13, జనవరి 2022, గురువారం

పండగ -వయసు ముచ్చట్లు

 పండగ-వయసు ముచ్చట్లు 


పెళ్ళయిన మొదటి సంవత్సరం, పెద్ద పండగకి పిలవడానికి మామగారొచ్చాడు. పండక్కి తీసుకెళ్తా రమ్మన్నాడు. మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను తరవాతొస్తానన్నా! ఏమనుకుందోగాని ఇల్లాలు, ఇద్దరం కలిసివస్తాం,అనిజెప్పి తండ్రిని పంపేసింది. భోగి ముందురోజు ఉదయం డ్యూటీ చేసి సాయంత్రం బయల్దేరి ఇరవై కిలో మీటర్లు దూరం కోసం రెండు గంటలు ప్రయాణం కోసం వెచ్చించి కడియం చేరేం.గుమ్మంలో చేరగానే ఎదురింటి పిన్నిగారు "ఏమే పాపా! ఇదేనా రావడం? "  అంటూ పలకరించి, అదే వరసని "అల్లుడూ బాగున్నావా?"  అడిగింది. ఆవిడ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి రెండో కోడలు,దుర్గేశ్వర శాస్త్రి గారి భార్య, ఇంకేంఉంది ఇల్లాలు పిన్ని చేతుల్లో వాలిపోయింది, అయస్కాంతానికి అతుక్కున్న ఇనప ముక్కలా. ఎంతకీ ఇనపముక్క ఊడి బయటకు రాదు. దగ్గేను, సకిలించేను ఉపయోగం లేకపోయింది. ఇనపముక్క ఊడలేదు.ఏం చేయాలి? లోపలికెళితే ఒక్కడివే వచ్చావు మా అమ్మాయేదీ? అంటే, అలాకాక మా అమ్మాయేదీ అంటే ఏం చెప్పాలి? తోచక నిలబడిపోయా! ఈలోగా అత్తగారు బయటికొచ్చి కూతుర్ని పిన్నమ్మ చేతుల్లో చూసి, నన్ను, నువ్వు లోపలికి రావయ్యా! అదొస్తుందిలే అంది. అమ్మయ్య ఒక గండం గడిచిందని లోపలికెళ్ళా! 


ఇల్లాలు ఇంట్లోకెప్పుడొచ్చిందో! మళ్ళీ కనపళ్ళా! భోజనాల దగ్గర మెరిసింది, కంచాలెత్తుతూ.ఆ తరవాతెప్పుడో గదిలోకి చేరి నిద్దరోతున్నారా? అడిగింది. లేదన్నా పొడిగా.ఈ మాత్రానికే అంత కోపమా అంది. అబ్బే కోపమేం లేదే అన్నా!పేదవాని కోపము పెదవికి చేటు అన్నది గుర్తు చేసుకుని. నాకు తెలవదేంటీ? అని సాగదీసింది. మొత్తానికి తెల్లారింది, దోమలు కుట్టి చంపుతూంటే, నిద్దరట్టక.


ఉదయమే భోగి తలంటాలన్నారు.వదినగారు తనూ కలిసి,తోడల్లుడికి నాకూ. కాదనలేక పీటమీద కూచున్నా. తలకి వంటాముదం రాసింది, వదినగారు, తబలాలా వాయించేసింది. ఆ తరవాత ఇల్లాలు ఒంటినిండా నువ్వుల నూనె రాసి, నలుగు పిండి రాసింది. నలుగెడతామన్నారు.అమ్మో! అని పరుగెట్టేను. తోడల్లుడు చక్కహా నలుగెట్టించుకున్నాడు. ఏం? అడిగింది ఇల్లాలు. నలుగు పిండి ఎండిపోయింది. నలిస్తే రాదుగాని ఒంటినున్న వెండ్రుకల్లో చిక్కుకుందేమో, నలుగెడితే అంతకంటే నరకం ఉండదని చెబితే ఆపింది. అమ్మయ్య మరో గండం గడిచిందనుకున్నా. ఈ లోగా కుంకుడుకాయ పులుసోసి నా తలని అప్పా,చెల్లీ చెడుగుడు ఆడుకుని, విడతల మీద, మొత్తానికి తలకి రాసిన జిడ్డు వదిల్చేరు. కుంకుడు కాయ పులుసుతో సున్ని పిండి కలిపి ఒళ్ళు రుద్దుకుని స్నానం అయిందనిపించుకుని బయట పడ్డా.  


కూడా, కుట్టించుకుని తెచ్చుకున్న కొత్తబట్టలు కట్టుకున్నా. మావగారికి,  అత్తగారికి దణ్ణం పెడితే మావగారు ఒక ఇరవై రూపాయలు పండగ బహుమతి ఇచ్చాడు, వాటిని ఇల్లాలు ఊడలాకుంది. నవ్వుకున్నాము. పన్నెండయింది, భోజనాలన్నారు, కానిచ్చి లేచేం. వెళ్తానన్నా! అదేం మాట అన్నారంతా! రేపు పండగ కదా అన్నారు కూడా కోరస్ గా. నేను సమాధానం చెప్పేలోగా ఇల్లాలు, "చిన్నంటి  కెళ్ళాలి లే! లేకపోతే ఆవిడకి కోపం వస్తుందంది". ఒక్క సారి నిశ్శబ్డం అయిపోయింది.అంతే కాదు నేనేదో ఘోరం , నేరం చేసినట్టు చూశారందరూ, చాలా ఇబ్బందికరంగా ఉంది, నాకు మాత్రం. ఈలోగా ఇల్లాలే కలగజేసుకుని ''సాయంత్రం నాలుక్కి డ్యూటీ'' అని చెప్పింది. అంతా ఒక్క సారి భళ్ళున నవ్వేసేరు.ఇదేం ఉద్యోగం! పండక్కి కూడా శలవు లేదూ అని బుగ్గలు నొక్కుకున్నారు ఇరుగూ పొరుగూ! పెళ్ళికే,ఒకరోజు రాత్రి  డ్యూటీ   చేసి మరునాడు అంటే పెళ్ళి రోజు వారపు శలవు తీసుకుని, పెళ్ళైన మర్నాడు సాయంత్రం ఉద్యోగానికెళ్ళిన ఘనత కలవాడు మా అయన చెప్పింది ఇల్లాలు.   అటువంటి ఉద్యోగం కూడా ఉంటుందని తెలియని రోజులు, ఎప్పుడూ అరవై ఏళ్ళకితం   మాట.  


7, జనవరి 2022, శుక్రవారం

అభ్యాసము కూసు విద్య!

 


 అభ్యాసము కూసు విద్య



అభ్యాసము కూసు విద్య, ఎంత చెట్టుకు అంత గాలి, సంతోషము సగము బలము ఇలా ప్రతి క్లాసులో గోడలమీద రాసి ఉండేవి. అక్షరాలు కూడబలుక్కుని చదివే రోజుల్నించి బడి వదలి పోయేదాకా రోజూ బళ్ళో క్లాసులోకి రాగానే కనపడేవి, ఇవి నెమ్మదిగా ఇంకిపోయాయి మనసులో...ఇప్పుడు బడిలో ఇవి రాస్తున్నారా?..

అభ్యాసం గురించి తాత మాట, ఏంటో ఈయన్ని తాతగారంటే దూరం పెట్టినట్టు ఉంటుంది, అందుకే ఆప్యాయంగా తాతా అంటాను, చిన్న బుచ్చటం కాదు, చనువు సుమా...
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.
చిన్న మాటలో చెప్పేసేడు కదా!
గువ్వల చెన్నడు 
కుల విద్యకు సాటిరావు గువ్వలచెన్నా!
ఏం ఎందుకనీ? ఎందుకంటే కుల విద్యని తల్లి తండ్రులు తాత,అమ్మమ్మలు, తాత, మామ్మలు,ఆచరించగా,చూస్తూ పెరుగుతాం, ఇదీ అభ్యాసమే.

వీడియోలో అమ్మాయి అన్ని మెలికలు తిరగ్గలిగిందంటే ఎంత సాధన చేసి ఉంటుంది?

ఇలాగే యోగా చిన్నప్పుడు చేశా!పదిహేడేళ్ళ దాకా ఆ తరవాత పొట్టకూటికి సాధనలన్నీ వదిలేశా! అందునా రాత్రి పగలు నిసబు లేని ఉద్యోగం దొరికింది.పెళ్ళైన తరవాత ఇల్లాలు మీ పెద్ద పెళ్ళాం పిలుస్తోంది, వెళ్ళండి, వెళ్ళండి అనేది, ఎంతకాలం వదిలేశా? దగ్గరగా ఏభై ఏళ్ళు. మొన్న కరోనాలో మళ్ళీ గురువు దగ్గర నేర్చుకున్నా ఓనమాలు. సాధన చేస్తూ వచ్చా, రెండేళ్ళనుంచి, కాని ఇదిగో ఒక నలభై రోజుల్నించి మానేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్తైపోయింది. కాలు చెయ్యి సాగటం కష్టంగా ఉంది, సాధన చెయ్యాలి. 

యోగా చేసేవారు ప్రాణాయామం కూడా చేస్తారు సాధారణంగా, నాకు తోచిన చిన్న మాట.ఇందులో ఊపిరి తిత్తులలోకి గాలి పీల్చుకుని వదలిపెడతాం. ఎంత ఎక్కువ సేపు ఊపిరి తీసుకుంటే అంత బాగుంటుందనుకుంటాం. కాని కాదు. మామూలుగానే ఊపిరి పీల్చాలి, కాని నెమ్మదిగా ఊపిరి వదలిపెట్టాలి, దీనికి ఎక్కువకాలం తీసుకోవాలి, ఎంత ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేస్తామో అంత గాలీ మనం తీసుకుంటాం తెలియకనే. అందు చేత సాధన చేయవలసినది ఊపిరి పీల్చడం కాదు,ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేయడమని నా నమ్మకం.ఆ పై మీ ఇష్టం..



5, జనవరి 2022, బుధవారం

కాటరాక్ట్ ఆపరేషన్.

 కాటరాక్ట్ ఆపరేషన్


సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇది పెద్దలమాట. కాని బాగా అశ్రద్ధ చేయబడేదీ కన్నే! 


నేటి రోజుల్లో ముఫై ఏళ్ళకే సుగర్ వ్యాధి కలుగుతోంది, దీని వల్ల వచ్చే అవకరాల్లో కాటరాక్ట్ ఒకటి. ఇది నెమ్మదిగా సంవత్సరాల తరబడి పెరుగుతుంది, నెమ్మదిగా దృష్టిని అడ్డుకుంటుంది. ఒకసారి కాటరాక్ట్ అని తేలితే ఆపరేషన్ తప్పదు, నేడో !రేపో!నాకు ఆరేళ్ళగా ఉన్నట్టు తెలిసింది,కాని అశ్రద్ధ చేసేను, కారణాలనేకం, అందులో భయం ముఖ్యమైనది.

నా అనుభవాలు రాస్తున్నా!

