29, ఆగస్టు 2022, సోమవారం

మళ్ళీ జూదం (అనుద్యూతం)

మళ్ళీ జూదం (అనుద్యూతం)

అంధ్రమహాభారతం,సభాపర్వం,ద్వితీయాశ్వాసం 270 నుండి 279 వరకు స్వేఛ్ఛానువాదం.


 జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ధర్మరాజుకి,కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పి, వారి రాజ్యం వారికిచ్చి పంపించాడు. వారంతా ఇంద్రప్రస్థం వెళ్ళారు. 


"ఇక్కడ జరిగిన సంగతంతా దుశ్శాసనుడు అన్న దుర్యోధనుని చెవిని వేశాడు. దుర్యోధనుడు, కర్ణ, శకుని,సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి,ఎంతమంచి చేసినా పాండవులకు ప్రీకరమైనవాళ్ళమవుతామా? పగపట్టిన పాముని మెడలో వేసుకున్నట్టయింది, పొరపాటు చేసేసేం.బలవంతులైన అర్జున,భీమ, నకుల సహదేవులను యుద్ధంలో గెలవగలమా? అంచేత మళ్ళీ వాళ్ళని ద్యూతం లో ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టడం చేయవలసిన పనని ధృతరాష్ట్రుని చెప్పగా ఒప్పుకుని మళ్ళీ జూదానికి రమ్మని ప్రాతికామిని పంపించాడు. ప్రాతికామి చెప్పినకబురుతో ధర్మరాజు, అనుజ,భార్యా సహితుడై హస్తిన చేరాడు, తండ్రి మాట జవదాటలేనని, మిత్రులు ప్రజలు గోలపెడుతున్నా!. ఇదివరలాగే అదే సభాభవనంలో ఆసీనులుకాగా, శకుని ధర్మరాజుతో సంపదలు రాజ్యము మీకు ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇచ్చేడు, కనక వాటిని పందెంగా ఒడ్డి అడటం కుదరదు.ఇప్పుడు నేను చెప్పే పందెం అపూర్వం. ఇందులో ఓడినవారు నారచీరలుగట్టి,బ్రహ్మచర్యంతో, కందమూలఫలాలు తింటూ, పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి, పదమూడో ఏట జనపదంలో అజ్ఞాతవాసమూ చెయ్యాలి. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసమూ, ఆపై అజ్ఞాతవాసమూ చెయ్యాలి. ఇందుకు ఇష్టపడితే జూదమాడదామన్నాడు. ధర్మారజు పందెం ఒడ్డేడు, ఓడిపోయాడు. అన్నట్టుగానే నారచీరలుగట్టి వనవాసానికి పోయారు."  

కొద్దికాలం కితం జూదం జరిగినదానికి, కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పిన ధృతరాష్ట్రుడు, మళ్ళీ జూదానికెందుకొప్పుకున్నట్టు?


కొడుకు మొహమాటం లేకుండానే చెప్పేసేడు, వాళ్ళు బలవంతులు, యుద్ధం చేసి నెగ్గలేం. ఎలాగైనా వాళ్ళని రాజ్యం నుంచి బయటకి తోలెయ్యడమే కావలసింది, అనికూడా చెప్పేసేడు. ధృతరాష్ట్రునికి కావలసింది కూడా పాండవులు బయటికిపోవడమే! కాని అది తను చేస్తున్నట్టు ఉండకూడదు, అదీ ఉద్దేశం. మూలకారణం ధృతరాష్ట్రుడే! 

కితం సారి జూదం జరిగినపుడు సభంతా కలగుండుపడింది, నాడు జరిగిన విషయాలన్నీ అందరికి బాధ కలిగించాయి. గాంధారి అగ్నిపర్వతంలా ఉంది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేనట్టు ఉంది. ఇక ద్రౌపది బద్దలైన అగ్ని పర్వతమే, వాళ్ళని చల్లార్చకపోతే నాడు కురుక్షేత్రం అక్కడే జరిగుండేది. అందుకు వరాలిచ్చి బులిబుచ్చి మాటలు చెప్పి వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కొడుకు చెప్పిన పథకం నచ్చింది. ఇందులో రాజ్య ప్రసక్తిగాని, స్త్రీలను అవమానించే ప్రసక్తిగాని లేదు. పదమూడేళ్ళ తర్వాత ఏమగునో? ఎవరి కెరుక? అదేగాక అజ్ఞాతంలో దొరికితే మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చెయ్యాలి, పథకం బాగా నచ్చింది, ధృతరాష్ట్రునికి, అందుకే మళ్ళీ కబురు పెట్టేడు. ధర్మరాజుకి బుద్ధి లేదా? ఆయనదొకటే మాట తండ్రి చెప్పేడు, అంతే!


27, ఆగస్టు 2022, శనివారం

ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.

 ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.


జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. 

మహాభారతం, కవిత్రయ ప్రణీతం, సభాపర్వం,ద్వితీయాశ్వాసం 264నుండి 267 వరకు.


"అనిన ధృతరాష్ట్రుండు కోడలిగుణంబుకు ధర్మంబెరుగుటకు సంతసిల్లి యనుజ సహితంబుగా యుధిష్ఠరు రావించి నీవు సర్వసంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖంబుండుము నీకు లగ్గయ్యెడు మని వెండియు.......264


నీవు నిత్యము వృద్ధోపసేవజేసి యెరుగు దెల్లధర్మంబుల నెరుక లేక

కడగి నీ కెగ్గు సేసె నాకొడుకు దీని మఱచునది నీకు నొండ్లు గఱపనేల...265


మనమున వేరమి దలపమియును సక్షమచిత్తుడగుటయును గుణంబులుకై

కొని దోషంబులు విడుచుటయును నుత్తముడయిన పురుషునుత్తమగుణముల్....266


యేను బుద్ధిలేక జూదంబుపేక్షించితి. నల్పబుద్ధిసత్వుం డయిన నన్నును మీతల్లి యయిన గాంధారినిం దలచి,దుర్యోధనాదులు సేసినదుర్నయంబులు సేకొనకుండునది. సర్వశాస్త్ర విదుండయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండువుగా నిక్కురుకులంబునకు లగ్గగునని ధర్మరాజు బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన...267"


//నీ సంపదలు,స్వరాజ్యం తీసుకుని ఇంద్రప్రస్థం వెళ్ళి సుఖంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది.నీవు పెద్దవాళ్ళని సేవించడం మూలంగా ధర్మాలన్నీ తెలుసు, నాకొడుకు ధర్మం తెలియక నీకు కీడు చేసేడు, దీన్ని మరచిపో! అన్నీ తెలిసినవాడివి నీకు మరొకరు చెప్పాలా! మనసులో వేరుగా తలపకపోవడం, క్షమాచిత్తం కలిగి ఉండడం, మంచిని తీసుకుని చెడును వదలిపెట్టడం ఉత్తములైనవారి ఉత్తమగుణాలు.

నేను బుద్ధిలేక జూదాన్ని తేలికగా, అశ్రద్ధగా,తీసుకున్నాను. నిర్లక్ష్యం చేశాను.  అల్పబుద్ధి కలిగిన నన్నూ మీతల్లి గాంధారిని తలచి, దుర్యోధనాదులు చేసిన చెడ్డపనులు మనసుకు తీసుకోకు. సర్వశాస్రాలూ తెలిసిన విదురుడు మంత్రిగా నీవు రక్షకుడవుగా ఉంటే ఈ కురుకులానికి మంచి జరుగుతుందని చెప్పి ధర్మరాజుకు పాండురాజు రాజ్యం సమర్పించాడు. //


నాకు బుద్ధిలేకపోయిందయ్యా! నాకు బుద్ధి లేకపోయి జూదాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేశాను. స్వార్ధబుద్ధి కల నన్నూ మీ తల్లి గాంధారి ముఖాలు చూసి నాకొడుకు వాని అనుచరులు మీ పట్ల చేసిన చెడ్డపనులు మరిచిపో, క్షమించు. 

26, ఆగస్టు 2022, శుక్రవారం

నమస్కారం



 నమస్కారం


బ్లాగులో రాయడం అన్నది ఒక వ్యసనమైపోయింది, నాకు, కాని బ్లాగు రాయడం కూడా ఒక కళే! కలకాదు సుమా! :) 


కాదు సుమా! కలకాదు సుమా!! అమృతపానమున అమరగానమును, గగనయానమును కల్గినట్లుగా గాలినితేలుచు  సోలిపోవుటిది, 

కాదు సుమా! కలకాదు సుమా!! 


 బ్లాగు మొదలుపెట్టి పదకొండేళ్ళవుతోంది. ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుభవిస్తూ వాటిని బ్లాగులో పంచుకోవడం అలవాటయిపోయింది. ఈ అలవాటు ఎప్పుడు తప్పుతుందో తెలియటం లేదు. నేనా సహస్రచంద్ర దర్శనానికి దగ్గరలో ఉన్నాను, శని ప్రస్తుతం మకరం లో ఉన్నారు, శని మేషం లోకి వచ్చేదాకా ఇది కొనసాగగలదని అనుకుంటున్నాను :). 

దీనికి తోడు కవిని కూడా (కవి,కనపడదు, వినపడదు)ఇప్పుడు మాటాడాలంటే ఎవరు ఉంటారు?ఉన్నన్నాళ్ళూ ఇల్లాలు వినేది, నాలుగేళ్ళయింది, దాటిపోయి.  నా చెవిటి గోల వినడానికి ఎవరు ఉంటారు  ? ఎవరిగోల వారిది కదా! అందుకు వాటిని బ్లాగులో ఒలకబోసుకోవడం. :) బ్లాగులో రాసేవి ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించినవి కావు. నాకెవరి మీద కోపం, కసి,ద్వేషం లేవు, రావు కూడా! మౌనేన కలహో నాస్తి అని నమ్మినవాడిని. చదువుకోనివాడిని, పల్లెటూరివాడిని, మా పల్లెటూరి మాటలు సున్నితంగా ఉండవు, కొంచం మోటు కూడా!. డిగ్రీలు లేవు, యూనివర్సిటీలు ఎరగను, కాలేజి మెట్లే ఎక్కనివాడిని యూనివర్సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం కదా! చిన్నప్పుడు బట్టీ వేసిన కొన్ని శతకాలు మాత్రం అస్తిగతాలు. అవే బయటపడుతుంటాయి.  మనసులో బాధ, సంతోష వ్యక్తం చేయడమే! ఎవరేనా కొన్నిమాటలు గాని, కొన్ని టపాలుగాని తమను ఉద్దేశించినవి అని అనుకుంటే అసహాయుడను.

నమస్కారం.


 ఆగండి! ఆగండి!! ఎవరో ఏదో అన్నారని, అనుకున్నారని బ్లాగులో రాయడం మాత్రం మానలేను, లేను,లేను.   


మరోసారి నమస్కారం పెట్టను ఎందుకో చెప్పండి :)

25, ఆగస్టు 2022, గురువారం

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

 ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?


ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264 వరకు స్వేఛ్ఛానువాదం


ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. 


ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు,దుర్యోధనుడు. 

దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృద్ధులు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. 


దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే!  నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు.

ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. 


విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి

’నా కోడళ్ళంద’రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. 


నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు. ధర్మరాజా! నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,  ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు.


 ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి...



23, ఆగస్టు 2022, మంగళవారం

రుచి చేకురునటయ్య భాస్కరా!

 రుచి చేకురునటయ్య భాస్కరా!


కొంతమందితో మాటాడకపోవడం తప్పు. మరికొంతమందితో మాటాడటమూ తప్పే. ఎవరితో మాటాడాలి ఎంతవరకు మాటాడాలి, ఎలా మాటాడాలి అన్నదే వివేకం. దానినే భాస్కరశతకంలో ఇలా చెప్పేడు,శతకకారుడు. 


చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము జేసినయైన యందు ఇం  

 పొదవెడునుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా!


ఎంతచదువు చదివినా మాటాడకూడని చోట మాటాడటం మాటాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పే! ఇది తెలుసుకోవడమే రుచి కలిగించే ఉప్పులాటి రసజ్ఞత.


ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని 

హీనుడవగుణంబు మాన్చలేడు

బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు 

విశ్వదాభిరామ వినుర వేమ


పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదు.పాముకి పాలు పోసిపెంచినా విషమే కక్కుతుంది. ఇది తెలుసుకోవడం విజ్ఞత.


ఎంత విజ్ఞానం ఉండి ఆచరణలేని విజ్ఞానం నిష్పలం, ఉపయోగంలో లేని విజ్ఞానం అడవికాచిన వెన్నెల.


21, ఆగస్టు 2022, ఆదివారం

వాక్స్వాతంత్ర్యం

 వాక్స్వాతంత్ర్యం


ఏంటో! 

వాక్స్వాతంత్ర్యం,ఈ మాట రాయడమే ఇంత కష్టంగా ఉందే!ఈ హక్కును నిలుపుకోడం ఎంత కష్టమో కదా! 


ఈ హక్కు గురించి మాటాడేవారంతా, వారేమైనా అనచ్చు, కాని ఎదుటివారు ఏమీ అనకూడదు, ఇదీ వారి వాక్స్వాతంత్ర్యం. సుప్రీం కోర్టువారేమో, ప్రతి స్వాతంత్ర్యానికి హద్దుంటుంది, అదేముద్దు అంటారు.సుప్రీం కోర్టు లెక్కా :) సుప్రీం కోర్టు నే ఏమైనా అంటాం అంటున్నారు.   


ముఫై ఎకరాల మా కాలేజి కాంపౌండ్ రోజంతా పెళ్ళివారిల్లులాగే ఉంటుంది. ఉదయం నాలుక్కి నడిచేందుకొచ్చేవాళ్ళతో ప్రారంభం, నడిచేవాళ్ళు,యోగా చేసేవాళ్ళు, ఇండోర్ లో టెన్నిస్ అడేవాళ్ళు, ఇలా రకరకాలుగా మొత్తం దగ్గరగా రెండొందలమంది ఉంటారు,ఉదయం. 

పున్నమినాడు అస్తమిస్తున్న చంద్రుడు  


 ఇలా నడుస్తుంటారు, జట్లు,జట్లుగా  


ఉదయం నా కార్య స్థానం, అప్పటికే యోగా చేస్తున్న మిత్రుడు.  



యోగా క్లాస్  


 నాది తక్కువ అంచనా!! మాకో కల్బ్ ఉంది దానిపేరు జి.బి.ఆర్ వాకర్స్ క్లబ్, దీనికి అనుబంధంగానే మిగిలిన సబ్ క్లబ్బులన్నీ, అవే యోగా క్లబ్,టెన్నిస్ క్లబ్. ఎనిమిది దాటితే వీళ్ళెవరూ ఉండరు. పిల్లలొచ్చేస్తారు. సాయంతరం నాలుగు దాటిన తరవాత పిల్లలంతా వెళ్ళిపోతారు. ప్పుడు స్త్రీలు ఎక్కువా, పురుషులు తక్కువా, ముసలాళ్ళు ఉదయం సాయంత్రం సమానంగా ఉంటూంటారు,నడకకి.   


వీళ్ళూ మరో మూడువందల మందిదాకా ఉంటారు,అదిన్నూ రాత్రి ఎనిమిది దాకా. కేంపస్ అంతకీ లైటింగ్ ఉంటుంది,ఉదయం నాలుగునుంచి ఆరు, సాయంత్రం ఆరునుంచి ఎనిమిది.మా ఊళ్ళో మూడు వాకింగ్ ట్రేక్ లు ఉన్నాయి. మాదే మొదటిదిన్నూ! రెండోది పక్క హైస్కూల్ గ్రవుండ్లో, మూడోది రైల్ ఫైఓవర్ కి అప్రోచ్ రోడ్ కింద, ట్రేక్ అవతల. నాలుగోది రైల్వే ప్లాట్ఫారం.ఇన్ని చోట్ల చాలమంది నడుస్తూనే ఉంటారు,రోజూ, ఉదయం,సాయంత్రం.   


