30, జూన్ 2021, బుధవారం

ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం

 ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం

ఒకప్పుడు సుగర్ చూడాలంటే ఉదయమే లేవగానే మూత్రం పట్టి దానిని డాక్టర్ దగ్గరకి పట్టుకెళితే పరిక్ష నాళికలో పోసి వెచ్చచేసి బెనిడిక్ట్ సొల్యూషన్ వేస్తే ఆ మూత్రం రంగు మారేది, ఆ రంగు నీలంగా ఉంటే సుగర్ లేనట్టూ, ఇటుక రంగు వస్తే ఎక్కువున్నట్టూ, ఇలా రంగులనిబట్టి ఎంత సుగర్ ఉన్నదీ చెప్పేవారు. ఇది ఆ తరవాత కాలంలో అవసరాన్ని బట్టి ఇంటి దగ్గరే చేసేవాళ్ళం. రోజులు మారేయి, ఒక రక్తపు చుక్కతో సుగర్ చెప్పేరోజులొచ్చాయి. ఇందులో కూడా తేడాలు. ఒకప్పుడు ఒక సి.సి రక్తం తీసుకుని టెస్టు చేసేవారు, ఇప్పుడు ఒక చుక్కచాలు.ఆ రోజుల్లో లేబ్ లు లేవు, నేడు లేబ్ లు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో సుగరూ బిపి లు చూసుకోవడానికి లేబ్ వారిని రమ్మన్నా,వెళ్ళినా ఒకటే :) అందుచేత ఇంటి దగ్గరే సుగర్ టెస్టు చేసుకునే విధానం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ సాధనాలు చాలాకాలం కితమే ఉన్నా వీటి అవసరం ఇప్పుడు బయట పడింది, ఎందుకూ, కరోనా తో మనిషిని చూస్తే భయం మూలంగా


సుగర్ చూసుకునే మిషన్ని గ్లూకో మీటర్ అంటారు. చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, కొన్ని ఉచితంగా కూడా ఇస్తున్నాయి.లాభం లేందే సెట్టి వరదని పోడని సామెత. ఈ మీటర్ ఊరికే వచ్చినా ఇందులో టెస్టుకోసం ఉపయోగించే స్టిక్కులు కొనుక్కోవాలి, అదీ అసలు సంగతి.ఈ meter ఖరీదు తక్కువే పదేను వందలలోపు, స్టిక్కులు మాత్రం ఒక్కోటి పన్నెండు రూపాయలపై మాట. 


ఇక బి.పి ఇది పది నిమిషాల వ్యవధిలోపలే రీడింగ్ మారిపోతూ ఉంటుంది.ఐతే సిస్టోలిక్ మారుతున్నా డైస్టోలిక్ అంత వేగంగా మారదు. దీనికీ మీటర్ దొరుకుతున్నాయి. ఇప్పుడు డాక్టర్లు బి,పి చూడటం లేదు, ఆటొమేటిక్ డిజిటల్ బి.పి మీటర్ తో నర్సులే చూస్తున్నారు, ఫలితం నోట్ చేస్తారు, డాక్టర్ చూస్తారు. దీనిని ఇంటీ దగ్గరె చూడచ్చు. మీటర్ ఉన్నదని అస్తమానమూ చూస్తే గాభరా పుడుతుంది.ఇది కూడా ఐదు వేలలోపే ఖరీదు. అనుమానం తీర్చుకోడానికి పనికొస్తుంది, అంతే. రీడింగులు చూసి గాభరా పడద్దు.


ఇక అసలు విషయానికొస్తే ఏ రెండు మీటర్లూ ఒకలా చూపవు.ఇక ఈ సుగర్ మీటర్ సంగతి, మన దగ్గర మీటర్ ఎక్కువ రీడింగ్ చూపుతుంది, లేబ్లో మీటర్ తక్కువ చూపుతుంది. మోసంకాదా అనిపిస్తుంది,ఆవేశపడ్డాకూడా. తెలిసినవారు విషయం వివరించినది చెబుతా. మనం తీసుకునే రక్తపు చుక్క ధమనులనుంచి వచ్చే రక్తం. లేబ్లో టెస్ట్ కోసం మన దగ్గర తీసే రక్తం సిరల నుంచి.ధమనుల్లో రక్తంలో గ్లూకోస్ శరీర చివరి భాగాల దాకా అందిస్తుంది కదా! దానిలో గ్లూకోస్ ఎక్కువ ఉంటుంది, సిరలలో రక్తంలో అది తక్కువ ఉంటుంది. సిరలలో రక్తం ఎందుకు టెస్ట్ చేస్తారు? చెప్పలేను. ఇలా ఈ తేడా ఎంతా అన్నది తెలియాలంటే లేబ్ కి రక్తం ఇచ్చిన వెంటనే మనమూ మన దగ్గర మీటర్ తో చూసుకుంటే తేడా తెలుస్తుంది. ఇది సాధరణంగా 20'% ఉంటుందంటారు. కాని నా అనుభవం 38% తేడా ఉంది, మరి రెండు మూడు సార్లు తేడా గమనించాలి. 


ఇక బిపి మీటర్లో ఈ తేడాలు గమనించలేం.కాని బిపి తీసుకునే ముందు జాగ్రతలూ తెలిసినవే చెబుతా. నడచిన వెంటనే, సైకిల్ తొక్కిన వెంటనే, భోజనం, టిఫిన్ చేసిన వెంటనే బిపి ఎక్కువ ఉంటుంది.ఇక మాట్లాడుతూ బిపి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కుర్చీలో కూచుని కాళ్ళు కత్తెరేసి కూచుంటే బిపి ఎక్కువ చూపుతుంది. అంతెందుకు మీ చేతికి కట్టే బేండు వదులుగా కడితే బీపీ పరిగెడుతుంది. అందుచేత మీ శరీర పరిస్థితి గమనించుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించాలి. కంగారు పడిపోకూడదు సుమా!ఈ రీడింగులు చూసుకుని మందులు మానెయ్యడం డోసులు మార్చేసుకోడం చేయకూడదు, ప్రమాదం తెచ్చి పెడతాయి. తస్మాత్ జాగ్రత.


28, జూన్ 2021, సోమవారం

వరదలో

 


Courtesy:Quora.com

వరదలో చిక్కుకున్న ఈ భవంతి ఎక్కడిదో తెలియదు. కోనసీమ లంకలలో ఇళ్ళు గోదారి వరదకాలంలో ఇలాగే ఉంటాయిగాని ఈ బందోబస్తు ఉండదు.

25, జూన్ 2021, శుక్రవారం

కరోనా కాలం-కష్ట కాలం.

  కరోనా కాలం-కష్ట కాలం.

కితం సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైన కరోనాతో కాలు బయట పెట్టేది లేక లాక్ డవున్ లో లాకప్ లో ఉండిపోయాం. అప్పటినుంచి ఇల్లు వదిలిందే లేదు. బయటికొస్తే చంపుతానంటోంది కరోనా, లోపలుంటే మా మాటేంటీ అని నస పెడుతున్నాయి ఆస్థాన విద్వాంసులు,సుగరు,బి.పి లు.. కొన్నాళ్ళు జోకొట్టినా తరవాత కాలంలో డాక్టర్ ని కలవక తప్పటం లేదు. అక్కడా గుంపులే ఎవరి బాధ వారిది,తప్పదు కదా! టెస్టుకి వెళ్ళిన ప్రతిసారి భయం,బ్లడ్ తీసేవాడినుంచే సోకుతుందేమోనని భయం.  భయమే చంపేస్తుందేమో చెప్పలేనిది.

