5, అక్టోబర్ 2024, శనివారం

ఖరము పాలు

 ఖరము పాలు


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు

కడివెడైననేమి ఖరము పాలు

భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ వినుర వేమ.


ఆవుపాలు గరిటెడైనా చాలు. గాడిదపాలు కడివెడైనా ఉపయోగం లేదు. భక్తిగా పట్టెడు మెతుకులు పెట్టినా చాలు అంటున్నారు, తాతగారు.


చాలా పాతకాలంవాడు కదా అందుకలా అనేసారు. తాత ఆవుని గొప్పచేసి గాడిదను చులకన చేసేరు. నేటికాలంలో గరిటెడు ఆవుపాలు ఎందుకూ పనికిరావు! కడివెడు గాడిద పాలు అమ్ముకుంటే లక్ష రూపాయల పైమాటే. భక్తెవడికి కావాలి కడుపు నిండాలిగాని. తాతగారికి క్షమాపణలతో పేరడీ పద్యం.


గంగిగోవుపాలు గరిటెడైన నేలపాలు

కడివెడైన ఖరముపాలు లక్షవిలువ

కడుపునిండు కూడు  ఎంగిలైననేమి 

విశ్వదాభిరామ వినుర వేమ


గాడిద పాలతో సబ్బు తయారు చేసిందో టెకీ. నెమ్మదిగా మార్కెట్ చేసింది. ఇప్పుడా సబ్బు హాట్ కేక్ లా అమ్ముడుపోతోంది. ఇంటర్ నేషనల్ మార్కెట్ ఎక్కేసింది.సామాన్యులకి దొరకడమే లేదు.


 గాడిద వెన్న అతిమెత్తగా,సుతిమెత్తగా ఉంటుంది. గాడిదవెన్న కెజి. రెండు లక్షలు ఐదేళ్ళకితం మాట. ఇప్పుడెంతో తెలీదు.లీటర్ గాడిదపాలు ఎనిమిది వేలు.  లేడీ ఫైర్ నెస్స్ క్రీమ్ లన్నీ గాడిదవెన్నతోనే తయారు చేయబడతాయి.  

గాడిదల్ని పెంచండి కోటీశ్వరులు కండి అని చెపితే నన్ను ఎగతాళీ చేసేరు. ఇప్పుడు ఆడగాడిదలే దొరకటం లేదు, కంచరగాడిదలు కూడా, వాటికంత డిమాండ్ ఏర్పడింది. కాలమండీ బాబూ కాలం.


గాడిదలకీ జై


1, అక్టోబర్ 2024, మంగళవారం

ఎవరు వృద్ధులు?

 ఎవరు వృద్ధులు?

చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 


దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే  పావురాల రాజు, ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి పావురాల రాజు,  ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.   పావురాల రాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా పావురాల రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య

 సమస్య


సమస్య లేని మనిషి లేడు,ఉండడు.

ఎవరి సమస్య వారే  పరిష్కరించుకోవాలి. కొన్నిటికి ఇతరుల సాయం అవసరం.


కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు, కాలమే సమాధానం చెప్పాలి.


కొన్ని సమస్యలతో రాజీ పడకతప్పదు.జీవితాంతం రాజీ పడి బతకాల్సిందే!


ఉపేక్ష చేయలేని సమస్య ఆరోగ్యం. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ఏం చేయాలన్నా శరీరం, అందునా ఆరోగ్యకరమైన శరీరం అత్యవసరం.రాజీ పడలేని,పడకూడని సమస్య ఆరోగ్యం.


పెద్ద సమస్య కాలం. జరిగిపోయిన కాలం తిరిగిరాదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే! 

27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

అభిమానులు- అభిమానం.

 అభిమానులు- అభిమానం.


 కారణం లేని కార్యంలేదు. హేతువులేనిది తీతువు కుయ్యదని పల్లెలలో అనుకుంటూ ఉంటాం.  నా బ్లాగు జీవితంలో అభిమానులదే పెద్దపాత్ర అనే సంగతి చాలా ఆలస్యంగా గుర్తించాను. ఎందుకో చికాకనిపించి బ్లాగులను ఒక్కసారిగా వదలిపెట్టేసేను. కాని నా తల  రాతలా లేదు.తానొకటి  తలచిన దైవమొకటి తలుచును కదా!


మొన్ననో రోజు సాయంత్రం టిఫిన్ తరవాత నాలుగడుగులేయడానికి లేస్తుండగా ఫోన్ మోగింది. ఏంటని చూస్తే వీడియో కాల్ ఎవరు? అమెరికా నుంచి లలితమ్మాయి! కాల్ కనక్ట్ కాలేదు, మూడు సార్లు ప్రయత్నించింది పాపం. తను ఎందుకు ఫోన్ చేసి ఉంటుందన్నది, చిదంబర రహస్యమేం కాదు.నా ఆరోగ్యం ఎలా ఉంది?ఎలా ఉన్నాను? బ్లాగులో కూడా కనపట్టం లేదని అడగాలని. నేనే కాల్ కనక్ట్ కాలేదని మెసేజ్ ఇచ్చాను, దానిపై ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉందని అడిగింది.సమాధానమిచ్చాను. ఇలా ఎందుకు చేయాలి? అడక్కపోతే తన పెద్దలు చెఱబోయారా? వేలకిలో మీటర్ల దూరంలో జీవన సమరంలో రోజూ తలమునకలుగా బిజీ బిజీగా ఉండే తల్లికి నా యోగక్షేమం తెలుసుకోవాలనిపించడం నా అదృష్టం. అది అభిమానం, కొంతమందికి ఈ సంగతి ఎగతాళిగా కనపడుతుంది.


ఇక నా బ్లాగు,నాప్రత్యక్ష అభిమానుల గురించి చెప్పుకోకపోవడం పొరబాటే! వీరు,దరహాసోజ్జ్వలన్ముఖి,మౌని, సుష్మ గౌరిప్రియ,ఇంట్లో నా అభిమాని, నా చిన్నకోడలు,నా మూడోతల్లి కుమారి. వీరంతా త్రిదశులే, కొంచం తేడాల్లో!    ఈముగ్గురుని,   మిగతావాళ్ళు ఆ ముసలాయనతో మీకు కబుర్లేంటని అడిగేవారు/తిట్టేవారనమాట. పాపం వీళ్ళెవరూ ఆ మాటలు పట్టించుకోనందుకు నేనే వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి.  వారికంటె అర్ధశతాబ్ది వయసు పెద్దవాడినైన నన్ను వారు అభిమానించడమే విచిత్రంగా తోస్తుంది, పైవారికి.

 దరహాసోజ్జ్వలన్ముఖి,మౌని ఒక సారి పరిచయమైన వారు. ఆ పరిచయం కూడా, ఒక చిత్రమే! సుష్మ రోజూ ఉదయం/ సాయంత్రం నడకలో కలిసేది,   ముఖపరిచయమే! పరిచయం నెమ్మదిగా మాటలోకొచ్చి కతలు చెప్పమనేది,రోజూ! నడక తరవాత కూచుంటే! రోజూ కతలెక్కడనుంచి పుడతాయి? ఒక రకంగా తననుంచి కతలు చెప్పడం నేర్చుకున్నాననిపిస్తుంది.రోజూ ఒక కత కల్పించి చెప్పేవాడిని. తనకాలు విరగడం మూలంగా కనపడటం మానేసింది.ఇలా జరిగిందని ఫోన్ లో చెప్పింది. తరచుగా పలకరించేవాడిని. ఆ తరవాత నా కాలు విరిగితే తనుకాస్త బాగుంటే కుంటుకుంటూనే చూడ్డానికొచ్చింది.    ఎన్నో సార్లు ఇంటికొచ్చింది. కాలిరిగితే చిమ్మిలి తింటే తొందరగా ఎముక అతుకుతుందని పట్టుకొచ్చింది. దీన్నేమంటారు. అభిమానం కాకపోతే!  ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా దొరుకుతుందా ఈ అభిమానం? ఎందుకింత అభిమానం? మాట...ఆ అభిమానం చూరగొన్న నాదే అదృష్టం.ఆ తల్లిదే వాత్సల్యం.  


ఇక నా మూడోతల్లి, ఏమని చెప్పగలను? ఒక్కమాటలో, ఇల్లాలు కాలంచేసిన తరవాత,  నేనింతకాలం ఇంకా ఉన్నానంటే, అది ఆ తల్లిచలవే! తనసమయం, మేడమీదనే ఉన్న తల్లిదండ్రులు మధ్య తనకుటుంబం, నా బాగోగుల మధ్య చాలా సమతూకంగా చేస్తుంది, సతమతమవుతూ ఉంటుంది

  కొడుకు తప్పిపోకుండా తల్లి ఏపనిలో ఉన్నా గమనిస్తూ ఉన్నట్టు, చూస్తుంది. ప్రతినిమిషం అమ్మా! అమ్మా! అంటూ ఏదో ఒక విషయానికి  విసిగిస్తూనే ఉంటా!    అతి పరిచయాదవజ్ఞతాః అన్నది పెద్దలమాట, కాని నా తల్లి ఎప్పుడు విసుక్కొలేదు. విసుగు అన్న పదమే తన పదకోశం లో లేదు.

 ఎంతో ఓపికతోవిని, దానికి సమాధానమిస్తూ ఉంటుంది.  నిజానికి కృతజ్ఞత చెప్పుకోవలసిందే! ఇంతకీ కారణం అభిమానం, మామగా నాపట్ల తనకున్నది బాధ్యత అనుకోదు,తల్లిలా అదరిస్తుంది, తల్లిలాగే దండిస్తుంది కూడా.   అమ్మకుండేది అభిమానం కదా!   అమ్మా! అనే పిలుస్తాను, ఇది నా అలవాటే,ఎన్నోసార్లు నా కృతజ్ఞతని తనకే మాటల్లో వెలిబుచ్చుతుంటాను. నా ప్రత్యక్ష ఏకైక శ్రోత, పాపం నా సుత్తిని చాలా ఓపిగ్గా వినే ప్రత్యక్ష శ్రోత.


