7, అక్టోబర్ 2024, సోమవారం

కొండొండోరీ సెరువుల కిందా........కొత్త వ్యాఖ్య.

కొండొండోరీ సెరువుల కిందా........కొత్త వ్యాఖ్య.

కొండొండోరి సెరువులకింద..... ఈ గేయానికి అర్ధం నామటుకు నేను పూర్తిగా చెప్పుకోలేకపోయాను. ఎవరెవరో చెప్పినవాటిని కూడా పూర్తిగా ఆమోదించలేకపోయాను. కాని తెలుసుకోవాలనే ఉత్సుకత పోలేదు. ఇప్పటికి నాకు నచ్చిన వ్యాఖ్య కనపడింది. అందుకే పంచుకుంటున్నాను.రచయిత్రి నీరజ హరి ప్రభలగారికి నా అభినందన మందారమాల. 

Courtesy:-

 https://www.manatelugukathalu.com/post/kondondori-seruvula-kinda-telugu-article-3670


'Kondondori Seruvula Kinda- New Telugu Article Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 01/10/2024

'కొండొండోరీ సెరువుల కిందా' తెలుగు వ్యాసం

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


కొండొండోరీ సెరువుల కిందా........


నాకు చాలా చాలా ఇష్టమైన తత్వము. దీనిని అడవి బాపిరాజు గారు వ్రాశారు. ఇది చాలా భావయుక్తమైనది, అర్ధవంతమైనది. ఈ తత్వానికి చాలా లోతైన భావముంది. 


మన జీవిత వాస్తవాన్ని తెలుపుతూ మనలో నిగూఢంగా నిక్షిప్తమైన సత్వము,రజస్సు, తమస్సు గుణాలను, వాటిస్వభావాన్ని తెలుపుతూ, వాటికనుగుణంగా మన మనస్సు ఏవిధంగా మెలిగేదీ తెలుపుతుంది. ఈ తత్వానికి అర్ధం వివరించ ప్రయత్నిస్తున్నాను.


1.కొండొండోరీ సెరువుల కిందా సేసిరి ముగ్గురు ఎగసాయం… అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో త్రిమూర్తులు ముగ్గురు స్రృష్టి వ్యవసాయం చేయ మొదలు పెట్టారు. ఒకడికి కాడీ లేదు, రెండు దూడా లేదు అంటే వ్యవసాయానికి కావలసిన కాడిగానీ, దూడ గానీ వాళ్ళవద్ద లేవు. 

కాడీ దూడ లేనెగసాయం పండెను మూడు పంటలు. అంటే ఆ పంటలు సత్వము,రజస్సు, తమస్సు అనే గుణాలు.మరి ఆ పంటలకు వడ్లు, గడ్డి ఉండాలి కదా! కానీ సత్వరజస్తమోగుణాలు అనే పంటలకు వడ్లు, గడ్డి రెండూ లేవు.


2.ఆ పంటలను తీసికెళ్ళి ఇశాక పట్నం సంత (ఇశాఖ అంటే ఔన్నత్యం శాఖలు లేని సంసారం)లో పెట్టారు. జీవులు వాటిలో లీనమై మాయా ప్రపంచాన్ని చూసి అది నిజమని భ్రమపడి సంసార జీవితంలో పడి ఆ వ్యామోహంతో వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోయారు. ఐహిక సుఖాలు- కోరికల వ్యామోహానికి దాసులయ్యారు.


3. జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు…అంటే షరాబులు అంటే కంసాలులు. వాళ్ళు అగ్ని, వాయువు, సూర్యుడు. వాళ్ళకు కాళ్లు లేవు, రెండు చేతులు లేవు.వాళ్ళకు మనలాగా రూపములు ఉండవు కదా!.


4.కాళ్లు, సేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు…అంటే అవి త్రిదండాలు. అవి 1.వాక్ దండము(మౌనము) 2.మనోదండము (ఆశ లేకుండుట) 3.కాయదండము(స్వధర్మాచరణము).

అవి వొల్లావొల్లాదు, రెండూ సెల్లా సెల్లావు అంటే త్రిదండాలకు ఈ లోకంలో చెల్లుబాటు లేదని భావము.అంటే. ఆ మూడింటినీ మనం ఆచరించము కదా!


5.వొల్లా సెల్లని కాసులు తీసుకు ఇజయనగరం ఊరికి పోతే ఒట్టి ఊరే కానీ ఊళ్ళో జనం లేరు …అంటే (విజయ అంటే మిక్కిలి గెలుపు ). సహస్రార చక్ర ఛేదనము ఆనే ఊరు. ఈ లోకంలో చాలా మంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగా భ్యాసంతో ఆ సహస్రార చక్రఛేదనము అనే ఊరు వెళదామని చూస్తే ఆఊరు చేరినవారెవరూ లేరు. అంటే ఉత్తమ యోగులు లేరు అని భావం.


6.జనంలేని ఊళ్ళోను ఉండిరి ముగ్గురు కుమ్మర్లు...అంటే వాళ్ళు త్రికాలాలు. అవి భూత, భవిష్యత్.వర్తమాన కాలాలు. ఒకటికి తలా లేదు, రెండు మొలా లేదు అంటే ఉత్తమ యోగాభ్యాసం చేసే వాళ్లు లేకపోయినా తలా-మొలా లేని(ఆకారం లేని త్రికాలాల ) కుమ్మర్లు వస్తూనే ఉంటారు. కాలాలు అతీతమైనవి కదా!


 7.తలా-మొలా లేని కుమ్మర్లు సేసిరి మూడు భాండాలు….అంటే అవి భూలోకం, పాతాళ లోకం, స్వర్గలోకం. ఒకటికి అంచు లేదు రెంటికి అడుగూ లేదు.(కాలం సృష్టించే లోకాలకు అంచు-అడుగు లేదుఆది-అంతం ఉండదు.) అది నిరంతరం ఉంటుంది.