ఎంత నిబ్బరంగా ఉందామన్నా పరిస్థితులు చూస్తుంతే నీరుగారిపోతున్నాం.ఇక మేధావుల మాటలకి అంతే లేదు. మూడో పొర  వస్తుంది పిల్లలని చంపుతుంది...ఇది జాగరత చెప్పినట్టు లేదు, భయపెడుతున్నట్టే ఉంది..ఇక మందులు జాగరతలు చెప్పే వారికి అంతులేదు, పాపం వీరంతా మందికి మంచి జరగాలని చెప్పేదే! ఆనందయ్య మందు ఎక్కడికక్కడ తయారు చేసి పంచిన వారున్నారు.కరోనాకి చిక్కి బయటపడిన వారు సర్వం దానం చేసినవారున్నారు, ప్రాణావసరమైన మందులు ఇతరాలు దాచి విపరీత ధరలకి అమ్ముకున్నవారున్నారు.కరోనా ఎదురింటికి వచ్చి ఆగింది.


 ఇక ఎండ కష్టాలు చెప్పేదేంటి, పాత పాటే కదా! వద్దనుకుంటూనే ఏ.సిలో వాసం,ప్రతి నిమిషం భయం, కరోనా ఎదురింటి దాకా రావడంతో.....ఆగిపోయింది మా జీవన స్రవంతి, గేటు తాళం తీసి బయట కాలు పెట్టలేదెవరమూ...ఇక నెట్ లోకి కూడా రాలేదు కీ బోర్డ్ చెడిపోడంతో. 


ఏప్రిల్ మే, జూన్ నెలల్లో చాలా మంది మిత్రులు/అమ్మలు  వాట్సాప్ లోనూ మైల్ లోనూ పలకరించి ధైర్యం చెప్పినందుకు ధన్యవాదాలు,నమస్కారం. నా ఫొన్ నంబర్ దొరక్క వెతికి వెతికి అబ్బాయితో మాటాడి నా కుశలం కనుక్కున్న ప్రియ శత్రువుకి నమస్కారం.టపా రాదామనుకుంటే కీ బోర్డ్ చెడిపోయింది. బ్లాగు మొదలెట్టిన తరవాత మార్చిన ఆరో కీ బోర్డిది. 


ఏప్రిల్ నెల తరవాత కరంటు రీడింగ్ తీయలేదు. అసలే వేసవి, మా దగ్గరైతే వేడి 41 పై  మాటె. ఎంతకాదనుకున్నా ఏ.సి తప్పలేదు.. మొన్న రెండు నెలల బిల్లూ ఒక సారి చేతిలో పెట్టేటప్పటికి కళ్ళు తిరిగాయి. 

 వాడుకున్నదే కాని ఒక్కాసారిగా కట్టాలంటేనే  బాధ.బంగారు పళ్ళేనికి కూడా గోడ చేరుపు కావాలి కదా! డబ్బులకోసం అప్పుకెళ్ళేలా కూడా లేదు, ధాన్యం అమ్మి నెలపైగా ఐనా ప్రభుత్వం నుంచి సొమ్ములూ రాలేదు.కరంటు బిల్లు కట్టడం ఆలస్యమయ్యేలా ఉంది..


జూన్ పదేనుకి కూడా ఇంకా కాలవ రాలేదన్నాడు అబ్బాయి.నిన్ననొచ్చిందని చెప్పేడు, ఇక హడావుడి, పెట్టుబడికి సొమ్ములు అవసరం...కరోనా ఉండగా ఇది మూడో పంట పూర్తిగా మాసూలు కావడం. నాలుగో పంట వేయబోతాం. కరోనా మొదలయ్యేనాటికి కూలిపనికి ఐదొందలు. ఆ తరవాతది నెమ్మదిగా పైకి పాకి ఇప్పుడు రోజుకి వెయ్యికి చేరుకుంది.పంట దిగుబడి పెరగలేదు, పెట్టుబడిలు పెరిగిపోయాయి.వ్యవసాయం లో మిగిలినది ఏమీ లేకపోయినా గింజలు పండించి ఇచ్చామనే తృప్తి మిగిలింది. ఏమీ మిగలకపోతే ఎందుకు వ్యవసాయం చేయడం అడగచ్చు, ఇదొక వ్యసనం, మరే పనీ చేతకాదు, మరొకరికి తిండికి గింజలిచ్చిన తృప్తే మాకు మిగిలుతోంది.


కరోనా తో కలిగినవారికి బాధ లేదు, లేనివారికీ బాధ లేదు, మధ్య తరగతి వారే మాడిపోతున్నారు. కొంతమంది రోజు కూలికి వెళుతున్నారు. అలవాటు లేని పని కావడంతో బాధ పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రయివేటు స్కూళ్ళ టీచర్లున్నారు.కరోనా టికాలు జోరుగా వేస్తున్నారు, పల్లెలలో వెతికి మరీ వేస్తున్నారు.


బడికెళ్ళే పిల్లల స్థితి అధ్వాన్నంగా ఉంది. శారీరకంగా పోల్చుకోలేనంతగ మారిపోయారు, బయటికి వెళ్ళినది లేదు, ఆట లేదు పాట లేదు ఆన్ లైన్ చదువు నడుస్తోందంతే. బడులు తీస్తామంటారొకపక్క,కరోనా మూడో పొర పిల్లల పాలిట గండమంటారు మరో మేధావి, పిల్ల ని మానసికంగా హింసించేస్తున్నారు. బడులు తీసినా పిల్లలు వెళ్ళేందుకు భయపడుతున్నారు, తల్లితండ్రులూ బడికి పంపేందుకు భయపడుతున్నారు, పిల్లలు బతికుంటే అంతే చాలనుకుంటున్నారు.  ఆడపిల్లలు మగపిల్లలకి పెళ్ళిల్లు వెనకబడిపోయాయి.


15, జూన్ 2021, మంగళవారం

కోటి విద్యలూ కూటి కోసమే

 

Coutesy:What's app

కోటి విద్యలూ కూటి కోసమే
  
https://youtu.be/wd1Aijoki50

ధర్మమ్ చై బాబు కానీ
ధర్మమ్ చై బాబు
ధర్మమ్ చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మమ్ చై బాబు
కోటి విద్యలూ కూటి కోసమే పూటే గడవని ముష్ఠి జీవితం
అరణా ఒరణా రెండణా కాలణా 
నీ చై పైన నా చై కింద ఇచ్చి పుచ్చుకును రుణమే బాబు
కవిగారు ఏం చెప్పేడండీ
కోటి విద్యలు కూటి కోసమన్నాడు,ధర్మానికి లిమిటూ లేదు అర్ధణా, ఒకణా,రెండణాలు, ఫొనీ లేవయ్యా అంత ధర్మం చై లేకపోతే ఓ కాణీ. ఇప్పుడు నువ్విస్తున్నావేమో నేను తీసుకుంటున్నా కాని ఇదంతా నువ్వు చేసుకున్న రుణం తీర్చుకోడమే సుమ్మా...వారెవా ఏం జబర్దస్తీ  
రేలంగి (Self) పాడిన పాట వినండి


14, జూన్ 2021, సోమవారం

సామాన్య పొరపాట్లు

  https://tappoppulu.irusu.in/

link courtesy:whats app

అంతా తెనుగులో చదువుకున్న(న్నా)వారమే కాని రాసేటప్పుడు కొన్ని (పొరబాట్లు)పొరపాట్లు (దొల్లు)దొర్లుతాయి. అ(వే)వేంటో చూదాం.పై లింక్ లో చూడండి.

12, జూన్ 2021, శనివారం

మెదడుకి మేత

 Solve this puzzle:it is tough one.Take your time

Here is a list showing the month and a number to each month.

January 71313

February 82382

March 53113

April 54203

May 35113

June 46203

July 47113

August 68313

Decipher the logic and find the number for September=?

Challenge O P E N  for  all

Brilliant brain scratching exercise.

Courtesy :Whats app.


10, జూన్ 2021, గురువారం

మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్

  ఉగ్రం వీరం మహావిష్ణుం

జ్వలంతం సర్వతో ముఖమ్

నృసింహం భీషణం భద్రం

మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్


శ్రీమనృసింహ విభవే గరుడధ్వజాయ,

తాపత్రయోపశమనాయ, భవఔషధాయ,

తృష్ణాది, వృశ్చిక, జలాగ్ని, భుజంగ, రోగ,

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే 







15, ఏప్రిల్ 2021, గురువారం

నీకూ తప్పలేదా మహదేవా?