నేను వేసవి,వర్షకాలాలలో ఉదయమూ, శీతకాలంలో సాయంత్రమూ నడవడానికి వెళతాను. చాలామందికి నా పేరు తెలియకపోయినా నన్ను ఎరుగుదురు,పాతికేళ్ళ దగ్గర సమయంలో ఆ వాకర్స్ క్లబ్ స్థాపకుల్లో నేనూ ఒకడిని.  కవిని కూడా కదా! :) కర్ర పుచ్చుకు తిరుగుతుంటాను, అందుకు అందరికి ఎరుకే! :) నేనెవరితోనూ మాటాడగా ఎవరూ చూసి ఉండరు ఆ కేంపస్ లో! :)

మామూలు రోజుల్లో ఎక్కడవాళ్ళు అక్కడ, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వర్షం వస్తే మటుకు అందరూ చాలా పొడుగైన మా వరండాలని ఆక్రమించేస్తారు :) ఈ వరండాలో ఒక యువకుడు యోగా చేస్తాడు, రోజూ, ఎండవానలు వేటిని లెక్క చేయక, మరొకరు కూడా ఆయనతో ఉంటారు, కాని చెప్పలేం. ఇక నేను నా కోటా నడక తరవాత ఈ వరండాలో యువకుని పక్క చేరి ప్రాణాయామం చేస్తాను, ఒక అరగంటపాటు. అలుకు తీర్చుకోడానికి కొంతమంది ఈ వరండా మీద కూచుంటుంటారు, అది అలవాటు.  


ఇలా జరుగుతుండగా,నిన్న ఉదయం నా పక్క యోగాసనాలు వేస్తున్న మిత్రుడు నా దగ్గరకొచ్చి,మీరు టెలిఫోన్ లో పని చేశారు కదా! పని చేయకుండా జీతాలు తీసుకున్నారని తిడుతున్నాడని అక్కడే  అలుకు తీర్చుకోడానికి కూచున్న యువకుడిని చూపించాడు.


ఒక క్షణం విస్తుపోయా! తేరుకుని మాటాడటం మొదలెట్టా! నేనెప్పుడూ మాటాడగా చూడని చుట్టు పక్కలవారంతా కూడిపోయారు. నిన్న మొన్నలో, మనం స్వాతంత్ర్య అమృతోత్సవం జరుపుకున్నాం కదా! మనకు పెద్దలు     సంపాదించి పెట్టిన స్వాతంత్ర్య హక్కుల్లో వాక్స్వాతంత్ర్యం ఒకటి. అతనలా తిట్టుకుంటున్నాడా? కాదనే హక్కు మనకు లేదు,తిట్టుకోమను, అడ్డుపడకు. అతనికో సలహా చెప్పు అతనితో పాటుగా మనల్ని తిట్టడానికి మరో పది మందిని కూలీకి నియమించుకోమను,తిట్టడానికి, మరెక్కడో వద్దు, ఇక్కడే ఎదురుగా తిట్టించమను, మన గ్రవుండ్ లో ఉన్నవాళ్ళందరిని పిలుద్దాం! తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని చెప్పు. ఆ తరవాత మాట, తిట్టిన ప్రతి తిట్టుకు ఒక రూపాయి ఇమ్మను! అంత చెయ్యలేడా పోనీ మొత్తానికి ఒక రూపాయి నా చేతులో పెట్టమను, అదీ చేయలేడా సరే! ఒక నమస్కారం పెడదాం, ఏమంటావు? అని ఊరుకున్నా! 


ఇది విన్నవాళ్ళంతా ఒక్క సారి గొల్లు మన్నారు.కార్యక్రమం ఎప్పుడో చెబితే తీరుబడి చేసుకుంటా 

 టైమయింది వస్తానూ అని తువ్వాలు దులుపుకుని భుజాన వేసుకుని ఎలబారేను :)

ఇదండీ! మన వాక్స్వాతంత్ర్యం సంగతి  


19, ఆగస్టు 2022, శుక్రవారం

పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?

 

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.


https://kasthephali.blogspot.com/2022/08/blog-post_6.html


పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?


ఈ కొచ్చనుకి సమాధానం ఎవరేనా చెబుతారేమోనని ఎదురు చూశా, ఇంక నేనే నాకు తోచినది చెప్పక తప్పలేదు.


అదేమో పాతకాలపుపల్లె. పూరి గుడిసెలన్నీ పడిపోయి ఉన్నాయి.నష్టం జరగని ఇల్లు కనపడలేదు. తన ఇంట విలువైనవన్నీ పాడయ్యాయి, రాత్రి ఉడకేసుకోడానికి బియ్యమూ లేవు, పిండీలేదు. పిడకలగూడు తడిసిపోయి పనికిరాకపోయింది, ఎండు కట్టెలాచూద్దామంటే ఎక్కడాలేవు ఊరు మొత్తం మీద. పడిపోయిన ఇంట వెతికితే కూడు వండుకోడానికి కుండ దొరకచ్చు.కూడు వండుకోడానికి ఎవరేనా బియ్యం సాయం చేయచ్చు. కొంప కూలింది కనక పొయ్యీ పనికిరాకపోయె. మూడు రాళ్ళు, వెతుక్కుంటే దొరుకుతాయి,పొయ్యి అవసరం తీరిపోతుంది. మరి పొయ్యి కిందకి  ఎండుకట్టెలు దొరకవు, పోనీ పిడకలంటే పిడకలగూడు పోయె, ఎవరినైనా అడుగుదామంటే, ఏమైనా ఇస్తారుగాని పిడకలు ఇవ్వరెవరూ అందునా ఇలా గాలివాన సమయంలో, కావాలంటే ఓ ముద్ద కూడు పెడతారు.  


అయ్యో! కడవలే!!కణ్ణా!!!ఎంత కష్టం తెచ్చిపెట్టేవు పిడకలగూడు తడిపేసి, అని పిడకలగూటి కోసమే ఏడ్చింది.


ఇక ఒక నామకం పొలిటికల్ సెటైరా? అనడగి అధికారంపోయె,ఆస్థులు ఇ.డి పాలా అన్నారు. దాన్ని వివరిస్తే, నిజమేనేమో అనిపించింది. పిండి, బియ్యం లాటి విలువైనది అధికారం, అది పోయె! మరి వేల కోట్ల రూపాయల ఆస్థి పిడకలగూడు లాటిది. ఇదిపోతే? అధికారం ఎప్పుడేనా, ఎలాగైనా సంపాదించుకోవచ్చు కాని సొమ్మెవరిస్తారు.ఇన్ని వేలకోట్ల రూపాయలని ఎన్నేళ్ళలో సంపాదించేం. అధికారం సంపాదించాలంటే సొమ్ములవసరం కదా!అందుకు పిడకలగూడులాటి ఆస్థికోసం ఏడవటం సహజమేనేమో :) 

17, ఆగస్టు 2022, బుధవారం

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

 కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో  పన్నెండేళ్ళవనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.

14, ఆగస్టు 2022, ఆదివారం

స్వాతంత్ర్యం జన్మ హక్కు




స్వాతంత్ర్యం  జన్మ హక్కు.
 ఇది ముమ్మాటికి నిజం. 
హక్కుతోపాటే బాధ్యత కూడా ఉంటుంది, వెలుగు వెనకే నీడ ఉన్నట్టు. 
హక్కు గురించి మాటాడేటపుడు బాధ్యత మరచిపోరాదు. 
 

10, ఆగస్టు 2022, బుధవారం

కౘ్చలో నిప్పు పడ్డా, కోళ్ళగంపలో పిల్లి పడ్డా, కచేరిలో కాయితం పడ్డా నష్టం తప్పదు...



