15, మార్చి 2021, సోమవారం

వేసవి-దాహం-చిట్కా.

 వేసవి-దాహం-చిట్కా.


వేసవి పరిగెత్తుకొస్తోంది, దాహం సహజం, ఎక్కడపడితే అక్కడ వాటర్ పేకట్లు అమ్ముతూనే ఉన్నారు, కూల్ డ్రింక్ ల సంగతి చెప్పేదే లేదు. వాటర్ పేకట్లు కూల్ డ్రింకులు తాగితే రోగం కొనుక్కు తెచ్చుకున్నట్టే.ఐతే దాహానికో చిట్కా, ఒక బళ్ళారి నీరుల్లిపాయని జేబులో పడేసుకోండి. దాహంగా ఉంది, ఉల్లిపాయ కొరికి నమిలి మింగండి, ఇంకా అనిపిస్తే మళ్ళీ తినండి. దాహం కడుతుంది, దగ్గరలో ఎవరింటికైనా వెళ్ళి కాసిని మంచినీళ్ళియ్య తల్లీ అని అడగండి. దొరకవా? అందుకే నీ మొహానికి నిప్పూ నీళ్ళూ కూడా పుట్టవని తిట్టేవారు, పెద్దాళ్ళు. 


 మరో చిన్న చిట్కా! ఉసిరి పప్పు అని అమ్ముతారు. అదేమంటే ఉసిరి కాయలోని లోపలిగింజల పై దళసరిగా ఉన్న పెంకు. దీనిని ఉప్పులో పోసి ఎండబెడతారు. ఎండిన తరవాత దానితో ఉండే ఉప్పు బహు కొద్ది కొన్ని మైక్రోగ్రాములు, ఈ పప్పు చిన్న ముక్కని నోట్లో వేసుకోండి, మింగెయ్యద్దు, మెత్తబడిపోతుంది,బుగ్గన పెట్టుకోండి, లాలాజలం ఊరుతూనే ఉంటుంది, దాహమే వెయ్యదు. 



ఈ సావకాశం కూడా లేదు, నోరు ఆర్చుకుపోతోంది, ఏం చెయ్యాలి? నోరు తెరవండి, నాలిక బయటికి చాపి రెండు పెదవుల మధ్యనా సున్నాలా చేయండి, ఆ సున్నాలా ఉన్న నాలుకలోంచి నోటితో గాలి పీల్చండి, గుండెల నిండా, నోరు మూయండి, ముక్కుతో గాలి వదలి పెట్టండి, ఇలా రెండు మూడు సార్లు చేయండి, నోటిలో లాలాజలం నూతిలో పడ్డ జలలా ఊరుతుంది, ఏంటి చూసుకున్నారా? వెంటనే దగ్గరలో మంచి నీరు తాగండి, మంచి నీటికి ప్రత్యామ్నాయం లేదు. ఇలా నాలుకను సున్నాలా చేసి గాలి పీల్చి ముక్కుతో వదలి పెట్టడాన్ని శీతలీ ప్రాణాయామం అంటారు. బయట వేడిగా ఉన్న గాలి సున్నాలా ఉన్న నాలుక గుండా పీల్చినపుడు చల్లబడుతుంది, ముక్కు ద్వారా వదలే గాలి వేడిగా ఉంటుంది. నోటితో పీల్చినగాలెందుకు చల్ల బడుతోంది? దీనిలో సైన్స్ ఉందా? చెప్పండి. అత్యవసరంలో తప్పించి ఇదిచెయ్యద్దూ! ఊపిరి తిత్తుల వ్యాధి ఉన్నప్పుడు, రొంపతో ఉన్నప్పుడు అసలు చెయ్యదు, జాగ్రత!

ఫ్రిజ్ లో నీళ్ళెన్ని తాగినా దాహం తీరదు, దానికి తోడు అనారోగ్యం కూడా! ఇలా చేసుకుని చల్లటి నీళ్ళు తాగండి.ఆ తరవాత మీ ఇష్టం. 


 https://kastephale.wordpress.com/2013/05/25/

శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

11, మార్చి 2021, గురువారం

నమః శంభవేచ

 

Courtesy:Whats app

హిమాచల ప్రదేశ్ లోని సోలాన్ లో ఉన్న జటోలి శివాలయం. 



నమః శంభవేచ మయోభవేచ 

నమః శంకరాయచ మయస్కరాయచ 

నమశ్శివాయచ శివతరాయచ. 



5, మార్చి 2021, శుక్రవారం

నిండా ములిగితే

 నిండా ములిగితే


నిండా ములిగినవానికి చలేంటి? అనిగాని నిండా ములిగితే చలేంటీ అనిగాని చెబుతుంటారీ నానుడిని. దీనికి రెండు అర్ధాలూ చెబుతారు. నీళ్ళలో శరీరం సగం ములిగితే చలనిపిస్తుంది, నిండా ములిగితే చలి ఉండదు అనేది ఒక అర్ధం. మరో మాట ఏదో విషయంలో పరిస్థితి పూర్తిగా విషమించి పోయినపుడూ, పూర్తిగా చెయిదాటిపోయినపుడూ, నష్టం తప్పదన్నపుడూ బయట పడి తెగించడమూ చెబుతారు. 


సగం ములిగితే చలేస్తుంది. ఎందుకు? శీతకాలమైనా వేసవి కాలమైనా శరీర ఉహ్ణోగ్రత స్థిరంగా ఉంటుంది 37 C, కాని బయటి ఉహ్ణోగ్రత శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే తక్కువగానూ వేసవిలో ఎక్కువగానూ ఉంటుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నది ఒక నానుడి. నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అలాగే ఉష్ణం కూడా ఎక్కువనుంచి తక్కువ కి ప్రవహిస్తుంది. శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే బయట ఉహ్ణోగ్రత తక్కువ ఉన్నపుడు శరీరం వేడిని కోల్పోతూ ఉంటుంది, అందుకే చలేస్తుంది. అలాటి కాలంలో  నీటిలో దిగితే ఎలా ఉంటుంది?  శరీర ఉహ్ణోగ్రత ఎక్కువగానూ బయటి ఉహ్ణోగ్రత తక్కువగానూ ఉంటుంది, అలాటప్పుడు నీటిలో దిగితే నీటి పైపొరలలో ఉహ్ణోగ్రత క్కువగానూ  లోపలి పొరలలో ఎక్కువగానూ ఉంటుంది. అసలే శరీరం ఉహ్ణోగ్రత కోల్పోతున్నపుడు సగం శరీరం నీటిలోనూ సగం బయట ఉంటే చలి ఉంటుంది, కాని అదే పూర్తిగా శరీరం నీటిలో ములిగితే చలి ఉండదు.కారణం బయటి ఉష్ణోగ్రత కంటే లోపలి నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.   

అదే నిండా ములిగినవాడికి చలేంటీ అన్నది.  

Matter will be in three states. Solid,liquid,vapor. Water will be at liquid state at normal temperatures, it becomes solid at the 0 C and  and vaporizes after 100 C. Special feature of water is that, it will become solid at 0 C but remains as liquid at -4 C. By becoming solid, water looses its latent heat. (Latent heat of fusion of water is 80 cal for gram) Please correct if I am wrong. 

 

మరోమాట కూడా నీరు  నున్నా ఉష్ణోగ్రతలో గడ్డకడుతుంది, కాని -4 C డిగ్రీల దగ్గర నీరుగానే ఉంటుంది. అందుకే మంచు పలకలకింద నీరుంటుంది అది -4 C ఉష్ణోగ్రతలో ఉంటుంది.


ఇక రెండవదాని గురించి ఏం చెప్పేది? కొల్లలు ఉదాహరణలు అందుకు చెప్పను :)   


1, మార్చి 2021, సోమవారం

ఓం మిత్రాయనమః


 ఓం మిత్రాయనమః

ఓం రవయేనమః

ఓం సూర్యాయనమః

ఓం భానవేనమః

ఓం ఖగాయనమః

ఓం పూష్ణేనమః

ఓం హిరణ్య గర్భాయనమః

ఓం మరీచయేనమః

ఓం ఆదిత్యాయనమః

ఓం సవిత్రేనమః

ఓం   అర్కాయనమః

ఓం భాస్కరాయనమః


భాస్కరుడు ఫిబ్రవరి నెల ముగియ కుండానే ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయమే దట్టమైన మంచు తొమ్మిదికి గాని భాస్కర దర్శనం లేదు. మధ్యాహ్నానికే 38 కి వేడి జేరిపోతోంది.సాయంత్రానికి కూడా చల్లబడటం లేదు, రాత్రి చలి. ఇలా ఉన్న వాతావరణం లో అనారోగ్యం పెరగటం ఖాయం. నిరుడు ఇదే రోజుల్లో అంటు కున్న కరోనా సడలింది అనుకునే లోగా మళ్ళీ పుంజుకుంటోందనే వార్త. ఇదివరలో పద్నాలుగు రోజులు కాలం ఉండేది ఇప్పుడు మూడు రోజుల్లో అంతా తేలిపోతుందని భయపెట్టే వార్తలు, లక్షణాలు ఇవి అని చెప్పేందుకు లేదు. వస్తే ఈడ్చెయ్యడమేనని సోషల్ మీడియా వార్తలు భయపెడుతున్నాయి. నేటి కరోనా విషయంలో ప్రభుత్వం కొద్దిగా వార్తలిస్తే ఈ బెదిరింపులు తగ్గుతాయేమో! పిల్లలు బడికి వెడుతున్నారు, ఇంతలో ఒక సోషల్ మీడియా వార్త కరోనా పెరిగిపోడంతో బడి, కాలేజిలకి రెండు నెలలు శలవులని. ప్రజలు బేజారెత్తి పోయారు. ఇలాటి వార్తలు ప్రచురించేవారిని కఠినంగా ప్రభుత  శిక్షించాలని కొరిక. వార్త ఉత్తిదేనని ప్రభుత వివరణ ఇచ్చేలోగా జరగ వలసినది జరిగిపోయింది. ఇటువంటి నీలి వార్తలు ప్రచారం చేసేవారు పొందే ఆనందం ఏమిటో!

