చాలాకాలంగా నన్ను చూడడానికొచ్చిన అభిమానులగురించి చెప్పలేదు.నా బ్లాగు పుస్తకంలో అభిమానులది పెద్ద ప్రకరణమే! నిజం చెప్పాలంటే, అభిమానులే నన్ను బ్లాగులో ఇంతకాలం నిలబెట్టేరన్నది కాదనలేని సత్యం.ఐదేళ్ళకితం మాట. ఓ రోజో మెయిలొచ్చిందిలా!''నాపేరు చెఱువు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ దగ్గర, ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా! మీ బ్లాగు చూస్తాను. అభిమానిని,విశాఖ పెళ్ళికెళుతున్నా!వచ్చేటపుడు వస్తా!'' అంతకుముందు పరిచయమే లేదు. రమ్మని ఆహ్వానించా!ఎలా వస్తారు? ఎప్పుడొస్తారు. అడిగా! ''నాది గాంధీగారి టిక్కట్టు, ఎప్పుడొస్తానో చెప్పలేను, వచ్చి మిమ్మల్ని చూసి వెళతా!'' అన్నారు. మర్నాడు ఉదయం, ''ఇప్పుడు స్టేషన్లో ఉన్నాను,బండి ఏది దొరికితే అది ఎక్కేసివస్తా''ననంటే బండెక్కేకా చెప్పండి స్టేషన్ కొస్తా అంటే,''రావద్దు నేనే వస్తా! ఎలా రావాలో చెప్పండంటే'' చెప్పక తప్పలేదు. ఎదురుచూస్తూ కూచున్నా! మధ్యాహ్నం పన్నెండున్నర దాటింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చారు.వయసు ఎనభై అన్నారు. భోజనాలు చేసేం,చేస్తూ కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు కూచోండన్నా! ''కూచోను, ఏ బండి దొరికితే అదెక్కేస్తాను. ఏరాత్రి కైనా హైదరాబాదు చేరతానని'' వచ్చినంత వేగంగానూ వెళ్ళేరు. వారిని కలిశాను,అదో ఆనందం! అంతే!!ఆ తరవాత కాలంలో శ్యామలీయం,శ్రీమతి శారద,తమ్ముడు రామంతో "వస్తున్నా "అన్నారు, కాకినాడనుంచి. రమ్మని ఆహ్వానించా!అప్పటికే ఇల్లాలు లేవటం లేదు,మంచాన ఉంది. ఎలా వస్తున్నారు? అడిగా! కార్ ఉంది చేతిలో ఏలారావాలో చెప్పండంటే, చెప్పేను. దురదృష్టం ఆ రోజు ఫ్లై ఓవర్ కట్టేసేరు, అక్కడికొచ్చి ఫోన్ చేసేరు, ఇలా జరిగిందని. అక్కడికెళ్ళి సందుగొందులగుండా ట్రేక్ దాటించి,ఇంటికి చేరేం! ఆ తరవాత అంతంత మాత్రమే అతిథి సత్కారం చేయగలిగేం. దానికేవారు చాలా ఆనందపడ్డారు. నిజానికి ఏమీ చేయలేకపోయేం అన్నది, నిజం.ఆ తర్వాత ఇల్లాలు కాలం చేయడంతో అన్నీ వెనకబట్టేయి. ఎవరిని రమ్మనటమూ లేదు. ఇలా జరుగుతుండగా ఒక రోజు లలితమ్మాయి ''దేశంలో కొచ్చా! వస్తున్నా'' అంది! రమ్మని ఆహ్వానించా! గౌరవం చేయలేనేమోనని భయం, అనుమానం. వచ్చింది,ఇంటి ఆడపడుచుకంటే ఎక్కువగా కలసిపోయిందంటే! అభిమానం ఇలా అని చెప్పలేను. ఇంతకు మించి చెప్పను. బంగారు తల్లికి దిష్టి తగులుతుంది. తను మాకోసం ఎవో ఏవో బహుమతులు తెచ్చింది. మంచినీళ్ళు కూడా తెచ్చుకుంది,పాపం. మా చిన్న సత్కారం పుచ్చుకుంది. వీటన్నిటికంటే నాకు మీ ఆశీర్వచనం కావాలనిపాదాభివందనం చేసి, కూచుంది. చిన్న ఆశీర్వచనం పనస చెప్పి ఆశీర్వదించా! కడుపు నిండింది, మీరు పిలవకపోయినా వచ్చానంది.అవునమ్మా! నిజమే నేనే ఎవరిని పిలవలేకపోతున్నా! ఇల్లాలు కాలం చేయడంతో అన్నా! అభిమానం ఉన్నపుడు పిలుపులు పట్టింపులు ఉండవు, అందుకే పిలవకపోయినా వచ్చాను, ఆశీర్వచనానికే వచ్చానని, సరిపెట్టుకుంది.. మీ అభిమానానికి కడుపు నిండిందని సంబరపడి వెళ్ళింది. నిజానికి తను నన్ను చూడ్డానికి వచ్చి నన్ను సంబరపెట్టింది. నన్ను మళ్ళీ లోకంలో పడేయడానికి తనరాక దోహదం చేసింది.
29, జనవరి 2024, సోమవారం
అభిమానులు
27, జనవరి 2024, శనివారం
దోచుకో! దాచుకో!!
దోచుకో దాచుకో
దోచుకో! దాచుకో!! ఇదే నేటి నినాదమనిపిస్తూ ఉంది. దోచుకుని ఏమి అనుభవిస్తున్నట్లు? పొట్టకి తిండా మూడు పూటలకంటే ఎక్కువ తినలేము. కట్టుకునే గుడ్డా? ఏదైనా మానం కాపాడుకోడానికే! ఉండే ఇల్లా? ఎంతపెద్ద ఇల్లున్నా ఒకమంచంమీదే పడుకోగలం.స్త్రీ/పురుష అనుభవమా? మూడు నిమిషాల ముచ్చట. అంతే! ఇతర వైభవాలా? అర్ధం చేసుకుంటే కొరగానివే. ఇది ఐశ్వర్యంకాదు. రెండు పూటల తింటే ఆకలి వేయడం ఐశ్వర్యం.ఆరోగ్యం ఐశ్వర్యం. కట్టుకున్నవారితో మనసుకలిసుండడం ఐశ్వర్యం. ఎందుకు దోచుకుంటున్నట్లు?
నృసింహ శతకకర్త అన్నారిలా.
సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
సృష్టి మొదలు ఎందరు పుట్టేరు? ఎందరు పోయారు. పోయినవారెవరూ చిటికెడు మన్ను పట్టుకుపోలేదు. నిన్న మొన్నటి ఉదాహరణలు స్టీవ్ జాబ్స్, రాకేష్ ఝున్ ఝున్ వాలా! కదలలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణాలు వదలినవారు. ఆఖరికి తాను అనుకున్న శరీరం కూడా ఇక్కడే వదిలేసిపోతున్నారు. ఎవరూ నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈవేళ చస్తే రేపటికి రెండు. దోచుకోకు!