ఒకసారి ఆపరేషన్ కి నిర్ణయించుకున్న తరవాత డాక్టర్ గారితో తారీకు నిర్ణయం చేసుకున్నా! నిర్ణయమైన తారీకుకు ముందు నాలుగు రోజులు కంటిలో మందు చుక్కలు రోజూ నాలుగు సార్లు వేసుకోమన్నారు. రోజుకొక కాప్శూల్ వేసుకుని నాలుగో రోజు మూడు గంటలకి రమ్మన్నారు. అలాచేసి నాలుగో రోజు మధ్యాహ్నం మూడుకు చేరేం.ఒక రూం ఇచ్చారు. విశ్రాంతి తీసుకున్నా, ఆ తరవాత బి.పి,సుగర్,కారోనా టెస్టులయ్యాయి. వాటి ఫలితాలు చూసి కంటికి పరీక్ష చేసి అన్నీ బాగున్నాయి రేపు ఉదయం ఆరుగంటలి రండి, రోజూ వేసుకునే మందులు సమయం ప్రకారం వేసుకోండి, టిఫిన్ సమయానికి చేయండి. అని చెప్పి ఇంటి కెళ్ళి మరునాడు ఉదయమే రమ్మన్నారు.(లోకల్ కనక) ఆపరేషన్ లో ఉపయోగించే ఐ.ఒ.ఎల్ కొనమని రాసిచ్చారు, దాని ఖరీదు పదివేలు,అక్కడే పక్కన కొన్నాం.


మరునాడు ఉదయమే స్నానం అన్నీ పూర్తి చేసుకుని రోజువారీ మందులేసుని టిఫిన్ చేసి ఉదయం ఆరుకి రూంలో చేరాం.ఏడుకి కంటిలో మందు వేసింది, నర్సు.ఎనిమిది తరవాత ఆపరేషన్ చెప్పింది.కంటి రెప్పలపై ఉన్న వెంట్రుకలు తొలగించింది.ఎనిమిదికి ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న సీనియర్ సర్జన్ రూంలో కూచో బెట్టేరు. నాకు ముందు ఒకరున్నారు.ఎనిమిదికి సీనియర్ సర్జన్ మళ్ళీ టెస్ట్ చేశారు, ఒకె ముందుకెళ్ళమంటే నా ముందున్నతన్ని ఆపరేషన్ కి తీసుకెళ్ళారు.

 ఆ తరవాత పది నిమిషాల్లో నాకు పిలుపొచ్చింది. ఒక నర్స్ నన్ను డిసానిజేషన్ రూంలోంచి నడిపించి తీసుకెళ్ళింది. మరో సానిటజెడ్ వరండాలో పీట మీద కూచోమంది.నాకు రెండు మాత్రలిచ్చి వేసుకోమంది. వేసుకున్నా! ఐదు నిమిషాల్లో కొద్దిగా మత్తనిపించింది,(ముందుగానే నాకు ఆపరేషన్ భయం ఎక్కువని, ఆతృతరోగం ఉందని, వినపడదని,రాసిచ్చి విన్నవించుకున్నా,   డాక్టర్ గారికి.)

చిత్రంగా నాలో భయం,ఆలోచన ఏమీలేని శూన్యస్థితి ఏర్పడింది.కుడికాలుపెట్టి థియేటర్ లో అడుగుపెట్టా. నన్ను నర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గరకి నడిపించింది. టేబుల్ మీద పడుకోమన్నారు. టేబుల్ మీద బుట్టలా ఉన్నచోట తలపెట్టి పడుకున్నా. కంటిలో మందు చుక్కలేశారు, కళ్ళమీద గుడ్డలాటిది వేశారు, కళ్ళు కనపడుతున్నాయి.కంటి పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పిగా అనిపించి అబ్బా అన్నా! చేతులు పక్కన పెట్టుకోండన్నారు,ఈ లోగా కంటి మీద లేజర్ ఫోకస్ చేశారు, ఒక బొమ్మ కనపడింది,(ఈ బొమ్మ కితంరోజు సాయంత్రం టెస్ట్ చేసినప్పుడు కనపడింది)మరుక్షణం లేజర్ తొలగించారు, ఏమీ కనపడలేదు, మరుక్షణం ఏదో పెట్టినట్టయింది, కన్ను కనపడింది.మందు చుక్కలేశారు. దూది ఉండ కంటి మీద పెట్టి టేప్ వేశారు నిలువుగా అడ్డంగా కదలకుండా.( దీనికి తీసుకున్న సమయం పది నిమిషాల లోపు ఉండి ఉంటుందని ఊహించా)కొంచం పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పి ఉంది. లేవమన్నారు, నర్స్ నన్ను థియేటర్ నుంచి నడిపించి తీసుకొచ్చి మా వాళ్ళకి  అప్పజెప్పింది.

నన్ను రూం కి తీసుకెళ్ళి పడుకోమన్నారు. టైం ఎంతన్నా! తొమ్మిది దాటిందన్నారు. మరి కాసేపటిలో ఇంటికెళ్ళిపోమన్నారు, మర్నాడు ఉదయం రమ్మన్నారు.   విశ్రాంతి తీసుకోమన్నారు, రాత్రికి నిద్ర పట్టదేమో అని సంశయం చెప్పా,నిద్ర పడుతుందని చెప్పేరు.లిఫ్ట్ లో కిందకి తీసుకొచ్చారు. ఆటోలో ఇంటికొచ్చాం! పదయింది. ఆటో వాళ్ళకి అలవాటనుకుంటా ఎవరూ చెప్పకనే నెమ్మదిగా గతుకుల రోడ్ లో తీసుకొచ్చాడు.ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా, మామూలుగా భోజనం చేసాను.సాయంత్రానికి కంటి నొప్పీ తగ్గింది, హాయిగా నిద్ర పట్టింది.

 మర్నాడు ఉదయం ముఖాన్ని తడి దూదితో తుడుచుకున్నా! స్నానం మామూలుగా చేసాను.హాస్పిటల్ కి చేరాం. నాలాటివారు మరో పది మంది, ఒక హాల్ లో కూచున్నాం,నర్స్ లు కంటి కట్టు తీసేశారు.కంట్లో మందు చుక్కలేశారు, కన్ను కనపడుతోంది.కళ్ళు మూసుకు కూచున్నా! ఈ లోగా నల్లకళ్ళజోడిచ్చి పెట్టుకుని చూడచ్చన్నారు. నల్ల కళ్ళజోడులోంచి లోకం అందంగా కనపడింది. 

ఆనందమానందమాయె!మరి ఆశల నందనమాయె! మాటలు చాలని చోట పాటగ మారిన మాయే! 

డాక్టర్ పరీక్ష చేశారు, బాగుందన్నారు. ఈ కింది జాగ్రత్తలూ తీసుకుంటూ నల్లకళ్ళజోడు వాడుతూ ఇరవైరోజుల తర్వాత రమ్మన్నారు.

నాకు తోచినది ముఖ్యంగా కంటికి శ్రమ వద్దు.ఇన్ఫెక్షన్ కి దూరంగాఉండాలి.ఎక్కువ వెలుగు చూడద్దు.హాస్పిటల్ నుంచి ఇంటి కొచ్చాకా మొదటిరోజు ఇంట్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నా, మర్నాటి నుంచి బయటికెళ్ళినప్పుడు మాత్రం నల్ల కళ్ళజోడు వాడేను.మొదటి మూడు రోజులూ దూదితో కళ్ళు ముఖం శుభ్రం చేసున్నా. నాలుగో రోజునుంచి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కున్నా. ఇరవైరోజుల తరవాత షాంపూతో తలంటుకున్నా! క్షవరం చేయించుకున్నా. గడ్డం మామూలుగానే చేసుకున్నా. టివి.ఫోన్ వగైరాలన్నీ ఇరవై రోజులు వదిలేశా.మొదటి పది రోజులు బాగుందిగాని తరవాత కాలం గడవడం కష్టం అనిపించింది. ధ్యానం చేయడం నేర్చుకున్నా. కాలం గడచిపోయింది, తెలియకనే.ఇక అవసరమైన మైల్స్,మెసేజిలకి రోజూ మనవరాలు సాయంత్రం ఒక గంట సాయపడేది. సమాధానాలివ్వవలసిన చోట నేను చెప్పినట్టు టైప్ చేసి పంపేది, అలా గడిపేశా.

 ఇరవైరోజుల తరవాత హాస్పిటల్ కి వెళ్ళా. రెండు కళ్ళు టెస్ట్ చేశారు. కళ్ళ జోడు రాసిచ్చారు.ఇరవై రోజుల తరవాత వెళ్ళినపుడు ఒక చుక్కల మందు రాసిచ్చారు. అది రోజు ఆపరేషన్ ఐన కంటిలో ఒక చుక్క ఉదయం సాయంత్రం వేయమన్నారు, అది వచ్చినంత కాలం,  వేసుకుంటున్నా! రేపో, మాపో ఐపోతుంది. మూడో రోజు కళ్ళ జోడుతో జీవితం గాటిలో పడింది.రెండు కళ్ళకి జోడి కుదరడానికి కొంత కాలం పడుతుంది. ఆపరేషన్ కన్ను చురుగ్గాను, అప్పటిదాక పని చేసిన కన్ను మందంగా ఉంటాయి.మొదటి మూడు రోజులు నడక మానేశా. ఆ తరవాత నడిచాను. ఆపరేషన్ ఐన రోజునుంచి యోగా మానేశాను. ఆరు వారాల తరవాత మొదలెట్టాను. 

Total cost of operation.Rs24,500.

I.O.L 10,000.

Doctor fees 10,000

Medicines 2,200

Transport 3days 300

karona test 500

Spectacles 1500


డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు. 



3, జనవరి 2022, సోమవారం

మీ నాన్నగారున్నారా?

 మీ నాన్నగారున్నారా?

మీ నాన్నగారున్నారా , నీ అమ్మ మొగుడుగారున్నారా అన్నవి రెండూ తెనుగు వాక్యాలే! రెండిటి అర్ధమూ ఒకటే, కాని మొదటి వాక్యమే వాడతాం, ఏం? అదే సభ్యత, సంస్కారం అన్నారు పెద్దలు.కొంత మందికి సభ్యత సంస్కారం పుట్టుకతోనే వస్తాయి, కొంతమంది లోకం చూసి నేర్చుకుంటారు. కొందరికి నేర్పినా రావు, ఇదే లోకంఅంటే!


ఒక పల్లెలో పుట్టాను, అక్కడే చదువుకున్నా!మరో పల్లె కి దత్తత వచ్చా!నాకు ఊరు కొత్త, మనుషులూ కొత్తే!మా ఇంటికి పక్కనే ఒక హొటలు, తెల్లారుగట్ల నాలుగుకి నమో వెంకటేశా పాటతో మొదలయ్యేదా హొటలు. నాలుక్కే జనంతోకిటకిటలాడిపోయేది.లోపల కాళీ లేకపోతే పక్కనే ఉన్న మా ఇంటి అరుగు హోటల్ కి వచ్చిన వాళ్ళకి విశ్రామ స్థానం.ఉదయం ఏడుగంటలకి స్నానం పూర్తి చేసుకుని వీధరుగు మీద కూచుని పాత ఇంగ్లీషు పేపరు చూస్తూ, కొత్త పేపర్ కోసం ఎదురు చూస్తూ గడిపేవాడిని. 


ఇక ఆ అరుగు మీద జనం లోకం లో ముచ్చట్లు,రాజకీయాలు, పెళ్ళిళ్ళు, ముండ తగవులు ఇలా అన్నీ దొర్లిపోతుండేవి. వూళ్ళో విషయాలన్నీ నాకు చేరుతుండేవి. నేనే సంభాషణలోనూ పాల్గొనే వాడిని కాదు.జనాల మాటలు వింటూ, జనాలని పరిశీలిస్తూ  ఉండేవాడిని.