Coutesy:What's app



  ముఖం మీద అలక కనపడుతుండగా కుడి చేత పైట కొంగు బిగించి కనులువాల్చి నిలచిన అంబను, తన కుడి చేయి అంబ గెడ్డం కింద ఉంచి బ్రతిమాలుతున్నశంకరుడు. అంబా శంకరులకు మ్రొక్కెద.. 

 

అలుక మానవే చిలుకల కొలికిరో....నీకూ తప్పలేదా మహదేవా?

13, ఏప్రిల్ 2021, మంగళవారం

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

29, మార్చి 2021, సోమవారం

లాలలు పోసుకుని...


 courtesy:Whats app


 ఒంటికి నువ్వులనూనెరాసి మర్దించి,సున్నిపిండి నలుగుబెట్టి, కుంకుడు కాయతో తల ఒళ్ళు రుద్ది, తల తుడిచి, ముక్కులలో చెవులలో తిరిబెట్టి,సాంబ్రాణి పొగవేసి, తల్లి చేతికిస్తే, కడుపు నిండా పాలుతాగిన బిడ్డడు, ఆదమరచి ఉయ్యలలో నిదురించే రోజు రానుందా? 

20, మార్చి 2021, శనివారం

90/140......140/90

 90/140.........140/90

 రోజుకు 10,000 అడుగులు.



 అంకెల చుట్టూ ఆరోగ్యం తిరుగుతోందా?

ఆరోగ్యం చుట్టూ అంకెలు తిరుగుతున్నాయా?

ఆరోగ్యం చుట్టూ వ్యాపారం తిరుగుతోందా?

వ్యాపారం చుట్టూ ఆరోగ్యం తిరుగుతోందా?

========

Diabetes and hypertension are the ailments of the world. 

1 set. 90/140

90:: is the the glucose level to be maintained in fasting blood I. e 90mg/dL

140:: is the glucose level to be maintained in blood after taking tiffin but after 90 to 120 minutes after taking tiffin. 140mg/dL.

=====

2 ND  set of 140/90

140 is the systolic pressure or the pressure which is maintained in arteries while the heart is pumping blood. 

90 is the dystolic pressure or the pressure of blood to be maintained in the nerves during the time between lab and dub of the heart. 

===

10,000 steps recommended per day to keep health.

====


15, మార్చి 2021, సోమవారం

వేసవి-దాహం-చిట్కా.

 వేసవి-దాహం-చిట్కా.


వేసవి పరిగెత్తుకొస్తోంది, దాహం సహజం, ఎక్కడపడితే అక్కడ వాటర్ పేకట్లు అమ్ముతూనే ఉన్నారు, కూల్ డ్రింక్ ల సంగతి చెప్పేదే లేదు. వాటర్ పేకట్లు కూల్ డ్రింకులు తాగితే రోగం కొనుక్కు తెచ్చుకున్నట్టే.ఐతే దాహానికో చిట్కా, ఒక బళ్ళారి నీరుల్లిపాయని జేబులో పడేసుకోండి. దాహంగా ఉంది, ఉల్లిపాయ కొరికి నమిలి మింగండి, ఇంకా అనిపిస్తే మళ్ళీ తినండి. దాహం కడుతుంది, దగ్గరలో ఎవరింటికైనా వెళ్ళి కాసిని మంచినీళ్ళియ్య తల్లీ అని అడగండి. దొరకవా? అందుకే నీ మొహానికి నిప్పూ నీళ్ళూ కూడా పుట్టవని తిట్టేవారు, పెద్దాళ్ళు. 


 మరో చిన్న చిట్కా! ఉసిరి పప్పు అని అమ్ముతారు. అదేమంటే ఉసిరి కాయలోని లోపలిగింజల పై దళసరిగా ఉన్న పెంకు. దీనిని ఉప్పులో పోసి ఎండబెడతారు. ఎండిన తరవాత దానితో ఉండే ఉప్పు బహు కొద్ది కొన్ని మైక్రోగ్రాములు, ఈ పప్పు చిన్న ముక్కని నోట్లో వేసుకోండి, మింగెయ్యద్దు, మెత్తబడిపోతుంది,బుగ్గన పెట్టుకోండి, లాలాజలం ఊరుతూనే ఉంటుంది, దాహమే వెయ్యదు. 



ఈ సావకాశం కూడా లేదు, నోరు ఆర్చుకుపోతోంది, ఏం చెయ్యాలి? నోరు తెరవండి, నాలిక బయటికి చాపి రెండు పెదవుల మధ్యనా సున్నాలా చేయండి, ఆ సున్నాలా ఉన్న నాలుకలోంచి నోటితో గాలి పీల్చండి, గుండెల నిండా, నోరు మూయండి, ముక్కుతో గాలి వదలి పెట్టండి, ఇలా రెండు మూడు సార్లు చేయండి, నోటిలో లాలాజలం నూతిలో పడ్డ జలలా ఊరుతుంది, ఏంటి చూసుకున్నారా? వెంటనే దగ్గరలో మంచి నీరు తాగండి, మంచి నీటికి ప్రత్యామ్నాయం లేదు. ఇలా నాలుకను సున్నాలా చేసి గాలి పీల్చి ముక్కుతో వదలి పెట్టడాన్ని శీతలీ ప్రాణాయామం అంటారు. బయట వేడిగా ఉన్న గాలి సున్నాలా ఉన్న నాలుక గుండా పీల్చినపుడు చల్లబడుతుంది, ముక్కు ద్వారా వదలే గాలి వేడిగా ఉంటుంది. నోటితో పీల్చినగాలెందుకు చల్ల బడుతోంది? దీనిలో సైన్స్ ఉందా? చెప్పండి. అత్యవసరంలో తప్పించి ఇదిచెయ్యద్దూ! ఊపిరి తిత్తుల వ్యాధి ఉన్నప్పుడు, రొంపతో ఉన్నప్పుడు అసలు చెయ్యదు, జాగ్రత!

ఫ్రిజ్ లో నీళ్ళెన్ని తాగినా దాహం తీరదు, దానికి తోడు అనారోగ్యం కూడా! ఇలా చేసుకుని చల్లటి నీళ్ళు తాగండి.ఆ తరవాత మీ ఇష్టం. 


 https://kastephale.wordpress.com/2013/05/25/

శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

11, మార్చి 2021, గురువారం

నమః శంభవేచ

 

Courtesy:Whats app

హిమాచల ప్రదేశ్ లోని సోలాన్ లో ఉన్న జటోలి శివాలయం. 



నమః శంభవేచ మయోభవేచ 

నమః శంకరాయచ మయస్కరాయచ 

నమశ్శివాయచ శివతరాయచ. 



5, మార్చి 2021, శుక్రవారం

నిండా ములిగితే

 నిండా ములిగితే


నిండా ములిగినవానికి చలేంటి? అనిగాని నిండా ములిగితే చలేంటీ అనిగాని చెబుతుంటారీ నానుడిని. దీనికి రెండు అర్ధాలూ చెబుతారు. నీళ్ళలో శరీరం సగం ములిగితే చలనిపిస్తుంది, నిండా ములిగితే చలి ఉండదు అనేది ఒక అర్ధం. మరో మాట ఏదో విషయంలో పరిస్థితి పూర్తిగా విషమించి పోయినపుడూ, పూర్తిగా చెయిదాటిపోయినపుడూ, నష్టం తప్పదన్నపుడూ బయట పడి తెగించడమూ చెబుతారు. 


