Sunday 4 August 2019

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి.

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.

Courtesy: Owner


నృసింహ శతకంలో పద్యం చదువుకుంటున్నాం కదూ! మొన్న మొదటి పాదం చదివేంగా. ఇప్పుడు రెండో పాదం, అవధరించండి. 




మొదటిపాదంలో అధిక విద్యావంతులు అప్రయోజకులౌతున్నారన్నారు. అప్రయోజకులంటే పనికిరానివారని అర్ధం. ఈ శుంఠ శబ్దానికి అదే అర్ధం చెబుతోంది ఆంధ్రభారతి. తేడా ఏంటీ?




పండిత పుత్ర పరమ శుంఠ అన్నది పెద్దలమాట.ఈ మాటలోని పరమ శుంఠ పదాన్ని కవిగారు పూర్ణ  శుంఠ అన్నారనుకుంటా! పైవాళ్ళు అర్ధ శుంఠలైతే వీరు పూర్ణశుంఠలట. పూర్ణశుంఠ అనడం లో అవసరమూ ఉన్నది సుమా! పై పాదంలో పనికిరానివారు అన్నవారు పూర్ణశుంఠలు కారు. కొంత సానబడితే వారు పనికిరావచ్చు గాని ఈ పూర్ణశుంఠలు మాత్రం పుటమేసినా పనికిరారని చెప్పడానికే పూర్ణశుంఠ అన్నారనుకుంటా. 




పండిత పుత్రులు పరమశుంఠలు ఎలా అవుతారు? అలా పరమ శుంఠలైనవారు సభాపూజ్యులెలా అవుతారు అన్నదే అనుమానం.పండితునికి తన పాండిత్యం ద్వారా కలిగే వ్యవహారాలమీద తప్పించి సంతానం ఎలా ఉన్నదో పట్టించుకునే తీరిక ఉండదు. మరి వీరిని చూసేవారెటువంటివారుంటారు? వీరు సమయం గడుపుకోవాలనే స్వార్ధపరులై ఉంటారు.ఇతరులను పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకునేవారవుతారు. వీరు ఆ పండితుని పొగిడి అవసరం గడుపుకునేవారు కావడంతో పిల్లలికి చెడ్డ బుద్ధులే అబ్బుతాయి, వీరి చదివు సంధ్యలు వెనకబడతాయి. వీరిని సరి దిద్దేవారుండరు, ఎత్తుచేతివారి బిడ్డలు కదా!.పిల్లలను కూడా పండితుని కంటే గొప్పవారని పొడ్తలలో ముంచి పబ్బం గడుపుకుంటూ, పండితుని పిల్లలను పరమ శుంఠలుగా తయారు చేస్తారు.  ఆ తరవాత వారు కూడా ఈ పండితుని గౌరవంలో కాలం గడిపేస్తారు. పిచ్చి ప్రజలు పండితుని ప్రజ్ఞ పాటవాలు వీరిలో కూడా ఉన్నాయనుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమైపోతుంది. కాలం గడుస్తుంది, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి. అప్పటి దాకా ఈ పరమ శుంఠలు సభాపూజితం పొందుతూనే ఉంటారు.  

11 comments:

  1. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నది ఇదే

    ReplyDelete
  2. విన్నకోటాజీ.. ఇక్కడెవరో భక్తుడు మిమ్మల్నే ప్రార్థిస్తున్నాడు. అక్కడ సిరిని కాసేపు ఐఫోన్ లో వదిలేసి ఓసారి ఇటు వచ్చి పోరాదూ?!

    ReplyDelete
    Replies
    1. సూర్యాగారు.

      స్వామివారు ఇవేవీ వినే మూడ్ లో ఉన్నట్టు లేరు,బిజీ బిజీ otherwise

      Delete
  3. అవునండీ, కాస్త బిజీయే - చెంచులక్ష్మి ఏదో సాధిస్తుంటేనూ.

    అయినా, దేనికైనా సరైన సమయం కోసం వేచిచూడాలి - ఒక్క హిరణ్యకశిపుడి సంగతి చూడడానికే బోలెడంత టైం పట్టింది కదా.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      చిత్తం దేవరా!
      నమస్కారాలు.

      Delete
    2. అలాగా, దేనికైనా టైం రావాలా? సరే కానివ్వండి. మీకు నైవేద్యం పెట్టడానికైనా టైం రావాలి. అప్పటిదాకా పస్తులే!

      Delete
    3. ఏం ఫరవాలేదు. ఎలాగూ డైటింగే లెండి. Take your time 🤚.

      Delete
    4. డైటింగ్ కి ఉపవాసానికి మధ్య ఉన్న సన్నని గీతని గుర్తించట్లేదు తమరు!

      Delete


  4. ఏమండీ కష్టేఫలి వారు కశ్మీరు పై మీరో టపా వ్రాయరాదూ ?



    జిలేబి

    ReplyDelete
  5. జిలేబి గారు,

    కాశ్మీర్ కేo బానే ఉందిగా

    ధన్యవాదాలు

    ReplyDelete