కోక అంటే స్త్రీలు కట్టుకునే వస్త్రం చీర, అనే అర్ధం స్థిరపడిపోయింది నేడు, కాని స్త్రీ,పురుషులు ఎవరైనా నడుముకిందనుంచి కట్టుకునే వస్త్రాన్ని కోక అనడమే పాతకాలపు అలవాటు. "కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ దొడ్వితిన్" ఇది శ్రీనాథుని మాట. స్త్రీలు, పురుషులు కోక కట్టేటప్పుడు ముందు వైపు కుచ్చెళ్ళు పెడతారు. అవి చాలా ఒత్తుగా ఉంటాయి, చాలా మడతలుంటాయి. ఒక కొంగు రెండుకాళ్ళ మధ్యనుంచి వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి వెనక దోపుతారు. దీన్నే కౘ్చ అంటారు, వాడుకలో గోచీ దోపడం అంటారు. ఒకప్పుడు ఎనిమిదిగజాల పంచలు,చీరలు ఉండేవి, అవి ఆ తరవాత ఆరుగజాలకు, ఆ తరవాత ఐదు గజాలకు కుంచించుకుపోయాయి. ఇక కచ్చ దోపడానికి వస్త్రమెక్కడ? కచ్చపోసి కోక కట్టిన ఆడదిగాని మగాడుగాని కనపట్టం లేదు. దీన్నే మడికట్టు అంటారు తమిళులు. ఈ కౘ్చలో నిప్పు పడితే, ఎక్కడ పడిందో వెతుకులాటకే ఎక్కువ సమయం పడుతుంది. నిలబడి దులుపుకున్నా, నిప్పురవ్వ ఆ మడతలలో నుంచి బయట పడ్టం తేలికకాదు.ఈ లోగా అది చేయాల్సిన నష్టం చేసేస్తుంది, అందుకు నష్టం తప్పదు. లేదా కోక, పంచ విప్పేసినా విప్పిన వాటిని కాల్చేస్తుంది, నిప్పు. అంచేత కచ్చలో నిప్పు కష్టం,నష్టం కలగజేస్తుంది.



కోళ్ళగంప


కోళ్ళగంపవేరు,కోళ్ళగూడు వేరూనూ. కోళ్ళగూడంటే  రెండడుగుల పొడవు వెడల్పు,ఎత్తులతో ఒక చిన్న కట్టడం.మూడు పక్కల పైన ఇటుకల కట్టుబడి, ఒక వైపు ఖాళీ దీనిలో పులి బోనులాగా ఒక కటకటాల తలుపు పైనుంచి తీసి కిందికి వదిలేలా. పగలు కోళ్ళు ఇంటిచుట్టు తిరిగినా రాత్రికి గూట్లోకి పెట్టేవారు. కోళ్ళు క్షేమంగా ఉండేవి. ఇక కోళ్ళగంప అనేది ఒక వెదురు బుట్టలాటిది. ఒక్కొకప్పుడు కోళ్ళను పిల్ల
తో దీనికింద పెట్టేసి వదిలేసేవారు, రాత్రులు కూడా,కొందరు. పిల్లి ఈ వెదురుబుట్టను పైకి లేపి పిల్లల్ని ఎత్తుకుపోయే సావకాశం. పిల్లిగనక ఈ కోళ్ళగంప మీదపడితే కనీసం ఒక కోడిపిల్లనైనా పట్టుకుపోతుంది. అంటే కోళ్ళగంపలో పిల్లి పడితే నష్టం తప్పదనమాట.


కచేరి అంటే కోర్టు. ఇందులో కాయితంపడటం అంటే, మనం ఎవరిమీదనో దావా చేయడం, లేదా మరొకరు మనమీద దావా చేయడమనమాట. కోర్టులో దావా నెగ్గినవాడు ఇంట్లోనూ, ఓడినవాడు వీధిలోనూ ఏడ్చారని నానుడి. నెగ్గినవాడెందుకు ఏడ్చాడు? నెగ్గినవాడు లాయర్లకి కోర్టు ఖర్చులకి, తిరుగుళ్ళకి, సాక్షులకి అయిన ఖర్చు తలుచుకు,ఇంటిలోనే  ఏడ్చాడు. ఓడిన వాడు వీటన్నిటితో కేసూ పోయిందని భోరున కోర్టులోనే ఏడ్చాడు. అందుకే కచేరిలో కాయితం పడితే నష్టమనమాట స్థిరపడిపోయింది.  




6, ఆగస్టు 2022, శనివారం

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.



"పిండీ, బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచిందనేది" ఒక నానుడి. పిండి, బియ్యం అనేవి ఆహారపదార్ధాలు, పిడకలంటే ఇంధనం,పొయ్యిలో మంటకి ఉపయోగించేవి. పెద్ద లెక్కలోకి తీసుకునేవి కావు, మరి అటువంటి పిడకలకోసం ఎందుకేడిచిందీ? విలువైనవాటికోసం కాక విలువ తక్కువైన వాటి కోసం ఎందుకు ఏడ్చిందీ? అదిగదా అసలు ప్రశ్న.  కతలో కెళ్ళే ముందు కొంత చెప్పాలి. పిండి, బియ్యం అంటే తెలిసినవే! ఇక పిడకలగూడేంటనేదే తెలియవలసినది. సరే! పిడక కూడా తెలీదా?  పాతకాలంలో, అదేం లెండి నేటికిన్నీ పశువులు విసర్జించినదాన్ని పేడ అంటారు. పేడని అలాగేగాని,దీనితోపాటు, రంపంపొట్టు, బొగ్గుపొడి, ఊక ఇలా మండే స్వభావం ఉన్నవాటిని కలిపి ముద్దగా చేసి గుండ్రంగా చపాతీలా చేసి వాటిని ఎండబెడతారు. ఆ తరవాత వాటిని ఆహారం పచనం చేసుకోడానికి ఇంధనంగా వాడుతారు,కట్టెలతో పాటు, లేదా పిడకలే, నేటికీ పల్లెలలో, కొంతమంది.  ఇలా ఎండిన పిడకల్ని ఆరుబయట ఎత్తైనచోట గుండ్రంగా పేరుస్తారు. ఆతరవాత వాటిపైన వరసగా పేర్చుకుంటూ వస్తే అదొక శంకువు ఆకారంకి తేలుతుంది. దీనిపైన కొన్ని తాటాకులు కప్పుతారు, తడవకుండా, పైన ఒక రాయి ఎత్తు పెడతారు, ఆకులు ఎగిరిపోకుండా. 

కావాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో వెతకండి, ఒక్కో పిడక ఖరీదు ఎనభైతొమ్మిది రూపాయలే.



మరో మాట,ఆవు పేడని ఎగుమతి చేస్తున్నారట, భారతదేశం నుంచి. దిగుమతి చేసుకుంటున్న దేశాలు U.A.E,U.S.A., Malaysia. నేడు,  15000 టన్నుల ఆవుపేడ U.A.Eకి ఎగుమతి అవుతోందిట, రాజస్థాన్ నుంచి, ఎందుకూ వారికిదీ? అదిగదా కొచ్చను. ఆవుపేడ ఎరువుగా వేసి పెంచిన ఖర్జూరాలు పెద్దవిగానూ, నాణ్యంగానూ ఉన్నాయని వారి సైంటిస్టులు చెబుతున్నారష. పిడకల వ్యాపారం బాగున్నట్టుందే! కంగారు పడిపోకండి, ఇప్పటికే చాలామంది ఆ వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు కతలో కొద్దాం.


