Sunday 6 September 2020

కృష్ణార్పణం

  ఏదైనా భగవంతునికి సమర్పించి, నమస్కరించి అనుభవించడం భారతీయులకి అలవాటు. దీనినే కృష్ణార్పణం అంటారు లేదా కైంకర్యం చేయడం అంటారు. నేటి కాలంలో కృష్ణార్పణం అంటే పోగొట్టుకోవడమనీ, కైంకర్యం చేయడమంటే దొంగిలించడమనీ రూఢి అర్ధాలు చెప్పేస్తున్నారు. గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అనే నానుడి ఒకటి ఉంది. ఏమది? ఒక చిన్న కత, అవధరించండి.


ఒకపల్లెలో ఒక ముసలమ్మ, పళ్ళూడిపోయాయి. నమలలేదు కనక ఏం తిన్నా అరగదు. అందుకు పేలాలు తినడం మొదలు పెట్టింది. పేలాలు అంటే పాత ధాన్యంతో చేస్తారు. అటుకులు కొత్త ధాన్యంతో చేస్తారు. పేలాలు వేరు,అటుకులు వేరు. వీటి గురించి ఇదివరలోనే చెప్పేనుగనక మళ్ళీ చెప్పను. పాండిందే పాటరా పాచి పళ్ళ దాసరీ అన్నట్టు. పాలలోనో పెరుగులోనో కలుపుకున్నా పేలాలని చప్పరించక తప్పటం లెదు. అందుకు పేలాలని పిండి చేసుకుంది.ఈ పిండిని పాలలో కలుపుకుని భగవంతునికి అర్పించి కృష్ణార్పణం చేసి తను తీసుకుంటూ వచ్చింది. ఒక రోజు ఇలా తయారు చేసుకున్న పేలపిండిని ఎండలో పెట్టి కాపలా కూచుంది. ఇంతలో ఒక సుడిగాలి వచ్చి ఆ పేల పిండి మొత్తాన్ని ఎత్తుకుపోయింది. ఏం చేయాలో ముసలమ్మకి తోచలేదు. అయ్యో! కృష్ణార్పణ చేయలేకపోయానే అని బాధ పడింది. ఈ పేలాలూ భగవంతుడే ఇచ్చాడు, ఈ సుడిగాలీ భగవంతుని రూపమే. ఆయనే ఇచ్చి ఆయనే తీసుకెళితే మధ్యలో నేనెందుకు బాధ పడాలి? అనుకుని తూర్పుకు తిరిగి ఒక నమస్కారం చేస్తూ గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అని నమస్కారం చేసి ఉపవాసం ఉంది. 


మన చేతిలో లేనిదాని గురించి బాధ పడేకంటే కృష్ణార్పణం అని అనుకుని భగవంతునికి అర్పించేస్తే చాలుగా.


సందర్భం ఏంటో? ఒక బ్లాగును ముచ్చటపడి మొదలుపెట్టా దగ్గరగా తొమ్మిదేళ్ళ కితం. ఆ బ్లాగంటే నాకిష్టం, మమత, ఎందుకు? చెప్పలేను, అంతే! నాలుగు నెలలకితం అది నా చేతి పరిధి దాటిపోయింది.ప్రయత్నం చేశా నా వలన కాలేదు. అందుకే కృష్ణార్పణ చేశా, అంటే సమాజానికే వదిలేశా.  







6 comments:

  1. శ్రీమద్రమారమణగోవిందోహరి..

    నిజమే ఆచార్య..
    ఒక్కోపాలి టగాఫ్ వార్ తాడు కూడా మనం ఎంతగా లాగినా గాని పట్టు తప్పి సర్రున జారుతుంది. ఇంక గట్టిగా పట్టుకుంటే రాసుకుని పూసుకుని అరచేతినే గాయాలపాలు చేస్తుంది. ఒక రకంగా పైన మీరు తెలిపిన పెలాల పిండి గాలికొదిలేసిన బామ్మ లానే మనం కూడా కొన్ని సందర్భాలలో (మనసొప్పకున్నా కాని) అలా టగ్ ఆఫ్ వార్ రోప్ ను వదిలేస్తేనే మంచిది; కాని మీరు డీలా పడకండి. వీలు చిక్కినపుడల్ల మంచి మంచి నీతి కతలు ప్రచూరిస్తు ఉండండి. పైపెచ్చు.. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూనే సుమండి.
    మనిషన్నాక సవాలక్ష సవాళ్ళను ఎదురుకోవాల్సి వస్తుంది. అధైర్య పడకూడదు. ఒహవేళ నేను మీరు ప్రచూరించిన ఆ వేంపాడు (ఎలమంచిలి నర్సిపట్నం హైవే పక్కన ఊరు) పేరు గల కుటుంబికుల కథ తో మీ మనసును ఇబ్బంది పెట్టి వుంటే మన్నించండి. అనట్టు అప్పులప్పారావు మునిమామ్మ కామెడి చూశారా.. మనసు తేలిక చేసుకోండి. మీ ఆరోగ్యం జాగ్రత.. మీ అందరి ఆశిస్సులను ఎల్లవేళల కోరుకుంటు..

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్,
      సరిగా రెండేళ్ళకితం ఇదే రోజున నా ఇల్లాలు నా చెయ్యి వదిలేసి పరమాత్మను చేరుకుంది. ఆరోజునుంచి మనసు మొద్దుబారిపోయింది. బాధాలేదు,సంతోషమూ లేదు.ఒక క్షణం పాత విషయం గుర్తు చేస్తే ఒక నవ్వు నవ్వుకోవడం అంతే!రోజు నడుస్తోంది.

