29, సెప్టెంబర్ 2022, గురువారం

చెఱపకురా చెడేవు.

 చెఱపకురా చెడేవు.


ఎవరికీ చెడ్డకోరకూడదు. అదే మనకు తిరిగొస్తుందంటారు. 

"చేసిన ర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట" తత్త్వం, తెలిసి చేసినా తెలియక చేసినా, నిప్పులో చెయ్యి పెడితే కాలి తీరుతుంది కదా! అంతే మరి, చెడ్డ చేస్తే ఫలితమూ చెడ్డగానే ఉంటుంది. చెడు ఎలా చేస్తాం? ఎలా చేస్తామో చెబుతుందీ శ్లోకం,

కరచరణ కృతంవా
మనోవాక్కాయజం వా చ
తవాపరాధం క్షమస్వ
మహా దేవ దేవ శంభో!
కాళ్ళూ చేతులతో, మనసు,వాక్కు, కర్మలతో చేసే సర్వ అపరాధాలనీ క్షమించమని వేడుకోలు. వేడుకున్నంతలో ఫలితం ఉండదు, ప్రతిఫలమూ తప్పదు. అందుకే మనవాళ్ళు "ఎప్పుడు చేసిన కర్మో! ఇప్పుడిలా కట్టికుడుపుతోంద"ంటారు.మరో మాట కూడా చెబుతారు, "నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలం అనుభవిస్తావ"ని. "Karma returns" today saying.  అబ్బే! జాంతానై! గురువూ నై!! దేవుడూ నై!!!,నేటి మాట అస్తు! అస్తు!!


చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు.


చెట్టు పాడవడాన్ని "పుల్ల విరిగింద"ంటాo, మా పల్లెటూరీ భాషలో. చెట్టు కాని, పాదుకాని కాపు పూర్తయి, ఇక ముందు కాయదు అనడానికి సంకేతంగాను, ఇక ముందు చనిపోతుందని సంకేతంగా  ఇటువంటి పిందెలు దిగుతాయి. వీటిని కుక్కమూతి పిందెలంటారు. ఇలాగే మనుషుల్లో కూడా, పిదపకాలపు బుద్ధులు పుడతారంటారు. 


25, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.

 ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.




సాధారణంగా ఉట్టి ఎత్తుగానే కడతారు. రోజూ వాడుకునేదైతే కొంచం తక్కువ ఎత్తులో అంటే ఆ ఇంటి ఇల్లాలు నిలబడి చేతులెత్తితే అందేలా కట్టుకుంటారు. ఇందులో పాలు,పెరుగు దాచుకుంటారు, పిల్లి నుంచి రక్షించుకోడానికి.

ఇక స్వర్గమన్నది ఉందో లేదో తెలీదు, ఉంటే ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపుతారు, ఎంత దూరమంటే తెలీదు.ఎగిరి వెళితే ఎంత కాలం పడుతుందంటే తెలీదు. ఇటువంటి ఏమీ తెలియని స్వర్గానికి, నిలబడి చేతులెత్తి ఉట్టి అందుకో లేని ఇల్లాలు, ఎగిరి వెళ్ళిపోతానందిట, ఆంటే హాస్యాస్పదంగా ఉందని అంటారు గిరీశం భాషలో గోతాలు కొయ్యడం. 


ఇదే మరోలా కూడా చెబుతారు, కూచుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెళతానంది, అని. 


ఒక అత్తా ,కోడలు. అత్త ముసలిదై కూచుంటే లేవలేక లేస్తే కూచో లేక తిప్పలు పడుతోంది. నడుం ఒంగిపోవడంతో తిన్నగా నిలబడలేక, నడవలేక ఉన్నది, లేస్తే ఒంగుని నడుస్తుంది,కఱ్ఱపోటుతో.

 ఒక రోజు కోడలితో తీర్థం వెళతానంది. అత్తా! కూచుంటే లేవలేకున్నారు, ఎలా వెళ్ళగలరు తీర్థానికి? అక్కడ జన సమ్మర్దం, తోసుకుంటారు, మీకంత ఓపిక ఉందా? నడవగలరా? అడిగింది. దానికి అత్త, కూచుని లేవలేకపోవచ్చుగాని , ఒంగుని నడిచి తీర్థం వెళతానూ అందిట. విన్న కోడలు ముసి ముసి నవ్వులు నవ్వుకుందిట, పగలబడి నవ్వలేదు? ఎందుకూ?   



పంచాయతి ప్రెసిడెంట్ గా నెగ్గలేనివాడు ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తానన్నట్టు.

ఇవి రెండూ తెనుగునాట చెప్పుకునే నానుడిలే సుమా!

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

 విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

Continuation of

 https://kasthephali.blogspot.com/2022/09/2024-1.html

విపక్షం నుంచి ఏ ఒక్క పార్టీ బిజెపిని ఒంటరిగా దేశం మొత్తం మీద ఎదుర్కోగల స్థాయిలో లేదు. ఆర్జెడి నేత "కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీరుపోటీ చేయండి, స్థానిక పార్టీలు బలంగా ఉన్నచోట వాటిని బలపరచండి" అని సూచించారు, దానికి కాంగ్రెస్ వారిచ్చిన సమాధానం " మేమింకా బలహిన పడదలుచుకోలేదని" పురిటిలోనే సంధికొడుతుంటే పొత్తులెక్కడా? అనేదే  సందేహం. 


ప్రధాని పదవికి పోటీ పడాలని అనుకునేవారు ఈ కిందివారని ప్రజలమాట, మీడియా మాట.

రాహుల్ గాంధి: వీరి పార్టీకి స్థానిక పార్టీలకి చుక్కెదురు, అన్ని రాష్ట్రాలలోనూ. పాలనానుభవం శూన్యం, కనీసం పంచాయతి ప్రెశిడెంట్ గా కూడా పని చేసిన అనుభవం లేదు. పైనుండి చెప్పడం వేరు, పని చేయడం వేరు. ఇది వీరికి పెద్ద మైనస్ పాయింటే. ఎత్తుచేతివారి బిడ్డ గనక పాలనానుభవం పుట్టుకతోనే వచ్చేస్తుందనేవారూ లేకపోలేదు. ఇతనికి సమయం సందర్భం తెలిసిమాటాడే అలవాటు పూజ్యం అని అంటారు. విపక్షంలో కాకలు తీరిన యోధులున్నారు, పాలనానుభం కొల్లలుగా ఉన్నవారున్నారు. ఇతనిని ప్రధానిగా ఒప్పుకోగలరా అన్నది, పెద్ద ప్రశ్న.మరొకరిని వీరి పార్టీ నుంచి ఎన్నుకునే సావకాశం చెప్పలేనిదే!వీరికి రాగల సీట్లు 50. శత్రువులెక్కువ. 


మమత: వీరు బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి బెంగాల్లో తప్పించి మరో రాష్ట్రంలో పలుకుబడి లేదు. బెంగాల్ దాటి వీరి ప్రభ లేదు,సామాన్యులెవరికి తెలియనివారే! తృణమూల్ పార్టీకి, కాంగ్రెస్ కి, సి.పి.ఎమ్ లు రాష్ట్రంలో ప్రత్యర్థులు.  బెంగాల్లో ఎక్కువలో ఎక్కువ  వీరికి 20 సీట్లకంటే వచ్చే సావకాశం లేదు. మరొక పార్టీకి అదే తమిల్నాడులో డి.ఎమ్.కె కి మాత్రం వీరితో సమానంగా సీట్లు వచ్చే సావకాశం.మమత తాము,అఖిలేష్, ఝర్ఖండ్ వారు ఒక జట్టని ప్రకటించారు. వీరికి రాబోయే సీట్లు 20.


నితీష్: వీరు బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం నుంచే ఉన్నారు. పాలనానుభవం దండిగా ఉన్నవారే!ఇప్పటికే చాలా సార్లు తమపార్టీని కాంగ్రెస్ నుంచి, బి.జె.పి కి మరల ఇటునుంచి అటు కప్పగంతులు వేసి అధికారం నిలబెట్టుకున్నారనే అపప్రథ ఉన్నది. ఇప్పుడైతే ఎన్నికల తరవాత మళ్ళీ బి.జె.పి లోకి గెంతరనే నమ్మకం ఎక్కువమందికి లేదు.అంతేగాక వీరు బి.జె.పి తరఫున పనిచేస్తూ కాంగ్రెస్ వైపుకొచ్చారు, గూఢచారిగా అనే మాట కూడా వినపడుతోంది. వీరికి బీహార్లో తప్పించి మరో రాష్ట్రంలో పట్టులేదు.  నితీష్ ఉ.ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నేటి వార్త. వీరికి ఉ.ప్ర లో పట్టులేదు, కాని వీరికి ఉ.ప్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ తన సీటు ఫూల్పూర్ వీరి పోటికి త్యాగం చేయబోతున్నట్టు వార్త.నితీష్, బాబోయ్! నేనసలు విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ లో ఉన్నానని చెప్పలేదు మొర్రో! అని మీడియా ముందు గోల. వీరికి అందరూ మిత్రులే అలాగే అందరూ శత్రువులే!!! వీరికి రాబోయే సీట్లు 6.


శరద్ పవార్: వయసు మీద బడింది,ఆరోగ్యమూ సరిలేదు, వీరు కేంద్ర మంత్రిగానూ ఉన్నారు, మరాఠా చాణుక్యుడంటారు. వీరికి మహరాష్ట్రలో ఓ చెంపనే బలముంది,మరే రాష్ట్రంలోనూ చెప్పుకోతగ్గ బలం లేదు.  వీరికి రాబోయే సీట్లు 6 కి పెరగవు.  వీరికి కొత్త మిత్రులు పాత శత్రువులు ఒకటే! ఎవరితోనైనా కలసిపోతారు, తమ పని ముఖ్యం,అంతే.


 అఖిలేష్ యాదవ్ : ఉ.ప్ర. కి ఉన్న సీట్లు 80. వీరికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.హిందీ రాష్ట్రాలలో కూడా వీరికి పట్టులేదు, తమ రాష్ట్రం తప్పించి. వీరికి బి.ఎస్.పి కి కుదరదు.  వీరికి రాగల సీట్లు ఇరవైలోపే.ప్రధాని కావాలనే కోరిక ఎక్కడా వెలిబుచ్చినట్లు లేదు.


కేజ్రివాల్: వీరినంతా క్రేజివాల్ అంటారు,అదేమో మరి. వీరు ఢిల్లీ లోనూ పంజాబ్ లోనూ అధికారంలో ఉన్నారు. రేపు హిమాచల్ లోనూ గుజరాత్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామంటున్నారు. వీరికి కాంగ్రెస్ అంటే చుక్కెదురు. మేము అప్పుడే బి.జె.పి వ్యతిరేక ఫ్రంటులో చేరమని ప్రకటించారు. అంటే  తటస్థంగా ఉండి, ఎక్కువ లాభం పొందాలని ఆశ, దురాశ కాకుంటే మంచిదేనేమో!. 


ఇక దక్షణాది కొస్తే, ఇక్కడ్నుంచి ప్రధాని అయ్యే సావకాశాలే తక్కువ.మొత్తం దక్షణాది రాష్ట్రాలలో సీట్లు అన్నీ కలిపి ఆంధ్ర25+తెలంగాణా17+తమిల్నాడు39+కేరళా20+కర్నాటక28=129.ఇక్కడినుంచి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతూ మోడీ ని దించేస్తాం, ఆ తరవాత మాదే ప్రభుత్వం అంటున్న కె.సి.ఆర్ అనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రథములు.పోనీ ఈ దక్షణాదివారంతా ఒక మాట మీదుంటారా అంటే సాధ్యం కానిదే! వీరికి కాంగ్రెస్ కీ కుదరదు. వారున్నచోట వీరుండరు. కాంగ్రెసేతర,బిజెపియేతర ప్రతిపక్షపార్టీలకూటమా? ఇదివరలో చాలా ప్రయత్నాలే జరిగాయి, కాని ఏదీ బతికి బట్టకట్టలేదు.కొత్త పార్టీ స్థాపనా? ఎమో చూడాలి.ఒక రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో నెగ్గుకురాగలగినవారు ఎన్.టి.ఆర్ మాత్రమే! దేశం మొత్తం మీద కొత్త పార్టీ పెట్టి ఆశయాలు చెప్పి అన్ని రాష్ట్రాలలో ఒప్పించగల కార్యకర్తలు, మంది, మార్బలం సమకూర్చుకోవడం తేలికా, రెండేళ్ళలో సాధ్యమా? అభిమానులు జరుగుతుందంటే విని ఆనందించచ్చు.కాని ఇది నిజానికి దూరమేమో! అన్ని పార్టీలు ఎక్కడివారక్కడ పోటీ చేసి ఎన్నికలయ్యాక పొత్తులు కుదుర్చుకుంటాం అంటే ప్రజలు నమ్ముతారా? 


కెసిఆర్: వీరి పార్టీ తెలంగాణా లో పదేళ్ళుగా పాలనలో ఉంది. తెలంగాణాలో పట్టున్నది. కాని రాష్ట్రం దాటి వీరి మాట వినేవారెవరనేది పెద్ద ప్రశ్న.కొత్త పార్టి పెడుతున్నా! ఖబడ్దార్ అని గర్జిస్తున్న మాట నిజం. వీరి రాష్ట్రం లో మొత్తం సీట్లు 17 కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ స్థానాన్ని బి.జె.పి ఆక్రమిస్తున్నందుకే వీరి గర్జనలని విజ్ఞుల మాట. వీరికి మహా ఐతే 10 సీట్లు రావచ్చు. వీరికి కాంగ్రెస్ కి పొత్తు లేదు. వారి నీడ కూడా పడటానికి ఇష్టపడని వీరు కాంగ్రెస్ లేక కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా?వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 

చంద్రబాబునాయుడు: తెలుగుదేశం పార్టి బిజెపితో అంటకాగి YSR CP వేసిన ఎత్తుకు చిత్తయి,బిజెపితో కటీఫ్ చేసుకున్నారు,ప్రభుత్వం నుంచీ బయటికొచ్చారు. దీనికీ ఎవరూ తప్పుపట్టాలేదు. కాని, బద్ధ వ్యతిరేకి ఐన కాంగ్రెస్ తో 2019 లో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నంతో ప్రజలు తిరస్కరించారు. అప్పటినుంచి,ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారానికి దూరమై ఉన్నవారు.నలభై ఏళ్ళ పాలనానుభవం, రాజకీయానుభవం పనిచేయలేదు.వీరికి రాష్ట్రంలో పది సీట్లురావచ్చు.మరో రాష్ట్రంలో పట్టులేదు.పట్టుందని ప్రయత్నించిన కర్ణాటకలో ఎదురు దెబ్బే తగిలింది. వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 


కమ్యూనిస్టులు:అంతర్జాతీయ పార్టీ మాదని చెప్పుకునే వీరు దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు. బెంగాల్ లో తృణమూల్ దెబ్బకి మట్టికరిచి మరి తేరుకోలేకపోయారు. ఇక వీరికి పట్టున్న మరోచోటు కేరళా, కాని ఇది కూడా కుటుంబ పార్టీ ఐపోతోందంటున్నారు. చారిత్రిక తప్పిదాలు చేయడం వీరి అలవాటు. మరెక్కడా ఉనికి ఉన్నట్టు లేదు. కేరళాలోనే వీరికి రాగల సీట్లు 10.


1962 లో మొదటి సారి ఓటేసిన వాడిని, నాటినుంచి ఎన్నికలు చూస్తున్నవాడిని,రాజకీయనాయకులతో,

రాజకీయపార్టీలతో సన్నిహితంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిపినవాడిని. ఆరోజుల్లో కూడా కాంగ్రెస్ నీ గద్దె దించేస్తామన్న వారే అందరూ, కాని ఆ పార్టీ చిత్తు కావడానికి దగ్గరగా ఏభై ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం మూలంగానే!స్వాతంత్ర్యం తరవాత పాలూ తేనెలు ఈ పార్టీ దేశంలో ప్రవహించేస్తుందని నమ్మి మా తాతలు ఆస్థులు తెగనమ్మి ఈ పార్టీని బతికించారు, మమ్మల్ని వీధులపాలూ చేశారు. 

అంతర్గత ప్రజాస్వామ్యం తో దేశప్రజల ఆకాంక్షలు తీర్చగల మరో పార్టీ ఉండటం మంచిదే! అటువంటి పార్టీని నిర్మాణం చేస్తే ఆనందమే.స్వార్ధమే, పరమావధిగానూ, ద్వేషమే ఊపిరితో బతికే పార్టీలు ఏమి చేయగలవన్నదే ప్రశ్న.

పై చెప్పినవారే కాక వెలుగులోకి రాని వారు చాలామందే ఉన్నారు, అందరూ పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరన్నదే ప్రశ్న.

  అనుకున్నట్టే కాక ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయని ఊహిస్తూ అంచనా

CON60+TMC 25+DMK25+NCP10+AAP10+SP 20+RJD 20+TDP10+TRS10 +CPM10 Total 200 small parties say 30.Now the total is 230 along with congress, 170 without congress. It is difficult to understand how a governemt can be formed at centre. 

ఇందులోనే, ఒకరినీడ మరొకరిపై పడినా సహించలేరు.ఒకరిపై ఒకరికి నమ్మకమూ లేదు వీరికి పొత్తెలా? ప్రజలని ఎలా నమ్మిస్తారు?అటువంటి కూటమికి విదేశీ విధానం ఏమిటి? చాలా ప్రశ్నలకి సమాధానం లేదు.కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారంలో ఉన్నవారితో అంటకాగుతాయి, అది సహజం కూడా. ఎన్నికల తరవాత ఎంతమంది ఈ కూటమిలో ఉంటారో! ఎవరు జారుకుంటారో ఎవరు చెప్పగలరు?

బలవంతంగా వీరంతా కలిసినా అదెంతకాలం? అలా కలపగల వారెవరు? సామాన్యునికి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!


21, సెప్టెంబర్ 2022, బుధవారం

ఎద్దు పుండు కాకికి నొప్పా?

 ఎద్దు పుండు కాకికి నొప్పా?

స్వంతవైద్యం చేసుకోకూడదు. అలాగే ఇంట్లో వారెవరూ వైద్యమూ చేయకూడదు,ఎంత గొప్ప వైద్యులైనా. ఎందుకు? ఇదిగదా మన ప్రశ్న :) సందేహజీవులం కదా!


మొన్న నిమ్స్ డిరెక్టర్ అపోలో లో చేరితే నిమ్స్ లో వైద్యం బూటకం వగైరా అనేశారు. కాని ఆయన అపోలో లో చేరి మంచిపని చేశారు. నిమ్స్ లోనే కనక చేరితే అక్కడ ఆయన రోగిగా గుర్తించబడి వైద్యం జరగదు. ఆయన డైరెక్టర్ గానే గుర్తిస్తారు, అందరూ. ఇది ఎంత చెప్పినా వైద్యులు మిగతా సిబ్బంది మీద ఉంటుంది. ప్రమాద సమయాల్లో నిర్ణయం తీసుకోడానికి వైద్యులు జంకుతారు. అందుకు స్వంతవైద్యమూ పనికిరాదు, స్వంత ఇంటిలో వైద్యుడే ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కావలసినవారికి వైద్యం చేయకూడదు. తెలిసిన వైద్యులెవరూ అలా చేయరు. పెరటిలో మనం చెట్టు వేస్తేనే పెరుగుతుంది, దానికి ఎంతో కొంత దోహదం చేస్తాం, అది సహజవాతావరణం పెరిగినదై ఉండదు,దానిలో కొన్ని సహజ గుణాలు లోపిస్తాయి. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు.


సందేహజీవులం కదా మరో సందేహం ప్రాథమిక చికిత్స చేయవచ్చా? ప్రాథమిక చికిత్స ఎప్పుడు చేస్తారు? ప్రమాదం జరిగినపుడు కదా! ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అత్యవసరం, అది ఎవరైన, ఎవరికైనా చేయచ్చు, ఆ తరవాత అవసరాన్ని బట్టి వైద్యుల దగ్గరకు తీసుకుపోవాలి. 


పెరటి చెట్టు మందుకు పనికిరాదు


యజమాని ఎద్దును కాడి మెడమీద వేసి బండికి, నాగలికి కడతాడు. ఐతే పని చేసేటపుడు ఎద్దు మెడమీద అధికభారం మోపితే పుండు పడుతుంది. యజమాని పుండు పడినా పనికి మలుపుతూనే ఉంటాడు, ఎద్దు ఎత్తుబడిపోయేదాకా! . ఎద్దు మెడ మీదపడ్డ పుండు మీదనే కాకివాలుతుంది, మాంసం పొడుచుకుతినడానికి. ఎద్దు కాకిని తోలుకో లేదు. తోక మెడదాకా అందదు, చెవులాడించినా, అవీ మెడమీద కాకిని బయటికి తోలలేవు, ఎద్దు మెడ ఆడించినా కాకి ఎగిరి మళ్ళీ అక్కడే వాలుతుంది. పాపం ఎద్దు అసహాయం గా కాకితో హింసింపబడుతూ ఉంటుంది. కాకికి బాధేంటి ఎద్దుకుగాని? 


సమాజంలో కాకిలాటి వారుంటారు, ఎద్దులా అసహాయంగా బాధ అనుభవిస్తున్నవారూ ఉంటారు. తస్మాత్ జాగ్రత!!! 


ఎద్దు పుండు కాకికి నొప్పా?

19, సెప్టెంబర్ 2022, సోమవారం

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1

విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1


ఈ ప్రశ్న విపక్షాలని తీవ్రంగా కలవరపెడుతోంది. నితీష్ కాంగ్రెస్ పక్కకి చేరడంతో చర్చ ఊపందుకుంది.చిత్రం ఏమంటే, బి.జె.పి నుంచి,తదుపరి ప్రధాని అభ్యర్ధి  మోడీ యేనని ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించేశాయి.


కాంగ్రెస్ దేశంలోని ఐదు పెద్ద రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయింది. అవి ఆ.ప్ర 25,ఉ.ప్ర80,బెంగాల్ 42,తమిల్నాడు 39,తెలంగాణా 17, మొత్తం సీట్లు 203. కాంగ్రెస్  కి ఇక్కడ పోటీకి మనుషులు కూడా దొరికేసావకాశాలు సన్నగిల్లేయంటారు.


ఇక కొన్ని రాష్ట్రాలలో అధికారంలోఉంది.  అవి రాజస్థాన్,చత్తీశ్ ఘర్, ఇక ఈ మధ్యనే మహారాష్ట్రలో,పంజాబ్ లో అధికారం కోల్పోయి బీహార్ లో అధికారం పంచుకుంటోంది. ఈ రాష్ట్రాలలో కూడా చెప్పుకోతగ్గ జనం పార్టీ వెంట ఉన్నట్టులేదు. 


ఇక మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్, కేరళా,గుజరాత్ లలో విపక్షంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో ఈ పార్టీ అడుగంటిపోయింది.      


దేశం మొత్తం మీద పార్టీ పలుకుబడి సన్నగిల్లిపోయింది, భారత్ జోడోయాత్ర  తో బలం పుంజుకుంటుందేమో చూడాలి. ”భారత్ జోడోయాత్ర” ”కాంగ్రెస్ ఛోడో” యాత్ర కాకుంటే చాలని అభిమానుల ఆవేదన. ఎలా చూసినా పెద్ద రాష్ట్రాలలో పట్టులేక అధికారం సంపాదించడం తేలిక కాదు.కాంగ్రెస్ కి ఇప్పుడున్నట్టుగానే ఏబై సీట్లు దాకా రావచ్చు,అంతకు మించి పెరిగేసూచనలేం కానరావటం లేదు.ఇక మిత్రులు చూదామంటే ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పార్టీలన్నీ విరోధులే. మిత్రులుగా  ఉన్నది ఒక్క తమిల్నాడులో డి.ఎమ్.కె మాత్రమే. ఈ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచే అధికారం గుంజుకుంది.

ఈ పార్టీ నుంచి ముఖ్యనాయకులందరూ వరసకట్టి బయటకుపోతున్నారు. ఇటువంటి వారిలో ముఖ్యమైనవారు గులాం నబీ ఆజాద్,రేపో,నేడో  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా బి.జె.పి లో చేరుతున్నట్టు వార్త.  ఈ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోడానికి తిప్పలుపడుతోంది. రాహుల్ గాంధీ యే మరలా అధ్యక్ష పదవి తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి తీర్మానించినట్టు వార్త. ఏమైనా రాహుల్ గాంధీ తప్పించి మరొకరు ఈ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి అయే సావకాశాలే లేవు. ఐతే ఎందరు విపక్షంనుంచి రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.


ఒకప్పుడు స్వాతంత్ర్యం సంపాదించడానికి కారణభూతమయ్యామని చెప్పుకునే పార్టీ, నేడు ఎందుకు ఇంత దిగజారిపోయింది?స్వయంకృతాపరాథం అని ఒక్కమాటలో చెప్పెయ్యచ్చు. ఈ పార్టీ నాయకుల ఆస్థులు స్వాతంత్ర్యం ముందు ఎంత? నేడు ఎంత ఉన్నాయి, వారేం చేసి ఇప్పుడున్న ఆస్థులు సంపాదించారన్నది విచారిస్తే నిజం బయటపడుతుంది. అధికార దాహం, కుహనా గాంధీ కుటుంబ పరిపాలనే దీనికి కారణమని వారి పార్టీ నుంచి బయటికొచ్చిన వారు ఎలుగెత్తి చెబుతున్నమాట. కర్ణుని చావుకి కారణాల్లా ఈ పార్టీ అంతరించిపోయే దశలో కారణాలు చాలానే కనపడుతున్నాయి. గొడ్డు గోతిలో పడితే తలో బెడ్డా వేసేరన్న నానుడికి సరిపోతుంది.


ఇతర పార్టీలనుంచి, చాలా మంది నాయకులు ప్రధాని కావాలని ఆశ పడుతున్నారు, ఒక్కొకరిని చూదాం! పార్టీల బలాబలాల నుంచి వారి శక్తి యుక్తుల దాకా!

(సశేషం)   


18, సెప్టెంబర్ 2022, ఆదివారం

తా వలచింది రంభ తా మునిగింది గంగ

తా వలచింది రంభ తా మునిగింది గంగ



1.సొమ్ములున్నవాడికి పార్టీ టిక్కట్టు ఇచ్చి, సొమ్ములకి పార్టీ టిక్కట్లు అమ్ముకుని, గెలిచిన వాడు ఎదుటిపార్టీ వాళ్ళకి అమ్ముడు పోయాడని అనుకోడం

మన బంగారం మంచిదయితే కంసాలిని ఆడిపోసుకోడం ఎందుకూ? 


2.విపక్ష ఎమ్.ఎల్.ఎ లని తన పక్షంలోకి తాము చేర్చుకుంటే అభివృద్ధిని చూసి మా పార్టీలో చేరేరంటాం, అదే పని మరొకరు చేస్తే హోల్ సేల్ గా కోనేసేరంటాం :)

మనం చేస్తే శృంగారం అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం.



3.తల్లీతండ్రీ బూతులు మాటాడుతోంటే కొడుకు కూతురు నీతులు మాటాడతారా?

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?



4.తనకి నచ్చిన పార్టీ దొంగలగుంపైనా ప్రజస్వామ్యం ఉన్నపార్టీ అదే మరో పార్టీ ఐతే నిక్కచ్చి కుటుంబ పార్టీ అంటాం.

తా వలచింది రంభ తా మునిగింది గంగ


మాటకి మాట తెగులు నీటికి నాచు తెగులు

ఇదే రాజకీయం.


ఒక రాజకీయనాయకుడు తమ పార్టీ గురించి వెలిబుచ్చిన సత్యం.

మా పార్టీలోకి రావడం తేలిక, బయటికి పోవడమూ తేలికే, కాని పార్టీని అంటి పెట్టుకుని ఉండటం కష్టం.

పచ్చి నిజం :)

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

పిల్లి మెళ్ళో గంట కట్టాలె

  పిల్లి మెళ్ళో గంట కట్టాలె


బహు కుటుంబీకుడైన ఒకరి ఇల్లు. ఆ ఇంట్లో ధాన్యం,బియ్యం దాచుకునే ఒక గది, పశువులకి అవసరమైన చిట్టూ,తవుడూ దాచుకునే మరోగది, చల్లగది,వంటగది, భోజనాలశాల,సరుకులు దాచుకునేగది,అదే కొట్టుగది , ఆహారపదార్ధాలు దాచుకునేగది, పడకగదులు, ఇలా చాలా గదులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ ఇంట్లో పందికొక్కులు, ఎలకలున్నాయి. పందికొక్కులు, ఎలకలు అన్నిటిని తిన్నంత తిని, మిగిలినది పాడు చేస్తున్నాయని,కొంప తవ్విపోస్తున్నాయని,  యజమాని సాయంత్రానికి అన్ని గదుల తలుపులు మూయిస్తూ వచ్చాడు, కాని ఎలకలు మాత్రం చూరుల వెంబడి కదులుతూ,తలుపులు చిల్లుపెట్టి, ఒక గదినుంచి మరోగదికి నేలలో పందికొక్కులు  బొరియలుచేసి యధేచ్చగా అన్నిటిని పాడు చేస్తూనే ఉన్నాయి. పడకగదులుల్లో కూడా ఎలకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  యజమాని బాధపడుతూనే ఉన్నాడు.  ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. కాని తలుపులు మూసి ఉండటంతో ఎలుకలు చిక్కడం కష్టమయింది,పిల్లికి.  యజమాని, కుటుంబ సభ్యులు విసిగిపోయారు, రాత్రులు తలుపులు మూయడం మానేశారు, దాంతో పిల్లికి వీలు చిక్కి దొరికిన పందికొక్కును, ఎలుకను దొరికినట్టు స్వాహా చేస్తూ వచ్చింది. చూసిన యజమానికి చేసిన పని బాగున్నట్టనిపించింది. ఎలుకలకి కొంత స్వేఛ్ఛ తగ్గింది, దీనితో ఎలుకలన్నీ కటకట పడ్డాయి. ముసలి ఎలుకలు, ముసలి పందికొక్కు అధ్యక్షతన  ఒక సభ చేయాలని, పిల్లి నుంచి ఎలుకలకు కలిగే నష్టాన్ని లేకుండా చేసుకోవాలని  తీర్మానించుకున్నాయి. ఆ సభకు ముసలి పందికొక్కును అధ్యక్షునిగా చేసుకుని సభ తీర్చి ఏమి చేయాలనేది ఆలోచించాలని, అనుకున్నాయి. 

 నేడు,రేపు అంటూనే సభ వాయిదా పడుతూ వచ్చింది. చివరికో రోజు సభ తీరాయి. ముసలిపందికొక్కు అధ్యక్షతన. అధ్యక్షులవారు స్వాగతోపన్యాసం ఇస్తూ జరుగుతున్నది చాలా అన్యాయం, దీన్ని ఎదుర్కోవలసిందే! అని శలవిచ్చి,పందికొక్కులు త్యాగాలు చేసినవని, అన్యాయాలను ఎదుర్కొని పోరాడినవని, మాది త్యాగధనుల వంశమని పొగుడుకుని, మిగతావారికి సావకాశం ఇచ్చారు.  యువ ఎలుకలు,  ఆవేశంగా ఉపన్యాసాలిచ్చాయి. యువ ఎలుకలు పందికొక్కులే త్యాగధనులు కాదు, మా వంశాలలలోనూ త్యాగధనులున్నారు, పోరాడుతూ ప్రాణాలూ పోగొట్టుకున్నవారున్నారు, ఇలా విడతీసి మాట్లాడటం అధ్యక్షులవారికి తగనిపని అన్నాయి. దానికి పందికొక్కులు ఉన్నమాట చెప్పేరు అధ్యక్షులవారు,వారి వంశం త్యాగధనుల వంశం అని వంత పాడేయి. దీనికి ఎలుకలు కినిశాయి. మమ్మల్ని కించపరచడానికే సభ చేసినట్టుందని పందికొక్కులు బయటకి పోతామని బెదిరించాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక సమస్య చర్చించాలిగాని ఇలా పక్కదోవ పట్టించకండని సుతి మెత్తగా అందరిని మందలిస్తే ఆవేశాలు చల్లారాయి. 


 పిల్లిని కట్టడి చేయాలి, మన వంశాలు నాశనం కాకుండా చూడాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ లోగా పిల్లి సడి పసికట్టిందో ఎలక, పక్కదానిని హెచ్చరించింది, అది మరోదాన్ని హెచ్చరించడంతో ఎలకలన్నీ సభ వదలి పారిపోయాయి. మళ్ళీ సభ చేయాలని అనుకున్నాయి. ఆవేశంగా ఉపన్యాసాలివ్వడం కాదు ఏమి చేయాలన్నిది సూచనలు చేయాలని అనుకున్నాయి. వాయిదా పడుతూ పడుతూ సభ జరిగింది మరోరోజు. ముసలి పందికొక్కును అధ్యక్షత వహించమన్నాయి, ఎలుకలు, దానికి ము.ప నాకా వయసు చెల్లింది, నా స్థానంలో నా వంశం వారిని అధ్యక్షులుగా చేసుకుని సభ చేయమని సలహా చెప్పింది. దానికి కొన్ని ఎలుకలు వ్యతిరేకించాయి, మరికొన్ని మద్దతు పలికాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక ఇదంతా వ్యర్థం, అది పిల్లి, దొరికితే నోట కరుచుకుపోతుంది, సభ చాలించి ప్రాణ రక్షణ చూసుకోండని, సలహా ఇచ్చింది. దానికో పందికొక్కు,ఇది పిల్లి పక్షం మాటాడుతోంది, పిల్లి దీనికేమైనా ఎర చూపిందేమో అన్నాయి పందికొక్కులు. దానికి ఎలకలు ఉన్నమాట చెప్పినదానికి అంత ఉలుకెందుకని నిలదీశాయి. ముసలి ఎలక మాటాడుతూ అది పిల్లి, ఎవరినైనా నోట కరుచుకుపోతుంది, ఉన్నమాట చెప్పి చెడ్డయ్యాను,   నాకెందుకొచ్చిన గోలంటూ, సభ వదలిపోయింది.   ఒక యువ ఎలుక పిల్లి చప్పుడు చేయక వచ్చి మనమీద దాడి చేస్తోంది కనక, పిల్లి వస్తున్నట్టు తెలియాలంటే మెడలో గంట కడితే సరికదా అని సలహా ఇచ్చింది. దీనికి సభలో వారంతా భేష్! భేషని చంకలు గుద్దుకున్నారు. ఇంతలో పిల్లి వస్తున్న సడి వినపడింది, ఎలకలు,పందికొక్కులు పరిగెట్టేయి. 

( సశేషం )


15, సెప్టెంబర్ 2022, గురువారం

గాడిద మాలక్ష్మికీ జై

గాడిద మాలక్ష్మికీ జై   

వ్యాధి నిరోధక శక్తి అనేది బజారులో కొనుక్కుంటే దొరికేది కాదు. దీనికోసం మనవారు చాలా ప్రయత్నాలే చేశారు, అందులో కొన్ని, దొండాకుపసరు తాగించడం, వసపోయడం, తిప్పతీగనుంచి తిప్పసత్తు తయారు చేసుకువాడటం, గాడిదపాలు తాగటం, ఒంటెపాలు తాగటం ఇలా చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక టపారాస్తూ గాడిద పాల వ్యాపారం లాభసాటి అన్నాను.అది నిజమని నిరూపించబడింది. చూడండి. 

https://kastephale.wordpress.com/2016/02/27/


శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం  తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో,  మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!


12, సెప్టెంబర్ 2022, సోమవారం

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)


కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో,కృపాచార్యునితో, దుర్యోధనుడు, కర్ణుని గురించి మాటాడుతూ చెప్పిన మాట. 


కులము గలవాడు శౌర్యము గలవాడును నధికసేన గలవాడును భూ

తలమున రాజనునామము విలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్

ఆంధ్ర మహాభారతం,ఆది పర్వం షష్ఠాశ్వాసం, 46


కులములో పుట్టినవాడు, శౌర్యం ఉన్నవాడు, అధికమైన సేన కలవాడు, ప్రపంచంలో రాజని పిలవబడతాడు.


 మారాజా! మా మంచిమాట సెలవిచ్చావయ్యా!! నాటి కాలం మాట దేవుడెరుగుగాని, నేటి కాలానికి తమరు చెప్పిన మాట అచ్చరాలా నిజం బాబయ్యా! 


కులంలో పుట్టినవాణ్ణి ఎలాగా రాజనే పిలుస్తారు, కాని రాజకుమారుడే రాజవుతాడు. శౌర్యముకలవాడు అంటే, రక్షకుడు, ధైర్యవంతుడు,వీరుడు అని అర్ధాలు చెప్పటం లేదు దొరా! నాటికాలానికి పెక్కుమందిని రక్షించగలవాడినే వీరుడు,శౌర్యవంతుడనేవారు. నేటి కాలానికి ఎంత ఎక్కువ మందిని భయపెట్ట గలవాడినే రాజు కాదుగాని నాయకుడని అనేస్తున్నారు. తమరు చెప్పినట్టు ఇక్కడ కులంతో పనిలేదు దొరా! భయపెట్టడం అంటే మామూలుగా కాదు దొరా! చంపడం దగ్గర నుంచి, చంపుతానని, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని, లేదా నీ పెళ్ళాన్నే ఎత్తుకుపోతానని, లేదూ నీ ఎదురుగానే నీ కూతురునీ,పెళ్ళాన్నీ మానభంగం చేస్తానని, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నావని పట్టిస్తానని, ఇలా రకరకాలుగా భయపెట్టి, చేయగలవాడినే మేము నాయకుడని పిలుస్తున్నాం దొరా!! వాడు ఎవరికి చెబితే వాడికే ఓటు వేస్తున్నాం, ఇదేగా మరి జరుగుతున్నది దొరా!!!


అధిక సేనగలవాడు రాజంటారన్నారు తమరు. దేవరా!! సేన ఊరికే వస్తుందా? సొమ్ము లేనిది సేనెక్కడినుంచి వస్తుంది దేవరా!! నిజం దొరా! నేడు ప్రపంచంలో ఎక్కువ సేన, గొప్పగొప్ప, కొత్తకొత్త,మారణాయుధాలు ఎక్కువ ఉన్నదేశనాయుకుడే నేడు ప్రపంచ పోలీసు దొరా!!! ఆ దేశం పేరు చెప్పి  నాయకుడు ఏదైనా చేస్తాడు దేవరా!! 

 మాది ప్రజాస్వామ్యం, మాకు రాజులుండరు అన్న దేశాలవారి నాయకులు, ఇతరదేశాలవారిని అనేకరకాలుగా అణచేస్తున్నారు దొరా! 

ఇక ప్రజాస్వామ్యం కాదు, మాది సోషలిజం అంటున్న దేశాలూ అదే పని చేస్తున్నాయి దొరా! 

మరికొన్ని ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం వెళ్ళబోస్తున్నాయి. ప్రపంచంలో మంచి,మంచివన్నీ ఎత్తుకొచ్చి, తెచ్చినవన్నీ బహిరంగంగా సిగ్గులేక ప్రదర్శిస్తూనూ ఉన్నాయి. ఈ పెద్ద దేశాలని చెప్పుకుంటున్నవారొక సంస్థను ఏర్పాటు చేసి, వారు చెప్పినదే వేదమని, నిరంకుశత్వం చేస్తూ దాన్ని ప్రజాస్వామ్యం అని నమ్మమంటున్నాయి దొరా! ఇటువంటి దేశాల వారే రాజులుగా చెలామణీ అవుతున్నారు దేవరా!! తమమాట నిలబెట్టేరు దొరా!!!


ఇంతకీ సొమ్మున్నవాడే రాజంటారు, అంతేగా దేవరా!!!


10, సెప్టెంబర్ 2022, శనివారం

తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!

  తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!



పార్టీ అధికారంలో ఉన్నపుడు-నాయకులు


ఎప్పుడు సంపద గల్గిన

యప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెరువు నిండిన

గప్పలు పది వేలు చేరు గదరా సుమతీ!

సంపదలు కలిగినప్పుడు అందరూ బంధువులే, ఎక్కడెక్కడినించీ పుట్టుకొచ్చేస్తారు, ఎలా? చెఱువు నిండితే,నీటితో, కప్పలు పదివేలు చేరాతాయన్నట్టు.


పార్టీ వదిలేసిన నాయకులు 


కమలములు నీటబాసిన

కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్

 మతమ నెలవులు దప్పిన

తమమిత్రులె శత్రులగుట  తథ్యము  సుమతీ

కమలం నీటిలో ఉన్నంతకాలం నవనవలాడుతూ ఉంటుంది. అదే కమలాన్ని నీటిలోంచి తీసేసి బయట పడేస్తే వాడిపోతుంది, ఎందుకు? కమలాక్షుని రస్మిసోకి, అంటే సూర్యుని కాంతికి వాడిపోతుంది. అలాగే ఎవరి స్థానాలలో వారున్నంత కాలం సవ్యంగానే ఉంటుందంతా, కాని తమతమ నెలవులు దప్పిన మిత్రులే శత్రువులైపోతారోయ్! 


అధిష్టానం-పార్టీ వదిలేసిన నాయకులు


కూరిమిగలదినములలో

నేరములెన్నడుడును గలుగ నేరవు మరి యా

 కూరిమి విరసంబైనను

నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!

స్నేహం కలిగినన్నాళ్ళు తప్పులేం కనపడవు,కాని ఈ స్నేహం కనక చెడితే అన్నీ తప్పులే కనపడుతూ ఉంటాయ్! జాగర్తా!!! 


గొడ్డు గోతిలో తలో బెడ్డా వేసేరని.


గొడ్డు చాలా బలమైనది, అవసరం లేకపోయినా ఒక నమస్కారం పెట్టి తప్పుకున్నారు, అది బయట ఉన్నకాలంలో తప్పుకు తిరిగేరు. కాని అది కాలవశాన గోతిలో పడింది, ఇక అందరూ వీరులే,అందరూ తలో బెడ్డా విసిరేవారే!!! 


లోకంబాబూ!!! లోకం!!!


7, సెప్టెంబర్ 2022, బుధవారం

ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.





ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.


 బాల భాస్కరుడు




ఉదయమే నిద్ర లేచి మంచం దిగే ముందు పడకమీదనుంచే సెల్ ఫోన్ మొహం చూసిగాని మంచందిగటం లేదెవరూ! నేటి కాలంలో, కాని, కొంతమంది ఇంకా ఈ శ్లోకాలు పఠించి చివరి శ్లోకంతో మంచం దిగుతూ భూమికి నమస్కరించే వారున్నారు, అరుదుగా! 
అసలీ శ్లోకాలేంటి? వాటి అర్ధ పరమార్ధాలేంటీ?


గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః

గురువు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్తు దేవుడు, అటువంటి గురువుకు నమస్కారం.

ఆపదామపహర్తారం
దా తారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

ఆపదలనుంచి కాచేవాడు, సంపదలిచ్చేవాడు,ఎల్లరచే కొనియాడబడేవాడైన రామునకు మరల, మరల నమస్కారం.

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనం

చేతి చివర లక్ష్మి,మధ్య సరస్వతి, చెయి మొదట గోవిందుడు ఆవాసం చేస్తున్న చేతిని చూస్తున్నానని,అంటూ కనులు తెరచి,అరచేతుల్ని చూచి కనులకద్దుకుంటాం.

సముద్రే వసనే దేవీ
పర్వతే స్తనమండలే
విష్ణుపత్నీనమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వ మే

సముద్రంలో తేలియాడుతున్న దేవత, పర్వతాలే స్తనమండలాలుగా ఉన్న విష్ణుపత్నియైన భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను క్షమించు.
అంటూ కాలు భూమి మీద పెడతాం. 


జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు బ్రహ్మ స్వరూపం, చిటికినవేలు పట్టి నడిస్తే లోకాన్ని చూపించిన గురువు తండ్రి విష్ణు స్వరూపం, అజ్ఞానాంధకారాన్ని జ్ఞానమనే వెలుతురుతో పాలద్రోలిన గురువు మహేశ్వర స్వరూపం. ఆ తదుపరి గురువే దైవ స్వరూపం అని నొక్కి వక్కాణించారు,అనగా తల్లి,తండ్రి, గురువులే దైవ స్వరూపాలని చెప్పేరు, గురు సాక్షత్ పరబ్రహ్మ అంటూ.అటువంటి గురువులైన తల్లి,తండ్రులకు, గురువుకు దైవానికి నమస్కారం. 
ఆతదుపరి

రామో విగ్రహవాన్ ధర్మః ఇది మారీచునిమాట, రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షతిః రక్షితః, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. అటువంటి ధర్మానికి మరల,మరల నమస్కారం,అంటే ధర్మాన్ని ఆచరిస్తానని ప్రతిన, ధర్మం రక్షిస్తుందని నమ్మకం. ధర్మానికి నమస్కారం.



చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారు. గోవిందా అంటే నారాయణి,  నారాయణి,నారాయణులకు అభేధం, అక్కడ గోవిందా అంటే పార్వతి, లలితాదేవి స్వరూపం. లలితా దేవికి మరో పేరు ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణీ అంటారు. ఈ మూడు రూపాలూ బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల శక్తి రూపాలు. సర్వమూ నా చేతిలో ఉంది, నా ప్రయత్నంతో సర్వమూ సమకూడుతుందనే నమ్మిక,ప్రతిన. నా ప్రయత్నానికి దైవ శక్తి తోడవాలి,తోడవుతుందని కనులు తెరచి అరచేతులను చూచి కళ్ళకద్దుకుంటాం, ఇది స్వశక్తి మీద నమ్మకం కలగజేసుకోవడం.

సముద్రంలో నివసించే దేవీ, పర్వతాలే స్తనాలుగా కలిగిన, విష్ణుశక్తి స్వరూపిణి భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను,క్షమించమని వేడటం. 

సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, "సర్వం విష్ణుమయం జగత్", విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం.  



1, సెప్టెంబర్ 2022, గురువారం

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)


భయపడి వరాలిచ్చాడు.

ఎవరికి భయపడ్డాడు?

ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి.

ఎవరువారు?

1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి.

ఎందుకుభయపడ్డాడు

గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె ’జయోస్తు’ ని దీవించలేదు, ’యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. 


గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   


ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!.... ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు

కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.


ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! 

 స్వస్తి.



29, ఆగస్టు 2022, సోమవారం

మళ్ళీ జూదం (అనుద్యూతం)

మళ్ళీ జూదం (అనుద్యూతం)

అంధ్రమహాభారతం,సభాపర్వం,ద్వితీయాశ్వాసం 270 నుండి 279 వరకు స్వేఛ్ఛానువాదం.


 జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ధర్మరాజుకి,కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పి, వారి రాజ్యం వారికిచ్చి పంపించాడు. వారంతా ఇంద్రప్రస్థం వెళ్ళారు. 


"ఇక్కడ జరిగిన సంగతంతా దుశ్శాసనుడు అన్న దుర్యోధనుని చెవిని వేశాడు. దుర్యోధనుడు, కర్ణ, శకుని,సైంధవులతో ఆలోచించి ధృతరాష్ట్రుని దగ్గరకొచ్చి,ఎంతమంచి చేసినా పాండవులకు ప్రీకరమైనవాళ్ళమవుతామా? పగపట్టిన పాముని మెడలో వేసుకున్నట్టయింది, పొరపాటు చేసేసేం.బలవంతులైన అర్జున,భీమ, నకుల సహదేవులను యుద్ధంలో గెలవగలమా? అంచేత మళ్ళీ వాళ్ళని ద్యూతం లో ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టడం చేయవలసిన పనని ధృతరాష్ట్రుని చెప్పగా ఒప్పుకుని మళ్ళీ జూదానికి రమ్మని ప్రాతికామిని పంపించాడు. ప్రాతికామి చెప్పినకబురుతో ధర్మరాజు, అనుజ,భార్యా సహితుడై హస్తిన చేరాడు, తండ్రి మాట జవదాటలేనని, మిత్రులు ప్రజలు గోలపెడుతున్నా!. ఇదివరలాగే అదే సభాభవనంలో ఆసీనులుకాగా, శకుని ధర్మరాజుతో సంపదలు రాజ్యము మీకు ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇచ్చేడు, కనక వాటిని పందెంగా ఒడ్డి అడటం కుదరదు.ఇప్పుడు నేను చెప్పే పందెం అపూర్వం. ఇందులో ఓడినవారు నారచీరలుగట్టి,బ్రహ్మచర్యంతో, కందమూలఫలాలు తింటూ, పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి, పదమూడో ఏట జనపదంలో అజ్ఞాతవాసమూ చెయ్యాలి. అజ్ఞాతవాసంలో పట్టుబడితే మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసమూ, ఆపై అజ్ఞాతవాసమూ చెయ్యాలి. ఇందుకు ఇష్టపడితే జూదమాడదామన్నాడు. ధర్మారజు పందెం ఒడ్డేడు, ఓడిపోయాడు. అన్నట్టుగానే నారచీరలుగట్టి వనవాసానికి పోయారు."  

కొద్దికాలం కితం జూదం జరిగినదానికి, కొడుకులు చేసిన అకృత్యాలకి క్షమాపణ చెప్పిన ధృతరాష్ట్రుడు, మళ్ళీ జూదానికెందుకొప్పుకున్నట్టు?


కొడుకు మొహమాటం లేకుండానే చెప్పేసేడు, వాళ్ళు బలవంతులు, యుద్ధం చేసి నెగ్గలేం. ఎలాగైనా వాళ్ళని రాజ్యం నుంచి బయటకి తోలెయ్యడమే కావలసింది, అనికూడా చెప్పేసేడు. ధృతరాష్ట్రునికి కావలసింది కూడా పాండవులు బయటికిపోవడమే! కాని అది తను చేస్తున్నట్టు ఉండకూడదు, అదీ ఉద్దేశం. మూలకారణం ధృతరాష్ట్రుడే! 

కితం సారి జూదం జరిగినపుడు సభంతా కలగుండుపడింది, నాడు జరిగిన విషయాలన్నీ అందరికి బాధ కలిగించాయి. గాంధారి అగ్నిపర్వతంలా ఉంది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేనట్టు ఉంది. ఇక ద్రౌపది బద్దలైన అగ్ని పర్వతమే, వాళ్ళని చల్లార్చకపోతే నాడు కురుక్షేత్రం అక్కడే జరిగుండేది. అందుకు వరాలిచ్చి బులిబుచ్చి మాటలు చెప్పి వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు కొడుకు చెప్పిన పథకం నచ్చింది. ఇందులో రాజ్య ప్రసక్తిగాని, స్త్రీలను అవమానించే ప్రసక్తిగాని లేదు. పదమూడేళ్ళ తర్వాత ఏమగునో? ఎవరి కెరుక? అదేగాక అజ్ఞాతంలో దొరికితే మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చెయ్యాలి, పథకం బాగా నచ్చింది, ధృతరాష్ట్రునికి, అందుకే మళ్ళీ కబురు పెట్టేడు. ధర్మరాజుకి బుద్ధి లేదా? ఆయనదొకటే మాట తండ్రి చెప్పేడు, అంతే!


27, ఆగస్టు 2022, శనివారం

ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.

 ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు చెప్పిన క్షమాపణ.


జూదమయిపోయింది, ధర్మరాజు సర్వమూ కోల్పోయాడు, తననూ తమ్ములనూ కోల్పోయి శకుని చెప్పినట్టు ద్రౌపదిని ఒడ్డి ఓడి పోగా, ఆమె ఏకవస్త్రను, రజస్వలను అని చెబుతున్నా వినక దుశ్శాసనుడు కొప్పుపట్టి సభకు ఈడ్చుకురావడం, ఆపై  వస్త్రాపహరణానికి ప్రయత్నమూ జరిగింది. భీముని ప్రతినలూ అయ్యాయి. ఈ సందర్భంగా గాంధారి విదురునితో వచ్చి సభలో జరిగినిది సర్వమూ చెప్పడమూ జరిగింది, ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచి రెండు వారాలివ్వడమూ జరిగింది, ఆమె అడగకపోయినా. ఆ తరవాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును, తమ్ములందరితోనూ దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. 

మహాభారతం, కవిత్రయ ప్రణీతం, సభాపర్వం,ద్వితీయాశ్వాసం 264నుండి 267 వరకు.


