Wednesday, 15 October 2025

మరోమారు అధిక విద్యావంతులప్రయోజకులైరి....

మరోమారు అధిక విద్యావంతులప్రయోజకులైరి....


అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)




పైవీడియో పంపుతూ విన్నకోటవారు ఇలా ఐతే ఏదీతినలేం కదు సార్! అన్నారు, దానికి నేను అన్నీ అవేతింటున్నాం సర్! అన్నా!. 
  
అన్నానుగాని ఒక అనుమానం పీడించింది. నిజమే ఒక మోస్తరుగా మనదగ్గర కూడా ఇది జరుగుతోందిగాని ఇంతలా కాకపోవచ్చేమో అనేది. అంతేకాదు, ఇది నిజమా అదీ ఒక విదేశంలో లా ఉందే! అక్కడకూడా మన దగ్గరలాగా కల్తీ జరుగుతుందా? ఒక సందేహం. అదేకాదు నేటి కల్పిత మేధస్సు కాలం లో నిజమేదో తెలుసుకోవడమంత వీజీ కాదు. నేడు అన్నీ నిజంలాటి అబద్ధాలు,అబద్ధం లాటి నిజాలు కనపడుతున్నాయి. బియ్యంలో రాళ్ళు ఏరుకున్నట్టు వేరు చేయడం అంత తేలిక కాదనిపించింది. 

ఇక వీడియోని పరికిస్తే ఒక అధికవిద్యావంతుడే ఈ కల్తీ  చేస్తున్నట్టు ఉంది. ఒకటీ , రెండూ కాదు నిత్యావసర కూరగాయలన్నిటి మీదా ఇలా చేస్తున్నట్టు ఉంది. మరి అధిక విద్యావంతుడు ఒక లేబ్ లో ఇది చేస్తున్నాడంటే,ఆ లేబ్ ని నిర్వహిస్తున్నాడంటే, ఏదేశపు వాడైనా ఈ అధిక విద్యావంతుడు అప్రయోజకుడే. వీళ్ళని చూసికదా నిరక్షరాస్యులు మరీ చెలరేగిపోతున్నది. 

మన దగ్గర నేనెరిగి పుచ్చకాయకి ఇంజెక్షన్ ఇస్తారు ఎర్రగా కనపడ్డానికి. ఇది పాదుని కాయమీద ఉండగానే చేస్తున్నారు. ఇక అరటిపళ్ళూ ఇతర పళ్ళు మాగబెట్టడానికి బేటరీ వాడతారన్నది నిజం. ఈ మధ్య సీతాఫలం మీద కూడా ఈ పని జరుగుతున్నట్టు ఉంది. ఈ సంవత్సరం సీతాఫలం డజను 400,500 పైన అమ్ముతోంది.  పాలలో కల్తీ చెప్పేదేలేదు. బర్రెలకి ఆవులకి ఎక్కువ పాలు ఇచ్చేందుకు కార్టిసోన్ ఇంజక్షన్లు చాలాకాలంగా తెలిసినదే. ఆకుకూరలు నవనవలాడుతూ తాజాగా కనపడుతున్నాయంటే మందులో ముంచినవే సుమా!డ్రగ్ ఇనస్పెక్టర్లు  చిదంబర రహస్యం. ఏదేశమైనా ఇంతేనా! అధిక  విద్యావంతులు మరో సారి అప్రయోజకులేనా?    

2 comments:

  1. అధికవిద్యావంతులను లోకం అప్రయోజకులుగా లెక్క వేస్తున్నది - విద్యాహీనులే కులధనజనబలాలతో పెత్తనం చేస్తూ ఉంటే అని శతకకారుడి తాత్పర్యం.

    ఈరోజుల్లో అధికవిద్యావంతులు మరొక చిచ్చు తెలివితో జనాన్ని మోసం చేయటానికి తమ విద్యను వాడుతున్నారు అదే ప్రయోజకత్వం అని నమ్ముతూ. డబ్బు ఎలా వచ్చినా డబ్బే. సంపాదించడమే ప్రయోజకత్వం. నీతి అంటారా అప్రయోజకులు చెప్పే ఒక సాకు అన్నమాట.

    ReplyDelete
  2. శ్యామలీయం26 October 2025 at 22:21
    అధిక విద్యావంతులే ధనం కోసం అతినీచమైన పనులకు ఒడిగడుతుంటే అప్రయోజకులు అనక మరేమనాలంటారు. వీరు ఇటువంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నారు గనకనే ధన,కుల,యవ్వన గర్వాలతో అవిద్యాపరులు గద్దెలెక్కుతున్నారు,అనుమానం కాదుగా. అధికవిద్యావంతులు గొప్పవారని వారిని మిగిలిన సమాజం అనుసరిస్తుంది. యద్యాచరత శ్రేష్ఠ భగవానుడు చెప్పిన మాటకదా! సమాజానికి,మానవాళికి ఉపయోగమైనవి సృష్టించండి, ప్రయోజకులు కండి అన్నది కవిగారి మాటనుకున్నాను. అలా కావటం లేదని నీవే దిక్కని నృసింహునికి మొరపెట్టుకున్నారు, కవి.
    మీరు ప్రజల్లో పడుతున్నందుకు ఆనందం.

    ReplyDelete