కడుపాకలికి కక్కుర్తి పడితే అదో అందం. అంతే!!!!
నోరున్నవారూ, బలమున్నవారూ;దోచుకుంటున్నారు,దాచుకుంటున్నారు. ఎవరి వీలున్నంతవారు, వ్యాపారస్థులనుంచి, బలమైన వృత్తి వారలనుంచి,రాజకీయులదాకా! ఎందుకో!!!
ఎంత కళ్ళు మూసుకుందామనుకున్నా చూడక తప్పటం లేదు. బాధపడకా తప్పటం లేదు . ఏమీ చేయలేని అసహాయ స్థితి. ఇదింతే!!!!
25, జనవరి 2024, గురువారం
రహస్యం దాగదు.
రహస్యం దాగదు.
దుష్యంతుడు వేటకి వెళ్ళి, కణ్వుడు లేనప్పుడు కణ్వాశ్రమంలో శకుంతలని చూసి మోహించి, గాంధర్వం అని పెళ్ళి చేసుకుని, ఆమెను తల్లిని చేసి వెళ్ళాడు.నిన్ను తీసుకువెళతానని వాగ్దానమూ చేసాడు. అడగొచ్చిందా? అనుకున్నాడు. శకుంతల కొడుకుని కన్నది. కొడుకు పెద్దవాడవుతున్నాడు, రాజు దగ్గరనుంచి ఎన్నాళ్ళకి కబురులేకపోతే తనే బయలుదేరిందీసారి,కణ్వునికి చెప్పి. రాజసభలో కొడుకుని చూపించి, వీడు మన కొడుకు అని చెప్పింది. దుష్యంతుడు ఎవరినో కుర్రాణ్ణి తీసుకొచ్చి వీడు నీకొడుకు అనడం బాగుందా? అసలు నువ్వెవరు? నాకు తెలియదే అనేసాడు. దానికి శకుంతల చాలా చెబుతూ, ఇలా అంటుంది
విమల యశోనిధీ పురుషవృత్త మెరుంగుచు నుండు జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదా
ర్థము లివి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్ను మ్రుచ్చిలన్.
తెల్లనిదైన యసస్సు కలిగినవాడా! మానవుల చర్యలను చూస్తున్నవారున్నారు సుమా! వారు
ధర్మం-1
యముడు-1
అంతరాత్మ-1
సూర్యుడు,చంద్రుడు-2
పగలు,రాత్రి-2
సంధ్యలు-3
వేదములు-4
పంచభూతాలు-5.
వీరిలో ఎవరో ఒకరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మానవుడు రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఏమీ చేయలేడు. అందుచేత నువ్వు చేసిన పని ఎవరికీ తెలియదనుకోకు. అని చెప్పింది.అబ్బే అలాగా వినలేదు, తరవాత కత చాలానే జరిగి చివరికి ఒప్పుకున్నాడు.
నేటికీ ఈ మహా పదార్ధాలు ఏదో ఒకటి మనం చేసేపని చూస్తూనే ఉంటాయి. నేటికాలం లో మరొకదాన్ని ఈ మహాపదార్ధాలలో చేర్చుకోవలసి వస్తూంది :) అదే గూగుల్. ఎలాగని అడగచ్చు. మీరు ఏం చదువుతున్నారు, ఏ రకపు వార్తలను చూస్తారు, ఏవస్తువులు కొనాలనుకుంటున్నారు, ఏవి మీకిష్టం, ఎక్కడ ఎమి దొరుకుతాయి,వాటిఖరీదులెంత,ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు,అక్కడకి దగ్గరలో చూడవలసినవేంటి? ఏమి తింటారు?
మీ ఆలోచనేంటి? కల్పితమేధస్సుతో మీరెలా ఆలోచిస్తారో కూడా చెప్పేస్తున్న సంఘటనలున్నాయి. మీరెక్కడున్నారు,ఎంతసేపున్నారు, ఏ దిశగా కదిలేరు, ఇలా సర్వం జి.పి.ఎస్ లో దొరుకుతుంది. ఆధునికత పేరుతో బందీలైపోతున్నారు సుమా! బహుపారాక్! ఒక రోజు మీ చర్యలే మీ కాళ్ళకి,చేతులకి బంధాలు కావచ్చు సుమా!
ఇలా మీసర్వస్వమూ గూగుల్ గుప్పెట్లో ఉంది. ఇది మహా పదార్ధం కాదా?
23, జనవరి 2024, మంగళవారం
కల్లు తాగె.
కల్లు తాగె.
స్థల,కాల,పరిమితులు లేనిదేది?
అసలే కోతి,నిప్పులు తొక్కె,
ముల్లు గుచ్చుకునె,కల్లు తాగె,
పిచ్చి పట్టె, ఆపై దయ్యం పట్టె,
ఏమని చెప్పుదు గురువరా!
22, జనవరి 2024, సోమవారం
జననీ జన్మ భూమిశ్చ
జననీ జన్మ భూమిశ్చ
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి
తల్లి,జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి.
రాముడు నేడు జన్మ భూమికి చేరుతున్నాడు.
19, జనవరి 2024, శుక్రవారం
రెటమత శాస్త్రం :
రెటమత శాస్త్రం :
16, జనవరి 2024, మంగళవారం
చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది
చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
ఇదొక నానుడి అమ్మ తరచు చెప్పేది. ఏమిటి ఇలా చెబుతుందనుకునీ వాడిని. నిజమే కదా! అన్నీ వడ్డించిన విస్తరి బరువుకి అణిగి ఉంటుంది, పుల్లాకు(పులివిస్తరి) ఏమీ బరువు లేక ఎగిరెగిరి పడుతుంది. జీవితం లో అనుభవాలతో గాని దీని అర్ధం తెలియలేదు. సంపద కలిగినవాడు సంపాదన ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటాడు,ఎగిరెగిరి పడడు. ఏవిషయానికి ఉద్రేకపడిపోడు. సంపాదన లేనివాడు సంపద లేనివాడే ఎగిరెగిరి పడుతుంటాడు. అలాగే జీవితం లో కష్టసుఖాలు చూసినవాడు ఉద్రేకపడిపోడు, సమస్యను పరిష్కరించుకోడానికే చూస్తాడు. జీవితానుభవం లేనివాడు మరికొన్ని చిక్కులు తెచ్చుకుంటాడు. అలాగే చదువుకున్నా, అణుకువ కలిగి వున్నవాడు, తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు విద్యాభారంతో అణుకువగా ఉంటాడు. నోటికొచ్చినదంతా మాటాడడు. నాకింకా తెలియదు అనుకున్నవాడు వృద్ధిలో కొస్తాడు,ఎగిరి పడడు. మిడిమిడి జ్ఞానం వారు చెప్పక్కరలేదు. మొన్నటి పద్యభాగమే మరోసారి.