సగం ములిగితే చలేస్తుంది. ఎందుకు? శీతకాలమైనా వేసవి కాలమైనా శరీర ఉహ్ణోగ్రత స్థిరంగా ఉంటుంది 37 C, కాని బయటి ఉహ్ణోగ్రత శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే తక్కువగానూ వేసవిలో ఎక్కువగానూ ఉంటుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నది ఒక నానుడి. నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అలాగే ఉష్ణం కూడా ఎక్కువనుంచి తక్కువ కి ప్రవహిస్తుంది. శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే బయట ఉహ్ణోగ్రత తక్కువ ఉన్నపుడు శరీరం వేడిని కోల్పోతూ ఉంటుంది, అందుకే చలేస్తుంది. అలాటి కాలంలో  నీటిలో దిగితే ఎలా ఉంటుంది?  శరీర ఉహ్ణోగ్రత ఎక్కువగానూ బయటి ఉహ్ణోగ్రత తక్కువగానూ ఉంటుంది, అలాటప్పుడు నీటిలో దిగితే నీటి పైపొరలలో ఉహ్ణోగ్రత క్కువగానూ  లోపలి పొరలలో ఎక్కువగానూ ఉంటుంది. అసలే శరీరం ఉహ్ణోగ్రత కోల్పోతున్నపుడు సగం శరీరం నీటిలోనూ సగం బయట ఉంటే చలి ఉంటుంది, కాని అదే పూర్తిగా శరీరం నీటిలో ములిగితే చలి ఉండదు.కారణం బయటి ఉష్ణోగ్రత కంటే లోపలి నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.   

అదే నిండా ములిగినవాడికి చలేంటీ అన్నది.  

Matter will be in three states. Solid,liquid,vapor. Water will be at liquid state at normal temperatures, it becomes solid at the 0 C and  and vaporizes after 100 C. Special feature of water is that, it will become solid at 0 C but remains as liquid at -4 C. By becoming solid, water looses its latent heat. (Latent heat of fusion of water is 80 cal for gram) Please correct if I am wrong. 

 

మరోమాట కూడా నీరు  నున్నా ఉష్ణోగ్రతలో గడ్డకడుతుంది, కాని -4 C డిగ్రీల దగ్గర నీరుగానే ఉంటుంది. అందుకే మంచు పలకలకింద నీరుంటుంది అది -4 C ఉష్ణోగ్రతలో ఉంటుంది.


ఇక రెండవదాని గురించి ఏం చెప్పేది? కొల్లలు ఉదాహరణలు అందుకు చెప్పను :)   


1, మార్చి 2021, సోమవారం

ఓం మిత్రాయనమః


 ఓం మిత్రాయనమః

ఓం రవయేనమః

ఓం సూర్యాయనమః

ఓం భానవేనమః

ఓం ఖగాయనమః

ఓం పూష్ణేనమః

ఓం హిరణ్య గర్భాయనమః

ఓం మరీచయేనమః

ఓం ఆదిత్యాయనమః

ఓం సవిత్రేనమః

ఓం   అర్కాయనమః

ఓం భాస్కరాయనమః


భాస్కరుడు ఫిబ్రవరి నెల ముగియ కుండానే ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయమే దట్టమైన మంచు తొమ్మిదికి గాని భాస్కర దర్శనం లేదు. మధ్యాహ్నానికే 38 కి వేడి జేరిపోతోంది.సాయంత్రానికి కూడా చల్లబడటం లేదు, రాత్రి చలి. ఇలా ఉన్న వాతావరణం లో అనారోగ్యం పెరగటం ఖాయం. నిరుడు ఇదే రోజుల్లో అంటు కున్న కరోనా సడలింది అనుకునే లోగా మళ్ళీ పుంజుకుంటోందనే వార్త. ఇదివరలో పద్నాలుగు రోజులు కాలం ఉండేది ఇప్పుడు మూడు రోజుల్లో అంతా తేలిపోతుందని భయపెట్టే వార్తలు, లక్షణాలు ఇవి అని చెప్పేందుకు లేదు. వస్తే ఈడ్చెయ్యడమేనని సోషల్ మీడియా వార్తలు భయపెడుతున్నాయి. నేటి కరోనా విషయంలో ప్రభుత్వం కొద్దిగా వార్తలిస్తే ఈ బెదిరింపులు తగ్గుతాయేమో! పిల్లలు బడికి వెడుతున్నారు, ఇంతలో ఒక సోషల్ మీడియా వార్త కరోనా పెరిగిపోడంతో బడి, కాలేజిలకి రెండు నెలలు శలవులని. ప్రజలు బేజారెత్తి పోయారు. ఇలాటి వార్తలు ప్రచురించేవారిని కఠినంగా ప్రభుత  శిక్షించాలని కొరిక. వార్త ఉత్తిదేనని ప్రభుత వివరణ ఇచ్చేలోగా జరగ వలసినది జరిగిపోయింది. ఇటువంటి నీలి వార్తలు ప్రచారం చేసేవారు పొందే ఆనందం ఏమిటో!

22, ఫిబ్రవరి 2021, సోమవారం

పొట్ట తగ్గాలంటే?

 పొట్ట తగ్గాలంటే?


మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ

పదండి ముందుకు పదండి తోసుకు

పదండి పోదాం పై పైకీ

మరో ప్రపంచం మరో ప్రపంచం  పిలిచిందీ


అన్నారట మహాకవి శ్రీశ్రీ. కవిగారూహించిన మరో ప్రపంచం కనబడిందో లేదో గాని తోసుకునే అలవాటు మాత్రం మిగిలిపోయింది,జనాలకి, ఎక్కడి దాకా? రిజర్వ్ కంపార్టుమెంటులోకి ఎక్కడానికి నలుగురే ఉండి, రైలు పావుగంట ఆగుతుందని తెలిసి, రైలు ఆగగానే దిగే వాళ్ళని కూడా దిగనివ్వకుండా తోసుకుని ఎక్కే అలవాటు దాకా, పిల్ల చచ్చినా పురిటి కంపు పోనట్టు ఈ అలవాటు మాత్రం మిగిలిపోయింది.. అనుకోని విపత్తు అంటే ఆకాశం విరిగి మీద పడటం అని అంటారు. ఆకాశం విరుగుతుందా?అక్కడేం లేదు కదా! అదే మరి విచిత్రం అలాటిదే నిరుడు ప్రపంచంమీద విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారిని చూస్తూ కూడా జనం దూరం పాటించక పొట్టలతో తోసుకోడం మానలేదు, ఎక్కడా! అదీ అసలు విచిత్రం.ఐపోయిన పెళ్ళికి బాజాలెందుకుగాని, 


సరే నేటి పరిస్థితి కరోనా కొంత వెనకబట్టిందనగానే గుంపులు,గుంపులు జనాలు ఎక్కడబడితే అక్కడ తోసుకుంటూనే ఉన్నారు, హాస్పిటళ్ళలో, డాక్టర్ల దగ్గర, హోటళ్ళలో, సినిమా హాళ్ళలో,బస్సుల్లో, రైళ్ళలో ఇదేస్థితి రాబోతోంది.


మా దగ్గర కొద్దికాలం తప్పించి నడక సాగించాం అందరం, మా వాకర్స్ క్లబ్ వారం. ఇప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నాం. తొమ్మిది మంది దాకా ఒక గుంపు, మూడడుగుల దూరంలో ముగ్గురో వరసకి ఉంటూ అన్ని విషయాలూ, నేటి రాజకీయం మొదలు,నాటి సాంఘిక స్థితి నుంచి, కాళిదాసునుంచి విప్లవ కవిత్వం దాకా ఎవరో ఒకరు నాటి ప్రవచకులుగా నడక సాగిపోతూనే ఉంది. ఉదయం పూట నాలుగొందల మీటర్ల ట్రాక్ మీద నడక, మూడు నాలుగు గుంపులు, మరో పక్క యోగాసనాలు వేసేవారు, మరో పక్క బేస్కెట్ బాలు ఆడేవారు, మరో పక్క ఫిజికల్ ఫీట్నెస్ కోచింగూ, సాయంత్రం పూట క్రికెట్టూ, నడకా, వాలీబాల్,బేస్కెట్ బాలూ, మరో పక్క ఇండొర్ స్టేడియంలో,టేబుల్ టెన్నిస్ షటిల్ ఇలా మా గ్రౌండ్ పెళ్ళివారిల్లులా ఉంటుంది,రెండు పూటలా. చూడ రెండు కళ్ళు చాలవు.ఇక్కడికొచ్చేవారెవరఎవరుంటారూ అని కదా అనుమానం, వ్యాపార వేత్తలు, టీచర్లు,లెక్చరర్లు,పోలీస్,ఇతర ఆఫీసుల వారు, లాయర్లు,డాక్టర్లు, ఇంజనీర్లు, నాలాటి వయసుడిగినవారు, ఏమని చెప్పను? ఎన్నని చెప్పను.. ..ఈ మధ్యనే నవ్వుల క్లబ్ కూడా మొదలెట్టాలనుకుంటున్నారు.  