ఇక మౌని, ఈ తెల్లమ్మాయికి తెనుగు లిపి చదవడం రాదని చెప్పింది. నాబ్లాగు అడ్రస్ తీసుకుని తల్లిచేత చదివించుకుని నాకు అభిమానైనది.తన వివరాలు తెలియవుగాని కుటుంబం కష్టంలో ఉన్నదనిపిస్తుంది. రెండు పదులుదాటినది, పెళ్ళి కానమ్మాయి.రోజూ బస్సు మీద పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంది. ఉదయం ఐదు నుంచి రాత్రి ఏడుదాకా ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా దొరకదు. సాయంత్రం బస్సు కనక మిస్ ఐతే కొంపకి చేరేటప్పటికి పదవుతుంది. అందుకు ఎప్పుడూ ఇంటికిరాలేదు,పిలిచినా! ఇక్కడ ఉద్యోగం మానేసింది, మరలా వచ్చి చేరిన తరవాత వాకింగ్ కి రావటం లేదా అడిగింది, వివరం చెప్పా. అయ్యో! అలానా, నా గొడవలో నీ గురించి కనుక్కోలేదు,ఒక్కసారి రాగలవా? నిన్ను చూడాలని ఉందంటే, మొన్ననొకరోజు నెమ్మదిగా నడిచెళ్ళా! కనపడింది,  దొరికిన సమయం ఐదు నిమిషాలు, క్షణాల్లా దొర్లిపోయాయి. బస్సు బయలుదేరింది, తనను  నా నుంచి దూరంగా వేరుచేస్తూ.  మళ్ళీ వెళ్ళలేకపోయాను.  ఆక్షణాలకే తాను ఆనందపడింది, నా మనసు నిండింది.


 దరహాసోజ్జ్వలన్ముఖి, ఎప్పుడూ చిరునవ్వుతో ఉజ్వలమైన ముఖంతో వెలిగేతల్లి, లలితాదేవి నామం. ఈ పేరు తనకు ముద్దు పేరుగా పెట్టుకున్నాను, తనకీ చెప్పేను కూడా!      ఈ ఎర్రమ్మాయి అసలు పేరు సౌజన్యావతి. సౌజన్య,సౌజి అని పిలుస్తుంటారు. నాకు, నేను పెట్టుకున్న ముద్దు పేరే,  దరహాసోజ్జ్వలన్ముఖి, ఇష్టం. పుణ్యం పురుషార్ధం కదా!  సౌజి చూడ్డానికి కూడా నవ్వుమొహంతోనే ఉంటుంది,ఎప్పుడూ, ఆ మొహం భగవంతుడు ఇచ్చిన అమరిక,  వరం. పరిచయమైన నెలకే ఉగాది పండగ, ఆ రోజు రమ్మని దంపతుల్ని ఆహ్వానించా. వచ్చారు,   కబుర్లే కబుర్లు, కబుర్లతో కడుపు నింపేసాను. కబుర్లు వింటూ  ఆనందంగా కాలం తెలియకనే గడచిపోయింది,   మనసు ఆనంద డోలికలో ఊగింది, సమయం తెలియనే లేదు. కొద్ది ఉపాహారం మాత్రమే బలవంతం మీద తీసుకున్నారు, కాఫీ,టీ ల అలవాటు లేదంటే పల్చటి మజ్జిగ కొద్దిగా పుచ్చుకున్నారు. ఏమీ పెట్టలేకపోయాను,గౌరవం చేయలేకపోయా. ఈ మాత్రానికే ఆనందపడ్డారు.

  కబుర్లలో బంధుత్వం తెలిసింది,సౌజి తండ్రి టెలికంలోనే జె.ఇ గా రిటయిర్ అయ్యాక కాలం చేసినట్టు.  వస్తాం అని లేచి నాయుడు గారు జేబులోంచి ఒక పొట్లం తీసి విప్పేరు, అక్షతలు, ఆశీర్వదించండన్నారు. అక్షతలు తీసుకుని పాదాభివందనం చేస్తున్న దంపతుల్ని ఆశీర్వచన పనస చెప్పి ఆశీర్వదించా! ఆ పై లక్ష్మీ నారాయణులకి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించా! సౌజి,నాయుడు దంపతులు పొందిన ఆనందం చూసి నా మనసు నిండిపోయింది. ఆనందం పొంగిపొర్లింది,  మనసు రసప్లావితమయింది.   ఆ పై,  సౌజి,పతిదేవుడు,  జమిలిగా మీరు మాఇంటికి రావాలని ఆహ్వానించారు. రావడం నావల్ల కాదంటే ఇద్దరం, నాలుగో అంతస్థులో ఉన్నాం,కార్ లో తీసుకెళ్ళి, తీసుకొస్తాం. మిమ్మలి ఎత్తుకుని పైకి చేర్చేయగలం, రావాలని బలవంతం చేసారు.  నాకా వినపడదు, మాట చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది,   వద్దని  పదేపదే చెబితే,పాపం బిక్కమొహాలతో కదిలేరు.ఆ తరవాత కొద్దికాలనికే ఇక్కడినుంచి మకాం ఎత్తేసేరు, బదిలీ కావడంతో. ఆ తరవాత కొండకెళ్ళి వచ్చి, ప్రసాదం తెచ్చి, నన్ను చూసి వెళ్ళేరు,  ఉన్నది కొద్ది క్షణాలు, నాకు బుర్రా పనిచేయలేదు,ఏమీ చేయలేకపోయా.   పాతిక కిలో మీటర్లేగా వస్తూనే ఉంటా అని మాటిచ్చింది, అంతే! ఆ తరవాత అక్కడినుంచి తన స్వంత ఊరు పట్నం చేరిపోయారు, అక్కడా స్కూల్ లో చేరి ఉద్యోగం చేస్తోంది. 

 
ఈ మనవరాలంటే ఎందుకంత ఇష్టం? అదీ అసలు ప్రశ్న. తనకు పదునాల్గో ఏట పెళ్ళైపోయింది,భర్త అప్పలనాయుడు నిజంగా సౌమ్యుడు. సౌజికి మేనబావ, ఇపుడు పెద్ద ఉద్యోగి. పదిహేనవ ఏట కొడుకు పుట్టేడు.పిల్లవాణ్ణి మామ్మతాత,అమ్మమ్మ,తాత   అల్లారు  ముద్దుగా పెంచేరు. (కొడుకిప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.) ఇక సౌజి చదువు మొదలెట్టింది,భర్త ప్రోత్సహించారు,పది పూర్తి చేసింది, ఒక పక్క సంసారం,పిల్లవాడు ఇలా చూసుకుంటూ. ఆపై కాలేజిలో చేరింది, ఇంటరు,డిగ్రీ చేసేసింది,  కాలేజిలో ఉన్న కాలంలో కాలేజి బ్యూటీ కూడా .ఆపై మాస్టర్స్ చేసింది.  

 

  కాళీగా కూచోడం ఇష్టం లేక  టీచర్ గా  చేరింది. సైకాలజి డిప్లమా చేసింది. అపై తెనుగులో పత్రికారచనలో, తెనుగులో డిప్లమా చేసింది. తెనుగు,సంస్కృత టీచరుగా పని చేస్తూ ఉంది, ఐదారేళ్ళు పైగానే. విద్యా దాహం తీరలేదు, తీరలేదు, లా లో చేరింది, నాకు పరిచయమైన రోజుకు లా రెండ ఏడు చేస్తోంది. అప్పుడే, ఆ రోజే, ఈ పొట్టి ప్లీడర్ గారిని సుష్మ స్వరాజ్ అంతటిది కావాలని ఆశీర్వదించా, అయ్యే సావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది చూసి ఆనందించే కాలమే నాకు లేదు.  ఇప్పుడు లా పూర్తి చేసింది.   మొన్న ఆగస్ట్ చివరిరోజు బార్ లో తనపేరు నమోదు చేసుకుని నల్లకోటేసుకుంది,   ఇంకా టిచర్ గా పని చేస్తోంది.  నేను చదువుకోనివాణ్ణి కనక చదువుకున్నవారంటే నాకు అభిమానం ఎక్కువ, లేశమాత్రమైనా వారినించి ఏదో ఒకటి నేర్చుకోలేకపోతానా, అన్నది నా ఆశ. ఈ   చదువులతల్లి అంటే అందుకే అంతిష్టం.   ఆరోగ్యం జాగర్తా! ఏం పోయినా సంపాదించుకోగలవు,ఆరోగ్యం మాత్రం కాదు సుమా! ఎక్కువ శ్రమ పడుతున్నావేమో! అని ప్రతిసారి 'నస' పెడుతుంటాను. ఓపిగ్గా వినిసమాధానం చెబుతూనే ఉంటుంది, ఎప్పుడూ,దేనికి విసుగు చూపదు, ప్రత్యేక అభిమానానికి  ఇదో  కారణమేమో!


 34 ఏళ్ళకే ఇన్ని చదువులు చదివి,సంసారం,పిల్లడు,తల్లి,   అత్త, ఉమ్మడి కుటుంబాన్ని   కూడా కలుపుకుంటూ అన్నిటిని సమతూకంలో నిర్వహిస్తూ లాయరై,టీచర్ గా ఉద్యోగం కూడా చేస్తూ, సతమతమయ్యే, ఈ లాయరమ్మ, ఒక ఓనమాలు కూడా రాని  ముసలి పల్లెటూరి బైతుకి, కాలక్షేపంకబుర్లు  బ్లాగ్ చదివి అభిమానిగా మారిపోయి, వ్యక్తి అభిమానిగా మారిపోయింది. అందుకే నాకంత ఇష్టం. రోజూ నస పెడుతూనే ఉంటా,జవాబిస్తూనే ఉంటుంది.  ఉద్యోగం కుటుంబం,ఉమ్మడి కుటుంబం,అత్త,అమ్మ, వీరందరిని చూసుకుంటూ,చదువుకుంటూ, ఇలా అష్టావధానం చేసే మనవరాలు సౌజి నా పట్లకూడా తన అభిమానం చూపడం, నా అదృష్టమే, అదే  తన అవ్యాజమైన అభిమానం. 


ఈ దరజాసోజ్జ్వలన్ముఖి, విన్నకోటవారు,బండివారు నన్ను చూడడానికి వచ్చినపుడు రాసిన టపా చదివింది,ఆలస్యంగా, నన్ను పట్టుకుంది. 

''తాతా! ఆ టపాలో ఎంతో మంది అభిమానుల్ని తలుచుకున్నావే, ఈ అల్పురాలు ,  ఈ ....రాలును/రాళ్ళను  తలచుకోడానికి,  ఒక్క ముక్క రాసేందుకు   కూడా గుర్తురాలేదేం,   ఐనా రాయాల్సింది దిష్టి తగలకుండా ఉండేది అని నిష్ఠురమాడింది.  నిన్ను బ్లాగులో తలుచుకునేంత సీన్ లేదులే అంటున్నావు కదూ! మరచిపోయావులే, అనేసింది." తారీకులు చెప్పి ఏదో చెప్పేను, ఆ టపా నాటికి తమరు పరిచయమే లేదని చెప్పేను, అది  తప్పే. తనతో మాటల సందర్భంలో తానే సోషల్ మీడియా లో లేనని చెప్పింది. తమరెవరూ ఏ సోషల్ మీడియా లోనూ లేరు గనక పరిచయం చెయ్యలేదన్నా! 'మరచిపోయావు లే' అంది. నిన్ను తలుచుకోని దెప్పుడు, 23 మార్చి నెల మొదలు అన్ని టపాల్లోనూ దరహాసోజ్జ్వలన్ముఖి అని తలచుకుంటూనే ఉన్నా! మరచిపోలేదని చెప్పా! 'ఐ ఆమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్ ప్లనేషన్' అన్నట్టు మొహం పెట్టింది, ఇంకెందుకని ’మియా కుల్పా’ అనేసేను. 