8.అంచూ-అడుగు లేని భాండాలలో ఉంచిరి మూడు గింజలు…అంటే అవి శ్లేష్మం, వాతం, పిత్తం అనే త్రిదోషాలు.అవి ఉడకా ఉడకదు, రెండు మిడకా మిడకావు. అంటే ఈ లోకంలో జీవులు ఆడుకునేందుకు వాత, పిత్త, శ్లేష్మం అనే 3 గింజలను ప్రతి జీవిలోను ఉంచాడు భగవంతుడు.


9.ఉడకా-మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టాలు…అంటే ఆ చుట్టాలు ముగ్గురు మనస్సు, వాక్కు, కర్మ అనే త్రికరణాలు. 

ఒకటికి అంగుళ్ళేదు, రెండు మింగుళ్ళేదు. అంటే శ్లేష్మం, వాత, పిత్తం అనే త్రికరణాలను జీవులు అనుభవిస్తున్నారు. వాటితో ఎప్పుడూ ఏదో ఒక విధంగా బాధ పడుతూనే ఉంటాడు ప్రతి జీవి.


10.అంగుడు-మింగుడు.(లోకుత్తుక) లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు….అంటే అవి ధర్మ, అర్థ, కామము అనే త్రిగుణాలు. వాటికి సుట్టూ లేదు, రెండు మద్దే లేదు. సెల్లా లు అంటే అంచులు లేని బట్టలు. ధర్మార్థకామమనే త్రిగుణాలు సెల్లాలు. వాటిని త్రికరణాలు తెచ్చారు. అంటే వీటికి చుట్టాలు లేరు. పరిమితము అనేది లేదు.
 https://www.manatelugukathalu.com/ వారికి,నీరజహరి,ప్రభల గారికి ధన్యవాదాలు తెలుపుతూ టపాను ఇక్కడ పంచుకుంటున్నా!

5, అక్టోబర్ 2024, శనివారం

ఖరము పాలు

 ఖరము పాలు


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు

కడివెడైననేమి ఖరము పాలు

భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ వినుర వేమ.


ఆవుపాలు గరిటెడైనా చాలు. గాడిదపాలు కడివెడైనా ఉపయోగం లేదు. భక్తిగా పట్టెడు మెతుకులు పెట్టినా చాలు అంటున్నారు, తాతగారు.


చాలా పాతకాలంవాడు కదా అందుకలా అనేసారు. తాత ఆవుని గొప్పచేసి గాడిదను చులకన చేసేరు. నేటికాలంలో గరిటెడు ఆవుపాలు ఎందుకూ పనికిరావు! కడివెడు గాడిద పాలు అమ్ముకుంటే లక్ష రూపాయల పైమాటే. భక్తెవడికి కావాలి కడుపు నిండాలిగాని. తాతగారికి క్షమాపణలతో పేరడీ పద్యం.


గంగిగోవుపాలు గరిటెడైన నేలపాలు

కడివెడైన ఖరముపాలు లక్షవిలువ

కడుపునిండు కూడు  ఎంగిలైననేమి 

విశ్వదాభిరామ వినుర వేమ


గాడిద పాలతో సబ్బు తయారు చేసిందో టెకీ. నెమ్మదిగా మార్కెట్ చేసింది. ఇప్పుడా సబ్బు హాట్ కేక్ లా అమ్ముడుపోతోంది. ఇంటర్ నేషనల్ మార్కెట్ ఎక్కేసింది.సామాన్యులకి దొరకడమే లేదు.


 గాడిద వెన్న అతిమెత్తగా,సుతిమెత్తగా ఉంటుంది. గాడిదవెన్న కెజి. రెండు లక్షలు ఐదేళ్ళకితం మాట. ఇప్పుడెంతో తెలీదు.లీటర్ గాడిదపాలు ఎనిమిది వేలు.  లేడీ ఫైర్ నెస్స్ క్రీమ్ లన్నీ గాడిదవెన్నతోనే తయారు చేయబడతాయి.  

గాడిదల్ని పెంచండి కోటీశ్వరులు కండి అని చెపితే నన్ను ఎగతాళీ చేసేరు. ఇప్పుడు ఆడగాడిదలే దొరకటం లేదు, కంచరగాడిదలు కూడా, వాటికంత డిమాండ్ ఏర్పడింది. కాలమండీ బాబూ కాలం.


గాడిదలకీ జై


1, అక్టోబర్ 2024, మంగళవారం

ఎవరు వృద్ధులు?

 ఎవరు వృద్ధులు?

చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 


దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే  పావురాల రాజు, ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి పావురాల రాజు,  ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.   పావురాల రాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా పావురాల రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సమస్య

 సమస్య


సమస్య లేని మనిషి లేడు,ఉండడు.

ఎవరి సమస్య వారే  పరిష్కరించుకోవాలి. కొన్నిటికి ఇతరుల సాయం అవసరం.


కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు, కాలమే సమాధానం చెప్పాలి.


కొన్ని సమస్యలతో రాజీ పడకతప్పదు.జీవితాంతం రాజీ పడి బతకాల్సిందే!


ఉపేక్ష చేయలేని సమస్య ఆరోగ్యం. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ఏం చేయాలన్నా శరీరం, అందునా ఆరోగ్యకరమైన శరీరం అత్యవసరం.రాజీ పడలేని,పడకూడని సమస్య ఆరోగ్యం.


పెద్ద సమస్య కాలం. జరిగిపోయిన కాలం తిరిగిరాదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే!