16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

భాస్కర జయంతి

 భాస్కర జయంతి (రథసప్తమి)


నమస్సవిత్రే జగదేకచక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే


జగత్తుకి కన్ను,సృష్టి, స్థితి, లయ లకు కారణము, సర్వము త్రిగుణాత్మకమైన,బ్రహ్మ,విష్ణు,మహేశ్వర రూపమైన భాస్కరునికి నమస్కారము.


భారతదేశంలో సూర్యోపాసన అనాదిగా ఉన్నదే!సనాతన ధర్మంలో సూర్యోపాసన ప్రముఖమైనదే. భాస్కరుణ్ణి ప్రత్యక్షనారాయణుడిగా (ప్రత్యక్ష దైవం) ఆరాధిస్తారు. మాఘశుక్ల సప్తమి రోజు కృత్తికా నక్షత్రంలో సూర్యజననం అంటారు. ఉదయమే తలకు కొద్దిగా నూనెపెట్టుకుని జిల్లేడాకు మీద ఒక రేగుపండు ఉంచుకుని తలపై ఉంచుకుని శిరఃస్నానం చేయడం ఆచారం. సూర్యునికి పరమాన్నం ప్రీతికరమైనది. గోమయంతో చేసిన పిడకలపై ఆవుపాలతో కొత్తబెల్లంతో బియ్యపు పరమాన్నం సూర్యుని వెలుగులో వండి భాస్కరునికి   నైవేద్యం చేసి ప్రసాదంగా తీసుకోవడం ఆచారం. ఇలా తయారు చేసిన పరమాన్నం నిజంగానే అమృతం లా ఉంటుంది.

15 కామెంట్‌లు:

  1. అవును శర్మ గారు. ఆ పరమాన్నం మా అమ్మగారు చేస్తుండేవారు. చాలా రుచికరంగా వండేవారు 🙏.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు22 February 2024 at 15:55
      భాస్కరుడికి పరమాన్నమే ఆహారం. పళ్ళు లేవు కదండీ! దక్షయజ్ఞంలో వీరభద్రుడు కొడితే పళ్ళూడిపోయాయి. అప్పటినుంచి పరమాన్నమే ఆహారం, ఆయనకి. ఇక మన సంగతికొస్తే ఆయన కిరణాలు అందులో పడతాయి ఆ రోజు, అంతేకాదండి పంచభూతాలూ అందులో సమ్మిళతమవుతాయంటారు,ఆ తరవాత భాస్కరునికి నైవేద్యం, అందుకే అంత రుచేమో!

      తొలగించండి
    2. sarma22 February 2024 at 16:48 (contd)
      ఆ తరవాత ఈశ్వరుడు దేవతలందరిని కరుణించాడు. అందులో భాగంగా భాస్కరుడుకి యాజమాన్యదంతాలు ( Dentures) ప్రసాదించాడు. చంద్రుడు వేడితే కాలుతో తొక్కినందుకుగాను నెత్తిన పెట్టుకున్నాడు.

      తొలగించండి
  2. శర్మ గారు,
    అడిగానని ఏమనుకోవద్దు. శ్యామలరావు గారు నొచ్చుకుంటారేమో తెలియదు మరి. అయిననూ తెలుసుకోవలె.

    ఈ మధ్యకాలంలో నాకు విచిత్రంగా తోస్తున్న పని ఒకటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని మూలాల గురించి, ప్రామాణికత గురించే నా సందేహం.

    పని ఏమిటంటే - శ్రీరామ నవమి దగ్గర పడుతోందంటే చాలు వడ్లని చేత్తో ఒలిచి సీతారాముల తలంబ్రాల కోసం బియ్యం సిద్దం చెయ్యడం. జనాలు - ముఖ్యంగా మహిళలు - పోటాపోటీగా ఈ పనిలో నిమగ్నమవుతుంటారు.

    నా సందేహం - తన కూతురి పెళ్ళి అయినప్పటికీ, తాను మహారాజు అయినప్పటికీ జనక మహారాజు కూడా ఇలా జనాల్ని కూర్చోబెట్టి వడ్లు ఒలిపించలేదేమోనని. ఏం, ఎంత త్రేతాయుగం నాటి పాతకాలం అయినప్పటికీ ఆనాటి నాగరికతలో కూడా రోళ్ళు రోకళ్ళు ఉండే ఉంటాయి కదా? ఇలా చేత్తో వడ్లు ఒలవడం ఏమిటి? ఎన్ని వేల వడ్లగింజల్ని ఒలవాలి?

    దీనికి ఏదైనా ప్రామాణికత ఉందా లేక ఇటీవలి కాలంలో ఎవరయినా మొదలెట్టిన వేలంవెర్రా? మీరేమంటారు?
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావు22 February 2024 at 16:14
      కొంచం పెద్దదిగా ఉంటుంది సమాధానం ఏమనుకోవద్దూ! ఎవరు కోపపడ్డా జరుగుతున్న సంగతి చెబుతున్నాను.
      గోజిలవారికి గోదావరన్నా,భద్రాద్రి అన్నా ఒక పులకింత. తూగోజిలో సీతానగరం అనే ఊరు ఉంది.ఆ ఊళ్ళో 4 acres land రామునికి తలంబ్రాలు పండించడానికి కేటాయించేరెవరో!ఒక దాత. ఆ ఊళ్ళో వర్షకాలంలో పొలం దున్నేవారు,ఊడ్పు ఊడ్చేవారు, కోతకోసేవారు,కుప్పనూర్చి ధాన్యం ఇంటికి చేర్చేవారు అంతా రామబంటుల వేషాల్లోనే పని చేస్తారు.ఆ పైన ధాన్యాన్ని గింజ గింజ రామనామం జపిస్తూ, రామదాసును స్మరిస్తూ,రామకీర్తనలు గానం చేస్తూ, నామరామాయణం చెబుతూ ఇలా సర్వం రామమయంగా, చేత్తో ఓలిచి తలంబ్రాలు తయారు చేసి భద్రాద్రి పంపుతారు, ఆ గ్రామ మరియు చుట్టుపక్కల గ్రామాల స్త్రీలు, చాలా నిష్థగా. ఇదెందుకంటే తలంబ్రాలకి ముక్కు విరగని బియ్యం వాడాలంటారు. చేత్తో ఒలిస్తే ముక్కు విరిగితే పక్కన పెడతారు. అదండి సంగతి. ఇదెంతకాలం నుంచి? చెప్పలేను. ఇదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. ఇది నిష్ఠ,పులకింత,భక్తి, రాముడు,సీతలపై ప్రేమ,అభిమానం,సీతారాములు మాస్వంతం, మీరేమనుకోండి, ఇదింతే. నాకింతకంటే మాటలు రావు,చెప్పడానికి.
      ఇక మా దగ్గర మండపేటనుంచి కొబ్బరి బొండాలను రంగులేసి అలంకరించి పంపుతారు రాముడు పెళ్ళిరోజునాటికి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేతిలోపెట్టే దానికోసం.ఇదీ ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది.

      తొలగించండి
    2. ఈ కార్యక్రమం కొన్ని నెలలు సాగుతుందండి.

      తొలగించండి
    3. చాలా వివరంగా చెప్పారు శర్మ గారు. ధన్యవాదాలు.

      నా సందేహం ప్రస్తుత దాతల గురించి, వదాన్యుల గురించీ కాదండి. అసలీ ఆనవాయితీ అనాదిగా సాగుతూ వస్తోందా లేక కలియుగంలో అది కూడా ఈ మధ్య కాలంలో మొదలయిందా అని. ఇంకా సూటిగా చెప్పాలంటే ఈ వడ్లు ఒలిచే కార్యక్రమం గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణం లో ఉన్నదా అని. ఉంటే గనక అది ప్రామాణికత అవుతుంది. లేదూ అంటే గనక ఇది మనం మొదలెట్టిన వేడుక అవుతుంది.

      సరే మీరన్నట్లు రాముడి గురించిన ఒక “పులకింత”. ఎంతైనా చెయ్యచ్చు లెండి.

      వడ్లు ఒలవడం గురించి నేనిందాక గూగులిస్తే ఒక ఆసక్తికరమైన విడియో తగిలింది. దానిలోని మహిళ ఒక లక్షా ఏభై వేల బియ్యపు గింజల మీద శ్రీరామ అని రంగుతో వ్రాస్తోంది. పూర్తయిన తరువాత భద్రాద్రికి పంపిస్తుందట. ఎవరి “పులకింత” వారికి ఆనందం 🙏.