"అనిన ధృతరాష్ట్రుండు కోడలిగుణంబుకు ధర్మంబెరుగుటకు సంతసిల్లి యనుజ సహితంబుగా యుధిష్ఠరు రావించి నీవు సర్వసంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున కరిగి సుఖంబుండుము నీకు లగ్గయ్యెడు మని వెండియు.......264


నీవు నిత్యము వృద్ధోపసేవజేసి యెరుగు దెల్లధర్మంబుల నెరుక లేక

కడగి నీ కెగ్గు సేసె నాకొడుకు దీని మఱచునది నీకు నొండ్లు గఱపనేల...265


మనమున వేరమి దలపమియును సక్షమచిత్తుడగుటయును గుణంబులుకై

కొని దోషంబులు విడుచుటయును నుత్తముడయిన పురుషునుత్తమగుణముల్....266


యేను బుద్ధిలేక జూదంబుపేక్షించితి. నల్పబుద్ధిసత్వుం డయిన నన్నును మీతల్లి యయిన గాంధారినిం దలచి,దుర్యోధనాదులు సేసినదుర్నయంబులు సేకొనకుండునది. సర్వశాస్త్ర విదుండయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండువుగా నిక్కురుకులంబునకు లగ్గగునని ధర్మరాజు బాండురాజు రాజ్యంబునందు సమర్పించిన...267"


//నీ సంపదలు,స్వరాజ్యం తీసుకుని ఇంద్రప్రస్థం వెళ్ళి సుఖంగా ఉండు, నీకు మంచి జరుగుతుంది.నీవు పెద్దవాళ్ళని సేవించడం మూలంగా ధర్మాలన్నీ తెలుసు, నాకొడుకు ధర్మం తెలియక నీకు కీడు చేసేడు, దీన్ని మరచిపో! అన్నీ తెలిసినవాడివి నీకు మరొకరు చెప్పాలా! మనసులో వేరుగా తలపకపోవడం, క్షమాచిత్తం కలిగి ఉండడం, మంచిని తీసుకుని చెడును వదలిపెట్టడం ఉత్తములైనవారి ఉత్తమగుణాలు.

నేను బుద్ధిలేక జూదాన్ని తేలికగా, అశ్రద్ధగా,తీసుకున్నాను. నిర్లక్ష్యం చేశాను.  అల్పబుద్ధి కలిగిన నన్నూ మీతల్లి గాంధారిని తలచి, దుర్యోధనాదులు చేసిన చెడ్డపనులు మనసుకు తీసుకోకు. సర్వశాస్రాలూ తెలిసిన విదురుడు మంత్రిగా నీవు రక్షకుడవుగా ఉంటే ఈ కురుకులానికి మంచి జరుగుతుందని చెప్పి ధర్మరాజుకు పాండురాజు రాజ్యం సమర్పించాడు. //


నాకు బుద్ధిలేకపోయిందయ్యా! నాకు బుద్ధి లేకపోయి జూదాన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేశాను. స్వార్ధబుద్ధి కల నన్నూ మీ తల్లి గాంధారి ముఖాలు చూసి నాకొడుకు వాని అనుచరులు మీ పట్ల చేసిన చెడ్డపనులు మరిచిపో, క్షమించు. 

26, ఆగస్టు 2022, శుక్రవారం

నమస్కారం



 నమస్కారం


బ్లాగులో రాయడం అన్నది ఒక వ్యసనమైపోయింది, నాకు, కాని బ్లాగు రాయడం కూడా ఒక కళే! కలకాదు సుమా! :) 


కాదు సుమా! కలకాదు సుమా!! అమృతపానమున అమరగానమును, గగనయానమును కల్గినట్లుగా గాలినితేలుచు  సోలిపోవుటిది, 

కాదు సుమా! కలకాదు సుమా!! 


 బ్లాగు మొదలుపెట్టి పదకొండేళ్ళవుతోంది. ఇబ్బందులు, కష్టాలు, బాధలు అనుభవిస్తూ వాటిని బ్లాగులో పంచుకోవడం అలవాటయిపోయింది. ఈ అలవాటు ఎప్పుడు తప్పుతుందో తెలియటం లేదు. నేనా సహస్రచంద్ర దర్శనానికి దగ్గరలో ఉన్నాను, శని ప్రస్తుతం మకరం లో ఉన్నారు, శని మేషం లోకి వచ్చేదాకా ఇది కొనసాగగలదని అనుకుంటున్నాను :). 

దీనికి తోడు కవిని కూడా (కవి,కనపడదు, వినపడదు)ఇప్పుడు మాటాడాలంటే ఎవరు ఉంటారు?ఉన్నన్నాళ్ళూ ఇల్లాలు వినేది, నాలుగేళ్ళయింది, దాటిపోయి.  నా చెవిటి గోల వినడానికి ఎవరు ఉంటారు  ? ఎవరిగోల వారిది కదా! అందుకు వాటిని బ్లాగులో ఒలకబోసుకోవడం. :) బ్లాగులో రాసేవి ఎప్పుడూ ఎవరిని ఉద్దేశించినవి కావు. నాకెవరి మీద కోపం, కసి,ద్వేషం లేవు, రావు కూడా! మౌనేన కలహో నాస్తి అని నమ్మినవాడిని. చదువుకోనివాడిని, పల్లెటూరివాడిని, మా పల్లెటూరి మాటలు సున్నితంగా ఉండవు, కొంచం మోటు కూడా!. డిగ్రీలు లేవు, యూనివర్సిటీలు ఎరగను, కాలేజి మెట్లే ఎక్కనివాడిని యూనివర్సిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదం కదా! చిన్నప్పుడు బట్టీ వేసిన కొన్ని శతకాలు మాత్రం అస్తిగతాలు. అవే బయటపడుతుంటాయి.  మనసులో బాధ, సంతోష వ్యక్తం చేయడమే! ఎవరేనా కొన్నిమాటలు గాని, కొన్ని టపాలుగాని తమను ఉద్దేశించినవి అని అనుకుంటే అసహాయుడను.

నమస్కారం.


 ఆగండి! ఆగండి!! ఎవరో ఏదో అన్నారని, అనుకున్నారని బ్లాగులో రాయడం మాత్రం మానలేను, లేను,లేను.   


మరోసారి నమస్కారం పెట్టను ఎందుకో చెప్పండి :)

25, ఆగస్టు 2022, గురువారం

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?

 ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?


ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264 వరకు స్వేఛ్ఛానువాదం


ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. 


ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు,దుర్యోధనుడు. 

దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృద్ధులు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. 


దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే!  నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు.

ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. 


విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి

’నా కోడళ్ళంద’రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. 


నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు. ధర్మరాజా! నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,  ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు.


 ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి...



23, ఆగస్టు 2022, మంగళవారం

రుచి చేకురునటయ్య భాస్కరా!

 రుచి చేకురునటయ్య భాస్కరా!


కొంతమందితో మాటాడకపోవడం తప్పు. మరికొంతమందితో మాటాడటమూ తప్పే. ఎవరితో మాటాడాలి ఎంతవరకు మాటాడాలి, ఎలా మాటాడాలి అన్నదే వివేకం. దానినే భాస్కరశతకంలో ఇలా చెప్పేడు,శతకకారుడు. 


చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము జేసినయైన యందు ఇం  

 పొదవెడునుప్పులేక రుచి చేకురునటయ్య భాస్కరా!


ఎంతచదువు చదివినా మాటాడకూడని చోట మాటాడటం మాటాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పే! ఇది తెలుసుకోవడమే రుచి కలిగించే ఉప్పులాటి రసజ్ఞత.


ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని 

హీనుడవగుణంబు మాన్చలేడు

బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు 

విశ్వదాభిరామ వినుర వేమ


పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదు.పాముకి పాలు పోసిపెంచినా విషమే కక్కుతుంది. ఇది తెలుసుకోవడం విజ్ఞత.


ఎంత విజ్ఞానం ఉండి ఆచరణలేని విజ్ఞానం నిష్పలం, ఉపయోగంలో లేని విజ్ఞానం అడవికాచిన వెన్నెల.


21, ఆగస్టు 2022, ఆదివారం

వాక్స్వాతంత్ర్యం

 వాక్స్వాతంత్ర్యం


ఏంటో! 

వాక్స్వాతంత్ర్యం,ఈ మాట రాయడమే ఇంత కష్టంగా ఉందే!ఈ హక్కును నిలుపుకోడం ఎంత కష్టమో కదా! 


ఈ హక్కు గురించి మాటాడేవారంతా, వారేమైనా అనచ్చు, కాని ఎదుటివారు ఏమీ అనకూడదు, ఇదీ వారి వాక్స్వాతంత్ర్యం. సుప్రీం కోర్టువారేమో, ప్రతి స్వాతంత్ర్యానికి హద్దుంటుంది, అదేముద్దు అంటారు.సుప్రీం కోర్టు లెక్కా :) సుప్రీం కోర్టు నే ఏమైనా అంటాం అంటున్నారు.   


ముఫై ఎకరాల మా కాలేజి కాంపౌండ్ రోజంతా పెళ్ళివారిల్లులాగే ఉంటుంది. ఉదయం నాలుక్కి నడిచేందుకొచ్చేవాళ్ళతో ప్రారంభం, నడిచేవాళ్ళు,యోగా చేసేవాళ్ళు, ఇండోర్ లో టెన్నిస్ అడేవాళ్ళు, ఇలా రకరకాలుగా మొత్తం దగ్గరగా రెండొందలమంది ఉంటారు,ఉదయం. 