మాది మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇల్లు, ఆ వీధి చివర ఒకాయన ఉండేవారు. ఆయన తో సైకిలు,గొడుగూ ఎప్పుడూ ఉండేవి. అవి రెండూ ఆయన ట్రేడ్ మార్కు. వారి ఇంటి పేరు చల్లా! ఆయన నోరు విప్పితే చాలు బూతులే వచ్చేవి, తల్లి,పిల్ల, పిన్న,పెద్ద,ఆడ, మగ, కూతురు,కోడలు ఇలా తేడాలేం లేవు.ఎవరితోనైనా బూతులే మాటాడేవాడు, అదీ పెద్ద గొంతుతో. ఆయన మాత్రం మా అరుగు మీద చేరితే, మరెవరూ కూచునేవారు కాదు, లేకపోతే జనంతో కిటకిటలాడుతూ ఉండేవి, మా అరుగులు. ఈయనొస్తే నేను పని ఉన్నటు లోపలికి పోయేవాడిని. ఈయన్ని అందరూ ఇంటి పేరుకి ఉకారం చేర్చి పలికేవారు.

ఒక పెద్దరైతు ఏభై ఏళ్ళవాడు, పొలం వెళ్తూ పలకరించేవాడు.ఏం బాబా అనేవాడు. ఈయన ఆడవారిని అమ్మా అనీ,పెద్దవారిని తల్లీ అనీ, మగవారిని అయ్యా అనే సంబోధించేవారు.వీరిని అందరూ పెదకాపుగారనేవారు, ఏభై ఎకరాల ఆసామీ వ్యవసాయం చేసేవారు. ఆయన కాపుకాదు, కాని ఎప్పుడూ ఎవరినీ పెదనాయుడనిగాని, పెదచౌదరనిగాని పిలవమని అనలేదు.ఒక్కో రోజు వీరితో కలసి పొలం వెళ్ళే వాడిని. ఆయన కార్యక్షేత్రంలో ఆయనను గమనించేవాడిని, మాట తీరు వ్యవహార శైలి వగైరా.ఆయనెప్పుడూ కోపంలో కూడా, సంయమనం కోల్పోయింది చూడలేదు. 


ఆ తరవాత ఒక సెట్టిగారి దగ్గర గుమాస్తాగా చేరా! ఆయన ఎవరినైనా ఏమండి అనే సంబోధించేవారు.ఆ తరవాత ఒక బ్రాకెట్ కంపెనీలో పని చేశా! ప్రతి చోట మనుషుల్ని చదవడం నేర్చుకున్నా! ఇదంతా  రెండు సంవత్సరాల వ్యవధిలో. మనుషుల్ని  చదవడం నేర్చుకోవాలి, అదంత తేలిగ్గాదు.



29, డిసెంబర్ 2021, బుధవారం

చలిగా ఉంది! చలి చలిగా ఉందీ!!

 చలిగా ఉంది! చలి చలిగా ఉందీ!! 


పగలు వేడి  ౩౦డి లోపుంటోంది.ఉదయం 17,18డి, మధ్యాహ్నం 30డి లోపు, నాలుక్కే వేడి 24.21డిలకి తగ్గిపోతోంది.పగలు కూడా ఇంట్లో చలేస్తోంది.చలికి ముణగదీసుకు కూచోడం సరిపోతోంది, చేసే పనిలేదు,చేయగలదీ దేదన్నట్టు ఉంది,దీనికి తోడు బద్ధకం, ఏ పనీ చేయ బుద్ధి కావటం లేదు.పగలు కూడా ఏ.సి వేసుకోవల్సి వస్తూంది. మధ్యాహ్నం భోజనం తరవాత కప్పుకు పడుకుంటే కునుకట్టింది. 


పగటి నిద్రలో మా గీరీశం కనపడ్డాడు.చాలా చెప్పేడు, చెప్పాలంటే బద్దహం గా ఉంది.సంవత్సరం చివరి రోజులకొచ్చాం, బుజ్జమ్మ కనపడిందా?


23, డిసెంబర్ 2021, గురువారం

సిరివెన్నెల-మారదులోకం-స్మృత్యంజలి.

 

సిరివెన్నెల-మారదులోకం-స్మృత్యంజలి.


సిరి వెన్నెల మరి లేదు, కనుమరుగయింది, కాని సిరివెన్నెల కలం బాలు గొంతులో చిరంజీవిగా ఉండిపోయింది.మిత్రుడు చేంబోలు సీతారామ శాస్త్రి అనే సిరివెన్నెల బహుముఖ ప్రజ్ఞా శాలి, అతని పాటలలోనే కొన్ని మచ్చుకి.


మేటనీ పిక్చరుంది బోటనీ లెక్చరుంది దేనికో ఓటు చెప్పరా?

అనగల చిలిపి చెలికాడు.


ఐయాం సారీ అన్నాగా వందో సారి

అని ప్రేయసి చేత అనిపించి, ఏం వంద సార్లు చెప్పాలా అని సన్నగా ప్రియుణ్ణి సాధింప జేయగల కొంటెవాడు. 


మారదు లోకం, మారదు కాలం, ఎవ్వరు ఏమైపోనీ

నిగ్గదీసి అడుగు, నిప్పులతో కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని, మారదు లోకం, మారదు కాలం

అంటూ,  సమాజాన్ని మార్చేసాం,అని, నిప్పులతో కడిగి నిగ్గదీసిన వారెందరు చరిత్రలో లేరు? ఐనా సమాజం మారిందా? లేదు మారదు అని నొక్కి వక్కాణించి చెప్పిన మేధావి. సమాజం మారదు ఎవరు ఏమైపోయినా కాలం మారదు, మారుతుందనే భ్రమలో బతక్కు, నిజాన్ని చూడు అని చెప్పిన విప్లవవాది.


జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. 

సత్యం.ఈ మానవ సమాజం అంతా ఒక కుటుంబం కాని ఎవరి బతుకు వారిదే, ఎవరిచావు వారిదే అనే నిష్టుర సత్యాన్ని సినీ పాట ద్వారా సామాన్యులకి చేర్చగల తాత్వికుడు.


బిచ్చమడిగేవాని నేమి అడిగేది, బూది నిచ్చేవానినేమి కోరేది?

నిందాస్తుతితో శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకునే మార్గాన్ని బోధించినవాడు. కోరికలతో వేగిపోకు, కర్మఫలం అనుభవింపక తప్పదు, ఈ ఉపాధిలో కొత్తగా కర్మఫలాన్ని పొగేసుకోకు, బూది అంటే వైభమనే మాట చెప్పి తనలో కలుపుకునే వైభవాన్ని ఇచ్చేవాడిని ఇంకా ఏమడుగుతావన్న వేదాంతి.వేదాంతాన్ని చినచిన్న మాటలలో సినీ గేయంలో ప్రజలకి చేరువజేయగల నేర్పరైన మిత్రుడు నిజంగానే బోళా శంకరుడు.కుడుము చేతికిస్తే పండుగనుకునేవాడు.


నిజమే నిజంగానే భోళా శంకరుడు కనుకనే ఏకాదశి మరణం ద్వారా నిరూపితమయింది. ఏకాశి మరణం ద్వాదశి దహనం అన్నవి పుణ్య ఫలశేషాలని పెద్దల మాట.మరో మాట కూడా చెబుతుంది లోకం, ఎమీ తెలియనివానికి ఏకాశి మరణం, అన్నీ తెలిసినవానికి ఆమావాస్య మరణం, అని.మిత్రుడు ఏకాదశి రోజు ఇహలోక యాత్ర ముగించి పరలోకానికి చేరిన వాడు వైకుంఠ ప్రాప్తి చెందినట్టుగానే భావిస్తాను.


ఎంతచెప్పినా మిత్రుడు లేనిలోటు తీర్చరానిదే. మిత్రుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్మృత్యంజలి ఘటిస్తున్నాను.


---------------------------------

మిత్రుని గురించి ఎంత చెప్పినా కొంత మిగిలుంటుంది.మిత్రుని మరణ వార్తను నాకుటుంబ సభ్యులు చేరవేశారు నాకు, ఆ తరవాత మిత్రులు విన్నకోటవారు తెలియజేశారు.కొంతకాలంగా కంటికి విశ్రాంతినివ్వడం కోసం అన్ని  మీడియాలనుంచీదూరంగా ఉన్నాను. ఫోను కంప్యూటర్లు వాడటం లేదు, చదవను కూడా మానేశాను. సృత్యంజలి సమర్పించడం ఆలస్యమయింది.


14, నవంబర్ 2021, ఆదివారం

చెఱువైన వరి చేను.


 తూర్పు గోదావరి జిల్లాలో గతవారంగా చిన్న చినుకు పడుతూనే ఉంది. నేటికీ తగ్గలేదు,ఒరుపివ్వ లేదు. కోసిన చేలలో పనలు తేలుతున్నాయి. కోయవలసిన చేలు కోయక్కర లేదు, కుళ్ళుతున్నాయి, నీట మునిగి. రైతు పూర్తిగా మునిగిపోయాడు. కోసిన చేను చెఱువైతే గుండె చెఱువైన  ఒక రైతు వ్యధ.

రాబోయేది పున్నమి సముద్రం పోటు మీదే ఉంటుంది. నీరు లాగదు, చేళు పూర్తిగా కుళ్ళిపోవడం ఖాయం.

23, అక్టోబర్ 2021, శనివారం

ఎవరు చేసిన కర్మ

 



ఎవరు చేసిన కర్మ

 వారనుభవింపకా 

ఏరికైనా తప్పదన్నా

ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవింపక తప్పదన్నా

అనుభవించుట తథ్యమన్నా.


కరోనా పుట్టింట కథాకళీ చేస్తోందని వార్త.


పుట్టింటి వారి బంధులింటా నిన్నటిదాకా కథాకళీ చేసినట్టుంది.


లోకువ వాళ్ళని చూసి నవ్వకు.

నవ్విన నాపచేను పండింది(ట).


3, అక్టోబర్ 2021, ఆదివారం

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు .

 అందితే జుట్టు లేకపోతే కాళ్ళు .

ఇదొక నానుడి. తరచుగానే చెబుతుంటారు. దీని గురించి చూస్తే చిన్న కత భాగవతంనుంచి.
బహుశః ఈ సంఘటన నుంచే ఈ నానుడి పుట్టిందేమో!

శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు హస్తినాపురం వెళ్ళి, దుర్యోధనుని కూతురైన లక్షణ అనే కన్యను, రాక్షస వివాహం చేసుకోడానికి తీసుకొస్తుంటే కౌరవులు అడ్డుకున్నారు. (రాక్షస వివాహం అంటే కన్యను, కన్య బంధువుల ఇష్టానికి వ్యతిరేకంగా తీసుతెచ్చుకుని వివాహం చేసుకోవడం.భారతం, నాటి సమాజం ఎనిమిది రకాల వివాహాలను అనుమతించినట్లు చెబుతోంది)


“కోరి సుయోధను కూతురి సర్వలక్షణములు గల్గి లక్షణ యనంగ
మహినొప్పు కన్యకామణి వివాహంబున జక్రహస్తుని తనూజాతు డైన
సాంబుడు బలసాహసమున నెత్తుకపోవ గౌరవు లీక్షించి కడగి క్రొవ్వి
పడుచువాడొక డదె బాలిక గొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి

ఇట్టి దుర్మదు గయిముట్టి పట్టి తెచ్చి
జనులు వెఱగంద జెఱబెట్టి యుంతుమేని
యదువులు మనల నేమి సేయంగ గలరొ
యనుచు గురు వృద్దజనముల యనుమతమున….భాగవతం….స్కం. ౧౦ ఉత్తర భా….౫౫౬

దుర్యోధనుడి కూతురు లక్షణ అనే పేరుగల కన్యను శ్రీ కృష్ణుని కొడుకైన సాంబుడు వివాహం చేసుకోడానికి తీసుకొస్తూ ఉంటే, కౌరవులు చూసి, కుఱ్ఱాడొకడు పిల్లని తీసుకుపోతున్నాడు, ఇటువంటి వాణ్ణి పట్టుకుని, పెద్దల అనుమతితో, బంధిస్తే యాదవులేమి చెయగలరో చూద్దామనుకున్నారు.”

