Thursday, 21 August 2025

ఎవరు వృద్ధులు?

 

నేడు వృద్ధుల దినోత్సవం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?

చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 


దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే వాయసరాజు ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి వాయసరాజు ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 


1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడాదు.

2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.

3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.

4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.

5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.

6.వాయసరాజు  బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా వాయస రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.

7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.


వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.


జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 


ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  

అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.

కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

పెళ్ళి భోజనాలు - వడియాలు

 పెళ్ళి భోజనాలు - వడియాలు


పెళ్ళిలో భోజనాలంటే ఒక యజ్ఞం లా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదు రోజుల పెళ్ళిలో చెప్పేదే ముంది, పూట పూటా సంబరమే. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువా లో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగు పక్కల వేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరి వేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకు గాని, తాటాకు చాపలు గాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు.  అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది. పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా, ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండి వంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్య కూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవింద నామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభ మయ్యేది, తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచ కట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించే వారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. వడ్డన సామానుల పేర్లే మరిచి పోతున్నారు ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడే పాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి, పప్పండి, పప్పండి అని వడిగా అంటు కదిలే వాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి, నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబ గబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడి అన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్న మండి తో ప్రారంభించి, మీ కన్న మండి, మీ కన్న మండి, మీ కన్న మండి అంటూ సాగిపోయేవారు. మీకు + అన్న మండి = మీ కన్న మండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆట పట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు, ఒరేయ్ సుబ్బన్నా, ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాత గారికి పడుచు పెళ్ళాం కావాలంటు న్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చిన తరవాత ఇదేమిటి ఇవి తెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలు కావలన్నారని అనేవాడు, యువకుడు. అప్పుడు తాతగారు ఒర్నీ, వడియాలంటె పడుచు పెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలు కావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా, అనే వారు కాని వద్దనేవారు కాదు. అది ఒక సరదా. వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. ఇప్పుడు అర్ధమైనదనుకుంటాను, అప్పడాలు (అప్పటి+ ఆలు = అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా (వడి + ఆలు = వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచి నీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసు ల్లో మంచి నీళ్ళు పోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చిన వారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయింది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా. భోజనాల దగ్గర నుంచి అంతా ఒక సారి లేచే వారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారి కోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యే దాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాల లో కూడా ఇలా సరదా చూపే వారు. అలా సందడి సందడి గా భోజనాలు  ముగిసేవి. ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని, వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి, ఎక్కడో ఒకచోట  కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం. మాధాకవళం బ్రతుకులై పోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను. అందం, హాస్యం చచ్చిపోయాయి.

Courtesy: whats app 🤣

******

పదునాలుగేళ్ళ తరవాత నేను వ్రాసినది what's app లో తిరిగి నాకే వచ్చింది, 30.11.2011 నాటిది

శర్మ కాలక్షేపం కబుర్లు-పెళ్ళిభోజనాలు-వడియాలు 

Wednesday, 20 August 2025

మనసున మనసై.....

 మనసున మనసై.....


మనసున మనసై బతుకున బతుకై

తోడొకరుందిన అదే భాగ్యము అదే స్వర్గము

సినీకవి మాట నూటికి నూరుపాళ్లు నిజం.


మనసున మనసై  దగ్గరగా అరవై ఏళ్ళు కలిసి బతికి, ఏడేళ్ల క్రితం ఇహలోక యాత్ర చాలించిన ఇల్లాలు జ్ఞాపకాలు మిగిల్చి దివి కేవినది, ఈ రోజు. నాటి నుంచి మనసు లేని రాయిలా బతికేస్తున్నాను,ఎందుకో తెలీదు. 


ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు

ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు


ఊరు,విడచి వాడ విడచి ఎంతదూరమేగినా

ఐనవారు అంతరాన ఉందురోయ్!


Tuesday, 19 August 2025

ఎర్ర డబ్బా


 ఎర్రడబ్బ మళ్ళీ నెల 1 నుంచి కనుమరుగవుతోందని వాట్స్ అప్ మిత్రులంతా బాధపడుతున్నారు. ఉపయోగంలో లేనిది ఏదైనా నశిస్తుందని అందరికీ తెలిసిందే. మనమే పేపర్ లెస్,పేపర్ లెస్ అని వాడడం మానేశాం,ఎర్రడబ్బ చరిత్రలో కలిసిపోతుంది.

వార్తలు తరచయ్యాయి మనసులు దూరమయ్యాయి,మనుషులు దూరమైపోయారు.మన చరిత్ర మనం రాసుకోం,అదే మనలవాటు.ఎర్రడబ్బ తో అనుబంధం తల్లి పేగులాటిది.అది తెగింది,మిగిలింది చరిత్ర.

Monday, 18 August 2025

అల్లి పళ్ళు

 అల్లి పళ్ళు


అల్లి పళ్ళు

ఈ పళ్ళు కుంకుడు గింజంత ఉంటాయి,నల్లగా ఉంటాయి,దూరం నుంచి చూస్తే నేరేడు పళ్ళలా ఉంటాయి. కొంచం తీపి,వగరు కలిగి ఉండి అటవీ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి,సంవత్సరానికి ఒకసారే వస్తాయి. వీటిని పల్లెవాసులు ఇష్టంగానే తింటారు. నల్లటి పండు ఏదైనా మంచిదే, ఇది ఇనపగని, నేరేడు పండు లాగే. ఇది తింటే నోరు నేరేడు పండు తిన్నట్టు ఐపోతుంది.  డయాబెటిస్ వారికి మంచిదే,తినవలసినదే! ఇలాటి పిచ్చితిళ్ళు తినం కావాలంటే ఒక బిళ్ళ మింగుతాం అనేవారికి వందనం. 

Sunday, 17 August 2025

వీధి కుక్కల సమస్య-ఒక పరిష్కారం.

 వీధి కుక్కల సమస్య-ఒక పరిష్కారం.


మానవులు పశువులతో సహజీవనం చేయడం ఈ వేళ కొత్తమాటేం కాదు, వాటిని ప్రేమగా  సాకడం కూడా కొత్తమాట కాదు.


నాకు తోచిన మటుకు సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. కుక్కలు,డేగలు,పావురాలు,కోతులు ఇలా అన్ని జంతువులూ దేశరక్షణలో పని చేస్తాయంటే నమ్మలేరు. హక్కుల సంఘాలవారు సమస్య ప్రభుత్వం  మెడకి వెయ్యాలనే తాపత్రయం తప్పించి దానిని పరిష్కరి0చాలని అనుకోవు, కారణాలనేకం. పెటా లాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.  


దేశీ గాడిదలకి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. మనగాడిదలు జపాన్ గాడిదల తరవాత లెక్కలో కొస్తాయి. పాకిస్తాన్ గాడిదలు కూడా మన దేశగాడిదలతో పోటీ పడతాయి. గాడిదలు పెంచి ఎగుమతి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.


కుక్కలు దేశరక్షణలో పాలు పంచుకుంటాయన్నది జగమెరిగిన సత్యం. విదేశీ కుక్కలే కాదు, మన కుక్కలు కూడా ఇందుకు తీసిపోవు. ఐతే వాటికి శిక్షణ  ఇచ్చి తీర్చి దిద్దాలి. రక్షణ రంగం ఈ పని కొంత చేస్తుంది, కాని ప్రైవేట్ రంగం దీని పైన శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ప్రభుత్వం వీటి గురించి శిక్షణ సంస్థలు నెలకొల్పితే జరిగేదేంటో తెలియనిదేంకాదు. నిజమైన జంతు ప్రేమ ఉన్న సంస్థలకి ప్రోత్సాహం ఇచ్చి ఇలా కుక్కలను వినియోగించుకోవచ్చు. 


గద్దలు,డేగలు ఇప్పటికే రక్షణ రంగంలో ఉన్నాయి. అంతే కాదు విమానాశ్రయాలలో పక్షుల బెడద లేకుండా చేయడానికి డేగలు,గద్దలని ఉపయోగిస్తున్నారు. పావురాలు రక్షణ రంగంలో పని చేయడం నేడు కొత్త విషయమూ కాదు. నాకు తెలిసి కోతులను కూడా రక్షణ రంగంలో వినియోగించచ్చు అనుకుంటాను. ఇలా దేశీయ వనరులను వినియోగించుకున్నపుడే మనం సమస్యలని అధిగమించగలం.  పెటా లాటి సంస్థలని దేశం నుంచి తరిమెయ్యచ్చు. హక్కుల సంఘాల వారు పాపం నిరుద్యోగులైపోతారు. పేరెన్నికగన్న లాయర్ల నోటి దగ్గర కూడు పడిపోతుంది 🤣 

Saturday, 16 August 2025

వీధి కుక్కలు

 వీధి కుక్కలు

సుప్రీం కోర్టు ఒక్కసారి ఉలిక్కిపడి,వీధి కుక్కల్ని సురక్షిత స్థానాలకు తరలించి,ప్రజల్ని కాపాడమని ఢిల్లీ అధికారులను ఆదేశించింది. దీనిని అమలు చేసేటపుడు ఎవరైనా అడ్డుపడితే అది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పింది. ఏం జరగబోతోంది, చూడాలి.

కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కులేదా? ఇలా కుక్కల్ని జైళ్ళలో వేసి చంపేస్తారా అని కుక్కల హక్కుల సంఘాలవారు సుప్రీం కోర్ట్ మీద దండయాత్ర చేసినంత పని చేసారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి కలగజేసుకుని కుక్కల హక్కులు మిగతా విషయాల గురించి విచారించడానికి ముగ్గురు న్యాయ మూర్తుల బెంచీని ఏర్పాటు చేసారు. హక్కుల సంఘాలవారికి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకోడానికి డబ్బులెక్కడినుంచి వస్తాయో తెలీదు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు తేలుస్తారో మొత్తం ఫుల్ కోర్ట్ సమావేశం కోరతారో వేచి చూడాలి. ఫుల్ కోర్ట్ సమావేశం జరిగినా ఆశ్చర్య పడక్కరలేదు. వేచి చూదాం! కుక్క కరిస్తే ఒకడేకదా చచ్చేది దీనికింత రాద్ధాంతం అవసరమా అనే వారే కనపడుతున్నారు.   


మానవులకేనా భూమి మీద బతికే సావకాశం? కుక్కలకి ఇతర జంతువులకీ సమానంగా బతికే హక్కు లేదా? కొన్ని జంతువులు అడవుల్లోనే ఎందుకుండాలి? అవీ మనతో పాటు ఉండచ్చుగా! హక్కుల సంఘాలవారు పెంచూకోనూ వచ్చు. పులలను సింహాలను  అరబ్ దేశాలలో పెంచుకోడం లేదూ? మానవులదేముంది లెండి,ఈ వేళ ఉంటారు,రేపు పోతారు. మా జంతు రాజ్యం పరిపాలనకోస్తే ఎట్టుంటదో తెలుసా! అంతా సమానం ఎవరికి కావలసినది వారు వేటాడుకుని నచ్చినదాన్ని తినెయ్యచ్చు. జంతు రాజ్యం జిందాబాద్!     

Friday, 15 August 2025

నాకూ సొతంత్రం వచ్చింది.

 నాకూ సొతంత్రం వచ్చింది.

***

నాకూ సొతంత్రం వచ్చింది.


🤣🤣🤣🤣🤣


ఎందుకంత పడి,పడి నవ్వుతావు?


నీకు సొతంత్రమొచ్చిందా? ఎలా బాబూ!

నా చెయ్యి,నా కాలు,నా నోరు,నా చెవి, నా ముక్కు అంటున్నావుకదా! ఇవే కర్మేంద్రియాలూ,జ్ఞానేంద్రియాలూ కదూ!


అవును అనుమానమేంటీ?  


నిజం కదూ! 🤣🤣🤣


అదేమిమాటా?


నీవి అనుకుంటున్నవన్నీ నీ అధీనంలో లేవు. నీ మనసు అధీనంలో ఉన్నాయి. అవునుకదా! 

 నీ మనసు నీ అధీనంలో లేదు. నువ్వు నీ మనసు అధీనంలో ఉన్నావు.  నీకు సొతంత్ర ఎక్కడా? మనసు సంకెళ్ళనుంచి బయటపడు,అప్పుడూ నీకు సొతంత్రమొచ్చినట్టు.  

మనసు బానిసత్వం నుంచి సొతంత్రం పొందు. 

*****

మనసు బానిసత్వం నుంచి బయటపడిన వారందరికి సొతంత్ర దిన శుభకామనలు.    

Wednesday, 30 July 2025

లా వొక్కింతయు/ లావొక్కింతయు



లా వొక్కింతయు/ లావొక్కింతయు


 లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్ 

ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే దప్ప యితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!


”లా” వొక్కింతయు లేదు’  అని వాపోయారు పోతన నాటి కాలంలోనే! ఆయన రాసిన భాగవతాన్ని అంకితమివ్వలేదని రాజు దండించబూనడం వగైరా చెబుతారు, ఆ తరవాత ఇమ్మనుజేశ్వరాధముల...కంటూ భాగవతంలోనే రాసెయ్యడంతో మన దాకా వచ్చేసింది. 

మరి నేటి కాలానికొస్తే లా లేదోయ్ మా దేశంలో అని ఎలుగెత్తి చాటుతున్నారో పక్క, మరో పక్క సుప్రీం కోర్ట్ అర్ధరాత్రి తలుపులుదీసి మరీ న్యాయం చెబుతోంది. అంతే కాదు సమయం దాటిన తరవాత కూడా బెంచీలు అప్పటికప్పుడు కూర్చి, కుదరకపోతే మార్చి న్యాయం చెప్పేస్తున్నారు.నేనే చంపేను,ఇదీ కారణం,ఇదిగో వీడియో అని చెప్పి సోషల్ మీడియాలో వీడియో పెట్టినవారిని తగు సాక్షాలు చూపడంలో పోలీస్ విఫలం, అంజెప్పి కేసులు కొట్టేసెతే, పీక తీసినవాడు జల్సాగా బోరవిరుచుకు తిరుగుతున్నాడు, న్యాయం, ఉన్నట్టా? లేనట్టా? న్యాయం ఉన్నట్టా? లేనట్టా? మాన్యులకేగాని సామాన్యులకు కాదనేవారూ ఉన్నారు. ఏమో ఇది విష్ణుమాయా?

దీనికేంగాని ఎంతజెప్పుకున్నా తరిగేదీ కాదు... పోతనగారి లావొక్కింతయు లేదు దగ్గరకుపోదాం.
లావొక్కింతయు లేదు అని వాపోయినవాడు గజేంద్రుడు, ఎక్కడా? మడుగులో! ఎప్పుడూ? మొసలి పట్టినపుడు, పోరాడి,పోరాడి ఇక లాభం లేదనుకుని సంపూర్ణ శరణాగతి చేసిన సమయంలో . అసలీ మొసలేంటి మడుగేంటి అనుమానం రాలేదేం!!! మనమే ఈ గజేంద్రుడు, మడుగే ఈ సంసారం, మొసలే కోరికలు. 

గజేంద్రుడు కరిణీ సంఘంతో బయలుదేరేడు. కొంతదూరంపోయేటప్పటికి ఒక మడుగు కనపడింది, అది చాలా ఆకర్షణీయంగా ఉంది. దాంతో జలకాలాటలకి దిగేడు పత్నులతో ఇంకేంటి మడుగు కలచేసి దున్నేసేరు, అంతా కలిసి. ఇప్పుడు అందులో ఉన్న మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంది, దాంతో పోరాటం మొదలెట్టేడు. కరిణీ సంఘం గట్టెక్కేసి చూస్తూ నిలబడింది. గజేంద్రుడు పోరాడి పోరాడి అలసిపోయి, తన బలం పూర్తిగా నశించిందని గుర్తించి, ఇది దైవ కృపతో జరిగేదని తలచి,లావొక్కింతయు లేదు అన్నాడు .... 

ఈ గజేంద్రుడు మనమే! అమ్మా బాబూ, కడుపు కట్టుకుని చదివిస్తే చదివేసుకున్నాం! ఆ తరవాత జేరబడింది సిరితల్లి,ఇల్లాలు. ఇంకేం కోరికలు మొలుచుకొచ్చేయి. కోరికలు తీర్చడానికి పడ్డ పుర్రాకులకి కొదవే లేదు. సంపాదనే ధ్యేయంగా సాగిపోయింది, ఇక మనకి ఎదురు లేదు అనుకుని కాలం గడుపుతున్న కాలంలో మొసలిలాటి బలవత్తరమైన కోరికేదో పట్టింది,దానికోసం ప్రయత్నంలో పోరాటం తప్పలేదు. కాలం చెల్లిందిగాని కోరిక తీరలేదు,మొసలి వదల లేదు.వయసూ మీద పడింది.  కాని ఒంట్లో రోగం మాత్రం ప్రవేసించింది. అది పెరిగి పెద్దదయింది. కదలలేని రోజొస్తే ఆసుపత్రిలో పారేసేరు. ఐ.సి.యు బయట ఇల్లాలు,కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు అల్లుళ్ళు ఎదురు చూస్తున్నారు, డాక్టర్ చెప్పే కబురు కోసం.  ఎవరి గోల వారిదే! డాక్టరు ఇంకా వీళ్ళ దగ్గర ఎంత గుంజచ్చు అంచనా వేస్తున్నాడు. పెళ్ళాం ఏదో సంపాదించాడు,విల్లు రాసేనన్నాడు ,నాకూ చెప్పలేదు. ఏమి రాసేడో! నాకేమైనా ఇచ్చాడా ? ఇక కొడుకులు ఇక్కడ కొంప,గోడు అంటాడు, అమ్మేసి వచ్చెయ్యంటే వినడు. విల్లులో ఏం రాసేడో!!! ఇక కూతుళ్ళు అల్లుళ్ళు, మనకి ఎందుకీ జాగరం? విల్లులో ఏంరాసేడో! కొడుకులకే ఇచ్చుకుని ఉంటాడు, మీకేం ఉండదు, అని అల్లుళ్ళ సతాయింపు కూతుళ్ళని సన్నగా! ఇలా బయట గుంపుచింపులు పడుతుండగా లోపల బెడ్ మీద మానవునికి గడచిన జీవితం రీలు తిరిగి, అయ్యో! ఈ పెళ్ళము పిల్లల కోసమా నేను ఇన్ని నాళ్ళూ తిప్పలు పడినది? నా ఆరోగ్యం కూడా చెడగొట్టుకుని సంపాదించినది? గజేంద్రుడి భార్యలు గట్టెక్కి చూస్తూ నిలబడినట్టు, నేడూ నావాళ్ళన్నవాళ్ళంతా బయట నా చావుకోసం ఎదురు చూస్తున్నారు. పరమాత్మా జీవితంలో తప్పు చేసాను, ఇక వ్యాధులతో పోరాడ లేను, త్వరగా తీసుకుపో అని ప్రార్ధిస్తున్నాడు.
అదే
లా ఒక్కింతయు లేదు..... 

Tuesday, 29 July 2025

భయం

భయం


 *ఇది హాస్యం కాదు…🙏*

*దయచేసి చదవండి, మీకు నచ్చితే ఇతరులతో కూడా పంచుకోండి!*


### *!!! అల్ట్రా-మాడరన్ మెడికల్ సైన్స్ !!!*


*డా. అనన్యా సర్కార్ రచన*


మీకు రెండు లేదా మూడు రోజుల పాటు జ్వరం వచ్చింది. మందులు తీసుకోకపోయినా, మీ శరీరం కొన్ని రోజుల్లోనే స్వయంగా  కోలుకుంటుంది..

కానీ మీరు డాక్టర్‌ను సంప్రదించారు.

డాక్టర్ మొదటినుంచే పలు టెస్టులు రాసేశారు.


పరీక్షల్లో జ్వరానికి స్పష్టమైన కారణం కనపడలేదు.

కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవల్స్ పెరిగినట్టు చూపించాయి — ఇవి చాలా మందిలో సాధారణంగా ఉండే విషయాలే.


జ్వరం తగ్గిపోయింది.

కానీ ఇప్పుడు మీరు కేవలం జ్వరంతో ఉన్న వ్యక్తి కాదు.

డాక్టర్ మీకు చెప్పారు:


> "మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. షుగర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మీరు ప్రీ-డయబెటిక్. మీరు కొలెస్ట్రాల్ మరియు షుగర్ కంట్రోల్ చేసే మందులు వాడటం మొదలుపెట్టాలి."


దీనితో పాటు అనేక ఆహార నియమాలు విధించబడ్డాయి.

మీరు ఆహార నియమాలను కచ్చితంగా పాటించకపోయినా — మందులు తీసుకోవడం మాత్రం మరిచిపోలేదు.


మూడు నెలలు గడిచాయి. టెస్టులు మళ్లీ జరిగాయి.

కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గింది.

కానీ ఇప్పుడు మీ *బీపీ* కొంచెం పెరిగిపోయింది.

ఇంకో మందు వచ్చేసింది.

ఇప్పుడు మీరు *మూడు మందులు* వాడుతున్నారు.


ఇవన్నీ విని మీకు *ఆందోళన* పెరిగింది.


> “ఇంకా ఏమి జరుగుతుంది?”

> ఈ టెన్షన్ వల్ల మీరు *నిద్రలేమి*తో బాధపడడం మొదలుపెట్టారు.

> డాక్టర్ *నిద్ర మాత్రలు* రాసేశారు — ఇప్పుడు మందుల సంఖ్య *నాలుకైంది*.


ఈ మందుల వలన మీకు *అమ్లత (acidity)* మరియు *జ్వాల (heartburn)* మొదలయ్యాయి.

డాక్టర్ చెప్పారు:


> “ఆహారానికి ముందు ఖాళీ కడుపుతో గ్యాస్ టాబ్లెట్ తీసుకోండి.”

> ఇప్పుడు మీ మందుల సంఖ్య *ఐదు*.


ఆరు నెలల తర్వాత ఒకరోజు మీకు *ఛాతీలో నొప్పి* వచ్చి ఎమర్జెన్సీకి వెళ్లారు.

పూర్తి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:


> “మీరు సమయానికి వచ్చారు, లేకపోతే పరిస్థితి తీవ్రమయ్యేది.”


మరిన్ని టెస్టులు అవసరమయ్యాయి.

వెరిఫై చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:


> “ప్రస్తుతం ఉన్న మందులు కొనసాగించండి. కానీ గుండె కోసం ఇంకో రెండు మందులు వేసుకోవాలి. అలాగే ఎండోక్రినాలజిస్ట్‌ను కలవండి.”

> ఇప్పుడు మీరు *ఏడు మందులు* వాడుతున్నారు.


కార్డియాలజిస్ట్ సలహాతో, మీరు ఎండోక్రినాలజిస్ట్‌ను కలిశారు.

ఆయన ఇంకో *షుగర్ మందు* మరియు *థైరాయిడ్ టాబ్లెట్* చేర్చారు — ఎందుకంటే థైరాయిడ్ లెవల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.


ఇప్పుడు మొత్తం *తొమ్మిది మందులు*.


ఇలా మీరు నెమ్మదిగా మీరు అనారోగ్యంతో ఉన్నవారని నమ్మడం ప్రారంభించారు:


* గుండె రోగి

* డయాబెటిక్

* నిద్రలేమి బాధితుడు

* గ్యాస్ సమస్యలు

* థైరాయిడ్

* కిడ్నీ సమస్యలు

  ... ఇంకా చాలానే


ఎవ్వరూ మీకు చెప్పలేదు — మీరు మెరుగైన *మనోబలం, ఆత్మవిశ్వాసం మరియు జీవనశైలితో* ఆరోగ్యంగా ఉండవచ్చని.

అదే బదులుగా, మీకు పదే పదే చెప్పబడింది — మీరు తీవ్రమైన రోగి, బలహీనుడు, విఫలమైన వ్యక్తి అని.


ఆరు నెలల తర్వాత ఈ మందుల దుష్ఫలితాల వలన మీకు *మూత్ర సంబంధిత సమస్యలు* మొదలయ్యాయి.

అదనంగా టెస్టులు చేశారు — *కిడ్నీ సమస్యలు* ఉన్నట్టు అనుమానం వ్యక్తమైంది.


డాక్టర్ మరిన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పారు:


> “క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరిగాయి. కానీ ఆందోళన అవసరం లేదు — మీరు మందులు క్రమంగా తీసుకుంటే సరిపోతుంది.”

> ఇప్పుడు ఇంకో *రెండు మందులు* చేర్చారు.


ఇప్పుడు మీరు *పదకొండు మందులు* తీసుకుంటున్నారు.


మీరు ఇప్పుడు ఆహారంకంటే *ఎక్కువ మందులు* తీసుకుంటున్నారు, మరియు ఆ మందుల దుష్ప్రభావాల వలన మీరు *మెల్లగా మరణం వైపు* నడుస్తున్నారు.


ప్రారంభంలో, మీరు జ్వరంతో డాక్టర్‌ను కలిసినప్పుడు, ఆయన ఇలా చెప్పి ఉంటే ఎలా ఉండేది?


> "ఎటువంటి భయం అవసరం లేదు. ఇది తేలికపాటి జ్వరమే. మందుల అవసరం లేదు. విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా నీళ్లు తాగండి, తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి, ఉదయం వాకింగ్‌కి వెళ్లండి — అంతే. మందులేమీ అవసరం లేదు."


*కానీ అలా అయితే… డాక్టర్లకు మరియు ఫార్మా కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది?*


---


### ముఖ్యమైన ప్రశ్న:


*డాక్టర్లు హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు అని ఎలా నిర్ణయిస్తారు?*

*ఈ ప్రమాణాలను ఎవరు నిర్ణయిస్తారు?*


ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం:


* *1979లో, డయాబెటిస్ గా పరిగణించే బ్లడ్ షుగర్ లెవల్ **200 mg/dl*.

  అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం *3.5%* మాత్రమే టైప్-2 డయాబెటిక్‌గా గుర్తించబడ్డారు.


* *1997లో, ఇన్సులిన్ తయారీ సంస్థల ఒత్తిడితో, ఈ పరిమితి **126 mg/dl*కి తగ్గించబడింది.

  దీంతో డయాబెటిక్ జనాభా \\*3.5% నుండి 8%\\కి పెరిగింది — అంటే **4.5% మంది అసలైన లక్షణాలు లేకుండానే రోగులుగా మారిపోయారు*.

  *1999లో*, WHO దీనిని అధికారికంగా ఆమోదించింది.


ఇన్సులిన్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి. మరిన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి.


* *2003లో, **అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA)* ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్‌ను *100 mg/dl*గా పేర్కొంది — దీన్ని ప్రీ-డయాబెటిక్‌గా తీసుకున్నారు.

  దాంతో *27% జనాభా డయాబెటిక్‌గా మారిపోయారు* — ఎటువంటి అసలు కారణం లేకుండానే.


* ప్రస్తుతం ADA ప్రకారం, *భోజనం తర్వాత బ్లడ్ షుగర్ 140 mg/dl* అయినా డయాబెటిస్ గా పరిగణిస్తున్నారు.

  దీని వల్ల ప్రపంచ జనాభాలో *సుమారు 50% మంది* డయాబెటిక్ లు అయిపోయారు — కానీ వారిలో చాలామంది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారే.


భారత ఫార్మా కంపెనీలు దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి — అంటే *HbA1c 5.5%* అని స్టాండర్డ్ పెట్టాలని చూస్తున్నారు, తద్వారా మరింత మందిని రోగులుగా మలచి మందుల అమ్మకాలు పెంచడం.


చాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం *HbA1c 11% వరకు* కూడా డయాబెటిస్‌గా పరిగణించాల్సిన అవసరం *లేదంటారు*.


---


### మరో ఉదాహరణ:


*2012లో, ఒక పెద్ద ఫార్మా కంపెనీకి *\$3 బిలియన్** జరిమానా వేసింది *US సుప్రీం కోర్టు*.

2007–2012 మధ్యకాలంలో వారి డయాబెటిస్ మందు *గుండెపోటు వచ్చే అవకాశాన్ని 43% పెంచింది* అనే ఆరోపణ.


ఆ కంపెనీ ఇది ముందుగానే *తెలుసుకుని కూడా దాచేసింది* — లాభాల కోసమే.

ఆ సమయంలో వారు *\$300 బిలియన్* లాభం పొందారు.


---


*ఇదే ఈరోజు “అధునాతన వైద్య విధానం”!*


*ఆలోచించండి… ఆలోచించడం మొదలుపెట్టండి…*


---


✅ ఇది తప్పక భద్రపరచదగిన విషయం.

🧏‍♂️🧏‍♀️

*అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి — ఇదే నా మనస్ఫూర్తి కోరిక.


Courtesy:Whatsapp.

భయం మన శరీరంలోకి నరనరానా కొద్దికొద్దిగా ఎక్కించబడింది. మనదైన వైద్యాన్ని పోగొట్టుకున్నాం, చేతులారా నాశనం చేసుకున్నాం!  

Monday, 21 July 2025

జిలేబి-సమోసా

Courtesy:Whats app

 ఈ రోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ట.
*****

జిలేబి-సమోసా

జిలేబి-సమోసా గురించి ఏ ప్రభుత్వానికి కోపమొచ్చిందో. మనకా రెండు తెనుగు ప్రభుత్వాలున్నాయి, ఒకటి జాతీయ ప్రభుత్వం. ఈ హెచ్చరిక ఎవరిదబ్బా!
 ఈ హెచ్చరిక ఎవరు చేసినా తిట్టచ్చు,మనకి ( మంకీ అనచ్చునంట)  వాక్కు,స్వాతంత్ర్యం ఉన్నాయి గనక. పొరబాటుగా కూడా ట్రంప్ గురించిగాని, అమెరికా ప్రభుత్వం గురించిగాని మాటాడేరా!  మీ వీసా కట్టు,వీసా ఇస్తే కూడా గుడ్ బిహేవియర్ టాక్స్ కట్టాలట అదెంత? 250 డాలర్లు,మీరు అమెరికాలో అడుగెట్ట లేరు. అమెరికాలో అడుగెట్టక తప్పదుగదా మీకు, నోరు కుట్టేసుకోండి. మోడీ ని తిడితే కావలసినంత పబ్లిసిటీ,యోగీని తిట్టినా అంతే. ఇక మా రాహుల్ బాబాని తిట్టుకుంటారా! మీదే కర్మ. మరి తెనుగు రాజుల్ని తిట్టుకుంటారా? మీ చిత్తం అభిమానులు కర్రుచ్చుకుంటే నా బాధ్యత లేదు. ఔరా జిలేబీ! ఎంతకి తగుదువు, ఎక్కడ జూసినా తగువులే .🤣 

Saturday, 19 July 2025

పేకాట పేకాటే పెద్దన్నయ్య....

 పేకాట పేకాటే పెద్దన్నయ్య....

పేకాట పేకాటే, పెద్దన్నయ్య పెద్దన్నాయే. ఈ నానుడిని తెనుగునాట విరివిగానే చెబుతారు.దీన్నే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనీ చెబుతారు. పేకాటలో కూచున్నాకా ఓడిపోతే ఓకులు లెక్కపెట్టి డబ్బులివ్వను, నేను అన్ననురా/తమ్ముణ్ణి అనడానికి లేదు. ఇచ్చి తీరవలసిందే. అదేదో పేకాటలో కూచునే ముందే తేల్చుకోవాలి. దీన్నే మరో ముతక సామెతగా చెబుతారు మా పల్లెటూరివాళ్ళు 'మంచం ఎక్కేదాకానే వరస, మంచం ఎక్కేకా వరసేంటి?' అంచేత పేకాటకి బంధుత్వానికి లింక్ పెట్టద్దు.


 ఇదీ భారతం నుంచి వచ్చిందే! జూదానికి పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళి జూదం లో కూచున్నాకా అన్నీ ఓడిపోయాడు. జరగవలసినవన్నీ జరిగిపోయాకా, గుడ్డి రాజుగారు ఇదంతా తూచ్! అనేసి వరాలిచ్చేసి పంపించేసేడు. మళ్ళీ జూదంలోనూ ఓడిపోయిన పాండవులు అడవులకు పోయారు. రాజ్య భాగం గురించిన మాట షరతుల్లో లేదు. వనవాసం తరవాత రాజ్య భాగమడిగితే సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు,దుర్యోధనుడు. 'రాజ్యం వీర భోజ్యం' కనక యుద్ధం జరిగింది. గెలిచినవాళ్ళు రాజ్యం చేసుకున్నారు. ఇదిప్పటికిన్నీ జరుగుతున్నదే!  

నేటికాలానికి ఈ నానుడిని వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే అని చెబుతుంటారు. రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళకి పన్నులు పెంచేస్తామని అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతున్నాయి. ఇదేంటి మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు,మమ్మలిని వద్దనడం,కాదని చేసిన వాళ్ళకి పన్నులు పెంచుతాం. ఇదేం వ్యాపారం? ఇది వ్యాపారం కాదు, వ్యవహారానికి లింకు. రష్యాని యూక్రెయిన్ తో యుద్ధం మానుకోమని చెప్పండి మేమూ చెబుతాం. కాదు మేము రష్యాతో వ్యాపారం చేసినవాళ్ళకి పన్నులు పెంచుతామని బెదిరించి రుబాబులు చేసి రోజులు గడుపుకునే కాలం చెల్లింది. రుబాబులు చెయ్యకండి వ్యాపారం వ్యాపారం లా చేయండి,వ్యవహారం వ్యవహారం లా చేయండి, రెండిటిని కలిపి ఆధిపత్యం వెలగబెట్టె రోజులు చెల్లేయని గుర్తించండని  భారత్ యూరోపియన్ యూనియన్ కి తెగేసి చెప్పింది. వార్నీ!  మన పేకాట సామెత అంతర్జ్యాతీయంగా వెలిగిపోతోంది.    

Wednesday, 9 July 2025

*విశ్వనాథ వారి వ్యక్తిత్వం గురించి వారి శిష్యులు పేరాల భరత శర్మ గారు చెప్పిన కొన్ని విశేషాలు*


----------------------/--------------------


ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లో పోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తే గాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా! అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా ! ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడ నుండి ఊడి పడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ!? నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే! కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు! ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది! అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి, యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం.. కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది! లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడి నంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో, కష్టమేమిటో తెలిసినంత...సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలా మంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె." ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా! 


‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి

…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను

నేలుకొనిన నా పట్టమహిషి’’


‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా

లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’

అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.


(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది!)🙏🙏

=====================

Courtesy:Whats app.

Sharing courtesy:Narasimha Rao. Vinnakota.

Monday, 7 July 2025

శవాలంకారం.

 శవాలంకారం.

ఊపిరున్నంత కాలంలోనే వ్యక్తులను పేరుతో పిలుస్తారు ఆపై శవం అనే అంటారు. ముద్దుగా నేటి కాలంలో పార్ధివ శరీరం అంటున్నారు. పార్ధివ శరీరం అంటే శవమనే అర్ధం కదా! మరి ఈ శవానికి అలంకారం చేస్తారు. బతికుండగా అలంకారం చేస్తే ఆ శరీరంలో ఉన్నవారు ఆనందించనైనా ఆనందించేవారు. చనిపోయి శవమైన తరవాత అలంకారం ఏమి ప్రయోజనం? నిష్ప్రయోజనమని తెలిసీ అలంకారం చేయడమే చిత్రం. మానవులు బహు చిత్రాతి చిత్రమైనవారు సుమా!  

Friday, 4 July 2025

1920 లో ప్రభుత్వ తెనుగు ఉత్తరువు

 1920 లో ప్రభుత్వ తెనుగు ఉత్తరువు


1920 లో నా దత్తత తండ్రిగాని జనాభా లెక్కల న్యూమరేటర్ గా తెనుగు ఉత్తరువు

Thursday, 3 July 2025

మగాడు

 మగాడు

తాతా! ఒంటరిగా అడవిలోకి పోతున్నా అందో మనవరాలు ఓ రోజు పొద్దుటే ఛాట్ లో.

ఏమైందబ్బా అని సోచాయించి,బంగారం ఒంటరిగా అడవిలోకి పోకు(జనారణ్యం లోకైనా) పెద్దపులులెత్తుకుపోతాయి. బంగారాన్ని పులెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోనా! ఓ పని చెయ్యి. ఎక్కడిదక్కడ వదిలేసి నా దగ్గరకొచ్చెయ్యి. నీకు కోపమనిపిస్తేతిట్టు,నాకు వినపడదుగా బాధలేదు(పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటా) కొట్టాలనిపిస్తే కొట్టు పంచ్ బేగ్ లా,అనేసాను.   


