5, ఫిబ్రవరి 2026, గురువారం

రాముని రాజ్యం-భరతుని పట్టం-3

 

రాముని రాజ్యం-భరతుని పట్టం-3


ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.

https://kasthephali.blogspot.com/2023/03/1.html

https://kasthephali.blogspot.com/2023/04/2.html


జరిగిన కథ సంక్షిప్తంగా .......   

అయోధ్యకు రమ్మని మేనమామల ఇంట ఉన్న భరతునికి కబురు పoపినదీ,అతను తిరిగిరాగా తెలిసినవిషయాలు,ఆపై  అతను తీసుకున్న చర్యలూ చూసాం. రాముని తిరిగి తీసుకురావడానికి తన ఇంటిలో వారికి ఎలా చెప్పి, తాను చెప్పినది నిజమని నమ్మించాడో చూసాం. రామునిదే రాజ్యం అని చెప్పి తనపరివారాన్ని,ప్రజలను నమ్మించినదీ చూసాం. రాముని తీసుకురావడానికి అడవులకు బయలుదేరినదీ చెప్పుకున్నాం. దీనంనీ 'ఇంట గెలవడం'గా అనుకున్నాం కదా! ఇప్పుడు రచ్చ, అనగా బయటవారికి రామునిదేరాజ్యం అని చెప్పి ఎలా ఒప్పించాడు, అలా బయలుదేరి భరతుడు ఎవరెవరిని కలిసాడు,ఏం జరిగింది ముందు చూదాం...  

అవగాహన..

అలా ససైన్యంగా,రాణివాసంతో బయలుదేరిన భరతుడు గంగానదీ తీరాన ఉన్న శృంగబేరిపురం చేరాడు. డేరాలు వేసుకుని మకాం చేసాడు.గంగ దాటడానికి, ఆపై అడవిదారుల్లో భరద్వాజాశ్రమం చేరేదారి,మిగిలిన విషయాలు చర్చించుకుంటున్నాడు. ఈ సైనక సందోహం గమనించి,  దానిని దశరథుని సైన్యంగా గుర్తించిన ఆ ప్రాంత పరిపాలకుడు గుహుడు,ఇలా తలపోసాడు.

 'భరతుడు, రాముని అడవులలో కూడా ఉండనిచ్చేలా లేడు. ఆయన పరివారం,మిత్రులమైన మనను చంపనూ వచ్చు', అనుకుని తనవారిని సమావేశపరచి,'మన దగ్గరున్న వీరులందరిని అస్త్ర,శస్త్రాలతో గంగ ఒడ్డున ఉండమనండి. మనదగ్గర 500 నావలున్నాయి. ఒక్కొక నావకు వందమంది చొప్పున వీరులు సిద్దoగా ఉండండి',అని చెప్పి తాను పళ్ళు,తేనెలు తీసుకుని భరతుని దర్శించడానికి బయలుదేరాడు. 

 దూరాన్నుంచే గుహుని గమనించిన సుమంత్రుడు భరతునితో 'ఆ వచ్చే ముసలాయన  ఈ ప్రాంత పరిపాలకుడు, అంతేకాదు ప్రజ్ఞాశాలి,  ఈ ప్రాంతమంతా వీరికి కొట్టిన పిండి.  చాలా సైన్యం కలవాడు.రామునికి మిత్రుడు. అతనికి వెంటనే దర్శనం ఇవ్వడం మoచిది' అని సలహా చెప్పేడు. భరతుడు గుహుని వెంటనే కలిసాడు.       

కుశలప్రశ్నల అనంతరం, 'తమరాక ముందు తెలిస్తే, నేనే ఎదురొచ్చి స్వాగతం చెప్పేవాడిని కదా! ఈ ఫలాలు,తేనెలు స్వీకరించమని' అంటాడు గుహుడు. ఆపై 'మా ఆతిధ్యం ససైన్యంగా స్వీకరించ'మంటాడు. దానికి భరతుడు 'నీవు అన్నరాముని కడుకూర్చుమిత్రునివి, నీవు మాకు చేయదలచిన మర్యాదల  అభిలాష కడు అపూర్వం', అంటూ 'ఈ ప్రాంతం గంగా జలాలతో నిండి ఉన్నది,దీన్ని దాటే మార్గం,ఆపైన భరద్వాజ ఆశ్రమానికి చేరే సులువైన మార్గమేది?' అడిగాడు.'నేను నీ కూడా వస్తాను,మా యోధులు మనకు రక్షణగా వస్తారు. శ్రీరాముడు ఎవరికి కీడు తలపెట్టేవాడు కాదు,అటువంటివాడిని చూడ్డానికి వెళుతూ ఇంతటి మహా సైన్యంతో పనేమి?' అడిగాడు గుహుడు. దానికి భరతుడు 'అటువంటి దుష్కాలం నాకెప్పుడు రాకుండుగాక. రాముడు నా సోదరుడు,తండ్రితో సమానుడు',అంటాడు. 'నేను రాముడిని వెనక్కు తీసుకువెళదామని  బయలుదేరి వెళుతున్నాను. నేను పలుకుతున్న ఈ మాట ముమ్మాటికీ సత్యం' అన్నాడు. దానికి గుహుడు ఆనందభరితుడై 'నీవు చేస్తున్నది చాలా గొప్పపని,నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది' అన్నాడు . ఇంతలో ఇనుడస్తమించాడు.  ఇక్కడికి ఆపుతాను,ఇది పెద్ద ఘట్టం. టైప్ చేయడం కోసం కూచోవడం ఇబ్బందితో చిన్నచిన్నగా చేయక తప్పలేదు,మన్నిచండి.  