22, ఫిబ్రవరి 2021, సోమవారం

పొట్ట తగ్గాలంటే?

 పొట్ట తగ్గాలంటే?


మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ

పదండి ముందుకు పదండి తోసుకు

పదండి పోదాం పై పైకీ

మరో ప్రపంచం మరో ప్రపంచం  పిలిచిందీ


అన్నారట మహాకవి శ్రీశ్రీ. కవిగారూహించిన మరో ప్రపంచం కనబడిందో లేదో గాని తోసుకునే అలవాటు మాత్రం మిగిలిపోయింది,జనాలకి, ఎక్కడి దాకా? రిజర్వ్ కంపార్టుమెంటులోకి ఎక్కడానికి నలుగురే ఉండి, రైలు పావుగంట ఆగుతుందని తెలిసి, రైలు ఆగగానే దిగే వాళ్ళని కూడా దిగనివ్వకుండా తోసుకుని ఎక్కే అలవాటు దాకా, పిల్ల చచ్చినా పురిటి కంపు పోనట్టు ఈ అలవాటు మాత్రం మిగిలిపోయింది.. అనుకోని విపత్తు అంటే ఆకాశం విరిగి మీద పడటం అని అంటారు. ఆకాశం విరుగుతుందా?అక్కడేం లేదు కదా! అదే మరి విచిత్రం అలాటిదే నిరుడు ప్రపంచంమీద విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారిని చూస్తూ కూడా జనం దూరం పాటించక పొట్టలతో తోసుకోడం మానలేదు, ఎక్కడా! అదీ అసలు విచిత్రం.ఐపోయిన పెళ్ళికి బాజాలెందుకుగాని, 


సరే నేటి పరిస్థితి కరోనా కొంత వెనకబట్టిందనగానే గుంపులు,గుంపులు జనాలు ఎక్కడబడితే అక్కడ తోసుకుంటూనే ఉన్నారు, హాస్పిటళ్ళలో, డాక్టర్ల దగ్గర, హోటళ్ళలో, సినిమా హాళ్ళలో,బస్సుల్లో, రైళ్ళలో ఇదేస్థితి రాబోతోంది.


మా దగ్గర కొద్దికాలం తప్పించి నడక సాగించాం అందరం, మా వాకర్స్ క్లబ్ వారం. ఇప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నాం. తొమ్మిది మంది దాకా ఒక గుంపు, మూడడుగుల దూరంలో ముగ్గురో వరసకి ఉంటూ అన్ని విషయాలూ, నేటి రాజకీయం మొదలు,నాటి సాంఘిక స్థితి నుంచి, కాళిదాసునుంచి విప్లవ కవిత్వం దాకా ఎవరో ఒకరు నాటి ప్రవచకులుగా నడక సాగిపోతూనే ఉంది. ఉదయం పూట నాలుగొందల మీటర్ల ట్రాక్ మీద నడక, మూడు నాలుగు గుంపులు, మరో పక్క యోగాసనాలు వేసేవారు, మరో పక్క బేస్కెట్ బాలు ఆడేవారు, మరో పక్క ఫిజికల్ ఫీట్నెస్ కోచింగూ, సాయంత్రం పూట క్రికెట్టూ, నడకా, వాలీబాల్,బేస్కెట్ బాలూ, మరో పక్క ఇండొర్ స్టేడియంలో,టేబుల్ టెన్నిస్ షటిల్ ఇలా మా గ్రౌండ్ పెళ్ళివారిల్లులా ఉంటుంది,రెండు పూటలా. చూడ రెండు కళ్ళు చాలవు.ఇక్కడికొచ్చేవారెవరఎవరుంటారూ అని కదా అనుమానం, వ్యాపార వేత్తలు, టీచర్లు,లెక్చరర్లు,పోలీస్,ఇతర ఆఫీసుల వారు, లాయర్లు,డాక్టర్లు, ఇంజనీర్లు, నాలాటి వయసుడిగినవారు, ఏమని చెప్పను? ఎన్నని చెప్పను.. ..ఈ మధ్యనే నవ్వుల క్లబ్ కూడా మొదలెట్టాలనుకుంటున్నారు.  


నేను వీరితో కలవలేను కవిని కనక, ఒంటరిగా నడక సాగిస్తా. అలా ఒంటిగా నడచి ఒకరోజు దగ్గరే ఉన్న స్కూల్ అరుగు మీద కూచున్నా. మరో మిత్రుడు తన నడక ముగించి వచ్చి పక్కనే కూచున్నారు. చాలా తొందరగా వ్యాయామం ముగిస్తున్నారు, మరి కొంచం సేపు చెయ్యాలి అన్నారు. చేయలేకపోతున్నానన్నా! ఒక పని చెయ్యండి, వెనక్కి నడవండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటీయనా? ఎగతాళీ చేస్తున్నారా అనిపించింది, ఇంటి కొచ్చాకా గుర్తొచ్చి గూగులమ్మని అడిగా! వామ్మో! పెద్ద లిస్టు చూపింది. వెనక్కి నడిస్తే లాభాలూ అని చెప్పుకొచ్చేరు అందరూ. మర్నాటినుంచి వెనక్కి నడవడం ప్రారంభించా, నవ్వేరు, నాకేం మీపళ్ళే బయట పడ్డాయని ఊరుకున్నా! సలహా చెప్పిన స్నేహితుడూ జత కూడారు. పొట్ట తగ్గుతుందన్నారు కొందరు, కొలిచి చూసుకుందామనుకుని అలాచేశేం. ఒక నెల రోజులు విడవకుండా అందరూ నవ్వినా కొనసాగించాం. నెల తరవాత చూసుకుంటే రెండంగుళాలు పొట్ట లోపలికి పోయింది, ఇద్దరికీ. ఇప్పుడు ఆడా మగా అందరూ వెనక్కి నడుస్తున్నారు.  ఇతర లాభాలు చెప్పను గూగుల్లో వెతుక్కోండి.


చైనావాళ్ళకి వెనక్కి నడవడం బాగా అలవాటట. మంచి గుణం శత్రువు నుంచైనా నేర్చుకోవలసిందే! వెనక్కి నడవండి, పొట్ట తగ్గించుకోండి.




18, ఫిబ్రవరి 2021, గురువారం

పొట్టెందుకు పెరుగుతుంది?

 

పొట్టెందుకు పెరుగుతుంది?


భోజనాగ్రే సదా పథ్యం 

లవణార్ద్రక భక్షణం

రోచనం దీపనం వహ్ని 

జిహ్వాకంఠ విశోధనమ్


భోజనానికి ముందు సైంధవలవణం అల్లం కలిపి నమిలితే జీర్ణ శక్తి పెరుగుతుంది,గొంతు నాలుక పరిశుద్ధమై రుచి కలుగుతుంది.


 భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,

అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.

భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,

ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః


భోజనానంతరం నూరడుగులేస్తే అన్నము యుక్త స్థానము చేరి శరీరానికి బలం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే కూచుంటే పొట్టొస్తుంది,వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు చేరుతుంది, మెల్లగా నడచిన ఆయుర్వృద్ధి,పరుగెత్తినచో ఆయుక్షీణము.


మరో మాట భోజనానంతరము మెల్లగా నూరడుగులు నడచి వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూచుంటే ఆరోగ్యం మీసొత్తే అంటారు పెద్దలు. చిత్రమైన మాటేమంటే భోజనం తరవాత యోగాసనాలు వేయ కూడదు కాని ఈ ఒక్క వజ్రాసనం మాత్రమే భోజనం తరవాత కూడా వేయచ్చు. యోగాసనాలు వేయడం తేలికైన పనికాదు, తెలిసి తెలియక ఆసనాలు వేయడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళూ చేతులు నొప్పులు పుడతాయి, విరగచ్చు కూడా జాగర్త.


ఈ రోజుల్లో అందరికి పొట్టలెందుకొస్తున్నాయో తెలిసిందోచ్! భోజనం చేసిన వెంఠనే కంప్యూటర్ దగ్గర కూచోడం అలవాయిపోయింది జనాలికి చాలా కాలంగా అందుకే పొట్టలొస్తున్నాయి. పొట్ట తగ్గే మార్గం........?

15, ఫిబ్రవరి 2021, సోమవారం

యతో భ్రష్టః తతో భ్రష్టః

 


భుక్త్వా శతపదం గఛ్ఛేత్

తాంబూలమ్ తదనంతరమ్

వామపార్శ్వేతు శయనమ్

ఔషధైః కిం ప్రయోజనమ్ ?.


భొజనానంతరము నూరడుగులు నడచి తాంబూలము సేవించి, ఎడమవైపు పడుకుంటే ఔషధములెందుకు?


