Wednesday, 31 December 2025

గడచిన సంవత్సరం 2025

 గడచిన సంవత్సరం 2025


2019లో అనుకుంటా,రతన్ టాటా గారిని అడిగారట. 'ఈ సంవత్సరం మీరు సాధించిందేమిటీ?' అని, దానికి వారు 'ఈ సంవత్సరం బతికున్నాను,అదే ఘనకార్యం' అన్నారట. ఆ సంవత్సరంలో పెద్దవయసు వాళ్ళు చాలామంది కాలంచేసేరు,కరోనా మూలంగా. అప్పటికి ఆయన వయసు 80 దగ్గరనుకుంటా.
ఇప్పుడెందుకిదని అనుమానం రావచ్చు. నాకు తొమ్మిదో పది సమయం కనుచూపుమేరలో కనపడుతోంది. గత సంవత్సరం ముక్కుతోనో మూలుగుతోనో గడిపేసాను. రోజు గడిస్తే పండగ,బోనస్సు అనేలా గడుస్తోంది.
కుంతీ దేవి మేనల్లుడే ఐన శ్రీ కృష్ణుని ఇలా వేడుకుంటుంది.


యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి

చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!


శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!


ఇందులో వేడుకోలు  
 అంటే, ఈ భవలతలు అనగా ఇహలోక బంధాలను తుంచెయ్యవయ్యా, ఆంటుంది. పాండవులందు యాదవులందు మోహ విఛ్ఛేదము,     ఇలా ఒక్క కొడుకులనే కాదు అటు పుట్టింటివైపు వారిమీదా తనకున్న బంధాలను తుంచేలా చెయ్యమంది. ఇలా వేడుకున్నా చివరిదాకా కుంతికి భవలతలు వదలలేదు. అలాగే నాకున్నూ ఈ భవలతలు వదలటం లేదు. ఇవి ఎంత సున్నితం అంటే సాలెపురుగు తననోటి నుంచి స్రవించిన ద్రవంతో అల్లే సాలెగూటి దారమంత సున్నితంగా కనపడతాయి. చిత్రం ఆ సాలెగూటి దారం పెనుగాలివానలకూ తెగదు. నిజo 100 కి.మీ వేగంతో వీచేగాలి దానిని తెంపలేదు.అలా నేటికిన్నీ భవలతలు కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నా ప్రయత్నం వ్యర్ధమవుతూనే ఉంది.



https://kasthephali.blogspot.com/2024/05/blog-post_24.html

విష్ణుమాయ దేనినీ వదలలేకపోతున్నాని తెలుసు, కాని సంపూర్ణ శరణాగతి చెయ్యలేకపోతున్నా! అదే విష్ణుమాయ. దానిని దాటడానికి మహామహుల ప్రయత్నాలే చెల్లలేదు,నేనెంత? అలా అని ఊరుకోలేకపోతున్నా! ఎప్పటికి ఆయన దయ కలుగుతుందో!



శాంతి శాంతి శాంతిః

స్వసి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు. 
ఇక సెలవు
🙏🙏🙏

Sunday, 28 December 2025

ఇందుగలడందులేడని

ఇందుగలడందులేడని 


Courtesy: Whatapp




Courtesy: Whatapp

 

ఇందుగలడందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుండు

ఎందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే!


ఇందుకలడందు లేడను సందేహము వలదు హరి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు,చూసేకన్ను చూడగల మనసు ఉంటే ఎక్కడేనా ఉన్నాడు,అంతెందుకు నీలో ఉన్నాడు చూసుకో! అది చూసుకోలేకనే తిప్పలు పడుతూ ఉన్నాము.

Friday, 26 December 2025

ఊరు పొమ్మంటోంది.....

ఊరు పొమ్మంటోంది..... 

ఊరుపొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అని ఒక నానుడి చెబుతారు, అదేమో చూదాం.

