఇదే ఊరలేకపోతే పేర పిలవరన్నదానికి సాక్ష్యం.


ఆ తరవాత కాలంలో దీనికి మరోలా అన్వయం కూడా చెపుతున్నారు, నిప్పు లేనిది పొగరాదుగా! ఏదో లేనిది కేసులెందుకు పెడతార్లే, ఊరలేనిది పేర పిలుస్తారేంటిలే!!! 

Wednesday, 22 November 2023

కొఱవితో తల గోక్కున్నట్టు


కొఱవితో తల గోక్కున్నట్టు

మండుతున్న కట్టెను కొఱవి అంటారు. దీనితో తలగోక్కుంటే ఏమవుతుంది? తల అంటుకుపోతుంది. కాలుతుంది. అనగా అనాలోచిత అవివేక చర్యగా చెబుతారు. తెలిసి,తెలిసి చేసేతప్పుగానూ చెబుతారు. 


సంచి లాభం చిల్లి కూడదీసినట్టు.

 సంచిని గోతం అని కూడా అంటారు. ఇప్పుడంటే 25కేజిలకి,50కెజిలకి,100కెజిలకి గోతాలున్నాయిగాని ఒకప్పుడు సంచి అంటే 100కెజిలు లేదా 24 కుంచాలు ధాన్యం పట్టే జనపనార సంచి అని వాడుక. గుడ్డ సంచిని చేతి సంచి అంటారు, ఇది చిన్నదిగా ఉంటుంది. పాతకాలంలో కొలతేగనక సంచి నిండాఅంటే 24 కుంచాలేనని వాడుక. ఈ సంచుల్ని మరలమరల వాడుతుంటే సాగిపోతాయి. 24 కుంచాలకంటే ఎక్కువ పడతాయి. ఒక వ్యాపారస్థుడు ఇలా సాగిపోయిన సంచి తీసుకుని రైతు దగ్గర ధాన్యం కొన్నాడు, ఇలా సాగిపోయిన సంచిలో నింపుకున్నాడు,ఎక్కువ ధాన్యం తెచ్చుకోవచ్చని ఆశకొద్దీ, లాభపడచ్చనుకుని. వాడకం ఎక్కువ కావడంతో అది చిల్లి పడింది, కాని ఇతను గమనించలేదు. ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాడు, ఇంటికొచ్చేటప్పటికి అవి కాస్తా24 కుంచాలే ఉన్నాయి, కొల్చుకుంటే. ఎక్కువ పట్టిన వడ్లు ఏమయ్యాయి,చిల్లిలోంచి దారిపొడుగునా కారిపోయాయి. లాభం వస్తుందనుకుని ఆశకు పోయి మోసం చెయ్యబోతే జరిగేదానికి ఈ మాట చెబుతారు. ఒక్కొకప్పుడు ఇలా చేస్తే నష్టం కూడా వస్తుందనీ అంటారు. 

ఈనగాచి నక్కలపాలు.

ఇది వ్యవసాయ సంబంధమైన నానుడి. పంట వేసిన దగ్గరనుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, కాపలా కూడా కావలసొస్తుంది కొన్ని పంటలకి. ఇలా పంటని వేసింది మొదలు జాగ్రత్తగా కాపాడుకొచ్చి, చివరి కాలానికి అనగా పంట ఫలించే సమయానికి అశ్రద్ధ చేస్తే పాడవుతుంది, శ్రమ,సొమ్ము, సమయం వృధా అవుతాయి. ఈ నానుడి ముఖ్యంగా చెఱకు పంటకు చెబుతారు. చెఱకు సిద్ధమయ్యే కాలానికి నక్కలు పాడు చేస్తాయి.ఆ సమయం లో కాపలా కూడా పెడతారు, పంట కాపాడుకోడానికి. ఫలసాయం చేతికొచ్చే సమయానికి అశ్రద్ధ చేయడాన్ని ఈ నానుడితో చెబుతారు. 


Friday, 10 November 2023

మొలతాడు బిగిసింది.

 మొలతాడు బిగిసింది.


మొలతాడు బిగిసిందంటాం. మొలపెరిగిందనుకోం.  మొలతాడు చిక్కదు :) మనమే బలుస్తాం,ఎప్పుడో కట్టుకున్న మొలతాడిప్పుడెందుకు బిగుస్తుంది?మొల చుట్టుకొల్త పెరిగితేనేకదా!


సమస్య పట్టుకుని వదలటం లేదంటాం. సమస్యని మన మనసు పట్టుకుంది, తన చుట్టూ కట్టేసుకుంది. కాని సమస్య పట్టుకుంది వదలటం లేదంటాం.వదలవలసిందెవరు? మనమనసే. 

తననెవరో పట్టుకున్నారంటుంది, మరెవరో విడిపించాలనీ అనుకుంటుంది. చెబితే శానా ఉంది. 

అన్నిటికి మూలం మన మనసు.

ఇక చాలు.

సర్వే జనాః సుఖినోభవంతు.

.....స్వస్తి.....


Thursday, 9 November 2023

కాస్త తాళుము కృష్ణా

  కాస్త తాళుము కృష్ణా



తలుపు తీయునంతలోనె
తత్తర మదియేల నోయి?
తలుపుదీతు వీలు జూచి
తాళుము కృష్ణా!
    కొంతసేపు
తాళుము కృష్ణా!
    పతి నిద్దుర వోవలేదు
    మతి సందియ మొందె నేమొ
    పతికి కునుకు పట్టగ లో
    పలకు వత్తుగాని తాళు
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!
నుదుట బొట్టు దిద్దలేదు
చెదరియున్న ముంగురులను
కుదురుజేయలేదు యేల
పదెపదె పిలచెదవురా
తాళుము కృష్ణా!
    కాస్తసేపు
తాళుము కృష్ణా!
    ఏల నంత తత్తరమ్ము
    ఏల నంత భయము, సామి
    నిన్నుగాక వేరొక్కని
    నెట్లు వలవగలను కృష్ణ!
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!


గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా!తియ్యని పాయసమోయ్‌ బావా!
తీరుగ వండానోయ్‌ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!కమ్మని పూరీలోయ్‌ బావా!
కర కర వేచానోయ్‌ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్‌ బావా!
    కనికరించి తినవోయ్‌ బావా!వెన్నెల యిదుగోనోయ్‌ బావా!
కన్నుల కింపౌనోయ్‌ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్‌ బావా!
    వేగముగా రావోయ్‌ బావా!పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్‌ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్‌ బావా!
    పదవోయ్‌ పవళింతాం బావా!
బసవరాజు అప్పారావు గారి గేయం

Wednesday, 8 November 2023

మాట విలువ

మాట విలువ  

 రామకృష్ణులు మఠంలో ఉండగా, ఒక తల్లి తనకొడుకుని తీసుకుని వచ్చి, ఈ కుర్రవాడు చిన్నవయసులోనే చెప్పినమాట వినటం లేదు, బెల్లం ఎక్కువ తింటున్నాడు , మీరు చెబితే వింటాడని మీదగ్గరకి తీసుకొచ్చానంది.


విన్న రామకృష్ణులు రేపురమ్మని వాయిదా వేసేరు. ఆ తల్లి కొడుకుని తీసుకుని మరునాడొచ్చింది. మళ్ళీ రేపురమ్మని వాయిదావేసేరు. ఇలా వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు, కాని కుర్రవానికి బెల్లం తినద్దని చెప్పటం లేదు. ఆ తల్లి పట్టువదలక తిరుగుతూనే ఉంది. చివరికి   నెలదాటిన తరవాత రామకృష్ణులు ఆ కుర్రవానితో, బెల్లం తినకు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేరు. అప్పుడు ఆ తల్లి రామకృష్ణులతో, ఈ మాట మీరు నెలకితమే చెప్పి ఉండచ్చుగా! అని అడిగింది. అంత రామకృష్ణులు తల్లీ! నెలకితందాకా నేనూ బెల్లం తింటున్నవాడినే. ఈ నెలలోనే నేను బెల్లం తినడం మానేసాను, ఆ తరవాతే చెప్పేను, అన్నారు. చిత్రంగా ఆ కుర్రవాడు ఆ   తరవాత బెల్లం మరి తినలేదు.


ఆచరించి చెప్పినమాటకంత విలువుంటుంది.

గాలివాటు మనుషుల మాటకి విలువుండదు.

Monday, 6 November 2023

గతకాలపు వైభవ చిహ్నాలు.

 



Raleigh సైకిలు


LG TV

Post-Box


కల్వం,సన్నికల్లు,రుబ్బురోలు,కుందిరోలు


వస్తువుల్ని గుర్తు పట్టండి

అవసరం తీరేకా మానవులూ ఇంతే! ఐతే కొందరు గతకాలపు వైభవ చిహ్నాలుగా మిగిలిపోతారు, మరికొందరు కాలగర్భం లో నామరూపాలు లేక మలిగిపోతారు.