After dinner sleep awhile. After supper walk a mile.


దేశీయమైనదేదీ నమ్మం, విదేశీయమైనది అర్ధం చేసుకోం. 

యతో భ్రష్టః తతో భ్రష్టః


16, జనవరి 2021, శనివారం

మా ఊళ్ళో సంక్రాంతి సంబరం

 


మా ఊరు గ్రామదేవత వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర.


పోరుకు తయారైన బరి



గంగలకుఱ్ఱు గ్రామంలో భారీ భోగి పిడకలదండ.

ప్రభల తీర్థం (విడియో పాతదే)


మరువని సంప్రదాయం

All videos courtesy:Whats app. 

పండగ గురించి తెలియని వారుండరు, మూడు ముక్కలతో ముగించేస్తా. . భోగి రోజు నలుగురితో పంచుకుని తినడం అనేదే భోగం, అదే ఆనందం. రెండవరోజు పెద్ద పండగ, పెద్దల పండగ, పెద్దల పేరు చెప్పి తిలతర్పణం, దానం. మూడవరోజు కనుమ పశువులపండగ.నాలగవరోజు బొమ్మల కొలువు, బొమ్మల నోము ప్రధానం అదే సావిత్రి గౌరి దేవి నోము,''ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం'' ఇందులోదే

 ఇప్పుడు పట్టేవారు లేరు, పదమూడు సంవత్సరాల నోము. మరచిపోయిన ఒక ఆచారం.

శలవు.

15, జనవరి 2021, శుక్రవారం

రకరకాల పందెం కోడి పుంజులు

 
















courtesy:Whats app



విజయమో వీర స్వర్గమో పుంజులదే అగ్ర స్థానం. గెలిస్తే సన్మానం, ఓడితే వీర స్వర్గం మర్నాడు దాకలో కోసగా కూరకే . ఏదైనా దొరుకుతుందేమో గాని ''కోస'' దొరకదట, కొనడానికైనా! పుంజులదే రాజ్యంగాని పెట్టలకి చోటు లేదు :)

13, జనవరి 2021, బుధవారం

ఎప్పుడెప్పుడు పండగా?

 సంక్రాంతి శుభకామనలు.

(సం క్రాంతి శుభకామనలు. :) )



courtesy: whats app


ఎప్పుడెప్పుడు పండగా?

ఏడది పండగా!

పండగెందుకొచ్చింది?

పప్పలు తిండానికొచ్చింది!!

అల్లుడెందుకొచ్చాడు?

అరిసెలు తిండానికొచ్చాడు!!!

కూతురెందుకొచ్చింది?

కుడుములు తిండానికొచ్చింది!!!!

కట్టుకుపోడానికొచ్చింది!!!!

పట్టుకుపోడానికొచ్చింది!!!!

అహహహహ!!!!!!!!!


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

అతస్త్వామ్ ఆరాధ్యాం హరి హర విరించాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి


సౌందర్యలహరి.


(చిన్న ఆట విడుపు)


1, జనవరి 2021, శుక్రవారం

త్వం క్షమస్వ! త్వం క్షమస్వ !!

క్షమస్వ త్వం



 2020

 ఈ సంవత్సరం మనం సాధించినదేమిటి?

బతికి ఉండటమే ఈ సంవత్సరం మనం సాధించిన గొప్ప ఘన కార్యం.

(ఇది పెద్దల మాట)


అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే.

శేషశైల శిఖామణే! హరీ! మయా, అజ్ఞానినా విహితాన్ దోషాన్ అశేషాన్! త్వం క్షమస్వ!  త్వం క్షమస్వ !!


2021

స్వాగతం

శుభకామనలు.

31, డిసెంబర్ 2020, గురువారం

30, డిసెంబర్ 2020, బుధవారం

పీత్వామోహమయీం ప్రమాదమదిరా

 పీత్వామోహమయీం ప్రమాదమదిరా


ఆదిత్యస్యగతాగతై రహరహ స్సంక్షీయతే జీవితం

వ్యాపారై ర్బహుకార్యభారగురుభిః కాలో న విజ్ఞాయతే

దృష్ట్వా జన్మజరావిపత్తిమరణం త్రాస శ్చనోత్పద్యతే

పీత్వామోహమయీం ప్రమాదమదిరా మున్మత్తభూతం జగత్.


సూర్యుని ఉదయాస్తమాలతో ఆయువు తరిగిపోతోంది. ఎడతెగని పనులలో మునిగితేలు జనులు అది గుర్తించకున్నారు.పుడుతున్నవారిని, చనిపోతున్నవారిని, ముసలివాళ్ళవుతున్నవాళ్ళని,కష్టాలు పడుతున్నవాళ్ళని చూస్తూ కూడా జనులు భయపడటం లేదు. కల్లుతాగి పిచ్చెక్కినట్టు అజ్ఞానం లో పడి ఉంది, జగత్తులో జనసమూహం. అనగా తెలుసుకోవలసినదానిని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు.


తెల్లవారుతోంది పొద్దుగూకుతోంది, రోజులు,వారాలు,నెలలు, సంవత్సరం 

గడచిపోతోంది.   కొత్త సంవత్సరం   వచ్చేస్తోంది, పండగ చేసుకుంటున్నాం, ఎలా?సంవత్సరం ఆఖరిరోజు, అర్ధరాత్రి దాకా మేలుకుంటున్నాం. ఆడా మగా తేడా లేక గుమిగూడుతున్నాం, మన దీపాలు మనమే ఆర్పుకుంటున్నాం. పన్నెండుకి చీకట్లో కొత్త సంవత్సరం వచ్చిందని అరుస్తున్నాం, దీపాలు వెలిగించుకుంటూ తాగుతున్నాం, వాగుతున్నాం, ఊగుతున్నాం. ఆ తరవాత ఒళ్ళు తెలియని స్థితిలో ఆడా మగా తేడా లేక మోటర్ సైకిళ్ళెక్కి హేపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఊరు తిరుగుతున్నాం. ఇదేమిరా అని అడిగినవారిని ఈసడిస్తున్నాం. సంస్కారం లేనివాళ్ళు అంటున్నాం. మన పయనమెటు?

  ఇదంతా ఎందుకో తెలీదు, అదో ఆనందం, తుత్తి. కాని ఒక సంవత్సరం ఆయుస్సు గడచిపోయిందనుకోటం లేదు. గడచిన సంవత్సరం ఎలా గడచిందీ? రోగం,భయం, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పుట్టినరోజు పండగలూ చేస్తున్నాం, పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, కష్టపడేవాళ్ళు     పడుతున్నారు, ముసలాళ్ళవుతున్నారు ఛస్తున్నారు, వాళ్ళని పంపించేసి వస్తున్నాం. ఇంత మన కళ్ళ ఎదుట జరుగుతున్నా, పనుల్లో పడిపోయి తిరిగుతున్నాం. రేపు మనకూ ఇదేగతి పడుతుందనే భయమే కనపడటం లేదు. మూము గుడ్డలు కట్టుకోవలసివచ్చినా, తిరిగేస్తున్నాం లేకపోయినా. కొత్త దయ్యమొచ్చింది, భయమేలేదు. అయ్యో కాలం ఇలా జరిగిపోతూ ఉంది, ఈ పుట్టుక చావుల అంతరార్ధం ఏమిటీ? ఈమధ్య కాలంలో కల్లుతాగినపిచ్చెక్కిన కోతిలా, మోహంతో డబ్బు వెనక ఎందుకు పడిపోతున్నాం, దీనికి కారణం అన్వేషించటం లేదు. అసూయ, ద్వేషాలతో కొట్టుకుంటున్నాం, ఇదే సుఖం అనుకుంటున్నాం,ఇంతేనా ఈ కతంతేనా?  

 అనుదినమున్ నశించు బరమాయువు సూర్యునిరాకపోకలన్

ఘనబహుకార్యభారముల గాలము పోవుట గానరాదు సం

జననజరామయంబులును జావునుజూచి భయంబు లేదు, దు

ర్జనభువనంబు మోహమదిరారస విహ్వల మయ్యె నయ్యయో...లక్ష్మణ కవి

స్వస్తి


28, డిసెంబర్ 2020, సోమవారం

బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

 బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

''కుర్రోడితో యేపారం బెట్టిద్దామనుకుంటన్నాను, ఏం యేపారం పెట్టించమంటావూ?'' అడిగాడు మా సుబ్బారాజు.

''బుఱ్ఱలో గుంజుండాలిగాని బూడిదమ్ముకు బతకొచ్చు'' చెప్పేడు సత్తిబాబు.

 నువ్వన్నీ ఇలాగే చెబుతావు. అన్నీ యతి కుతం మాటలే 

విసుగు చూపాడు మా సుబ్బరాజు.

 ''ఎవడూ మొదటిరోజే అంబానీ ఐపోడయ్యా 

నీకు తెలుసా అంబానీ పెట్రోల్ బంకులో డెలివరీ బాయ్ గా పనిజేసేడు. కష్ట పడటానికి ఇష్టపడాలి. పనిజేయాలె. ఫలితమూ వస్తది.మంత్రసానితనం ఒప్పుకున్నాకా బిడ్డొచ్చినా పట్టాలె గొద్దొచ్చినా పట్టాలె.ఇదో సావెతలే అన్నా!''