చమురున్న పెంకు నిలిచి కాలుతుంది, చమురు లేని పెంకు పెటపెట లాడుతూ ఎగిరెగిరి పడుతుంది , అనేవారు నాటి కాలంలో. ఇదీ ఒక నానుడే!
14, జనవరి 2024, ఆదివారం
మా పల్లెలో సంక్రాంతి
ఎల్లరకు శోభకృత్నామసంవత్సర సంక్రాంతి శుభకామనలు.
మా పల్లెలో సంక్రాంతి
12, జనవరి 2024, శుక్రవారం
10, జనవరి 2024, బుధవారం
చెట్టు మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్నది.
మొదలు పైకి చిగుళ్ళు కిందికి ఉన్న చెట్టు
చెట్టు మొదలు కిందికి చిగుళ్ళు పైకి ఉన్నది,మన కంటి పటలం మీద(రెటీనా)ఆ చెట్టుయొక్క బొమ్మ (image formed on retina is real and inverted ) తలకిందుగా ఉంటుంది. కాని మనకు చెట్టు మొదలుకిందికే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు?
*****
ఊర్ధ్వమూల మధశ్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయం
ఛన్దాంసి యస్య పర్ణాని యన్తం వేద స వేదవిత్
భగవద్గీత.15-1
అధశ్చోర్ధం ప్రసృతా స్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః
అధశ్చ మూలన్యనుసంతతాని కర్మానుబన్ధీని మనుష్యలోకే
భగవద్గీత.15-2
వృక్షశాఖలు ప్రకృతి యొక్క త్రిగుణములచే పోషింపబడి కిందికిని మీదికిని వ్యాపించును. చిగురాకులు ఇంద్రియార్ధములు. ఈ వృక్షమునకు కిందికిపోవు వేళ్ళు కూడా నున్నవి. ఇది లోకముయొక్క సకామ కర్మలచే బద్ధములై యుండును.
8, జనవరి 2024, సోమవారం
ఏదేశంలోనూ ఏకాలంలోనూ అబద్ధం చెప్పనిదేది?
ఏకాలంలోనూ,ఏదేశంలోనూ,అబద్ధం చెప్పనిదేది?
5, జనవరి 2024, శుక్రవారం
కవులు-మసాగత్తు /మశాగత్తు.
కవులు-కదపా-మంద-మసాగత్తు/మశాగత్తు.
కవులుని, కౌలు అని కూడా అంటుంటారు, కవులు శబ్దానికి నానార్ధాలూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది రైతు,భూయజమాని మధ్య ఒడంబడిక గురించి. ఇది రైతు భూయజమానికి రాసిచ్చేది. కవులును ఉయలు అనికూడా కొంతమంది లేకరులు నాటికాలం రాయగా చూసిన అనుభవం ఉంది. ఇక కదపా అన్నది భూయజమాని రైతుకు రాసిచ్చే హామీ. ఈ రెండిటిలో వచ్చే పదాలే మంద,మశాగత్తు/మసాగత్తు. నేను వీటితో పరిచయం వదిలేసి చాలాకాలమే అయింది, నాకు తెలిసిన కాలంలో కవులు ఎలా ఉండేది? రాస్తాను.
దివి..... .....నామ సంవత్సర,...మాస బహుళ/శుక్ల.... ...వాసరాన,......జిల్లా......తాలూకా.......గ్రామ కాపురస్థులు........గారి కుమారుడు..........గారికి.
......జిల్లా......తాలూకా..........గ్రామ కాపురస్థుడు.........గారి కుమారుడు........వ్రాయించి ఇచ్చిన కవులు.
మీకు ....గ్రామంలో ఉండుకున్న సర్వేనెం.......రి.సర్వేనెం.......లోని య........సెం.....భూమిని ఈ రోజు కొలతవేయించి వ్యవసాయం నిమిత్తంగా నాకు అప్పగించినారు. సదరు భూమిపై కవులుగా సంవత్సరం ఒక్కంటికి, యకరానికి ....... 3 గుళ్ళ /75 కే.జిల కాటాబస్తాలు మొదటిపంట ధాన్యం , మొత్తం య........సెం.....భూమి కి .....బస్తాల నెంబు,తప్ప,తాలు,పొల్లు, తుక్కు,దూగర లేని మొదటిపంట ధాన్యం, మీగాదివద్ద కొలగారంవారిచే తూకం వేయించి అప్పగించగలవాడను. ఈ కవులు కాలం ఐదు సంవత్సరములు. ఈ కాలంలో మొదటిపంటగా వరిని,రెండవపంటగా నువ్వు,మినుము,పెసర,కంది, జొన్న లాటి మెట్టపైరులు పండించుకునే నిర్ణయం. రెండవపంట ఫలసాయంలో మీకు సంబంధము లేదు. ఈ భూమికి ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు యావత్తూ మీరే చెల్లించుకోవలెను. ఈ భూమికి ఉన్న నీటివనరులు పాడుచేయక రక్షిస్తాను, ఉన్న ఈజుమెంటు హక్కుల్ని రద్దు చేయను,కొత్తవాటిని కలగజేయను. సరిహద్దురాళ్ళను జాగ్రత్తగా కాపాడతాను. చివరి సంవత్సరంలో నువ్వు పంట వేయకుండా ఉండే నిర్ణయం. చివరి సంవత్సరం రెండవపంట తరవాత మంద,మశాగత్తులు జరిపించి, మీ భూమిని మీకు అప్పగించగలవాడను. ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కవులు.
సంతకం....................
ఇందుకు సాక్షులు....
౧.
౨.
దస్తూరి..............
ఇక కదపా అనేది, కవులులో చెప్పబడిన షరతులు అన్నీ ఇందులోనూ ఉంటాయి. ఫలానా,ఫలానా షరతులు రైతు అమలు చేయాలనీ,వివరాలుంటాయి. చివరలో ఈ కవులు కాలంలో ఇవ్వవలసిన కవులు బకాయిలు పెట్టకుంటే కవులు రద్దు చేయనని కదపా ఇస్తున్నాను, ఇది సమ్మతిని వ్రాయించి ఇచ్చిన కదపా.
అనగా రైతుకు యజమాని చ్చే భరోసా,గేరంటీ,హామీ. చెవికదపా ఇస్తానోయ్! అన్నమాట వింటుంటాం, అంటే చెవిని హామీ ఇచ్చాడనమాట. :)
మంద అనేది మందగట్టడం. ఏభై ఏళ్ళ కితం రసాయన ఎరువులు లేవు, ఎరువుగా పెంటతోలడం,పశువులు,మేకలు,గొర్రెలని మందగా భూమిలో ఉంచడం చేసేవారు.