Sunday, 5 November 2023

శిలాభిశ్చ ప్రహరతి

 శిలాభిశ్చ ప్రహరతి


నమోఽస్తు రామాయ స లక్ష్మణాయ

దేవ్యై చ తస్త్యె జనకాత్మ జాయై

నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో

నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః


జయత్యతి బలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభి పాలితః


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః

హనూమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః


న రావణ సహస్రం మే

యుద్ధే ప్రతిబలం భవేత్

శిలాభిశ్చ ప్రహరతి

పాదపైశ్చ సహస్రసః


అర్దయిత్వా పురీం లంకా

అభివాద్య చ మైథిలీమ్

సమృద్దార్ధో గమిష్యామి

మిషతాం సర్వ రక్షసామ్


అర్థసిద్ధిం తు వైదేహ్యాః

పశ్యామ్యహముపస్థితామ్

రాక్షసేంద్రవినాశం చ

విజయం రాఘవస్య చ


**********

రామరామ జయరాజారామ్

రామరామ జయసీతారామ్

Saturday, 4 November 2023

దొంగని దొంగే పట్టాలి-1

 దొంగని దొంగే పట్టాలి...1


మొన్నీ మధ్యే ముల్లును ముల్లుతో తీయాలన్నదానికి ఒక కత చెప్పుకున్నాం. మరి దొంగని దొగే పట్టాలంటే! ఇదీ ఒక నానుడే. ఒక కత చెప్పుకుందాం.అలా ముందుకుపోదాం.


అనగనగా ఒక రాజ్యం, దానికోరాజు,ఒక మంత్రి.రాజ్యం ధనవంతమైనదే కాని పేదలే ఎక్కువ. ఆ రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి.రాజుకి తాకిడి ఎక్కువయ్యింది, దొంగతనాల గురించి. మంత్రిని నిలదీశాడు,రాజు. దానికి మంత్రి ''రాజా! కలిగినప్పుడు మాత్రమే దొంగతానాలెక్కువగా ఉంటాయి. లేనివాడింటికి కన్నమేసేటంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. 'లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవు'. అంచేత మనదేశం ధనవంతమైనది, అందుకు సంతసించండి'', అన్నాడు మంత్రి.


రాజు,''దేశం ధనవంతమైనందుకు నిన్ను అభినందిస్తున్నాను. మన పరిపాలన  సవ్య దిశలో నడుస్తున్నట్టేగా! అది సరేగాని లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవన్నావు. అదేంటో చెప్పూ'', అన్నాడు.


వినండి, రాజా! మన దేశంలో ఒక పల్లెటూరు. అందులో ఒక జాయ,పతి. వయసులోనే ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ధనానికి లోటేమోగాని సంతానానికి లోటు లేదు, ఇంటి నిండా పిల్లలే! ఆ కుటుంబ యజమాని ధనం మాటెలా ఉన్నా పిల్లల్ని మాత్రం కనేసేడు, పదిమందిని. పూర్వులు సంపాదించి ఇచ్చిన కొంప పడిపోడానికి సిద్ధంగా ఉన్నదానిలో కాపరం. ఒక రోజు ఇంటి ఇల్లాలు పిల్లలికి కలిగినదేదో పెట్టి తను గంజితాగి పడుకుంది, ఉన్న ఒకే ఒక్కదీపాన్ని మలిపేసి.పిల్లలు తనూ కింద పడుకున్నారు. నడిరాత్రి ఒక దొంగ నెమ్మదిగా ఉతకలెత్తేసి తలుపులు తీశాడు. మెలుకువొచ్చిన ఇల్లాలు పడుకునే ఉంది. దొంగ ఇల్లంతా తిరిగేడు. చీకటి, ఎక్కడ చూసినా తలకి ఆనపకాయ బుర్రలేతగులుతున్నాయి. అవీ ఖాళీగా ఉన్నవే. ఇంక కాలికి పిల్లల పిర్రలే తగులుతున్నాయి, ఎటుతిరిగినా. ఏమీ విలువైనది దొరక్కపోతే దొంగ, ''ఎరక్కపోయి ఇంటికి కన్నం వేసాను, ఎటుచూసినా పైన బుర్రలు,కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకలేదని'' సణుక్కున్నాడు. విన్న ఇంటి ఇల్లాలు. 


''అన్నా!రాత్రి వేళ ఇంటికొచ్చావు. కనీసం గంజి కూడా లేదు, పోద్దామంటే! ముందు తలుపులెత్తేసేవు, దయ ఉంచి వెనక తలుపులు కూడా ఉతకలెత్తెయ్యి. వాటిని బాగుచేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! వాటిని ఎత్తి బయటకు తీయలేక ఊరుకున్నా!'' అంది. విన్న దొంగ నిర్ఘాంతపోయాడు. ''చెల్లీ! దీపమేనా పెట్టుకోలేదే''మని అడిగాడు. 


''అన్నా! ఉన్నది ఒక్కదీపం అది రాత్రంతా వెలిగితే మర్నాడు వెలిగించుకోడానికుండదు'' ''బావగారు!......'' వాకబు చేశాడు దొంగ. ''పొరుగూళ్ళో ఉద్యోగానికెళ్ళేరు. ఉదయానికొస్తా''రంది. దొంగ చలించిపోయాడు, ఇంత దుర్భర దారిద్యం చూసి. దీపం వెలిగించమని, ఆపై ఆమె చెప్పిన పని చేసి పెట్టి, తన దగ్గరున్న సొమ్మును ఆమెకిచ్చి, దణ్ణం పెట్టి, ఇకపై దొంగతనం చేయనని కష్టపడి బతుకుతానని ఆమెకు మాటిచ్చి వెళ్ళేడు.


కతబాగుందిగాని అసలు సంగతి చెప్పండి, అడిగాడు రాజు. రాజా! విషయం రేపు చెబుతానని వాయిదా వేసాడు మంత్రి...

ఎదురు చూడక తప్పదుగా

Wednesday, 1 November 2023

నడక నేర్చుకుంటున్నా!

 

 


నడక నేర్చుకుంటున్నా!

 ఓం సర్వవ్యాధి ప్రశమనీయైనమః


చిన్నప్పుడు నడక నేర్చుకున్నా! అమ్మ వెనకుండి నేర్పింది. మూణ్ణెల్లు మంచం మీదుంటే, నడక మరిచిపోయా! నడవడమంటే భయంగా ఉంది పడిపోతానేమోనని, మళ్ళీ ఎముక విరుగుతుందేమోనని,భయం. మళ్ళీ

ఓం దరహాసోజ్వలన్ముఖాయైనమః) అమ్మలగన్నయమ్మే నడక నేర్పిస్తోంది. మెల్లమెల్లగా అడుగులేస్తూ కఱ్ఱ బోటేసుకుని గ్రౌండు దాకా నడిచా! 


ఎందుకిన్ని తిప్పలు? హాయిగా పడుకోవచ్చుగా! నిజమే అలా మూడు నెలలు, కాలు విరిగి  బలవంతంగా పడుకుంటే, బద్ధకం ముందు పెరిగింది. ఆ పై సుగర్ పెరిగింది, బరువు పెరిగింది,BMI పెరిగింది.కనపడని బి.పి పెరిగింది.ఆకలి తగ్గింది.

సుగర్ డాక్టర్ నడిస్తేగాని సుగర్ తగ్గదు,బరువు తగ్గదు,బి.పి తగ్గదు, ఆకలిపుట్టదంటారు. ఎముకల డాక్టర్ పడుకునుంటేగాని కాలు సరిపడదంటారు. పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుంది, పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది. ఏది ముందు? బలే లింకులేసేవయ్యా సామీ!అంతేలే కారణం లేనిది కార్యం జరగదని అంటారు. తీసుకుపోయేటందుకు, నెపం నీమీదుంచుకోవనీ అంటారు.

ఇంకా కొంతకాలం తిరిగే యోగం ఉన్నట్టే ఉంది, నడుస్తున్నా, నెమ్మదిగా, ధైర్యం వచ్చింది. :) 


పైవాడు బలే లింకు లేస్తాడు, తీయాలంటే అంత తేలిగ్గానే తీసేస్తాడు. అది పైవాని వల్లే ,అవుతుందిగాని మనవల్లగాదు. కాని మనం మాత్రం సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, ఇదీ కత.బయట లోకం అంతా కొత్తగా ఉంది, బ్లాగ్ లోకం వింతగా ఉంది  :)

Friday, 20 October 2023

కూలికి విషం తాగరు.

  కూలికి విషం తాగరు.


ఇదొక నానుడి, పల్లెలలో బాగా చెబుతారు.

డబ్బుకోసం ఏ నీచపుపని చేయడానికైనా దిగజారిపోతారు, కొందరు. ప్రపంచంలోని యుద్ధాలు తగువులు అన్నిటికి మూలకారణాలు కాంతా,కనకాలే!

కాంతపైన ఆశ 

కనకంబుపై ఆశ

లేనివాడు మొదలు లేడురా

ధరణిలేడురా! 

అన్నారో సినీకవి,చాలా కాలంకితం.