మొన్న, కూచుంటే కాదని కర్రబోటుతోనే వీధిచివరి ఇంటిదాకా వెళ్ళేను. బాబాయ్! నువ్వేవచ్చేవు,బాగున్నావా! ఏరోజుకారోజే వద్దామనుకుంటున్నాను, ఏదీ కుదిరితేనా!! కళ్ళులేని పెద్దపులి,ఈ సంసారంతోనే సరిపోతోంది లెద్దూ అంది,కూచుంటే లేవలేకుండా ఉన్న ఓ కూతురు వరసమ్మాయి. అమ్మా! నీదొడ్లో ఎర్రబచ్చలుంది కదా,నాలుగు కాడలు పట్టుకెళ్ళి, కందా బచ్చలీ కూర చేయించాలని, అన్నా! అయ్యో! బాబాయ్! కబురంపితే నేనే తెద్దును,లేదంటే మీ అల్లుడినే పంపుదును కదూ! వయసైపోయిందిగా తిరక్కు,జాగర్తా! అని నాలుగు కాడలు బచ్చలి కూర చేతిలోపెట్టి కుంటుకుంటూ గేటుదాకావచ్చి సాగనంపింది, ఆ కూతురు.

మొన్న ఒక వైద్య మిత్రుడు కలిసేడు. సుగర్ అదుపులో ఉంది చాలాకాలంగానే , ఒకప్పుడు,సుగర్ ఎక్కువ అదుపులో లేక ఉండిపోవడంతో తిమ్మెరలు వగైరా చిన్నెలు అందుకున్నాయి. డాక్టర్ మందులు రాసారు,వాడుతున్నా, విడవక,కాని తగ్గటం లేదు,ఏమని డాక్టర్ గారినడిగితే మందులు లేట్ గా పని చేస్తాయని అంటున్నారు. ఏమి సంగతన్నా! డాక్టర్ చెప్పినది నిజం వయసైపోయింది కదూ. మందులు పని చెయ్యకాపోవచ్చు. కాని అది చెప్పం, కారణం మీరు నిరాశపడిపోతారని చెప్పం.వయసు మీరిన కొద్ది శరీరంలో రోగాన్ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది,అందుకు మందులు పని చెయ్యవు, పని చేసినా తగ్గినట్టుంటాయి,మళ్ళీ వచ్చేస్తాయని గుట్టు విప్పేసేడు. 

వయసైపోయి వ్యాధి నిరోధకశక్తి పూర్తిగా తగ్గిపోయిన ముసలాళ్ళు కుటుంబాలకి పెద్ద బరువు. వారినేం చెయ్యలేరు,బతికుండగా చంపెయ్యలేరు.వాళ్ళ నిత్య జీవితంలో ప్రతి పనికి వీళ్ళు అడ్డుగానే ఉంటారు. వయసైపోవడంతో వాళ్ళతో కలసి సినిమాలు షికార్లు చెయ్యలేరు,ఒంటరిగా ఇంట్లో ఉండలేరు. ఇంట్లో వాళ్ళు వీళ్ళని ఒంటరిగా వదిలేసి బయటికిపోతే ముసలాళ్ళు బాధపడిపోతారు.అందుకే వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నారు. ఇది పెద్ద ఇబ్బంది,ఇదీ వయసైపోయినవారి కత.

ఇక కాడు రమ్మనడమేమి? కాడు అనగా శ్మశానము, అది రమ్మని పిలవదు. అక్కడికి తీసుకుపోబడ్డవాడెవడూ తిరిగిరాడు. మరిదేంమాటా? వారణాశిని మహా శ్మశానం  అంటారు. స్మశానం పిలవడం అంటే, కాశీ విశ్వేశ్వరుని మహాశ్మశానంలో అగా వారణాశిలో అంతిమ శ్వాస విడవాలని సనాతనుల కోరిక. అనగా కాశీ రమ్మని పిలుస్తోంది అని చెప్పడం. యువ సంసారాలకి బరువైనవారిని కాశీ పిలుస్తోందని అంటారు.అంటే సంసార బంధాలు వదలిపెట్టు చివరికాలం వానప్రస్తంలో కాశీలో గడపమని అర్ధం.  అదీ ఊరుపొమ్మంటోంది కాడు రమ్మంటోంది కత.  

Wednesday, 24 December 2025

నాహం కర్తా హరిః కర్తా

                                 నాహం కర్తా హరిః కర్తా          

తిరుమల  కొండమీద వేంకటేశ్వరుని       ఆలయంలో ధ్వజస్తంభం  మాను పుచ్చిపోయింది!                                       

 

శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. 


అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.

"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."


...  మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే,  ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది.                                     మరి ఎలా నిలబడింది ? 

ధ్వజస్థంభంపై నున్న  బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...


పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.  

నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ... 

రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు... 

మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ... 


50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని  సంపాదించి  ప్రతిష్టించాలి.  

ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు. 

కొమ్మలు ఉండకూడదు. 

ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.

దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి. 

... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?  


అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. 

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది.  ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !! 


ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’


అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో  లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....  

……..

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి. 


ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.


అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?


విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది. 


వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?)....... 


ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది. 

అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.


‘‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’ 

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే  ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.  


మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.                            

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు.   ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది. 


ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!


ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?) 


- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. 


మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్దలయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ? 

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’ 


ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. 

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’- 


బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి  ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు. 

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది. 

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?


అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !  

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. 


ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. 

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను. 


ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...! 


అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు : 

‘‘నాహం కర్తా హరిః కర్తా

తత్పూజా కర్మ చాఖిలం

తదాపి మత్కృతా పూజా

తత్ప్రసాదేన నా అన్యథా’’


“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.”

(Source: పూర్వ ఐఏఎస్ అధికారి  పివిఆర్ కె ప్రసాద్ గారు రచన  'నాహం కర్తా, హరిః కర్తా')

ఓం నమో వేంకటేశాయ 10 what's app గ్రూప్స్ కి షేర్ చేయండి అంత మంచి జరుగుతుంది 🙏

Courtesy:Whats aapp

Monday, 22 December 2025

కొడుకుని నమ్ముకునేకంటే...

 కొడుకుని నమ్ముకునేకంటే...



కొడుకుని నమ్ముకునేకంటే కొబ్బరిచెట్టును నమ్ముకుంటే మేలు అని, కొడుకుని పెంచుకునే కంటే కొబ్బరి చెట్టును పెంచుకోవడం మేలు అనీ మా కోనసీమ వాసులు అనుకునేమాట. అలా అనుకోలేదుగాని ఇల్లాలు ఈ కొబ్బరిమొక్కని పది పన్నెండేళ్ళకితం నాటింది. ఎవరింటికో ముత్తయిదు వాయనానికి పిలిస్తే వెళ్ళగా వారు ఇచ్చిన బొండం ఇంటిలో ఉంచగా,దానికి మొలక కనపడింది. దానిని సద్వినియోగం చేస్తానని పక్క పెరటిలో పాతింది. దానిని సంరక్షణ చేయకపోయినా పెరిగి పెద్దదయింది. నాటిన అమె కాలం చేసి 7 ఏళ్ళు దాటింది. మొదటి సారిగా కాయలు దింపితే దగ్గరగా నలబై కాయలు లెక్కకొచ్చాయి. మంచి పని చేసిపోతే ఫలితం తరవాత వారైనా అనుభవిస్తారుగా!          

Sunday, 21 December 2025

డిసెంబర్ 21 (Longest night) -భాస్కరదర్శనం

 డిసెంబర్ 21 -భాస్కరదర్శనం


 డిసెంబర్ 21 తేదీనాడు సూర్యుడు, భూమి యొక్క దక్షణార్ధగోళం లోని మకరరేఖకి అభిముఖంగా ఉంటాడు. దీనివల్ల ఇప్పటికే వేసవితో అల్లాడుతున్న అస్ట్రేలియా,న్యూజిలాండు,దక్షణ ఆఫ్రికా,దక్షణ అమెరికాదేశాలకి మండుటెండ, ఐతే మనకి చలి చాలా బాధ పెడుతోంది. మనకంటే యూరప్ ఉత్తర అమెరికా,రష్యా దేశాలైతే చలికి వణుకుతున్నాయి. సూర్యుని రెండు ఆయనాలలో ఉత్తరాయణంలో మనకు మండుటెండలు కదా. అందునా కర్కాటకరేఖ మనదేశం మీదుగా ఉంటుంది.నేడు మనకి రాత్రి భాగం ఎక్కువుంటుంది,అనగా సూర్యాసమయ,సూర్యోదయ కాలాలమధ్య సమయం సంవత్సరంలోని ఇతరరోజులకంటే ఎక్కువ ఉంటుంది. (Longest night) నేడు యాదృఛ్ఛికంగా ఒక మిత్రుడు గ్రూప్ లో పెట్టిన వీడియోలో ఉషా,ఛాయా,పద్మినీ,సౌజ్ఞా  సహిత సూర్యనారాయణమూర్తి నిజదర్శన భాగ్యం కలిగింది. ఎన్నిసార్లు గొల్లలమామిడాడలోని స్వామిని దర్శించినా ఈ దర్శన భాగ్యం నోచుకోలేదు. 

Friday, 19 December 2025

నెలగంట

 

నెలగంట

ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంది,అనగా సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశికి మారే రోజు సంక్రమణం. మూడు రోజులకితం సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనూరాశికి మారాడు. ఈ నెలకాలాన్నీ ధనుర్మాసం అంటారు.రాబోయే మాసం మకరమాసం. మకరసంక్రమణం రోజునే మనం పెద్దపండగ అంటాం. ఈ ధనుర్మాసంలో మొదటిరోజునుంచి నెల చివరి వరకు  వైష్ణవాలయల్లో ఉదయం నాలుగు గంటలకి జరిగే  ఉత్సవం,ఈ నెలగంట. ఉదయమే నాలుగు గంటలకి నిద్రలేచే అలవాటు చేయడమేమో! అలాగే నగరసంకీర్తనం అనగా విష్ణుభక్తికి సంబంధించి కీర్తనలు పాడుతూ నగరవీధులలో ఉదయమే నాలుగు మొదలు ఆరుదాకా చేసే ఉత్సవం. 

Wednesday, 17 December 2025

ఏదీ నీతోడు రాదు!

 ఎవరూ నీవారు కారు! ఏదీ నీతోడు రాదు!!




ఎవరో గుర్తుపట్టేరా!
ఒకప్పటి అందాలనటి కాంచన. నడవలేనిస్థితిలో ఉన్నామె వయసు 90. 
వయసు మళ్ళిపోయింది. అందమూ జారిపోయింది. ఆరోగ్యమూ జారిపోయింది. సంపాదించిన ఐశ్వర్యమూ చేజారింది. కోర్టుల్లో పోరాడి కోట్ల విలువైన ఆస్థిని దక్కించుకుంది,కాని అనుభవించే వయసు,ఆరోగ్యమూ లేవు. సర్వం అనగా 100కోట్ల విలువైన ఆస్థిని వేంకటేశ్వరునికి అర్పించి,ఆటోలో ఇంటికి వెళ్ళింది. మనం స్టీవ్ జాబ్స్ ని గుర్తుచేసుకుంటాం తప్పించి ఇటువంటివారిని గుర్తు చేసుకోం! భారతీయులం కదా! ఏదీ నీతోడు రాదు,ఎవరూ నీవారు కాదు. అదే సత్యం. 

Friday, 12 December 2025

శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.

 

శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.

బుర్రగుంజు.

బుర్రగుంజా! ఏమిటీ ఫైలు పెట్టడం? ఏదితోస్తే అదేనా పెట్టెయ్యడం అని నిలతీసింది బుద్ధి మనసుని.  బుర్రగుంజు,కొబ్బరి పువ్వు నీకే తెలుసునా? తెలిసి నువ్వేమిటి చేసావు నిన్న అనిదెప్పింది మనసు. సరే ఆ చెప్పేదేదో సూటిగా చెప్పేడు అని చిన్న సంతకం పారేసి పైలు గిరవాటేసింది బుద్ది. మనసు పైలాపచ్చీసు వయసులో వుంది,బుద్ధికి వయసొచ్చింది అదీ తేడా. బుద్ధికి మనసుకిపై అధికారినని గర్వం.

బుర్రగుంజు తాటిచెట్టునుంచి వచ్చేది. మన వాళ్ళు తాటివనాలు పెంచేవారట. రామ కృష్ణులు తాటివనంలో వుండగా,గొడవ చేస్తున్న గార్ధభాసురుణ్ణి గిరగిరా తిప్పి తాటిచెట్ల కేసి కొట్టి చంపేసేడట బలరాముడు. నిన్ను తిన్నగా బుర్రగుంజుగురించి చెప్పమంటే ఇదంతా ఎందుకు సోది అని బుద్ధి అడ్డుపడితె,  మనసు, ఆగవయ్యా! ప్రతిదాంట్లో దూరిపోయి వేలెట్టుకోకు బాగోదు. నువ్విలా చేస్తే నేను పైవాళ్ళకి చెబుతానంది మనసు. నువ్వు పిచ్చిపిచ్చిగా వాగితే నీ మీద డిసిప్లినరీ ఏక్షన్ తీసుకుంటానంది బుద్ధి.  చాలు చాల్లేవోయ్! నీ పవర్స్ తెలుసుకుమాట్లాడు అని గింజు కుంది మనసు. నీ పైన ఇద్దరున్నారు. చిత్తం గారు ఇష్టమైతే వెంటనే ఫైలుమీద సంతకం చేసిచ్చేస్తాడు. ఆయన కూడా కాదంటే ఆయన పై అధికారి అహంకారం గారి దగ్గరకెళితే పని మరీ సులభం. నీ గౌరవం దక్కించుకో. నీకో సంగతి చెబుతా! ఒక సారి అహంకారం గారితో గొడవైంది. ఆయన మాట్లాడితే నేను,నేను అని గుండిలకేసి చూపించి కొట్టుకుంటూ, చెబుతూ వుంటాడు కదా.  ఏమండి! నేను,నేను అంటున్నారు కదా, మీరెవరని ప్రశ్నవేసాను.  గురుడికి బుర్ర తిరిగిపోయింది. అది తెలియకేకదా ఈ బాధంతా. తెలిస్తే సర్వం ఒకటే.  అద్వైతం చెబుతున్నావా అంది బుద్ధి.  అనుకో అంది మనసు. నువ్వెవరో చాల క్లియరుగా చెప్పిందయ్యా వేదం. “పద్మకోశప్రతీకాశగ్ం హృదయంచాప్యధోముఖం! అధోనిష్ట్యా వితస్త్యాన్తేనాభ్యాముపరితిష్టతి”…….. “నీవార శూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా!!  తస్యా శ్శిఖాయా మధ్యేపరమాత్మా వ్యవస్థితః”. నేను అన్నవాడు ఎలా వుంటాడో కూడా వివరంగా చెప్పిందయ్యా! ఎలావుంటాడట! నివారి ( చాలా సన్నపాటి వరి రకంట.) వరి ధాన్యంగింజ పైన వుండె చిన్న ముల్లులా వుంటాడట. ఎక్కడుంటాడు. గుండెలో మధ్యలో వుంటాడట. ఆయనే పరమాత్మ, అదే నేను అనే నువ్వు. నీకూ పరమాత్మకీ తేడా లేదయ్యా! తెలిసిందా అంది మనసు. బుర్రగుంజు గురించి ఎక్కడనుంచి చెప్పమంటావు అంది మనసు. నీ ఇష్టం వచ్చినట్లు ఏడు అంది బుద్ధి.  ముసలిగోల వదిలిందికదా! ఇప్పుడు చెప్పుకుందామంది మనసు.  తాటిచెట్టులో మొగ ఆడ చెట్లుంటాయి. పోతుతాడి కల్లు బాగుంటుందిట. బుద్ధి మిర్రిమిర్రి చూస్తోంది ఏమీ అనలేక.  ఆడతాడికి కాయలు కాస్తాయి. అవి పండుతాయి. పండి రాలుతాయి. రాలిన పళ్ళ నుంచి రసం తీసుకుని రొట్టి కాల్చుకుంటారు. ఇదీ బాగుంటుంది.  తాటి కల్లు నుంచి బెల్లం వండుతారు.  ఇది మందుగా ఉపయోగం.  దీన్నే పాత బెల్లం అంటారు, లేదా తాటిబెల్లం అంటారు… రసం తీసేసిన టెంకలు పాతితే భూమిలోతేగలొస్తాయి. ఈ తేగల చివర టెంకలో వుంటుంది బుర్ర గుంజు. అన్ని టెంకలలో బుర్రగుంజు వుండక పోవచ్చు. అందుకే అదృష్టం బుర్ర గుంజు అంటారు.  తేగలో మధ్య చందమామ ఉంటుంది.  అది తింటే చదువురాదుట, పిల్లలు పుట్టరట, ఏదో చెప్పీవారు.  నేను చాలా సార్లు తిన్నాను.  ఒకటి మాత్రం నిజం అయింది చదువుమాత్రం రాలేదు నాకు.  తేగలు తినడం ఒక కళ.  తేగ ముక్కలుగా విరిచి పీచు శుభ్రంగా తీసి, పేరి, పూసలు తేరిననెయ్యిలో ముంచి, కారం అద్దుకుని తింటే నారాజా! అదుర్స్.  ప్రస్తుతం పళ్ళు లేవు మరి.  తేగ తిన్న తరవాత టెంక బద్దలుకొడితె, లోపలుంటుంది తెల్లగా బుర్ర గుంజు..  ఇది బలే తియ్యగా వుంటుంది.  పట్నవాసం వాళ్ళకి తేగలే తెలియకపోతే బుర్ర గుంజేమి తెలుస్తుంది? ఇది ఎక్కువగా తింటే చలవచేస్తుంది.  జలుబు చేస్తుంది, . జలుబు చేస్తే దగ్గు వస్తుంది,  దానితో జ్వరం వస్తుంది, తలనెప్పి వస్తుంది.  ఇవ్వన్నీ నాకు చెప్పి, నువ్వు, నిన్న, ఎందుకు, బుర్రగుంజు తిని, జ్వరం తెచ్చుకున్నావని బుద్ధిని, మనసు నిలతీసింది.  పైవాళ్ళిద్దరూ ఆర్డరేశారో మరి,  అందుకేతినమన్నాను అంది బుద్ధి.  ఐతే అనుభవించు అంది మనసు.