ఇక మశాగత్తు/మసాగత్తు అనే పదానికి అర్ధంలేదు. మసాహత్ అనే ఉర్దూ/హిందీ పదం మన తెనుగునోటబడి మశాగత్తు/మసాగత్తు అయింది. దీనికి అర్ధం, భూమి కొలత,సర్వే అని అర్ధం. రైతు భూమి తీసుకునేటపుడు కొలతవేయించి అప్పజెప్పుకుంటాడు, మళ్ళీ కొలత వేయించి అప్పజెపుతాడు. ఇక మసాహత్ అనగా కొలత ఎందుకని సందేహం కదా! సర్వేరాళ్ళు జరిపేసేవారు,గట్లు జరిపేసేవారు, ఇలా చాలాచాలా అపభ్రంశాలు జరిగేవి,దీనితో తగవులూ చాలా ఉండేవి, వీటిని మొదటిలోనే పరిహరించడానికి చేసే ప్రయత్నమే ఇది. మాస్టర్ రాయి అని ఒక పెద్ద సర్వేరాయి ఉంటుంది. మొత్తం గ్రామ సర్వే అంతా ఆ రాయి ఆధారంగా నడుస్తుంది. ఇది ఎంతుంటుందంటే, పైన రెండ డుగుల పొడవు వెడల్పులతో దగ్గరగా పది అడుగుల పొడవుంటుంది. కిందికిపోను లావుగా ఉంటుంది. ఏడు,ఎనిమిదడుగులలోతుపాతిపెట్టి,ఒకడుగు పైకి ఉంచేటట్టు చేస్తారు. ఈ మాస్టర్ రాయిని రైతులంతా గమనిస్తుంటారు. దీనినే రాత్రికి రాత్రి తవ్వితీసి మరోచోట పాతిపెట్టిన ఘనులూ ఉన్నారు,నాడే! ఆ తరవాత కాలంలో రివెన్యూవారు సరిచేసిన సందర్భాలు కోకొల్లలు.
గ్రామానికో డిగ్లాటు ఉంటుంది. ఇది కరణం దగ్గరఒకటి,తాసిల్దారు దగ్గరొకటి, కలక్టర్ దగ్గర కాపీలుంటాయి. ప్రతి సర్వే నెంబరు భూమి పరిమితం,కొలతలు,భూమి ఆకారపు చిత్రం స్కేలుకి వేసి ఉంటుంది, సర్వేరాళ్ళు ఎక్కడ ఉన్నదీ నమోదయి ఉంటుంది. మనభూమి తాలూకు డిగ్లాట్ కావాలంటే కరణం అచ్చుగుద్దినట్టు వేసి ఇచ్చేవాడు, అసలును చూసి. ఈ డిగ్లాటును సర్వే,రిసర్వేలలో సర్వే చేసినవారు, వేస్తారు. సర్వే చేసి డిగ్లాటు వేసిన వారి పేరు హోదా కూడా నమోదయి ఉంటుంది. చాలాచాలా మార్పులొచ్చాయి, ఇప్పుడెలా ఉన్నది తెలియదు.
3, జనవరి 2024, బుధవారం
నీళ్ళుకొడితే ఒకటవుతాయి....
నీళ్ళుకొడితే ఒకటవుతాయి...
నీళ్ళుకొడితే ఒకటవుతాయి! పాలు కొడితే ఒకటవుతాయా?
అనికాని
నీళ్ళుకొడితే ఒకటవుతాయిగాని, పాలు కొడితే ఒకటి
కావు.
అంటూ ఈ నానుడిని వాడుతుంటారు. ఎంటి దీని విశేషం? ఇది మానవ సంబంధాలను నిర్ణయించడానికి తరచుగా చెప్పే మాట.
ఈ నానుడి నిక్కచ్చి నిజం. జీవిత సత్యాన్ని చిన్న మాటలలో ఇమిడ్చి చెప్పేరు,ఎంతో అనుభవం మీద పెద్దలు. అది ఇప్పటికి సత్యమే! ఎప్పుడూ నిత్య నూతనమే!! నీళ్ళని ఎంత చిలికినా నీళ్ళుగానే ఉంటాయి. కాచినా ఆవిరైపోతాయేమోగాని నీళ్ళుగానే అవుతాయా తరవాత కూడా, మార్పు చెందవు. కాని పాలు చిలికితే వెన్నొస్తుంది. దీన్ని పచ్చిపాల వెన్న అంటారు. కాస్తే నెయ్యవుతుంది, కాని కొవ్వు వాసనుంటుంది. కాచి తోడు వేస్తే పెరుగవుతుంది. చిలికితే మజ్జిగవుతుంది,వెన్నొస్తుంది. వెన్న కాస్తే నెయ్యొస్తుంది. పాలు ఎన్ని రూపాంతరాలు చెందాయి? మరి నీళ్ళు మారాయా? లేదే!!
అసందర్భపు మాటే గాని అవసరమైనమాట. మజ్జిగ చుక్క వెయ్యనిది,వేలు ముంచనిది పాలు పెరుగుకావు. మరి మొదటిసారి పాలు పెరుగెలా అయ్యాయి,అవుతాయి? గోరు వెచ్చని పాలలో ఒక ముచికున్న ఎండు మిరపకాయ పడెయ్యండి, చాలు,పాలు తోడుకుపోతాయి,పెరుగవుతుంది. పాలు పెరుగవడానికి కావలసిన బేక్టీరియా ఆ ఎండు మిరిరపకాయ తొడిమలో ఉంది.
పాలుకాస్తే అందులో నీరు ఆవిరై పొడిలా మిగుల్తుంది. అంటే ఏం చేసినా నీరు ఒకటిగానే ఉంది, పాలు మాత్రం రూపాంతరం చెందిపోయింది. అలాగే కావలసినవారి మానవ సంబంధాలూ అలాగే ఉoటాయని ఈ నానుడి మాట.
ఒక ఉదాహరణ చెబుతా స్వానుభవం....
నా మిత్రుడు భార్యకి, తల్లికి, సరిపడక, తల్లిని వేరుంచాడు. మిత్రుని తల్లి ఓ రోజు వచ్చి కూచుని, తన కొడుకు కోడలి మీద చెప్పిన నేరం చెప్పకుండా చెప్పి, కళ్ళనీళ్ళు తుడవకుండా ఏడ్చి, ముక్కులు చీది గోడలు ఖరాబు చేసి వెళ్ళింది. ఆ తరవాత ఇల్లాలు నెమ్మదిగా 'మనకెందుకొచ్చిన గొడవ' అని ఊరుకుంది. నేను ఊరుకోలేక మర్నాడు మిత్రుడు కనపడితే ఒంటరిగా చూసి 'ఏం బాగోలేదురా!
నీతల్లి అలా బాధపడుతుంటే' అని క్లాసు పీకేను,
చెప్పిన సంగతీమరచాను కూడా! ఆ తరవాత వారంలో ఒకరోజు ఇంటికొచ్చేసరికి, ఇల్లాలు మొన్ననొచ్చినావిడ మధ్యాహ్నం నుంచి రెండుసార్లొచ్చింది మీకోసం, అని చెప్పింది. ఏమయిందిట,అనేలోగానే ఆవిడొచ్చి కూచుంది. ఏదో మంచిమాట చెబుతుందిగాబోలనుకున్నా! ఆవిడ,"ఔరౌరా! ఏం పెద్దమనిషివయ్యా నువ్వూ! వాళ్ళు నా కొడుకు, నా కోడలు,
పైవాళ్ళేం కాదు. ఏదో! నా కడుపులో మాట నీ చెవినేసేనో అనుకో! వాళ్ళనిలా వీధిని పడేస్తావా!" అంటూ చింతచెట్టును దులిపినట్టు దులిపి, నేను చెప్పేమాట కూడా వినక వెళ్ళింది. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లాలు నవ్వు బిగబట్టుకుని ఉన్నట్టే అనిపించింది. ఆవిడెళ్ళిన తరవాత, ఇక ఈవిడ దులుపుతుంది కాబోలురా దేవుడా! అనుకుంటూ 'రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువనేర్తునా' అనే నానుడి గుర్తుచేసుకుని ఇల్లాలికేసి చూసాను. కాని చిత్రంగా స్వీటు,స్వీటుగా ''పాలుకొడితే ఒకటిగావు,నీళ్ళు కొడితే ఒకటే'' అని చెప్పలేదూ! అని ఊరుకుంది. ఇంత స్వీటుగా చెప్పి ఊరుకున్నందుకు ఏదో చెయ్యబోతే చాలు!చాలు!! పిల్లలెదురుగా పోకిరీ వేషాలంటూ స్నానం చెయ్యండని బాత్ రూమ్ లోకి తోసింది....నిజం కదూ! ఆ తల్లి,కొడుకు,కోడలు ఒకటయ్యారు, నేను వేరయ్యాను..
అంతెందుకు నిన్నమొన్న,మన రాష్ట్ర రాజకీయాల్లో జరిగిందిదే కదూ!
దీనికి కుటుంబాలు,కులాలు, మతాలు
ట్రేడ్ యూనియన్లు, లాయర్ల,డాక్టర్ల అసోసియేషన్లు, పత్రికా విలేకరుల యూనియన్లు రాజకీయపార్టీలు,రాష్ట్ర రాజకీయాలు,దేశరాజకీయాలు,అంతర్జాతీయ రాజకీయాలూ అతీతం కాదు.
అంతా మేము దీనికి అతీతం అంటుంటారు, విని నవ్వుకోడమే! 'అందరూ శ్రీవైష్ణవులే,బుట్టడు రొయ్యలూ ఏమైనట్టు' అన్నది ఒక నానుడి.
ఎవరు ఏం చెప్పినా నీళ్ళు కొడితే ఒకటవుతాయి, పాలుకొడితే కావు!!!!
31, డిసెంబర్ 2023, ఆదివారం
మందున్నది మంచి విందున్నది.
2024ఆంగ్ల నూతన వత్సర ప్రారంభదిన ముoదస్తు శుభకామనలతో
మందున్నది మంచి విందున్నది.
రారోయి బావా! మా ఇంటికి
మందున్నది మంచి విందున్నది.
మందున్నది మంచి విందున్నది.
నువ్వు రానీకి బుల్లెట్టు బండున్నది
మనం కూచోను ఫామ్ హవుజ్ ల చోటున్నది.
రావోయ్ బావా మా ఇంటికి
మందున్నది మంచి విందున్నది.
నువు తాగనీకి పోతుతాడి కల్లున్నది.
నంజుకోను దోర దోర చికినున్నది
రావోయి బావా మా ఇంటికి
మందున్నది మంచి విందున్నది.
కాదు కాదంటె పాతపాత చిగురున్నది.
అందులోకి చీకు ముక్కున్నది.
రావోయి మా ఇంటికి బావా
మందున్నది మంచి విందున్నది.
నీకు నచ్చకుంటె కంపెనీ సరుకున్నది.
అందులోకి వర్రవర్ర కాజున్నది.
రావోయి బావా మాఇంటికి
మందున్నది మంచి విందున్నది.
లేదు కాదంటె సీమ సరుకున్నది.
నంజుకోను సీమకోడి ఇగురున్నది.
రావోయి బావా మాఇంటికి
మందున్నది మంచి విందున్నది.
నీకాకలేస్తె బాస్మతి వైట్ రైసున్నది.
అందులోకి పొట్టేలుతల కూరున్నది.
రావోయి బావా మాఇంటికి
మందున్నది మంచి విందున్నది.
ఆపైన మంచి ఉలవచారున్నది
రావోయి బావా మాఇంటికి
మందున్నది మంచి విందున్నది.
ఆపైన అసలు పాల పెరుగున్నది.
చీక్కోను మాగాయి టెంకున్నది.
రావోయి బావా మా ఇంటికి
మందున్నది మంచి విందున్నది.
నువు పడుకోను డబల్ కాట్ల బెడ్డున్నది
దానితోడు, ఏ.సి మిసనున్నయి.
రావోయి బావా మా ఇంటికి
మందున్నది మంచి విందున్నది.
(రావోయి మావా మా ఇంటికి పాట పేరడీ)
ఈపాటికి చాలామందికి ఇలా ఆహ్వానాలొచ్చే ఉంటాయి, నూతన సంవత్సరం సందర్భంగా!
ఇది ప్రమోదం అయ్యేలా లేదు. కరోనా ప్రమాదం చెప్పి చెప్పిరాదు. సింగపూర్ లో XBB వేరియంట్ బలంగా వ్యాపిస్తోందిట. మూలమైన చైనాలో గత మూడు నెలలుగా ఇది నడుస్తున్నట్టు వార్తలు. లక్షణాలు పిల్లలని ఎక్కువగా సోకుతున్నట్టు, న్యూమోనియా ఆక్రమించి ప్రాణాలు తీస్తున్నట్టు వార్తలు.
ఇక మనదేశంలో ఇది ఇంకా అడుగుపెట్టలేదు గాని, JN1 అనే వేరియంటు కేరళా,మహారాష్ట్ర, గోవాలలో ఉన్నట్టు వార్త. లక్షణాలు దగ్గు,రొంప,జ్వరం,న్యూమోనియా...ఇలా నడుస్తున్నట్టు వార్తలున్నాయి. మా జిల్లాలో మూడు కేస్ లున్నట్టు, ఒకటి పండు ముసలి,మరొకటి చిన్ని పాప,మరొకటి మధ్యవయసు. ఈ వార్త ధృవీకరింపబడలేదు. మేం మాత్రం ము.మూ గుడ్డలు కట్టుకునే తిరుగుతున్నాం. పది మందిలోకి పోవటం లేదు. ఆరోగ్యం జాగర్త! బతికియుండిన సుఖములబడయవచ్చు.
