అప్రస్తుత ప్రసంగం.
నేను పుట్టినకాలం నాటి ముచ్చట. ఆ రోజుల్లో వినోదం అంటే తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాడించే కళాకారులు రామాయణ,భారత,భాగవతాల్లో అంశాలు చెబుతుండేవారు,తోలుబొమ్మల సాయంతో. ఈ ఆట కొంత నడిచిన తరవాత తెరపై కేతిగాడు ఉరఫ్ జుట్టుపోలిగాడు ఉరఫ్ గాందోళిగాడు,బంగారక్కల బొమ్మలను తెరపై వేసి అసందర్భ ప్రసంగం చేసి హాస్యం పుట్టించేవారు. ఆ తరవాత కాలంలో ఈ హాస్యం శృతి మించి రాగానపడినట్టు బూతులు చోటు చేసుకున్నాయి. సరే ఆ తరవాత అవి సినిమా,టివి లకీ చేరిపోయాయి. హాస్యం అపహాస్యమూ అయింది.
ఇంతకీ ఇదెందుకు గుర్తొచ్చిందీ? అదీ కొచ్చను. 96 ఏళ్ళ వృద్ధ తోలుబొమ్మలాట కళాకారిణికి పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు గుర్తొచ్చింది, నాటి కాలంలో, ఆంధ్ర ప్రాంతంలో మా వూరు నరిసిపూడి, ఈ తోలు బొమ్మలాటకి ప్రసిద్ధి పొందింది. అంతే కాదు నాటి తోలుబొమ్మలాట కళాకారులకు మా పూర్వీకులు గురువులు. అదీ బాదరాయణ సంబంధం,ఇదో అప్రస్తుత ప్రసంగం.
కాలంలో ఇది సాహిత్యంలోనూ చోటు చేసుకుంది. భాసుని మృఛ్ఛకటిక నాటకంలో శకారుడు,(రాణీగారి తమ్ముడు, అనధికార కేంద్రం), మాటల ద్వారా హాస్యం పండింప జేసేరు. ఆ తరవాత కాలంలో తెనుగులో గురజాడవారు తమ కన్యాశుల్కం నాటకం ద్వారా ఈ రకపు హాస్యాన్ని పండించడం చేసేరు. గిరీశం, బుచ్చమ్మల ద్వారా అపహాస్యపు మాటల ద్వారా, హాస్యం కొంత పండింప జేసేరు. ఆ నాటిక అవసరం నేటి కాలానికి లేకపోయినా,ఆ సమస్య చచ్చిపోయినా,కొందరు నేటికీ ఆ నాటికను వేస్తూ,చచ్చిన గుర్రాన్ని తోలుతూనే ఉన్నారు ( ఏదో కారణం ఉండి ఉంటుంది) ఇది నేటి కాలానికి అప్రస్తుతం . మృఛ్ఛకటకం, కన్యాశుల్కాలని పోలిస్తే భాసుడు శకారుణ్ణి సృష్టిస్తే గురజాడ గిరీశాన్ని పుట్టించారు. భాసుడు ఒక హీరోని,హీరోయిన్ గా ఒక వేశ్యను పుట్టించి, చివరికి వేశ్యను ఉదాత్త పాత్ర చేసేరు. అలాగే గురజాడ భాసుని హీరో విలన్ లను కలిపేసి గిరీశాన్ని తయారు చేసి,మథురవాణి అనే వేశ్యను ఉదాత్తం చేసేరు. గురజాడ నాటికకు భాసుని నాటిక ఉత్తేజమా? ఏమో తెలిసినవారు చెప్పాలి. ఇదీ అప్రస్తుత ప్రసంగమే! డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎక్కడబ్బా?
ఇక అష్టావధానం అనేది ఒక కవితా ప్రక్రియ. చెళ్ళపిళ్ళ వారి ద్వారా అది ప్రజల దగ్గరకు చేరింది. అందులో ఒక అప్రస్తుత ప్రసంగితో ప్రసంగం కూడా ఒక ప్రక్రియ. ఇలా అప్రస్తుత ప్రసంగం కవులనూ చేరింది. ఇందులోనూ హాస్యంచోటు చేసుకుంది, ఒక్కొకపుడి అపహాస్యం కూడా అవుతోంది.
కొద్ది మోతాదులో అప్రస్తుత ప్రసంగం కూడా బాగుంటుందేమో సుమా!
ఇదీ నేటి కాలానికి అప్రస్తుత ప్రసంగం.