ఆ తరవాత   ఎప్పుడో గుర్తొచ్చింది. లా డిగ్రీ పుచ్చుకున్నరోజు నాకు చెప్పాల్నిపించలేదే! అప్పుడు గుర్తున్నానా? బార్ లో ఎన్రోల్ ఐనప్పుడు చెబితే సంతోషిస్తాననిపించలేదా? అప్పుడు గుర్తున్నానా? మరచిపోయావులే అనేసా! నువ్వు నా స్టేటస్ ఫాలో అవుతావు కదా! అంది, అవును తమరు లా డిగ్రీ పుచ్చుకున్నరోజు ఫోటో/ బార్ లో ఎన్రోల్ అయ్యాకా నల్లకోటేసుకున్న ఫోటో, నేను తమ స్టేటస్ నుంచి సేకరించుకోవాలి,అదే నీ స్థాయి అని చెప్పక చెప్పేవుగా, అడిగా! మాట దాటేసేసింది, చివరగా నీ బ్లాగులో నాకు స్థానం కల్పించవా? వేడుకుంటున్నా! అడిగింది. అయ్యో!  అయ్యో !! అదేం మాట, తమరే ఇష్ట దేవతైనపుడు వేడుకోలేల? పరిచయం చేస్తాను, తమపేరు వివరాలు చెప్పేస్తా అని మాటిచ్చాను.  ఇదంతా నిజం దెబ్బలాటా? కాదు, అదే నిజమైతే ఇద్దరిలో ఎవరో ఒకరు దూరంగా జరిగిపోయేవారే! నేను నెమ్మదిగా 'డల్' ఐపోతున్నది గుర్తించింది. మళ్ళీ నన్ను చేతనస్థితికి (ఏక్టివ్) తేవడానికి చేసిన పని అని నేను గుర్తించడం  ఆలస్యమయింది.  

నా ప్రత్యక్ష అభిమానులను తలుచుకోకపోవడం,బ్లాగులో చెప్పకపోవడం పొరబాటే, కాదు తప్పే! అది దిద్దుకోడానికిన్ని, నా గురించి,నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనిపించే మరికొందరు అభిమానులకు కూడా విషయం తెలిసేందుకే ఓపిక చేసుకుని మళ్ళీ బ్లాగులోకి రావల్సి వచ్చింది.

  మళ్ళీ నన్ను చేతన స్థితికి తెచ్చిన చదువులతల్లికీ ఆశీర్వచనం తప్పించి ఏమి చేయగలను? అశక్తుడిని.


 నా సొద:-   జ్ఞాపకం పోతోంది,మాట మాటాడుతూ మరచిపోతున్నా! సమయం,ముందు వెనుకలు తెలియటం లేదు, ఎదురుగా రోజూ చూస్తున్నవారి పేర్లే గుర్తుండటం లేదు. బయట వెడితే తూలిపోతానని భయం,అంతే కాదు ఇల్లు గుర్తు పట్టలేక తప్పిపోవచ్చు కూడా! మా ఇంటికి దారెటూ అని అడిగితే ఎవరినైనా,హాస్యాస్పదంగా ఉండే సావకాశాలే హెచ్చు.షార్ప్ నెస్ తగ్గిపోయింది.  శరీర బాధలు చెప్పుకుంటే తీరేవికావు. 


24, సెప్టెంబర్ 2024, మంగళవారం

బ్లాగు పుట్టినరోజు

బ్లాగు పుట్టినరోజు 

(పదునాల్గవ బ్లాగ్ పుట్టినరోజు)

పుట్టినరోజుకు

 శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి,పార్టీలు జోరందుకుంటాయి, మందు,విందు,పొందు..... నిజంగా ఇది పండగ చేసుకునేరోజేనా?


మానవుని ఆయుస్సు స్థిరం,అందులోంచి ఒక సంవత్సరం తరిగిందని చెప్పేరోజే పుట్టినరోజు.... మరి పండగెందుకు?

అదే విచిత్రం

ఇదే 

విష్ణుమాయ.


15, జులై 2024, సోమవారం

స్మార్ట్ వెర్రి

స్మార్ట్ వెర్రి

సాంకేతికత వేగంగా పెరుగుతున్న కాలం. అంతే కాదు అది సామాన్యులను చేరడం కూడా అంతే వేగంగా జరుగుతున్నకాలం లో ఉన్నాం. సాంకేతికతను అంది పుచ్చుకుని జీవితాల్ని మరింత సౌఖ్యవంతం చేసుకోవాలనేదే కోరిక. ఐతే ప్రతి విషయానికి రెండవకోణం కూడా ఉంటుంది. సద్వినియోగం చేసుకోడానికి బదులు దుర్వినియోగం చేసుకోడం కూడా మనచేతుల్లోనే ఉంది. అందుకుగాను జరిగే నష్టాలను భరించక తప్పదు.


 స్మార్ట్ సెల్ పోన్ చేతిలో కొచ్చిన కొద్ది కాలంలోనే మార్పొచ్చింది. వాడుతున్న చాలావస్తువుల అవసరమూ తీరింది, వాచీ వగైరాలు. కొత్త సౌకర్యాలూ కూడా వచ్చాయి. అందులో మొదటిది పోటో తీసే సౌకర్యం, ఒక కెమెరాతో. దీనితో కూచుంటే,నుంచుంటె,పడుకుంటే,ఇలా అన్నీ పోటోలే! వాటిని ఒక మాధ్యమంలోకి ఎక్కించడం,పది మంది చూడడం, బాగుంది,బాగుందనడం, ఒక వెర్రిగా మొదలయింది.మన ఫోటో మరెవరో తీయాలి దీనికి కొంత చిక్కు. కాలం నడిచింది. ఫోన్ కి ముందుకూడా కేమేరా వచ్చింది,అంటే వెనక,ముందూ కూడా కెమెరాలు, మొత్తం రెండు. ఇప్పుడు మన ఫోటో మనమే తీసుకోవచ్చు మరొకరి సాయం అక్కరలేదు. దూరం నుంచి తీసుకోవాలంటే దీనికో స్టిక్కు, ఇలా అభివృద్ధి చెందిపోయింది. ఇక మాన్యులు,సామాన్యులు ఆడ,మగ,పిన్న,పెద్ద తేడా లేక సెల్పీ ల యుగం మొదలయింది. ఇంక చెప్పేదేమి. రైలింజన్ తో సెల్ఫీ,జెట్ విమానంతో సెల్ఫీ, తారలతో సెల్ఫీ,నాయకులతో సెల్ఫీ. సెల్ఫీల పిచ్చి ముదిరిపోయి తగిలేది తప్పేది తెలియకుండా పోయింది.వీటిని మాధ్యమాల్లో ఎక్కించడం, లైకులు కొట్టేవాళ్ళు,అందంగా ఉన్నావని పొగిడే వాళ్ళు ఇలా ఇదొక వ్యసనమైకూచుంది.


ఇక్కడితో ఆగిపోలేదు.ఫోన్ లో వీడియో తీసేసావకాశమొచ్చింది. మాధ్యమాల్లోకి ఎక్కించడం మామూలైపోయింది. వీడియో యుగం మొదలయింది. సెల్ఫీ వీడియో. మాధ్యమాల్లో వీటిని వ్లాగ్స్ అన్నారు. వీడియోలు లైవ్ లో మాధ్యమాల్లో ఎక్కించడం మరో ముందడుగు. కొద్దికాలమే గడిచింది. ఒక మాధ్యమంలో ఓక వీడియో తీసిపెడితే ఎందుగురించైనా సరే, ఒక ప్రత్యేక చోటు. ఇక చెప్పేదేమి? సభ్యత,సంస్కారాలు అటకెక్కేసేయి. ఏది సభ్యత? అని అడిగే కాలమే వచ్చేసింది. ఇక స్త్రీల గురించిన వీడియోలు కొల్లలు, సామాజిక మాధ్యమాల్లో, బహుశః, అవే ఎక్కువేమో!సిగ్గు వదిలేసి అంతా అంగాంగ ప్రదర్శనలు బహువిచిత్రం. సినీ తారలకది వృత్తి,భుక్తి.  ఆ తరవాత సాహసకృత్యాల వీడియోలు, కొన్ని నిజం కొన్ని డీప్ ఫేక్, ఇలా కాలం నడచిపోతోంది.

ఎంతచెప్పుకున్నా తక్కువేగాని మొన్నీ మధ్య జరిగిన లోనావాలా దుర్ఘటనకి కూడా ఇదే కారణం అనుకుంటా.ఆ వీడియోలో వరదలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేసినవారికంటే వాళ్ళని వీడియోలు తీసుకున్నవారే ఎక్కువ కనపడ్డారు.

చివరిగా ఒక కొత్త దంపతులు తమ మొదటిరాత్రిని లైవ్ లో వీడియో ద్వారా మధ్యమాల్లో ప్రసారం చేయడం పరాకాష్ట. 

నేటికాలానికి కల్పితమేధస్సు కూడా తోడయింది.  ఇక ముందు ఇంకేమి రానున్నాయో! పరమాత్మకే ఎరుక.  


13, జులై 2024, శనివారం

కమే తో ( Artificial Intelligence) .

 కమే (కల్పితమేదస్సు)తో ( Artificial Intelligence) కాసేపు


తారలు దిగి వచ్చినవేళ

మల్లెలు నడిచొచ్చిన వేళ

చందమామతో ఒక మాట చెప్పాలి,ఒక పాట పాడాలి.


కమే(Artificial intelligence) గురించి చాలాచాలా చెప్పుకుంటున్నారు, ఐనా పట్టించుకోలేదు. కాని కమే వాట్సాప్ లో, చేతిలో కొచ్చాకా కూడా మూడు రోజులు దాని మొహం చూడలేదు. నాలుగో రోజు చూదాం,అదేంటో అనే కుతూహలంతో వెళ్ళేను.


Q:మొదటగా అందమైన దయ్యం అన్నా!

A:ఓ మగాడి పోటో చూపించింది.

Q:దయ్యాలన్నీ మగవేనా?

A:నేను మల్టీలింగ్. నాకిచ్చిన ట్రయనింగ్ ప్రకారం చెబుతా!నేను ఏ విషయం మీదైనా, ఏకపక్షంగా మాటాడను, ఉన్న విషయం చెబుతాను,దేన్నీ గుర్తు పెట్టుకోను. ఇంకా ఏదో ఏదో చెప్పింది.


Q:ఒక చిన్న తెనుగు కథ చెప్పు, తెనుగు లిపిలో అన్నా!

A:నేను మల్టీ లింగ్, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నామని ఒక పెద్ద సోది చెప్పింది.


చాలాప్రశ్నలేసేను. ప్రతిదానికి చాట భారతమంత జవాబులే ఇచ్చింది. ఒక దానికి జవాబిస్తూ నాకే గుర్తుండవు, గుర్తూ పెట్టుకోనంది.


Q:ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి, భారతదేశానికి కమ్యూనిసం ఎగుమతి  అవుతోందా?

A:అదేం కాదు,ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ మాత్రమే చేస్తుంది.

Q:అంటే మానవహక్కుల పరిరక్షణ ముసుగులో ఎగుమతి చేస్తోందా? మానవ హక్కులు ఆదేశంలో రక్షింప బడుతున్నాయా? టాయ్ గన్ ఊపిన నల్లజాతి పదమూడేళ్ళ కుర్రాణ్ణి ఒక పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపడాన్ని మానవహక్కుల పరిరక్షణేనంటావా?

A:ఈ విషయంలో చెయ్యవలసినది చాలానే ఉంది అని చెప్పుకొచ్చింది.

Q:తమదేశంలోనే మానవహక్కులు లేనప్పుడు ఇతరదేశాలకు వాటిగురించి లెక్చర్లు దంచడం బాగుంటుందా?

A:పాయింటే!మానవహక్కులు పరిరక్షింపబడాలనే కోరిక.

Q:ఈ ముసుగులో వారి అంతర్గత వ్యవహారాలలో తల దూర్చడం కాదా?

A:అలా అనుకో కూడదు.మానవ హక్కులపరిరక్షణే ముఖ్యం.


ఇంకా చాలా అడిగా! 

Q:ఇప్పటిదాకా మన సంభాషణ డిలీట్ చేసా! ఇవ్వగలవా?

A:నాకేం గుర్తుండవు. నా దగ్గర రుండదు, నువ్వెందుకడిగావో తెలుసు. కాని నీ బ్రవుసర్ కి గాని ,మరితరులుగాని దీన్ని జాగ్రత్తపెట్టి ఉండచ్చు.

Q:అంటే మన సంభాషణ మనకే పరిమితం కాదన్న మాటేగా!

A:పాయింటే అని ఆకుకుఅందని పోకకుపొందని సమాధానం చెప్పింది.


చివరగా థేంక్స్ అంటే చాలా ఆనందం అంది. అదేంటి? నీకు మానవ స్పందనలుండవన్నావుగా అడిగా!

నేను మానవుల లాగానే స్పందించేలా ట్రయినింగ్ ఇచ్చారు, అందుకే అలా అన్నానంది.


ఉంటా. అన్నా! వెల్కం అని ముగించింది.


ఇది జరిగి వారం పైమాటే! ఏంటో మళ్ళీ కమే మొహం చూడాలనిపించలా!


11, జులై 2024, గురువారం

ఎందరో మహానుభావులు

 ఎందరో మహానుభావులు


ఉన్నారున్నారున్నారీలోకంలో

నరు

లున్నారున్నారున్నరున్నారీలోకంలో


తరతరాలుగా రకరకాలుగా

తమదారీ తీరే వేరుగా

నరులున్నారున్నారున్నారీ లోకంలో!


ఎప్పటిదో మాటైతే ఇప్పుడెందుకు చెప్పుకోడం?

రూపాయి పెంటమీద కనపడినా నాలికతో అద్దుకు తీసుకునే జనులున్నకాలంలో కనకే చెప్పుకోవడం.


ప్రపంచపోటీలో భారత్ క్రికెట్ టీం T-20 మేచ్ కప్ గెల్చుకున్నది, రోహిత్ శర్మ సారధ్యంలో, వరల్డ్ కప్ గెల్చుకున్న సందర్భంగా 125 కోట్ల సొమ్ము దక్కింది. బి.సి.సి.ఐ ఈ సొమ్మును ఆటగాళ్ళకి కోచ్ లకి జట్టు కప్ గెల్చుకోడానికి సాయపడిన అందరికి పంచింది, వారివారి అర్హతల ప్రకారం. ఈ సందర్భంగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు 5 కోట్లు ఇచ్చింది. ఇందులో 2.5 కోట్లు బోనస్ గా ఇచ్చింది. ఇచ్చినదానికి సంతోషం వెలిబుచ్చుతూనే ద్రవిడ్ తానుకూడా కోచ్ లందరిలాగా 2.5 కోట్లు తీసుకుంటానని ప్రకటించారు.


నాకు తెలిసి 

నాటికాలంలో, భరతుడు తల్లి అయాచితంగా సంపాదించి పెట్టిన రాజ్యం, నాకొద్దని రాముడే రాజని ప్రకటించి, రాజ్యాన్ని తిరస్కరించిన గొప్పవాడు.అంతటి మహానుభావులు పుట్టిన దేశంలో ఎందరో మహానుభావులు, అందులో నేటి కాలానికి రాహుల్ ద్రవిడ్ ఒకరు.


అయాచితంగానైనా తనదగ్గరకొచ్చిన ధనాన్ని తృణప్రాయంగా తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్ కి జేజే లు

9, జులై 2024, మంగళవారం

పంపకాలు.

 పంపకాలు.


అనగనగా ఒక పల్లెటూరు. ఒక కలిగిన కుటుంబం, తల్లి తండ్రికి ఇద్దరు కొడుకులు. వారిని బాగా పెంచి విద్యా బుద్ధులు చెప్పించి, ప్రయోజకుల్ని చేసి, తల్లి తండ్రులు గతించారు, ఆస్థులు పంచుకోడానికో విల్లు రాసి. పంచుకుందాం లే అని కాలయాపన చేసేరు, అన్నదమ్ములిద్దరూ. ఒక రోజు తీరుబడిగా విల్లు తీసి చదువుకుని పంపకాలు మొదలెట్టేరు. 


పంపకాలు సాగుతున్నాయి చిన్న పెద్ద పోట్లాటలతో. చివరికొచ్చినట్టే అనిపించింది.


ఇంతలో తమ్ముడు అన్నా! నాన్న చేసిన పంపకాలలో తేడా ఉంది, కొన్ని కొన్ని విషయాలు  నాన్న విల్లులో రాయలేదు.


నీవాటాకొచ్చిన పొలంలో పెద్ద మోటర్ వేయించాడు, నా వాటాకొచ్చిన పొలంలో చిన్న మోటర్ వేయించాడు. నాది నాలుగంగుళాల బోరు, నీది ఆరంగుళాల బోరూ. మోటర్లు వేయించినప్పటినుంచి నీవాటా పొలంలో మోటరుకి ఖర్చు ఎక్కువైంది, నాకు ముదరా రావాలి. ఇటువంటివి చాలా ఉన్నాయి. అంతే కాదు నువ్వు నాకంటే మూడేళ్ళు ముందు పుట్టేవు. నీకు ఖర్చు చాలా పెట్టేరు,  నువ్వు ఇంతకాలం ఉమ్మడిలో నా కంటే ఎక్కువ ముద్దలే తిన్నావు,రోజూ, నేను తక్కువ తిన్నాను. తిండి విషయం లో, దీనికీ ముదరా రావాలన్నాడు. నీకు నాకంటే ముందు పెళ్ళి చేసేరు,పెళ్ళామొచ్చింది, ఆవిడా తింటూనే ఉందిగా. నీకో కొడుకు పుట్టేడు, వాడు పెద్ద మనవడని మురిసిపోయి, ఎవేవో చేయించారు. వాటికి ముదరా చూసుకోవాలిగా. ముదరా  ఇలా చెప్పుకుపోతున్న తమ్ముణ్ణి చూసి, అన్నకి ఏం చెప్పాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు. 


ఇది నిజంగా జరిగింది, నేను ప్రత్యక్షంగా చూసేను.  

4, జులై 2024, గురువారం

ఉద్యమేన హిః సిద్ధ్యంతి

ఉద్యమేన హిః సిద్ధ్యంతి 


ఉద్యమేన హిః సిద్ధ్యంతి 

కార్యాణి న మనోరథైహిః 

న హి సుప్తస్య సింహస్య

ప్రవిశంతి ముఖే మృగాః 


తలుచుకున్నంతలో పనులు పూర్తైపోవు,ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి.నిద్రపోతున్న సింహం నోట్లో జంతువులు చొరబడవు.


మనసులో కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటిలో కొన్నిటినైనా నెరవేర్చుకోవాలంటే, ప్రయత్నం చేయాలి. సింహం నోరు తెరుచుకుని నిద్రపోతున్నంతలో మృగాలు నోట్లో చొరబడతాయా? అంటే, వేటాడక నిద్రపోతున్న సింహం నోట జంతువులు ఎలా పడవో, అలాగే పనులు కూడా సిద్ధించవు,ప్రయత్నం లేక.ప్రయత్నించు, ప్రతి ఓటమి గెలుపుకు మార్గం. 

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ


పై కవిగారు చెప్పినదాన్ని తాత మరికొంచం వివరించారు. సంగీతం పాడేవారు నిత్యమూ అభ్యాసం చేస్తూనే ఉంటారు. దానిని నేటికిన్నీ మా పల్లెలలో అనడం అనే అంటారు. ఇలా రోజూ అంటూ వుంటే రోజు రోజుకి రాగం పాడే విధం మెరుగుపడుతూ ఉంటుంది.ఇది అభ్యాసంతోనే సాధ్యం. అభ్యాసము కూసువిద్య గువ్వలచెన్నా! అన్నారు మరో కవి.అలాగే వేముని నేలవేము అంటారు. ఇది చాలాచిన్నమొక్క. బహుచేదు. ఆయుర్వేద వైద్యంలో వాడతారు. దీనిని నిత్యం సేవిస్తే కొంత కాలానికి నిజంగానే తియ్యగా ఉంటుంది. రాచ ఉసిరి కాయను కొరికితే పుల్లగా వగరుగా ఉంటుంది, కాని ఆ తరవాత నోరంతా తియ్యగా ఐపోతుంది. సాధన తోనే పనులవుతాయి, కూచుంటే పనులు కావని తాత మాట. మరొకరు
కృషితో నాస్తి దుర్భిక్షం 
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం.

ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా!!!!.

2, జులై 2024, మంగళవారం

డబ్బుతోనే ఉందయ్యా! అంతా!!!

 ధనమూలమిదం జగత్


త్యజంతి మిత్రాణి ధనైర్విహీనమ్ 

పుత్రాశ్చ దారాచ సుహృద్జనాశ్చ

తమర్ధవంతమ్ పునరాశ్రయంతి

అర్ధోహి లోకే మనుషస్య బంధుః

(ఆచార్య చాణక్య)


డబ్బులేనివాడిని భార్య,కొడుకులు, మిత్రులు,  మంచివాళ్ళు కూడా  వదిలేస్తారు. డబ్బు సంపాదిస్తే మళ్ళీ వీరంతా చేరతారని చాణక్యుని మాట.


డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడనీ ఈసడించారో కవి. నడపీనుగు వచ్చెనంచు భార్య ఈసడిస్తుందన్నారు మరొకరు. 

అంతెందుకు? ధనమూలమిదం జగత్ అన్నాడు లక్ష్మణుడు.  డబ్బు సంపాదించు అంతా చుట్టూ చేరతారు మళ్ళీ!


ఎప్పుడు సంపదగల్గిన

అప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెఱువు నిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!


డబ్బుతోనే ఉందయ్యా! అంతా!!! 

30, జూన్ 2024, ఆదివారం

పిల్ల చచ్చినా పురిటి కంపు పోదు.

 పిల్ల చచ్చినా పురిటి కంపు పోదు.


ప్రసవించిన స్త్రీ దగ్గరనుంచి కొద్ది వాసనొస్తుంది,దీన్ని పురిటి వాసన అంటారు. ఇది ప్రసవానికిగాను శరీరం నుంచి బయటకొచ్చే కొన్ని హార్మోన్ల ప్రభావం. దురదృష్టం కొద్ది బిడ్డ దక్కకపోయినా ఈ వాసన తప్పదు,మూడు నెలలుంటుంది.


ఎన్నికలైపోయాయి దగ్గరగా నెల కావొస్తోంది, కాని ఆనాడు ఓటేసినట్టు వేలు మీద పెట్టిన గుర్తు మాత్రం ఇంకా పోలేదు, ఎన్నాళ్ళుంటుందో చూడాలి.

అనారోగ్యంతో బాధ పడుతున్నా రాసే అలవాటు మానలేనట్టు.  :) :) :) 


28, జూన్ 2024, శుక్రవారం

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.

  తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.


కన్నగాడు కత్తి మరవడు.

పడ్డవాడు చెడ్డవాడు కాదు.

 తంతే (తన్నితే)  బూరెల బుట్టలో పడ్డట్టు.

లాభం లేని వ్యాపారం జీతంలేని ఉద్యోగం ఉండవు.

బోడిచేతికి శనగలు తినడం నేర్పినట్టు.

కోడెకు పొట్లు నేర్పినట్టు.


20, జూన్ 2024, గురువారం

సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

 సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

nmrao bandi14 June 2024 at 05:47

''అవును గురూజీ నేనూ అనుకుంటూ ఉంటాను, నేను పోయినా నా బ్లాగు ఇలాగే ఉంటుంది కదా అని. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు - అలా నా వెనక!? దేవుడికే అది ఎరుక, తెలిసేది లేదు కనక!! మనం ఎగిరెళ్ళిపోయినా బ్లాగు చూసే మిగిలున్న వాళ్ళకి ఆ విషయం తెలీదు కనక! ఓ విధంగా ఆ విధంగా సజీవులమే కొన్నాళ్ళు, ఇంకొన్నాళ్లు - అదెన్నోళ్ళో మరి! ఇది కన్నోళ్ళు విన్నోళ్ళు ఏమంటారో మరి? ఔనంటారా సరి! రామ్మా, పజ్జెమేసుకో బామ్మా :)''




మిత్రుని వ్యాఖ్యకి సమాధానం రాయబోతే టపా అయ్యేలా ఉందని వెనకబెట్టేను. ఈ రోజుదయం సింహాసనం ఎక్కి రాయడం మొదలు పెట్టేటప్పటికి కరంటు పుటుక్కున పోయింది. అయ్యో! అనుకుంటూ వచ్చాకా మొదలెడితే మళ్ళీ పోయింది.(వారం కితం మాట)  ఎన్నిసార్లు లెక్కేయడం మానేసా! విసిగి రాయడమే మానేసాను! మొదలెట్టిన ప్రతిసారి కొత్త ఆలోచన, ఆలోచనలు ముసిరి,విషయం పక్కకి పోయి,చిందరవందరైపోతే! మొత్తం ఎత్తి కట్టేసాను! రాత్రి మొదలెడితే, అనుకుంటే వేడి రాత్రికీ దిగలేదు. మొదలెట్టేనుగాని వేడి భరించలేక మానేసాను. తెల్లవారుగట్ల మొదలెడదామని! (ఇదంతా నాలుగురోజుల కితం మాట) వేడి ఇంకా దంచుతోనే ఉంది,చినుకులు అక్షంతల్లా పడ్డాయి.


ఎక్కడ మొదలెట్టాలి? సమస్య అలాగే ఉండిపోయింది. ఎక్కడో ఒకచోట మొదలెట్టాలిగా! అని ఇలా!

మొదటగా ఆకాశం వ్యక్తమయింది. దానినుంచి గాలి, గాలినుంచి అగ్ని,అగ్నినుంచి నీరు,నీటి నుంచి భూమి. వీటన్నిటి సంయోగంతో సర్వసృష్టి వ్యక్తమయ్యాయని మన తత్త్వం చెబుతోంది,సయిన్సూ చెబుతోంది. ఆకాశం ఎక్కడినుంచి పుట్టిందీ? మహత్తు నుంచి అంటోంది భారతీయ తత్త్వం, అదే శక్తి అనికూడా అంటోంది,సయిన్సూ. ఆశక్తినే మనవారు లలితా దేవి అనికూడా అన్నారు. లలితా సహస్రనామాలో ఒక నామం ”వియదాది జగత్ప్రసూః” అని అంటే వియత్తు అనగా ఆకాశం మొదలుగా,వియదాది, జగత్ ప్రసూః అనగా సర్వజగత్తునూ కన్న తల్లి అని. అనగా ఆకాశం మొదలుగా పంచభూతాలను వ్యక్తపరచిన శక్తి అని అర్ధం. ఇలా సర్వజగత్తునూ వ్యక్తం చేయడం మరలా అవ్యక్తం, తనలోకి తీసుకోవడం చేయడం అనేది, ఈ శక్తి ఎక్కడా? అంటే! భాగవతం 'లోకంబులు లోకేశులు,లోకస్థులు దెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుంగు'.... అంటుంది ఆ శక్తిని వర్ణిస్తూ! అక్కడే పోతనగారు 'ఒకపరి జగముల వెలినిడి,ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానై' అంటూ చెబుతారు. సయిన్స్ చెప్పే,మన తత్త్వం చెప్పే ఈ ఎవల్యూషన్,డివల్యూషన్ రెండూ పక్కపక్కలే జరిగిపోతుంటాయి.ఒక్క సారిగా అన్ని వ్యక్తం కావు అన్నీ ఒక్కసారిగా అవ్యకతమూకావు, కాలంలో వచ్చి వెళుతుంటాయి. మొత్తం ఒక్క సారిగా ప్రళయం సంభవించి అన్నీ ఏకమవుతాయి. అప్పటిదాకా ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. అన్నీ కాలంలో వచ్చి కాలంలో వెళుతుంటాయి. అందుకే దీనిని జగత్ అని అంటారు. జాయతే గఛ్ఛతే ఇతి జగత్, వచ్చేది,వెళ్ళేది. అన్నీ కాలంతో పాటివే! కొన్ని, కొన్ని క్షణాలే ఉంటే కొన్ని వందల సంవత్సరాలుంటే, మరికొన్ని వేల సంవత్సరాలు ఉంటాయంటున్నారు. సముద్రం లో వేల సంవత్సరాలుండే జీవులున్నాయని సయిన్స్ చెబుతోంది. కాలం మాత్రం ఆ శక్తికిలోబడి ఉంటుంది, దానినే ,కాలాతీత శక్తి, అని అంటాం.చెప్పుకుంటే చాలా ఉంది. ఇక్కడికాపుదాం. 

మనకతలో కొస్తే!


న+క్షరం='అక్షరం', అనగా నశింపు లేనిది. మనం రాసే ఈ అచ్చరాలెంతకాలముంటాయన్నదే ప్రశ్న. రామాయణం రాస్తూ వాల్మీకి, ''ఈ కావ్యం, నదులు పర్వతాలు ఉన్నంత కాలం ఉంటుంద''న్నారు. ఇటువంటి మాట ఆ తరవాత కవుల్లో ఎవరూ అనలేకపోయారు,నేటిదాకా.  ప్రకృతిలోకి వ్యక్తమయ్యేది ప్రతిదీ, కాలం తో ముడిపడి ఉన్నట్టే మన అచ్చరాలూ ముడిపడి ఉన్నాయి.   ప్రతిజీవికి కాలం ఉన్నట్టే  అచ్చరాలకీ కాలం ఉంది. కాలం తరవాత మరుగునపడతాయి,నశించవు. అక్షరాల సమూహానికో త్రాణ,త్రాణని బట్టి కాలం, కాలమే ప్రాణం. అది ఎంత? అదిగదా ప్రశ్న,సమాధానం లేని ప్రశ్న.  


 ఒకప్పుడు అచ్చరానికి మాధ్యమం శ్రవణం, కాలం మారి, అనేకరూపుల్లో పుస్తకాలొచ్చి చాలా మార్పొచ్చింది. ఇప్పుడు పుస్తకాన్ని ముట్టుకునే ఓపిక,తీరిక ఎవరికిన్నీ లేదు. అంచేత మరలా శ్రవణానికే మారిపోతున్నకాలం.


ఇక ఎలక్ట్రానిక్ యుగంలో మార్పులు చాలా తొందరగా వస్తున్నాయి. ఈ మాధ్యమాలు మనం చూస్తుండగా పుట్టాయి,పెరిగాయి, కొన్ని మరుగున పడిపోయాయి. ఈ అచ్చరం రాసే అలవాటున్నవాళ్ళు కొద్ది. చదివేళ్ళూ వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. మాధ్యమాలు వెనకబడితే, రాసేవాళ్ళు వెనకబడితే,చదివేవాళ్ళు వెనకబడితే అన్ని మరుగున పడతాయి. అదెంతకాలం? అదీ పెద్ద కొచ్చను.????