మరో బావయ్య ఇలా అంటున్నాడు చిత్తగించండి.
వద్దురా బావయ్య!
ఈపొద్దు మందు మాటొద్దురా
అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!
పెద్దోళ్ళింటిని తఱిచి చూచేవేళ
ఈపొద్దు మందు మాటొద్దురా
అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!
పూడ్చిన చిగురేమో పండని వేళాయె
చీకులకి నీ చెల్లి చెల్లు చెప్పినవేళ
వద్దురా! వద్దురా!! బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా
చుట్టాలందరు గాలిగాళ్ళురా!
మనమీద కొండెములు మళ్ళీ చెప్పేరు
వద్దురా! వద్దురా బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా
కంపెనీ మందంటే కడు గోలరా
మొదటి రౌండ్ కే వాంతులొచ్చేను.
వద్దురా! వద్దురా! బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా
ఆడుకోవలనన్న పాడుకోవలెనన్న
అన్నిట, సెల్లు చాలురా
వద్దురా! వద్దురా! బావయ్య
ఈపొద్దు మందు మాటొద్దురా
( వద్దురా కన్నయ్యా! పాటకి పేరడీ! బండి వారి బ్లాగులో కామెంటుగా ఆశువుగా చెప్పినది, కొన్ని కొన్ని మార్పులతో.)
28, డిసెంబర్ 2023, గురువారం
తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.
తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.
ఇదొకనానుడి జనసామాన్యం చెప్పుకునీదిన్నీ! ఏమి దీని కత?
తుమ్ము సాధారణంగా ఒంటరిగా ఉండదు. కనీసం రెండు సార్లు తుమ్ముతారు. కొంతమంది మూడు,నాలుగు,ఐదు సార్లు వరసగా తుమ్మడం అలవాటు ఉంటుంది. అందుకే తమ్ముకి తమ్ముడున్నాడంటారు, అంటే ఒక్కసారి తుమ్మడంతో కాదు, మరోసారి కూడా తుమ్ముతారు సుమా! అని చెప్పడమే.
ఇక ఆవులింతకి అన్నలేడు. నిజం :) అన్నలేడన్నారుగాని తమ్ముడు లేడనలేదు. అంటే ఆవులింత కూడా వస్తే ఒక్కసారితో కాదు. వరసగా వస్తాయని చెప్పడం. కొంతమందైతే అలా అవులిస్తోనే ఉంటారు. కొంతమంది ఆవులింతతో పెద్ద పెద్ద, వింత వింత శబ్దాలు కూడా చేస్తారు.
అసలు తుమ్మెందుకొస్తుంది? అదీ తెలుసుకోవలసింది. ముక్కులోకి ధూళి కణాలు చేరినా, ఘాటైనా వాసన పీల్చుకున్నా వాటిని అసంకల్పితంగా బయటకు పంపే చర్యనే తుమ్ము. ధూళి కణాలను అడ్డేందుకు ముక్కులో వ్యవస్థ ఉంది.వెంట్రుకలుంటాయి, ముక్కు తడిగా ఉంటుంది.. ఇవి ఫిల్టర్ లా పనిచేస్తాయి. వాటిని అందంకోసం తొలగించేస్తున్నారు. ఆలిఫేక్టరీ నాడులకొసలు ప్రతిస్పందించి, లోపలికి ఊపిరి తిత్తులలోకి పీల్చుకున్న ఘాటైన వాసనల్ని బయటికి పంపించేస్తాయి.
ఇక ఆవులింత శరీరం అలసినపుడు నిద్ర ముంచుకొస్తున్నవేళ ఆవులింతలొస్తాయి,ఎక్కువగా.!
తుమ్ముకుని చిరంజీవ అనుకోడం.
తుమ్మినపుడు గుండె లిప్తకాలం లయతప్పి మరలా లయ అందుకుంటుందట. దానికిగాను, తుమ్మితే పెద్దలు చిరంజీవ అని ఆశీర్వదించడం అనూచానంగా వస్తున్న అలవాటు. గుండె లయతప్పడమన్నది మనవారికి తెలుసునా? ఏమో చెప్పలేను. కాని చిరంజీవ! అని ఆశీర్వదించడం మాత్రం అనూచానంగా జరుగున్నదే!
రాత్రులు భోజనసమయంలో తుమ్మితే నెత్తిన నీళ్ళు జల్లి చిరంజీవ అని ఆశీర్వదించడం అలవాటు. అలా పెద్దలు ఆశీర్వదించేదాకా మరోముద్దనోట పెట్టకూడదంటారు. కారణమేమై ఉండచ్చని ఆలోచిస్తే మరో తుమ్ము రావచ్చనీ అందుకుగాను కొద్ది సమయం వేచి చూడడం మంచిదని అనుకుంటా! ఇలా తుమ్మిన తరవాత ఆశీర్వదించేవారు లేక,తమమటుకు తమరే ఆశీర్వదించుకోడాన్ని తుమ్ముకుని ఆశీర్వదించుకోవడమంటారు.
దీన్ని తర్జుమాచేసి తప్పుచేసి (మరొకరు తప్పుపట్టేలోపు)తమనుతామే నిందించుకోవడాన్ని ఈ నానుడితో చెబుతారు.
తుమ్ముపై లోకoలో మాటలు
తుమ్మును ఎక్కువగా అపశకునంగానే భావిస్తారు.
తుమ్ముకుంటూ నిదరకి ఉపక్రమించచ్చంటారు.
తుమ్ముకుంటూ నిద్ర లేవకూడదంటారు.
తుమ్ముకుంటూ ప్రయాణానికి బయలుదేరకూడదంటారు.
ప్రయాణానికి బయలుదేరి ఒకడుగేసిన తరవాత,వెనకనుంచి తుమ్ము వినపడితే, వెనకతుమ్ము ముందుకు మంచిదంటారు. ప్రయాణం సాగిస్తారు.
25, డిసెంబర్ 2023, సోమవారం
యతికుతం....
యతికుతం....
ఆతనో యతికుతం మనిషిలెద్దురూ అంటుంటారు, అన్నీ యతికుతం బుద్ధులే.... ఈ ,యతికుతం, కి అర్ధమేంటి?
పూజ చేస్తున్నారా? కొంతపూజయ్యాకా మొదలవుతుంది.....యానికానిచ పాపాని......పాహిమాన్ కృపాయా దేవ శరణాగత వత్సల,అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..రక్ష రక్ష....
పాపాలు చేశాను... దేవుడా దయతో మన్నించు, మరో దిక్కులేదు,రక్షించు,రక్షించు, అంటూ....
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి...
నీకు ప్రదక్షణ చేసి నమస్కారం చెయ్యాలని కోరిక,శక్తి లేదు, నీవు నాలో కూడా ఉన్నావని నమ్ముతూ, నా చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నా, నీకు ప్రదక్షిణం చేసినట్టు భావించు, నమస్కారం స్వీకరించు.