నేను వీరితో కలవలేను కవిని కనక, ఒంటరిగా నడక సాగిస్తా. అలా ఒంటిగా నడచి ఒకరోజు దగ్గరే ఉన్న స్కూల్ అరుగు మీద కూచున్నా. మరో మిత్రుడు తన నడక ముగించి వచ్చి పక్కనే కూచున్నారు. చాలా తొందరగా వ్యాయామం ముగిస్తున్నారు, మరి కొంచం సేపు చెయ్యాలి అన్నారు. చేయలేకపోతున్నానన్నా! ఒక పని చెయ్యండి, వెనక్కి నడవండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటీయనా? ఎగతాళీ చేస్తున్నారా అనిపించింది, ఇంటి కొచ్చాకా గుర్తొచ్చి గూగులమ్మని అడిగా! వామ్మో! పెద్ద లిస్టు చూపింది. వెనక్కి నడిస్తే లాభాలూ అని చెప్పుకొచ్చేరు అందరూ. మర్నాటినుంచి వెనక్కి నడవడం ప్రారంభించా, నవ్వేరు, నాకేం మీపళ్ళే బయట పడ్డాయని ఊరుకున్నా! సలహా చెప్పిన స్నేహితుడూ జత కూడారు. పొట్ట తగ్గుతుందన్నారు కొందరు, కొలిచి చూసుకుందామనుకుని అలాచేశేం. ఒక నెల రోజులు విడవకుండా అందరూ నవ్వినా కొనసాగించాం. నెల తరవాత చూసుకుంటే రెండంగుళాలు పొట్ట లోపలికి పోయింది, ఇద్దరికీ. ఇప్పుడు ఆడా మగా అందరూ వెనక్కి నడుస్తున్నారు.  ఇతర లాభాలు చెప్పను గూగుల్లో వెతుక్కోండి.


చైనావాళ్ళకి వెనక్కి నడవడం బాగా అలవాటట. మంచి గుణం శత్రువు నుంచైనా నేర్చుకోవలసిందే! వెనక్కి నడవండి, పొట్ట తగ్గించుకోండి.




18, ఫిబ్రవరి 2021, గురువారం

పొట్టెందుకు పెరుగుతుంది?

 

పొట్టెందుకు పెరుగుతుంది?


భోజనాగ్రే సదా పథ్యం 

లవణార్ద్రక భక్షణం

రోచనం దీపనం వహ్ని 

జిహ్వాకంఠ విశోధనమ్


భోజనానికి ముందు సైంధవలవణం అల్లం కలిపి నమిలితే జీర్ణ శక్తి పెరుగుతుంది,గొంతు నాలుక పరిశుద్ధమై రుచి కలుగుతుంది.


 భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,

అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.

భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,

ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః


భోజనానంతరం నూరడుగులేస్తే అన్నము యుక్త స్థానము చేరి శరీరానికి బలం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే కూచుంటే పొట్టొస్తుంది,వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు చేరుతుంది, మెల్లగా నడచిన ఆయుర్వృద్ధి,పరుగెత్తినచో ఆయుక్షీణము.


మరో మాట భోజనానంతరము మెల్లగా నూరడుగులు నడచి వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూచుంటే ఆరోగ్యం మీసొత్తే అంటారు పెద్దలు. చిత్రమైన మాటేమంటే భోజనం తరవాత యోగాసనాలు వేయ కూడదు కాని ఈ ఒక్క వజ్రాసనం మాత్రమే భోజనం తరవాత కూడా వేయచ్చు. యోగాసనాలు వేయడం తేలికైన పనికాదు, తెలిసి తెలియక ఆసనాలు వేయడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళూ చేతులు నొప్పులు పుడతాయి, విరగచ్చు కూడా జాగర్త.


ఈ రోజుల్లో అందరికి పొట్టలెందుకొస్తున్నాయో తెలిసిందోచ్! భోజనం చేసిన వెంఠనే కంప్యూటర్ దగ్గర కూచోడం అలవాయిపోయింది జనాలికి చాలా కాలంగా అందుకే పొట్టలొస్తున్నాయి. పొట్ట తగ్గే మార్గం........?

15, ఫిబ్రవరి 2021, సోమవారం

యతో భ్రష్టః తతో భ్రష్టః

 


భుక్త్వా శతపదం గఛ్ఛేత్

తాంబూలమ్ తదనంతరమ్

వామపార్శ్వేతు శయనమ్

ఔషధైః కిం ప్రయోజనమ్ ?.


భొజనానంతరము నూరడుగులు నడచి తాంబూలము సేవించి, ఎడమవైపు పడుకుంటే ఔషధములెందుకు?


After dinner sleep awhile. After supper walk a mile.


దేశీయమైనదేదీ నమ్మం, విదేశీయమైనది అర్ధం చేసుకోం. 

యతో భ్రష్టః తతో భ్రష్టః


16, జనవరి 2021, శనివారం

మా ఊళ్ళో సంక్రాంతి సంబరం

 


మా ఊరు గ్రామదేవత వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర.


పోరుకు తయారైన బరి



గంగలకుఱ్ఱు గ్రామంలో భారీ భోగి పిడకలదండ.

ప్రభల తీర్థం (విడియో పాతదే)


మరువని సంప్రదాయం

All videos courtesy:Whats app. 

పండగ గురించి తెలియని వారుండరు, మూడు ముక్కలతో ముగించేస్తా. . భోగి రోజు నలుగురితో పంచుకుని తినడం అనేదే భోగం, అదే ఆనందం. రెండవరోజు పెద్ద పండగ, పెద్దల పండగ, పెద్దల పేరు చెప్పి తిలతర్పణం, దానం. మూడవరోజు కనుమ పశువులపండగ.నాలగవరోజు బొమ్మల కొలువు, బొమ్మల నోము ప్రధానం అదే సావిత్రి గౌరి దేవి నోము,''ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం'' ఇందులోదే

 ఇప్పుడు పట్టేవారు లేరు, పదమూడు సంవత్సరాల నోము. మరచిపోయిన ఒక ఆచారం.

శలవు.

15, జనవరి 2021, శుక్రవారం

రకరకాల పందెం కోడి పుంజులు

 
















courtesy:Whats app



విజయమో వీర స్వర్గమో పుంజులదే అగ్ర స్థానం. గెలిస్తే సన్మానం, ఓడితే వీర స్వర్గం మర్నాడు దాకలో కోసగా కూరకే . ఏదైనా దొరుకుతుందేమో గాని ''కోస'' దొరకదట, కొనడానికైనా! పుంజులదే రాజ్యంగాని పెట్టలకి చోటు లేదు :)

13, జనవరి 2021, బుధవారం

ఎప్పుడెప్పుడు పండగా?

 సంక్రాంతి శుభకామనలు.

(సం క్రాంతి శుభకామనలు. :) )



courtesy: whats app


ఎప్పుడెప్పుడు పండగా?

ఏడది పండగా!

పండగెందుకొచ్చింది?

పప్పలు తిండానికొచ్చింది!!

అల్లుడెందుకొచ్చాడు?

అరిసెలు తిండానికొచ్చాడు!!!

కూతురెందుకొచ్చింది?

కుడుములు తిండానికొచ్చింది!!!!

కట్టుకుపోడానికొచ్చింది!!!!

పట్టుకుపోడానికొచ్చింది!!!!

అహహహహ!!!!!!!!!


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

అతస్త్వామ్ ఆరాధ్యాం హరి హర విరించాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి


సౌందర్యలహరి.


(చిన్న ఆట విడుపు)


1, జనవరి 2021, శుక్రవారం

త్వం క్షమస్వ! త్వం క్షమస్వ !!