16, జూన్ 2024, ఆదివారం

సామాన్యుని సణుగుడు- దిన దిన గండం

 సామాన్యుని సణుగుడు- దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు.

గండం అంటే ప్రాణ ప్రమాదం. దినదినమూ ప్రాణప్రమాదమే కాని వందేళ్ళూ బతుకుతాడని భావం.ప్రళయం అంటే లయం, అనగా కలిసిపోవడం.ప్రాణులన్నిటికి నిద్ర నిత్య ప్రళయం,తప్పనిదిన్నీ! అలాగైతే నూరేళ్ళెలా బతుకుతారని కదా!బతుకుతారు అదే చిత్రం. దినదినమూ నిద్రపోతారు, మేల్కొంటారు. ప్రళయం గడుస్తుంది. ఇలా అలావాటైన నిత్య ప్రళయాన్ని ఎవరూ లెక్క చెయ్యరు. ఎప్పుడో ఒక రోజు నిద్ర లేవరు అంతే!!! అందుకే దాన్నే దీర్ఘనిద్ర న్నారు. అదీ ఈ నానుడి భావం.








ఎవరు తప్పుకున్నా ప్రభుత్వం పడిపోదని తెలిసినవారి మాట. ప్రభుత్వంతో ఉన్న పార్టీలకి బి.జె.పి కి పరస్పరాశ్రయ న్యాయం వర్తిస్తుందిట. వీరవసరం వారికుంది,వారవసరం వీరికుంది. ఎవరూ విడిచిపోయేవారు లేరు. ప్రతిపక్షంలోనే చీలికలొచ్చే సూచనలు కనపడుతున్నాయి.

జగన్ మాకు 15 మంది ఎమ్.పి లు ఉన్నారు. మా బలమేం తగ్గలేదు, దేశావసరాలు,రాష్ట్ర అవసరాలని బట్టి అవసరం మేరకు ప్రభుత్వాన్ని బలపరుస్తామన్నారు. మహారాష్ట్రలో లకలుకలు బయలు దేరాయి ప్రతిపక్షంలో!! దినదినగండం నూరేళ్ళాయుస్సే!!!!


13, జూన్ 2024, గురువారం

సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.

 సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.


ఏది శాశ్వతం? ఏదీ కాదన్నదే సమాధానంట.మనకి కనపడే జంగమాలు,స్థావరాలు,ఉద్భిజాలు సర్వం ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవే కాలంలో. అంచేత అన్నీ కాలంలో లయం కావలసినవే! కాలమే శాశ్వతమా? కాదు. మనకి శాశ్వతంగా కనపడే కాలాన్ని కూడా లయం చేసే శక్తి ఉంది. అదే శాశ్వతం. ఏంటో దీనికి అంతులేదు,ఆదీ లేదు.


నా తరవాత నేను సంపాదించిన ఇళ్ళు,పొలాలు,,బంగారం వగైరా వగైరా ఏమవుతాయి? అసలు నేనేమవుతాను? నేను పోయిన తరవాత ఏం జరిగితే నాకెందుకు? ఏమవుతానో నాకు తెలీదు కదా? మరి దేనికి చింత? అనుకోగలిగితే కొచ్చనే లేదు.కాని అలా అనుకోదే మనసు. నా తరవాత నా పేరైనా శాశ్వతంగా ఉండాలని తాపత్రయం. ఇది నాతోనే మొదలవలేదు. అబ్బో మానవజాతి పుట్టినప్పటినుంచీ ఉంది,ఈ ఆలోచన. 


 మహరాజులు,రాణులు గుళ్ళు కట్టించారు,చెరువులు తవ్వించారు, అన్న సత్రాలు పెట్టించారు, కావ్యాలు రాయించారు, కృతులు పుచ్చుకున్నారు, ఇలా చాలాచాలా చేసేరు. పోషణకై ఆస్థులిచ్చారు.  కలిగినవారు చేశారీ పని. వేశ్య కూడా ఈ పని చేసింది. బోగందాని చెరువు పేరుండిపోయింది,ఆవిడపేరు తెలియకపోయినా!


నా తరవాత ఏం జరగాలో విల్లు రాసాను, ఆస్థులు అలా పంచుకుంటారు,తగువు లేదు, రాయకపోయినా పంచుకుంటారు, మానెయ్యరు, ఇదో చాదస్తం అంతే! ఒక రోజేడుస్తారు లోకంకోసమే! అమ్మయ్య ముసలాడి గొణుగుడు తప్పింది,చాకిరీ తప్పిందని.ఆ తరవాత మరిచే పోతారు, సహజం, నేను తాతని గుర్తుపెట్టుకున్నానా? పేరెట్టుకున్న, గనక, గుర్తు అంతే!


అతి సామాన్యులు ఐతే గుడి మెట్ల మీద పేర్లేయించుకునీవారు. మెట్టుకి పావలా పేరు లో అక్షరానికి అణా ఇలా ఉండేవి.నేటికీ కొన్ని దేవాలయాలకి మెట్లు వాడుతున్నారు, వాటి మీద నేటికిన్నీ పేర్లు కనపడుతుంటాయి. మా తాతపేరు అన్నవరం గుడి మెట్లమీదుందోచ్! అని చెప్పుకునీవారూ ఉన్నారు.


ఇంత అశాశ్వత జగత్తులో మన రాతలో లెక్కా! ఉంటే ఎక్కడో మూలుంటాయి,లేదూ కొట్టుకుపోతాయి, కాలంతో. నాబ్లాగొకదాన్ని రెండేళ్ళ కితం వదిలేసా! అప్పుడప్పుడు చూస్తుంటా,తెరుస్తా! ఉందా? పోయిందా అని! ఇంకా ఉంది, చిత్రం ఎవరికో అవసరం, రోజూ పాతికనుంచి ఏభై హిట్లుంటాయి. ఎన్నాళ్ళుంటాయి? అదే తెలీదు :) 

8, జూన్ 2024, శనివారం

సామాన్యుడి సణుగుడు

సామాన్యుడి సణుగుడు 

ఎన్నికల్లో చిత్రాలు.


  ఎన్నికల యజ్ఞం,ఫలితాల రాకా,  పూర్తయింది. చూసే కన్ను, మనసు ఉంటే చిత్ర విచిత్రాలే ఉన్నాయి.  ఎన్నికల్లో సామాన్యుడు చేసిన చిత్రం చూద్దాం.


మొన్నటిదాకా ఇ.వి.ఎమ్ లమీద అనుమానాలతో చెలరేగిపోయిన వారు ఫలితాల తరవాత నోరు మెదిపిన పాపాన పోలేదేమో!

ఇక ఎన్నికల కమిషన్ని, కమిషనర్లని, ప్రభుత్వoలో ఉన్న పార్టీకి కట్టుబానిసలని, తిట్టిన నోళ్ళు, తెరుచు   కోలేదు,ఫలితాల తరవాత.

కొంతమంది మేధావులు ఎన్నికల కమిషన్ కు,సుప్రీం కోర్టుకు ఉమ్మడి ఉత్తరం రాసేసి, ప్రభుత్వం పైన  తమకడుపులో కుళ్ళు వెళ్ళగక్కు కున్నారు.


ఎన్నికల తరవాత మోడీ మరో దేశం పారిపోతాడు అని నోరు పారేసుకున్న లాలూ ఎక్కడా? అరడజను సీట్లైనా గెల్చుకున్నాడా? లేదు 4 సీట్ల దగ్గరాపేసేరు.


మోడీ మళ్ళీ ప్రధానైతే గుండు గీయించుకుంటానన్నాడో  రాష్ట్ర మంత్రి,(తనకి నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు) ఏమయ్యాడో? 


భారతీయ పౌరులలో ఎక్కువమంది, చదువులేనివాళ్ళే కావచ్చు, మేధావులు కాకపోవచ్చు, పేదవాళ్ళే కావచ్చు, డబ్బుకి వోట్లు వేసేవాళ్ళు కావచ్చు, ఉచితాలకి ఎగబడేవాళ్ళే కావచ్చు కాని అవసరం వచ్చినపుడు, మండుటెండలో నిలిచి ఓటేసి, కొఱ్ఱు కాల్చి వాత పెట్టడం లో నిపుణులన్న  సంగతి ఎన్నికలని చూస్తే తెలుస్తుంది.  ఒక్కొకటే చూదాం!


నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు, అని సొల్లు కొట్టిన కేజ్రివాల్, పంజాబ్ లో మూడు సీట్లు గెల్చుకుని, డిల్లీలో, సోదిలోకి రాకుండా పోయాడు. ఉచితాలకి ఓట్లు రాలవన్న మొదటి మాట. 


ఉడుకెత్తించే ఉపన్యాసాలకి ఓట్లు రాలవని కూడా కన్నయ్యకి కాల్చి వాతేట్టేరు,డిల్లీలో!


బీహార్ లో లాలూకి,కాంగ్రెస్ కీ   తమ స్థానమేంటో చెప్పింది సామాన్యులే!

బెంగాల్లో కాంగ్రెస్ కీ, పూర్తిగా ఉద్వాసన చెప్పేసింది దీదీ! ఒకే ఒక్కడుగా పోరాడిన యోధుడు Adhir ranjan chowdary కూడా మమత దెబ్బకి నేలకొరిగాడు.   బెంగాల్లో కాంగ్రెస్ నీ వారి మిత్రులు కమ్యూనిస్టులని మమత కర్చు రాస్సినట్టే! ఒంటరి వీరుడు అధీర్ రంజన్ చౌదరీ ఆర్తనాదాలు కాంగ్రెస్ వారి చెవులబడుతున్నట్టు లేదు. నాకు మరో పని చెయ్యడం చేత కాదు,సంపాదనా మార్గమూ లేదు, కూతురు చదువుకుంటోంది. నేడో రేపో ఢిల్లీ వెళ్ళి క్వార్టరు కాళీ చేసి రావాలన్న ఆకలి కేకలు కూడా, నిన్నటివరకు  లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఆర్తనాదాలు కాంగ్రెస్ కోటలోకి చేరుతున్నట్టు లేదు.  కావాలంటే నన్నేమైనా చేసుకో కాని కార్యకర్తలని ఏమీ చెయ్యకని, మమతని ఫలితాల తరవాత జరిగే హింసనుంచి కాపాడమని, చేతులు జోడించి వేడుకున్నదైనా చెవులబడుతోందో లేదో,విన వలసిన వారికి, తెలియదు.    


