Tuesday, 27 January 2026

దొందూ దొందే!!!

దొందూ దొందే!!!

ఒకకొత్తగా పెళ్ళయిన జాయ,పతి. ఇద్దరూ కలసి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నది దాటాల్సి వచ్చింది. పడవెక్కి, ప్రయాణం తరవాత దిగేరు. నది ఒడ్డు ఎక్కుతూ తలపైకెత్తి చూస్తే, ఒడ్డున విరగబూసిన చింతచెట్టు కనపడింది ఇద్దరికీ,

పతి అసంకల్పితంగా   

తింతతెట్టు పూసిందే అన్నాడట!

చింతచెట్టు పూసిందే అన్నమాట.

దానికి జాయ మాటకలుపుతూ

తాతే పూతే తాలానికి తాయదా? పూయదా? అందట.

కాచే పూచే కాలానికి కాయదా?పూయదా అని ఆమె మాట. 

ఒకరికి "చ"పలకదు,మరొకరికి "క" "చ" రెండూ పలకవు.

ఇది విన్న పడవ సరంగు దొందూ దొందే!అన్నాడు.

ఇద్దరూ ఇద్దరే అన్నమాట. ఇతని "ఇ", "ర", ఒత్తులు పలకవు. 

ఈ చిన్ని కతని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మేధావుల పరంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఒకరిని మరొకరు ఉత్పేక్షాలంకారలో పొగుడుకుంటూ ఉంటారు.

Monday, 26 January 2026

కలికాలం

 భారత గణతంత్రదిన శుభకామనలు


కలికాలం 


కలికాలం I

ఇది కలికాలం II


ఆకలి కాలం, 

మూకల కాలం,

కేకల కాలం,

రూకల కాలం. 


కలికాలం I

ఇది కలికాలం II


రూపుల కాలం,

మాపుల కాలం,

రేపుల కాలం, 

పాపుల కాలం.


కలికాలం I

ఇది కలికాలం II


చూపుల కాలం

రాపిడి కాలం

చావుల కాలం

దోపిడి కాలం.

Thursday, 22 January 2026

రోగం రొష్టు-సంసారం గుట్టు

 రోగం రొష్టు-సంసారం గుట్టు


ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!

 రోగం రొష్టు

ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి  ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి.   నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన  దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో!  ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ  రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు.  టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.   


ఇక సంసారం గుట్టు. 

సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట  వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం.   బయట చెప్పుకునేవా?  అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే  అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు


ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం 

మంత్రమౌషధ సంగమౌ 

దానమానావమానశ్చ

నవగోప్యా మనీషిభిః 


వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం.  ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.    

Friday, 16 January 2026

తీర్థానికి వెళ్ళొచ్చా!

       తీర్థానికి వెళ్ళొచ్చా!

 తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట. 

మళ్ళీ సంవత్సరమేమో మనమేమో అని ఒకసారి తీర్థం చూసిరావాలనుకున్నా

ఈ  ఊరువచ్చింది మొదలు తీర్ధం చూస్తూనే ఉన్నా. భోగినాడు ఉదయమే అమ్మను దర్శించడం ఆనవాయితీ,కాని తీర్ధానికి వెళ్ళాలంటే దీపాలు పెట్టేకానే వెళ్ళాలి,అందుకు సంక్రాంతి రోజు సాయంత్రం వెళ్ళడానికి ముందుగా కోడలమ్మాయికి చెప్పేను. అబ్బాయికి చెప్పినట్టుంది, ఎప్పుడు వెళదాం తీర్థానికని అడిగాడు. సంక్రాంతిరోజు రాత్రి 6 దాటాకా అనడంతో నా తీర్థానికి ప్రయాణం నిశ్చయమయింది. నా చిన్నకొడుకు ఇప్పుడు నువ్వు తీర్థానికి వెళ్ళకపోతే నష్టమేం లేదు,జనంలో నడవలేవని విసుక్కోలేదు.  బండి మీద తీసుకెళ్ళి తీసుకొస్తా,భయము లేదని చెప్పి ఒప్పించాడు. 