''సరెలేవో సంగతేదో చెప్పరాదె!'' అరిసిండు సుబ్బరాజు. 

''తెల్లోడైనా నల్లోడైనా ఎవుడైనా వండుకోవాలె, తినాలె. వండుకున్న అంట గిన్నెలూ తోముకోవాలె''. 

''నీకన్నీ యాలాకోలమేనయ్యా'' అన్నాడు సుబ్బరాజు.

''నిజం జెపితే అలాగే ఉంటదిలే

నిన్నటి దాకా అంట గిన్నెలు తోముకోడానికి డిటర్జంట్లు, సబ్బులు  వాడేరు, ఇప్పుడో ఆర్గానిక్ బూడిద అరకేజి నాలుగొందలట. మంచేపారం. పిడకలు కొనిపించు, బూడిద చేయించు, దాన్ని పేక్ చేయించు అరకేజి మూడొంద ఏభై అను, బయో బూడిద అని యాడ్లేయించు, అరకేజి కొన్నోళ్ళకి స్పూన్ బహుమతను. ఐదు కేజిలు కొన్నోడికి మూడు వేలను, టీ కాసుకునే బొచ్చి గిఫ్ట్ పెట్టు. యాపారమే యాపారం.నిన్నటిదాకా బూడితతో అంట గిన్నెలు తోముకోడం అనాగరికమన్నారు. అందుకే సబ్బులు వచ్చాయి, కొన్నాం కాదా. ఇప్పుడు సబ్బులు వదలటం లేదు పూర్తిగా కడిగినా, అంచేత అనారోగ్యాలు కేన్సర్లు వస్తన్నాయంటన్నారు. మళ్ళీ ఆర్గానిక్ బూడిద ట్రెండవుతోంది. నువ్వు కొత్త ట్రెండ్ మొదలెట్టు. ఆర్గానిక్ బూడిడైతే పర్యావరణానికి నష్టం అందుకు బయో బూడిద వాడండి అని పిడకల బూడిదమ్ము. ఎలా ఉంది ఐడియా?'' అగాడు సత్తి బాబు. 

''అదిగాదుగాని మరోమాట చెప్పు'' అడిగాడు సుబ్బరాజు. 


''నీకేటి నేన్జెప్పింది బోదపడలా! ఏటిజేస్తాం. ఒక జరిగిన సంగతి చెప్తా ఇనుకో. మొన్నో పాలి కిరానా దుకానానికెల్లా, అదేలే స్టోరో ఎదోనట గందా? నీ కాడ ఎండు పళ్ళేటున్నాయన్నా? ఆడేటి తెల్లమొకమేసినాడు. అదెరా బాబూ డ్రై ఫ్రూట్స్ ఏటున్నాయన్నా? కిస్మిస్,డేట్స్ అంటా చెప్పుకొచ్చినాడు.ద్రాక్ష తీసుకున్నా, మరేదో కావాలన్నా లేవన్నాడు, తెచ్చినా అమ్మకం కావన్నాడు. 'మనూళ్ళో డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టినోడు లేకపోయె' అని గొణుక్కుంటా వచ్చేసినా.'' 

''ఐడియా. నేను గొణుక్కున మాట షాపోడు ఇన్నాడు. వారం కితం ఓ కుర్రోడో పేకటొట్టుకొచ్చి నమస్కారమెట్టి నిలబడినాడు. ఏటో ఒవుళు నువ్వు? అడిగినా. నేను స్టోరతని కొడుకునని మొన్న మీరన్న డ్రై ఫ్రూట్ షాప్ పెట్టేను. మీరడిగిన వెరైటీ ఇది. ఉంచండి'' అన్నాడు. ''ఎంత అంటే పేకట్ నూట ఏబై అండి, మీకిది బహుమతి'' అన్నాడు. ''అదేటి మొదటి సారిగదా'' అంటే

''మీ ఇడియా సార్. ఆశీర్వదించండి. నా shop కి రండి'' అని ఆహ్వానిం చాడు

''యాపారం ఎలా ఉందన్నా?"

''పర్లేదు సార్! మీలాఐడియా ఇచ్చే వాళ్ళుంటే దున్నేస్తా'' అన్జెప్పేడు.

''పర్లేదురా అబ్బాయి, పైకొస్తావన్నా!'' వెళుతూ, ''నా షాపులో ఎప్పుడూ మీకు స్పెషల్ రేటు సార్'' అని చెప్పెళ్ళేడు.

''సంఝే!!! నువ్వేటి యాపారం సెయ్యనేవు, కొర్రోణ్ణి ఒగ్గీ ఆడే జూసుకుంటాడు. సలాలు ఊరికే చెప్పీరు, కరుసవుద్ది.నీల్లలో పారీస్తేనే ఈతొస్తది''. అన్జెప్పి తుండుగుడ్డ బుజానేసుకుని ఎలబారిపోనాడు మా సత్తి బాబు.


26, డిసెంబర్ 2020, శనివారం

శకారః

 శకారః

అకారాంతః పుల్లింగో రామశబ్దః రాముడు. 

ఇదేంటి? శకారుడన్నారు, వ్యాకరణం చెబుతారేంటి?

 ఆ కారాంతః స్త్రీలింగో సీతా శబ్దః, సీతడు. 

యస్యజ్ఞాన దయా సింధో 

గోడదూకితే అదే సందో

సీతడు కాదూ సీతా అనాలి సీత కాదు. లలిత అనకూడదు లలితా అనాలి.

మీకేదో అయిందీవేళ. 

ఆగండి సావీ :)

ఈ శకారుడు అనే కాణేలీ పుత్రుడు మృఛ్ఛకటికం అనే సంస్కృత నాటికలో ఒక పాత్ర. మృఛ్ఛకటికం అంటే మట్టిబండి. అనగా మట్టితో చేసిన ఆటబండి. 

ఒక పాత్రకే అంత గొప్ప పేరా? 

జేంస్ బాండ్ కి అంత పేరు రాలేదేంటీ? ఈయన విశేషం చెబుదురూ....

ఈ శకారుడు ఒక రాజుగారి రాణీ గారి తమ్ముడు. అదేంటి రాజుగారి బావమరదని చెప్పచ్చుగా? అలా చెప్పేస్తే గొప్పేంటీ? ఈ రాణీ గారి తమ్ముడు బలే వింత వింత అపభ్రంశం పనులు చేస్తాడు, నాటి కాలానికి నవ్వొచ్చేటట్లు వింతగానూ మాటాడతాడు. చేసేవన్నీ...వద్దులెండి అభిమానులకి కోపమొస్తుంది. వీరికి నేటికీ అభిమానులున్నారు మరి. 

ఈ శకారుడు వసంత సేన అనే భోగప్పిల్ల వెనక పడ్డాడు. అదేమో ఛీ కొట్టింది, అంతతో ఊరుకుందా? మరో అందగాడిని ప్రేమించింది. ఇక అక్కడినుంచి మొదలవుతాయి, ఈ శకారుని వన్నెలు చిన్నెలూ! అసలే రాణీగారి తమ్ముడు,రాజుగారి బావమరదాయె, ఇతనిలో రాజ్యాంగేతర శక్తి కూడా బయటపడుతుంది.  శూద్రక మహాకవిరాసిన ఈ నాటకాన్ని తిరుపతి వేంకట కవులు తెనిగించారు.శకారుని కొన్ని పలుకులు........


1.ఏల పోయెదు పాఱిపోయెదవు తొట్రు

పాటుతో, దయయుంచు చంపము లతాంగి

బొగ్గు నిప్పులలోబడ్డ పొలుసువలెనె

కాల్చుచున్నాడు నామది కంజశరుడు.


2.ప్రక్కపై నిద్రయైనను బట్టకుండ

నాకు మదను ననంగు మన్మధుని వృద్ధి

పఱచి,దశకధరునకు లోబడిన కుంతి

పగిది నెట కేగెదే తొట్రుపడుచు పడుచ.


3.నాణెంబులు హరించు నలినాస్త్రు వేత్రంబు 

నంజుడు తినులంజ, నాట్యమాడు.

వెలది,చప్పిడి ముక్కు గలనాతి, వంశంబు 

లడగించు కామిని,యవశురాలు,

పూవింటివాని సొమ్ములపెట్టె, విలువైన

భూషణములుదాల్చు పువ్వుబోడి

డబ్బిచ్చి చొరగనాటకంబుగల్గని

మేడగాపురమున్న వాడ వెలది


పడపుమగువల కెల్లర కొడయురాలు

నంచు బది మంచిపేర్లు కల్పించినాడ.



.4.గల్లురని నగల్ మ్రోయగ వెళ్ళెదేల

రామునకు జంకి పరువెత్తు ద్రౌపదివలె

హనుమ, విశ్వావసు చెల్లెలగు సుభద్ర

పగిది,నిను బల్మి హరియించువాడ జూవె


5.అడవిలో వేటకుక్కల కాడునక్క

యడలుగతి బల్మి మాచేత నభిసరింప

బడుచు బరువెత్తె దేటికే వడిగ వేగ

మూలముట్టుగ నా డెందము హరించి.


6.ఏను సుశ్శాసనువలె నిపుడు నీదు

కొప్పుదొరకొందు, జమదగ్ని కొడుకు భీము

సేను డేతెంచి యాపునో చాన కుంతి

కాత్మజుండగు న్దశకంఠు డాపగలడొ?