అనగనగా అదొక పల్లెటూరు, నాటి కాలం పల్లెటూరు.  ఆ పల్లెలో నాడు ఉన్నవన్నీ పూరిళ్ళే! అంటే తాటాకు ఇళ్ళుగాని, ఆవిరిగడ్డి నేసిన పూరిళ్ళుగాని. అటువంటి పల్లె ఒక వర్షాకాలంలో గాలితుఫానులో చిక్కుకుంది. చినుకు చినుకుగా మొదలైన వాన కుండపోతయింది. ఇక గాలి వెర్రెత్తినట్టు వీచింది. అసలే పూరిళ్ళు, గాలికి కొన్ని పడిపోయాయి. మరికొన్ని మట్టి ఇళ్ళు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్ళకి తాటాకులెగిరిపోయాయి, మరొకొన్నిటికి నడికొప్పులెగిరిపోయాయి. ఇలాటి సమయంలో ఒక ఇల్లాలు తన తాటాకిల్లు కూలిపోతుండగా తప్పించుకుని బయట పడింది. కొంచం తడవని చోటకి చేరుకుంది. కొంత సేపటికి గాలి తగ్గింది. చిన్న చినుకు పడుతూంది, సాయంత్రమవుతూన్న సమయం. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా! కూలిపోయిన ఇంటి లో ఏమున్నాయో ఏమిపోయాయో వెతుకులాట ప్రారంభించింది, పడిపోయిన వాటిని తప్పిస్తూ,రాత్రి భోజనం తయారు చేసుకోడానికి..  

చూస్తే సర్వం నాశనం. కుండలో పోసిన బియ్యం పూర్తి నేలపాలయ్యాయి,మట్టి గొట్టుకుపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. కుండ మీద ఏదో పడటం మూలంగా, కుండ బద్దలైంది. ఆ పక్కనే పెట్టిన కుండ కూడా బద్దలైంది, పోసివుంచిన పిండీ  మట్టి చేరడం తో పనిరాకుండా పోయింది. బట్టలు సర్వం తడిసిపోయాయి, కొన్ని ఎగిరిపోయాయి,పొడి బట్టలేదు. నిలవడానికి పొడి జాగా లేదు.  ఇదంతా చూసిన ఆ ఇల్లాలికి బాధ కలిగింది. . . ఆ తరవాతామె పెరటిలోకి పోయి చూస్తే చెట్టూ, చేమా అన్నీ పడిపోయాయి. అక్కడే ఎత్తుమీదున్న పిడకలగూడు చెదిరిపోయింది, పిడకలన్నీ నీటిపాలయి ముద్దయిపోయాయి. ఇప్పుడు ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. అయ్యో! పిడకలగూడు పోయిందే అని బావురు మని ఏడ్చింది.


ఇన్ని పోయినా బావురుమని ఏడవని ఆమె పిడకలగూటికోసం ఎందుకు బావురుమని ఏడ్చింది చెప్మా!!!



3, ఆగస్టు 2022, బుధవారం

టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు

 టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు


అరవై ఏళ్ళ కితం అమ్మకి సుగర్,మూత్రం   టెస్ట్ కి, ఉదయమే  రోజు పక్క పట్నం సైకిల్ మీద  వెళ్ళి టెస్ట్ చేయించుకొచ్చి ఇంజక్షన్ చేసేవాడిని. నా తిరగుడు చూసిన డాక్టర్ గారు, టెస్టు చేయడం నేర్పించారు. టెస్ట్ చేయడం నేర్చుకున్నా, సరే, మరి పరీక్షనాళిక ఏదీ? డాక్టర్ గారే ఒకటిచ్చి కొద్దిగా సొల్యూషనూ ఇచ్చి ఇంటి దగ్గరే చేసుకో అన్నారు. ఇక ఇక్కడినుంచి నా తిప్పలు మొదలయ్యాయి. స్పిరిట్ లేంప్ లేదు, కుంపటి మీద నిప్పు సెగ వాడేను, టెస్ట్ ట్యూబ్ వేడెక్కుతుంది కదా చెయ్యి కాలకుండా పట్టుకోడానికి, తంటసం లేదు,గుడ్డ తో పట్టుకునేవాడిని. పొరబాటున కిందబడి పగిలిపోతే? ఈ ఆలోచనే భయపెట్టింది. 


కంపౌండర్ని అడిగా ఇవెక్కడ దొరుకుతాయీ,అని.   మెడికల్ షాప్ లో అడుగూ అన్నాడు.  ఆ ఊరికి పెద్ద షాపు కరెడ్లా మెడికల్స్,తొమ్మిదవలేదు, అప్పుడే షాపు తలుపులు తీస్తున్నాడు. టెస్ట్ ట్యూబు, సొల్యూషనూ, స్పిరిట్ లేంప్ ఉన్నాయా? అని అడిగా . కొట్టు తీస్తూనే సరుకు లేదనలేక, మళ్ళీ రండి, చెబుతానన్నాడు. చేసేది లేక కాళ్ళీడ్చుకుంటూ సైకిలెక్కి, మెడికల్ షాపుల వెంట పడ్డా. ఎవరినడిగినా కరెడ్లలో అడగమన్నవారే. ఆశ! దొరుకుతుందా? రెండు గంటల తరవాత మళ్ళీ కరెడ్లకి వెళ్ళేను. అతను నన్ను చూస్తూనే, దొరకవండి అనేశాడు, నిరాశ!. తెప్పించగలరా? చెప్పలేనండీ!. మరో నిరాశ!. మీదగ్గర దొరకచ్చని డాక్టర్ గారు చెప్పేరన్నా. పోనే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, దయచేసి, అని ప్రాధేయపడ్డా. దానికి అతను కొంచం మొహమాట పడుతూ, ఇప్పుడు బేరాల టైము, భోజనానికి కొట్టు కట్టేసే ముందు రండి. ఆశ చిగురించింది. బయటికిపోయా, ఎమీ చెయ్యాలి? ఉదయం చద్దెన్నం తిని బయలుదేరా సైకిల్ మీద,పదకొండు దాటుతోంది, కడుపులో కరకరలాడుతోంది, జేబులో డబ్బులు  నిండుకున్నాయి. అవసరం మనది కదా, అశక్త దుర్జనత్వంతో,  ఊరు పిచ్చి తిరిగుడు తిరిగి మళ్ళీ కరెడ్ల చేరాను. 


అతను నన్ను చూసి నక్షత్రకునిలా తగులు కున్నాడనుకున్నాడో ఏమో,నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా నా అవసరం, వైనవైనాలుగా అతనికి జాలి పుట్టించేలా చెప్పేను. తను కుర్చీలో కూచుంటూ, కూచోండి అన్నాడు, ఆశ మొలిచింది,కూచున్నా, ఇవి అస్తమానం అవసరముండవండీ, డాక్టర్ గారు చెబుతారు, మేము రిప్ లకి చెబితే వాళ్ళు వీటిని పంపేస్తారు, అక్కడితో అది పూర్తవుతుంది, స్టాక్ పెట్టం అంటూ పాత ఫైల్ దులిపి కాగితాలు తిరగేస్తూ ఆ అడ్రస్ దొరికింది అన్నాడు. ఆశ బతికింది.  ఇవి  ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ మచిలీ పట్నం లో దొరుకుతాయి, అన్నాడు. నిరాశ!. . మరోమాట ఈ కంపెనీకి కాకినాడలో బ్రాంచ్ కాబోలు ఉంది అన్నాడు,అడ్రస్ లేదు, ఆశ చావలేదు. ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పల్లె చేరేను రెండు దాటింది.మర్నాడు రెప్లై కార్డ్ కొన్నా, ''ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ, కాకినాడ'' కి ఓ ఉత్తరం రాసి పడేసి, టేస్ట్ ట్యుబు వి.పి.పి లో పంపమన్నా. జవాబు కోసం ఎదురు చూపు. జవాబు లేదు, అసలు  ఉత్తరం  అందిందా? అడ్రస్ రాయక కంపెనీ పేరు రాసి పడేస్తే, అనుమానం, ఏం చేయాలో తోచలేదు.  కాకినాడ నుంచి జవాబు రాకపోతే మచిలీపట్నం వివరాల కోసం ఉత్తరం రాయాలనుకుంటుండగా ఆశ నిరాశలో కొట్టుకుంటుండగా వారం దాటేకా పోస్ట్ మేన్ సూరయ్య రిప్లై కార్ద్ ఇచ్చాడు. మళ్ళీ ఆశ బతికింది. మీరడిగిన వస్తువులు మా దగ్గర దొరుకుతాయి కాని వి.పి.పి పంపం. ఒక వార్త ఆశ మరొకటి నిరాశ.ఏం చేయాలి?ధరల వివారాలిచ్చారు, అదే పదివేలనిపించింది.  