ఇలా అనుకుని “దుర్యోధనుడు, కర్ణుడు,శల్యుడు, భూరిశ్రవ, యజ్ఞకేతులు బయలుదేరి సాంబుడిని అడ్డుకున్నారు. సాంబుడు వీరత్వంతో యుద్ధం చేసేడు అందరితో, వీణ్ణి ఇలా గెలవలేమని అందరూ కలిసి ఒక్క సారిగా దాడి చేసి లక్షణతో సహా పట్టుకున్నారు.” “ఈ సంగతి నారదుని ద్వారా యాదవులకి తెలిసింది.రాజు ఉగ్రసేనుని అనుజ్ఞతో యుద్ధాని బయలుదేరుదామన్నారు యాదవులు. అంతలో బలరాముడు అడ్డుపడి కౌరవులు మనకు బంధువులు వాళ్ళతో గొడవ వద్దు అని ఆపేడు. అప్పుడు యుద్ధం చేద్దామన్నావాళ్ళతో కూడా కలిసి కరిపురం చేరి, కోట బయట విడిసి ఉద్ధవుడిని దూతగా పంపేడు, బలరాముడే వచ్చేడని కౌరవులు బయలుదేరి వెళ్ళి అర్ఘ్య, పాద్యాలిచ్చి గౌరవించారు. ఆప్పుడు బలరాముడు దుర్యోధనుని చూసి, మా రాజు ఆజ్ఞ ప్రకారం వచ్చేం, మీరందరూ కలిసి, ఒక్కణ్ణి చేసి సాంబుడిని బంధించడం తప్పు, ఐనా సరే మా రాజు బంధుత్వం తలచి ఆ తప్పు సైరించేడని చెప్పేడు. అందుకు సుయోధనుడు,

అనుమాటలు విని కౌరవ జననాయకుడాత్మ గలగి చాలు బురే! యే
మనగలదు కాలగతి చక్కన గాలం దొడుగు పాదుకలు దలకెక్కెన్…..భాగ…దశ స్కం.ఉత్తర…౫౭౨

ఆ మాటలకి సుయోధనుడు కోపించి కాళ్ళకి తొడుక్కునే చెప్పులు తలమీదపెట్టుకున్నట్లుంది, కాలం, ఏం చెప్పను, యాదవులతో సంబంధం సఖ్యం చాలు,భీష్ముడు, ద్రోణుడు,కర్ణుని లాటి వీరులకు దొరికినవాణ్ణి, దేవేంద్రుడయినా విడిపించగలడా, వృధా మాటలెందుకు అంటూ దుర్భాషలాడుతూ దిగ్గునలేచి మందిరానికి వెళ్ళిపోయాడు.”

ఇప్పుడు బలరాముడికి కోపం వచ్చి “రాజ్యవైభవ మధాంధుల మాటలు విన్నారు కదా అని కూడా వచ్చిన వారితో అని” ఇంకా ఇలా అన్నాడు.

“శ్రీ మధాందులు సామముచేత జక్క
బడుదురే యెందు బోయడు పసుల దోలు
పగిది నుగ్ర భుజావిజృంభణ సమగ్ర
సుమహితాటోప మనిలోన జూపకున్న….భాగ…..దశ.స్కం.ఉత్తర.భా….౫౭౬

డబ్బు మదంతో కొట్టుకుంటున్నవాళ్ళకి మంచిమాటలు పనికిరావు, బోయవాడు పసువుల్ని తోలినట్లు, యుద్ధంలో బుద్ధి చెప్పాలిసిందే, అని, కృష్ణుడు, మిగిలినవారిని రావద్దని వారించి వచ్చాను,దేవ దేవుడయిన కృష్ణుని కాదంటారా” అంటూ,ఇంకా

“తామట తలపగ దలలట యేమట పాదుకలమట గణింప రాజ్య
శ్రీ ముదమున నిట్లాడిన, యీ మనుజాధముల మాటలేమనవచ్చున్….భాగ…దశ.స్కం. ఉత్తర….౫౮౧

తమరేమో తలలా మేమేమో చెప్పులమా! రాజ్యమదం తో మాట్లాడే వాళ్ళని ఏమనగలమని, భూమి మీద కౌరవులను లేకుండా చేస్తానని, చేతిలో నాగలి హస్తినాపురానికి సంధించి గంగలో కలిపేసే ప్రయత్నం చేస్తూంటే నగరం అతలాకుతలమై పోయింది.” అప్పుడు …” దానికి ప్రతీకారంబు లేమిని గలవళంబున భయాకుల మానసులయి, పుత్ర మిత్ర కళత్ర, బంధు, భృత్య, పౌరజన సమేతంబుగా భీష్మ సుయోధనాది కౌరవ్యులు, వేగంబున నతని చరణంబులు శరణంబుగా దలంచి, సాంబునిం గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబులతో దోడుకవచ్చి దండప్రణామంబులాచరించి, కరకమలంబులు మోడ్చి, యిట్లనిరి…..”..భాగ..దశ.స్కం.ఉత్తర….౫౮౪

బంధు,మిత్ర, భార్యలతో సహా అందరూ చీని చీనాంబరాలూ పట్టుకుని సాంబుని లక్షణను తీసుకువచ్చి బలరాముని కాళ్ళు పట్టుకుని రక్షించమని వేడుకుని, సాంబుని, లక్షణ సహితంగా లక్షణంగా అప్పజెప్పి శరణు వేడేరు. బలరాముడు కొడుకుని, కోడలిని తీసుకుని తమ రాజ్యం చేరుకుని, అక్కడి వారికి జరిగిన కధ చెప్పేడు”. అందుకే ఇప్పటికీ హస్తినాపురం దక్షణం వైపు కొద్ది ఎత్తుగా ఉంటుంది, బలరాముడు నాగలితో పెళ్ళగించడానికి ప్రయత్నించడం చేత.

బాజాభజంత్రీలతో పెళ్ళికి విందుభోజనానికి పిలిస్తే, కాదని, మూకుడు పట్టుకుని పెళ్ళివారింటికి పులుసుకి వెళ్ళిందని సామెత.బలరాముడు సౌమ్యంగా సాంబుని, లక్షణను వదిలిపెట్టమంటే కాదని టెక్కుపోయి, చెప్పులలాటివారని హేళనచేసిన నోటితోనే, కొద్ది సేపటిలోనే, రక్షించమని కాళ్ళు పట్టుకోవడం ఏమంటారు? దీన్ని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోడమే అంటారుగా, నిజంగా జరిగింది కూడా ఆదే కదా.

28, సెప్టెంబర్ 2021, మంగళవారం

చి...ప్ప! కొబ్బరి చి...ప్ప!!



లప్ప లప్పనియేవు 
లప్పనాదనియేవు
లప్ప నీ దెటులౌను చిలకా.....అయ్యో!
కొబ్బరి చిప్పయే నీ గతి చిలకా

లప్పయే సుఖమనీ 
లప్పయే బతుకనీ 
లప్పెనక పోయేవు చిలకా......ఖర్మ!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

చిప్ప చిప్పనియేవు
చిప్పకాదనియేవు
చిప్పయే నీ గతీ చిలకా...అవునూ!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా

కాని కాలామొచ్చి
కళ్ళు మూసుకుపోయి
నీ బతుకు తెలియవే చిలకా...వహ్వా!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా
 
ఒళ్ళు పెరిగీ పోయి
మెడ తిప్ప లేకుంటె
చిప్పయే నీగతీ చిలకా...నిజమే!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
కళ్ళు మూసుకుపోయి
పిచ్చెక్కినప్పుడూ చిలకా...రామరామ!
కొబ్బరి చిప్పయే నీగతీ చిలకా

ఒళ్ళు పెరిగీ పోయి
బుఱ్ఱ పెరగాకుంటే
అప్పుడూ నీగతీ చిలకా...అయ్యయ్యో!
కొబ్బరి చిప్పలే నీ గతీ చిలకా

లప్పెక్కువైతేను
అతిమూత్ర వ్యాదొస్తె
చిప్పయే నీకు గతి చిలకా...శాభాషూ!
కొబ్బరీ చిప్పయే నీకు గతి చిలకా

చిప్పనూ కాదనీ 
లప్ప సంపాదిస్తే
లప్ప నీ వెంటవదు చిలకా........అయ్యో!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా

కొడుకులూ కోడళ్ళు తన్ని తగిలినవేళ
ఆత్మీయులెవ్వరూ ఆదరించని వేళ
రామ నామమే  నీగతీ చిలకా....అంతే! అంతే!!
కొబ్బరిచిప్పలే నీ గతీ చిలకా

లప్పకాదనుకునీ
చిప్పయే బతుకంటె
తిప్పక్కడున్నదే చిలకా...నిజమా?
నీ బతుకు తిప్పక్కడున్నదే చిలకా

కాని కాలంలోన
కట్టెలే నీ తోడు
కాని కాలమొచ్చి కట్టెలే లేకుంటె
చిప్పలే నీ గతీ చిలకా

కొబ్బరి చిప్పలే నీగతీ
మొద్దులే నీ గతీ
డొక్కలే నీ గతీ
కమ్మలే నీ గతీ
ఆకులే నీ గతీ
గులకలే నీ గతీ
పుచ్చెలే నీగతీ
దయ్యపు పుచ్చలే నీ గతీ చిలకా

దయ్యపు పుచ్చలూ లేకుంటె
పాతరే నీగతీ చిలకా
నిలువు పాతరే నీ గతీ చిలకా
ఉప్పు పాతరే నీ గతీ చిలకా

4, సెప్టెంబర్ 2021, శనివారం

రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు/వఱడు

 రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు/వఱడు

 ''రెంటికీ చెడ్డ ఱేవడు'' అన్నది జన సామాన్యంలోని మాట, కాని ''రెంటికీ చెడ్డ వఱడు'' అన్నది అసలు మాటేమోనని నా అనుమానం.

ఇదొక నానుడి. దీనికో చిన్నకత.

రేవడు/ఱేవడు అనే పదాలికి రజకుడు అని అర్ధం. రెంటికీ  చెడడం ఏమనేదే మిమాంస.