వయసుతో కాంతమీద మోహం,ఆశ తగ్గుతుందేమోగాని, చావదు. ఇంక కనకం మీద ఆశ చచ్చినా చావదు. :)

చావుకాలానికి ప్రాణంపోక, ఉండక కొట్టుకుంటున్నపుడు, తలకింద పెట్టుకున్న రూపాయల్ని, నీళ్ళలో కడిగి ఆ నీళ్ళు పోసేవారు. అప్పుడు ఆ జీవుడు కదైలేది బొందినుంచి. :)


డబ్బుకోసం హత్యలు చేస్తారు,చేయిస్తారు,  ఎంతకైనా తెగిస్తారు.

 


కాని డబ్బుకోసం చేయని పని ఒకటే  ఒక్కటి ఉంది ప్రపంచంలో,

 అదే ఆత్మహత్య. డబ్బుకోసం ఎవరూ ఆత్మహత్యకి పాల్పడరు. దాన్నే మా గ్రామీణులం కూలికి విషం తాగరు అంటూంటాం.


Monday, 16 October 2023

అదృష్టం బుఱ్ఱగుంజు

 తాటితాండ్ర



  తాటితాండ్ర

తాటిబెల్లం




వేసవిలో వచ్చేవి తాటికల్లు,తాటిముంజలు.

 వర్షకాలంలో వచ్చేవి తాటితాండ్ర,తాటిబెల్లం.

శీతకాలంలో వచ్చేవి తేగలు బుర్రగుంజు. 


 
  వేసవిలోతాడిచెట్ల సీజన్ ప్రారంభం. ముందుకల్లొస్తుంది. దానినుంచి తాటిబెల్లం అనే కల్లుబెల్లం లేదా పాతబెల్లం వండుతారు.వేసవిని తప్పించుకోడానికి తాటికల్లు ఆరోగ్యప్రదాయిని. తాటిముంజలూ అంతే! వీటినే ఐస్ ఆపిల్ అంటారు.  వేసవిలో తాటిముంజలొచ్చాకా అవి పెరిగి తాటికాయలవుతాయి, ఆ తరవాత పళ్ళూ అవుతాయి.తాటిపళ్ళనుంచి రసం తీసి మరగబెట్టి చాపలమీద పోస్తారు, పల్చగా,తాటి చాపలమీదే. అందుకే దీన్ని తాటితాండ్ర చాపలంటారు.  ఇక గుజ్జు తీసుకున్న తరవాత టెంకలు మిగులుతాయి, వీటిని కొచం ఎత్తుగా ఉన్నచోట పాతరేస్తారు. టెంకలనుంచి మొలకలొస్తాయి భూమిలోకి, ఇవే తేగలు.   టెంకలు అలా ఒకదానిమీద ఒకటిపేర్చేస్తారు. ఈ తేగలు తవ్వడానికి, శీతకాలానికి తయారవుతాయి, ఫిబ్రవరిదాకా వస్తాయి. తేగలు తవ్వుకున్న తరవాత టెంకలు మిగులుతాయి. వీటిని చితక్కొట్టుకుంటే బుర్రగుంజు దొరుకుతుంది, తియ్యగా ఉంటుంది. అన్ని టెంకల్లోనూ బుర్రగుంజుండదు. అందుకే  బుర్రగుంజన్నారు. టెంక చితక్కొట్టేదాకా బుర్రగుంజున్నది లేనిదీ తెలీదు. అలాగే మనిషిని వాడేదాకా బుర్రలో గుంజున్నదీ లేనిదీ తెలీదు. 

Saturday, 14 October 2023

మహాలయం

 

కష్టేఫలే-శర్మ కాలక్షేపం కబుర్లు-మహాలయ అమావాస్య

రేపు సెప్టెంబరు ఇరువదిఏడవతేది మహాలయ అమావాస్య.
ప్రతీ సంసృతిలోను  కాలంచేసినవారిని తలుచుకోవడం సహజం. దీనినే మనవాళ్ళు పెద్దలకి పెట్టుకోవడం అంటారు. అలాగే కాలంచేసినవారిని తలుచుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక పదిహేను రోజులని కేటాయించారు.అవి భాద్రపద బహుళ పాడ్యమి మొదలు భాద్రపద బహుళ అమావాస్య వరకు. ఈ రోజులలో పెద్దలు కాలం చేసిన తిధినాడుగాని అప్పుడూ కుదరకపోతే అమావాస్య నాడుగాని పెద్దలను తలుచుకొని తర్పణంచేసి సాత్వికులైన వారికి అన్నపానీయలిచ్చి గౌరవం చేయడం మన ఆచారం. ఈరోజు కనీసంగా పిత్రు తర్పణం అనగా గతించిన తండ్రి, తాత, ముత్తాతలని తల్లి, మామ్మ, తాతమ్మలకు ఋషి సహిత గోత్రనామాలతో నీళ్ళు వదిలిపెడతారు.తన వంశంలో పిల్లలు లేకుండాగతించినవారికి, అకాలమరణం పొందినవారికి తర్పణం ఇస్తారు. గతించిన గురువుకి,తరువాత తనకు ముఖ్యులై గతించినవారికి, గతించిన రాజుకు,చివరగా ఈ భూమండలంమీద అనాధగా చనిపోయినవారందరికి తర్పణం ఇస్తారు. తర్పణం అంటే మంత్ర సహితంగ నీళ్ళువదలి పెట్టడమే. మంత్రం చెప్పుకోలేనివారు తర్పణం చేయలేరా. శ్రద్ధ ముఖ్యంకాని మంత్రం కాదు. మంత్రంతో చేయగలిగితే మంచిదే. లేకపోయినా ఆయా పెద్దలను తలుచుకొని నీళ్ళువదలచ్చు. విశేషం ఏమంటే గంగా నది ఒడ్డున ఈరోజు మధ్యహ్నం పన్నెండు గంటలు దాటిన తరువాత ఈ కార్యక్రమం జరుపేవారు ఎక్కువ. మనమూ ఈ కార్యక్రమాన్ని అవుసరం ఉన్నవారు మధ్యాహ్నం పన్నెండు దాటిన తరువాత ఆచరించ వచ్చును. పెద్దలను గౌరవించడం తలవడం మన సంసృతి. అంతేకాదు మనకు ఏ సంబంధమూ లేని భూగోళం మీద గతించిన అనాధలందరూ కూడా శాశ్వత పుణ్యలోకాలలో మనవారితో సహా వుండాలని మన భారతీయ సంస్కృతి చెబుతోవుంది. ఇది చాదస్తంగా కనపడవచ్చు కాని
మనంఆచరించవలసినదే.

పెళ్ళికిముందుగా గతించిన పెద్దలను ఆహ్వానించి అర్చన చేసి, వంశములో జీవించియున్నవారిలో పెద్దలిని పిలిచి వారికి సత్కారం చేసి అప్పుడు చేయబోయే శుభకార్యంకి కంకణం కట్టుకుంటాము. గతించిన పెద్దలను తలుచుకొని చేసే కార్యక్రమమే సంకల్పం.

అది నాటిమాట. 

(25.09.2011)

*********************

ఇది నేటిమాట

(14.10.2023)

 లయం అంటే కలసిపోవడం మహాలయం అంటేసర్వజీవులూ కలసిపోవడం. ఎవరితో? అదీ ప్రశ్న. 

జీవులెనుబదినాల్గు లక్షలచావు పుట్టుకలిక్కడా! ఎవరుచేసిన పాపకర్మము లనుభవవించేదక్కడా! అనేది తత్త్వం. పుట్టిన ప్రతిజీవి లయంకాకతప్పదు. ఎప్పుడూ? ఎవరి కర్మానుసారంగా వారు లయమవుతూ ఉంటారు! చావూ పుట్టుకల చక్రం తిరుగుతూనే ఉంటుంది. అంతెక్కడా?  ఇలా చావుపుట్టుకలచక్రం నుంచి తప్పించుకోలేని జీవులకు కూడా ముక్తి ప్రసాదిస్తాడు శంకరుడు, అదే అదే మహాలయం. ఆ సమయంలో శంకరుడు ఈ సృష్టి సమస్థాన్ని లయంచేసి తన ఒంటికి బూడిదగా రాసుకుంటాడంటారు, ఈ పితృ పక్షంలో.

Wednesday, 11 October 2023

కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.

 కాలం కలసిరానప్పుడు తాడేపామై కరచింది.


కాలం కలిసొచ్చినపుడు, ప్రపంచమే మనచుట్టూ తిరుగుతున్నట్టనిపిస్తుంది, మనమాట మీదే నడుస్తున్నట్టుంటుంది. మన మాటే వేదమని పాటించేవారికంటే, మన మాటకోసం ఎదురుచూసేవారే ఎక్కువ. సరే  తరవాత చిన్నతల్లి పరుగు పరుగునా గలగలలాడుతూ చేరిపోతుంది.   అడగకనే న్యాయదేవత మన ముంగిట్లోకి నడచొచ్చేస్తుంది.  తెప్పలుగ జెరువునిండిన కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ! వందిమాగధులకి లోటుండదు. ఇంద్రుడు చంద్రుడు అననివారు దుర్మార్గులే! సమయం అదే కాలం తెలియకనే దొర్లిపోతుంటుంది. రోజులు నిమిషాల్లా,సంవత్సరాలు రోజుల్లా నడచిపోతుంటాయి. ఆకలుండదు దాహముండదు, నిన్ను చూస్తుంటే, అన్నట్టుంటుంది.  