7.ఉత్తరింతువొ యీవాడికత్తి నీదు

కుత్తుకను బళ్ళుమన దలగొట్టి నిన్ను

జంపుదునో చావుమూడిన జనుడు బతుక

డెందు, నీవేల పాఱిపోయెదవు గోల 


8.కటికచీకటిలోగన్ను గానకుండ

బోవుతఱి బూవుదండల తావివలన

నట్టెగుర్తించి కీల్జడ పట్టుకొంటి

యాజ్ఞసేనిని చాణుక్యుడట్లు నేను.


ఇలా ఈ శకారుని పద్దేలు తిరుపతికవులు రాశారు.చాలా ఉన్నాయి కొన్నే నేను ఇక్కడ ఇవ్వగలిగేను. ఇక ఇతనో రాజ్యాంగేతర శక్తి, కాణేలీ పుత్రా అని పిలిచేవారితనిని.ఇక ఇతను రాష్ట్ర శ్యాలకుణ్ణి చెప్పుకునేవాడు. ఇంతటి ఘనుడు బోగం పిల్ల ఛీ కొడితే పీక నులిపేడు, చచ్చిందని కంగారు పడ్డాడు, హత్య చేసేననుకుని హత్యను బోగంపిల్ల ప్రియుడి మీద నెట్టేసేడు. ఇదీ ఈ శకారుని వృత్తాంతం, కొద్దిగా. ఇంతకీ ఏమిటితని గొప్పా? రాజుగారి రాణిగారి తమ్ముడు. ఇతనేం రాజు కాదు మంత్రి కాదు, సేనాపతికాదు, చివరికి భటుడు కూడా కాదు, దర్పం, అధికారం వెళ్ళబోశాడు. ఇటువంటివాడే మరొకరు....ఇంతకంటే ముందువాడే అతనే దుర్యోధనుడు.


దుర్యోధనుడు రాజు కాదు, రాజు ధృతరాష్రుడు, యువరాజా కాదు యువరాజు ధర్మరాజు, మంత్రా? కాదు, సేనాపతా? కాదు చివరికి భటుడు కూడా కాదు. ఇంతకీ ఇతనెవరు రాజుగారి పెద్దకుమారుడు. ఏ అధికారమూ లేదు కాని అధికారం వెళ్ళబెట్టి చివరికి యుద్ధానికి కారకుడై తొడలు విరిగి చచ్చాడు. నేటి కాలానికి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయా? ఎవరేనా గుర్తొచ్చారా? అస్తు.



 





24, డిసెంబర్ 2020, గురువారం

ధైర్యం చెడుతుంది.

 ధైర్యం చెడుతుంది.


ధైర్యం చెడుతుంది, ఎప్పుడూ? 

ధర్మం చెడినపుడు. 


ధర్మం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో సత్యం చెడినపుడు. 


సత్యం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో కామ,క్రోధ, లోభ,మద,మత్సరాలు హద్దులు లేక పెరిగిపోయినపుడు,వీటినే అరిషడ్వర్గాలంటారు.


అరిషడ్వర్గాలెప్పుడు పెరుతాయి?

మనిషిలో దురాశ పెరిగినపుడు, 


దురాశ ఎప్పుడు పెరుగుతుందీ? 

స్వార్ధం అలవిగాక పెరిగినపుడు. 


స్వార్ధం ఎప్పుడు పెరుగుతుందీ?

కాంతాకనకాలమీద మోజు పెరిగినపుడు. 


కాంతా కనకాలమీద మోజులేనివారున్నారా?

ఇద్దరున్నారు!


ఎవరు వారు?

ఒకరు పుట్టనివాళ్ళు, మరొకరు చచ్చినవాళ్ళూ!


 అందరికి కాంతా కనకాల మీద మోజు ఉంటుంది! అది సహజమైనదిగా ఉండాలంటారు పెద్దలు.....


సహజసిద్ధంగా ఉండవలసినవేంటీ?


ఆపదలందు ధైర్యగుణ మంచితసంపదలందు దాల్మియున్

భూప సభాంతరాళముల బుష్కల వాక్చతురత్వమాజి బా

హాపటు శక్తియున్ యశమునందనురక్తియువిద్యయందు వాం

ఛాపరివృద్ధియున్ బ్రకృతి సిద్ధగుణంబులు  సజ్జనాళికిన్..... లక్ష్మణ కవి


ఆపదల్లో ధైర్యం కావాలి, సంపదల్లో ఓర్పు కావాలి.ఆపద మొక్కులూ సంపద మరుపులూ అనేది ఒక నానుడి.సభలలో వాక్చాతుర్యం కావాలి, ఇది మంది మంచికై ఉండాలి.యుద్ధంలో వీరత్వం కావాలి, కీర్తి మీద కోరిక ఉండాలి,నిత్య విద్యార్ధి ఐ ఉండాలి. ఇవే ప్రకృతి సిద్ధంగా వచ్చే గుణాలు.

విపది ధైర్య మధాభ్యుదయే క్షమా

సదసి వాక్పటుతా,యుధి విక్రమః

యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ

ప్రకృతిసిద్ధ మిదం హి మహాత్మనామ్


22, డిసెంబర్ 2020, మంగళవారం

మూడు తెనుగు ముక్కలున్న పద్యం./మూడు తెనుగు ముక్కలున్న తెనుగు పద్యం

 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

ఈ పద్యం మనుచరిత్రలో రెండవ ఆశ్వాసం లోది. మను చరిత్ర తెలియని తెనుగువారుంటారనుకోను. చిత్రమేమంటే ఈ పై పద్యంలో మొదటి మూడు మాటలు తప్పించి తెనుగు లేదు. ఆ మాటలు అట జని కాంచి అన్నవే! మిగిలిన పద్యమంతా సంస్కృతం అంటే నమ్మలేం. నిజానికి మనం మాటాడే తెనుగులో చాలా సంస్కృత పదాలే ఉంటాయి, ఉన్నాయి. నేడు ప్రపంచం  సంస్కృతం వెనక పరిగెడుతోంది, ముఖ్యంగా జర్మనీ, అంటే నమ్మేలా లేదు కదూ, కాని ఇది నిజం.మనం మాత్రం సంస్కృతం అంటే మృత భాష అనేస్తున్నాం. చిత్రం మృత అన్నది కూడా సంస్కృత శబ్దమే.  కంపూటర్ కి అనువైన భాష సంస్కృతం అంటే నమ్మలేరు. మరో సంగతి కూడా సంస్కృతం ఇంగ్లీష్ కీ బోర్డ్ మీద టైప్ చేయడం సులువు. 



ఈ పై పద్యంలో మాటలు తెలిసినంత వరకు విడదీయండి. అట, జని,కాంచె, ఇవి తెలుగనుకున్నాం కదూ. ఇక సంస్కృతం మాటలు చూడండి. అంబర, చుంబి, శిరః, పటల, ముహుర్ ముహుర్, తరంగ,మృదంగ,నిస్వన,, పరిఫుల్ల, కలాప, కలాపి, చరత్, కరేణు, కర,కంపిత, సాలము, శీత, శైలము.ఈ మాటలన్ని తెనుగు నిఘంటువులో అర్ధాలు దొరుకుతాయి. :) కొన్ని పదాలకి నిఘంటువు కూడా చూడక్కరలేదు కదూ
ఇది తెనుగు పద్యమా? సంస్కృత పద్యమా?

అట జని కాంచె అన్నవి రెండు గణాలుగా విడదీస్తే అటజ మూడు లఘువులు నగణం జకాంచె లఘు,గురువు,లఘువు మధ్య గురువు జగణం. అంటే పద్యం నడక నజభజజజర అనేగణాలతో నడుస్తుందని తెలిసిపోతోంది. దీనికో పేరు పెట్టేరు అదే చంపకమాలా వృత్తం. 

లఘువు ఒక మాత్ర, గురువు రెండు మాత్రలు సమయం పట్టేది. ఈ లఘు గురువులకు బైనరీ తో సంబంధం చెప్పచ్చు, అలాగే నేటి డిజిటలైజేషన్ కి ఇదే మూలం అంటే కూడా నమ్మకం కలగకపోవచ్చు. మాటల్ని గణాలుగా విభజించడం పద్యంగా చేయడం పెద్ద కష్టం కాదు. కాని అందమైన, అర్ధవంతమైన, కాలానికి నిలిచే పద్యం రాయడమే కష్టం.

ఈ సారి తెనుగు మాటలతో పద్యం రాయండి.  
 ప్రేరణ:విన్నకోటవారు. ధన్యవాదాలు.

20, డిసెంబర్ 2020, ఆదివారం

అదృష్టవంతుని చెరిపేవాడు

అదృష్టవంతుని చెరిపేవాడు

 రాతిరి మూషికంబు వివరం బొనరించి కరండబద్ధమై

భీతిలి చిక్కి యాస చెడి వెద్దయు డస్సినపామువాత

సం పాతము జెందె దానిదిని పాము దొలంగె బిలంబుత్రోవనే

యేతఱి హానివృద్ధులకు నెక్కటి దైవము కారణం బగున్.