రెంటికీ చెడ్డ ఱేవడు/రేవడు

ఒక రజకుడు బట్టలుతికేందుకు ఒక ఏటి దగ్గరకు పోయి, బట్టలు తడిపి గూనలో వేసి ఉడకబెట్టేడు. ఉడికిన బట్టలని తీసి ఉతకేడు, వాటిని ఆరేశాడు, ఏటి గట్టు పైన. మిగిలినబట్టలు ఉతుకుతున్నాడు. ఎండ మిటమిటలాడుతోంది. ఉన్నట్టుండి, గాలి చల్లగా వీచింది. అంటే దూరంలో వర్షం పడుతోందని సూచన కలిగింది. వర్షం పడితే కొన్ని ఏర్లు క్షణాలలో ఉధృతంగా ప్రవహిస్తాయి, అదీ రజకునికి తెలుసు. కాని అంత తొందరగా ఏరుకి నీరు వస్తుందని ఊహించక ఉపేక్ష చేసి బట్టలు ఉతుకుతూనే ఉన్నాడు. ఈ లోగా గాలి పెరిగింది,సుడిగాలయింది. ఆరేసిన బట్టలు ఎగిరిపోనారంభించాయి. వాటికోసం పరుగెట్టేడు, ఏటి గట్టు పైకి. ఈ లోగా ఏరు గలగలమంటు ఉధృతంగా వచ్చి పడిపోయింది. చూస్తుండగానే సుడిగాలి ఆరేసిన బట్టలెత్తుకుపోయింది, ఉతుకుతున్న బట్టల్ని ఏరు పట్టుకుపోయింది. పాపం! ఉత్తి చేతులతో రేవడు మిగిలిపోయాడు. అలా ఆరేసిన బట్టలకీ చెడ్డాడు, ఉతుకుతున్న బట్టలకీ చెడ్డాడు, అదేరెండిటికీ చెడడం.


రెంటికీ చెడ్డ వఱడు

మరో కత. రేవడు అంటే రజకుడు, వఱడు అంటే నక్క అని అర్ధం.వరుడు అంటే పెళ్ళి కొడుకు.  కత పంచతంత్ర కథలలోదని గుర్తు. 

ఒక వేటగాడు, వేట కోసం పొంచి ఉన్నది, ఒక నక్క చూచింది. వేటగాడికి వేట పడితే ఏమైనా కొద్దిగా తనకి ఆహారం దొరక్కపోతుందా! అని, నక్క దాపునే పొంచి ఉంది. వేటగాడు విల్లు ఎక్కుపెట్టుకుని ఉండగా అనుకోకుండా పులి తారసపడింది. బాణం వదలకపోతే పులి మీదబడి చంపుతుంది, తప్పక బాణం వదిలేడు, పులికి ఆయుస్థానం లో ములుకు తగిలింది. కాని పులి ముందుకు దూకి వేటగాడిని ఓ పెట్టు పెట్టి కూలిపోయింది. పులి పెట్టుకి వేటగాడూ కూలిపోయాడు, పులీ కూలిపోయింది. జరిగిన హటాత్ సంఘటనకి నక్క నివ్వెరపోయి తేరుకుని,తన అదృష్టాన్ని అభినందించుకుంది. పులి శరీరాన్ని ఒక వారం తినచ్చు,వేటగాడి శరీరాన్ని మరో వారం తినచ్చు అని లెక్కలేసుకుంది. ఎవరి నుంచి మొదలు పెట్టాలీ అనేది తేల్చుకోలేకపొయింది. వేటగాని విల్లు కనపడింది.   దానికున్న నారి బలంగా కనపడింది. ఈపూటకి ఈ నారిని భోంచేస్తాననుకుని, ఎక్కుపెట్టి ఉన్న వింటి నారిని కొరికింది. నారిని కొరకడంతోనే ఎక్కుపెట్టిన విల్లు కొన విసురుగా తగిలి నక్క కూడా చనిపోయింది. లోభత్వంతో రెంటికీ చెడి నక్క ప్రాణాలే కోల్పోయింది. అదే రెంటికీ చెడ్డ వరడు కత.


3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఇంతేరా ఈ జీవితం

 


ఇంతేరా ఈ జీవితం 15.8.21 తేదీని ఎండిన మొక్క 


1.9.21 తేదీనాటికి చిగిర్చి పూలు పూసిన మొక్క 

ఇంతేరా ఈ జీవితం  తిరిగే రంగుల రాట్నము. కష్టం నిలిచిపోదు, సుఖమూ నిలిచిపోదు.కాలమూ ఆగదు, ఎవరికోసమూ. జరిగినది విధి, వగచి ప్రయోజనం శూన్యం, రోజులు సంవత్సరాలూ లెక్కపెట్టుకోడం తప్పించి, ఇదీ తప్పనిదే.  

Past is perfect

Present Continuous.

Future Tense.

30, ఆగస్టు 2021, సోమవారం

అమ్మా తమ్ముడు మన్ను తినేను...


https://youtu.be/YpTb3VvqQ5Q

అమ్మా తమ్ముడు మన్ను తినేను...
మన్నేటికి భక్షించెదు ? మన్నెందుకు తిన్నావయ్యా? మన ఇంట తినడానికేం లేదా అడిగింది యశోద.

అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరిమాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ
రి మ్మార్గము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మాదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే...

అమ్మా మన్ను తినడానికి నేను చిన్నపిల్లాడినా,వెఱ్ఱివాడినా?వీరి మాటలు నమ్మకు. నేను మన్ను తిన్నానంటే నువ్వు నమ్మేసి నన్ను కొడతావు చూడు, అలా నన్ను నీ చేత కొట్టించాలని వీరి పన్నాగం. కావాలంటే నా నోరువాసన చూడమ్మా? అని నోరు తెఱచి  నిలబడిన కన్నయ్య నోట్లో అమ్మకి కనపడిందేంటీ? సర్వజగత్తూ.  చూసిన తల్లి ఏమనుకుంది?

కలయో వైష్ణవ మాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్..

కలగంటున్నానా? మాయా? మరో ఆలోచన చేస్తున్నానా? నిజమా? ఆలోచించలేకపోతున్నాను. అసలు నేను యశోదనేనా?వేరే లోకంలో కాని ఉన్నానా? చిన్ని బాలుని ముఖంలో ఈ విశ్వమంతా కనపడటానికి కారణం ఏంటని ఆశ్చర్యపోయిందా తల్లి. 

ఒకప్పుడు ఆటపాటలతో మట్టి తినడం కూడా ఒక బాల్య చేష్ట. నేడు మట్టి కనపడటం లేదు కనక మట్టి తినడం, మట్టిలో ఆడుకోవడం, మట్టిని ఆనందంగా ఒంటినిండా పట్టేలా దొర్లడం అనేది వికృత చేష్ట, ఏం చేస్తాం కాలం మారింది కదా! ఉస్స్.. కాలం మారలేదు, మనుషులే మారేరు...బుద్ధులు మారేయి.

ఒకప్పుడు చద్దెన్నం తింటూ అన్నం పారేసాను. పెంచుకున్న తల్లి తిట్టలేక యశోదలాగానే ”నాన్నా! అన్నం పారేయ కూడదయ్యా!! అన్నం పరబ్రహ్మ స్వరూపం''. అని చెప్పింది. అప్పుడు అర్ధం కాకపోయినా ఆ మాటలు గుర్తుండిపోయాయి. కాలంలో అవగతమయ్యాయి. అప్పుడే మరో మాటా చెప్పింది. ”కరువు కాలం లో అన్నం లేక జనులు మట్టి తినేవారు సుమా" అని. నాకున్న కొద్దిపాటి జ్ఞానం ప్రదర్శించా! మట్టి ఎలా తింటారని? అమ్మ మాట నిజం కాదనుకుని. అప్పుడు అమ్మ వివరంగా చెప్పిందిలా" 

“ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || ”

“ సమస్త ప్రాణులూ ‘ అన్నం ’ నుంచి పుడ్తున్నాయి … అన్నోత్పత్తి ‘ వర్షం ’ వల్ల కలుగుతోంది; ‘ వర్షం ’ ‘ యజ్ఞం ’ వల్ల కలుగుతుంది ; ‘ యజ్ఞం ’ సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతోంది.
Courtesy: pssmovement.org

వర్షం లేకపోతే పంటలేదు. పంట లేక ఆహారం లేదు, అన్నం లేదు. అప్పుడు ప్రజలు గంజి,అంబలి తాగి బతికేవారు. ఆ తరవాత ఆకులు ఉడక బెట్టుకుని తినేవారు. ఆ తరవాత కరువు తీవ్రమైతే రేగడి మట్టి పిసుక్కుని మజ్జిగలో/పెరుగులో కలుపుకుని తాగేవారు, అలా మట్టి తినేవారయ్యా! ఇప్పుడు మనకు అన్నం దొరుకుతోంది అదృష్టవంతులం, అన్నమెప్పుడూ పారెయ్యకూ" ఇది అస్తిగతమైపోయింది, నేటికీ...

అమ్మ చెప్పిన అన్నం పారెయ్యద్దన్న మాట ఆచరించాగాని, మట్టి తింటారన్న మాట, నమ్మలేకపోయాను, మొన్నటి దాకా. 

మనం తీసుకునే ఆహారం మట్టి నుంచి పుట్టినదే! మట్టితో మిగిలిన నాలుగు భూతాలూ సంయోగం చెంది పుట్టేదే అన్నం. అన్నం నుంచే జనులు పుడతారు. అది తిని మనుషులు పెరుగుతారు. అది తిన లేకపోతే మరణిస్తారు. పంచభూతాలూ సంఘటితమైతే జననం, విఘటితమైతే మరణం, ఇంతే ఇది..ఇదే సృష్టి..


 వీడియో చూడండి. హైతీ అనే దేశంలో అన్నం దొరక్క మట్టి తింటున్నారు, ఎలాగో చూడండి...

28, ఆగస్టు 2021, శనివారం

జకార పంచకం

జకార పంచకం

జామాతా జఠరం జాయా జాతవేదా జలాశయః

పూరితేనైవ పూర్యన్తే జకారాః పంచ దుర్లభాః (దుర్భరా)


తృప్తి పడనివారు జకారంతో ఉన్నవారు ఐదుగురు.


ఎంత పూరించినా తృప్తి లేనివారు,

జామాతా ( అల్లుడు):- నిజానికి ఇది నాటి మాటే అనుకుంటున్నాను. 

జఠరం:- ఆకలి, ఎంత తిన్నా పరగడుపే.

జాయా:- పత్ని. ఎంత సంపాదించినా తృప్తి పడనిది, ఏమి చేసినా తృప్తి కానిది.

జాతవేదా:- అగ్ని, ఈయన ఎంతటీవాడంటే, తనను అర్చించేవానిని కూడా కాల్చేస్తాడు, ఎంత తిన్నా తృప్తి లేదు.

జలాశయః:- సముద్రం. ఎన్ని వరదలొచ్చినా నీరంతా సముద్రంలో కి పోయేదే! ఎంతైనా తీసుకుంటుంది కొంచం వెనక ముందులంతే తేడా.


వకార పంచకమని మరొకటి ఉంది. వీరితో పని పడ కూడదుగాని....

27, ఆగస్టు 2021, శుక్రవారం

పెడితే పెళ్ళి

 పెడితే పెళ్ళి లేకపోతే శ్రార్ధం.


ఇది జన సామాన్యంలో ఉన్నమాట. మనకి ఉపకారం జరిగేటట్టు ప్రవర్తించిన వారికి మంచి జరగాలనీ లేకపోతే చెడు జరగాలనీ అనుకోవడంగా చెబుతారు.అసలేమి?


పెడితే పెళ్ళి:- పెళ్ళి ఇంట పదిమంది చెయికడగాలని అనుకుంటారు. అలా తృప్తిగా భోజనం చేసినవారు వధూ వరులను ఆశీర్వదించాలని పెద్దల కోరిక. అటివంటి చోట ఒక యాచకునికి తినడానికే దొరకదా? అదే పెడితే పెళ్ళి. పెళ్ళిరోజు పెడతారు.