ఆపైన
కరచరణ కృతంవా
మనోవాక్కాయజంవా చ
తవాపరాధం క్షమస్వ
......................
చేతులు, కాళ్ళతో;మనసు, వాక్కు, శరీరంలతో చేసిన తప్పులు, నీపట్ల చేసినతప్పుల్ని మన్నించు, క్షమించు,దేవా అంటూ, చెంపలు వాయగొట్టుకుంటూ...
చివరకొచ్చేసేం....
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాధిప ,
'యత్కృతం' తు మయాదేవ పరిపూర్ణం....
నేను చేసిన పూజలో మంత్రాలు సరిగా చెప్పలేకపోయినా,చేసే పూజలో లోపం ఉన్నా,(పత్రి, నైవేద్యం వగైరాలు) సరిగా లేకున్నా, నీపట్ల భక్తిలేకున్నా, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణంగా భావించు...
మంత్రాలు చెప్పలేకపోయావు సరే,పూజలో లోపం అదిన్నీ సరే,భక్తి కూడా లేని నిన్ను నేను రక్షించాలా? అని భగవంతుడు అడగడు......
ఇంతకీ 'యతికుతా'నికి దీనికి లింకేంటని కొచ్చను కదా!
మంత్రహీనం.......లో .......'యత్కృతం'.... అనివచ్చిందిగా అదే ఇది, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణం అనుకో అన్నాడుగా అలాగే నేనేది చేసిన,చెప్పినా అదే సంపూర్ణం అనే మనుషులుంటారు చూడు! అని చెప్పడానికే 'యత్కృతం'....అలా అలా నలిగి 'యతికుతం' అయింది అనుకుంటా.
ఇటువంటి వాళ్ళకి ఉదాహరణలు కావాలా?...... :)
22, డిసెంబర్ 2023, శుక్రవారం
నోట్లో మెతుకు గూట్లో దీపం.
నోట్లో మెతుకు గూట్లో దీపం.
ఇది ఒక నానుడి. నానుడి,జాతీయం,సామెత అనేవన్నీ జీవితం నుంచి పుట్టిన అనుభవాలు. వీటిని తెలుసుకుంటే పాతకాలంలో మన జీవన విధానం, స్త్రీ పురుషుల ప్రవర్తన,ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ఇవీ అవీ అనేం, జీవితమంతా నానుడులలోనే ఉంది.కొత్త వింత పాతరోత అనుకునేవారినేమనగలం. చిత్రమేంటంటే కొత్తవింత పాతరోత అన్నది కూడా ఒక నానుడే :) ఈ నానుడులలో పాత జీవితమేకాదు నేటి జీవిత సత్యాలు కూడా బోధపడతాయి. మరోమాట సంస్కృతి అంటే ఏమిటి?
ఇంతకీ నోట్లో మెతుకు గూట్లో దీపం ఏంటనికదా! పూరిల్లైనా, పెంకూటిల్లైనా,మేడైనా ఆ ఇంటి అన్ని గదులలోనూ దీపం గూడు ఉండేది. ఇంటి బయట ప్రహారీకి గమ్మానికి ఇరుపక్కలా రెండు దీపం గూళ్ళుండేవి. పాత కాలపు ఇళ్ళలో వీటిని చూడచ్చు, నేటికిన్నీ. కిరసనాయిల్ దీపాలు లేనికాలంలో ఆముదం దీపాలు వెలిగించుకునేవారు. ఆముదం ఒక మట్టి ప్రమిదలో పోసి ఆముదంలో పగలంతా నానబెట్టిన కొత్త గుడ్డముక్కని వత్తిగా వాడేవారు. ఇది రాత్రంతా వెలిగి ఉదయానికి మలిగేది. సాయంత్రం దీపాలు వెలిగించుకోడమొక పనిగా ఉండేదంటే నమ్మలేరు. ఆ తరవాత కాలంలో కిరసనాయిలు దీపాలొచ్చినా అవీ గూళ్ళలోనే ఉండేవి. ఆ తరవాత కాలంలో హరికేన్ లాంతర్లు, చిన్న చిమ్నీ బుడ్లు, వీటిని కోడిగుడ్డు లాంతర్లనేవారు, వాడుకలోకొచ్చాయి. వీటిని సీనారేకుతో చేసేవారు, ఆ తరవాత కాలంలో గాజు బుడ్లొచ్చాయి. ఇప్పటికీ ఇవి తీర్థాలలో దొరుకుతున్నట్టున్నాయి! ఈ చిన్న దీపాల బుడ్లు రెండు గదుల్లోకి కనపడేలా ద్వారబంధానికి ఒక మేకు కొట్టి దీన్ని దానికి తగిలించేవారు. వీటికి ఇలాయి బుడ్లని పేరు. బయట అవసరానికి హరికేన్ లాంతర్లు వాడేవారు. కలిగినవారు పెట్రొమాక్స్ లైట్లు వెలిగించుకునేవారు. కలిగినవారింటిలో దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకంగా ఒకరుండేవారంటే నమ్మలేరు. ఇది ఒక కార్యక్రమం, దగ్గరగా మూడు గంటలేనా కాలం పట్టేది. అన్ని గదుల్లో దీపాలూ తెచ్చుకోవాలి, ఒకచోటపెట్టాలి, దీపాలగది అని ఒకటి వేరుగా ఉండేది, అందులోనే ఈ పనంతా. అన్ని దీపాల చిమ్నీలు తీసేసి వేరుగా పెట్టి ఉంచి ఒక్కొదానినీ ముగ్గు వేసి, గుడ్డతో దీపాన్ని, చిమ్నీనిని ఉన్న మసి తుడిచి, ఆతరవాత ఇలాయి బుడ్లలో కిరసనాయిలు పూర్తిగా నింపి, హరికేన్ లాంతర్లని కూడా అలాగే చేసి, వత్తి మలిపి పెట్టుకుని, బర్నర్తో వత్తి పైకి కిందకి కదులుతోందో లేదో చూచుకుని, చివరగా దీపం వెలిగించి, అన్నిగదుల్లోనూ పెట్టాలి, ఇదో పెద్దపనే, నాటిరోజుల్లో. ఎర్రకిరసనాయిలు,తెల్ల కిరసనాయిలని రెండు ఉండేవి. ఎర్రకిరసనాయిలు గవర్నమెంటు ఇచ్చేది. తెల్ల కిరసనాయిలు మార్కెట్ రేటు. కిరసనాయిలు శేర్ల లెక్కని కొలిచి అమ్మేవారు. శేరు కిరసనాయిలు ధర ఒక అణా అనిగుర్తు, లీలగా.