1, ఆగస్టు 2022, సోమవారం

కాలమండి బాబూ కాలం

ఎప్పటికి తరగని వైభవం


 ఉష, ఛాయా, పద్మినీ  సమేత సూర్యనారాయణుడు

గొల్లలమామిడాడ




కొనసాగుతున్న గతకాలపు వైభవం
ముంగిట ముగ్గు


 గతకాలపు వైభవ చిహ్నం
ఇంటిపై టి.వి ఏంటెన్నా

గతకాలపు వైభవ చిహ్నం

Neighour's envy

Owner's pride,.

 

now
Owners liability--neghbour's burden.

*****

 నిన్నటి టీచర్ నేటి రాష్ట్రపతి....

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి చాయ్ వాలా నేటి ప్రధాని....

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి ఆటోవాలా నేటి ముఖ్యమంత్రి.

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి సన్యాసి నేటి ముఖ్యమంత్రి.

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నను రాజ్యాన్ని కనుసన్నలలలో పాలించిన దేవత....

నేడు ?????????

కాలమండి బాబూ కాలం.

*****

.నిన్నటి దొంగ-నేటి దొర

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి దొర-నేటి దొంగ

కాలమండి బాబూ కాలం.

*****

నిన్న కన్ను తిప్పుకోలేని అందం--నేడు కన్ను కనపడని చందం

కాలమండి బాబూ కాలం.

*****

రేపు రాజెవరో రెడ్డెవరో

కాలమండి బాబూ కాలం.

****


29, జులై 2022, శుక్రవారం

24, జులై 2022, ఆదివారం

కొండనాలిక్కి మందేస్తే-బుల్లి కథ

 బుల్లి కథ

కొండనాలిక్కి మందేస్తే

ఒక పల్లెటూరు దామోదరానికి అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకెళ్ళేడు. డాక్టర్ పరీక్ష చేసి మందు రాసిచ్చేడు. రాత్రి పడుకోబోయే ముందు ఈ మాత్ర వేసుకో, నిద్ర బాగా పడుతుంది,కొంచం మగతగా ఉండచ్చు, అని కూడా చెప్పేడు.  దామోదరం ఇంటికొచ్చి సంగతి చెప్పి మందు వేసుకుని పడుకున్నాడు. తెల్లారింది ఏడయింది, ఎనిమిదీ అయింది లేవడే! నాలుగు గంటలకే లేచి కాఫీ అని అరిచేవాడు,ముసలాయన, లేవలేదేంటబ్బా! టపాగాని కట్టేసేడా? అని అనుమానపడి చూస్తే హంస తిరుగుతూ ఉంది. బలవంతాన లేపితే లేచి ముఖం కడిగిస్తే, కాఫీ తాగి మళ్ళీ పడుకున్నాడు. డాక్టర్ మత్తుగా ఉంటుందన్నారు కదా! అని పడుకోనిచ్చారు, ఇంట్లోవాళ్ళు. మధ్యాహ్నం పన్నెండు, ఒంటి గంట, ఎంతకీ లేవడే. పొద్దుటిలాగే బలవంతాన లేపి కూచోబెట్టి అన్నం పెడితే తిని మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కంగారొచ్చి డాక్టర్ దగ్గరికి పోయి చెబితే సాయంత్రాని కి లేస్తాడు, కంగారు పడకండంటే, తిరిగొచ్చారు. రాత్రికి లేచాడు దామోదరం. భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. తనే లేచాడుగా,డాక్టర్ చెప్పినట్టిని ఊరుకున్నారు, ఇంట్లో వాళ్ళు. పడుకున్నవాడు హటాత్తుగా సగం రాత్రి లేచి కడుపులో గుడగుడమంటోదని పరుగెట్టేడు. అది మొదలు ప్రతి గంటకి ఒక విరేచనం, అదీ నీళ్ళ విరేచనం. ఇంట్లోవాళ్ళు కంగారుపడి డాక్టర్ దగ్గరికి పోదామంటే నిశరాత్రి, అని, దగ్గరున్న మాత్రేదో వేశారు. విరేచనాలు ఝాడించి కొట్టేయి. ఇంట్లో ఉన్న ఓ.ఆర్.ఎస్ (కాచి చల్లార్చిన నీళ్ళలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపి) కలిపిచ్చేరు, ఆరారగా. ఉదయానికి వాడిపోయిన తోటకూర కాడలాగా ఐపోయాడు, నోట్లోంచి మాట కూడా రావడం కష్టంగా ఉంది.

ఇంట్లోవాళ్ళు ఈ సారి నిజంగానే కంగారు పడి, డాక్టర్ దగ్గరికి మోసుకుపోయారు,తెల్లారగానే. డాక్టర్ చూసి ఒక సూది మందు పొడిచి, రెండు సెలైన్లు ఒక దాని తరవాత మరొకటి పెడితే, కొంచం తేరుకున్నాడు. భోజనం పెట్టించి, ఇంటికి తీసుకుపొమ్మన్నారు, డాక్టర్. 


సార్! ఏమయిందని అడిగితే, అనారోగ్యం అని నా దగ్గరకొచ్చాడు. ఆ అనారోగ్యానికి అందరికి రాసిచ్చే మాత్రే ఇతనికీ రాశాను. దురదృష్టం, మగత సామాన్యమేగాని, ఇంతగా నిద్ర పోతాడనుకో లేదు, ఇక నీళ్ళ విరేచనాలు కూడా ఆ మందు ప్రభావమే! ఆ మందు వేసుకుంటే దాని ప్రభావం, సైడ్ ఎఫెకట్స్, నీళ్ళవిరేచనాలు,నిద్ర మత్తు, తలనొప్పి ఉంటాయి. ఎక్కువ మందిలో ఇవి కూడా ఉండవు. లక్ష మందిలో ఒకరికి ఏదో ఒకటి రావచ్చు, కాని ఈ దామోదరంగారికి రెండూ వచ్చాయి, కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టయిందని, నవ్వేరు, డాక్టర్.


23, జులై 2022, శనివారం

కొండనాలిక్కి మందేస్తే

 కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు. 

 

అన్నవస్త్రాలకోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్టు.

 

మహరాజా! అని మనవి చేసుకోబోతే మరో రెండు తగిలించమన్నట్టు 


14, మార్చి 2022, సోమవారం

జానపదం

 


Courtsy:Whats app

తల్లితండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ!

11, మార్చి 2022, శుక్రవారం

ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.

 ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.


యుద్ధం,ఎన్నికల హాడావుడిలో కరోనా మాట మరచిపోయారు.మాస్క్ కూడా వాడటం మానేశారు. పెద్దలు మాత్రం కరోనా మనల్ని వదలలేదు, జాగ్రత్తలు అవసరమే అని చెప్పినా వినేలా లేరు జనం.


ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్లు చాలా ఉన్నాయి, ఏది సోకింది సామాన్యుడికి తెలీదు, ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతోంది, టెస్ట్ చేసే సమయం కూడా ఉండటం లేదు,దాంతో ఇది మామూలుగా ఋతువులో వచ్చే జ్వరం, దగ్గు, రొంప స్థాయికి జారిపోయినట్టు కనపడుతోంది.కరోనా ఎవరిని వదలకుండా అందరిని సోకింది, ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, వేక్సిన్ వేయించుకున్నవాళ్ళు( బూస్టర్లతో సహా )  వేయించుకోనివాళ్ళు, ఒక సారి వచ్చినవాళ్ళు అనే తేడాలే లేవు. సర్వం సమానం. ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళకి బయటికి కనపడటం లేదు, అంతే తేడా.