ఇక


పెట్టకపోతే శ్రార్ధం:- ఇది నిజం, సమాజంలో ఉన్నది జరుగుతున్నదిన్నూ. శ్రార్ధం అంటే శ్రద్ధగా చేసేది, అంటే తద్దినం, అంటే తత్+దినం. అనగా ఆరోజు, ఏరోజు, ఆ ఇంట పెద్దలెవరో కాలం చేసినరోజు. ఆ రోజుగనక యాచకుడు ఆ ఇంటికి యాచనకొస్తే,ఏమీ పెట్టరు, పైకెళ్ళమంటారు లేదా మళ్ళీ రమ్మంటారు, లేదా ఈరోజు తద్దినం అని చెబుతారు. అంటే ఇప్పుడు వీలు కుదరదని చెప్పడం. కాలం చేసిన వారికి అర్చన పూర్తి కాకుండా ఇతరులెవరికి ఏమీ పెట్టరు. ఇదీ లోకంలో ఉన్న ఆచారం. తద్దినాన్ని తిథి అని కూడా అంటారు.ఏరోజూ సూర్యోదయానికి ఉన్న తిథిని ఆరోజు  తిథిగా చెబుతారు, కాని తద్దినానికి తిథి ఐతే మాత్రం ఏరోజు అపరాహ్నానికి పోయినవారి తిథి ఉంటుందో ఆరోజే తద్దినం పెట్టాలి.


ఇదీ పెడితే పెళ్ళి పెట్టకపోతే శ్రార్ధం కత.

26, ఆగస్టు 2021, గురువారం

కన్యా వరయతే రూపం…

 కన్యా వరయతే రూపం…

కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా ధనం
బాంధవా కులమిఛ్ఛంతి
మృష్టాన్నమితరే జనాః.

ఇది పూర్వ కాలంలో చెప్పిన మాట. ఏంటిటా? కన్యా వరయతే రూపం, ఇది తెలుస్తూనే ఉంది, నేటి కాలానికి కూడా అమ్మాయి ముందు చూస్తున్నది, కాబోయే వాడు అందగాడేనా? అని. ఇది అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మారని సత్యం. ఆత్మ సౌందర్యమే అసలు సౌందర్యమన్న మాట తెలిసేటప్పటికి చేతులు కాలుతున్నాయి. ఆ వయసులో ఆలోచన అలాగే ఉంటుంది, అది ప్రకృతి సిద్ధమైన ఆకర్షణ కనక. తరవాతది మాతా విత్తం, ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం, అప్పుడూ, ఇప్పుడూ కూడా. తల్లి అనగా కన్యా ప్రదాత భార్య, కాబోయే అత్తగారు, తన అల్లుడికి ఉన్న సంపాదనా మార్గాలు, రాబోయే, లేక ఉన్న ఆస్థిపాస్థులు, అల్లుడు అమ్మాయికి పెట్టబోయే నగలు, నాణ్యాలు, ఇంటి వస్తువులు, తన కూతురు అనుభవించబోయే సుఖ, భోగ, సంతోషాలగురించి ఆలోచిస్తుందట, అందుకే మాతా విత్తం అన్నారు.  ఇప్పటికి ఇందులో మార్పు రాలేదు, ఇక ముందుకూడా రాదు. “పెళ్ళి సంబంధం చూసొచ్చానోయ్! మనమ్మాయికి, కలిగినవారు, బలగం ఉన్నవారు, సరసులు” అంటే. ” అది సరేగాని అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు, ఇతని వాటా కొచ్చే ఆస్థి ఎంత? ఇతని సంపాదన పెరుగుతుందా? జీతమేనా పైన గీతం కూడా ముడుతుందా” ఇదీ ప్రశ్న, తల్లినుంచి వచ్చేది. ఆ తరవాతది పితా ధనం, ఇదేంటీ, తల్లి విత్తం చూస్తోందిగా అని అనుమానం రావచ్చు, విత్తానికి ధనానికి తేడా ఉంది. తండ్రి చూసేది ధనం కదా! అది అభిమానధనం, పౌరుషధనం, మరి ఇతరమైన ధనాలు అనగా విద్య వగైరా చూస్తాడు. ఇది కూడా నేటి కాలానికీ నిజమే, అబ్బాయి చిన్న ఉద్యోగం లో ఉన్నాడని అనుకోవద్దు, అతనికి పెద్ద ఉద్యోగానికి, సంపాదనకి తగిన హంగులున్నాయి, వృద్ధిలోకి వస్తాడు అన్నది చూస్తాడట, ఇది తండ్రి ముందు చూపు. ఇది కూడా నిజమే ఇప్పటికీ.  బాంధవా కులమిఛ్ఛంతి, కుర్రాడి తల్లి తండ్రులు తమ కులం అనగా తమ కట్టుబాట్లలో వారేనా కాదా, రేపు ఆ ఇంటివారితో సంబంధ బాంధవ్యాలు నెరిపేసావకాశం ఉందా, ఇవి చూస్తారట, తోటివారు.  ఇది కూడా నేటికీ సత్యమే.

ఇక చివరిది మృష్టాన్నమితరే జనాః పప్పన్నమే పెడతాడా? ఇంకా ఘనంగా చెస్తాడా, పెళ్ళి? మొన్ననెవరో పెళ్ళిలో అరవైనాలుగు పదార్ధాలు పెట్టేరు, ఈయన అంతకంటే ఎక్కువ చేస్తాడా, తక్కువ చేస్తాడా అని చూస్తారట.  చిప్పలో కూడెట్టినా, తిని వచ్చి “అహా! ఏం గొప్పగా చేసేడండి పెళ్ళి” ఆంటారు. ఇది కూడా నిజమే నేటి కాలానికి కూడా. ఇంక తేడా ఎక్కడండీ అని కదా మీ ప్రశ్న.

నేటి కాలంలో అమ్మాయి తన వరుణ్ణి తనే ఎంచుకుంటున్నప్పుడు, అంటే గాంధర్వ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నపుడు, అమ్మాయే తల్లి తండ్రి, ఇతర బంధువులు చేయవలసిన పనులు చేసుకుంటూ ఉంది, తన పనితో, అనగా కన్యా వరయతే రూపంతో. నిజంగా నేటి అమ్మాయి ఎంత బాధ్యత తీసుకుంటూ ఉంది చెప్పండి. ఇదంతా చెప్పిన మాట వినకపోడంగా పరిగణించుకుంటే ఎలా? నేటి అమ్మాయిలు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోడం తప్పు లేదుకాని, తప్పుడు నిర్ణయాలు తీసుకుని అవస్థలు పడుతున్నారనుకుంటా. శకుంతల తండ్రికి చెప్పక వివాహం చేసుకుని కొడుకుని కని, ఎన్ని అవస్థలుపడి భర్తను చేరుకుందీ తెలుసుగా. అవి సత్య కాలపు రోజులు, మరి ఇప్పుడో…..

(3.1.2013)

25, ఆగస్టు 2021, బుధవారం

కరోనా పొరలు

కరోనా పొరలు


కరోనా ప్రవేసించి సంవత్సరం దాటింది. మొదటి పొరలో జాగ్రత్తలే ఇప్పటికి పాటించమంటున్నారు. ప్రజలు మాస్కులు వేసుకుంటున్నారు గాని దూరం పాటించటం లేదు, ఎక్కడా! 


రెండు పొరలు పూర్తయ్యాయంటున్నారు. దేశం అంతలోనూ కరోనా వెనకబడుతున్నా, కరోనా పుట్టింటివారి బంధువుల ఇంట కథాకళీ చేస్తూనే ఉందిట. చదువుకున్నవారు మేధావులు ఎక్కువగా ఉన్నచోట ఇలా ఎందుకు జరుగుతోందో మరి. స్థానికంగా కూడా విదేశాలతో రాకపోకలు ఎక్కువగా ఉన్న మండలాలలోనే కరోనా ఉన్నట్టు వార్తలు.


రెండొ పొర నడిచింది మూడో పొర తథ్యం అని చెబుతున్నారు, మేధావులు. చిన్నపిల్లలకే ప్రాణాంతకం ఈ పొర అని కూడా చెబుతున్నారు,కాని అన్ని చోట్ల బడులు తీసేస్తున్నారు. ఈ రోజునుంచి పిల్లలు బడికి వెడుతున్నారు. మనవరాలు చెప్పిన ప్రకారం క్లాసులో అరవై మంది ఉంటే మూడో వంతు బడికి హాజరైనట్లు తెలుస్తోంది.


మొదటి పొరలో వ్యాప్తికి పద్నాలుగురోజుల వ్యవధి తీసుకునే  కరోనా, తరవాత పొరకి వ్యాప్తి సమయం తగ్గింది అన్నారు. కాని రాబోయే మూడో పొరలో వ్యాప్తి సమయం అన్నది లేదు, లక్షణాలేం కనపడవు, వస్తే ఇంతే సంగతులని మేధావులు ఊదరకొడుతున్నారు, ఏమో ఏం జరుగునో తెలీదు.ఇక వేక్సీన్ యుద్ధ ప్రతిపదికన వేస్తున్నారు. వాక్సిన్ వేసినవారికి కరోనా వస్తోందంటున్నారు. కరోనా వాక్సీన్ ప్రభావం మూడు నెలలే అని మరొక వార్త. ఇలా రకరకాల వార్తలు ప్రజల్ని ఊదరకొడుతూనే ఉన్నాయి.కరోనా సమయంలో ఎవరికి ఓపికను బట్టి వారు దండుకున్నారు, ప్రజలనుంచి.ఇమ్యూనిటీ డ్రింక్స్ పేరిటా వ్యాపారం జోరుగా నడుస్తోంది.


రెండొ పొరలో హాస్పిటళ్ళలో బెడ్లు లేవు,ఆక్సిజన్ లేదనే మాటలు బలంగానే వినపడ్డాయి, కారణం నువ్వంటే నువ్వనుకునేదీ జరిగిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలలో రెండవపొర నడుస్తోంది. అక్కడ కూడా హాస్పిటల్ సౌకర్యాలు అంతంతగానే ఉన్నట్టు వార్తలు. ఏ దేశమైనా దేశప్రజలందరికి హాస్పటల్ లో బెడ్లు కేటాయించలేదేమో.ఒకవేళ బెడ్లూ ఉన్నా అప్పటికప్పుడు నర్సులు డాక్టర్లు పుట్టుకురావడం సాధ్యమా? ఏమో ఏమి జరగనుందో భగవంతునికే ఎరుక.

24, ఆగస్టు 2021, మంగళవారం

అర్ధ చంద్ర ప్రయోగం.

 అర్ధ చంద్ర ప్రయోగం.