      తొలగించండి
    4. విన్నకోట నరసింహా రావు22 February 2024 at 18:35
      మూడు వందల రామాయణాలున్నాయంటారు,తెలిసినవారు. నాకు తెలిసినది వాల్మీకి విరచిత రామాయణం. అందులో పెళ్ళితంతు వున్నట్టులేదు, లేదా నేను పొరబడి ఉండచ్చు,చూడడం.మిగిలిన రామాయణాల్లో ఏమున్నది చెప్పలేను.
      కలికాలం సంగతికేంగాని, నేనెరిగిన కాలంలో మాట. పెళ్ళిళ్ళలో రకరకాల ఆచారాలు,వ్యవహారాలూ ఉన్నాయి,భారతదేశంలో. తలంబ్రాలు అనే ఆచారం అన్నిచోట్ల ఉన్నదనుకోను. ఇది తెనుగువారిలో ఉన్న ఆచారం. ఇందులోనే మరోమాట, ముక్కు విరగనిబియ్యం మాత్రమే తలబ్రాలకు వాడటమనేది, ఇలా రకరకాలు. గోజిలవారికి ఈ అలవాటుంది. అందుకే బియ్యాన్ని మరీమరీ జల్లిస్తారు,తలంబ్రాలకి, దీనికో కొలత కూడా ఉంది. ఈ తలంబ్రాల బియ్యాన్ని కొన్ని చోట్ల ఇంటి మడేలు పట్టుకెళ్ళే ఆచారం. మరికొన్ని చోట్ల పెళ్ళి చేయించిన బ్రహ్మగారు పట్టుకెళ్ళే ఆచారం.
      ఇక ఈ ధాన్యపు గింజలని ఓలచడం సంగతి గురించి. ఈ సీతానగరం అనే గ్రామం పగోజిలో నేనుపుట్టిన ఊరికి ఎదురుగట్టున తూగోజిలో ఉన్నది (వంగలపూడి సీతానగరం అంటాం). నేనెరిగినంతలో ఈ ఆచారం అలవాటు డెభ్భై ఏళ్ళకితం లేదు. ఆతరవాత కాలంలో మొదలదలయిందనుకుంటాను. సీతారాములను స్వంతం చేసుకోవాలనే తపనలో మాది పిచ్చిలా కనపడచ్చు, కాని మారలేం,అంతేనండి. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం లాంచిలో ప్రయాణం, మా ఊళ్ళ మీదుగా గోదావరిలో, ఇసుకతిప్పలపై వంటవార్పు,పడక, రెండు రోజుల ప్రయాణం,. అదో గొప్ప అనుభూతి,ఆనందం. నేను పెంపకానికొచ్చిన ఊరిలో ఇంటిపక్కవారు నవమికి ఐదు రోజులు సీతారాముల వివాహం జరిపించేవారు, ఊరు ఊరంతకీ పండగే! మాకు గోదావరితో భద్రాద్రితో ఉన్న అనుబంధం. అదే ఒక పెద్ద పులకింత,అదేమాచే ఇలా చేయిస్తో ఉంటుంది.కాలంలో కొన్ని వెనకబట్టేయి,కొత్తవి పుడుతున్నాయి.

      తొలగించండి
    5. వాల్మీకి రామాయణం యధాతథంగా తెలుగులో దొరుకుతుందాండి?

      తొలగించండి
    6. దొరుకుతుంది
      పుల్లెల వారిది బావుంది.

      https://archive.org/details/VRPullela12356

      తొలగించండి
    7. bonagiri25 February 2024 at 22:20
      వాల్మీకి రామాయణం యధాతథంగా వచనంలో ఉషశ్రీని మించినది లేదనే నా అభిమతం. పుల్లెలవారిది బాగుంటుంది. ఇక మూడోది గీతాప్రెస్ గోరఖ్పూర్ వారిది మూడు పుస్తకాలుగా, ఒక పక్క శ్లోకం దాని పక్కనే అదే పేజిలో వచనం, చదువుకోడానికి బాగుందండి. రైల్వే బుక్ స్టాల్స్ లో దొరుకుతాయి. లేదా ఆన్ లైన్ తెప్పించుకోవచ్చు. ఖరీదు కూడా తక్కువ. ఇదీ వాల్మీకి రామాయణానికి యధాథమని నా నమ్మిక. నా దగ్గర ఉషశ్రీ వచనం,గీతాప్రెస్ వారివి ఉన్నాయి,వాటితోనే నెట్టుకొస్తున్నాను :)

      తొలగించండి
    8. Zilebi26 February 2024 at 02:44
      ధన్యవాదాలు.

      తొలగించండి
    9. వాల్మీకి రామాయణం యధాతథంగా వచనంలో ఉషశ్రీని మించినది లేదనే నా అభిమతం - నేనూ అంతే!

      తొలగించండి
    10. hari.S.babu26 February 2024 at 19:37
      కూజంతం రామరామేతి
      మథురం మథురాక్షరం
      ఆరుహ్య కవితా శాఖా
      వందే వాల్మీకి కోకిలం

      తెనుగు వచన వాల్మీకి ఉషశ్రీ
      వందే ఉషశ్రీ

      తొలగించండి