 

ఇది సోకినా ప్రమాదం లేదనుకున్నాం కాని ఇది తప్పు అభిప్రాయం.కరోనా అంటే తగ్గుతోందిగాని దీని ఫలితాలు, నీరసం, తలనొప్పి, చిన్న దగ్గు, కొద్దిగా జలుబు, డిప్రషన్, ఇలా లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి, నెలలు గడుస్తున్నా. వయసు మళ్ళినవాళ్ళని, ఇమ్యూనిటీలేనివాళ్ళని వేధిస్తూనే ఉన్నాయి, ఇందులో ఏదో ఒక లక్షణం. సుగర్,బి.పి లాటి దీర్ఘవ్యాధులున్నవారు చెప్పాపెట్టకుండా టపాకట్టేస్తున్నారు. కాని ఇది కరోనావల్ల అనుకోలేకపోతున్నారు. మరో విచిత్రం ఏమంటే ఒకరికి ఉన్న లక్షణాలు మరొకరికి ఉండటం లేదు. జాగ్రత్తలు కొనసాగడం మంచిది.


 నిజమెంతో తెలీదుగాని, 

కోవిడ్ లాటి వైరస్లను ఎలకలు,గబ్బిలాలు,పక్షుల ద్వారా శత్రు దేశాల్లో ప్రవేశపెట్టడానికి యూక్రైన్ లో పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి తాలూకు కాగితాలు,వగైరా దొరికాయనీ, లేబరేటరీలను స్వాధీనం చేసుకున్నామని, ఈ పరిశోధనలు అమెరికా పనుపున,ఆర్ధిక సాయం తో జరుగుతున్నాయనీ, తద్వారా శత్రు దేశాల ప్రజలను నెమ్మదిగా అనారోగ్యంపాలు చేసి, ఆ దేశాన్ని ఆర్ధికంగా నిలదొక్కుకోలేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, రష్యా ఆరోపిస్తోంది. ఈ పెద్ద దేశాలకి ఇటువంటి ఆలోచనలఎందుకొస్తున్నాయీ? సైన్స్ వెర్రితలలేస్తోందా? కాలమే చెప్పాలి. ఎప్పుడైనా జాగరత అవసరం.  

8, మార్చి 2022, మంగళవారం

భవతి రాక్షసో వైద్యః

 


రోగార్తస్య భిషక్ దేవ

ఆర్త్యన్తే మానవో భిషక్

భవతి రాక్షసో వైద్యః

సేవామూల్య ప్రదర్శనే


రోగంతో బాధపడుతున్నపుడు వైద్యుడు దేవుడులా కనపడతాడు. అర్త్యన్తే అనగా రోగబాధ నెమ్మళించిన తరవాత, వైద్యుడు మామూలు మనిషిలా కనపడతాడు. వైద్య సేవలకి మూల్యం అడిగినపుడు మాత్రం రాక్షసునిలా కనపడతాడని భావం.


ఇది పాతకాలం నాటి మాట. నాటి రోజుల్లో అనగా నేను ఎరిగిన రోజుల్లో కూడా వైద్యుడు, రోగి ఇంటికి వచ్చి వైద్యం చేసేవాడు. మందులూ ఆయనే ఇచ్చేవాడు. పధ్యపానాలూ వివరంగా చెప్పేవాడు.అంతే కాదు, వైద్యుడు అంటే ఇంటివారిలో ఒకడనే మాట ఉండేది. చిన్నచిన్న రోగాలకి వైద్యం చేసినా డబ్బులు అడిగేవారు కాదు. సంవత్సరానికి ఒక సారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వైద్యం చేయించుకున్నవారంతా కట్నాలని, కానుకలు చదివించేవారు. ఇవ్వలేనివారి దగ్గర అడిగేవారు కాదు.అదో సహకార జీవనం. 


కాలం మారింది, కాదు మనుషుల బుద్ధులు మారేయి ఎప్పటి సొమ్మప్పుడే చెల్లించాలి, నేడు.డాక్టర్ దగ్గరకే రోగిపోవాలి. అక్కడ ఒక కార్డ్ రాయించుకోవడంతో ఫీజు మొదలవుతుంది. ఈ కార్డ్ కి కూడా ఖరీదుంటుంది అది వందో ఆ పైమాటో, డాక్టర్ని బట్టి.నేటి డాక్టర్లు ఎక్కువ మంది తేనెటిగల్లాటివారు. కొద్దికొద్దిగా సంగ్రహిస్తారంతే, చిన్నచిన్న వైద్యాలకి, అదే పెద్దదైతే కార్పొరేటే :)


పై శ్లోకం మా వాట్సాప్ గ్రూప్ లో డాక్టర్ గారు పెట్టినది. ఇదేoటి ఆయన ఇలాటి టపా వేశారని మిత్రుణ్ణి కనుక్కుంటే తేలినదేమంటే, కరోనా మొదలుగా  డాక్టర్ గారు వాట్సాప్ లో రోగిని చూస్తూ అత్యవసర వైద్యం చేసేరు. అది గత రెండేళ్ళుగా జరిగిపోతూనే ఉంది కాని ఎక్కువమంది కన్సల్టేషన్ కూడా చెల్లించలేదని తెలిసింది. ఔరా! జనం, అనుకుంటూ ఒక సారి భుజాలు తడుముకున్నా! నా దగ్గర నుంచి డాక్టర్ గారికి ఇవ్వవలసినది ఉండిపోయిందేమోనని. సరి చూసుకున్నా! అన్నీ రాసుకుంటా కనక. 

ఇటువంటి వారు కూడా ఉన్నారా? ఉన్నారు అక్కడక్కడా!

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

 


 మనసు విరిగెనేని మరి అతుకగరాదు


ఇనుము విరిగెనేని 

ఇనుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు కమ్మరీడు

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

విశ్వదాభిరామ వినుర వేమ!

ఇనుము విరిగితే రెండు మాడుసార్లు అతకచ్చు, వేడిచేసి. కాని మనసు విరిగితే మరి అతుక్కోదు.


తాతగారి మాట చద్దన్నం మూట. 

ఇనుము చాలాగట్టి లోహం. అది విరగాలంటే చాలా పెద్ద సమ్మెటపోట్లు బలంగా తగిలితేగాని విరగదు. అలా విరిగిన ఇనుమును కూడా కమ్మరీడు కాలేసి అతకగలడు, అది కూడా రెండు మూడు సార్లే, ఆ తరవాత అదీ అతుక్కోదు. ఇక మనసు గాజుకాయలాటిది, ఎంత సున్నితమో అంత కఠినం కూడా. అటువంటి మనసు విరిగితే మరి అతకడం ఎవరివల్లా కాదంటారు, ఇంతటి మనసు ఎలా విరుగుతుంది, మాటల తూటాలకి విరుగుతుంది,అంటారు, తాతగారు. 


దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం ఉంది, పద్యం గుర్తు లేదు, భావం రాస్తున్నా! ఎవరేనా పద్యం గుర్తు చేస్తే సంతసం. ''పదునైన బాణం ములుకులతో ఐన గాయాలను కూడా మాన్చవచ్చు, కాని మాటలో ఐన గాయాలు, మాన్చటం ఎవరితరమూ కాదు!'' అందుచేత  ముందు ఆలోచించాలి,ఆలోచించి మాటాడాలి, నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణ సమానం, అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, వెనక్కి తీసుకోలేం. అందుకే నోరు సంబాళించుకో అంటారు, పెద్దవాళ్ళు.మరో మాట కూడా నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం. కాలు జారితే తీసుకోగలం ,నోరు జారితే తీసుకోలేము, ఇది మరో జాతీయం.