    ఆలోచన.

దూరాన్నించి గుహుణ్ణి చూసి సుమంత్రుడు భరతునికి చెప్పినమాట తీవ్రహెచ్చరిక. పెద్ద సేనను తీసుకుని బయలుదేరిన భరతుని,సుమంత్రుడు పూర్తిగా  నమ్మినట్టనిపించదు. అందుకే, ఈ పరోక్ష తీవ్ర హెచ్చరిక ఐ ఉండచ్చు. వచ్చేవాడు నీటిపైన,ప్రాంతంతెలిసినవాడుగా బలవంతుడు,మన సైన్యం ఏమీ చేయలేదు,ఇతనిని చిన్నవాడనుకుని ఉపేక్ష చేయకు  అన్నది ఈ తీవ్రహెచ్చరిక. డిప్లమసీ గురించి తెలుసుకోవాలన్నా,డిప్లమసీలో మాటాడటం ఎలాఉంటుందన్నది తెలుసుకోవాలన్నా రామాయణం చదవడం కాదు,  పారాయణ చేయాలి. గుహుడు భయపడ్డాడు,ఆత్మరక్షణచర్యలు తీసుకున్నా,విషయం తెలుసుకోడానికే భరతుణ్ణి కలవడానికొచ్చాడు. అవసరాన్ని బట్టి,యుద్ధానికే సిద్ద పడ్డాడు. వచ్చినవాడు మొహమాటం లేకనే రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడానికి ఇంత సైన్యం ఎందుకు? అన్న ప్రశ్న సూటిగానే వేసాడు. దానికి భరతుడు డిప్లమాటిగ్గా సమాధానమిచ్చాడు, పూర్తి అనుమాన నివృత్తి చేసాననుకున్నాడు. పెద్ద సైన్యాన్ని ఎందుకు వెంటబెట్టుకొచ్చాడన్న ప్రశ్న భరతుణ్ణి ఇక ముందుకూడా వేధిస్తుంది,అనుమానానికి నాంది చేస్తుంది. అంత సైన్యం ఎందుకు అన్నదానికి భరతుడు సమాధానం చెప్పినట్టు లేదు. గుహుడు భరతుణ్ణి పొగిడాడు,నీవు చేస్తున్నపని చాలా గొప్పదని,డిప్లమసీలో అవసరాన్నిబట్టి,సందర్భాన్ని,సమయాన్ని బట్టి తగుమాత్రం పొగడ్త కూడా భాగం. ఇంతలో సాయంత్రమయింది.

రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడానికే బయలుదేరానన్న భరతుని మాట గుహుడు నమ్మలేదు,నమ్మినట్టు నటించాడు..
 సైన్యం మాటముందూ వస్తుంది గనక ఒక మానుకుందాం. భరతుడు యుద్ధానికి దిగితే రామలక్ష్మణులు ఏం చేసి ఉండేవారు? మెదడుకి మేత ఆలోచించి,సకారణంగా,సహేతుకంగా  చెప్పండి.   

అనుమానం తీరని గుహుడు తరవాత ఏమి చేసాడో తెలుసుకోవాలంటే, తరవాత టపా కోసం ఎదురు చూడాల్సిందే! 
   

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

కలికి చిలకల కొలికి .......

 కలికి చిలకల కొలికి .......

                              

 చిత్రం :  సీతారామయ్యగారి మనవరాలు (1991)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  చిత్ర


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

అత్తమామల కొలుచు అందాల అతివ

పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి


మేనాలు తేలేని మేనకోడల్ని

అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని

వాల్మీకినే మించు వరస తాతయ్య

మాయింటికంపించవయ్య మావయ్యా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి

ఆ మాట యీ మాట పెద్ద కోడలికి

నేటి అత్తమ్మా నాటి కోడలివి

తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి

తలలోని నాలికై తల్లిగా చూసే

పూలల్లొ దారమై పూజలే చేసే

నీ కంటి పాపలా కాపురం చేసే

మా చంటిపాపనూ మన్నించి పంపూ


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


మసకబడితే నీకు మల్లెపూదండ

తెలవారితే నీకు తేనె నీరెండ

ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు

ఏడు జన్మలపంట మా అత్త చాలు

పుట్టగానే పూవు పరిమళిస్తుంది

పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది

తెలుసుకో తెలుసుకో తెలుసుకో

తెలుసుకో తెలుసుకో మనసున్న మామ

సయ్యోధ్యనేలేటి సాకేత రామా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

*****


ఈ పాట వింటుంటే ఒక తెనుగు జానపదగీతం గుర్తొస్తుంది. అది ఇదే ..