ఎవరు అనుభవిస్తున్నారు నేనా అంది బుద్ధి.  నేను నేననేవాడున్నాడుకదా ఆయననుభవిస్తాడు నాకేంఅంది.  అహంకారంగారు నాకేం తెలియదు!  అనుభవించేది నేనుకాదు,  ఐతే మరెవరు? శరీరం.  అంటే నువ్వు శరీరం కాదా.  కాదు అంది అహంకారం. సరే మీరూ మీరూ తేల్చుకోండని ముడెట్టి తప్పుకుంది మనసు. ఆత్మ వేరు శరీరం వేరు అని తెలిస్తే అద్వైతం తెలిసిపోయినట్లే.  తేగలు తినడానికి పళ్ళు లేవంటే బుర్రగుంజు అంట కట్టేడు తేగలమ్ముకునేవాడు. అదీ సంగతి.  బుర్రగుంజు బాగుందని తింటే జలుబు చేసి జ్వరం వచ్చిందని చెప్పడానికి ఇంత తిరకాసా? దానికో పోస్టా?దానికి అద్వైతంతో లింకా?.

మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ వుంటుంది. మనసు చేసే ప్రతి సంకల్పవికల్పాలను బుద్ధి తనస్వంత, ఇతరుల,చదివిన,విన్న, అన్ని విషయాల ద్వారా పోగుపడిన ఙ్ఞానం నుంచి ఆ విషయం మంచి చెడ్డలు విశ్లేషించి చిత్తానికి తెలుపుతుంది. అప్పుడు దానిపైచర్య ఉంటుంది. అహంకారం కనక అడ్డుపడితే ఈ మూడిటిని రద్దు చేసి తన ఇష్టం అమలు పరుస్తుంది. ఇది నేను అనేదానికి ప్రతీక.

Monday, 8 December 2025

మళ్ళున్నా, మాన్యాలున్నా.....

 మళ్ళున్నా, మాన్యాలున్నా.....

"మళ్ళున్నా,మాన్యాలున్నా మంచెమీద మనిషుండాలి,పాడి ఉన్నా,పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి". ఇది సినీకవిగారి మాట. నిజం. మడులు మాన్యాలు రక్షింపబడవు, మంచెమీద రక్షించే మనిషిలేనపుడు. ఆ మనిషి తనవారై ఉండాలి. లేకపోతే మిగిలేది శూన్యం. అదే మంచె మీద మనిషి కాపలా. చిన్నప్పటి నుంచి చచ్చేదాకా ఎవరో ఒకరు కాపలా కావాలి, అదే మనసు కాపలా. అదే మరో సినీ కవి "చిన్నతనాన తల్లి కాపలా,వయసున వలచినవారు కాపలా, ఏతోడూ నోచని వేళ కన్నీరేరా నీకు కాపలా" అన్నారు.  అంచేత కాపలా తప్పనిసరి. లేకపోతే బతుకు ఒంటరిదే. ఒంటరితనాని కంటే భయంకరమైన శిక్ష మరిలేదు. భారతదేశంలో  ఘట్టిగా ఏడవను కూడా చేతకాని వర్గం ఒకటుంది. అదే మధ్య తరగతి. ఈ కుటుంబాల ఆర్ధిక స్థితి గోచీకి పెద్ద గోణానికి చిన్న అన్నట్టు ఉంటాయి, వీరిలో భార్యాభర్తలో ఒకరు చెల్లిపోతే మిగిలినవారికి మిగిలేది భయంకరశిక్ష ఒంటరితనం.  అందుకే పాడిపంటలు ఎన్నున్నా పంచుకునే మనిషి కావాలన్నారు. ఈ మనిషి మనసుపంచుకున్నవారై ఉండాలి మొదటగా! ఆ తరవాతనే ఇతరులు,బంధువర్గమైన, మిత్ర వర్గమైనా, వీరంతా ఏదో ఒక సమయంలో మనసు బయట ఉండేవారే!. మంచెమీద మనిషి కానివారెవరూ ఆత్మీయులు కాలేరు.       


 నెల్సన్ మండేలా గుర్తున్నారా? మనం ప్రచార యుగంలో ఉన్నాముగా! ఎలా గుర్తుంటారు. మహానుభావుడు ఈయనను 35 సంవత్సరాలు ఒంటరి కారాగారవాసం చేయించిన బ్రిటన్ ప్రభుత్వం నేడు సుద్దులు చెబుతోంది,ప్రపంచానికి. మండేలా అంత భయంకరమైన శిక్షను కూడా తట్టుకున్న మహానుభావుడు. మరో ఉదాహరణ జరుగుతున్న చరిత్ర మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ ఇప్పటికి ఒంటరి కారాగారంలోనే ఉన్నట్టు.  


నేటికి మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు చెల్లిపోయాయి. అన్నీ చిన్నకుటుంబాలే. అసలు కుటుంబం అనే అవగాహనే పోతున్నట్టుంది. ఆలుమగలు అన్న భావన లేదు,ఇప్పుడున్నది స్త్రీ,పురుషులు మాత్రమే!  వయసులో ఒకరి అవసరం ఒకరికి ఉన్నది కనక లివ్ ఇన్ గా రోజులు గడిపేస్తున్నారు. ఇక ముసలి ముతకని చూసేవారెవరు. నేటికి పాతకాలంలోంచి కొత్తదానికి మారుతున్న జనాభా ఇంకా తల్లితండ్రుల్ని పునరావాస కేంద్రాలలో,వృద్ధాశ్రమాలలో ఉంచుతున్నారు. వీరికి తోడెవరు? కూడా ఉన్నవారే! కుటుంబంలో అన్నాతమ్ములు,అక్కచెల్లెండ్రు, కోడుకులు కోడళ్ళు  ఉన్నా అందరూ పైవారే, అందరిది ఆర్ధికపరమైన కాపలాయే. వీరెవరూ మంచెమీద మనుషులు కారు. మంచెమీద మనుషిది మనసు కాపలా!         

Friday, 5 December 2025

Find out the number/Mathematical beautiful magic Flower

 Find out/Mathematical beautiful magic Flower


The sum of three consecutive even numbers is 246. Find out numbers,with working and explain.

****

Mathematical beautiful magic Flower


Cliff Pickover on X: "Mathematics. "Magic flower." Each line segment sums to 123. Example: 6 + 37 + 80 = 123. Each numerical entry, from 1 to 81, is depicted only once in the figure. By Miguel Angel Amela, personal communication, used with permission. https://t.co/i4QpySNibr" / X https://share.google/5aKpYfUefNZWL08OH

Courtesy:Author and Owner.

Contribution by Syamaliyam.