కాలం నడుస్తున్నప్పుడు, రోజులు భారంగా నడుస్తుంటాయి. తెల్లవారుతుంది మళ్ళీ పొద్దుగూకుతుంది, అంతే!!పిలిస్తే పలుకుతారు జనం, లేకపోతే లేదు. ఎవరి ప్రపంచం వారిదే! వందిమాగధులు కైవారాలు కష్టం మీద కొనసాగచ్చు,సాగకాపోవచ్చు. ఏదీ నికరం లేదు. న్యాయదేవత కోసం పరుగులు పెడితే కరుణించచ్చు, లేకపోవచ్చు. జనాలు చేరిక చెప్పలేం, చిన్నతల్లి పలుకును బట్టి ఉంటుంది. చిన్నతల్లి పరుగులుండవు, నడకలూ ఎనకబడతాయి. ఒక్కొకప్పుడు చిన్నతల్లి పోకేగాని రాకుండదు. విత్తంకొద్దీ వైభోగం,నడుస్తూ ఉంటుంది. ఆకలుంటుంది, దాహమేస్తూ ఉంటుంది. ఇంతేనా జీవితం అనిపిస్తూ ఉంటుంది. కాలం నడుస్తుంటుంది, భారంగా. 


కాలం కలసిరానపుడు,పిలిచినా పలికేవాడుండడు. నిన్నటిదాకా మన గుమ్మందగ్గర నిలబడ్డవాడి గుమ్మం దగ్గర నిలబడ్డా దర్శనముండదు. దర్శనమిచ్చినా పలుకుండకపోవచ్చు.చిన్నతల్లి పలుకే బంగారం. పోయేగాని రాలేదు. న్యాయదేవత పెడముఖం పెడుతుంది. నిన్నటిదాకా మనం చెప్పినదే న్యాయమే, మరి నేడేంటి? న్యాయదేవత శలవులు తీసుకుంటూ ఉంటుంది.పలికేవారు ఉండరు. చెరువెండిపోతే కప్పలుండవు. ఇంద్రుడు, చంద్రుడు మాట దేవుడెరుగు మన పెరే గుర్తుండదు, ఎవరికి. గడియారం లో చిన్నముల్లు కదలదు, పెద్ద ముల్లు సరే సరి. రోజు నడవదు, భారంగా కూడా. నీడని చూసి భయపడాల్సివస్తుంటుంది. తాడు కరుస్తుందా? కాని కానికాలమొస్తే తాడే పామై కరుస్తుంది.


ఇంతకీ ఎవరీకాలం?అదీ కొచ్చను. కాలం గంటలు,నిమిషాలు, రోజులు ,సంవత్సరాలే కాదు. కాలానికి రూపులేదు, గుణం లేదు;  దయలేదు, దాక్షిణ్యం లేదు; పుట్టుకలేదు, చావులేదు; ఆది లేదు, అంతం లేదు; సమవర్తి. పెద్ద చిన్న తేడా లేదు.  ఎవరికోసమూ ఆగదు, నడుస్తూనే ఉంటుంది.ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. మరి ఇన్నిగుణాలూ ఉన్నవారొకరున్నారు, వారే దేవుడు, మీరే పేరుతో పిలుచుకున్నా, ఏమతంవారైనా, ఇదే నిజం. 


కాలం కలసిరావడమంటే భగవంతుడు మనతో ఉన్నాడు, అప్పుడు. అందుకే మనకి రోజులలా గడిచాయి, మనమా సమయంలో మంచిపనులు చేస్తామేమో అని భగవంతుడు ఎదురుచూచాడు. మన కర్మ బాగుంటే అదే కాలం కలిసొచ్చేది.


 ఆ తరవాత అరోజులు భారంగా నడిచాయి, ఎందుకు? భగవంతుడు నీ పట్ల ఉన్నట్టు లేనట్టు ఉన్నకాలం. ఇక కాలం కలసిరానపుడు భగవంతుడు మన పట్ల లేడు. 

అందరూ పడిపడి దణ్ణాలెట్టేవాళ్ళే!నాటి రోజుల్లో. ఎందుకూ? ఆ రోజు మన వెనక విధి ఉన్నది. అందరూ దణ్ణాళెట్టేరు, విధికి, కాని మనం, మనకే దణ్ణాలెట్టేరని భ్రమపడ్డాం, మనగొప్పే అనుకున్నాం. విధిని మరచాం. అందుకే...ఈ రోజు, పిలిచినా పలికేవాడు లేడు, సాయంచేసేవాడసలే లేడు, చిన్నతల్లి అడుగులు లేవు, ఆ రోజు మొక్కినవాడు, ఈ రోజు బయటకాపలా ఉన్నాడు, బయటికి పోకుండా. ఇప్పుడు గుళ్ళూ గోపురాలూ గుర్తొచ్చాయి, ఉపయోగమే కనపట్టదు.అదే తాడు పామైకరవడమంటే...


Monday, 9 October 2023

గోగుపూలు

 గోగుపూలు


గోగుపూలు

గోంగూర తెనుగువారి ఇష్టదైవం,ఆంధ్రమాత. గోగులో రెండు రకాలు, తెల్లగోగు దీన్నే ధనాసకూర అంటారు. రెండోది ఎర్రగోగు దీన్ని పుల్లగోగు అంటారు. గోంగూర పచ్చడిని ఇష్టపడని తెనుగువాడుండదని నా నిశ్చితాభిప్రాయం :)

ఉమ్మెత్తపూవు.

ఉమ్మెత్తలో రెండు రకాలు, తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, రెండూ ఆయుర్వేదంలో మతిభ్రమణానికి వాడే మందుల్లో వాడతారట. 


మొల్ల పూవు.

మొల్ల కవయిత్రి. 
ఈ పూవు పూజకి పనికిరాదు. తలలో పెట్టుకోడానికీ పనికిరాదు. వాసనలేని పూవును తలలో ధరించకూడదంటారు, పెద్దలు.

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్, సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్,
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!

Thursday, 5 October 2023

చదువెందుకు చంకనాకను...

  చదువెందుకు చంకనాకను...


కాలు కదపద్దంటే, మంచం మీద పడుకునుండిపోతుంటే, బద్దకం పెరిగింది, అదొకటే ఏంలెస్తురూ! అన్నీ పెరిగేయి.... అలా పడుకునుంటే చిన్నప్పటి సంగతులు ముసిరేయి..... ఇలా ఒకటి...


''చదువెందుకు చంకనాకను నాలుగావులు,గేదెల్ని మేపుకుని బతకవచ్చును'', అనేవాడు మా నున్నం నర్సన్న బాబాయ్, డెభైఐదేళ్ళకితం, సాయంత్రం పూట వీధరుగుమీద కూచుని చదువుకుంటున్న మాతో, పశువుల్ని పొలం నుంచి తోలుకొస్తూ,పూటుగా గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం పుచ్చుకుని వస్తూ. ఈలొగా వచ్చేసేవారు మానాన్నగారో పెదనాన్నగారో, ''ఒరే తమ్ముడూ! ఏంటిరా? ఈ అల్లరి, ఇంటికెళ్ళు మరదలు ఎదురుచూస్తూ ఉంటుందీ" అని అనునయించి పంపించేసేవారు. నిజంగానే తను చెప్పినట్టు పశువులపాల వ్యాపారమే చేసేవాడారోజుల్లో. ఇంట్లోవాళ్ళు ఆ మాట గుర్తుకురానివ్వకుండా రోజూ "చదువుకోక మన్నుకొట్టుకొట్టుకుంటావా? చదువుకోక గాడిదల్ని కాస్తావా?" అని ఇవేవో చాలా తక్కువపనులని బ్రెయిన్ వాష్ చేసేవారు. అదే నిలిచిపోయింది. పాల వ్యాపారం చేసి కొన్ని దేశాలే బాగుపడ్డాయి. ఒకప్పుడు భారతదేశంలో గొల్లభామ మార్కు పాల డబ్బాలమ్మేవారు, ఎంతమంది కి తెలుసో చెప్పలేను. ఈ పాల డబ్బాలు స్విజర్లాండ్ నుంచి దిగుమతి అయ్యేవి.  పేరుగొల్లభామ మార్కు  , condensed. sweetend milk'.   'cow and Gate' brand, milk powder of England.  నేడు పెటా వారు అముల్ వారిని పశువులపాలు అమ్మరాదని గొడవ చేస్తున్నారు. పశువుల పాలు తీయడం సభ్యతకాదట. మరీ మాట నేటికీ Switzerland దేశాలలో చెబుతారో? తెలీదు. భారత్ లోనే ఈ పలుకు పలుకుతున్నట్లుంది. 