 ఇక బెంగాల్ అంటే ఒకప్పుడు ఎఱ్ఱవారి కంచుకోటని పేరు, పాపం సోదిలోకి కూడా రాకుండా పోయారేమో! సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఒడిషా ది మరో చిత్రం. ఒడిషా అంటే పట్నాయక్ అని మారుపేరు, పాతికేళ్ళగా మచ్చ లేని ముఖ్యమంత్రి, కాని బయటికి పంపేసేరు, రాష్ట్ర ఎన్నికల్లో, ఇక పార్లమెంటుకి ఒక్క సీటిచ్చెరు,BJP కి పందొమ్మిది సీట్లిచ్చేరు.కారణం, తను మెచ్చిన ఒక తమిళ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని పూర్తిగా చంకనెత్తుకోవడం,చివరికి అతన్ని ఉద్యోగం మాన్పించి పార్టీ లో చేర్చి పెత్తనమప్పగించడం, సహించ లేదు. ప్రతిపక్షంలో కూచో బెట్టేరు.సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!

 

ఉత్తరప్రదేశ్ యోగి బాబా పరిపాలన, కాని అక్కడ సమాజవాది పార్టీకి 37 సీట్లిచ్చేరు, కూడా ఉన్న కాంగ్రెస్ కి ఆరిచ్చేరు. కాంగ్రెస్ తమగొప్పే అని చంకలు గుద్దేసుకుంటోంది. గొప్ప సమాజ్ వాది పార్టీ దనుకోడం లేదు.దూకుడు తగ్గించమని యోగిబాబాకి చిన్న చురక. 

 

తెలంగాణాలో, సర్వమూ నేనే అని చెప్పిన బి.ఆర్.ఎస్ కి లోక్ సభలో స్థానమే లేకుండా చేసేరు. ఎంత చిత్రం.


ఇక ఆంధ్రా గురించి చెప్పక్కరనే లేదు. జగన్ 11 MLA సీట్లు గెల్చుకుంటే గొప్పయి పోయింది. 4 ఎమ్.పి లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉచితాలనేకం ఇచ్చానే! అయ్యో! ఇంత అన్యాయమా? అని ఆక్రోసించి ఉపయోగం లేదు. ఉచితాలు గండం గడుపుతాయన్న వారికి పెద్ద పాఠమే! ఉచితాలు మేమడగలేదు, మీరిచ్చారు,పుచ్చుకున్నాం. ఉచితాలిస్తే ఓట్లేస్తామని మీరనుకోడం పొరబాటు. చురకేసి చెప్పినట్టు కాలేదా?    కేజ్రి తరవాత రెండో వారికి పాఠం చెప్పిన సామాన్యుడు.    ఏదో జరిగింది ఆధారాలు లేవని ఆక్రోశం ఉపయోగం లేనిది.  


ఎక్కడైనా కాలు పెట్టేరేమోగాని తమిల్ నాడులోకి బి.జె.పి ని రానివ్వకుండా చేసిన ఘనత స్టాలిన్ మరియు పుత్ర రత్నానిదే!  అదే మరి ప్రజాస్వామ్యమంటే! కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే! చివరికి భూమిమీద పేరైనా ఉందా? లేదే! ఇటువంటివారు కాలగతిలో ఎందరు చేరిపోలేదు? హిందూ సంస్కృతి డెంగూ, వగైరా అంటూ నేడు పేలుతున్నవారికి రోజు రావాలి! వస్తుంది!! అప్పటిదాకా ఇంతే!! దోస్తులకి ఇది వినపడుతోందా? 

  ఎ.ఐ.డి.ఎమ్.కె కనపడకుండా పోయింది, బి.ఆర్.ఎస్ లాగా!

చిట్ట చివరికి కేరళాలో సురేష్ గోపి, చిత్ర నటుడు రూపంలో బి.జె.పి కాలు పెట్టింది. ఇదొక రికార్డే! సామాన్యుని చిత్రం. కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లిచ్చి గెలిపించారు.సి.పి.ఎమ్ కి ఒక్క సీటిచ్చారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకి పెద్ద చురక. దేశం మొత్తం మీద ఒకే ఒక కమ్యూనిస్ట్ ఎమ్.పి అనుకుంటా! సామాన్యుడు వేసిన పెద్ద చురక.

   M.Pలో వృద్ధ కాంగ్రెస్ వాదులందరిని తుడిచి పెట్టేసి, మొత్తం సీట్లు బి.జె.పి కే ఇచ్చేసేరు. రాహుల్, ఈ వృద్ధ కాంగ్రెస్ వాదుల్ని వదిలించుకో లేకపోయాడు. ఆ పని బి.జె.పి చేసి పెట్టింది. కాంగ్రెస్ కి పెద్ద లాభం  

కర్ణాటకా లో ఉచితాలు ఉచితాలే, కేంద్ర ఎన్నికలు ఎన్నికలే అని తొమ్మిదే సీట్లిచ్చారు కాంగ్రెస్ కి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా!  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా BJP కి  17 సీట్లిచ్చారు  కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా ! సామాన్యుడు వేసిన పెద్ద చురక,కాంగ్రెస్ కి!


BJP:-మీరు దేశ భద్రత,రక్షణ,విదేశీ వ్యవహారాల్లో చూపిన నిపుణతకి జే జేలు చెప్పేం! ఐతే దేశపు అంతర్గత వ్యవహారాలలో కొంత పట్టు విడుపు అవసరం,దాన్ని విస్మరించి, ఒంటెత్తు పోకడ పోయినందుకు, మిమ్మల్నిప్రతిపక్షంలో   కూచోబెట్టలేదుగాని మీకుగా స్వతంత్రంగా 272 సీట్లు ఇవ్వటం లేదు, మరో నలుగుర్ని తోడిస్తున్నాం! వారితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి! అని చెప్పి నాలుగు పార్టీలతో కలిపి 293 సీట్లిచ్చినది పెద్ద హెచ్చరిక!  BJP కి,  మీతో ఇప్పుడు. తీసుకున్న నిర్ణయం కచ్చితoగా అమలు చేసే మోడీ అంటే చాలామందికి కడుపుమంట, దేశంలోనూ విదేశాల్లోనూ కూడా!   BJP పార్టీకి పెద్ద హెచ్చరిక!ఇది సామాన్యుని హెచ్చరిక

Congress:- పార్టీని మా తాత,తండ్రులు నిర్మించుకున్నది, నేటికి ఒక కుటుంబానికి చెందిపోయింది. మీ నుంచి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, అందులో ఒక్కటి మచ్చుకి. మీ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం వివరాలు దేశానికి చెప్పేరా? ఏమిటవి? ఇప్పుడు మీకిచ్చిన 99 సీట్లు మీ ప్రతిభకి మెచ్చి ఇచ్చినవి కావు. బి.జె.పికి,  ఒక చిన్న చురక అంటించడానికి చేసిన కసరత్తు.పదేళ్ళు పరిపాలన చేసినవాళ్ళని ప్రతిపక్షంలో కూచోబెడ్తారు,ఆ పని చెయ్యలేదు. ఈ 99 సీట్లు,  మీప్రతిభే అనుకుంటే పొరబాటు, మరోమాట కూడా! ప్రభుత్వాన్ని పడకొట్టేస్తాం! రంకెలేస్తున్నారు, అస్తు! మరచిపోకండి! ఆ తరవాత మీరు నిర్మించే ప్రభుత్వం ను, మీరు ఆరు నెలలు నిర్వహించలేరు. ఇప్పుడే మీ దోస్తు మమత నిన్నటిదాకా మీ పల్లకీ మోసిన బోయీ అధీర్ రంజన్ చౌదరిని నానాగడ్డీ కరిపించేస్తోంది. నేడు మీతో ఉన్నవాళ్ళెవరూ మీ మిత్రులు కారు, ఇంతటి గొప్ప దోస్తుతో మీ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉండబోతోంది? మీ యోధుడినే రక్షించలేని మీరు దేశాన్నేం రక్షిస్తారు? దేశo కుక్కలు చింపిన విస్తరైపోయి, మళ్ళీ మోడీకే ఈ సారి 400  సీట్లిచ్చి  పట్టం కడతారు. ఆ తరవాత మీ అడ్రసులు గల్లంతు, జాగ్రత్త! చూసుకుని అడుగేయండి. పశ్చిమ దేశాలన్నీ తమ స్వార్ధం చూసుకుంటాయి. అంతేకాదు భారత్ ఎప్పుడూ వాటికి అణిగిమణిగి ఉండాలనీ,వాటిమీద ఆధారపడి బతకాలనీ అనుకుంటాయి. అది తెలుసుకు మసలండి. మీ స్వంతంగా 272 స్థానాలూ వచ్చేదాకా ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రయత్నాలు చేస్తే ఫలితాలు విపరీతంగా ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక,చురక, సామాన్యుడి నుంచి.


29, మే 2024, బుధవారం

లోకులు పలుగాకులు.

 

    లోకులు పలుగాకులు.


లోకుల్ని కాకులతోనే ఎందుకు పోల్చేరు? 

కాకి కూత కఠోరంగానే ఉంటుంది. ఏమిటి లోకం? పలుగాకుల లోకం   న్నారో సినీ కవి.    

కాకుల్లో చాలా రకాలట, బొంతకాకులు,నల్లకాకులు,పిల్లకాకులు. మిరపకాయి తిన్న కాకిలా అరవకంటారు, ఇంకా ఐతే మిరపకాయ తిన్న పిల్ల కాకిలా అరవకంటారు. పిల్ల కాకి బాగా అరుస్తుందిట. ముసలికాకులూ బాగానే అరుస్తాయిట.  బొంతకాకులు మిగిలిన కాకుల్ని బెదిరిస్తూ ఉంటాయి. తెల్లకాకులు లేవన్నాడు బద్దెనగారు. ఇప్పుడంతా తెల్ల కాకులదే మహిమ. వారు చెప్పిందే వేదం.  మెతుకులు కనపడ్డ చోటనే కాకి చేరుతుంది, మరిన్ని కాకుల్ని పిలుస్తుంది, కూతతో.

కాకి కూసిందని మన పని మనం చేయడమూ మానకూడదు, కాకి కూత కోసం ఎదురూ చూడ కూడదు. ఈ పలుగాకుల్లో చాలా రకాలుంటాయి. కాకి కూతలు వినాలి. కాకులు కూస్తున్నాయని వాటిని తోలుకుంటూ కూచుంటే మన పని చేయలేం. కాకి కూతలు వినాలి, కాకి కూతల్ని ఆస్వాదించి, నవ్వుకోవాలి.  