Wednesday, 3 December 2025

అరటాకివ్వకపోతే ఆపద తప్పదా?

 అరటాకివ్వకపోతే ఆపద తప్పదా?  

ఉదయమే 4 కి లేచి పెరటిలోనే నడిచే అలవాటు,నిద్ర పట్టదుగా😂. ఆ తరవాత అక్కడే తూర్పు వరండాలో కూచుని ప్రాణాయమం,యోగా చేయడం అలవాటు 😂 .😂 ఆరోజు దశమి, ఉదయమే నడక తరవాత వరండాలో కూచుని ప్రాణాయామం చేస్తున్నా! ప్రాణాయామ సమయంలో కళ్ళు మూసుకోడం మరో అలవాటు. 


ఎప్పుడు దూరేడో కాని కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా కత్తి పుచ్చుకుని ఒక చిన్న కుర్రోడు ఐదు ఆరేళ్ళవాడు నిలబడి ఉన్నాడు. నీకు నేను చేసిన అపకారమేంటి నాయనా, ఉదయమే కత్తి పుచ్చుకొచ్చేవు. ఐనా నీకు అన్యాయం చేయడానికి గాని మరెందుకూ ఓపిక లేక ఉన్నవాడిని. ఎందుకు పొద్దుటే నన్ను పొడవడానికి కత్తి పట్టుకొచ్చావు? అనుకున్నాగాని మాట గొంతు దాటి బయటకు రాలేదు. పక్కనే ఉన్న కర్ర పుచ్చుకుని ఒక్కటేయచ్చు కాని వాడి చలాకీ చూస్తే నా ప్రయత్నం ఏం సఫలం కానట్టే ఉంది. ఎర్రతేలులా, కోల మొహం, రెండడుగుల ఎత్తు,మోకాళ్ళు దిగిన చొక్కా,దానికింద అది పఠాన్ డ్రస్సు అనిపించింది.  మనదేశం లోకి బుల్లి ఉగ్రవాదులు కూడా కత్తులు పుచ్చుకు తిరుగుతున్నారా అని సందేహమూ వచ్చింది. 


ఏంకావాలి? ఎందుకొచ్చేవు? ఎవరు నువ్వు? ఏమిటని? కొన్ని ప్రశ్నలు సంధించేననుకున్నా! వాడు అలాగే కత్తి పుచ్చుకు నిలబడే ఉన్నాడు, పెదవి విప్పి మాటలేదు. వాడు మాటాడితే నాకు వినపడలేదో! ఈ సారి కొంచం గట్టిగానే అడిగా. ఇంతలో కోడలమ్మాయి బయటికొచ్చి, అరటాకు కోసం కత్తి పట్టుకొచ్చాడు,ఇక్కడ రెండవ అపార్టు మెంట్లో ఉంటారు, అని చెప్పింది. దాంటో కొంత సద్దుకున్నా! వాడు మాత్రం ఆకు ఇస్తావా! చస్తావా! అన్నట్టె నిలబడ్డాడు. తలెత్తి చూస్తిని కదా ఆకులన్నీ మొన్న తుఫానుగాలికి చిరిగిపోయి ఉన్నాయి, ఉన్నవి రెండే చెట్లు,మిగిలినవి పీకి పారేయించా. ఏం చేయాలో తోచక అరటి చెట్ల చుట్టూ తిరిగి చేతికి అందనంత ఎత్తులో సగం చిరిగిన  ఆకును గుర్తించి,వణుకుతున్న  చేతులతో  వాడి కత్తి పుచ్చుకుని, అందని ఆకును కర్రతో కష్టపడి వంచి, ముక్కు కూడా తెగని ఆ బండ కత్తితో ఆకు కోసి వాడి చేతిలో పెట్టి,బతుకు జీవుడా అనుకున్నా! అబ్బే వాడు కదిలితేనా? చెయ్యి చాపేడు అప్పుడు గుర్తొచ్చింది, వాడి  చేతిలో కత్తి నాచేతులో ఉందని,ఆ కత్తి వాడికిచ్చి,ఇంతకంటే చిరగని ఆకులు లేవని చెప్పి చూపించి పంపేటప్పటికి బ్రహ్మ ప్రళయమయ్యింది.