ఆ తరవాత కాలంలో మాత్రం. అదేమాట నిలిచిపోయింది. ఐదెకరాలు రోడ్డు పక్క చేను, మూడెకరాలు ఊడ్చుకుని, ఎకరంలో గడ్డి పెంచుకుని, ఎకరంలో షెడ్లు,కొంప కట్టుకునుంటే, ఈ వేళ...ఎందుకులెండి....పాల  వ్యాపారం

 చేస్తే ఎలా ఉండేదో....., జీవితం మూడు పువ్వులు ఆరుకాయల్లా నడిచేది.ఉప్చ్! రోజులలా నడిచిపోయాయలా.


సరే! పదేళ్ళకితం ''గాడిదల్ని కాయండి, కోటీశ్వరులుకండి'', అంటే నవ్వేసేరు. ఇప్పుడు గాడిదపాలు లీటరు ఎనిమిదివేలు, తొందరలో పదివేలు కాబోతోంది. ఇదీ చెయ్యలేకపోయా! తెలివైనవాళ్ళు ఈ మాట అంది పుచ్చుకున్నారు. యోగం లెద్దురూ! కారణం లేనిది కార్యం జరగదు. ఇదింతే.....ఎవరియోగమెంతో అంతే!!


రాబోయే కాలంలో మనిషిపాల వ్యాపారం జరగబోతోంది. "బ్రెస్ట్ మిల్క్! బెస్ట్ మిల్క్!!" ఈ వ్యాపారం ఐడియా, ఆ స్లోగనూ నావే! రిజిస్టర్ చేయించాలి పేటెంటు కోసం. చూద్దాం.... 


Wednesday, 27 September 2023

దొంగని దొంగే పట్టాలి.

దొంగని దొంగే పట్టాలి


దొంగని దొంగే పట్టాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇవన్నీ సమానర్ధకమైన తెనుగు నానుడులు. దొంగతనం అరవైనాలుగు కళలో ఒకటిట. దొంగని దొంగ ఎలాపట్టగలడు? అదీ కొచ్చను!


దొంగలకి ఉండే అలవాట్లు, చేసే పొరబాట్లు, నమ్మకాలు, ఇలా చాలా విషయాలు సమానంగా ఉంటాయట, ఇది పెద్దలమాట. సాధారణంగా దొంగలు దొంగతనం చేయబోయే ఇంటిని చాలాకాలం జాగ్రత్తగా గమనిస్తారట. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు? ఎంతబలవంతులు? ఎదురుతిరగ్గలరా?ఎప్పుడు సొమ్ము ఉంటుంది ఇంట్లో?ఎంత ఉండచ్చు? బంగారం ఎంతుండచ్చు?  ఆ ఇంటివారి అలవాట్లు, భద్రత ఎంత?  ఎంతమంది ఆడాళ్ళున్నారు? కుక్కలున్నాయా? ఏజాతివి? బిస్కట్లకి లొంగుతాయా? లొంగదీసుకోడానికి ఇతర మార్గాలేంటి?కాపలా ఉంటుందా? పట్టుబడితే? కన్నగాడు కత్తి మరవడని సామెత.  


ఇలా చాలా విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే దొంగతనానికి దిగుతారట. అంతే కాదు, తిథి, వారం,నక్షత్రం ఇలా చూసుకునేవారూ ఉంటారట. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి సాటి దొంగకే తెలుస్తాయి, దీన్నే రెకీ చెయ్యడం అంటారట!!  కనక దొంగని దొంగే పట్టాలంటారు.


Monday, 25 September 2023

జలే తైలం

 జలే తైలం


 జలే తైలం ఖలే గుహ్యం

పాత్రే దానం మనాగపి

ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి

విస్తారం వస్తుశక్తితః

నీటిపైన నూనె, ఖలునికి తెలిసిన రహస్యం,  అర్హునికిచ్చిన దానం తెలివైనవానికి తెలిసిన శాస్త్రం, అన్నిటికిన్నీ వాటివాటి గుణాల ప్రకారంగా విస్తరిస్తాయి.


 ఆచార్య చణకుని భావం. 

 దుర్జనునికి తెలిసిన రహస్యము, అర్హునికిచ్చిన దానము, తెలివైనవానికి చెప్పిన విద్య,నీటి మీద పడిన నూనె చుక్కలా వ్యాప్తి చెందుతాయి.


దుర్జనునికి రహస్యం తెలిస్తే దానిని ఎవరికి చెప్పకూడదో వారికే చెబుతాడు, ఆ తరవాత జరిగేది విధ్వంసం. అర్హునికి దానమిస్తే దానితో అతను వృద్ధి చెందుతాడు, తనలా ఉన్న మరో కొంతమందిని కూడా వృద్ధిలోకి తీసుకొస్తాడు. తెలివైనవానికి చదువు చెబితే చాలా తొందరగా గ్రహిస్తాడు, అంతే కాదు దానిని మరో పదిమందికి వ్యాప్తి చేస్తాడు.దానిని జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో కనుగొంటాడు.


ఇలాగే

సజ్జనునికి చెప్పిన రహస్యం,అనర్హునికిచ్చిన దానం,తెలివిలేనివానికి చెప్పిన విద్య నీటి మీద నేతి బొట్టులా ఘనీభవించి పోతాయి. ఇవన్నీ వారికి ఉపయోగపడవు, మరొకరికి అంతకన్నా ఉపయోగించవు. ఇదెక్కడో చదివిన గుర్తు.  

Saturday, 23 September 2023

కలయో!

 కలయో!

బాలకృష్ణుడు మన్ను తిన్న సందర్భం.

ఈ సందర్భంగా వ్యాసుని మాటేమీ?

బాలకృష్ణ, బలరాములు పిల్లలతో కలసి ఆడుకుంటున్న సమయం. బలరాముడు మిగిలినపిల్లలు, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదకి చెబుతారు. అంత, యశోద,కృష్ణుని చేయి పట్టుకుని, నీ నోరు నీ వశంలో లేదు.మన్నెందుకు తిన్నావని అడిగింది. మన్ను తిన్నావని వీళ్ళు చెబుతున్నారు.. దానికి కృష్ణుడు, అమ్మా! నేను మన్ను తినలేదు. వీరు చెప్పే నేరములు అబద్ధము, వీరంతా సత్యం చెబుతున్నారనుకుంటే, నీవే నా నోటిని చూడమన్నాడు. ఐతే వీరు చెప్పిన మాట అసత్యమైతే, నీనోరు తెరవమన్నది. కృష్ణుడు నోరు తెరిస్తే అందులో యశోదకు విశ్వరూపం కనపడింది. ఆ సందర్భంగా


కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధి మోహః

అధో ఆముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః

ఏతత్-ఇది ,కిం స్వప్నః-కలయా? ఉత-లేక,దేవమాయా- శ్రీహరిమాయయా? వా-లేక, మదీయః-నాదైన, బుద్ధి మోహః కిమ్- బుద్ధియొక్క వ్యామోహమా? బత-ఆశ్చర్యము! అథో-లేక, ఆముష్య-ఈ, మమ-నా, అర్భకస్య-పిల్లవానిదే ఐన,యః కశ్చన-ఏదో ఒకానొక, ఔత్పత్తికః-సహజసిద్ధమైన, ఆత్మయోగః-తనదైన యోగ సిద్ధియా?

ఇది కలా? లేక వైష్ణవ మాయయా? లేక నాబుద్ధి వ్యామోహపడుచున్నదా? ఆశ్చర్యము! లేక, ఈ పిల్లవానికే, ఏదో ఒక, పుట్టుకతో వచ్చిన యోగ సిద్ధియా? అనుకున్నదన్నారు.


ఇక పోతనామాత్యుడు,ఈ సందర్భంగా

మన్ను తిన్నాడు కృష్ణుడని బలరాముడుగోపాలురు చెబితే, మన్నేటికి భక్షించెదు,.........మఱి పదార్ధము లేదే.. అడిగింది. దానికి మన్నుదినంగ నే శిశువునో... చిన్నపిల్లాణ్ణా,ఆకలేసిందా?వెఱ్ఱివాడినా?వీరిమాటలు నమ్మకు.వీళ్ళు, నేను మన్నుతిన్నానని చెప్పి, నిన్ను నమ్మించి,  నీచేత నన్ను కొట్టించాలని వీరి పన్నాగం. అలాకాదనుకుంటే నా నోరు వాసనచూడు, నా మాటలు తప్పైతే కొట్టమ్మా! అన్నాడు. సరే! అంటే నోరు తెఱచి చూపాడు. నోటిలో విశ్వరూపం కనపడింది, యశోద  ఆలోచించిందిలా అన్నారు 

కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో

తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర

స్థలమో బాలకు డెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర

జ్వల మై యుండుట కేమి హేతువొ మాహాశ్చర్యంబు చింతింపగన్..భాగవతం..దశమ స్కందం..341

అనుకుని విభ్రమ చెందింది. 


మరి నేటి కాలపు సినీ కవి చిన్న చిన్న మాటలతో

అమ్మా! తమ్ముడు మన్ను తినేను! 

చూడమ్మా అని రామన్న తెలుపగా!