నానుడి గురించి చెబుతానని దీపాలగురించి చెబుతావేం :) నోట్లో మెతుకు అంటే సాయంత్రం బువ్వ తినడం.సాయంత్రభోజనం దీపాలు పెట్టేకా చేసేవారు కాదు. సూర్యాస్తమయం లోగా భోజనాలయిపోవాలి.
అసుర సంధ్యలో భోజనం చేయకూడదు. ముందుగా ముసలి వారికి, పిల్లలకి సాయంత్ర బోజనాలు పెట్టేసి ఆ తరవాత అత్తగారు, మామగారు,ఆలుమగలు, ఇలా అంతాభోజనాలు కానిచ్చేసిన తరవాత దీపాలు వెలిగించేవారు. రాత్రి భోజనాలు దీపాలు వెలిగించకమునుపే అనగా సూర్యాస్తమయం లోపే చేయాలని చెప్పడానికే ఈ నానుడి, నోట్లో మెతుకు గూట్లో దీపం అనే నానుడిపుట్టింది. నేటికాలంలో ఉదయం ఫలహారం అంటే పదిగంటలకి, మధ్యాహ్న భోజనమంటే మూడు గంటలకి, రాత్రి భోజనమటే పన్నెండు తరవాత. కాలం మారిందా? కాలం మారలేదు , అలవాట్లు మారాయి.
నూరు పనులున్నా భోజనం ఆలస్యం చెయ్యకు, వెయ్యి పనులున్నా స్నానం ఆలస్యం చెయ్యద్దని ఆచార్యచణకుని మాట.
20, డిసెంబర్ 2023, బుధవారం
కాపరంచేసే కళ కాలిగోళ్ళనాడే తెలుస్తుంది.
కాపరంచేసే కళ కాలిగోళ్ళనాడే తెలుస్తుంది.
పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు కాలి,చేతులగోళ్ళు, పెళ్ళికూతురు వారింటి అబష్ఠుడు పెళ్ళికూతురు ఇంటి దగ్గర తీసి, ఒంటికంతా నూనెరాసి నలుగుపెట్టి తలంటుతాడు. కొంతమంది ఈ ఆచారాన్నిపాటిస్తారు.
పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు, తల్లి,ఆడబడుచుతో ఆడపెళ్ళివారింటికి వస్తాడు. వచ్చిన పెళ్ళికొడుకును హారతిచ్చి ఆహ్వానిస్తారు, లోనికి. ఆ తరవాత పానకమిచ్చి, కొత్తబట్టలిచ్చి గౌరవిస్తారు. తదుపరి, పెళ్ళికొడుకు తలంటుకు సిద్దమవుతాడు. ధాన్యం కుప్పగాపోసి దానిపై కొత్త పంచెలచాపు పరచి,దానిపై పీటవేసి,దానిపై పెళ్ళికొడుకును కూచుండబెట్టి, పెళ్ళికొడుకుకు కాలిగోళ్ళతీయడం, ఒంటికి నూనెరాసి నలుగు పెట్టడం, తతిమా కార్యక్రమమంతా అంబష్ఠుడు పూర్తి చేస్తాడు. తలంటిన తరవాత పెళ్ళికొడుకు అత్తవారిచ్చిన కొత్తబట్టలు కట్టుకుంటాడు, హారతిచ్చి తిలకం దిద్దుతారు, ఇదంతా ఆడపెళ్ళివారి తరఫువారు చేస్తారు. అంబష్టుడు ధాన్యము,దాని మీద వేసిన చాపు పట్టుకునిపోతాడు. అతనికోతాంబూలమిచ్చి సత్కరిస్తారు. ఇదేమి ఆచారం అని కదా సంశయం? ప్రతి ఆచారం వెనక కొన్ని కారణాలుంటాయి, అవి తెలుసుకోవలసినవే!
అమ్మాయి గురించి ఎంత తెలుసుకుంటారో, అబ్బాయి గురించి కూడా అంత తెలుసుకోడానికే ఈ ఆచారం. పెళ్ళికొడుకు ఆరోగ్యపరిస్థితి ఏమిటి? అవయాలు ఎంతపొందికగా ఉన్నాయి. చర్మరోగాలున్నాయా? అతని మాటతీరు, నడవడిక ఎలా ఉంటుందీ? వీటన్నిటి పరిశీలనకే ఈ ఆచారం. కాలిగోళ్ళనాడే పీటలపై సంబంధాలు తిరిగిపోయేవెన్నో!
ఇప్పుడెందుకిదీ?
ప్రతిపక్షాల సంఘటన వారొక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో తమవైపునుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోడానికి, సీట్ల సర్దుబాటు గురించి మాటాడుకోడానికిన్నీ. అందులో మమతమ్మ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే ని ప్రధాని అభ్యర్థిగా కోరింది. నితీశ్ కుమార్, లాలూ యాదవ్ దీనికి కినిసి సమావేశం నుంచి బయటకి వెళ్ళిపోయారు. జరుగుతున్నదానిని చూచిన ఖర్గే ఎన్నికలు కానివ్వవమ్మా! మనం నెగ్గిన తరవాత ప్రధాని ఎవరో చూడచ్చమ్మా! అని తప్పించారు. కాని కాంగ్రెస్ వర్గాలు రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా తప్పించే పన్నాగమే అని విరుచుకుపడుతున్నాయి. ఆ సమావేశంలో నితీశ్ ఉపన్యాసం తమిళంలో కావాలని స్టాలిన్ పట్టుబట్టారు, నితీశ్ కోపించారు. ప్రతిపక్షాల ఐక్యత ఇక్కడే తెలిసిపోతోంది, పై నానుడిలో చెప్పినట్టు.
16, డిసెంబర్ 2023, శనివారం
ఉప్పుతో తొమ్మిదీ/ పప్పుతో పది.
ఉప్పుతో తొమ్మిదీ/ పప్పుతో పది.
ఉప్పుతో తొమ్మిదీ తెచ్చుకోవలసిందే, ఇక్కడేంలేవు, అంటుంటారు. ఏమిదీనర్ధం? నోట్లోకి ముద్దరావాలంటే వంటకి కావలసిన పదార్ధాలు ఈ తొమ్మిదీ, ఉప్పుతో సహా! ఏమిటవి? ఎప్పుడూ ఆలోచించలేదుకదూ! అవేంటో చూదాం...ఇదీ ఒక నానుడే!
బియ్యం,
నెయ్యి/నూనె
కూర,
పాలు/పెరుగు,
పోపు సామాన్లు,
ఉప్పు,
పులుపు,
కారం,
తీపి.
మరోమాటా చెబుతారు ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది.
వీటికి వంట పాత్రలు, వంట కట్టెలు,విస్తళ్ళు అదనం.
ఇవన్నీ ఉంటేగాని వంట కాదు. ముద్దరాదు.కొత్తగా కాపురం పెట్టుకునేవాళ్ళు మరచిపోకూడని నానుడి.