పద్యం గుర్తొచ్చింది 

తనువున విరిగిన యలుగుల

ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

12, ఫిబ్రవరి 2022, శనివారం

మూర్ఖులకిచ్చే సలహా ప్రమాదకరం


 అనగనగా ఒక అడవి, అందులో ఒక చింతచెట్టు చివర కొమ్మని, ఒక పిచుకల జంట గూడు కట్టుకుని ఉంటోంది. అదే చెట్టు మీద కింది పలవలో ఒక కోతి ఆవాసం. ఒక రోజు రాత్రి పెద్ద గాలి,వానా కుదిపేశాయి. పిచుకల జంట భయం భయంగానే చిటారు కొమ్మన వెచ్చగా ఉన్న గూటిలో గడిపేయి. కోతి వానకి తడిసి, చలికి వణుకుతూ ఉండిపోయింది.తెల్లారింది, పిచుకల జంట బయటకి చూస్తే అడవి అల్లకల్లోలంగా ఉంది, వర్షం కొంచం తగ్గింది. కింది కొమ్మల్లో కోతి చలికి వణుకుతూ కనిపించింది.ఆ జంట కోతితో, బావా! నువ్వు బలవంతుడివి కదా! నాలుగు కొమ్మలు విరిచుకుని, గూడు వేసుకుంటే ఈ తిప్పలు తప్పేవి కదా అన్నాయి. ఇది విన్న కోతికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది. చర్రున లేచి, పిచుకల గూటిపై దాడి చేసింది. గూడు చిటారు కొమ్మన ఉండిపోవడంతో వెంటనే చిక్కలేదు. సంగతి గ్రహించిన పిచుకల జంట గూడు వదలి ఎగిరిపోయింది.. కోతి ఆగ్రహం పట్టలేక గూడున్న కొమ్మ విరిచి కింద పారేసింది. చూచిన జంట చెప్పిన సలహాకి  వగచి వేరు చెట్టుకు చేరాయి. 

సందర్భ శుద్ధి లేకఇచ్చే సలహా గాని మాటగాని రాణించవు.

మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు, అది ప్రమాదకరం.

9, ఫిబ్రవరి 2022, బుధవారం

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక  


ఎవరు చేసిన కర్మ వారనుభవింపక 

ఏరికైనా తప్ప దన్నా

ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవింపక తప్పదన్నా!


చేసిన కర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.


ఉత్కృష్టమైన పుణ్య,పాపకర్మల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి.చేసినది వ్యక్తిగాని, సమాజంకాని దేశం కాని ఫలితాలు తప్పవు, అనుభవించాలిసిందే! అందుకే నవ్వుతూ చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తామంటారు.  

ధర్మో రక్షతి రక్షితః  

5, ఫిబ్రవరి 2022, శనివారం

పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...

 పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...


పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది. పెట్టడం పెద్దలనాటి నుంచీ లేదన్నదే  మాట.


చెయి చిక్కని మనిషికి రా యే కాని పో లేదు..


నా ఇంటి కొస్తే నాకేం తెస్తావు, నీ ఇంటికొస్తే నాకేం పెడతావు?


లోభివానినడుగ లాభంబు లేదయా!

3, ఫిబ్రవరి 2022, గురువారం

భూయో భూయో నమామ్యహం

 ఆపదామప హర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహం

అపదల నుంచి రక్షించేవాడు, సర్వ సంపదలిచ్చేవాడు, జన్మోహనుడైన శ్రీరామునికి మరల మరల నమస్కారం.


చిత్రం రాముడు తీరికూచుని జనులను ఆపదలనుంచి రక్షిస్తాడు, సంపదలిస్తాడు అందుకు శ్రీరామునికి మరల మరల నమస్కారం.రాముడేం చెయ్యడు! రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడంటే రూపుకట్టిన ధర్మం. అంటే ధర్మానికి మరలమరల నమస్కారం. అంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఆచరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, అని చెప్పడమే!ధర్మాన్ని ఆచరిస్తానని మరలమరల సంకల్పం చెప్పుకోవడమే సుమా!భూయో భూయో నమామ్యహం!

28, జనవరి 2022, శుక్రవారం

రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?

 రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?


కరోనా మరో variant  ప్రపంచం మీదకి రాబోతోందని WHO మాట.ఇది ఇప్పటివాటికంటే చాలా తొందరనూ అందరికి సోకుతుందని వార్త.


ఇప్పటిదాకా కరోనా వచ్చి తగ్గినవారికి, ఏ వేరియంట్ ఐనా, ఇమ్యూనిటీ ఉంటుందా?


ఇప్పటికి టీకా వేసుకున్నవారు,బూస్టర్ తీసుకున్నవారికి ఇమ్యూనిటీ కొనసాగుతుందా?

 ఇప్పటికి తీసుకున్న బూస్టర్ టికా రాబోయే వేరియంట్ ని ఎదుర్కోగలదా?


కొత్తగారాబోయే వేరియంట్ తొందరగా సోకుతుంది సరే, దీని లక్షణాలేంటి?


ఎప్పటికి దీనినుంచి విముక్తి?


సమాధానం లేని రాని ప్రశ్నలు.


26, జనవరి 2022, బుధవారం

అమ్మో నొప్పి!

 అమ్మో నొప్పి!


అమ్మో! నొప్పి,ఒళ్ళంతా నొప్పులే, నోరు చేదు, పంచదార, కారం కూడా చేదుగా ఉన్నాయి. కడుపులో వికారం, లేస్తే తూలు,నిద్దర పట్టటంలేదు, ఆకలి లేదు చెప్పుకొచ్చారు, మనవరాలు, అబ్బాయి, జమిలిగా.విన్నాను, నేనెవరితో చెప్పుకోను అని మనసులో అనుకుని వీళ్ళని ఏమార్చాలని పిట్ట కత చెప్పేనిలా!


కర్ణాటక సంగీత కచేరీ చూశారుగా, అందులో గాయకుడు, అతనితో పాటు మృదగం, వయొలిన్, కంజీరా, ఘటం,మోర్సింగ్ వాయించేవాళ్ళూ ఉంటారు. సభ ప్రారంభం చేస్తూనే గాయకుడు పాడితే వయొలీన్,మృదంగం అనుసరిస్తాయి. రాగ ప్రస్తారం తరవాత గాయకుడు పాట అపుతాడు, అక్కడినుంచి వయొలిన్, ఘటం, కంజీరా, డొలక్,మోర్సింగ్ ఈ పక్క వద్యాలన్నిటికి సమయంఇస్తాడు. అందరూ పాట మొత్తాన్ని ఒకసారి పాడి వాయించి సభ ముగిస్తారు. మేం అడిగినదానికి మీరు చెప్పేదానికి అన్వయం కుదరలేదు తాతా అంది మనవరాలు. చెబుతా విను అనిమొదలెట్టా. 

గత పదిరోజులుగా ఒమిక్రాన్ అమ్మవారు మన ఇంట సభ జరిపింది కదా! ఆవిడతో పాటు జ్వరం,దగ్గు,రొంప కూడా వచ్చాయిగా, పక్క వాద్యాలలాగా. ఆవిణ్ణి శాంతింపజేయడానికి, మందులువాడేం.అవి మరికొన్ని పక్క వాద్యాలు.ఆవిడ పాట పాడి ఆపింది, ఇకపై పక్క వాద్యాలు ప్రతాపం చూపుతున్నాయి, కొన్ని రోజులు బాధలు తప్పవని ముగించాను.


25, జనవరి 2022, మంగళవారం

పెద్దమ్మ-చిన్నమ్మ.

 

పెద్దమ్మ-చిన్నమ్మ.

పెద్దమ్మ ఇంటి నుంచి బయటికి వెళుతుంటేనూ చిన్నమ్మ బయటినుంచి లోపలికొస్తుంటేనూ ఆనందం అంటారు.

వివరించండి.


24, జనవరి 2022, సోమవారం

Omicron -3



Be always positive in attitude. 

Be active even if tested positive. 

Family tested positive 😀