అన్నా! యని చెవి నులిమి యశోద

ఏదన్నా! నీనోరు చూపు మనగా

 చూపితివట నీనోటను
బాపురె పదునాల్గు భువనభాండమ్ముల నా
రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్

 జయ కృష్ణా ముకుందా! మురారి

జయ గోవింద బృందా విహారీ 


పై ముగ్గురిలో ఎవరూ యశోద కృష్ణుని నోట విశ్వరూపం చూసి స్పృహ కోల్పోయిందనలేదు.

మళ్ళీ పోతనగారి దగ్గరకొద్దాం.


కలయో- మానవులకి మూడు అవస్థలు. జాగృత, సుషుప్తి,స్వప్నావస్థలు. కలలో మనసు సర్వాన్ని  సృష్టించుకుని వాటితో తాదాత్మ్యంచెంది, దుఃఖిస్తుంది, సుఖిస్తుంది. మెలకువవచ్చాకా నిజంకాదూ? కలా! అనుకుంటుంది. ఇక వైష్ణవమాయయో- ఇదీ కలలాటిదే కాని అనుభవంకూడా ఉంటుంది. నేటికాలపు (virtual reality)  వర్త్యుయల్ రియాలిటీ! ఇతరసంకల్పార్ధమో- ఇతరులు తమ సంకల్పం నాపై ఆపాదిస్తున్నారా? అంటే నేటి  hypnotism,  సత్యమో- నిజమా? తలపన్నేరక యున్నదాననో- ఆలోచింపలేకపోతున్నానా? యశోదా దేవిగానో- అసలు నేను యశోదనేనా? అనుమానపడింది, పరస్థలమో- భూమి మీదకాక మరో గ్రహం మీదకాని ఉన్నానా?  ఆశ్చర్యం! చిన్నకుర్రాడి నోట విశ్వరూపం కనపడ్డానికి కారణమేమై ఉంటుందని తలపోసింది.


పోతనగారు, నేటికాలంలో గొప్పగా చెప్పుకుంటున్న మానసిక స్థితులను నాడే దర్శించినవారు కదా! పోతన మహాశయులకు శతకోటివందనాలు.


Thursday, 21 September 2023

తెనుగువార్తలు-మీడియా

తెనుగువార్తలు-మీడియా

మా చిన్నప్పుడూ అనను. ఆ రోజుల్లో ఈ రోజు పేపరు రేపొచ్చేది. అదొస్తే గొప్పే!!  నోటి మాటే వార్త. ఆ వార్త పేపర్లో కూడా వచ్చిందయ్యా! అంటే శిలాక్షరమని, నిజమని నమ్మేవారం, పల్లెలలో. రోజులు జరిగాయి, రేడియో వచ్చింది. వార్తలకి కొద్దికాలమే, పందులపెంపకానికి గంట సమయం. ఇదీ  రేడియో సంగతి. కాలం జరిగింది దూరదర్శన్  వచ్చింది. ఇదీ ఏం తక్కువ తినలేదు. చివరికి తెనాలి రామలింగడి పిల్లి కతైపోయింది, మాపల్లీయులకు :)  వార్త అంటే,   అందునా ప్రభుత్వ వార్త అంటే  నిజం కాదనే నిర్ణయానికొచ్చేసేం, అప్పుడే!


ఆ తరవాత ప్రైవేట్ టి.వి చానల్స్ వచ్చాయి, తల్లీబిడ్డా న్యాయంగా వార్తలుండేవి, ఇవీ తక్కువకాలమే, వార్తలు నిజానిజాల కలగలుపు.బియ్యంలో రాళ్ళేరు కున్నట్టుండేది. ఆ తరవాత వార్తా చానల్స్ వచ్చాయి. ఈ పాటికే పేపర్లు ఒకే వార్తని వారికి నచ్చిన రీతిలో రాసుకునే రోజులొచ్చాయి. నాలుగు పేపర్లు చదివితేగాని నిజమేంటో తెలిసేదిగాదు. ఆ తరవాత కాలంలో అదీ పోయింది.ఎవరివార్త వారిదే, నిజం ఎప్పుడో ఎగిరిపోయింది,ఇగిరిపోయింది.వార్త లేదు అంతా వారివారి అభిప్రాయాలే వార్తలైపోయాయి.

 ఇక ఆ తరవాత టి.వి చానల్స్ వారు వారికి తగినరీతిలో వార్తలు వండి వార్చుకోడం మొదలైంది, ఇంకేం అస్థాన విద్వాంసులు తిమ్మిని బెమ్మిని చేసి చూపే అలవాటు వచ్చి చేరింది, పేనల్ డిస్కషన్ పేరుతో. దీనితో టి.వి అంటేనే వెగటుపుట్టేసింది.


కాలం కొద్దిగానే నడిచింది.  సోషల్ మీడియా! ఎవరివార్త వారిదే!! ఆ తర్వాతొచ్చింది యు టూబ్, ప్రతివారూ ఒక పత్రికే,వార్త అందించేవారే, ఇక చెప్పేదేమి? ఏది నిజం, ఏది నిజంకాదు.తెలియదు. అంతలా వార్తలు బ్రష్టు పట్టిపోయాయి. మీడియా పేరు జెప్పుకుని భయపెట్టి, బ్లాక్ మైల్ చేసి డబ్బులు సంపాదించుకోడం పాతకాలపు విద్యే! పల్లెవాసులకిది కొత్త. యు ట్యూబ్ చానల్స్ వచ్చాకా మా దగ్గరా ఈ సంస్కృతి మొదలయింది.



ఇప్పుడన్ని వార్తా మాధ్యమాలకి దూరంగా ఉన్నాం. నిజమేంటి ఎవరూ చెప్పరు, కాదు చెప్పలేరు, కొందరటు, కొందరిటు,  తప్పుపట్టేవారే!!పోనీ ఎవడెటు పోతే నాకేం!!! అమ్మయ్యా! ప్రాణం సుఖంగా ఉంది.   ఎప్పుడూ పాలితుడినే, కాదు, ఎప్పుడూ పీడితుడినే!!!

ఏది నిజం? చిదంబర రహస్యం.


Tuesday, 19 September 2023

అంకెలతో ఆట

Match stick magic


 
అంకెలతో ఆడుకోడం ఆనందం. కొంతమందికి చిరాకు కూడా. ఇలా అగ్గిపుల్లలతో అంకెలు తయారు చేయడం వాటితో కొన్ని సమస్యలు సృష్టించడం నేడు జరుగుతున్న పని. ఇది కొంత  మేథను
 మథించేదేకాని ఉపయోగం శూన్యమని నా అవగాహన.
వీటి తో ఏమేo చేయచ్చో చూదాం....

ఒక అగ్గిపెట్టిలో పాతకాలంలో 60 పుల్లలుండేవి. వీటికి హార్స్ హెడ్ మేచ్ బాక్సులని పేరు,   వీటినే అగ్గిడెక్క లేదా డెక్క అగ్గిపెట్టి అనేవారు.. పెట్టిమీద రాసుండేది కూడా సిక్టీ మేచ్ స్టిక్స్ అని. నేటి కాలంలో అగ్గిపెట్టిలో50 గాని 52 కాని పుల్లలుంటాయి. 1 నుంచి 0 అంకెలు తయారు చేయడానికి 49 అగ్గిపుల్లలు కావాలి. ఈ 49 ప్రైమ్ నంబరా? కాదు. ఇలా అంకెలతో  ఆడుకోవడమో వ్యసనం కూడా, దీని గురించి మరో సారి.

ఇప్పుడు1నుంచి0 దాకా అంకెలలో మార్పులు చేర్పులుతో ఏమేం చెయ్యచ్చు....
  
చేర్పు/అదే అంకెలో చోటు మార్పు.

1. కి మరొక పుల్ల చేరిస్తే 7 చేయచ్చు. 
2. కి చేర్పువల్ల అంకె మారదు, ఒకపుల్లను అందులోనే చోటు మారిస్తే 3చేయచ్చు.
3. దీనికి ఒక పుల్ల చేరిస్తే 9 చేయచ్చు , ఒక పుల్ల చోటు మారిస్తే 2,5 చేయచ్చు .
4. ఏమి చేసినా మార్పు రానిది 4 మాత్రమని గుర్తుంచుకోవాలి.
5. ఒక పుల్ల చేరిస్తే 9,6 చేయచ్చు,ఒక పుల్ల చోటు మారిస్తే 3 చేయచ్చు .
6. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చు.ఒక్కపుల్ల చోటు మారిస్తే 0 చేయచ్చు.
7. ఒక పుల్ల చేరిస్తే మార్పు లేదు.
8. చేరిస్తే మార్పురాదు.
9. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చుఒక్కపుల్ల చోటు మారిస్తే 0 చేయచ్చు.
0. ఒక పుల్ల చేరిస్తే 8  చేయచ్చు.

ఒక పుల్ల తీసేస్తే
1 నుంచి  6 దాకా ఒకపుల్ల తీసేస్తే అంకెలో మార్పు రాదు.
7.లో పుల్ల తీసేస్తే 1 చేయచ్చు.
8.లో పుల్ల తీసేస్తే 0 చేయచ్చు.