Courtesy:Whatsapp

మొదటి పాటలో ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అనే చరణం ఉంది. దీని అర్ధమేమి అనే ఒక ప్రశ్న చూసాను.సమాధానం చూడలేకపోయా! నాకు తోచినది చెబుతున్నా!


ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి.......

ఈ అద్దగోడ గురించి తెలియాలంటే ఆచారం చేసేవారి వంటిల్లు ఎలా ఉంటుందో తెలియాలి. ఈ వంటిల్లు 15/8 కొలతల్లో ఉంటుంది. ఇందులో 10అ పొడుగు తరవాత అడ్డంగా ఒక గోడ 5 అడుగులపొడుగు రెండడుగుల వెడల్పు 4 అడుగుల ఎత్తునా ఉంటుంది. ఇందులో 10 అడుగులవైపు వంటపొయ్యిలు,పాలు,పెరుగు,పప్పూ ఉప్పులు పెట్టుకునే అలమారలు. వండుకున్నవి పెట్టుకోడానికి వేరుగా అలమార,పైన దండేలు,మడిబట్టలు ఆరేసుకోడానికి,ఎండుపుల్లలు తాళ్ళు వేలాడదీసి మధ్యలో పెట్టే ఏర్పాటు, అద్దగోడలో మడి మంచినీళ్ళ బిందెలు పెట్టుకునే ఏర్పాటూ ఉంటుంది. ఇది 'మడి' పక్క ఉండేది,దీన్నే ఆచారం వైపు అనగా అచారం చెయ్యి. ఇక రెండో భాగంలో తరవాణీ కుండ,చద్దెన్నాల ఊరగాయి జాడీలు, చద్దెన్నపు కంచాలూ, ఇలా ఉంటాయి. ఇది అనాచారం చెయ్యి. (అనాచారమంటే పనికిరానిదనికాదు,కొద్ది ఆచారం తక్కువ చేసేది.) ఈ ఆచారం చేతికి అనాచారం చేతికి హద్దు ఒకగోడ. ఆ గోడ అర్ధగోడ, హద్దుగోడ, కాలంలో అర్ధగోడ ఆతరవాత అద్దగోడగా రూపాంతరం చెందిది. ఇదే ఆచేయి ఈ చేయి అద్దగోడలికి కత.     

ఇక ఆమాట ఈ మాట పెద్దకోడలికి..

పాత తరం ఉమ్మడి కుటుంబాలంటే ఇంటిపెద్ద, ఆయన భార్య, వారి సంతానం. ఒక్కో ఇంట్లో 5 నుంచి 7 మంది కొడుకులు,అదేలెక్కన కూతుళ్ళూ ఉండేవారు. అటువంటి ఉమ్మడి కుటుంబం నేడు ఊహించనుకూడా లేము.  అటువంటి ఇంట పెద్దకోడలిది ప్రత్యేక హోదా,బాధ్యత,(చెప్పబడని)అధికారం.  ఈమె పెద్దలలో చిన్నది,చిన్నవాళ్ళలో పెద్దది. ఈమె తరాల మధ్య సరిహద్దులోది. పెద్దవాళ్ళ బాధలు కష్టాలు దగ్గరగా చూసేది,అర్ధం చేసుకోగల వయసుకు దగ్గరగా ఉన్నదీ. ఇక చిన్నవాళ్ళలో పెద్దది,చిన్నవాళ్ళ ఇష్టాలు,సరదాలు, ఇబ్బందులూ తెలిసున్నది. ఈమె అటు పెద్దవాళ్ళనూ ఇటు చిన్నలనూ సముదాయించగల స్థితిలో ఉంటుంది,చెప్పి ఒప్పించేవయసులో ఉంటుంది. సంసారం ఒడుదుడుకులు లేకనడుస్తోందంటే పెద్దకోడలు చాలా బాధ్యత తీసుకున్నట్టే. అటువంటి పెద్దకోడలు ఇటు పెద్దలమాట,ఇటు చిన్నలమాటా వింటూ సందర్భాన్ని బట్టి చెప్పి ఒప్పించడం,సముదాయించడం చేసేది గనక,ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అన్నారు. ఇదీ పెద్దగోడలికి,అద్దగోడకి పోలిక. అందుకే 'అద్దగోడకి,పెద్దకోడలికి పనెక్కువ'అనే నానుడి పుట్టింది.
=====