క్షమస్వ త్వం



 2020

 ఈ సంవత్సరం మనం సాధించినదేమిటి?

బతికి ఉండటమే ఈ సంవత్సరం మనం సాధించిన గొప్ప ఘన కార్యం.

(ఇది పెద్దల మాట)


అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే.

శేషశైల శిఖామణే! హరీ! మయా, అజ్ఞానినా విహితాన్ దోషాన్ అశేషాన్! త్వం క్షమస్వ!  త్వం క్షమస్వ !!


2021

స్వాగతం

శుభకామనలు.

31, డిసెంబర్ 2020, గురువారం

30, డిసెంబర్ 2020, బుధవారం

పీత్వామోహమయీం ప్రమాదమదిరా

 పీత్వామోహమయీం ప్రమాదమదిరా


ఆదిత్యస్యగతాగతై రహరహ స్సంక్షీయతే జీవితం

వ్యాపారై ర్బహుకార్యభారగురుభిః కాలో న విజ్ఞాయతే

దృష్ట్వా జన్మజరావిపత్తిమరణం త్రాస శ్చనోత్పద్యతే

పీత్వామోహమయీం ప్రమాదమదిరా మున్మత్తభూతం జగత్.


సూర్యుని ఉదయాస్తమాలతో ఆయువు తరిగిపోతోంది. ఎడతెగని పనులలో మునిగితేలు జనులు అది గుర్తించకున్నారు.పుడుతున్నవారిని, చనిపోతున్నవారిని, ముసలివాళ్ళవుతున్నవాళ్ళని,కష్టాలు పడుతున్నవాళ్ళని చూస్తూ కూడా జనులు భయపడటం లేదు. కల్లుతాగి పిచ్చెక్కినట్టు అజ్ఞానం లో పడి ఉంది, జగత్తులో జనసమూహం. అనగా తెలుసుకోవలసినదానిని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు.


తెల్లవారుతోంది పొద్దుగూకుతోంది, రోజులు,వారాలు,నెలలు, సంవత్సరం 

గడచిపోతోంది.   కొత్త సంవత్సరం   వచ్చేస్తోంది, పండగ చేసుకుంటున్నాం, ఎలా?సంవత్సరం ఆఖరిరోజు, అర్ధరాత్రి దాకా మేలుకుంటున్నాం. ఆడా మగా తేడా లేక గుమిగూడుతున్నాం, మన దీపాలు మనమే ఆర్పుకుంటున్నాం. పన్నెండుకి చీకట్లో కొత్త సంవత్సరం వచ్చిందని అరుస్తున్నాం, దీపాలు వెలిగించుకుంటూ తాగుతున్నాం, వాగుతున్నాం, ఊగుతున్నాం. ఆ తరవాత ఒళ్ళు తెలియని స్థితిలో ఆడా మగా తేడా లేక మోటర్ సైకిళ్ళెక్కి హేపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఊరు తిరుగుతున్నాం. ఇదేమిరా అని అడిగినవారిని ఈసడిస్తున్నాం. సంస్కారం లేనివాళ్ళు అంటున్నాం. మన పయనమెటు?

  ఇదంతా ఎందుకో తెలీదు, అదో ఆనందం, తుత్తి. కాని ఒక సంవత్సరం ఆయుస్సు గడచిపోయిందనుకోటం లేదు. గడచిన సంవత్సరం ఎలా గడచిందీ? రోగం,భయం, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పుట్టినరోజు పండగలూ చేస్తున్నాం, పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, కష్టపడేవాళ్ళు     పడుతున్నారు, ముసలాళ్ళవుతున్నారు ఛస్తున్నారు, వాళ్ళని పంపించేసి వస్తున్నాం. ఇంత మన కళ్ళ ఎదుట జరుగుతున్నా, పనుల్లో పడిపోయి తిరిగుతున్నాం. రేపు మనకూ ఇదేగతి పడుతుందనే భయమే కనపడటం లేదు. మూము గుడ్డలు కట్టుకోవలసివచ్చినా, తిరిగేస్తున్నాం లేకపోయినా. కొత్త దయ్యమొచ్చింది, భయమేలేదు. అయ్యో కాలం ఇలా జరిగిపోతూ ఉంది, ఈ పుట్టుక చావుల అంతరార్ధం ఏమిటీ? ఈమధ్య కాలంలో కల్లుతాగినపిచ్చెక్కిన కోతిలా, మోహంతో డబ్బు వెనక ఎందుకు పడిపోతున్నాం, దీనికి కారణం అన్వేషించటం లేదు. అసూయ, ద్వేషాలతో కొట్టుకుంటున్నాం, ఇదే సుఖం అనుకుంటున్నాం,ఇంతేనా ఈ కతంతేనా?  

 అనుదినమున్ నశించు బరమాయువు సూర్యునిరాకపోకలన్

ఘనబహుకార్యభారముల గాలము పోవుట గానరాదు సం

జననజరామయంబులును జావునుజూచి భయంబు లేదు, దు

ర్జనభువనంబు మోహమదిరారస విహ్వల మయ్యె నయ్యయో...లక్ష్మణ కవి

స్వస్తి


28, డిసెంబర్ 2020, సోమవారం

బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

 బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

''కుర్రోడితో యేపారం బెట్టిద్దామనుకుంటన్నాను, ఏం యేపారం పెట్టించమంటావూ?'' అడిగాడు మా సుబ్బారాజు.

''బుఱ్ఱలో గుంజుండాలిగాని బూడిదమ్ముకు బతకొచ్చు'' చెప్పేడు సత్తిబాబు.

 నువ్వన్నీ ఇలాగే చెబుతావు. అన్నీ యతి కుతం మాటలే 

విసుగు చూపాడు మా సుబ్బరాజు.

 ''ఎవడూ మొదటిరోజే అంబానీ ఐపోడయ్యా 

నీకు తెలుసా అంబానీ పెట్రోల్ బంకులో డెలివరీ బాయ్ గా పనిజేసేడు. కష్ట పడటానికి ఇష్టపడాలి. పనిజేయాలె. ఫలితమూ వస్తది.మంత్రసానితనం ఒప్పుకున్నాకా బిడ్డొచ్చినా పట్టాలె గొద్దొచ్చినా పట్టాలె.ఇదో సావెతలే అన్నా!''

''సరెలేవో సంగతేదో చెప్పరాదె!'' అరిసిండు సుబ్బరాజు. 

''తెల్లోడైనా నల్లోడైనా ఎవుడైనా వండుకోవాలె, తినాలె. వండుకున్న అంట గిన్నెలూ తోముకోవాలె''. 

''నీకన్నీ యాలాకోలమేనయ్యా'' అన్నాడు సుబ్బరాజు.

''నిజం జెపితే అలాగే ఉంటదిలే

నిన్నటి దాకా అంట గిన్నెలు తోముకోడానికి డిటర్జంట్లు, సబ్బులు  వాడేరు, ఇప్పుడో ఆర్గానిక్ బూడిద అరకేజి నాలుగొందలట. మంచేపారం. పిడకలు కొనిపించు, బూడిద చేయించు, దాన్ని పేక్ చేయించు అరకేజి మూడొంద ఏభై అను, బయో బూడిద అని యాడ్లేయించు, అరకేజి కొన్నోళ్ళకి స్పూన్ బహుమతను. ఐదు కేజిలు కొన్నోడికి మూడు వేలను, టీ కాసుకునే బొచ్చి గిఫ్ట్ పెట్టు. యాపారమే యాపారం.నిన్నటిదాకా బూడితతో అంట గిన్నెలు తోముకోడం అనాగరికమన్నారు. అందుకే సబ్బులు వచ్చాయి, కొన్నాం కాదా. ఇప్పుడు సబ్బులు వదలటం లేదు పూర్తిగా కడిగినా, అంచేత అనారోగ్యాలు కేన్సర్లు వస్తన్నాయంటన్నారు. మళ్ళీ ఆర్గానిక్ బూడిద ట్రెండవుతోంది. నువ్వు కొత్త ట్రెండ్ మొదలెట్టు. ఆర్గానిక్ బూడిడైతే పర్యావరణానికి నష్టం అందుకు బయో బూడిద వాడండి అని పిడకల బూడిదమ్ము. ఎలా ఉంది ఐడియా?'' అగాడు సత్తి బాబు. 

''అదిగాదుగాని మరోమాట చెప్పు'' అడిగాడు సుబ్బరాజు. 


''నీకేటి నేన్జెప్పింది బోదపడలా! ఏటిజేస్తాం. ఒక జరిగిన సంగతి చెప్తా ఇనుకో. మొన్నో పాలి కిరానా దుకానానికెల్లా, అదేలే స్టోరో ఎదోనట గందా? నీ కాడ ఎండు పళ్ళేటున్నాయన్నా? ఆడేటి తెల్లమొకమేసినాడు. అదెరా బాబూ డ్రై ఫ్రూట్స్ ఏటున్నాయన్నా? కిస్మిస్,డేట్స్ అంటా చెప్పుకొచ్చినాడు.ద్రాక్ష తీసుకున్నా, మరేదో కావాలన్నా లేవన్నాడు, తెచ్చినా అమ్మకం కావన్నాడు. 'మనూళ్ళో డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టినోడు లేకపోయె' అని గొణుక్కుంటా వచ్చేసినా.'' 

''ఐడియా. నేను గొణుక్కున మాట షాపోడు ఇన్నాడు. వారం కితం ఓ కుర్రోడో పేకటొట్టుకొచ్చి నమస్కారమెట్టి నిలబడినాడు. ఏటో ఒవుళు నువ్వు? అడిగినా. నేను స్టోరతని కొడుకునని మొన్న మీరన్న డ్రై ఫ్రూట్ షాప్ పెట్టేను. మీరడిగిన వెరైటీ ఇది. ఉంచండి'' అన్నాడు. ''ఎంత అంటే పేకట్ నూట ఏబై అండి, మీకిది బహుమతి'' అన్నాడు. ''అదేటి మొదటి సారిగదా'' అంటే

''మీ ఇడియా సార్. ఆశీర్వదించండి. నా shop కి రండి'' అని ఆహ్వానిం చాడు

''యాపారం ఎలా ఉందన్నా?"

''పర్లేదు సార్! మీలాఐడియా ఇచ్చే వాళ్ళుంటే దున్నేస్తా'' అన్జెప్పేడు.

''పర్లేదురా అబ్బాయి, పైకొస్తావన్నా!'' వెళుతూ, ''నా షాపులో ఎప్పుడూ మీకు స్పెషల్ రేటు సార్'' అని చెప్పెళ్ళేడు.

''సంఝే!!! నువ్వేటి యాపారం సెయ్యనేవు, కొర్రోణ్ణి ఒగ్గీ ఆడే జూసుకుంటాడు. సలాలు ఊరికే చెప్పీరు, కరుసవుద్ది.నీల్లలో పారీస్తేనే ఈతొస్తది''. అన్జెప్పి తుండుగుడ్డ బుజానేసుకుని ఎలబారిపోనాడు మా సత్తి బాబు.


26, డిసెంబర్ 2020, శనివారం

శకారః

 శకారః

అకారాంతః పుల్లింగో రామశబ్దః రాముడు. 

ఇదేంటి? శకారుడన్నారు, వ్యాకరణం చెబుతారేంటి?

 ఆ కారాంతః స్త్రీలింగో సీతా శబ్దః, సీతడు. 

యస్యజ్ఞాన దయా సింధో 

గోడదూకితే అదే సందో

సీతడు కాదూ సీతా అనాలి సీత కాదు. లలిత అనకూడదు లలితా అనాలి.

మీకేదో అయిందీవేళ. 

ఆగండి సావీ :)

ఈ శకారుడు అనే కాణేలీ పుత్రుడు మృఛ్ఛకటికం అనే సంస్కృత నాటికలో ఒక పాత్ర. మృఛ్ఛకటికం అంటే మట్టిబండి. అనగా మట్టితో చేసిన ఆటబండి. 

ఒక పాత్రకే అంత గొప్ప పేరా? 

జేంస్ బాండ్ కి అంత పేరు రాలేదేంటీ? ఈయన విశేషం చెబుదురూ....

ఈ శకారుడు ఒక రాజుగారి రాణీ గారి తమ్ముడు. అదేంటి రాజుగారి బావమరదని చెప్పచ్చుగా? అలా చెప్పేస్తే గొప్పేంటీ? ఈ రాణీ గారి తమ్ముడు బలే వింత వింత అపభ్రంశం పనులు చేస్తాడు, నాటి కాలానికి నవ్వొచ్చేటట్లు వింతగానూ మాటాడతాడు. చేసేవన్నీ...వద్దులెండి అభిమానులకి కోపమొస్తుంది. వీరికి నేటికీ అభిమానులున్నారు మరి. 

ఈ శకారుడు వసంత సేన అనే భోగప్పిల్ల వెనక పడ్డాడు. అదేమో ఛీ కొట్టింది, అంతతో ఊరుకుందా? మరో అందగాడిని ప్రేమించింది. ఇక అక్కడినుంచి మొదలవుతాయి, ఈ శకారుని వన్నెలు చిన్నెలూ! అసలే రాణీగారి తమ్ముడు,రాజుగారి బావమరదాయె, ఇతనిలో రాజ్యాంగేతర శక్తి కూడా బయటపడుతుంది.  శూద్రక మహాకవిరాసిన ఈ నాటకాన్ని తిరుపతి వేంకట కవులు తెనిగించారు.శకారుని కొన్ని పలుకులు........


1.ఏల పోయెదు పాఱిపోయెదవు తొట్రు

పాటుతో, దయయుంచు చంపము లతాంగి

బొగ్గు నిప్పులలోబడ్డ పొలుసువలెనె

కాల్చుచున్నాడు నామది కంజశరుడు.


2.ప్రక్కపై నిద్రయైనను బట్టకుండ

నాకు మదను ననంగు మన్మధుని వృద్ధి

పఱచి,దశకధరునకు లోబడిన కుంతి

పగిది నెట కేగెదే తొట్రుపడుచు పడుచ.


3.నాణెంబులు హరించు నలినాస్త్రు వేత్రంబు 

నంజుడు తినులంజ, నాట్యమాడు.

వెలది,చప్పిడి ముక్కు గలనాతి, వంశంబు 

లడగించు కామిని,యవశురాలు,

పూవింటివాని సొమ్ములపెట్టె, విలువైన

భూషణములుదాల్చు పువ్వుబోడి

డబ్బిచ్చి చొరగనాటకంబుగల్గని

మేడగాపురమున్న వాడ వెలది


పడపుమగువల కెల్లర కొడయురాలు

నంచు బది మంచిపేర్లు కల్పించినాడ.



.4.గల్లురని నగల్ మ్రోయగ వెళ్ళెదేల

రామునకు జంకి పరువెత్తు ద్రౌపదివలె

హనుమ, విశ్వావసు చెల్లెలగు సుభద్ర

పగిది,నిను బల్మి హరియించువాడ జూవె


5.అడవిలో వేటకుక్కల కాడునక్క

యడలుగతి బల్మి మాచేత నభిసరింప

బడుచు బరువెత్తె దేటికే వడిగ వేగ

మూలముట్టుగ నా డెందము హరించి.


6.ఏను సుశ్శాసనువలె నిపుడు నీదు

కొప్పుదొరకొందు, జమదగ్ని కొడుకు భీము

సేను డేతెంచి యాపునో చాన కుంతి

కాత్మజుండగు న్దశకంఠు డాపగలడొ?


7.ఉత్తరింతువొ యీవాడికత్తి నీదు

కుత్తుకను బళ్ళుమన దలగొట్టి నిన్ను

జంపుదునో చావుమూడిన జనుడు బతుక

డెందు, నీవేల పాఱిపోయెదవు గోల 


8.కటికచీకటిలోగన్ను గానకుండ

బోవుతఱి బూవుదండల తావివలన

నట్టెగుర్తించి కీల్జడ పట్టుకొంటి

యాజ్ఞసేనిని చాణుక్యుడట్లు నేను.