ఎక్కడికి ఒకడినే వెళ్ళే సాహసం చెయ్యడం మానేసి చాలాకాలమయింది,పిల్లలతోడు అవసరమూ అయింది. బయలుదేరాలంటే ముందు కోడలమ్మాయి స్వెట్టరు తొడికి మంకీ కేప్ పెట్టి కర్ర చేతికిచ్చి తయారుచేసి బండెక్కించింది. బండి ఎక్కడ పెట్టాలో వగైరా చెప్పబోతుంటే నేను చెబుతారండి అనేసేడు. నాకేమో, వాడు చిన్నపిల్లాడిలా కనపడతాడు. వాడేమో ఏభైదాటి లోకం చూస్తున్నవాడు. అన్నీ తెలుసని వాడనుకుంటే చిన్నపిల్లాడు ఏమీ తెలియనివాడని నేననుకుంటా ఇక్కడొస్తుంది తేడా కాలం మారిందన్న విషయం మరచిపోతుంటా,పిల్లల దగ్గర.  

అలా తీర్ధాని చేరి దూరంగా భద్రంగా ఉండే చోట బండి పెట్టేకా నా కర్రతో నా నడక తీర్థంలోకి మొదలయింది.  జనం,ఒకటే జనం. అదేమో 100 అడుగులరోడ్డు  రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రి-కాకినాడ కాలగట్టు రోడ్డు దాకా ఒక కిలో మీటర్ పొడుగు, దానిలో ఈ తీర్థం. ఎల్.ఇ.డి దీపాలతో తీర్థం వెలిగిపోతోంది. లోపలికి అడుగెట్టగానే గుండెలవిసేలా డి.జె సౌండు, గుండెలు పట్టేసినట్టయింది. గబగబా ఆ ప్రదేశం నుంచి కదలిపోయా,ముందుకు.,జనంలో. 

                                                      అమ్మగారబ్బాయి.


గ్రామ దేవత వీరుళ్ళమ్మ

కత్తి చేతితో దొరికిందట,మ్మఅందుకు వీరులమ్మ
( వీరుల తల్లి) అని నామకరణం చేసేరు. ఆ తరవాత అదికాస్తా వీరుళ్ళమ్మ ఐపోయింది. ఇది ఒకప్పటి ఫోటో,నేడు గుడి చాలా అభివృద్ధి చేసేరు. అమ్మను మొన్న భోగిరోజు ఉదయమే దర్శించి వచ్చా..

మా (స్లోగన్)నినాదం అందరూ బాగుండాలి,అందులో మనముండాలి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.




ఈ సారి గాజు సామాను కొట్లు,పింగాణీ సామాను కొట్లు ఎక్కువ వచ్చాయి.
తీర్థంలో అడుగెట్టగానే ఛాట్ మసాలా వాసన గుప్పున కొట్టింది. తీర్థంలో  పానీ పూరి,ఇతర తినుబండారాల కొట్లే ఎక్కువ కనపడ్డాయి. అక్కడే జనం ఉన్నారు. 

జైశ్రీరాం జండాలు బాగానే అమ్ముడుపోతున్నాయి.ఒకటి కొన్నా!


బతికి ఉన్న త్రాచునే మెడలో వేయించుకుందో అమ్మాయి. ఫోటో తీసేలోపు తీసేసింది. నీ ధైర్యానికి మెచ్చే, అని చెప్పేను. భర్త అనుకుంటా ఆ తరవాత ఆముదం తాగినవాడిలా మొహం పెట్టి పామును మెడలో వేయించుకున్నాడు,తాను భయపదటం లేదని. నేను ఆ అమ్మాయిని ప్రశంస చేస్తుంటే జనం మూగేసేరు,చుట్టూ. ఈ సందర్భంగా ఒక శ్లోకం గుర్తొచ్చింది.


స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే. 

మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.