అర్ధ చంద్రుడంటే సగం చంద్రుడనికదూ! సగంచంద్రుని ప్రయోగమేంటి బాబూ! అసలిటువంటి మాటలిపుడు వాడటం లేదు కదూ!! అందుకే అదేంటో తెలుసుకుందాం!!! కుడిచెయ్యి ఎత్తండి,ఎత్తేరా గుప్పిటముయ్యండి, బొటనవేలు పైకి ఉండేలాగానూ! ఆ( ఇప్పుడు నెమ్మదిగా గుప్పిటవిప్పండి…చాలు,చాలు ఇప్పుడు బొటనవేలునుంచి చూపుడు వేలు చేసే ఆకారమెలా ఉంది? అర్ధ చంద్రునిలా ఉందికదూ! ఇప్పుడీ చేతిని ఇలాగే ఎవరి మెడమీదనైనా ప్రయోగిస్తే దాన్నేమంటారు? అర్ధ చంద్రప్రయోగం అనికదా. అంటే ఏంటిటా? అర్ధ చంద్రప్రయోగం అంటే మెడపట్టి గెంటెయ్యడం!!! ఆ( అదా! ఆశ్చర్యపోయారా!! అవాక్కయ్యారా!!!

చంద్రహాసం.

చంద్రహాసమంటే చంద్రుని నవ్వు కదా! కాదు, మరేంటీ అని అనుమానం. చంద్రహాసం అంటే చాలా పదునైన కత్తి అని అర్ధం. మరీ అర్ధం ఎందుకొచ్చిందో తెలీదు. చంద్రహాసుడు అంటే పదునైనకత్తిలాటి కుర్రాడు అని అర్ధం 🙂 చంద్రహాసిని అని పేరు లేదు మరెందుకో తెలీదు గాని హాసిని,సుహాసిని,పేర్లయితే ఉన్నాయి కాని చంద్రహాసిని మాత్రం లేదు 🙂 . కత్తిలాటి అమ్మాయికి పేరులేదా! లేకేం వాడకంలో లేదంతే! అది జాణ, తెలివైన,అందమైన అమ్మాయిని జాణ అనేవారు.

నలభైయవ సంవత్సరం.

నలభయ్యో సంవత్సరం వచ్చిందీ అంటారు. అంటే పరాభవం జరిగిందీ అని. పరాభవానికి నలభయ్యో సంవత్సరానికి సంబంధం ఏంటీ? తెనుగు సంవత్సరాలు ప్రభవనుంచి మొదలయి అక్షయతో ముగుస్తాయి కదా! వరసగా లెక్కెట్టుకుంటూ వెళ్ళండి సంవత్సరాలు, ఆ( ఆగండి నలభై దగ్గరకొచ్చేటప్పటికి ఏ పేరొచ్చిందీ! పరాభవ కదా! అదీ సంగతి. నలభయ్యో సంవత్సరమంటే జీవితంలో సగానికి పైన జరిగిపోయినట్టు లెక్కా! ఇకనుంచి జీవితంలో ప్రతి నిత్యమూ చూసేవి పరాభవాలే అని…

తారతమ్యాలు.

తారతమ్యాలేంటీ? తారతమ్యాలు.  లేవుటయ్యా? అంటే తేడా లేదుటయ్యా అని, అలగే తారత్మ్యాలు చూడకుండా పని చేస్తున్నాం కదా అంటే తేడా చూడకుండా పని చేస్తున్నామని అంటాం. మరీ తారతమ్యాలేంటీ? ఇవి తారతమ్యాలు. కాదు ‘తరము’ ‘తమము’ లు. అంటే కష్టము,కష్టతరము, కష్టతమము, ఇలా ఈ మాటలలో మొదటివానిని తీసేసి వాడుకలో తారతమ్యాలుగా వాడేస్తుంటాం…

In English as more and most used before the adjectives as difficult, more difficult,most difficult. The degrees of comparison Comparative and Superlative.

(17.2.2016)

23, ఆగస్టు 2021, సోమవారం

ఆషాడమాసం-ములగాకు

 


ఆషాడమాసం-ములగాకు


కరోన పుణ్యామా అని బయట కాలు పెట్టింది లేదు, డాక్టర్ దగ్గరికి,నెలకోసారి తప్పించి. వారానికోసారి పక్క దోడ్లో ములగాకు కోసమూ.నడక పెరట్లొనే కానిచ్చేస్తూంటే గేటు తీసి బయటకు వెళ్ళే పనే కనపడటం లేదు.మొన్న ములగాకు కోసం బయలు దేరా! ములగ చెట్టుకి కరంటు వారు క్షవర కళ్యాణం చేసినట్టుంది, కిందకి అందే కొమ్మలూ కొట్టేసారు.కర్రతో ప్రయత్నం చేసినా ఆకు అందేలా లేకపోయింది. అప్పుడు రెండు వీధుల అవతల కిందకి అందేలా ఉన్న ములగ చెట్టు గుర్తొచ్చి, నెమ్మదిగా అడుగులేశా.ములగ చెట్టు దగ్గరో పాకుండేది,అదిలేదు,చెట్టు గుర్తు పట్టేలా లేదు. ఈ చెట్టుకు కూడా క్షవర కళ్యాణం అయిపోయింది, కొమ్మలందేలా లేవు. కర్రతో సాధ్యం చేసి ములగాకు కోస్తున్నా. 

''ములగాకెందుకూ?'' అని వినపడింది.

''ములగాకు పప్పులో వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు'' అంటూ చూశా! తెలిసినవారు.

''ఆషాఢం వెళ్ళిపోయింది కదండి'' అన్నారు.

''ఆషాఢంలోనే తినాలని కాదు, ఎప్పుడూ తింటూనే ఉండాలి, ఆకు కూరలా. తమిళ్ నాడులో తొమ్మిది జిల్లాలనుంచి ములగ ఉత్పత్తులు విదేశాలకి ఎగుమతి చేస్తున్నారట.ఇందులో ఇనుము, విటమిన్లు ఇంకా ఏవో చాలా ఉన్నాయట, నేటి కాలంలో ఇమ్యూనిటీకి చాలా అవసరమట, అందుకే తినాలని'' అన్నా ! నా తెలివి ప్రదర్శిస్తూ.దానికి వారు

''ఒక మాత్ర కొని పడేసుకుంటే సరిపోయేదానికి ఇన్ని తిప్పలా'' అన్నారు

తుళ్ళిపడ్డాను, ఎవరో గుర్తొచ్చారు.

వెంటనే నిజమండి, అలాగే అంటూ నమస్కారం చేసి వచ్చేశా, ములగాకు పుచ్చుకుని.

మౌనేన కలహో నాస్తి.   మనకి తోచదు మరొకరు చెబితే వినం .




21, ఆగస్టు 2021, శనివారం

తనకు కాని పనికి పోరాదు.

 


తనకు కాని పనికి పోరాదు.


చిన్నకథ, పాతదే ,తెలిసినదే.  

ఒకపల్లెలో ఒక పెద్ద చింతచెట్టుకింద ఒక పెద్ద రంపంగొయ్యి.ఆ గోతి మీద పెద్ద పెద్ద దుంగలని కోస్తూ ఉండేవారు.పెద్ద దుంగలు కోసేటపుడు రంపం ఆడడానికి ఒక సీల దిగగొట్టేవారు, కోత చీలికలో, రెండు కోతభాగాలూ కొద్ది ఎడం అయి రంపం అడేందుకు వీలుగా. ఆ చింత చెట్టు మీద ఒక కోతి నివాసం ఉంటోంది. రంపంగొయ్యి అక్కడ ఉండడం కోతికి ఇబ్బంది లేదు. కోతి చెట్టు మీద ఉండడం కోత పనివారికీ ఇబ్బంది లేదు. కోతి రోజూ ఈ కోత పని చూస్తూ ఉంది.రోజూ కోత పనివారు ఉదయమే వచ్చి కోత మొదలెట్టి మధ్యాహ్నం భోజనాలకి వెళ్ళి తిరిగొచ్చి సాయంత్రం దాకా కోత కోసేవారు. ఒక రోజు పనివారంతా మధ్యాహ్న భోజనాలకి వెళ్ళేరు, కోత ఆపి. కోతి చెట్టు దిగి వచ్చి కాసేపు రంపంతోనూ గోతిలోనూ ఆడుకుంది. చివరగా కోస్తున్న దూలం చీలికలో దిగ గొట్టిన సీల పీకడానికి ప్రయత్నించింది అది రాలేదు. దానితో దానిని ఎలాగైనా పీకాలని ఒక కాలు, చీలికలో వేసి మరోకాలు బయటకు వేసి బలంగా సీల పీకింది. సీల ఊడి రావడంతోనె కోస్తున్నదూలం రెండు భాగాలూ దగ్గరకు చేరిపోయాయి. కోతి కాలు చీలికలో చిక్కుకుపోయింది. పనివారు తిరిగొచ్చేసరికి కోతి ప్రాణవాయువులు గాల్లో కలిసిపోయాయి.


కోతికి అవసరంలేని పని సీలను పీకడం, దానిని అనవసరంగా పీకి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే తనకు కాని పనికి పోరాదన్నారు పెద్దలు.




17, ఆగస్టు 2021, మంగళవారం

పెళ్ళికుదిరితే …..

 పెళ్ళికుదిరితే …..

     పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది,పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుందని ఒక సామెత. ఎంతకీ తెగని సమస్యకి అనగా సమస్యల గొలుసుకి ఇది తార్కాణం. ఒక సమస్య తేలితే మరొక సమస్య తేలుతుంది, ఇది అది ముడిపడి ఉంటాయనమాట. ఏదీ జరగదు సమస్య తేలదు. జీవితంలో ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి, ఏమీ చేయలేక,సమస్య పరిష్కరించుకోలేక కాలానికి,దైవానికి దానిని వదిలేసి ఊరుకుంటాం. ఇదిగో ఇటువంటి సమస్యలనే ఎదుటివారు, కావలసినవారమని, రేపి బాధపడుతున్నట్టు నటిస్తూ బాధపెడుతుంటారు. ”ఏం వదినా! మీ అమ్మాయికి పెళ్ళి సంబంధం కుదురుతోందన్నావు, ఏమయిందీ?” ఇది తెలిసి కెలుకుతూ వేసిన ప్రశ్న. ఎద్దు పుండు కాకికి నొప్పా? పెళ్ళి కుదిరితే సామెత గురించి మొదలెట్టి ఇలా పోచుకోలు కబుర్లు చెప్పడం బాగుందా అంటారా? వస్తున్నా! వస్తున్నా!! 🙂 ఈ సామెత గురించి ఒక కత చెప్పుకుందాం,చిన్నదే! సరేనా! ఊ అన్నారా? 🙂

అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక బాగా కలిగిన కుటుంబం, ఒకడే కొడుకు, లేకలేక కలిగాడు. అల్లారు ముద్దుగా పెంచారు, తెలివితేటల మాట దేవుడెరుగుగాని కుర్రాడు మాత్రం ఎర్రగా బుర్రగా పెరిగాడు, జాంపడులా. వయసొచ్చింది, పెళ్ళి చేయాలని నిశ్చయించారు, తల్లితండ్రులు. కలిగిన కుటుంబం, జాంపడులాటి కుర్రాడేమో పెళ్ళి సంబంధాలు విరగబడి మీద పడుతున్నాయి. పెళ్ళిళ్ళ పేరయ్యలు రోజుకో సంబంధం తెస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయికి అమ్మాయి నచ్చకా, అబ్బాయికి అమ్మాయి నచ్చితే వియ్యపురాలికి లాంఛనాలు నచ్చకా, ఇవి రెండూ నచ్చితే వియ్యంకుడికి కట్నం నచ్చకా, ఇవన్నీ నచ్చుబాటైతే అమ్మాయి వంశం గౌరవం హోదా నచ్చకా సంబంధాలు తిరిగిపోతున్నాయి. ఇదెంతదాకా అంటే ఎవరేనా పెళ్ళిళ్ళ పేరయ్య వీరి సంబంధం గురించి ఆడపిల్లవాళ్ళకి చెబితే ”వారికి నచ్చదయ్యా! ఏదో ఒకటి చెప్పి కాదంటా”రనే పేరు పడిపోయేటంతగా.