పున్నమినాడు అస్తమిస్తున్న చంద్రుడు  


 ఇలా నడుస్తుంటారు, జట్లు,జట్లుగా  


ఉదయం నా కార్య స్థానం, అప్పటికే యోగా చేస్తున్న మిత్రుడు.  



యోగా క్లాస్  


 నాది తక్కువ అంచనా!! మాకో కల్బ్ ఉంది దానిపేరు జి.బి.ఆర్ వాకర్స్ క్లబ్, దీనికి అనుబంధంగానే మిగిలిన సబ్ క్లబ్బులన్నీ, అవే యోగా క్లబ్,టెన్నిస్ క్లబ్. ఎనిమిది దాటితే వీళ్ళెవరూ ఉండరు. పిల్లలొచ్చేస్తారు. సాయంతరం నాలుగు దాటిన తరవాత పిల్లలంతా వెళ్ళిపోతారు. ప్పుడు స్త్రీలు ఎక్కువా, పురుషులు తక్కువా, ముసలాళ్ళు ఉదయం సాయంత్రం సమానంగా ఉంటూంటారు,నడకకి.   


వీళ్ళూ మరో మూడువందల మందిదాకా ఉంటారు,అదిన్నూ రాత్రి ఎనిమిది దాకా. కేంపస్ అంతకీ లైటింగ్ ఉంటుంది,ఉదయం నాలుగునుంచి ఆరు, సాయంత్రం ఆరునుంచి ఎనిమిది.మా ఊళ్ళో మూడు వాకింగ్ ట్రేక్ లు ఉన్నాయి. మాదే మొదటిదిన్నూ! రెండోది పక్క హైస్కూల్ గ్రవుండ్లో, మూడోది రైల్ ఫైఓవర్ కి అప్రోచ్ రోడ్ కింద, ట్రేక్ అవతల. నాలుగోది రైల్వే ప్లాట్ఫారం.ఇన్ని చోట్ల చాలమంది నడుస్తూనే ఉంటారు,రోజూ, ఉదయం,సాయంత్రం.   


నేను వేసవి,వర్షకాలాలలో ఉదయమూ, శీతకాలంలో సాయంత్రమూ నడవడానికి వెళతాను. చాలామందికి నా పేరు తెలియకపోయినా నన్ను ఎరుగుదురు,పాతికేళ్ళ దగ్గర సమయంలో ఆ వాకర్స్ క్లబ్ స్థాపకుల్లో నేనూ ఒకడిని.  కవిని కూడా కదా! :) కర్ర పుచ్చుకు తిరుగుతుంటాను, అందుకు అందరికి ఎరుకే! :) నేనెవరితోనూ మాటాడగా ఎవరూ చూసి ఉండరు ఆ కేంపస్ లో! :)

మామూలు రోజుల్లో ఎక్కడవాళ్ళు అక్కడ, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వర్షం వస్తే మటుకు అందరూ చాలా పొడుగైన మా వరండాలని ఆక్రమించేస్తారు :) ఈ వరండాలో ఒక యువకుడు యోగా చేస్తాడు, రోజూ, ఎండవానలు వేటిని లెక్క చేయక, మరొకరు కూడా ఆయనతో ఉంటారు, కాని చెప్పలేం. ఇక నేను నా కోటా నడక తరవాత ఈ వరండాలో యువకుని పక్క చేరి ప్రాణాయామం చేస్తాను, ఒక అరగంటపాటు. అలుకు తీర్చుకోడానికి కొంతమంది ఈ వరండా మీద కూచుంటుంటారు, అది అలవాటు.  


ఇలా జరుగుతుండగా,నిన్న ఉదయం నా పక్క యోగాసనాలు వేస్తున్న మిత్రుడు నా దగ్గరకొచ్చి,మీరు టెలిఫోన్ లో పని చేశారు కదా! పని చేయకుండా జీతాలు తీసుకున్నారని తిడుతున్నాడని అక్కడే  అలుకు తీర్చుకోడానికి కూచున్న యువకుడిని చూపించాడు.


ఒక క్షణం విస్తుపోయా! తేరుకుని మాటాడటం మొదలెట్టా! నేనెప్పుడూ మాటాడగా చూడని చుట్టు పక్కలవారంతా కూడిపోయారు. నిన్న మొన్నలో, మనం స్వాతంత్ర్య అమృతోత్సవం జరుపుకున్నాం కదా! మనకు పెద్దలు     సంపాదించి పెట్టిన స్వాతంత్ర్య హక్కుల్లో వాక్స్వాతంత్ర్యం ఒకటి. అతనలా తిట్టుకుంటున్నాడా? కాదనే హక్కు మనకు లేదు,తిట్టుకోమను, అడ్డుపడకు. అతనికో సలహా చెప్పు అతనితో పాటుగా మనల్ని తిట్టడానికి మరో పది మందిని కూలీకి నియమించుకోమను,తిట్టడానికి, మరెక్కడో వద్దు, ఇక్కడే ఎదురుగా తిట్టించమను, మన గ్రవుండ్ లో ఉన్నవాళ్ళందరిని పిలుద్దాం! తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని చెప్పు. ఆ తరవాత మాట, తిట్టిన ప్రతి తిట్టుకు ఒక రూపాయి ఇమ్మను! అంత చెయ్యలేడా పోనీ మొత్తానికి ఒక రూపాయి నా చేతులో పెట్టమను, అదీ చేయలేడా సరే! ఒక నమస్కారం పెడదాం, ఏమంటావు? అని ఊరుకున్నా! 


ఇది విన్నవాళ్ళంతా ఒక్క సారి గొల్లు మన్నారు.కార్యక్రమం ఎప్పుడో చెబితే తీరుబడి చేసుకుంటా 

 టైమయింది వస్తానూ అని తువ్వాలు దులుపుకుని భుజాన వేసుకుని ఎలబారేను :)

ఇదండీ! మన వాక్స్వాతంత్ర్యం సంగతి  


19, ఆగస్టు 2022, శుక్రవారం

పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?

 

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.


https://kasthephali.blogspot.com/2022/08/blog-post_6.html


పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?


ఈ కొచ్చనుకి సమాధానం ఎవరేనా చెబుతారేమోనని ఎదురు చూశా, ఇంక నేనే నాకు తోచినది చెప్పక తప్పలేదు.


అదేమో పాతకాలపుపల్లె. పూరి గుడిసెలన్నీ పడిపోయి ఉన్నాయి.నష్టం జరగని ఇల్లు కనపడలేదు. తన ఇంట విలువైనవన్నీ పాడయ్యాయి, రాత్రి ఉడకేసుకోడానికి బియ్యమూ లేవు, పిండీలేదు. పిడకలగూడు తడిసిపోయి పనికిరాకపోయింది, ఎండు కట్టెలాచూద్దామంటే ఎక్కడాలేవు ఊరు మొత్తం మీద. పడిపోయిన ఇంట వెతికితే కూడు వండుకోడానికి కుండ దొరకచ్చు.కూడు వండుకోడానికి ఎవరేనా బియ్యం సాయం చేయచ్చు. కొంప కూలింది కనక పొయ్యీ పనికిరాకపోయె. మూడు రాళ్ళు, వెతుక్కుంటే దొరుకుతాయి,పొయ్యి అవసరం తీరిపోతుంది. మరి పొయ్యి కిందకి  ఎండుకట్టెలు దొరకవు, పోనీ పిడకలంటే పిడకలగూడు పోయె, ఎవరినైనా అడుగుదామంటే, ఏమైనా ఇస్తారుగాని పిడకలు ఇవ్వరెవరూ అందునా ఇలా గాలివాన సమయంలో, కావాలంటే ఓ ముద్ద కూడు పెడతారు.  


అయ్యో! కడవలే!!కణ్ణా!!!ఎంత కష్టం తెచ్చిపెట్టేవు పిడకలగూడు తడిపేసి, అని పిడకలగూటి కోసమే ఏడ్చింది.


ఇక ఒక నామకం పొలిటికల్ సెటైరా? అనడగి అధికారంపోయె,ఆస్థులు ఇ.డి పాలా అన్నారు. దాన్ని వివరిస్తే, నిజమేనేమో అనిపించింది. పిండి, బియ్యం లాటి విలువైనది అధికారం, అది పోయె! మరి వేల కోట్ల రూపాయల ఆస్థి పిడకలగూడు లాటిది. ఇదిపోతే? అధికారం ఎప్పుడేనా, ఎలాగైనా సంపాదించుకోవచ్చు కాని సొమ్మెవరిస్తారు.ఇన్ని వేలకోట్ల రూపాయలని ఎన్నేళ్ళలో సంపాదించేం. అధికారం సంపాదించాలంటే సొమ్ములవసరం కదా!అందుకు పిడకలగూడులాటి ఆస్థికోసం ఏడవటం సహజమేనేమో :)