పచ్చబొట్టు వేసేవాళ్ళు ఇద్దరు కనపడ్డారుగాని,వేయించుకునేవాళ్ళే కనపడలేదు. కిందటి సారి ఇల్లాలితో  వచ్చినపుడు జరిగిన సంభాషణ గుర్తొచ్చి మనసు చేదు తిన్నట్టయింది  


వాచీల కొట్టు. ఇంకా వాచీ పెట్టుకునేవాళ్ళు ఉన్నారా అనుకున్నా ఏదైనా 150, కొంటున్నారు. రెండు కొట్లు కనపడ్డాయి. 



కాలవగట్టు రోడ్డు,మైన్రోడ్డు కలిసేదగ్గర వెలసిన రాజరాజేశ్వరీ దేవి. వీరుళ్ళమ్మ,రాజరాజేశ్వరీ దేవిల ఆలయాల మధ్య ఈ తీర్థం. ఇద్దరమ్మల కాపు.


మెత్తటి రాయి (సోప్ స్టోన్) తో తయారు చేసిన పిల్లల ఆటవస్తువులు,రుబురోళ్ళు,వగైరా


జీళ్ళు,ఖర్జూరం కొట్లు తక్కువగానే ఉన్నాయి,రెండో మూడో కనపడ్డాయి.



                                                    బొమ్మల కొట్లు ఎక్కువే ఉన్నాయి.


జనంలో నడవడమే కష్టమయింది. ఎక్కువ ఫోటో లు తీయలేకపోయా.మొత్తానికి స్త్రీల అలంకరణ సామాను,పిల్లల ఆటబొమ్మల కొట్లు ఎక్కువ. జయింట్ వీల్ ఉన్నవైపు పోలేదు. ఇక్కడికే నీరసమొచ్చింది. దేవి సెంటర్ లో గుడి పక్క క్రీనీడలో నిలిచాడొక ఎస్.ఐ గారు,నీరసం మొహాన కొట్టినట్టు కనపడుతూనే ఉంది. భోజనం చేసేరా? అడిగా, లేదు, అన్నాడు. అయ్యో! అని, కేరేజి తెప్పించుకోవచ్చుగా ఇంటినుంచి అన్నా! భోజనం చేయడం కుదరదండి, ఈ మూడు రోజులూ ఇంతే,టిఫిన్ తోనే కాలం గడపాలన్నాడు. దగ్గరేం లేకపోయింది,తినడానికి ఇవ్వడానికి. పాపం! పోలీస్ జీవితం ఇంతేనా అనిపించింది. 

Wednesday, 14 January 2026

పట్నాలలో, పల్లెలలో కూడా,

                                               పట్నాలలో, పల్లెలలో కూడా

తెల్లవారు ఝామున లేచే అలవాటు లేదు.
ఒంటిని నువ్వులనూనె రాసింది లేదు.
సున్నిపిండి లేదు.
నలుగు మొదలే లేదు. 
మాగిళ్ళు వదిలింది లేదు.
కుంకుడు కాయ,షీకాయ తలంట్లు లేవు.
సాంబ్రాణి పొగ వేసే అలవాటు లేదు. 
నిప్పుల కుంపటి లేదు.
నీళ్ళ పొయ్యి, బొగ్గులసలే లేవు. 
టైలర్ కుట్టిన బట్టలు లేవు.
లంగా ఓణీ వేసిన ఆడపిల్లలేదు.
పంచగట్టిన, కోరమీసమున్న మగాడు లేడు.
తెనుగు రాయను చదవను వచ్చినవారు లేరు.
రెండు మాటలకు ఒక ఇంగ్లీషు పదం మాటాడని తెనుగువాడు లేడు. 
పిజ్జాలు బర్గర్లు అల్పాహారం, ఆవిరికుడుములు వగైరాలు లేవు.
వంట చేసిన ఇల్లు లేదు. 
దానం లేదు,ధర్మం మొదలే లేదు.
హస్తకళలు లేవు.
హరిదాసులు,కొమ్మదాసర్లు,గంగిరెద్దులు లేవు.
ముగ్గు వేసిన వాకిలి లేదు.
వరి కళ్ళాలు లేవు.
కంది చేలు కనపడటం లేదు.
పెరడున్న ఇల్లు లేదు.
మొక్కలు,చెట్లు ఉన్న ఇళ్ళు మొదలే లేవు.
కార్నివాల్స్ తప్పించి తీర్థాలు లేవు.
వేష భాషల్లో ఆడా,మగా తేడా లేదు.
ఉమ్మడి కుటుంబాలు లేవు.
బంధువులే లేరు.
వదిన,మరదళ్ళ సరసం లేదు.
బావా మరదళ్ళ హాస్యం లేదు.
దొంగ ముద్దులు లేవు.
పడుచు జంటలు లేవు.
పిల్లలు లేరు.
సెల్ ఫోన్ లేనివారు లేరు.
నెట్ లేనిఫోన్ లేదు. 
మందుకు తప్ప, తిండికి డబ్బు లేదు.
కోడిపందాలు లేని ఊరు లేదు. 