కాలామాగదుగదా! నడుస్తూనే ఉంది. అబ్బాయికి ఏళ్ళొస్తూనే ఉన్నాయి. ఏమయిందో తెలీదుగాని అబ్బాయి తిక్కతిక్కగా మాటాడుతున్నాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకోడం మొదలెట్టేరు. ఇది తల్లి తండ్రులకీ అనుభవంలోకొచ్చి వైద్యుని దగ్గరకి తీసుకుపోయారు. వైద్యుడు కారణాలు విచారించి వైద్యం చేశాడు. కొంతకాలం గుట్టుగా సాగింది, గుట్టు ఎంతకాలం సాగుతుంది? అబ్బాయికి మతిభ్రమణమని అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం తరవాత వైద్యుడు తేల్చినదేమంటే ”అబ్బాయికి పెళ్ళైతే ఈ మతి భ్రమణం తగ్గుతుందీ” అని. పిచ్చని తెలియడం తోనే పెళ్ళి సంబంధాలు రావడం ఆగిపోయాయి. వైద్యుడు చెప్పింది బాగానే ఉందిగాని, పెళ్ళిళ్ళ పేరయ్యలు తుపాకి దెబ్బకి కూడా కనపట్టం లేదే! పిల్లనిస్తానని వచ్చేవాడూ, చేసుకుంటాననే పిల్లా కనపట్టం లేదే! ఏం చెయ్యాలి? పెద్ద సమస్య ఐపోయింది.

పెళ్ళిళ్ళ పేరయ్యలని సంప్రదిస్తే అంతావిని, ”అలాగే చూద్దాం, నాలుగైదు సంబంధాలకి చెప్పానండీ” అని సాచేస్తున్నారుగాని ఒక్క సంబంధమూ తీసుకురావటం లేదు. పైపెచ్చు, ”ఆ రోజు చిలకలాటి అమ్మాయి,అందగత్తె,చదువుకున్నది, కుర్రాణ్ణి చూసి మోజుపడింది,అని సంబంధం చెబితే, వాళ్ళని డబ్బు లేనివాళ్ళని చులకనగా మాటాడి తిరగ్గొట్టెయ్యలేదూ! ఇప్పుడు పిచ్చాణ్ణి చేసుకోడానికే పిల్ల ముందుకొస్తుందిటా? సంబంధం చూడాలిట, సంబంధం….”అనొకడూ, ”చక్కటి సంబంధం, పిల్ల అందగత్తె,కట్నానికీ లోటు లేదు, అందరికి నచ్చింది కూడా, కాని ఏం చేసేరు, ’పెళ్ళికూతురు మేనత్త తోటికోడలు లేచిపోయిందిటా’ అని సంబంధం తిరగ్గొట్టేశారే… ఇప్పుడు సంబంధాలెక్కడినుంచి వాస్తాయిటా…. పిచ్చాడికి పిల్లనిచ్చే వాళ్ళుంటారా!” అని గొణుక్కుంటున్నారు పెళ్ళిళ్ళపేరయ్యలు. సమస్య తేల లేదు, కాలం గడుస్తోంది, పిచ్చీ తగ్గలేదు, పెళ్ళీ కుదరలేదు. మరికొంతకాలం గడిచింది. పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుంది. ఏది ముందూ? కాలం గడుస్తుండగా వైద్యుడు మరికొంత ధనవంతుడయ్యాడు 🙂

పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి

పై కథకి కొనసాగింపే ఈ సామెత కూడా దాని కతే మిగిలినదిన్నూ…

కొంతకాలం గడిచింది, బ్రహ్మచారి ముదిరిపోయాడు, తల్లితండ్రులలో, తల్లి ఉండబట్టలేక ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని ”అన్నయ్యా! కుర్రాడు ముదిరిపోతున్నాడు, ఇంత ఆస్థిపాస్థులకు వారసులు లేకుండాపోతారేమోననే దిగులు పట్టుకుందయ్యా! లేనింటి పిల్లనైనా సరే! పెద్ద అందగత్తె కాకపోయినా బాధలేదు, అందం కొరుక్కుతింటాముటయ్యా! పిల్లను చూసి మూడుముళ్ళూ వేయిస్తివా,చచ్చి నీకడుపున పుడతా! నాలుగేళ్ళలో, నీ కూతురు పెళ్ళి చేయాలి నువ్వు, దానిని సకల ఖర్చులతో నిర్వహించే బాధ్యత నాది,నన్ను నమ్ము” అని బతిమాలి, బులిపించినట్టు మాటాడితే, మెత్తబడిన పేరయ్య కాలికి బలపంకట్టుకుని పెళ్ళి కూతుళ్ళ వేటలో పడ్డాడు. పెళ్ళి కూతుళ్ళ తల్లితండ్రులకి వీరి గురించి వైనవైనాలుగా కొత్తగా చెప్పేడు. ”కొంతకాలం అబ్బాయి మతిభ్రమణంతో బాధపడ్డమాట నిజమే! ఇప్పుడు బాగున్నాడు,తెలివైనవాడూ! ఒక సారి అబ్బాయిని చూడండి, నచ్చితేనే చేద్దాం, చూడ్డానికేం పోయే” అన్నాడు. దానికి తల్లితండ్రులు పిచ్చాడికి పిల్లనివ్వడానికెళుతున్నామంటారయ్యా! ఎగతాళీ చేస్తారూ” అన్నారు. ”అదా మీ అనుమానం, పిల్లనివ్వడానికెళుతున్నట్టు తెలియనివ్వద్దూ, దారేపోతూ చుట్టం చూపుగా వెళ్ళినట్టు రండి, ఆ సమయానికి నేనూ వస్తా,చూడండి, ఒక రోజుండండి,చూడండి, నచ్చితేనే” అని బలవంతం మీద ఒప్పించాడు. ఒక రోజు అమ్మాయి తల్లి తండ్రులు చూడ్డానికి ఒప్పుకుని వచ్చారు, అనుకున్నట్టే సమయానికి పేరయ్యా చేరాడు.

అబ్బాయితోనూ అబ్బాయి తల్లితండ్రులతోనూ మాటాడుతూ వచ్చారు, అమ్మాయి తల్లి తండ్రులు. చూస్తే అబ్బాయి బాగున్నవాడేనేమో, పిచ్చి లేదేమో, ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమేమో అనిపించింది, కొంత సేపటికి. సాయంత్రమవుతుండగా, అబ్బాయి తల్లితండ్రులు,అబ్బాయి,అమ్మాయి తల్లితండ్రులు, పెళ్ళిళ్ళ పేరయ్య తీరుబడిగా కూచుని లోకాభిరామాయణం చెప్పుకోడం మొదలెట్టేరు, ఇంతలో అమ్మాయి తల్లికి, లోపల ఉన్న అనుమానం తొలుస్తుండగా, అబ్బాయితో ”బాబూ! నీకేదో అనారోగ్యం చేసిందిట,ఇప్పుడెలా ఉందీ” అని ప్రశ్నించింది. దానికి అబ్బాయి ”పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి” అన్నాడు. ఈ మాట విన్న అందరూ విస్తుపోయారు. అమ్మాయి తల్లి ఐతే ఒక క్షణం మూర్ఛపోయినంతై తేరుకుని మొగుడితో ”ఇంకా కూచున్నావేంటీ?” అంటూ చరచరా వెళ్ళిపోయింది…… ఇంకేముంది……

అదండి పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి కత.

(2-2-2018)

15, ఆగస్టు 2021, ఆదివారం

అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు.


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 



అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు.




ఇది ఒక నానుడి. మాచకమ్మకి వాళ్ళ అక్కకి వయసు తేడా తక్కువే. మాచకమ్మ అక్క ఈడేరింది, అందమైనది కూడా.  కులగోత్రాలకీ లోటు లేదు,పేదవారైనా. దానితో పక్కవూరి ఊరి మోతుబరి కొడుకు కోరి వరించేడు.పెళ్ళి ఘనంగానే జరింది. అప్ప అత్తారింటికీ వెళ్ళింది.అక్కడ అప్ప మహరాణీలా వున్నట్టు కబురులూ తెలుస్తున్నాయి. ఇంట్లో అత్తామామల దగ్గరనుంచి, భర్త, నౌకర్లు చాకర్లు అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి. పెళ్ళైన సంవత్సరం తిరగ్గానే అప్ప నీళ్లోసుకుంది. ఇక అప్ప అత్తారింట్లో ఆనందానికి పట్ట పగ్గాలూ లేవు. ఈవార్తలు తెలుస్తుండడంతో పుట్టింట అందరూ ఆనందంలో ములిగి తేలుతున్నారు, మాచకమ్మతో సహా. కాలం గడచింది, అప్ప మగ బిడ్డను కన్నది. అప్ప అత్తవారు కోడలిని అడుగు కింద పెట్టనివ్వటం లేదు. రెండో ఏడు పూర్తికాకుండానే బిడ్డ తల్లీ అయింది. అప్ప భర్తకి వ్యాపారం కలిసొచ్చి కొత్తగా పొలమూ కొన్నాడు. అప్ప  జీవితం వేలేస్తే కోలు దిగబడేలా ఉంది,అత్తారింటిలో.


మాచకమ్మకి అప్పకి జరుగుతున్నదంతా మొదటిలో అంతా ఆనందంగానే గడచినా, రెండేళ్ళలో కూడా మాచకమ్మ ఈడేరలేదు సరిగదా స్త్రీ లక్షణాలే పూర్తిగా ఏర్పడ లేదు. 

చూస్తేనే మాచకమ్మ సంసారానికి పనికి రాదని తెలిసిపోతూ ఉంది. ఎవరూ మాచకమ్మ పెళ్ళి మాటే ఎత్తటంలేదు, దానితో అప్ప వైభోగం చూస్తున్న మాచకమ్మకి మొదటిలో అప్ప పట్ల అసూయ పుట్టి ఆ తరవాతది పెరిగి ఈర్ష్యగా మారింది, కాని ఏం చేయగలదు? మడమలు తొక్కుకోవడం తప్పించి. మడమలు తొక్కుకోవడం అంటే నాట్యం చెయ్యడం చేతకాక కాళ్ళు తొక్కుకోడం అంటారు.ఇలా నిరాశతో అసూయ చెంది, దానిని ఈర్ష్యగా మార్చుకుని బాధ పడడాన్నే అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టని అంటారు. 


ఎవరి పుట్టుకవారిదే,ఎవరి అదృష్టం వారిదే, ఒకే తల్లి పిల్లలైనా. ఎవరి అందం, తెలివి,రాత, జీవితం వారివే. ఎవరి వైభొగమూ మనకు రాదు, ఎవరి దరిద్రమూ మనిని అంటదు, ఎవరి చావూ వారిదే. ఒకరిని చూసి అసూయ చెంది ఈర్ష్య పడితే జీవితం లో ఏదీ సాధించలేరు, నిరాశ తప్ప

13, ఆగస్టు 2021, శుక్రవారం

మూడంకె వేస్తే


 Courtesy:BAPU

Courtesy:What's app

అలిగి అలివేణి అలకపాన్పుపై మూడంకె వేస్తే 
 (వయసు ముచ్చట)