ఒకడు, ఒక తాచును పట్టుకుని బుట్టలో పెట్టి ఇంటవుంచాడు. పాము ఆకలితో నకనకలాడుతూ ఉంది. ఏమీ చేయలేక అసహాయoగా పడి ఉంది,ఆశ వదులుకుంది.ఆకలికి తోడు రేపేం జరుగుతుందో తెలీదు. ఇంతలో ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ, బుట్టకి కన్నం చేసి లోపలికి ప్రవేసించింది, ఆకలితో ఉన్న పాము ఎలుకను మింగి, ఆ ఎలుక చేసిన కన్నంలోంచి పారిపోయింది. ఇది దైవ వశాత్తు జరిగింది. అంటే అదృష్టవంతుని చెరిపేవాడు, దురదృష్టవంతుని బాగు చేయగలవారు లేరు, ఒక్క దైవం తప్పించి.అదృష్టవంతునికి అవకాశాలు కలసివస్తాయి.అననుకూల పరిస్థితులలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆపద నుంచి బయట పడటం దైవయోగమే!దైవయోగం లేకనే ఎలుక బలైపోయింది, అన్న వస్త్రాలకి పోతే ఉన్నవస్త్రాలే పోయాయి, ప్రాణమే పోయింది. తనపై విసిరిన ఇటుకలతోనే కోట కట్టుకున్నవాడు అదృష్టవంతుడు.నేటి కాలానికి ఉదాహరణ చెప్పగలరా? 


భగ్నాశస్య కరణ్డ పిణ్డితతనో ర్ల్మానేనిన్ద్రియస్య క్షుదా

కృత్వాఖు ర్వివరం స్వయం నిపతితీ నక్తం ముఖే భోగినః

తృప్తస్త త్పిశితేన సత్వర మసౌ తేనైన యాతః పధా

స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్దౌ క్షయే కారణమ్...

18, డిసెంబర్ 2020, శుక్రవారం

ధనం-పరిశేషన్యాయం

 ధనం-పరిశేషన్యాయం


దానం భోగో నాశ స్తిప్రో గతయో భవంతి విత్తస్య

యన్న దదాతి న భుజ్త్కే తస్య తృతీయా గతి ర్భవతి


ధనమునకు దానము, భోగము, నాశము అనే మూడు గతులు చెప్పబడుచున్నవి. మొదటి రెండునూ లేని ధనము మూడవ గతినే పొందును.


దానము, ఈ పేరు చెబుతేనే చేతులు మోరలు దిగిపోయి వెనక్కి పోతాయి. చూస్తూ చూస్తూ ఒక్క రూపాయి దానం చెయ్యలేము. ఎండలో చెమటలు కక్కుకుంటూ మనల్ని ఎండ తగలకుండా తీసుకొచ్చిన రిక్షావానికి నాలుగు రూపాయలకి గీచి బేరమాడి, చిల్లరలేకపోతే దానికోసం పంపి రూపాయి మిగుల్చుకునే వాళ్ళం.ఇదే ఒక్కరినో ఉద్దేసించక్కరలేదు. నేడు అందరం ఇలాగే ఉన్నాం, ఎక్కడో ధర్మాత్ములు కొందరున్నారు, వారి గురించిన మాట కాదిది. దానం చేయగలిగి చేయకపోవడమెంత తప్పో దానం చేయడానికి తాహతు లేక దానం చేయడమూ పొరబాటే. అన్నిదానములకన్న అన్నదానము మిన్న, కాదననుగాని విద్యాదానం మరింత మంచిది. ఇలా వ్యయమైన సొమ్ము సద్గతి పొందినదే.


ఇక రెండవది భోగం. అనుభవమే భోగం, ఎంత తగినంత. అంటే సౌకర్యమైన ఇల్లు, భోజనము, ఇతర సౌకర్యాలకి తగినంత, ఆడంబరాలు కాదు. తనకు తనవారి కొరకు ఖర్చు పెట్టని సంపాదన వ్యర్ధం. మొన్ననీ మధ్య ఒకరితో మాటాడుతుంటే, ధనం సంపాదనకే సమయం పూర్తిగా వెచ్చిస్తే అనుభవానికి సమయం ఉండదంటే! సంపాదించలేక, సంపాదించే వారిని చూసి అసూయ కొద్దీ అంటున్న మాటన్నారు. ఏమో! నాకైతే అనుభవించలేని ధనం ఎందుకు? అంకెలలో చూసుకోడానికా? బంగారం,వెండిలలో చూసుకోడానికా? ఇళ్ళు పొలాలలో చూసుకోడానికో తెలీదు. ధనం, పాడె కొమ్ములకి కట్టరు, కూడా రాదు,తీసుకెళ్ళలేం. గోరెడు మట్టి కూడా రాదు, అలా ఒక్కొకరు తీసుకెళ్ళగలిగితే ఈ భూమండలం ఉండేది కాదు. ఒకప్పుడు శవం మీద పువ్వులు రూపాయలు జల్లేవారు, తీసుకెళ్ళేటపుడు. శవయాత్రకి ముందు మంగళవాద్యాలు కూడా ఉండేవి, నేటి వారు నమ్మలేరు, కాని ఇది నిజం..ఇప్పుడదీ మానేశారు.ఇలా ఖర్చైన ధనమూ సద్వినియోగమే..



మూడు రకాలు చెప్పి మొదటి రెండూ కాదంటే మూడవదనే అర్ధం. దీనే పరిశేషన్యాయం అంటారు. 

పై రెండు విధాలా ఖర్చుకాని ధనం చివరికి దొంగలకిత్తురో దొరలకవునో... ఎవరికి తెలుసు?కడుపున పుట్టిన బిడ్డలే, తల్లి తండ్రులను, హింసించినా,పరిహసించినా,అవమానించినా, వారికే తమ సొమ్మును ఇచ్చి పోయేవారి ధనం కూడా మూడో కోవకే చెందుతుందేమో! కలిగినంతలో దానం, అనుభవం ఆనందాన్ని కలగజేస్తాయి.

ఇది తెలియనివారెవరు? కాని సమయానికి మాయ తెర కప్పేస్తుంది.


దానము భొగము నాశము

పూనికతో మూడు గతులు భువి ధనమునకున్

దానము భోగము నెఱుగని

దీనుని ధనమునకు గతి దృతీయమె పొసగున్.....లక్ష్మణకవి  

16, డిసెంబర్ 2020, బుధవారం

నిద్ర

 నిద్ర

ఆహార నిద్రా భయ మైధునాలు సర్వ జీవులకు సమానం అన్నారు, పెద్దలు.ఇవి ఎవరివి వారే అనుభవించాలి, మరొకరిని అనుభవించమనడం కుదరదు. ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం.నిద్ర గురించి చాలా కతలున్నాయి,భారతంలో,రామాయణంలో పాత చింతకాయ పచ్చడి చెప్పను.నేటి సినీ కవి మాట.

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు

మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు

కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు

చెప్పడమే నాధర్మం వినకపోతె నీ ఖర్మం

నేటి కాలంలో నిద్ర లేనివారు,నిద్ర లేని రాత్రులే ఎక్కువవుతున్నాయి. కారణాలు చూస్తే,

ఇరవైనాలుగు గంటలలోనూ ఎక్కువ భాగం బ్లూ స్క్రీన్ చూడ్డం.అవసరం ఉన్నది లేనిది అనక అన్ని విషయాలనూ బుర్రలో కుక్కెయ్యడం.దాంతో పీతబుర్ర కాస్తా పిగిలిపోతోంది, పగిలిపోతోంది.పరిస్థితి ఎలా తయారయిందంటే ఈగ ఇల్లలుకుతూ పేరు మరచిన చందమయింది.నీ పేరేంటీ? అంటే ఆగు గూగుల్ ని అడిగి చెబుతా అంటున్నట్టు ఉంది.ఇక మరొకటి తినకూడనివి తినకూడని సమయాల్లో తినడం.దీనికి విరుగుడు లేదా? పాము విషానికే విరుగుడుందే!

నిద్దర పట్టటం లేదా? ఇది దీర్ఘరోగానికి సంకేతం కావచ్చు సుమా. ఈకింది విధం గా చేసి చూడండి, అవసరాన్ని బట్టి డాక్టర్ ని కలవండి.

చేతుల బొటన వేళ్ళు ముడవండి, ఆపై మిగినవేళ్ళు ముడవండి. ఇది అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం అందరం ఉపాసన చేసినదే. అందుకే దీనిని ఆదిముద్ర అంటారు. ఇలా ముడిచిన చేతులతో ఎడమవైపుకు తిరిగి పడుకోండి, ఎడమచేయి తలకింద పెట్టండి, కుడి చేయి కూడా అదే పోస్ లో పెట్టి పడుకోండి.ఊపిరి నెమ్మదిగా పీల్చి వదలండి. ఊపిరి తిత్తులు ఖాళీ చేయండి, నెమ్మదిగా నాలుగంకెలు లెక్కిస్తూ ఊపిరి పీల్చండి. ఏడంకెలు లెక్కించేదాకా ఊపిరి బిగబట్టండి, ఆ తరవాత ఎనిమిది అంకెలు లెక్కెట్టే టైమ్ దాకా ఊపిరి వదలండి. దీనిని నాలుగైదు సార్లు చేయండి. కళ్ళ మీదకి నిద్ర వస్తుంది. బుర్రలోంచి ఆలోచనలు తుడి చేయండి. అది మీవల్ల కాదు లెండి. ప్రయత్నించండి.నిద్రకి ఉపక్రమించండి. ఇది సింపుల్. 

అబ్బే మేం ముదిరిపోయాం ఇలా కుదరదంటారా?