ఎవరి మీద కోపమొచ్చి ఉంటుందబ్బా! అని ఆలోచిస్తే,ముత్యం లాటి మొగుడు,చెప్పినమాట వింటాడు. రత్నంలాటి కొడుకు చదువుకుంటున్నాడు. రేపో,నేడో రెక్కలు కట్టుకుని ఎగిరిపోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక మావ కాపరానికి వెళ్ళకముందే కాటికిపోయాడు. అత్త ఎక్కడో దూరాన ఉంది. తెలుసుకుందామని ఎవరి మీదా కోపం అడిగేసా. 


ఎంజాయ్ చేసే వయసులో పని,పని అని విసుక్కుంది. ఆ! బిజీగానే ఉండు,ఖాళీగా కూచోకు,అంటే జీవితం ఎంజాయ్ చెయ్యకుండా పనులు తగిలించుకున్నదెవరు? నువ్వు కాదా! తగ్గించుకో!! ఎంజాయ్ చెయ్యి, వచ్చెయ్యి,వచ్చెయ్యి అన్నా. వస్తా! మా ఆయనతో చెప్పి, అని కట్ చేసింది.

-------------

కట్ చేస్తే 

పడిపోయాను అని ఏడుస్తూ అమ్మకి చెబితే ఆడపిల్లలా ఏడుపేంట్రా మగాడివికాదూ! అంది.

సూతోవాచా ! 

పరిక్ష పోయింది నాన్నా అంటే నాలుగుతికేడు, ఏడుస్తుంటే, ఎందుకాఏడుపు ఆడదానిలా అని మరో రెండు ఉతికాడు. 

మాస్టారు తిట్టారు,ఆఫీసర్ తిట్టాడు అని కొలీగ్ కి చెప్పుకుంటే ఏడవకు మగాళ్ళం కదూ అనేసాడు.

దేనికి ఏడుపొచ్చినా ఏడవకూడదనీ,అది ఆడవారి స్వామ్యం అనీ, చిన్నప్పటినుంచి  ఎగో పెంచిపోషించేసేరు. పెళ్ళాం తిట్టినా,కొట్టినా ఏడవలేదు. పనెక్కువైనా,ఆరోగ్యం బాగోకపోయినా,కొడుకు కోడలూ వినకపోయినా,మనవలు,మనవరాళ్ళూ తిట్టుకున్నా ఏడవలేడు. మగాడు కదూ! కుటుంబం కోసం గాడిదలా  చాకిరీ చెయ్యడం,ఎద్దులా సంపాదించడమే గాని మనసారా,కరువుతీరా ఏడవనుకూడా ఏడవలేడుగా! అదీ మగాడు.

Wednesday, 2 July 2025

ఆరు నూరైనా

  ఆరు నూరైనా

ఆరు నూరైనా,నూరు ఆరైనా! ఆ సూర్యుడిటు పొడిచినా, ఈ సూర్యుడటు పొడిచినా ...

ఇదొక వ్యవహారికం. 

ఆరేమిటి,నూరేమిటి? అర్ధం కాలేదు. ఆరు రుచులు (షడ్రుచులు), ఇవి ఎప్పటీ నూరు కావు. నూరు రుచులు లేవు. కనక ఇవి కాదు.

 ఆరు గుణాలు (షడ్గుణాలు). అవి కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు. ఇవి వెర్రితలలేస్తే నూరు పైనే కావచ్చు. కాని నూరు ఐన ఆగుణాలు ఆరు మాత్రం కావు,ఎన్నటికిన్నీ! అందుచేత ఇవీ కావు. 

షడంగాలు, ఇవి చాలా రకాలున్నాయి, అందు చేత అవీ కావు.


ఆరు రూపాయలు నూరు రూపాయలూ అవుతాయి,నూరు రూపాయలు ఆరు రూపాయలూ అవుతాయి. నేటి కాలంలో ఇవే చెప్పుకోవాలి. ఆరు నూరెలా అవుతాయి? కష్టపడి పని చేస్తే ఆరు నూరవుతాయి.తిని కూచుంటే నూరు ఆరు కావడం పెద్ద కష్టం కాదు. ఆరు నూరైనా,నూరు ఆరైనా; ఆసూర్యుడిటు పొడిచినా,ఈ సూర్యుడటు పొడిచినా పని కావాల్సిందే! అంటే సవ్యమైన పద్ధతులలోగాని అపసవ్య పద్ధతులలో గాని పని కావలసిందేనని భావం.  

Tuesday, 1 July 2025

ఏది శాశ్వతం?

 ఏది శాశ్వతం?

(రవీంద్రనాథ్ ఠాగూర్  అద్భుతమైన కవిత)



"నేనిక లేనని తెలిశాక  

విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  మిత్రమా! అదంతా నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం ఎలా చూడగలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంపరాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ అప్పుడు కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు 

నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేయలేవా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!


సానుభూతి తెలపడానికి 

నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. 

నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు,

బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను

హాయిగా నీతో మెలుగుతాను!"

------------------------------------------------

- ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*

                   

ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి 

మళ్ళీ కలుస్తాడో లేదో? 

మాట్లాడతాడో లేదో?    

  

ఏది శాశ్వతం?

ఎవరు నిశ్చలం?🌹🌹🙏...శ్రీ 🦋

----------------------------------------------------------

Coutesy:Whats app

విశ్వకవికి శతాధిక వందనాలు.

  జీవిత సత్యం తెలుపుతూ టాగూర్ రాసిన ఇంత అద్భుతమైన కవిత ఉన్నదని నాకు నేటివరకు తెలియదు.

 దీనిని వాట్సాప్ లో పంచుకున్న విన్నకోటవారికి 

 వందనాలు.


కావలసినవారో పైవారో అందరిని పలకరించండి,తడిసిపోయిన నులక మంచంలా బిగుసుకుపోకండి. అంతర్ముఖులు కాకండి.

ఒక వయసొస్తేగాని ఈ కవితలో అందం ఒంటబట్టదేమో 🤣 

Monday, 30 June 2025

తాతముల్లె

 తాతముల్లె

వివరంగా చెప్పనుగాని క్లుప్తంగా చెప్పి ముగించేస్తా!

పాతకాలంలో అదేం లెండి నేటికాలంలో కూడా, ముసలివారికో అలవాటుంటుంది. అది డబ్బులు తలకింద పెట్టుకోడం.ఇంట్లో ఏ అత్యవసరానికి దీనినుంచి తీసి డబ్బులు ఇవ్వరు. ఏం! పోయేటపుడు కూడా పట్టుకుపోతాడా? అని ఈసడిస్తారు కూడా!  ఎందుకు వీరు డబ్బు తలకింద పెట్టుకుంటారు? అదీ కొచ్చను. 🤣 


నాటికి నేటికి ఏనాటికి మారనిది మానవ మనస్తత్వం. ఏంటది? సామాన్యుడైనా మాన్యుడైనా వయసు మీదపడ్డవారికి సొమ్ములు అవసరంలేదు,కర్చులు ఏడుస్తూనో మొత్తుకుంటూనో కొడుకులు కోడళ్ళే పెడతారు. ఈ పెద్దవాళ్ళకి అంతా పరాధీనమేకదా! బయటికెళ్ళి నచ్చినది కొనుక్కోలేరు,తినలేరు. బయటికిపోవాలంటే తోడు కావాలి. సరే ఇక కొనుక్కోడమంటే వీరికి కనపడదు వినపడదు,'కవి' లు కదా! కొట్టువాడికి, మాల్ లోనూ మాటాపలుకూ ఉండదు. మరింక దగ్గర డబ్బెందుకు? అదీన్ని చిల్లరేంకాదు,పెద్దమొత్తంలోనే జమచేసుకుని తలకింద పెట్టుకుంటారు. మనవలు మనవరాళ్ళు దానిలోంచి డబ్బులు కొట్టేయాలని చూస్తుంటారు,కాని ముసలాళ్ళు ఇవ్వరు.తలకింద పెట్టుకుంటారు,పెద్దవాళ్ళుగనక దీనిని తాతముల్లె అంటారు.   మరెందుకీ డబ్బులు? 


చివరికాలం ఎప్పుడొస్తుందో తెలీదు, ఆ సమయంలో అంతా ఆతృతతో ఉంటారు. ఒకసారి ముసలిప్రాణం గుటుక్కుమన్నది మొదలు ,అంతా గొల్లు మంటారు,తప్పదు మరి. ఆ మరు నిమిషమ్నుంచి మొదలవుతాయి కర్చులు. మొదట కావలసినవి పచ్చి వెదుళ్ళు ఇవి ఇంట్లో ఉండవు బయటనుంచి తెప్పించుకోవలసిందే! సరే! ఆ సమయంలో ఎంత కలిగినవారైనా సొమ్ము దగ్గరుండకపోవచ్చు. ఇది అప్పుకి వెళ్ళే సమయమూ కాదు. బంధువులు,మిత్రులు కర్చులు చేయడానికి వెనుకాడరు, కాని  ఆ తరవాత ఇచ్చినా పుచ్చుకోరు. తరవాత  కాలంలో ఇది దెప్పుళ్ళకి సావకాశం. ఇది తరతరాలా ఉండిపోతుంది. 

మీ తాత పోయినపుడు కుండలు,పిడతలు,వెదుళ్ళు తెప్పించడానికే ఇబ్బంది పడిపోయారు,డబ్బులు లేక,  ఆ నాడు మా సుబ్బిగాడు సొమ్ములు కర్చు పెడితేగాని మీ తాత శవం కదల్లేదు,ఇంటినుంచి,తెలుసా!నువ్వేదో గొప్పలు చెప్పకోయ్, లా ఉంటాయి, తరవాతకాలంలో మాటలు. ఇవి చాలా బాధనూ కలిగిస్తాయి. అటువంటి సన్నివేశాలను ముందు తరం వారికి లేకుండ ఉండేందుకే, కనీసం, మొదటి మూడు రోజుల కర్చుకేనా ముల్లె ఉంచేవారనమాట. 

ఇదీ తాతముల్లె కత,సంక్షిప్తంగా       

Sunday, 29 June 2025

అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭

అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭


భార్య : "ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది."


భర్త : "అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు?"


భార్య : "ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే..."


భర్త : "అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."


భార్య : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"


భర్త : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది."


భార్య : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి."


భర్త : "సరే చెప్పు..."


భార్య : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."


భర్త : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"


భార్య : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."


భర్త : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"


భార్య : "మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి."


భర్త : "సరే... బయల్దేరనా?"


భార్య : "అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు..."


భర్త : "ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?"

భార్య : "ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం.."


భర్త : "ఇక చాలా?"


భార్య : "కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి."


భర్త : "హల్వాకు ఇంగువ వేస్తారా?"


భార్య : "అబ్బా.... హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?"


భర్త : "ఇకనైనా వెళ్ళనా?"


భార్య : "ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్..."


భర్త : "సరే.. బయల్దేరుతున్నాను."


భార్య : "అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు."


భర్త : "నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను."


భార్య : "ఎందుకు? మార్కెట్ కు పోరా?"


భర్త : "నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను.."


భార్య : "ఏమిటండీ, మీరే చెప్పారుగా..."


భర్త : ఓసి... నీ అమ్మ కడుపుమాడా బుద్ధి లేక చెప్పానే ..!


అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭

Courtesy:whatsapp

Saturday, 28 June 2025

బలవంతుడ

 బలవంతుడ

బలవంతునికే మిత్రులుంటారు. శత్రువులూ ఉంటారు. కాని బలహీనునికి శత్రువులేగాని మిత్రులుండరు. అలాగని బలవంతుడు


బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి బ్రతుకుట మేలా?

బలవంతమైన సర్పము 

చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!


అంచేత బలమున్నవాడు ప్రతివాడితోనూ శత్రుత్వం తెచ్చుకోకూడదు.

అధికారము,ధనము,అందము,బలము, యవ్వనము,మిత్రులూ శాశ్వతం కాదు


యుతులకు దుర్భలులకు

 మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
 మెవ్వఁడు ప్రాణులకును
 మెవ్వం డట్టి విభుఁడు ల మసురేంద్రా!

అందరి బలమూ పరమాత్మే నీ స్వంతబలమే లేదు సుమా గర్వ పడకని ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునకు చెప్పినమాట, ఇది నిత్య సత్యం.