చిభాశర్మ

శుభం

శుభం







 

Monday, 12 January 2026

నిషేధం

నిషేధం.


ఏరకుమీ కసుగాయలు

దూరకుమీ బంధుజనుల దోసము సుమ్మీ

బారకుమీ రణమందున

మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ

పచ్చి కాయలు కొయ్యకు.బంధువులలో లోపాలు ఉండచ్చు,అంతలో వారిని తూలనాడడం తగదు,తప్పు సుమా! యుద్ధరంగం నుంచి పిరికివాడిలా పారిపోకు.దేశానికి అవసరమైనపుడు పారిపోవడం తప్పు.గురువు చెప్పిన మాట అతిక్రమించకు.


నేటికాలంలో పచ్చికాయలే కోసి, రకరకాల కృత్రిమ పద్ధతుల ద్వారా పండబెడుతున్నారు. అన్ని స్థాయిలలోనూ, కృత్రిమంగా పెంచుతున్నారు. అన్ని కాయలకి పళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు. చివరికి, కొబ్బరికాయ కల్తీ లేనిదనుకున్నా నేటి దాకా,కాదు కొబ్బరికాయకి చెట్టున గెలపై ఉండగా ఇంజక్షన్ చేస్తున్నారు. మనల్ని దేవుడే రక్షించాలి.  


బంధుజనలెక్కడబాబూ! ఒకప్పుడు ఇద్దరు లేక ముగ్గురుచాలు మారోజుల్లో మాట, అరవైయేళ్ళ పైమాట. ఆ తరవాత మేమిద్దరం మాకిద్దరు,ఇదీ స్లోగను. ఆపై మేమిద్దరం మాకొక్కరు. ఇప్పుడు స్లోగన్ పెళ్ళొద్దు పెళ్ళాం కావాలి,పెళ్ళొద్దు మొగుడు కావాలి,ఇదీ స్లోగను. ఏరోజుకారోజే కొత్త మొగుడు,కొత్తపెళ్ళాం. లివ్ ఇన్ చాలు,పిల్లలా? బెడద. ఇక బంధువులెక్కడనుంచి వస్తారు? ఎవడి పెళ్ళాంతో ఎవడేనా తిరగచ్చు, లైనేయచ్చు, తప్పుకాదు.. ఆడామగాకి తేడాలేని రూలు, ఇదే చట్టం,ఇదే న్యాయం. ఇప్పుడు రాజకీయ నాయకులు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి, ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నాను,లేదూ, ఎవడి పెళ్ళానికైనా లైనెయ్యాలి.  

  

మూడో ప్రపంచయుద్దం  రాబోతోంది. అంతా సిద్ధం కావాల్సిందే,ముసలి,ముతకతో సహా!  చావో! రేవో!! నేటికాలంలో అందరూ కీబోర్డ్ వారియర్లే, అలా కుదరదు.


గురువు? ఎక్కడబాబూ! అంతలోనూ కట్,పేస్టు ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది. కట్ పేస్టుకి, కాపీ పేస్టుకి తేడా తెలియని గొప్పోళ్ళూ తయారవుతున్నకాలం. ఏమవుతుంది,ముందు కాలంలో? భగవాన్ జానే!!!