ఇలా ఈ శకారుని పద్దేలు తిరుపతికవులు రాశారు.చాలా ఉన్నాయి కొన్నే నేను ఇక్కడ ఇవ్వగలిగేను. ఇక ఇతనో రాజ్యాంగేతర శక్తి, కాణేలీ పుత్రా అని పిలిచేవారితనిని.ఇక ఇతను రాష్ట్ర శ్యాలకుణ్ణి చెప్పుకునేవాడు. ఇంతటి ఘనుడు బోగం పిల్ల ఛీ కొడితే పీక నులిపేడు, చచ్చిందని కంగారు పడ్డాడు, హత్య చేసేననుకుని హత్యను బోగంపిల్ల ప్రియుడి మీద నెట్టేసేడు. ఇదీ ఈ శకారుని వృత్తాంతం, కొద్దిగా. ఇంతకీ ఏమిటితని గొప్పా? రాజుగారి రాణిగారి తమ్ముడు. ఇతనేం రాజు కాదు మంత్రి కాదు, సేనాపతికాదు, చివరికి భటుడు కూడా కాదు, దర్పం, అధికారం వెళ్ళబోశాడు. ఇటువంటివాడే మరొకరు....ఇంతకంటే ముందువాడే అతనే దుర్యోధనుడు.


దుర్యోధనుడు రాజు కాదు, రాజు ధృతరాష్రుడు, యువరాజా కాదు యువరాజు ధర్మరాజు, మంత్రా? కాదు, సేనాపతా? కాదు చివరికి భటుడు కూడా కాదు. ఇంతకీ ఇతనెవరు రాజుగారి పెద్దకుమారుడు. ఏ అధికారమూ లేదు కాని అధికారం వెళ్ళబెట్టి చివరికి యుద్ధానికి కారకుడై తొడలు విరిగి చచ్చాడు. నేటి కాలానికి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయా? ఎవరేనా గుర్తొచ్చారా? అస్తు.



 





24, డిసెంబర్ 2020, గురువారం

ధైర్యం చెడుతుంది.

 ధైర్యం చెడుతుంది.


ధైర్యం చెడుతుంది, ఎప్పుడూ? 

ధర్మం చెడినపుడు. 


ధర్మం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో సత్యం చెడినపుడు. 


సత్యం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో కామ,క్రోధ, లోభ,మద,మత్సరాలు హద్దులు లేక పెరిగిపోయినపుడు,వీటినే అరిషడ్వర్గాలంటారు.


అరిషడ్వర్గాలెప్పుడు పెరుతాయి?

మనిషిలో దురాశ పెరిగినపుడు, 


దురాశ ఎప్పుడు పెరుగుతుందీ? 

స్వార్ధం అలవిగాక పెరిగినపుడు. 


స్వార్ధం ఎప్పుడు పెరుగుతుందీ?

కాంతాకనకాలమీద మోజు పెరిగినపుడు. 


కాంతా కనకాలమీద మోజులేనివారున్నారా?

ఇద్దరున్నారు!


ఎవరు వారు?

ఒకరు పుట్టనివాళ్ళు, మరొకరు చచ్చినవాళ్ళూ!


 అందరికి కాంతా కనకాల మీద మోజు ఉంటుంది! అది సహజమైనదిగా ఉండాలంటారు పెద్దలు.....


సహజసిద్ధంగా ఉండవలసినవేంటీ?


ఆపదలందు ధైర్యగుణ మంచితసంపదలందు దాల్మియున్

భూప సభాంతరాళముల బుష్కల వాక్చతురత్వమాజి బా

హాపటు శక్తియున్ యశమునందనురక్తియువిద్యయందు వాం

ఛాపరివృద్ధియున్ బ్రకృతి సిద్ధగుణంబులు  సజ్జనాళికిన్..... లక్ష్మణ కవి


ఆపదల్లో ధైర్యం కావాలి, సంపదల్లో ఓర్పు కావాలి.ఆపద మొక్కులూ సంపద మరుపులూ అనేది ఒక నానుడి.సభలలో వాక్చాతుర్యం కావాలి, ఇది మంది మంచికై ఉండాలి.యుద్ధంలో వీరత్వం కావాలి, కీర్తి మీద కోరిక ఉండాలి,నిత్య విద్యార్ధి ఐ ఉండాలి. ఇవే ప్రకృతి సిద్ధంగా వచ్చే గుణాలు.

విపది ధైర్య మధాభ్యుదయే క్షమా

సదసి వాక్పటుతా,యుధి విక్రమః

యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ

ప్రకృతిసిద్ధ మిదం హి మహాత్మనామ్


22, డిసెంబర్ 2020, మంగళవారం

మూడు తెనుగు ముక్కలున్న పద్యం./మూడు తెనుగు ముక్కలున్న తెనుగు పద్యం

 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

ఈ పద్యం మనుచరిత్రలో రెండవ ఆశ్వాసం లోది. మను చరిత్ర తెలియని తెనుగువారుంటారనుకోను. చిత్రమేమంటే ఈ పై పద్యంలో మొదటి మూడు మాటలు తప్పించి తెనుగు లేదు. ఆ మాటలు అట జని కాంచి అన్నవే! మిగిలిన పద్యమంతా సంస్కృతం అంటే నమ్మలేం. నిజానికి మనం మాటాడే తెనుగులో చాలా సంస్కృత పదాలే ఉంటాయి, ఉన్నాయి. నేడు ప్రపంచం  సంస్కృతం వెనక పరిగెడుతోంది, ముఖ్యంగా జర్మనీ, అంటే నమ్మేలా లేదు కదూ, కాని ఇది నిజం.మనం మాత్రం సంస్కృతం అంటే మృత భాష అనేస్తున్నాం. చిత్రం మృత అన్నది కూడా సంస్కృత శబ్దమే.  కంపూటర్ కి అనువైన భాష సంస్కృతం అంటే నమ్మలేరు. మరో సంగతి కూడా సంస్కృతం ఇంగ్లీష్ కీ బోర్డ్ మీద టైప్ చేయడం సులువు. 



ఈ పై పద్యంలో మాటలు తెలిసినంత వరకు విడదీయండి. అట, జని,కాంచె, ఇవి తెలుగనుకున్నాం కదూ. ఇక సంస్కృతం మాటలు చూడండి. అంబర, చుంబి, శిరః, పటల, ముహుర్ ముహుర్, తరంగ,మృదంగ,నిస్వన,, పరిఫుల్ల, కలాప, కలాపి, చరత్, కరేణు, కర,కంపిత, సాలము, శీత, శైలము.ఈ మాటలన్ని తెనుగు నిఘంటువులో అర్ధాలు దొరుకుతాయి. :) కొన్ని పదాలకి నిఘంటువు కూడా చూడక్కరలేదు కదూ
ఇది తెనుగు పద్యమా? సంస్కృత పద్యమా?

అట జని కాంచె అన్నవి రెండు గణాలుగా విడదీస్తే అటజ మూడు లఘువులు నగణం జకాంచె లఘు,గురువు,లఘువు మధ్య గురువు జగణం. అంటే పద్యం నడక నజభజజజర అనేగణాలతో నడుస్తుందని తెలిసిపోతోంది. దీనికో పేరు పెట్టేరు అదే చంపకమాలా వృత్తం. 

లఘువు ఒక మాత్ర, గురువు రెండు మాత్రలు సమయం పట్టేది. ఈ లఘు గురువులకు బైనరీ తో సంబంధం చెప్పచ్చు, అలాగే నేటి డిజిటలైజేషన్ కి ఇదే మూలం అంటే కూడా నమ్మకం కలగకపోవచ్చు. మాటల్ని గణాలుగా విభజించడం పద్యంగా చేయడం పెద్ద కష్టం కాదు. కాని అందమైన, అర్ధవంతమైన, కాలానికి నిలిచే పద్యం రాయడమే కష్టం.

ఈ సారి తెనుగు మాటలతో పద్యం రాయండి.  
 ప్రేరణ:విన్నకోటవారు. ధన్యవాదాలు.