వెల్లకిలా పడుకోండి. ఆది ముద్రపట్టండి రెండు చేతులా, ఈ చేతుల్ని బొడ్డు కింద ఉంచండి, ఒక దాని గుప్పెళ్ళు మరొక దానికి తగిలేలా. చివర వేళ్ళు రెండు చేతులవీ వదలండి. ఒక చేతి రెండు వేళ్ళని రెండవ చేతి వేళ్ళ దగ్గరగా ఉంచండి. నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండండి.దీన్ని శక్తి ముద్ర,మాతంగి ముద్ర అంటారు. కళ్ళు మూసుకోండి, ఊపిరి ఎక్సర్సైజ్ చేయండి, ఆలోచన తుడి చెయ్యండి. నెమ్మదిగా నిద్ర వస్తుంది. 

అబ్బే మేమింకా ముదురు అంటారా? చారెడు జీలకర్ర తీసుకోండి, చిన్న స్పూన్ చక్కెర తీసుకోంది. రెండిని కలిపి నమలండి, పై చెప్పినవి చేయండి, నిద్ర వస్తుంది. అబ్బే మేము మరీ ముదురు

ఐతే పై చెప్పినవి ఆచరిస్తూ పడుక్కోడనికి ఒక గంట ముందు, వేడిగా పాలు తాగండి. పైవి చేయండి కమ్మటి నిద్ర మీ సొంతం. ఇవన్నీ ఎప్పుడో అమలు పరచేసేం, ఏం పని చేయలేదంటారా? మీకు మాత్రలేగతి డాక్టర్ని చూడండి...ఇక చెప్పను.

ఒక్కటి గుర్తుంచుకోండి,రోజులో,కనీసం రెండు గంటల పాటైనా మీ శరీరానికి సూర్య రశ్మి తగలాలి, ఎప్పుడూ ఏ.సి లో కూచుని ఉంటే ఇంతే సంగతులు. రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణమై ఉండాలి,అప్పుడే మీ శరీరం విశ్రాంతిని కోరుతుంది. తిన్న వెంటనే పడుకుంటే రోగమొస్తుంది. అంటే తిన్న తరవాత కనీసం రెండు గంటలదాకా నిద్రకి ఉపక్రమించద్దు.  ఆ పై మీ ఇష్టం శరీరం మీది కదా! 

నీలాల కన్నుల్లో 

నిదురా రావమ్మా

రావే నెమ్మదిగా రావే

నీలాల కన్నుల్లో 

నిదురా రావమ్మా

రావే నిండారా రావే


నిద్ర జీవులకు నిత్య ప్రళయం


14, డిసెంబర్ 2020, సోమవారం

తాడిచెట్టు నీడా కాదు

 తాడిచెట్టు నీడా కాదు


ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధనాంగుడై

త్వరతోడవ బరువెత్తి చేరి నిలిచెవ దాళద్రుమఛ్ఛాయ ద

చ్చిరముం దత్ఫలపాతవేగమున విచ్చెవ శబ్దయోగంబుగా

బొరి దైపోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్.....లక్ష్మణకవి


అసలే బట్టతల ఆ పై మధ్యాహ్న ఎండకి తల  మాడుతుండగా నీడకోసం తాడిచెట్టు మొదలుకి చేరాడు.. 

 అప్పుడే తాటి పండు ఒకటి రాలి, బట్టతలపై పడింది. తల పగిలింది.    ”తాడిచెట్టు నీడా కాదు,ఉంచుకున్నోడు మొగుడూ కాదని ” సామెత. తాడి చెట్టు నీడెంత? చాలా తొందరగా నీడ జరిగిపోతుంది.అటువంటి నీడ కోసం పోతే తాటి పండు రాలి తలపగిలింది, దీన్నే ”దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురొచ్చిందని” సామెత చెబుతారు. అలాగే ”దరిద్రుడు ఏ రేవు కెళ్ళినా ముళ్ళపరిగే పడిందన్నదీ” సామెత. దైవబలం చాలకపోతే అన్నీ బాధలే,చుట్టు ముడతాయి."అన్న వస్త్రాలకోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు"సామెత.  నేటి కాలానికి  సరిపోయే పోలిక చెప్పండి.

మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు దైవబలం లేనపుడు ఆపదలు చుట్టు ముడతాయి


ఖర్వాటో దివసేశ్వరస్య సంతాపితే మస్తకే

వాఞ్చన్దేశ మనాతపం విధివశా త్తాలస్య మూలంగతే

తత్రవ్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః

ప్రాయోగఛ్ఛతి యత్ర దైవహతకస్త త్రైవ యా న్త్యాపదః

12, డిసెంబర్ 2020, శనివారం

ఆరో వేలు.

 ఆరో వేలు.


భగవంతుని సృష్టి విచిత్రం. సాధారణంగా మనం అంతా చేతులకి కాళ్ళకి ఐదేసి వేళ్ళు కలిగి ఉంటాం. కాని కొంతమందికి ఒక్కో చేతికి ఆరేసి వేళ్ళుంటాయి. అదో చిత్రం. చేతి ఐదు వేళ్ళూ ముడిస్తే గుప్పెట,మరి ఆరో వేలెందుకూ? అలంకారమా? కాదు కాని ఉంది.ఇది చాలా వాటికి వర్తిస్తుంది.అజాగళ స్తనం తెలుసు కదా! అదే మేక మెడ చన్ను. అది మేకపోతుకి ఎందుకు ఉపయోగం? అటువంటిదే మనిషికి ఆరో వేలు.ఇలాగే కొంతమంది అజాగళస్తనాలూ ఉంటారు.


నాకో మిత్రుడు రెండు చేతులకి ఆరేసి వేళ్ళుండేవి, ఇతనిని ఆరేళ్ళ ఆచారిగారనే వాళ్ళం. ఆయన్నో సారడిగా ఆరో వేలు ఇబ్బంది కాదా అని, దానికాయన పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అరచేతి ఎడమ పక్క వేలాడుతూ ఉంటాయి. నాకా ఉపయోగం అనిపించలేదు, అలాగనిఇబ్బందీ అనిపించలేదన్నారు. ఇదే సృష్టి చిత్రం.  సమాజం లో ఆరో వేలు లాటి మనుషులూ ఉంటారు.

10, డిసెంబర్ 2020, గురువారం

నాకూడా రాకురా!

 నాకూడా రాకురా!                                                                                                       కత


”ఆరున్నర దాటింది లేవచ్చు, ఏంటో మరీ బద్ధకం పెరిగిపోతోంది,మీకు” అరిచింది సతి, కిచెన్ లోంచి 

”రిటయిర్ అయి వచ్చిన తరవాత కూడా ఈ నసేంటీ?”..పతి వాపోయాడు,  దుప్పటిలో ముణగ దీసుకుంటూ .

”చూడరాదూ! పక్కింటి ముసలాయన, మీ కంటే పెద్దాడు కదా, ఆరయేటప్పటికి టంచనుగా కర్ర పుచ్చుకుని నడకకి వెళిపోతాడు రోజూ” సాగదీసింది, జాయ.

”ఒకరితో మనకి పోలికేంటోయ్, చలేస్తోంది కాసేపు పడుకోనిద్దూ”గొణిగాడు  పతి 

”అవును లెండి మనకి మంచిపోలికలెలా వస్తాయీ..లేవడమే ఆలస్యం, ఇంక నడకెప్పుడూ”....విసుక్కుంది జాయ.

”లేస్తాను లేవే పొద్దుటే చలీ”...అంటూ మంచందిగాడు, పతి.

”మీరు పొద్దుటే లేచి, నాలుగడుగులేసి ఆరోగ్యం సాధించుకుని మమ్మల్ని ఉద్ధరిస్తారనీ,ఈ గోల. రేపు ఏకాశి సోమవారం, మంచిది నడక మొదలెట్టండి,” సూచన చేసింది.... జాయ.

”రేపు ఏకాశి సోమవారమా? ఐతే దగ్ధయోగం, రేపొద్దుగాని ఎల్లుండి నుంచి మొదలెడతాలే”..వాయిదా వేసేడు పతి.

నడవడానికి ఒప్పుకున్నాడు, అంతే చాలు అని సంబరపడింది.ఇలా ఊరుకుంటే మానేస్తాడు,రేపు రేపు అని జరిపేస్తాడు. ఏం చేయడం అని ఆలోచించి, 'పక్క ముసలాయన ఉదయమే నడుస్తున్నాడు కదా, ఆయన కప్పజెపితే' ఆలోచన చేసింది. 'ఆ( మంచి ఐడియా' అని నడకకెళ్ళిన ముసలాయన తిరిగిరావడాన్ని వేచి చూస్తూ, కన్ను వీధి వైపు వేసుంచింది. ఇంతలో ముసలాయన కర్ర బోటుతో వస్తూ కనపడ్డాడు. చేతిలో పనొదిలేసి చేతులు తుడుచుకుంటూ వీధిలోకి పరుగెట్టింది.

ముసలాయన్ని పలకరిస్తూ 

”నమస్తే బాబాయ్!” అని నిలిచింది.

”కులాసానా అమ్మా!” అంటూ పలకరించాడు ముసలాయన. 

”మంచి అలవాటు బాబాయ్! ఉదయమే నడకకి వెళతారు,ఇంత వయసులో కూడా క్రమం తప్పకుండా, ఈయనకితగని బద్ధకం, లేపితే లేవరు,మీరు నడకకి వెళ్ళేప్పుడు ఒక్క కేక వేస్తే, రోజూ ఈయనా నడకకి వస్తారు”, విషయం చెప్పేసింది.