ఇలాగే రెండు పుల్లలు చేరిస్తే,  ఏమవుతుంది చూడచ్చు.ఒక రూపాయి అగ్గిపెట్టేతో డబ్బులు సంపాదిస్తున్నారు, రోడ్ పక్క ఒక చిన్న స్టాండ్ వేసుకుని ఇలా సమస్యలు పెట్టి తికమకపెట్టి. ఇది ఒక మానసిక ఆటలా చెప్పి మనుష్యులని చిన్న సమస్య చెయ్యలేకపోయామనే కసిపెంచి, డబ్బులు పోగొట్టుకునేలా చేస్తున్నారు. అందుకే ఈ టపా..,.హెచ్చరిక. ఇందులో వింతే లేదు! ఇందులో చిక్కుకోకండి...
2-2=6 ఒక్కపుల్ల మార్చండి,   ఆ తరవాత 1-2=6. ఒక్కపుల్ల మార్చండి బహుమతి గెల్చుకోండంటూ అరుస్తున్నాడు. ఒక్క క్షణం ఇంత చెప్పిన నేనే బిత్తరపోయా!! ఆ తరవాత ఫక్కున నవ్వుకున్నా!!!!!

 డబ్బులుపోగొట్టుకునేవాళ్ళు పోగొట్టుకుంటూనే ఉన్నారు.

Saturday, 16 September 2023

Correct the equation

Correct the equation 



Digits are formed by arranging match sticks which can be moved


 Correct the equation by moving only one match stick

Thursday, 14 September 2023

సెల్ఫీ

 సెల్ఫీ


ఒకప్పుడు ఫోటో తీయించుకోవడమంటే గ్రూప్ ఫోటో యే. మరికొంచం వెనక్కెళితే అది కలిగినవారు తీయించుకునేది, అదిన్నీ చెల్లిపోయిన తరవాతే! నాడు ఫోటో తీయడానికి చాలా బాదరబందీ! చెప్పుకుంటూ పోతే చాటు భారతమంత. ఇదివరలో ఒక టపా సాయించినగుర్తు. లింక్ వెతికే ఓపిక లేక విరమించుకున్నా! 


ఆ తరవాత కాలంలో పెళ్ళిళ్ళకి ఫోటోలు తీసుకోడం అలవాటయింది. అదీ ఖరీదు వ్యవహారమే! అన్నీ బ్లేకండ్ వైటే..ఆ తరవాత డబ్బా కెమేరాలొచ్చాయి. అందులో పదిహేనో ముఫైయ్యో ఫోటోలు తీసుకోడానికో ఫిల్ము,అవీ బ్లాక్ వైటే. అదీ ఖరీదైన వ్యవహారమే! ఇదీ కలిగినవారి మాటే. తరవాత కాలంలో ఇందులో కలర్ ఫిల్ములొచ్చాయి. దేనికైనా రీలు కడగడం ప్రింట్లు వెయ్యడం ఖర్చుతో కూడినదే! ఆ తరవాత స్తబ్ధుగా నడిచింది కొంత కాలం.  ఆ తరవాతది డిజిటల్ యుగం. ఫిలుము వగైరాబాదరబందీ లేక ఫోటో తీసుకునే అవకాశం, నిమిషాల్లో ఫోటో వచ్చే సావకాశం. కొద్దికాలమే గడిచింది, సెల్ ఫోన్ రావడంతో విప్లవం. ఫోటో ఎక్కడపడితే అక్కడ, ఎవరికిపడితే వారికి ఫోటో తీయడం అలవాటయింది. హార్డ్ కాపీకావాలంటే ప్రింట్ ఎప్పుడూ తప్పలేదు. డబ్బా కెమేరాల కాలంలో అంతా బ్లాక్ అండ్ వైటే! అప్పుడు కలర్ ఫోటో విప్లవం. ఇప్పుడంతా కలరే! తెల్లకాగితం మీద కూడా ప్రింట్ తీసుకునే బాదరబందీ లేని సావకాశం ఇంకేంచెప్పేది?


ఆ తరవాతది సెల్ ఫోన్ లోనే తనఫోటో తనుతీసుకునే సావకాశం, అదే సెల్ఫీ.దీంతో కూచుంటే ఫోటో నుంచుంటే ఫోటో, పడుకుంటే ఫోటో.ఎక్కడో ఒక మాధ్యమానికి ఎక్కించెయ్యడమే!


ఈ సెల్ఫీ జ్వరం సామాన్యులకే కాదు మాన్యులకీ ఉందిట :) మొన్న జి.-20 లో ఒక ముసలినాయకుడు ఒక ముసలి నాయకురాలితో సెల్ఫీ దిగేట్ట. అదో పెద్దవార్తైపోయిందా రెండు దేశాల్లోనూ. ఇలాగే మరొకరితో సెల్ఫీ, రైలింజన్తో సెల్ఫీ, విమానంతో సెల్ఫీ, ఈ జ్వరం ఎంతగా ముదిరిందంటే, పిల్లలు, పెళ్ళాంతో కలిసి వరదలో నుంచుని సెల్ఫీకి ప్రయత్నిస్తే పెళ్ళాన్ని వరదెత్తుకుపోయింది. ఇటువంటి వెన్నో! ఈ సెల్ఫీతో పాటే సెల్ఫీ వీడియో! వామ్మో దీని గురించి చెప్పడం మొదలెడితే....అసభ్య చిత్రాలు అతి లాఘవంగా నెట్ ని ముంచెత్తుతున్నాయి. ఇక ఆపేస్తానూ...


ఆతర్వాతది వాట్సాప్, సెల్ఫీకి పరాకాష్ట. నిమిషనిమిషానికి సెల్ఫీ ఆతరవాత అది స్టేటస్ లో అప్ లోడూ. ఈ పిచ్చి నాకూ పట్టింది, ఎందుకూ?? బ్లాగులో బుద్ధిగా టపా రాసుకునేవాణ్ణి, కాలు విరిగి మంచాన పడటంతో వాట్సాప్ వాడకం పెరిగింది. దాంతో సెల్ఫీల పిచ్చి పెరిగింది.అంతా సెల్ఫిలు పెడుతుంటే. పిచ్చిగా తీసుకున్నా సెల్ఫీలు, అదేంటో ఒక్కటి నచ్చలేదు, స్టేటస్ లో పెట్టడానికి. అన్నీ డిలీటాయనమః

ఒక సెల్ఫీ అందంగా ఉండేలా తీసుకోడమెలాగో ఉపాయం చెప్పండి. :)


Tuesday, 12 September 2023

వినాశ కాలే విపరీతబుద్ధిః

వినాశ  కాలే విపరీతబుద్ధిః 


రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః

పాపే  పాపాః   సమే సమాః

రాజానమనువర్తంతే

యథా రాజా తథా ప్రజాః

(ఆచార్య చణకుడు)

రాజు ధార్మికుడైతే ప్రజలు ధార్మికులై ఉంటారు. రాజు పాపకార్యాలు చేసేవాడైతే ప్రజలూ పాపకార్యరతులే! రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.


న నిర్మితా కేన న దృష్టపూర్వా

న  శ్రూయతే హేమమయీ కురంగీ

తథాపి తృష్ణా రఘునందనాస్య

వినాశ   కాలే విపరీతబుద్ధిః 

(ఆచార్య చణకుడు)


ఇంతకు ముందు బగారు లేడిని ఎవరూ నిర్మించలేదు, చూడలేదు, దాని గురించి వినలేదు. కాని బంగారు మాయలేడి కనపడితే రఘురాముడే ఆకర్షింపబడ్డాడు. వినాశ కాలానికి విపరీత బుద్ధులే పుడతాయి.


బంగారు లేడిని చూసినది సీత. ముచ్చటపడింది. బంగారు లేడి ఉండదని ఎప్పుడూ,ఎవరూ చూడలేదని తెలియనిదా సీత?. కాని ఆ క్షణానికి మాయ కమ్మింది. ఆలోచన నశించి రాముణ్ణి బంగారు లేడిని పట్టి తెమ్మని కోరింది. ఎప్పుడూ సీత కోరిక కోరినది కాదు, మరి ఈ సారి కోరిక కోరింది, అదిన్నీ తన వీరత్వానికి సంబంధించినదీ, కావచ్చు. రాముడికి మాత్రం బంగారు లేడి ఉండదని తాము రాక్షసుల మధ్య ఉన్నామని, వారి ఏ పన్నాగమైనా కావచ్చని తెలియనివాడా? సీతలాగే మాయలో పడిపోయాడు. విల్లంబులు పుచ్చుకు బయలుదేరాడు.   లక్ష్మణుడు  అన్నా! ఇది రాక్షసమాయ కావచ్చు, అని  చెప్పినా వినలేదు. బయలుదేరుతూ లక్ష్మణునికి సీత గురించి జాగ్రత్తలూ చెప్పాడు.

 అదే వినాశకాలె విపరీత బుద్ధి,కష్టపడే కాలానికి ఇటువంటి బుద్ధులే పుడతాయి.