      ఉన్నంతవరకు సాధ్యమైనంతలో నలుగురితో కలిసి బతకాలనేదే!

      Delete
    2. వీలు చిక్కినపుడల్ల మంచి మంచి నీతి కతలు [మీరు వదిలిపెట్టిన బ్లాగ్ లో కాదు లెండి. ఈ మీ ప్రస్తుత బ్లాగ్ లో ప్రచూరిస్తు ఉండడని నా ఉవాచ.. ఆ విషయాన్నే పైన రాయాలనుకున్నా..!] ప్రచూరిస్తు ఉండండి.

      Delete
    3. భార్య భర్తల అన్యోన్యత గురించి విపులంగ వివరిస్తా వినండి.. నాకు తెలుసు మీకు తెలుసునని.. కాని కాస్త ఊరటగా ఉంటుందని.. మరోలా అనుకోవద్దని మనవి.

      ఒక బంధం ముడి వేసుకోవాలంటే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు పెద్దలు.. కాని నిజమేమీటంటే.. తరతరాలకు తరగని బాంధవ్యాన్ని ఆలుమగలు తమకు తాముగానే అల్లుకుంటారు.. ఒక చక్కటి బొమ్మరిల్లుగా.. అపుడు ఏ వైపున ఎన్ని తరాలు ఎలా ఉన్నా ఏమి పట్టదు.. అలకలు, కోపతాపాలు ఇవన్ని గీటు రాయి వంటివి.. మొదటి రెండేళ్ళు నువ్వా నేనా అని పోటి పడి మరీ అలిగే ఆలుమగలు సైతం మెల్లగా దాంపత్య జీవితపు మాధుర్యాన్ని, ఒకరికి ఒకరి పట్ల విధేయతను అలవర్చుకుని జంటగా సాగుతారు., భార్య తన భర్త తోడును కోరుకుంటుంది.. అలానే భర్త తన భార్య కు నీడలా ఉంటాడు.. ఇలా పెనవేసుకూనే అనూహ్య బంధమే సతిపతిలిరువురివి.
      ఏడడుగుల బంధమే కాదు అదీ ఏడేడు జన్మల పుణ్యాల ఫలం.. ఋణానుబంధం.. బామ్మ గారికి మీకు పెండ్లి అయేపాటికి ఏ పదిహేనో-ఇరవైయో ఏటన జరిగి ఉండి ఉంటే మీతో పాటే షష్ఠిపూర్తి జరుపుకుని ఉంటారు.. మీ వజ్రోత్సవం కూడా.. ఇంతకు మించి ఏ ఇల్లాలికి దక్కే పుణ్యం ఏముంటుంది. అంటారు.. భర్త చేసే పొరపాటు కేవలం భర్తకే వర్తిస్తుంది.. కాని అదే భర్త చేసే పుణ్య కార్యం లో సగం పాలు భార్యకు చెందుతుంది అందుకనే ధర్మపత్ని అంటారుట.. అలా బామ్మగారు మీ సాంగత్యంలో పుణ్యమే దక్కిందంటాను నేను. (కన్నీటి పర్యంతం అవుతున్నారా.. అరాక్షలు కమకతిగా కగాసమ టేవుం.. కన్నులు తుడుచుకోండి..)
      ఎవరైనా చుట్టం చూపుగా పలకరిస్తేనే విసుక్కునే వారుంటారని మొన్నీమధ్యే మీరు ఒక టపా లో ప్రస్తావించారు..!
      ఈ బంధాల బాంధవ్యాల గురించి నాకంటే కూడా మీకే బాగా తెలుసు.. నేను మీకన్న నలభై ఐదేళ్ళు పిన్న వయస్కుడిని.. కొన్ని జ్ఞాపకాలు ఎపుడు మరుగున పడవు.. ఎందుకంటే అవి మన అనుకున్న వారి తీపి గురుతులు.. కొన్ని మనం వద్దనుకున్నా అలుకుపోయే బంధాలు.. పేగు బంధం ఉన్న వారికి జన్మతః ఋణం తీర్చుకోలేము.. అనుబంధం పెనవేసుకున్న వారికి ఆచంద్రతారార్కం ఋణపడే ఉంటాము.. కనుకనే బామ్మ గారి జ్ఞాపకాలను పదిలపరుచుకుని సంతోషంగా ఉండండి. అమ్మ, నాన్న ల తర్వాత అదే స్థాయిలో మన ఆలన పాలన చూసుకునే స్త్రీమూర్తికి ప్రతి మగవాడు ఋణపడే ఉంటాడు. బామ్మగారు సైతం ఎల్లపుడు మీ జ్ఞాపకాల్లో చిరునవ్వుగా, బాధలో ఓదార్పుగా, మీతోనే మీలోనే ఉంటారు..!

      Delete
  2. ఋణానుబంధ రూపేణా పశు పత్ని (సుతాలయా) బ్లాగాలయా
    ఋుణక్షయే క్షయయాంతి తత్ర పరివేదనా
    ————-
    అనుకోవడమే ఊరటగా ఉంటుందిగా, శర్మ గారు. పెద్దలు మీకు తెలియదనా.

    గతంలో దండెత్తి వచ్చినవారేనా ఈ సారి కూడా పుణ్యం కట్టుకున్నది?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఏదీ మన చేతిలో లేదు.ఏదో ఐపోయింది.కృష్ణార్పణం అంతే!

      Delete