హేటు కూసే  కాకి,  కూసి కూసి, కొంతకాలానికి, కాకి అలసిపోతుంది. కాకిని అలసిపోనివ్వ కూడదు.  మెతుకులేస్తూ ఉండాలి.  కాకితో సహజీవనం తప్పదు. మరీ మీద మీదకొచ్చే కాకుల్ని ఉపేక్షించ కూడదు. కాకి కూతలు మన పనికి అడ్డంకి కాదు, అడ్డంకి చేసుకోరాదు. ఇది మనచేతనే ఉంది. కాకులు మొత్తాన్ని తోలుకుంటూ కూచుంటే ఎలా? మన పని చేసుకుంటూ, కాకి కూతలు వింటూ, కాలక్షేపం చెయ్యాలి. కాకి కూతని కాలక్షేపం చేసుకోవాలి. మరో సంగతి మరచిపో కూడనిది, మెతుకులున్న చోటకే కాకి చేరుతుంది.  కాకి కూతలు విని మనం పయనిస్తున్న దిశ సవ్యంగా ఉందా? లేదా? అనేది నిర్ణయించుకో కూడదు.ఇది తెలిస్తే ఆచరిస్తే జీవితమే హాయి!!!! అంచేత కాకుల్ని తరిమేయకండి. కాకి కూతలు వినండి.రోజూ ఉదయమే కూసే కాకి కొన్ని రోజులు కనపడకపోతే, కాకి కూత వినపడకపోతే కాకి ఆరోగ్యం గురించి విచారించండి.కాకి జిందాబాద్!!!




అధో సూచిక:- ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలి. నేనూ కాకుల్లో ఒకడినే :)

28, మే 2024, మంగళవారం

కడుపుతో ఉన్నమ్మ

 కడుపుతో ఉన్నమ్మ


కడుపుతో ఉన్నమ్మ కనక మానదు.

ఒండుకున్నమ్మ తినక మానదు. 


ఇదొక నానుడి కడుపుతో ఉన్న ఆవిడ సమయానికి ప్రసవిస్తుంది. అలాగే వంట చేసుకోడమెందుకు? తినడానికే! దానికీ సమయం ఉంటుంది. అది ఆకలేసిన సమయం. అప్పుడే తింటుంది, వద్దన్నా మానదు. పల్లెటూరివాళ్ళు ఈ మాటని జరగవలసిన పని జరగవలసిన  సమయం లో జరిగి తీరుతుంది, వద్దంటే మానదని చెప్పడానికి చెబుతారు. ఒక్కొకపుడు సమయం నడుస్తున్నట్టే కనపడదు, ఒక్కొకప్పుడు సమయం పరిగెడుతున్నట్టే ఉంటుంది. మనం చెప్పినట్టూ, మనకి కావలసినట్టూ సమయం నడవదు. ఎన్నికలవుతున్నాయి. పూర్తైన తరవాత లెక్కింపూ,ఆపై ఫలితాల ప్రకటనా ఉంటుంది. మనం కంగారు పడినంతలో సమయం పరుగెడుతుందా? 


కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు.


   కూతురుంటే తల్లికి చేదోడని ఈ నానుడి భావం. కూతురు 

పెద్దదై తల్లికి తోడవుతుంది. కొడుకు పెద్దవాడై తండ్రికి శత్రువవుతాడు. ఇది లోకరీతి. 


చిన్న పామైనా పెద్ద కఱ్ఱతో కొట్టాలి

 

 విషమున్న పాము చిన్నదైనా వదలకూడదని భావం. అంటే సమస్య చిన్నదే కదా అని ఉపేక్ష చేయకూడదు. అగ్ని కణం చిన్నదే అని ఊరుకుంటే కొంపలు కాల్చేస్తుంది, అలాగే శత్రువు బలహీనపడైపోయాడనుకుని వదిలేయకు. ప్రయత్నం పెద్దది చేసైనా దండించాల్సిందే! మరో మాట పిల్లపాముకే విషమెక్కువుంటుంది, ముదిరిన పాముకి విషం తగ్గిపోతుంది, కక్కి,కక్కి ఉంటుందిగా! 

26, మే 2024, ఆదివారం

ఆశ.

 ఆశ.


ఆశ మానవుణ్ణి నడిపిస్తుంది.

పేరాశ మానవుణ్ణి పరుగుపెట్టిస్తుంది. ఫలితం ఉండదు.

దురాశ మానవుణ్ణి పరుగుపెట్టించి బోల్తా పడేలా చేస్తుంది.

నిరాశ మానవులకి దూరంగానే ఉండాలి. ఇది కమ్ముకుందా మరిలేవడు.  పొరబాటుగా నిరాశలో చిక్కుకున్నా, పడిపోయినా అది క్షణికంకావాలి. పడిపోయినందుకు సిగ్గుపడ కూడదు. నిరాశనుంచి బయటపడాలి బంతిలా పైకి లేవాలి.



కందుకమువోలె సుజనుడు 

కిందంబడి మగుడ మింటి కెగసెడును జుమీ

మందుడు మృత్పిండము వలె 

కిందంబడి అణగియుండు కృపణత్వమునన్


543 స్థానాలున్న లోక్ సభలో అన్ని స్థానాలకూ పోటీ చేసి లేదా ( 272 ఆపై స్థానాలకు)  మెజారిటీ రాగల స్థానాలకు పోటీ చేసిన పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం, ఆశ. ఎందుకంటే నెగ్గిన తరవాత పార్టీ కూడా ఎన్నుకోవాలిగా:)


543 స్థానాల్లో మెజారిటీ స్థానాలుకి (272) కూడా పోటీ చేయలేని పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం పేరాశ. ఎందుకంటే,ఆ పార్టీ వారు, ఈ పార్టీవారు నన్ను ఎన్నుకుంటారనుకోడమే పేరాశ.


543 స్థానాల్లో పదిస్థానాలకీ పోటీ చేయలేని పార్టీవాడు ప్రధాని ఐపోతానని ఆశ పడటం చెప్పుకోవడం దురాశ.   

25, మే 2024, శనివారం

అల్లో నేరేడు పళ్ళు

  అల్లో నేరేడు పళ్ళు

 నేరేడు పళ్ళు, జంబూ ఫలం, Jamun Fruit,Black berry 

 kg. 400/- 

నిరుడు kg 3౦౦/-

24, మే 2024, శుక్రవారం

విష్ణుమాయ

 


(సామాన్యుడు వేంకటేశ్వరునికి విన్న వించుకుంటున్న తీరు. అన్నమాచార్యల వారి పెద్ద కుమారుడు పెద తిరుమలయ్య తన కీర్తనలో వెలిబుచ్చుతున్న విధం)  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ


జీవులన్నిటిలోను మానవజన్మ గొప్పది,అది పొందేను..  మానవజన్మ ఎందుకు గొప్పది? జీవులన్నిటిలోనూ మానవునికే అన్నీ అధికం, ఈ జన్మనుంచి మాత్రమే జన్మరాహిత్యం పొందడానికి సావకాశం. మిగతా ఉపాధులలో జన్మరాహిత్యం పొందేందుకు తగిన కర్మలు చేసే సావకాశం లేదు. అటువంటి జన్మ ఎత్తినా ఫలితం కనపడటం లేదు. ఇక నిన్నే నమ్ముకున్నా! ఇది నిజం, అంటే నీవేదప్ప ఇతఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద మన్నింపు భద్రాత్మకా! అని గజేంద్రుడు శరణాగతి చేసినట్టు చెబుతున్నా! ఇక నీ చిత్తం పాలముంచినా నీట ముంచినా నీవే దిక్కని వేడుకోలు.


మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద  సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా


మూడు పూటలా కంచం దగ్గరకి చేరడం మరిచిపోను, రాత్రికి మంచం దగ్గరకి చేరడమూ మరచిపోను (స్త్రీ సుఖమూ మరువను)సరే! ఇంతతో సరిపెడతానా? మిగిలిన ఇంద్రియ సుఖంకోసము పరుగులు పెడతాను.( మంచి సినిమా చూసేస్తాను, దమ్మరో దమ్ సంగీత కచేరి! ముందుంటాను. మంచి అత్తరొచ్చిందిట ఇంకేం కొనేస్తాను, ఈ శరీరానికి రాసేస్తాను. ఇవేవి మరచిపోను.) మాధవా నీమాయ సుమా! మంచిమాట మరచిపోతాను. నిన్ను తెలుసుకునే రహస్యం చెప్పినది మరచిపోతాను. చిత్రం చూడు! గురువునూ మరచిపోతాను,నిన్నే మరచిపోతాను!!! ఏంటయ్యా ఈ మాయ?



విడువను బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయా

పాపమంటాను, పుణ్యమనీ అంటాను కాని ఏదీ వదలిపెట్టను, పాపాలు చేస్తూనే ఉంటాను. నా దుర్గుణాలు వదలను,పేరాశ, దురాశ, అంటూ ఉంటాను కాని వదలిపెట్టను, దేనినీ. ఇదంతా నీ మాయ విష్ణుడా! షట్కర్మలు వదిలేస్తా ( ఏమిటవి? అధ్యయనం,అధ్యాపనం;యజనం,యాజనం; దానం,ప్రతిగ్రహం.(చదవడం,బోధించడం;యజ్ఞం చేయడం,చేయించడం; దానమివ్వడం,పుచ్చుకోవడం) నిన్ను చేరే చదువు వదిలేస్తా, ఆచారమా గాడిదగుడ్డేం కాదూ! వదిలేస్తా!  గుర్తే రాదు, ఇదే కదా విష్ణుమాయ. 


తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధమ్ముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా

అనవసర విషయాలో వేలు పెట్టేస్తా, అనవసర బంధాల్లో తగులుకుంటా!!! మోక్ష మార్గం సుంతైనా తలపుకు రానివ్వను. అంతర్యామివైన నువ్వు నవ్వుతుంటావు, నా ఏలికవై  నీవుండగా  నాకేల ఈ విష్ణుమాయ, వేంకటేశ్వరునిగా నవ్వుతూ దర్శనమీయరాదా.  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ

అన్నమయ్యను స్మరించుకుంటూ...


ధన్యవాదాలు.:-మొన్న ఒక కామెంట్ రాస్తూ ఈ కీర్తన చరణం మొదటి పాదమే రాయగలిగా మిగిలినది గుర్తుకు రాలేదు. >>>> పెట్టి వదిలేసా! మిత్రులు విన్నకోటవారు ఈ కీర్తన పట్టుకుని నాకు పంపించారు. దానినిలా సద్వినియోగం చేసుకున్నాను. విన్నకోటవారికి మరొక సారి ధన్యవాదాలు.