కయ్యానికైనా వియ్యానికైనా ........

కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలి.


కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలి, ఇదోనానుడి.అలాగే కుర్రాడితోనూ గుణం తక్కువవాడితోనూ దెబ్బలాడకు. ఏమి వీటి సంగతి? యోచించగా...చించగా.....


కుర్రాడితో దెబ్బలాడితే ఇంతవయసొచ్చింది కుర్రాడితో గొడవేంటయ్యా! అనేస్తారు, తప్పెవరిదైనా, చూసేవాళ్ళు, విషయం తెలుసుకోకనే!అంచేత కుర్రాడితో వివాద పడటం మంచిదికాదని ఉవాచ. ఇక గుణం తక్కువవాడు, ఈ మాట అనచ్చు ఇది అనకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇది ఉచితం,ఇది అనుచితం అనే ఇలాటి శషభిషలేం పెట్టుకోడు. దీనికితోడు వీడు బలవంతుడై ఉంటాడు. దాంతో ఎవరూ నిజం మాటాడరు. పోనిద్దురూ గొడవెందుకూ అనేస్తారు. ఎం?అంటే, ఒక్కమాటలో చెప్పాలంటే, భయం.  రేపు నిజం మాటాడినవారి ఇంటి మీద రాళ్ళేస్తాడేమో,కాదు వేస్తాడు, తన పెళ్ళాన్ని, కూతుర్ని  గొడవపెడ్తాడేమో అని భయం. అందుకు గుణం తక్కువవాడి జోలికే పోకూడదు. 


అందుకే కయ్యానికైనా వియ్యనికైనా సమ ఉజ్జీ కావాలి. అదేంటో! కయ్యానికి ఉజ్జీ సరిపోవాలి, అంటే సమానంగా దెబ్బలాడగలిగి ఉండాలి. అది వాక్కలహమైతే ఒకరో మాటంటే ఎదుటివారు దాన్ని తిప్పికొట్టగలగాలి, అదిన్నీ వెంట, వెంటనే కావాలి.  మరి ఈ వాక్కలహంలో చణుకులు, సామెతలు, ముచ్చట్లు, దెప్పులు, ఎగతాళీలు వరదగోదారిలా సాగిపోతాయి. ఇది కవులు రచయితల మధ్యనైతే చదువరులకు పండగే, చెళ్ళపిళ్ళవారికి, శ్రీపాదవారికి మధ్య జరిగిన వాక్కలహంలో ”ఈ ’దాక’లో అరసున్నా వేయించండి”, అన్నదో చెణుకు. నిజానికి చూసేవారికిదో గొప్ప అనుభూతి కూడా! ఇటువంటి వాక్కలహం రాతలో ఉంటే అబ్బో! అదో గొప్ప. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. ఆనందిస్తుంటారు కూడా.  మరి ఈ వాక్కలహంలో సరితూగలేకపోతే, తిట్లు,శాపనార్ధాలు  చోటు చేసుకుంటాయంటే, సరి తూగలేనివారు, ఉడుకుబోతుతనంతో తిట్లకి లంకించుకుంటే,   త్వం..అంటే త్వం.. అనుకుంటే,  అది అసహ్యంగా ఉంటుంది.   ఒక వేళ సరితూగలేకపోతే ఏ సమయంలో తగ్గిపోవాలో తెలిసుండాలి. ఆ తగ్గిపోవడంలో కూడా అందముండాలి. అలా తగ్గిపోయారని ఎదుటివారు రెచ్చిపోతే... ఇక చూడు నా సామిరంగా, చూస్తూన్నవాళ్ళు అలా రెచ్చిపోయేవాళ్ళ తలంటేస్తారు. సమయం చూసుకు   తగ్గిపోవడం కూడా కళే సుమా!



ఇక బాహాబాహీ కలహమైతే ఇద్దరూ సమాన బలం కలవాళ్ళైతే! అదీ వింతే, చూచేవారికి ఆనందం, రెచ్చగొట్టేవారికి... చెప్పెదేలేదు. అలా సమ ఉజ్జీలు కాకపోతే అబ్బే! చప్పగా ఉంటుంది.


వియ్యానికో! అంటే ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు, ఆర్ధికంగా, బంధుబలగంలో సరిసమాన ప్రతిపత్తులున్నవారు, వరుడు,వధువు అన్నిటా సరితూగేలా ఉంటే చూడముచ్చట. 


చూతము రారండి.

 శ్రీ సీతారాముల కల్యాణము చూతమురారండి.        

సురలును మునులును చూడవత్తురట

చూచువారలకు చూడముచ్చటగ

 పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట, 

భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట,

 చూతము రారండి, 

శ్రీ సీతారాముల కల్యాణము 

చూతమురారండి.

Thursday, 7 September 2023

ధనికః శ్రోత్రియో రాజా

 ధనికః శ్రోత్రియో రాజా

(999 post)


 ధనికః శ్రోత్రియో రాజా

నదీ వైద్యస్తు పంచమః

పంచ యత్ర న విద్యన్తే

న తత్ర దివసం వసేత్

(ఆచార్య చాణక్య)

డబ్బున్నవాడు (అప్పిచ్చేవాడు)శ్రోత్రియుడు (వేదం చదువుకున్నవాడు)రాజా (రక్షకుడు)నదీ ( ఎల్లప్పుడు పారేదానినే నది అంటారు)వైద్యుడు, ఈ ఐదుగురు ఉన్నవూరిలో ఉండు. లేని ఊరిలో ఒక్కరోజు కూడా ఉండకు.


అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడతెగక బారు నేరును ద్విజుడున్

జొప్పడిన యూరనుండుము

   చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ.

ఆచార్య చణకుడు ఐదుగురిని చెబితే సుమతీ శతకకర్త నలుగురితోనే సరిపెట్టేరు, ఎందుకో చెప్పలేను, తెలిస్తే చెప్పండి.



లోకయాత్రా భయం లజ్జా

దాక్షిణ్యం త్యాగశీలతా

పంచ యత్ర న విద్యంతె

న కుర్యాత్ తత్ర సంగతిమ్

(ఆచార్య చాణక్య)


లోకయాత్రా (జీవనోపాధి) లేనిచోట,భయం,లజ్జ (సిగ్గు),అభిమానం(దాక్షిణ్యం)త్యాగశీలత ( ఈవి కలిగి ఉండటం, విడిచేగుణం కలిగి ఉండటం) మనుషుల్లో,ఈ ఐదున్నూ లేనిచోట ఉండకు.


ఆతురె వ్యసనె ప్రాప్తె

దుర్భిక్షె శత్రుసంకటె

రాజద్వారె శ్మశానె చ

యస్తిష్టతి స బాంధవః

(ఆచార్య చాణక్య)


ఆతురె(అనారోగ్యం)లో, వ్యసనె(దుఃఖం, దురదృష్టం)లో, దుర్భిక్షం (కరువు కాలం)లో శత్రుసంకటె (శత్రువు దాడి చేసినపుడు), రాజద్వారె(రాజసభ, కోర్టు)లో, శ్మశానె(శ్మశానం)లో వదలక ఉండే బంధు సమానుడు ఎవరు? 


న పశ్యతి చ జన్మాంధః

కామాంధో నైవ పశ్యతి

మదోన్మత్తా న పశ్యతి

అర్ధి దోషం న పశ్యతి.


పుట్టిగుడ్డి ఎప్పుడూ చూడలేరు.కామంతో కళ్ళు మూసుకుపోయినవారూ చూడలేరు. మదోన్మత్తులూ చూడలేరు.

కోరేవారికి దోషం కనపడదు.


పుట్టుగుడ్డివారెప్పుడూ చూడలేరు. కాని కామాంధులు గర్వాంధులు కూడా కాన లేరు. ఇకా యాచన చేసేవారికిన్నీ అడగకూడనిది, అడగతగినది ఉండదు, తమకు కావాలి అంతే! అడిగేస్తారు. ఉదాహరణలు చూదాం.

 కామాంధులకు, మొదటగా చెప్పుకునేవాడు రావణుడు, గర్వాంధుడు కూడా.తరవాత చెప్పుకోదగ్గవాడు కీచకుడు, మాలిని రూపంలో ఉన్న ద్రౌపదిని మోహించాడు, అంతే.. తరవాత కత తెలిసినదే!. ఇలాటి వాడే మరొకడు సైంధవుడు. కౌరవుల, పాండవుల చెల్లెలైన దుస్సల భర్త. ముని ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని మోహించి ఆమెను బలవంతంగా రథం మీద తీసుకుపోతుంటే ధౌమ్యుడు అరచి పండవులతో చెప్పగా, పాండవులు ద్రౌపదిని కాపాడారు.  సైంధవునికి  ద్రౌపది చెల్లితో సమానం. కామంతో కళ్ళు మూసుకుపోయి, వీరంతా చచ్చారు.


చివరగా అర్ధికి ఉచితానుచితాలు తెలియవనడానికి, కళ్ళు కానవనడానికి ఉదాహరణ, దేవతలు ధధీచి వెన్నెముక అడగడం