”అలాగేనమ్మా! నువ్వేం మడులు, మాన్యాలూ అడిగావా, నేనేమన్నా రాళ్ళూ గుళ్ళూ ఎత్తుకోవాలా? అతని నడక అతను నడుస్తాడు, అలాగే, రేపు ఉదయం పిలుస్తా” అన్నాడు.

”కాదు బాబాయ్, రేపు ఈయనకేదో పనుందిట, ఎల్లుండి నుంచీ” అని నాన్చేసింది.

''అలాగేనమ్మా'' ఆని ముందుకు సాగిపోయాడు, ముసలాయన. 

అమ్మయ్య, ఒక ఆధారం దొరికిందనుకుంటూ లోపలికొచ్చిన ఆమెకు పతి బాత్ రూం నుంచి వస్తూ కనపడ్డాడు.ముసలాయనతో మాటాడిన సంగతి చెప్పి 'ఎల్లుండి నుంచి నడవండని' పతికి హుకుం జారీ చేసింది జాయ.


ఎల్లుండి రానే వచ్చింది, ఉదయమే ముసలాయన కర్రతో నడకకి వచ్చేసేటప్పటికి,వాకిట్లో పతికి బూట్లు తొడుగుతూ, ”ఐపోయింది బాబాయ్ వచ్చేస్తున్నారూ” అంటూ పతిని బయటికి పంపించింది. ముసలాయన, పతి ఇద్దరూ నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకుంటుండగా తాను నిష్క్రమించింది. కొత్త మిత్రు లిద్దరూ కబుర్లలో పడి, నడక సారించారు. 


కబుర్లలో ఇద్దరికీ శంఖ చక్రాలున్నట్టు తేలింది, నడక అవసరమేననీ తేలింది.నడక కొనసాగిస్తుండగా, రోజూ వరు ముందు బయలుదేరితే, వారు రెండవవారిని పిలవాలని ఒక ఒప్పందం. సరే! ఏరోజూ పతి ముసలాయన్ని పిలిచిన పాపాన పోలేదు. ప్రతిరోజూ ముసలాయన వచ్చే సమయానికి పతికి నడక బూట్లు తొడుగుతూ ఉంటుంది జాయ. మధ్యలో ఆదివారమొస్తే శలవు ప్రకటించాడు, పతి. ''ఆదివారమని ఏపని చేయడం మానేస్తున్నావు మగడా, నడకకి శలవెందుకూ?" పోరింది సతి.

''నువ్వేమన్నా ఆదివారం నడకకి శలవే భీష్మించాడు'' పతి.అదేదో తేల్చుకోండని వెళ్ళాడు ముసలాయన.ఇలా తంపులతో నడక నడుస్తూ ఉంది. 


ఇంతలో వచ్చింది కరోనా, బయటకి కాలు కదపడానికి లేదంటే ఇద్దరూ ఇళ్ళలో బందీ ఐ పోయారు. ముసలాయన తన పెరటిలోనూ పతి తన డాబా మీదా నడుస్తూ వచ్చారు, కాని ఇద్దరికీ శంఖ,చక్రాలు పెరిగినట్టే అనిపించింది, ఆరు నెలలయేటప్పటికి. ఇద్దరూ ఒకే డాక్టర్ ని చూస్తే ఇద్దరికి ఉండవలసిన దానికంటే చక్కెర ఉత్పత్తి రెట్టింపే ఉన్నట్టు తేలింది. నడక తప్పని సరీ అయింది, మళ్ళీ ఒప్పందమూ అమలులోకొచ్చి, నడక మొదలెట్టేరు.ము.మూ గుడ్డలు కట్టుకుని దూరం పాటిస్తూ నడక కొనసాగించారు. నెలపాటు నడక సాగినట్టే సాగింది, 


ఇంతలో ఒక రోజు ఉదయమే, పతి ముసలయ్య ఇంటికొచ్చి ''బయటికి రావద్దు ఊళ్ళో బాగో లేదు,మన మిత్రుడు డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేడు, పెరటిలోనే నడక''  అన్నాడు. దానికి ముసలయ్య ''దూరం పాటిస్తున్నాం, ముమూ గుడ్డలు కట్టుకుంటున్నాం కదా! ప్రభుత్వమూ బయటి రావడానికి నిషేధమూ ప్రకటించలేదు, మరెందుకు నడక మానేయాలని'' ఆరాతీశాడు. ''వద్దూ బయటికి రావద్దూ, ఇంట్లోనే ఉండండీ'' అనేసి మాటకి దొరక్కుండా పోయాడు పతి. ముసలయ్య ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని నడకకై బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తోచని ముసలయ్య ఇంట్లో చిక్కుకుపోయాడు. నడకా ఆరోగ్యమూ కొద్దిగా దారిలో పడుతున్న ముసలయ్యకి ఇది బాధే అనిపించింది. 


మళ్ళీ మొదలు కొచ్చేసినట్టుందే నడక వ్యవహారం అనుకుంటూ ఉండిపోయాడు,ఇంట్లో. వారం తరవాత కాళ్ళు గుదులెక్కిపోతే నడుద్దామని బయలుదేరి, అలవాటుగానే పతి కోసం ఇంటి కెళ్ళేడు. ఎంత పిలచినా పతి ఇంటినుంచి జవాబు రాలేదు. ఇంటికా తాళం లేదు, బయటికెళ్ళేరేమో, ఏమయి ఉంటుందీ అని అనుకుంటూ ముందుకు సాగిపోయాడు ముసలయ్య.  పతి ఆ రోజు  ముసలయ్యకి అందుబాటులోకి రాలేదు. మర్నాడు ఉదయమే వెళితే పతి కనపడలేదుగాని అతని భార్య,  తాము కట్టించుకుంటున్న అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేడని చెప్పింది. కాని, ఎదురుగా ఉన్న చెప్పుల స్టాండ్ లో పతి నడక బూట్ల తో సహా మిగిలిన చెప్పులూ కనపడుతూనే ఉన్నాయి. పతి ఇంట్లోనే ఉన్నాడని అర్ధమైపోయింది, ముసలయ్యకి.అంటే పతి ఇంట్లోనే ఉండి ముసలయ్యతో మాటాడటానికే ఇష్టపడటం లేదని అర్ధమయింది. సాలోచనగా ముసలయ్య చూసేటప్పటికి సిగ్గు పడింది, జాయ, తను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు. తన అసౌకర్య పరిస్థితి నుంచి తప్పించుకోడానికి మాట పొడిగిస్తూ, సతి

” బాబాయ్!  డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేరు తెలిసిందా? ఆయన మీ స్నేహితుడట కదా!”  వాకబు చేసింది.  ”అవునమ్మా! ఆయనకి ఎనిమిది పదులు నిండేయి, నాకంటే వారం పది రోజులు పెద్దవాడు, నేనీ వూరు వచ్చిన రోజునుంచి స్నేహితుడు,గుండె జబ్బు కి ఆపరేషనయింది, డయాబెటీస్ ఉన్నవాడు, ఎలాపోయాడో”? అడిగాడు ముసలయ్య. 

”అదేం కాదు బాబాయ్! కొత్తమ్మోరే ఎత్తుకుపోయిందంది”,  కరోనా పేరు చెప్పకుండా.

 ”అయ్యో” నిట్టూర్చాడు, ముసలయ్య. 

బాబాయ్! నడక్కి వెళ్ళద్దు,ఈయన బయటకి రావడానికి భయపడుతున్నారు, తప్పక అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేరు. నిన్నూ నడకకి వెళ్ళద్దన్నారు. అదీగాక నిన్ను తను కూడా నడక్కి తిప్పుతుంటే ఏం మాట పడిపోతానోనని మధన పడిపోతున్నారు, నీకా మాట చెప్పలేకపోతున్నారు, ఏమీ జరగదనుకో,  ఏదీ మన చేతులో లేదు కదా! ఇలా అన్నానని ఏమనుకోకు బాబాయ్! ఇంటికెళిపో” అంది చివరగా.  తనకూడా నడకకి రావద్దని చెప్పలేక భార్యతో చెప్పించాడనమాట.  తను నా కూడా నడకలో ఉంటుంటే, నాకేమైనా ఐతే తను మాట పడిపోతానేమోననుకుంటున్నాడనమాట, అనుకుంటూ  ముసలయ్య నడకకి సాగిపోయాడు.

”నాకూడా రాకురా అంటే నన్నెత్తుకోరా” అని వెనకపడినట్టు, పతి వెనక పడటం తెలివి తక్కువేమో అనుకున్నాడు, ముసలయ్య. ఉదయమే మంచు,దానికి తోడు చలి, మంచులో సూర్యుడు కనపడ్డు. ఇన్ని కష్టాలతో ఉదయం నడకెందుకని సాయంత్రానికి మార్చుకున్నాడు, ముసలయ్య.

''కానున్నది కాక మానదుగదా! ఒకప్పుడు పతి నా కూడాపడి నడకకి వచ్చినవాడు, ఇప్పుడు తన కూడా నడకకి రావద్దంటున్నాడు.చూడరాదూ చిత్రం'',అనుకున్నాడు ముసలయ్య .

లోకం ఎంత చిత్రమైనదీ